অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సకశేరుక చీడల యాజమాన్యం

సకశేరుక చీడల యాజమాన్యం

  1. వలయాకార ముళ్ళ కంచె పద్ధతి (రేజర్ ఫెన్స్)
  2. ఇనుప వల కంచె (చైన్ లింక్ ఫెన్స్)
  3. సౌరశక్తి కంచె (సోలార్ ఫెన్స్ )
  4. జి.ఐ.తీగె కంచె
  5. కందకము త్రవ్వు పద్ధతి
  6. జీవకంచెలు
    1. పొలం చుట్టూ కుసుమ పంటను 4 వరుసలలో నాటడం
    2. పొలం చుట్టూ ఆముదపు పంటను 4 వరుసలలో నాటడం
    3. పదునైన ముళ్ళతో కూడిన మొక్కలు/ఎడారి మొక్కలు పొలం చుట్టూ నాటడం.
    4. వాక్కాయ చెట్లను పొలం చుట్టూ నాటడం
  7. రసాయనిక పద్ధతులు
    1. ఫోరేట్ గుళికల పద్ధతి
    2. క్రుళ్ళిన కోడి గ్రుడ్ల ద్రావణం పంట పొలం చుట్టూ పిచికారి చేయు పద్ధతి
    3. కిరోసిన్ ద్రావణంలో ముంచిన కాటన్ నవారును పంట చుట్టూ 3 వరుసలలో కట్టడం.
  8. సాంప్రదాయ పద్ధతులు
    1. ఊరపందుల పెంట మిశ్రమం పిచికారి విధానం.
    2. వెంట్రుకలు వెదజల్లు పద్ధతి
    3. చీరల పద్ధతి
    4. పొగపెట్టు పద్ధతి
    5. రాత్రి వేళల్లో టపాయకాయలు పేల్చుట
    6. వేట కుక్కలతో తరిమే పద్ధతి
  9. వివిధ దేశాలలో అడవిపందులను అదుపుచేయుటకు రకరకాల పద్ధతులు అమలులో ఉన్నాయి.
  10. పక్షుల నియంత్రణా పద్ధతులు
    1. రిబ్బన్ పద్ధతి
    2. ఆకుచుట్టూ పద్ధతి
    3. అర్తనాద పద్ధతి
    4. వేప గింజల కషాయం తయారీ
    5. కోడి గ్రుడ్డు ద్రావణం పిచికారీ
    6. కాగితపు ప్లేట్ ల పద్ధతి

మన దేశంలో పంటలలో నష్టం ముఖ్యంగా కీటకాలు, తెగుళ్ళు, కలుపు మొక్కలు మరియు పక్షుల వలన జరుగుతుంది. ఈ మధ్య కాలంలో క్షీరదాలైన ఎలుకలు, జింకలు, నీల్ గాయ్ లు, అడవి పందులు మొదలగునవి. వీటి తర్వాత స్థానాన్ని ఆక్రమించాయి. తెలంగాణలో ముఖ్యంగా అడవిపందుల వలన పంటలకు చెప్పుకోదగ్గ నష్టం వాటిల్లుతున్నది. విత్తనం నాటినప్పటి నుండి మొలకెత్తి పక్వానికి వచ్చే వరకు వివిధ దశాలో వీటి వలన నష్టం వాటిల్లుతున్నది. దీనికి గల కారణాలను గమనించినట్లయితే అడవి పందుల అవాస ప్రాంతాలైన అడవుల విస్తీర్ణం తగ్గడం, తద్వారా వాటికి కావలసిన ఆహారకొరత ఏర్పడుట, మరియు అడవిపందులను వేటాడే జంతువులు అంతరించిపోవడం వంటి కారణాలు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. అడవిపందుల సంఖ్య గణనీయంగా పెరిగి ఆహారం కొరకు సమీపంలోని పంటపొలాలపిఅ ఆధారపడుతున్నాయి. ఆహార పంటలైన వరి, మొక్కజొన్న, జొన్న, నూనెగింజల పంటలైన పొద్దుతిరుగుడు, వేరుశనగ, మరియు పండ్ల జాతికి చెందిన జామ, దానిమ్మ, ద్రాక్ష, మరియు కూరగాయల పంటలపై అడవి పందులు దాడొక్జేసి తినటం ద్వారా, పంట నష్టం సంభవిస్తుంది. అడవి పందులు తినడం ద్వారా చేసే పంటనష్టం కన్నా అవి విస్తృతంగా సంచరించటం ద్వారా పంట మొక్కలు ధ్వంసం చేయబడి నష్ట శాతం పెరుగుచున్నది.

అడవులకు సమీపంలో ఉన్న వ్యవసాయక సాగు ప్రాంతాలలో అడవి పందుల సంచారం అధికంగా ఉండటం వల్ల నష్ట శాతం ఈ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. అడవి పందులు ముఖ్యంగా ప్రాతఃకాల సమయంలో, మరియు సాయంత్రం వేళల్లో గుంపులుగా సంచరించి పంట పొలాలపై దాడిచేస్తాయి. అడవి పందులకు వసనను పసిగట్టే గుణం అధికంగా ఉంటుంది. అందువలన అవి దూరం నుంచే పంట పొలాలను వాసన ద్వారా గుర్తించి దాడి చేయడానికి పూర్తి ఆస్కారం ఉంటుంది.

వ్యవసాయ రంగంలో వివిధ జంతు జాతుల యాజమాన్య పద్ధతుల ననుసరించి మేలు రకాల జంతు జాతుల సంరక్షణ, వ్యవసాయ హానికర జంతు జాతుల నియంత్రణ ద్వార పంట దిగుబడిని పెంచి, రైతుల సామర్ధ్యాన్ని పెంపొందించే ఆధునిక పద్ధతులను అందించే ప్రధాన లక్ష్యాలతో ఏర్పాటైన అఖిలభారత వ్యవసాయ పక్షి పరిశోధనా శాస్త్ర విభాగం పంటలకు ప్రధానంగా నష్టం కలిగించే జీవులైన పక్షులు, రోడెంట్స్ (కొరికి తినే ఎలుక జాతి జంతు వులు) మొదలగు వాటితో పాటు ఇతర నష్టం కలిగించే జంతుజాతుల యాజమాన్య పద్ధతులను రూపొందించింది. ఈ మధ్య కాలంలో అడవి పందుల వలన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండటం వలన, అఖిలభారత వ్యవసాయ పక్షి పరిశోధనా శాస్త్ర విభాగం, నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తంచి, ఆ ప్రదేశాలలో రైతులను చైతన్య వంతం చేయుటకు నడుము బిగించింది. దానిలో భాగంగానే అనేక ఆదునిక పద్ధతుల తోపాటు, రైతులకు అందు బాటులోఉండే సాంప్రదాయక పద్ధతులను కూడా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే దిశలో తీవ్రంగా కృషి చేయు చున్నది. ఆహారపుటలవాట్లు: ఇవి మిశ్రమ భక్షణ రకానికి చెందిన జంతువులు ముఖ్యంగా మాంసాహారం మరియు శాఖాహారం రెండింటిని భుజిస్తాయి. వీటి శాఖాజారంలో ప్రధానంగా పంట మొక్కల వేర్లు, దుంపలు, వివిద రకాల గడ్డలను తింటాయి. మాంసాహారంలో భాగంగా కీటకాలు, పాములు, పాడైపోయిన జంతు కళేబరాలు మొదలగునవి ఉంటాయి. పంటలపై దాడిచేయుటకు అడవి పందులకు వివిధ అనుకూల సాధనాలు ఉన్నాయి.

అడవి పందులలో వాసన పసిగట్టే గుణం చాలా అధికంగా ఉండటం వలన వివిధ పంట మొక్కల యొక్క ఉనికిని దూరంనుంచే పసిగడతాయి. ఆహార సేకరణ కొరకు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఒక్కొక్క గుంపులో సుమారు 15-35 వరకు అడవి పందులుంటాయి. అందువలన అవి పంట పొలాలపై సమర్ధవంతంగా దాడిచేసి ఆహారాన్ని పొందుతాయి. ముఖ్యంగా ఇవి ప్ర్రాతఃకాల సమయంలో మరియు రాత్రివేళల్లో మాత్రమే ఆహారాన్ని వెదుకుతాయి. కాబట్టి ఆ సమయాలలో పంటపొలాలపై దాడిచేస్తాయి. వీటికి వినికిడి శక్తి మరియు చూపు మాత్రం చాలా తక్కువగా అభివృద్ధి చెందాయి.

వీటి ఆహార సేకరణ పద్ధతి వలన పంటపొలాలకు కొంటమేర ఉపయోగం కలుగుతుంది. అడవి పందుల నోటి పైభాగం (ముట్టె) చాలా ఉండీ భూమిని త్రవ్వుటకు అనుకూలంగ ఉండును, అందువల్ల ఇవి వేర్ల కొరకు భూమిలో గుంతలు పెడతాయి. అప్పుడు భూమి గుల్ల పరచబడి గాలి ప్రసారం భాగా జరుగుతుంది. మరియు వర్షపు నీరు సులభంగా భూమిలోపలికి ఇంకుతుంది. ఈ ప్రక్రియలో రాలిపోయిన ఆకులు, చెత్త మొదలగు వ్యర్థ పదార్థాలు భూమి లోపలికి చేరి కుళ్ళి పోయి ఎరువులుగా మారి భూసారాన్ని పెంచుతాయి. భూమిలోపలికి త్రవ్వడం మూలంగా వేరుపురుగులను తంటాయి. దానివల్ల వేరు పురుగుల సమస్య కొంతవరకు నివారించబడుతుంది. పంట మొక్కలపై అడవి పందుల దాడి తత్ఫలితంగా వాటిల్లుతున్న నష్టాలను నివారించ డానికి సమగ్ర విశ్లేషణ ద్వారా అఖిల భారత వ్యవసాయ పక్షి పరిశోధనా శాస్త్ర విభాగం, రైతులకు కొన్ని మార్గదర్శకాలను సూచించింది. అదే విధంగా ఈ పద్ధతులు సమర్థవంతంగా అమలు జరిగే విధంగా రైతులను జాగృతం చేసే కార్యక్రమాలను రూపొందిస్తుంది. అడవి పందుల దాడిని ఎదుర్కొనుటకు గాను అఖిల భారత వ్యవసాయ పక్షి పరిశోధనా శాస్త్ర విభాగం సూచించిన సస్యరక్షణపద్ధతులు. భౌతికంగా ఏర్పాటు చేయు ప్రహారీలు ఇనుప ముళ్ళ తీగె కంచె (బార్బడ్ వైర్ ఫెన్స్).

పంట పొలం గట్టు వెంబడి ఒక అడుగు దూరంలో ముళ్ళను కలిగి ఉన్న ఇనుప తీగెను పంట పొలం చుట్టూ కర్రల సహాయంతో ఒక అడుగు ఎత్తులో 3 వరుసలలో బిగించి కట్టినట్లైతే అడవి పందుల రాకను ఈ ముళ్ళ కంచె నిరోధిస్తుంది. ఇనుప ముళ్ళ తీగె కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు (సుమారుగా) ఇనుప ముళ్ళ తీగె చుట్ట వెల రూ. 6,855 నుండి రూ. 7,000/-, మూడు వరుసలలో తీగెను బిగించు టకు కర్రలు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ. 1,000/- మొత్తం ఒక ఎకరానికి అయ్యే ఖర్చు సుమారుగా రూ.8,000/-.

వలయాకార ముళ్ళ కంచె పద్ధతి (రేజర్ ఫెన్స్)

  • ఈ పద్ధతిలో వలయాకరంలో ఉన్న ఇనుప కంచెను పొలం గట్ల వెంబడిపంటకు ఒక అడుగు దూరము నుండి అమర్చినట్లైతే అడవి పందులు ఈ కంచెను దాటుటకు ప్రయత్నించి నప్పుడు, ఈ కంచెకు ఉండే చిన్న పదునైన బ్లేడ్ల వంటి నిర్మాణాలు అడవి పందుల దేహానికి తీవ్రమైన గాయాలను కలుగ జేయును. గాయాల తో అవి అరుస్తూ పారిపోవునప్పుడు మిగతా పందులు ఏదో ఆపద వున్నదని భయపడి వెనుకకు వెళ్ళిపోతాయి. ఈ పద్ధతి చాలా సమర్థవంతంగా అడవి పందులను ఎదుర్కొంటుంది.
  • వలయాకార రక్షణ కంచెను పంటపొలం చుట్టూ బిగించి కట్టినట్లైతే అడవిపందులు రాకను ఈ ముళ్ళకంచె సమర్థవంతంగా నిరోధిస్తుంది. వలయాకార రక్షణ కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు (సుమారుగా) ఒక ఎకరానికి చుట్టూ ఏర్పాటు చేయవలసిన వలయాకార రక్షణ కంచె చుట్ట వెల రూ. 18,000/-, ఒక వరుసలో వలయాకార రక్షణ కంచె బిగించుటకు కర్రలు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ.1,000/-, మొత్తం ఒక ఎకరానికి అయ్యే ఖర్చు రూ.19,000/-, నుండి రూ.20,000/-.

ఇనుప వల కంచె (చైన్ లింక్ ఫెన్స్)

  • పంటపొలం నుండి ఒక అడుగు దూరములో, ఇనుప వల కంచెను 3 అడుగుల ఎత్తువరకు ఏర్పాటు చేయడం ద్వారా అది సమర్థవంతంగా అడవి పందులు ప్రవేశాన్ని నిరోధించును. ఇనుప వల కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు (సుమారుగా) ఇనుప వల కంచె చుట్ట వెల రూ. 10,020/- నుండి రూ. 10,500/-, భూమి నుండి 3 అడుగుల ఎత్తు వరకు ఇనుప వలను బిగించుటకు కర్రలు మరియు కూలీలకు అయ్యె ఖర్చు రూ.1,000/-, మొత్తం ఒక ఎకరానికి ఇనుప వలను బిగించడానికి అయ్యె ఖర్చు రూ. 11,500/-నుండి సుమారుగా రూ.12,000/-.
  • సౌరశక్తి కంచె (సోలార్ ఫెన్స్ )

  • ఈ మధ్య కాలంలో సోలార్ ఫెన్సింగ్ పద్ధతి సమర్థవంతంగా పనిచేస్తూ ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఇందులో సోలార్ ప్లేట్ల ద్వారా 12 వోల్టులు విద్యుత్ ఉత్పత్తి చేయబడి స్వల్పమోతాదులో వైర్ల ద్వారా ప్రసారం జరిగి అడవి పందులకు షాక్ తగిలి పంట పొలాలవైపు రావడానికి జంకుతాయి. జీవ వైవిధ్య సంరక్షణా చట్టం 1972 ప్రకారం వన్య్ ప్రాణులను సంహరించుట నేరం కావున సోలార్ పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడు విధుత్ అడవి పందులకు ప్రాణహాని జరగ కుండా కేవలం షాక్ ను మాత్రమే కలిగించుట, ఈ షాక్ తగిలి అరుస్తూ పారిపోవునప్పుడు మిగతా పందులు ఏదో ఆపద వున్నదని భయపడి వెనుకకు వెళ్ళిపోతాయి. ఈ పద్ధతి చాలా సమర్థవంతంగా అడవి పందుల బెడదను తగ్గిస్తుంది. పొలం చుట్టూ సౌరశక్తి కంచెను 3 ఫీట్ల ఎత్తులో ఏర్పాటు చేయడం ద్వారా అది సమర్థ వంతంగా అడవి పందుల ప్రవేశాన్ని నిరోధించును.
  • సౌరశక్తి కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు: సౌరశక్తి కంచె ఒక అడుగు వెల రూ.100/-, నుండి 120/-, ఒక ఎకరానికి సౌరశక్తి కంచెకు అయ్యే ఖర్చు రూ,83,400/-, భూమి నుండి 3 అడుగుల ఎత్తు వరకు సౌరశక్తి కంచె బిగించుటకు ఇనుప పైపులు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ.3,000/-, మొత్తం ఒక ఎకరానికి సౌరశక్తి కంచెకు అయ్యే ఖర్చు రూ.86,400/- నుండి సుమారుగా రూ. 90,000/-.

జి.ఐ.తీగె కంచె

  • పంటపొలం చుట్టూ ఒక అడుగు దూరంలో జి.ఐ.తీగను భూమికి ఒక అడుగు ఎత్తులో 3 వరుసలలో బిగించి కట్టినట్లైతే కంచెలాగ ఉండి అడవి పందులు పంటపొలం లోనికి వెళ్ళకుండా నిరోధిస్తాయి. ఈ జి.ఐ.తీగ ప్రహారీకి అక్కడక్కడ గుండ్రుటి ఉచ్ఛులను ఏర్పాటు చేసినట్లైతే అడవి పందులు వాటిలో చిక్కుకుని పంట పొలాల లోనికి వెళ్ళలేవు.
  • జి.ఐ. తీగె కంచెను ఒక ఎకరా పొలం చుట్టూ నిర్మించడానికి అయ్యే ఖర్చు వివరాలు (సుమారుగా) జి.ఐ.తీగె వెల రూ.950/-, భూమి నుండి 3 అడుగుల ఎత్తు వరకు మూడు వరుసలలో జి.ఐ.తీగెను బిగించుటకు కర్రలు మరియు కూలీలకు అయ్యే ఖర్చు రూ,1,000/- మొత్తం ఒక ఎకరానికి జి.ఐ.తీగను బిగించడానికి అయ్యే ఖర్చు రూ,1900/- నుండి రూ.2000/-

కందకము త్రవ్వు పద్ధతి

  • పంటపొలం చుట్టూ ఒక అడుగు దూరంలో గట్ల వెంబడి రెండగుల వెడల్పు ఒకటిన్నర అడుగుల లోతైన కంద కాలను (ట్రెంచ్ స్ ను) ఏర్పాటు చేసినట్లైతే అడవి పందులు పొలంలోపలికి ప్రవేశించలేవు. ఈ పద్ధతి ఒక్క అడవి పందుల నివారణ మాత్రమే కాకుండా వర్షాభావ ప్రాంతాలలో నేలలోని తేమను వృద్ధి చేయడానికి, ఒక పొలం నుండి ఇంకో పొలంనకు సోకే పురుగుల తాకిడిని తగ్గించడానికి కూడ తోడ్పడును.
  • పొలంచుట్టూ 2 అడుగుల వెడల్పు ఒకటిన్నర అడుగుల లోతు కందకాన్ని త్రవ్వడానికి అయ్యే ఖర్చు వివరాలు: కందకాన్ని తీయడానికి (జె.సి.బి.ద్వారా) గంటకు వెల రూ. 500/- చొప్పున ఒక ఎకరా పొలానికి 15 గంటలు పడుతుంది. దానికి గాను అయ్యే ఖర్చు సుమారుగా రూ.7,500/-.

జీవకంచెలు

పొలం చుట్టూ కుసుమ పంటను 4 వరుసలలో నాటడం

  • వేరుశనగ పంట పొలాల చుట్టూ 4 నుండి 5 వరుసలు కుసుమ పంటను దగ్గరగా వేసినచో వాటికి సన్నని ముళ్ళు ఉండటం ;మూలాన అడవి పందులు వచ్చి ముట్టెతో భూమిని త్రవ్వడానికి ప్రయత్నించి నప్పుడు ఆ ముళ్ళు ముట్టెపై చర్మానికి గుచ్చుకొని తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. మరియు కుసుమ పంట వాసన, వేరు శనగ పంట వాసన కన్నా ఘాటుగా ఉండి సులభంగా వ్యాపిస్తుంది. అందువల్ల దూరంలో ఉన్న పందులు వేరు శనగ వాసనను పసిగట్టలేక, లోపలికి చొచ్చుకొని పోవడానికి విముఖత చూపుతాయి. కుసుమ పంట వలన రైతులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.

పొలం చుట్టూ ఆముదపు పంటను 4 వరుసలలో నాటడం

  • మొక్కజొన్న పంటపొలాల చుట్టూ 4 నుండి 5 వరుసలు ఆముదపుపంటను దగ్గరగా వేసినచో మొక్కజొన్న పంట వాసన కన్నా ఆముదపు పంట వాసన ఘాటుగా ఉండి త్వరగా వ్యాపిస్తుంది.అందువల్ల దూరంలో ఉన్న పందులు మొక్కజొన్న వాసనను ;పసిగట్ట లేక, లోపలికి చొచ్చుకొని పోవడానికి విముఖత చూపుతాయి. ఆముదపు పంటను అడవి పందులు తినడానికి ఇష్టపడవు. ఫలితంగా పంట రక్షింప బడుతుంది. అదే విధంగా రైతులకు ఆముదము ద్వారా అదనపు ;ఆదా;యం సమకూరుతుంది.

పదునైన ముళ్ళతో కూడిన మొక్కలు/ఎడారి మొక్కలు పొలం చుట్టూ నాటడం.

