భారత వాతావరణ విభాగం వారి సమాచారం ప్రకారం సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ 7 వ తేదీన ప్రవేశిస్తాయి. కాని ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు కేరళలో మే 30న ప్రవేశించాయి. అనగా వారం రోజులు ముందుగా నైరుతి రుతుపవనాలు భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ 12వ తేదీన ప్రవేశించి రాష్ట్రమంతటా విస్తరించాయి.
రాష్ట్రంలో 01.06.2017 నుండి 20.09.2017 వరకు కురిసిన వర్షపాత వివరాలు గమనిస్తే రాష్ట్రంలో సాధారణ వర్షపాతం (677.5 మి.మీ. కు గాను 605.2 మి.మీ.) నమోదైంది. రాష్ట్రంలో 01.06.2017 నుండి 20.09.2017 వరకు కురిసిన వర్షపాత వివరాలను జిల్లాల వారీగా గమనిస్తే మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అదిలాబాద్, జయశంకర్ భూపాలవల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు
- వరిలో కంకినల్లి, గింజ రంగుమారడం గమనించినట్లయితే నివారణకు, 2 మి.లీ. ప్రోఫెనోఫాస్ + 1 మి.లీ. ప్రోపికొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. .
- పత్తిలో ఆకుమచ్చ తెగుళ్ళు నివారణకు, 30 గ్రా. కాపర్-ఆక్సీ-క్లోరైడ్, 2 గ్రా. ప్లాంటామైసిన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- పత్తిలో రసంపీల్చే పురుగులు నివారణకు 0.2 గ్రా. ఎసిటామిప్రిడ్ లేదా 0.2 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- పత్తిలో నల్ల మచ్చ తెగులు గమనిస్తే నివారణకు, 30 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ + 2 గ్రా, ప్లాంటమైసిన్ లేదా 2 గ్రా, పోశామైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేయాలి.
- పత్తిలో బూడిద తెగులు గమనిస్తే నివారణకు, 3 గ్రా. నీటిలో కరిగే గంధకము లేదా 1 మి.లీ. కెరథేన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
- కందిలో ఫైటాప్తోర ఎండు తెగులు గమనిస్తే నివారణకు, 2 గ్రా. మ్యాంకోజెబ్ మందును . లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
- ఆముదంలో బూజు తెగులు నివారణకు, ముందు జాగ్రత్త చర్యగా 1 గ్రా, కార్బెండజిమ్ లేదా 1 మి. లీ. ప్రొపికొనజోల్ మందును వర్షం కురవడానికి 6-8 గంటల ముందుగా, వర్షం కురిసిన తరువాత 6-8 గంటల వ్యవధిలో లీటరు నీటికి కలిపి మొక్క అన్ని భాగాలు తడిచే విధంగా పిచికారీ చేయాలి.
- వంగలో కొమ్మ, కాయతొల్చు పురుగును నివారణకు, పురుగు సోకిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి, 2 మి.లీ. ప్రోఫెనోఫాస్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- కూరగాయ పంటలలో రసంపీల్చే పురుగుల నివారణకు 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నల్ల రేగడి నేలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకుంటూ శనగ, కుసుమ పంటలను విత్తుకోవాలి.
- నీటి వసతి గల ప్రాంతాలలో ఆరు తడి పంటలైన మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను విత్తుకోవాలి.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వివిధ పంటలను ఆశించటానికి ఆస్కారం ఉన్న చీడపీడలు
- వరిలో అగ్గితెగులు, కాండంతొలిచే పురుగు, సుడిదోమ, పొట్టకుళ్ళు తెగులు, కంకినల్లి.
- పత్తిలో రసంపీల్చే పురుగులు, ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు.
- కందిలో ఫైటాప్తోరా ఎండు తెగులు, ఆకుచుట్టు పురుగు, మారుక మచ్చల పురుగు.
- కూరగాయ పంటలలో రసంపీల్చే పురుగులు.
- గొర్రెలలో చిటుకు, మశూచి వ్యాధి.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక