తెలంగాణ రాష్ట్రంలో నీటి వసతి కలిగిన ప్రాంతాల్లో ఖరీఫ్ మొక్కజొన్న, పసుపు తర్వాత, వరి మాగాణుల్లో వేసవిలో సాగు చేయడానికి అనువైన పంటల్లో నువ్వు పంట ముఖ్యమైనది. అదే విధంగా ఆలస్యంగా వేసిన ఖరీఫ్ పంటల తర్వాత రెండవ పంటగా విత్తుకోవచ్చు. వేసవిలో సాగు చేసే నువ్వు పంటలో చీడ పీడల బెడద తక్కువగా ఉండడం వలన తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చు. నువ్వును వేసవిలో సాగు చేయడానికి జనవరి మొదటి పక్షం నుండి ఫిబ్రవరి మాసం 20వ తేదీలోపు విత్తుకోవచ్చు. వేసవిలో నువ్వు సాగుకు అనువైన రకాలు, సాగు పద్ధతులు ఈ కింది చూద్దాం.
నీటి వసతి కలిగిన ఎర్రనేలలు, సారవంతమైన మురుగు నీరు పోయే సౌకర్యం గల నల్ల నేలలు చాలా అనుకూలం. అదే విధంగా సమస్యాత్మక భూములు అంటే చౌడు, ఆమ్ల, క్షార స్వభావం గల నేలలు ఈ పంట సాగుకు పనికి రావు.
నేలను 2-4 సార్లు మెత్తగా దున్ని, 2 సార్లు గుంటకతోలి, చదును చేయాలి.
ఒక ఎకరాకు సరిపోయే 2.5 కిలోల విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల మధ్య 30 సెం.మీ. (12 అంగుళాలు) మొక్కల మధ్య 15 సెం.మీ. (6 అంగుళాలు) ఉండే విధంగా విత్తుకోవాలి. మొలకెత్తిన 15 రోజులకు అదనంగా ఉన్న మొక్కలను తీసివేయాలి.
నువ్వు పంటను ఆశించే వివిధ రకాల తెగుళ్ళ నుండి కాపాడుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున మాంకోజెబ్ అనే శిలీంధ్ర నాశిని కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. అదే విధంగా పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల నుండి రక్షించడానికి ఒక కిలో విత్తనానికి 2.0 మి. లీ. ఇమిడాక్లోప్రిడ్ అనే మందును విత్తనానికి పట్టించాలి.
ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను అనగా 8 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్లను దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తనాలు వేసిన 30 రోజులకు కలుపు తీసి ఎకరాకు 26 కిలోల యూరియా వేయాలి.
కలుపు నివారణ కోసం విత్తనాలు వేసే ముందు ఎకరానికి ఒక లీటరు ఫ్లూక్లోరాలిన్ (45 శాతం) అనే మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేకుంటే విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు 200 లీటర్ల నీటిలో ఒక లీటరు పెండిమిథాలిన్ (30 శాతం) లేదా అల్లాక్లోర్ (50 శాతం) అనే మందును కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులకు గొర్రుతో అంతర కృషి చేయాలి.
నువ్వులో విత్తనాలు వేసిన వెంటనే నీటి తడి ఇవ్వాలి. పూత కాయ అభివృద్ధి, గింజ కట్టే దశలు నీటి తడులకు కీలకమైనవి. కాబట్టి విత్తిన 35-40 రోజుల నుండి 65-70 రోజుల వరకు పైరుకు నీటి ఎద్దడి కలగకుండా చూసుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి పంట కాలంలో 3-4 తడులు అవసరమవుతాయి. నీటి తడులకు పూత దశ అత్యంత కీలకమైనది. కావున ఈ దశలో బెట్ట పరిస్థితులు ఏర్పడితే పూత తగ్గడంతో పాటు ఉన్న పూత కూడా రాలిపోతుంది. ఒకవేళ నీటి తడి ఇచ్చే అవకాశం లేకుంటే లీటరు నీటికి 20 గ్రా. యూరియాను కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. దీనివల్ల పంట నష్టాన్ని కొంత వరకు తగ్గించవచ్చు.
పంట కోత సమయంలో అధిక ఉష్ణోగ్రత వలన కాయలు చిట్లి గింజలు పొలంలోనే రాలిపోతాయి. కాబట్టి కింది ఆకులు, కాండం పసుపు రంగుకు మారుతున్న సమయంలోనే కోసి కట్టలుగా కట్టి ఎండబెట్టాలి. 5-6 రోజులు ఎండబెట్టిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన తర్వాత గింజల్లో తేమ 8 శాతానికి వచ్చే వరకు ఆరబెట్టి గోనె సంచుల్లో నిల్వ చేసుకోవాలి.
వేసవిలో నువ్వు పంటను సాగుచేసే రైతు సోదరులు పైన తెలిపిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే తక్కువ సమయంలో, తక్కువ వనరులతో మంచి లాభాలను పొందవచ్చు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020