  • వివిధ ముళ్ళపొదలు (రేగిజాతులు), అగేవ్ జాతి మొక్కలు, జిజిఫస్ జాతులు, కాక్టస్ జాతులు, ఒపన్షియా మొదలగు ఎడారి జాతి మొక్కలు మరియు గచ్చ పొదలను, గట్ల వెంబడి పెంచినట్లైతే వాటి యొక్క ముళ్ళు అడవి పందులకు గాయాలను కలగ జేస్తాయి.

వాక్కాయ చెట్లను పొలం చుట్టూ నాటడం

  • వాక్కాయ చెట్లను గట్ల వెంబడి పెంచడము మూలానా వాటి పదునైన ముళ్ళ వలన అడవి పందుల దేహం గాయపడి అడవి పందులు అరుస్తూ పారిపోతాయి. వాక్కాయ గింజలను చింత పండుకుక్ ప్రత్యామ్నాయంగా ఉప యోగిస్తారు. జాములు, పచ్చళ్ళు మరియు పళ్ళరసాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. వాక్కాయ ఉత్పత్తులకు మార్కెట్ లో అధిక ప్రాముఖ్యత ఉండడం వలన ఈ ఉత్పత్తుల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.

రసాయనిక పద్ధతులు

ఫోరేట్ గుళికల పద్ధతి

  • 200గ్రా. ఫోరేట్ గుళికలు/థిమ్మెట్ గుళికలు ఒక కేజి ఇసుకలో కలిపి గుడ్డ సంచిలో కాని ప్లాస్టిక్ సంచిలో కాని మూటగా కట్టి, చిన్న రంధ్రాలు చేసి పంట చుట్టూ ఒక అడుగు దూరంలో కర్రలు 3 మీ. కు ఒకటి చొప్పున పాతి 60-100 సెం.మీ.ల ఎత్తులో ఈ సంచులు వాటికి కట్టాలి. గాలి ద్వారా ఫోరేట్ /థిమ్మెట్ గుళికల వాసన పంట వాసన కన్నా ఘాటుగా ఉండి సులభంగా వ్యాపించి, పందులను పంట వాసన పసిగట్టకుండా చేయడం వలన పందులు దూరం నుండే వెనకకు వెళ్ళిపోతాయి. తద్వారా పందుల బెడద గణనీయంగా తగ్గుతుంది.

క్రుళ్ళిన కోడి గ్రుడ్ల ద్రావణం పంట పొలం చుట్టూ పిచికారి చేయు పద్ధతి

  • క్రుళ్ళిన లేదా మామూలు కోడి గ్రుడ్లను సేకరించి ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఈ ద్రావణం 20 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పంట పొలం చుట్టూ ఒక అడుగు వెడల్పులో చదును చేసిన తడి భూమిపై పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా ఘాటైన వాసనా వెలువడుతుంది.
  • ఈ వాసన పంట వాసన కంటే ఘాటుగా ఉండి సులభంగా వ్యాపించి పందులను పంట వాసన పసిగట్టకుండా చేయడం వల్ల పందులు దూరంనుండే వెనుకకు వెళ్ళీపోతాయి. అందువల్ల అవి పంట పొలాలవైపుకు రావడానికి సుముఖత చూపవు. వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 10 రోజులకు ఒక మారు 50-70 లీ.ల నీటికి 40-50 కోడి గ్రుడ్లును కలిపి తరచుగా పిచికారి చేసుకోవాలి.
  • ఈ కోడి గ్రుడ్ల ద్రావణము పర్యావరణానికి హాని చేయదు మరియు పంట పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ పద్ధతికి అయ్యే ఖర్చు ఒక ఎకరానికి సుమారుగా రూ. 300/-,

కిరోసిన్ ద్రావణంలో ముంచిన కాటన్ నవారును పంట చుట్టూ 3 వరుసలలో కట్టడం.

  • ఈ పద్ధతి లో మంచాలకు ఉపయోగించే బట్ట నవారును కిరోసిన్ద్రావణంలో నానబెట్టి 2 గంటల తర్వాత తీసి ఆర బెట్టాలి. ఇలా ఆరబెట్టిన నవారును పంట పొలం చుట్టూ కర్ర దుంగలు పాతి 3 వరుసలుగా చుట్టుకోవాలి, ఇలా చుట్టిన నవారు నుండి ఘాటైన కిరోసిన్ వాసన వెలువడుతుంది. ఫలితంగా అడవి పందులు ఆ ప్రాంతానికి రావడానికి విముఖత చూపుతాయి. తద్వారా పంట రక్షింప బడుటయే కాకుండా ఈ పద్దతికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ.
  • గంధకం+పందిక్రొవ్వు నూనె మిశ్రమాన్ని 3 వరుసల కొబ్బరి తాడుకు పూయడం పందిక్రొవ్వు నూనె సేకరింకి దానికి తగినంత గంధకపు పొడిని కలిపి, మిశ్రమంగా తయారు చేసి ఉంచుకోవాలి. పంట పొలం గట్టు చుట్టూ 3 మీ.ల ఎడంతో కర్ర దుంగలు పాతుకోవాలి. ఈ కర్ర దుంగలకు కొబ్బరి తాడును భూమికి ఒక అడుగు ఎత్తులో మొదలు పెట్టి మధ్య ఒక అడుగు స్థలం ఉండేటట్లు చూసుకొని 3 వరుసలు బిగుతుగా లాగి కట్టుకోవాలి. ఇలా త్రాడుకు ముందుగా తయారు చేసుకున్న పంది క్రొవ్వు మరియు గంధకపు మిశ్రమాన్ని దట్టంగా పూయాలి.ఈ మిశ్రమం నుండి వెలువడు ఘాటైన వాసనలు చాలా రోజుల వరకు ఉండి రాత్రి వేళ్ళల్లో సంచరించు అడవి పందులకు శ్వాసపరమైన ఇబ్బందులు కలుగ జేయును. ఈ వాసన పంత వాసన కన్నా ఘాటుగా ఉండి సులభంగా వ్యాపించి పందులను పంట వాసన పసిగట్ట కుండా చేయడం వల్ల పందులు దూరంనుండే వెనకకు వెళ్ళి పోతాయి. వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 10 రోజులకు ఒక మారు మిశ్రమ ద్రావణాన్ని తాడుకు పూయాలి. తత్పలితంగా పందులు పంట పొలాల సమీపం నుండి దూరంగా వెళ్ళి పోతాయి. పంటలు రక్షింప బడుతాయి.

సాంప్రదాయ పద్ధతులు

ఊరపందుల పెంట మిశ్రమం పిచికారి విధానం.

  • దీనికి గాను ఊరపందుల పెంటను సేకరించి తగినంత నీటితో ద్రావణంగా తయారు చేసి వడగట్టుకోవాలి. ముందే పంటపొలం చుట్టూ 1 అడుగు వెడల్పు ప్రాంతాన్ని చదును చేసి, నీటితో తడపాలి. ఈ వడగట్టిన ద్రావణాన్ని తడిచేసిన ప్రాంతంలో పిచికారి చేసినట్లైతే ఒక విధమైన వాసన వస్తుంది. ఈ వాసన గ్రహించిన అడవి పందులు ఆ ప్రాంతంలో వేరే పందులు సంచరిస్తున్నాయని భ్రమపడి దూరంగా వెళ్ళి పోతాయి.
  • ఈ వాసమ ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 7 రోజులకు ఒక మారు మిశ్రమ ద్రావణాన్ని పిచికారి చేయాలి. తత్ఫలితంగా పందులు పంటపొలాల సమీపంలోకి రాకుండా దూరంగా పారి పోయి పంటలు రక్షించబడుతాయి.

వెంట్రుకలు వెదజల్లు పద్ధతి

  • క్షౌరశాలలో దొరికే వ్యర్ధమైన వెంట్రుకలను సేకరించి పంట పొలాల గట్ల చుట్టూ ఒక అడుగు వెడల్పు ప్రాంతాన్ని చదును చేసి వెంట్రుకులను పలుచగా చల్లాలి. అడవి పందుల నేలను త్రవ్వే అలవాటు, వాసన చూసే అలవాటు ప్రకారం అవి నేలమీద తమ ముట్టే భాగాన్ని ఉంచి గాలిపీల్చడం వలన ఈ వెంట్రుకలు వాటి ముక్కులోనికి ప్రవేశించి శ్వాసపరంగా తీవ్ర ఇబ్బందికి గురై తిరిగి వెనకకు వెళ్ళిపోతాయి. తద్వారా పంటలు రక్షింపబడుతాయి

చీరల పద్ధతి

  • పంట పొలాల చుట్టూ చీరలను కర్రలను పాతి గోడల వలె కట్టినట్లైతే, అడవి పందులు రాత్రి సమయాలలో దాడిచేసినప్పుడు ఆ చీరల స్పర్శతో మనుషులు ఉన్నట్లుగా భ్రమపడి అరుస్తూ దూరంగా పారిపోతాయి. ఈ శబ్ధాలను విన్న మిగతా పందులు భయపడి దూరం ;నుండే వెనుదిరుగుతాయి. మరియు పంటలు రక్షింప బడుతాయి.

పొగపెట్టు పద్ధతి

  • ఈ పద్ధతిలో ఊపపందులు పేడ పిడకలను సేకరించి మట్టి కుండలలో ఉంచి కాల్చడం ద్వారా పొగ వచ్చేటట్టు చేయాలి. ఈ కుండలను రాత్రి సమయాలలో పొలం చుట్టూ అక్కడక్కడ ఉంచాలి. ఫలితంగా వెలువడు వాసన ద్వారా ముందే అక్కడ మరొక పందుల గుంపు సంచరిస్తుందని భ్రమించి దూరంనుండే వెనుదిరుగుతాయి. ఈ వాసన ఎక్కువ రోజులు వ్యాపించి ఉండాలంటే 2 రోజులకు ఒక మారు పందుల పిడకలను కాల్చి పొగ వచ్చునట్లు చేయాలి. తత్ఫలితంగా పందులు పంటపొలాల సమీపం నుండి దూరంగా పారిపోయి పంటలు రక్షీంకఃఅబదుటాయీ.

రాత్రి వేళల్లో టపాయకాయలు పేల్చుట

  • అడవిపందుల బెడద ఎక్కువగా ఉన్న పంట పొలాల ప్రాంతాలలో రైతులు, రాత్రివేళల్లో శబ్దా ప్రయోగాలు (పటాసులు కాల్చడం,కేకలు వేయడం, ఖాళీడబ్బాలతో శబ్దాలు చెయ్యడం) చెయ్యాలి. అందువల్ల అవి భయభ్రాంతులకు గురై పంటపొలాల సమీపానికి రావు.
  • బ్యాటరీలను ఉపయోగించి సెల్ ఫోన్ ల ద్వారా శబ్దాలను ఇత్పత్తి చేయటం ద్వారా కూడా అవి మనుఘలున్నారని భ్రమించి దూరంనుండే పారిపోతాయి. ఇవియేకాక పంటపొలం చుట్టూ మంటలు పెట్టడం వలన కూడా అడవి పందులు భయపడి దూరంనుండే పారిపొతాయి.

వేట కుక్కలతో తరిమే పద్ధతి

  • ఈ పద్ధతిలో తర్ఫీదు పొందిన వేట కుక్కలను పందులు దాడిచేయు సమయాలలో దూరంగా తరిమివేస్తాయి. వేట కుక్కలకు భయపడి అడవిప్సందులు పంట పొలాలవైపుకు రావడానికి జంకుతాయి. ఇది అడవిపందులను ఎదుర్కొనుటలో అమర్ధవంతమైన పద్ధతిగా చెప్పుకోవచ్చు.

వివిధ దేశాలలో అడవిపందులను అదుపుచేయుటకు రకరకాల పద్ధతులు అమలులో ఉన్నాయి.

  • అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వ్యవసాయ ప్రాంతాలలో అడవిపందులను వేటాడుట, బోనుల ద్వారా బంధించి తుపాకితో కాల్చి వేయుట ద్వారా అదుపుచేస్తున్నారు.
  • పాకిస్థాన్ లో విషపుఎర పద్ధతులద్వారా పెద్ద ఎత్తిన అడవిపందుల సంఖ్య అదుపులో ఉంచబడింది.
  • భూటాన్ లో ప్రభూత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక రైతు బృందాలను ఏర్పరచి అడవిపందులను వేటాడి చంపుట ద్వారా అదుపులోకి తెస్తున్నారు.
  • ఇటలీలో విషపు ఎరలద్వారా బంధించి చంపుటద్వారా అదుపు చేస్తున్నారు.
  • సోడియం మోనోఫ్లోరో అసుటేట్ ను సాధారణంగా ఉపయోగిస్తారు. ఇదే  కాకుండా వార్ ఫెరిన్ ను (1080) గూడా ఉపయోగించి అడవి పందులను అదుపు చేస్తున్నారు.
  • కుక్కలతో వేటాడి కూడా అదుపుచేస్తున్నారు.
  • ఇనుప కంచె పంటపొలాల చుట్టూ ఏర్పాటుచేసి, విధ్యుత్ ప్రసారం చేసి అడవి పందులను రాకుండా చేస్తున్నరు.
  • ప్రత్యామ్నాయ ఆహారపు పంటలు స్వల్ప విస్తీర్ణంలో అడవీ ప్రాంతాలలో సాగుచేయుట ద్వారా అవి వ్యవసాయ సాగు ప్రాంతాలలోనికి రాకుండా నిరోధిస్తున్నారు.
  • వన్యప్రాణి సంరక్షణా చట్టం, జీవ వైవిధ్య సంరక్షణ చట్టం ప్రకారం వన్యప్రాణులను వేటాడుట నేరం కాబట్టి నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వీటిని అదుపు చేయుటకు గాను, ప్రభుత్వం, అటవీ శాఖ ఆధ్వర్యంలో నష్టపరిహారం చెల్లించడం మరియు వంట నష్ట తీవ్రత హెచ్చిన పరిస్థితులలో, అటవీ శాఖాధికారుల అనుమతిలో వేటాడాలి.

పక్షుల నియంత్రణా పద్ధతులు

రిబ్బన్ పద్ధతి

  • పంట ఎత్తుకంటే ఒక అడుగు ఎత్తుగల రెండు కర్రలను ఉత్తర దక్షిణదిశలలో నాటవలెను. ఒక ప్రక్క ఎరుపు రంగు మరొక ప్రక్క తెలుపు రంగు కల్గి అర అంగుళం వెడల్పు 30 అడుగుల పొడవు గల రిబ్బన్ 3 లేదా 4 మెలికలను త్రిప్పి కర్రలను 10మీ. దూరములో నాటి కట్టవలెను. పక్షుల ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల కర్రల మధ్య దూరము 5మీ. తగ్గించి కట్టవలెను. సూర్యరశ్మి రిబ్బన్ పైబడి ధగధగ మెరుస్తూ గాలి వీచినప్పుడు ఒకరకమైన శబ్దము చేస్తూ పంట దశ పక్షుల కంట పడకుండా చేస్తుంది. రిబ్బన్ పద్ధతిలో అన్ని రకములైన ఆహార ధాన్యాల, పప్పుధాన్యాల, నూనెగింజల పంటలు మరియు పండ్లతోటలను పక్షుల బారి నుండి కాపాడవచ్చును.

ఆకుచుట్టూ పద్ధతి

  • మొక్కజొన్న ఆకులను, గింజలను పాలుపోసుకొను దశలో కంకి చుట్టొచుట్టి పక్షుల మరల్చ వచ్చును. గట్ల నుండి 3లేదా 4 వరుసల వరకు ఆకులను చుట్టి పక్షుల దృష్టిని మరల్చి పంటలను రక్షించవచ్చును. తక్కువ విస్తీర్ణము కల్గిన పంటలకు ఇది అనువైన పద్ధతి.

అర్తనాద పద్ధతి

  • పంట నష్ట పక్షుల ఆర్తనాదమును ముందుగా రికార్డు చేసి క్యాసేట్ ద్వారా పంట ప్ర్రాంతములో ప్రయోగించవలెను. ఈ పద్ధతిని పండ్ల తోటలకు తక్కువ విస్తీర్ణము కల్గిన పంట ప్రాంతములో మరియు విత్తనోత్పత్తి కేంద్రములలో ఉపయోగించవచ్చు. ఈ యంత్రం సోలార్ ద్వారా కూడా పనిచేస్తుంది.

వేప గింజల కషాయం తయారీ

  • తగిన మొత్తంలో వ వేప గింజలను సేకరించి ఎండబెట్టుకోవలెను. గింజలు బాగా ఎండిన తరువాత గింజ పై పొట్టును వేరుచేసి గింజలను తిరిగి ఒకరోజు ఎండ బెట్టవలెను. తరువాత ఈ గీంజలను బాగా పొడిగా చేసి తడిలేని డబ్బాలలో పోసి నిల్వ ఉంచుకోవాలి. వేప గింజల కషాయం పిచికారి చేయడానికి, దానికి ముందురోజు ఈ గింజల పొడిని ఒక పలుచటి గుడ్డలో కట్టి, ఒక పాత్రలో తగినంత నీటిని తీసుకొని గింజల పొడి ఉన్నమూట ఆ నీటిలో మునుగునట్లు ఉంచినట్లైతే రాత్రి సమయం మొత్తం ఆ పొడి నీటిలో నాని చక్కటి కషాయం తయారవుతుంది. మరుసటి రోజు ఉదయం ఆ మూటను పాత్రలో నీటిలో గట్టిగా పిండి పిప్పిని వడపోసి, ఆ కషాయాన్ని తయారుచేసుకోవాలి. ఈ రకంగా తయారుచేసిన వేప ద్రావణాన్ని 15మె.లీ/ 1లీటరు నీటికి కలిపి పంటపై పిచికారి చేసినచో పక్షులు గింజలను తినడానికి విముఖత చూపుతాయి. ఫలితంగా పక్షుల బారి నుండి పంటను సమర్థవంతంగా కాపాడుకోవచ్చును. ఈ పద్దతి ద్వారా 7 నుండి 10 రోజుల వరకు పక్షుల పంటను నష్టపరచకుండా కాపాడవచ్చు.

కోడి గ్రుడ్డు ద్రావణం పిచికారీ

  • కుళ్ళిన కోడిగ్రుడ్లు సేకరించి వాటిని పగులగిట్టి ద్రావణాన్ని వేరుపరచాలి. ఈ ద్రావణాన్ని 20 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి గింజ పాలుపోసుకొనే దశలో పంటపై పిచికారి చేసినట్లైతే ఆ వాసనలు పక్షులకు తీవ్రమైన చిరాకును కలుగచేయును. మరియు గింజలు రుచింపవు. అందువలన అవి పంట పొలాల వైపునకు రాకుండా దూరంగా పారిపోతాయి. దీని ద్వారా వచ్చే వాసన సుమారు 10-15 రోజుల వరకు పని చేసి పక్షులను రాకుండా చేస్తుంది. అవసరమైనచో రెండవ విడుత కూడా పిచికారీ చేసుకోవచ్చు.
  • ఈ పద్ధతికయ్యే ఖర్చు అతి స్వల్పం. ఒక ఎకరాకు 25 గ్రుడ్లు అవసరం అవుతాయి. గ్రుడ్డు ఒక్కింటికి రూ.3 చొప్పున 25x3 =75, ఒక కూలీమనిషి ఒక్క రోజుకు రూ.150 మొత్తం ఒక ఎకరా పొలానికి అయ్యే ఖర్చు రూ.225.

కాగితపు ప్లేట్ ల పద్ధతి

  • ప్రొద్దుతిరుగుడు పంటలో గింజ పాలుపోసుకునే దశలో ఈ పద్ధతిసమర్ధవంతంగా పనిచేయును. ఇందులో ఒకవైపు వెండిపూతను పోలిన మెరుపు గల కాగితపు ప్లేట్లను తీసుకొని వెండిపూత పైవైపునకు వచ్చేటట్లు పువ్వుకాడకు అమర్చవలెను.అప్పుడు సూర్యరశ్మి సోకినప్పుడు వెండిపూత తళ తళ మెరిసి పక్షులు చూచుటకు తీవ్ర అసౌకర్యానికి గురవుతాయి. ఒకవేళ సూర్యరశ్మి లేకపోయిన పక్షులు వాలడానికి పేపర్ ప్లేట్ లు ఆధారాన్నివ్వకుండా పువ్వులోని గింజలను తినకుండా చేస్తాయి. ఫలితంగా పువ్వులలో గింజ నష్టం అరికట్టబడుతుంది. ఈ పద్దతి ఖర్చుతో కూడుకున్నదైనప్పటికిని అనివార్యమైన పరిస్థితులలో ఈ పద్ధతి సమర్థవంతంగా పక్షుల బెడదను అరికట్టును. ఈ పేట్లు అన్ని కిరాణా షాపులలో లభిస్తాయి.

మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన చిరునామా: సకశేరుక చీడల యాజమాన్య విభాగం, రాజేంద్రనగర్ హైదరాబాద్ ఫోన్ నెం. 040-24015754, 9440411166

చివరిసారిగా మార్పు చేయబడిన : 3/3/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate