অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జామ

జామ

మన రాష్ట్రంలో జామ సుమారుగా 6230 హెక్టార్లలో సాగు చేయబడుతూ 84,190 టన్నుల దిగుబడినిస్తుంది. ఖమ్మం, వరంగల్, జయశంకర్ భూపాల పల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్గండ, వికారాబాదు, మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా సాగులో ఉంది.

చౌకగా దొరికే జామ పండ్లలో, నారింజ పండు కంటే 2.5 రెట్లు ఎక్కువగా ‘సి’ విటమిన్ మరియు ‘ఎ’ విటమిన్, పాంటోధేనిక్ ఆమ్లం, రైబోఫ్లావిన్, నియాసిన్ మరియు భాస్వరం కలిగి ఉండటం వల్లనే “పేదవాడి పండుగా”, “ఉష్ణమండల ఆపిల్” గా జామ అందరికి అందుబాటులో ఉన్నది.

వాతావరణం

వేడితో కూడిన పొడి వాతావరణంలో పెరిగిన తోటల్లో పండ్ల నాణ్యత ఎక్కువ. జామలో మంచి పూత, పిందె ఏర్పడటానికి 23-38o సెం.గ్రే ఉష్ణోగ్రత మిక్కిలి అనుకూలం. రాత్రి ఉష్ణోగ్రత తక్కువ (10o సెం.గ్రే) ఉన్నప్పుడు అంటే చలికాలంలో పండు నాణ్యత బాగా ఉంటుంది. పండు పక్వదశలో అధిక వర్షపాతం ఉన్నట్లయితే కాయ నాణ్యత తగ్గుతుంది.

నేలలు

నీరు ఇంకే నేలలు, లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు జామ సాగుకు అత్యంత అనువైనని. ఈ పంట చావుడును కూడా కొంత వరకు తట్టుకుంటుంది. ఉదజని సూచిక 6.0 నుండి 8.2 వరకు ఉన్న నెలల్లో జామను సాగు చేయవచ్చు.

రకాలు

జామలో తెల్ల, ఎర్ర కండ గల రకాలు ఉన్నాయి.

తెల్ల కండ రకాలు

అలహాబాద్ సఫేదా : మధ్యస్ద పరిమాణం, గుండ్రని పండ్లు, కండ తెల్లగా, మంచి నాణ్యత కల్గి ఉంటుంది. గింజలు చిన్నవిగా, మృదువుగా ఉంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 60-80 క్వింటాళ్ళు.

లక్నో – 49 (సర్దార్) : పండ్లు తెల్లటి కండతో, లేతాకు పచ్చరంగులో, గుండ్రంగా, గరుగ్గా ఉండి, పెద్ద పరిమాణంలో (కాయ 150-220 గ్రా. బరువు) మంచి రుచిగా ఉంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 60-80 క్వింటాళ్ళు.

సఫేద్ జామ (అలహాబాద్ సఫేదా x కోహిర్) : పండ్లు మధ్యస్దంగా, గుండ్రంగా, పలుచటి తోలుతో మంచి రుచిగా ఉంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 80-100 క్వింటాళ్ళు. గింజ మృదువుగా ఉంటుంది.

కోహిర్ సఫేదా (కోహిర్ x అలహాబాద్ సఫేదా) : అత్యధిక దిగుబడి నిస్తుంది, పండ్లు పెద్దగా, గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి.

అర్క మృదుల : పండ్లు గుండ్రంగా, పెద్దవిగా, గింజలు మెత్తగా ఉండి, కండ తెలుపు రంగులు, తియ్యగా ఉండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

ఆర్క అమూల్య (సీడ్ లెస్ జామ x అలహాబాద్ సఫేదా): కాయలు మధ్యస్ధంగా, తెల్లకండతో తియ్యగా ఉంటాయి. మృదువైన విత్తనాలు కలిగి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

శ్వేత : అధిక విటమిన్ ‘సి’ అధిక తీపితో, అత్యధిక దిగుబడి నిచ్చే తెలుపు కండ రకం. పండు గోళాకారంలో, 225 గ్రా. బరువుతో, తెలుపు రంగుతో ఎరుపు మచ్చలు కలిగి ఉంటుంది. గింజలు మృదువుగా ఉండి, నాటిన ఆరవ సవత్సరంలో ప్రతి చెట్టు సుమారు 100 కిలోల దిగుబడి నిస్తుంది.

ఎర్ర కండ రకాలు

ఎర్రని గుజ్జు గల జామ పండ్ల వాడకం నిల్వ పదార్ధాల తయారీ పరిశ్రమలలో ఎక్కువగా ఉంది.

రెడ్ ప్లష్ : కాయ ముదురు ఆకుపచ్చ రంగుతో గరుకుగా ఉండి, కండ ఎరుపు రంగులో ఉంటుంది. గింజలు గట్టిగా ఉంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 70-80 క్వింటాళ్ళు.

లలిత్ : అలహాబాద్ సఫేదాతో పోలిస్తే 24% దిగుబడి ఎక్కువ ఇస్తుంది. నిల్వ పదార్ధాలు తయారికి అనువైన ఎరుపు కండ రకం.

కిరణ్ : ఎరుపు కండతో, మృదువైన గింజలున్న రకం. లైకోపిన్ అధికంగా ఉంటుంది. జామ పల్ప్ తయారికి అనువైనది.

ఈ రకాలతో పాటు రాయపూర్ ప్రైవేటు రకాలు, విదేశీ రకాలైన తైవాన్ తెలుపు, తైవాన్ పింక్ రకాలను కూడా సాగు చేసుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, అత్యధిక లాభాలను రైతు సోదరులు పొందవచ్చు.

ప్రవర్దన పద్దతులు

జామను నేల అంటు, మొగ్గంటు, వెడ్జ్ గ్రాఫ్టింగ్ పద్ధతులలో ప్రవర్ధనం చేయవచ్చు. మన రాష్ట్రంలో నేల అంటు పధ్ధతి ద్వారా వాణిజ్య పరంగా జామను ప్రవర్దనం చేయచున్నారు.

మొక్కలను నాటుట

మొక్కలను జూన్ – జూలై, అక్టోబరు-నవంబర్ మాసాలలో నటుటకు అనుకూలం. మొక్కలను నాటేందుకు తొలకరి వర్షాలు పడినప్పుడు నేలను బాగా దున్ని 60 x 60 x 60 ఘ.సెం.మీ పరిమాణం గల గుంతలను తయారుచేసుకొని, ప్రతి గుంతను పై మట్టితోపాటు 20 కిలోల పశువుల ఎరువు, 500గ్రా. సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో వేప పిండి కలిపిన మట్టి మిశ్రమం తో నింపాలి. నులి పురుగుల నివారణకు గుంతలో 50 గ్రా. కార్బోఫ్యురాన్ గుళికలను అడుగున వేయాలి.

మొక్కల మధ్య దూరాన్ని నేల లోతు, భూసారం, సాగు నీటి సౌకర్యం, రైతు సామర్ధ్యం, అభిలాషను బట్టి నిర్ణయించుకొని సి.ఐ.ఎస్.హచ్, లక్నో పరిశోధనా స్దానం సిఫార్సు చేసిన ఈ క్రింది పద్దతులలో జామను సాగు చేసుకోవచ్చు.

తక్కువ విస్తిర్ణంలో ఎక్కువ సాంద్రతలో మొక్కలను నాటటం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చును. ఈ పద్దతులలో మొక్కలు నాటుటకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అధిక సాంద్రత పద్దతులలో మొక్కలు నాటిన మొదటి సంవత్సరం నుండి కొమ్మ కత్తిరింపులు, శిక్షణ (ఫ్రూనింగ్, ట్రైనింగ్) ల ద్వారా చెట్టున ఎక్కువగా, పెరగనివ్వక, పొట్టిగా, నిర్దిష్ఠ ఆకారంలో పెంచాలి. కాబట్టి రైతులు నేల సారం, నీటి వసతి మరియు కొమ్మ కతిరింపులు గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకొని క్రింది పద్ధతులలో మొక్కలు నాటుకోవాలి.

నాటే పద్ధతి మొక్కల మధ్య దూరం మొక్కల సంఖ్య/ఎకరాకు దిగుబడి
పరిమిత సాంద్రత పద్ధతి 6 x 6 మీ. 112 8 టన్నుల
5 x 5 మీ 160 10 టన్నుల
పాక్షిక సాంద్రత పధ్ధతి 6 x 3 మీ. 222 18.8 టన్నుల
అధిక సాంద్రత పధ్ధతి 3 x 3 మీ. 444 19.6 టన్నుల
అత్యధిక సాంద్రత పధ్ధతి 3 x 1.5 మీ. 885 22.2 టన్నుల
మెడో పద్ధతి 2 x 1 మీ. 2000 25 టన్నుల

పాక్షిక, అధిక, అత్యధిక సాంద్రత పద్ధతిలో చేయాల్సిన కొమ్మ కత్తిరింపులు

నాటిన 2 లేక 3 నెలలకు మొక్కలను సక్రమంగా పెంచుటకు ట్రైనింగ్ మరియు ఫ్రూనింగ్ తప్పనిసరిగా చేయాలి. కత్తిరింపులు 3 సార్లు ఈ విధంగా చేపట్టాలి.

  • 60-70 సెం. మీ. ఎత్తులో మొక్క పై భాగాన్ని కత్తిరించాలి. 3-4 కొమ్మలను నాల్గు వైపులా పెరగనివ్వాలి.
  • 4-5 మాసాలకు ఈ కొమ్మలు 40-50 సెం.మీ పెరిగిన తర్వాత 50 శాతం కత్తిరించాలి.
  • 3-4 మసాల తరువాత ఈ విధంగా మళ్ళి 50 శాతం కత్తిరించినచో పూత, పిందే ఏర్పడుతుంది.

ఈ పద్ధతులలో చెట్లను 2.5 మీ. ఎత్తు మరియు 2 మీ. వెడల్పు ఉండేటట్లు కత్తిరించి చెట్టు పెరుగుదలను నియంత్రించాలి.

మెడో పదతిలో జామ తోటల పెంపకం

క్రమ పద్ధతిలో కత్తిరింపుల ద్వారా మొక్క పరిమాణం నియంత్రించబడి, మొక్క పొట్టిగా ఉండి నాటిన మొదటి సంవత్సరంలోనే ఎకరాకు 5 టన్నులు దిగుబడి వస్తుంది. ఈ పద్ధతిలో కత్తిరింపులు ఈ క్రింద చెప్పినట్లు చేసుకోవాలి.

  • మొక్క కాండంపై 30-40 సెం. మీ. వరకు కొమ్మలు పెరుగనివ్వరాదు. మొక్కలు నాటిన 1-2 నెలల తర్వాత 30-40 సెం. మి. ఎత్తుకు ప్రధాన కాండాన్ని కత్తిరించి వేయాలి. 3-4 కొమ్మలను ఉంచి మిగతా కొమ్మలను తీసివేయాలి.
  • 3-4 నెలల తర్వాత ముదిరిన ఈ కొమ్మలను 50 శాతం వరకు కత్తిరించిన భాగం నుండి కొత్త కొమ్మలు వస్తాయి.
  • ఈ కొమ్మలను 3-4 నెలల తర్వాత మరొకసారి 50 శాతం వరకు కత్తిరించాలి. ఈ కొమ్మలలో పూత, పిందె ఏర్పడుతుంది.

ఈ విధంగా సంవత్సరానికి 3 సార్లు కొమ్మ కత్తిరింపులు చేయుట ద్వారా మొక్క పెరుగుదలను నియంత్రించి ప్రతి కొమ్మలో పూత, పిందే ఏర్పడేటట్లు చేయవచ్చును. అదే విధంగా ఒక సంవత్సరం తరువాత కొమ్మ కత్తిరింపులను మే-జూన్, సెప్టెంబరు-అక్టోబరు, జనవరి-ఫెబ్రవరి మాసాలలో చేపట్టాలి. ఈ పద్ధతిలో చెట్టు నాటిన మొదటి సంవత్సరంలోనే కాపుకు వస్తుంది.

ఎరువుల యాజమాన్యం

మొక్క వయస్సుని, నాటుకొన్న పద్ధతిని బట్టి క్రమబద్ధంగా ఎరువులు వేసి జామలో అధిక దిగుబడి, మంచి నాణ్యత గల పండ్లను పొందవచ్చు.

నత్రజనిలో సగభాగాన్ని పశువుల ఎరువు, వేప పిండి రూపంలో ఇవ్వవచ్చు. ఇందుకోసం 5 సంవత్సరాలు, ఆపై వయస్సు ఉన్న ప్రతి చెట్టుకి 100 కిలోల పశువుల ఎరువులను వేసుకోవాలి. పిందే, కాయగా పెరిగే దశలో 1 శాతం యూరియా (10 గ్రా. లీటరు నీటికి) పిచికారి చేయడం వల్ల కాయ పరిమాణం పెరిగి దిగుబడి అధికంగా వస్తుంది. పోషక లోపాల నివారణకు 4గ్రా. జింక్ సల్ఫేటు తో పాటు 2గ్రా. బోరాక్స్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మెగ్నిషియం లోపం – సవరణ

నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పంట తొలి దశలో ఆకులు రంగు కోల్పోయి, వాలిపోయి ఉంటాయి. వేసవి కాలంలో ఆకులు ఎరుపు రంగుకు మారుతాయి. 2 గ్రా. ల. మెగ్నిషియం సల్ఫేట్ లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి ఈ లోపపాన్ని నివారించవచ్చు.

నాటుకొనే పద్ధతి చెట్టు వయస్సు (సం.) యూరియా (గ్రా.) సింగల్ సూపర్ఫాస్ఫేట్ (గ్రా.) మ్యురేట్ ఆఫ్ పోటాష్ (గ్రా.)
జూన్ సెప్టెంబరు సెప్టెంబరు జూన్
పరిమిత సాంద్రత పద్ధతి 1 108 108 250 170
2 217 217 500 240
3 325 325 750 510
4 434 434 1000 680
5, ఆపై 542 542 1250 850
పాక్షిక, అధిక, అత్యధిక సాంద్రత పధ్ధతి 1 182 78 375 100
2 364 156 750 200
3 546 234 1125 300
4 782 312 1500 400
5, ఆపై 910 390 1875 500
మెడో పధ్ధతి 1 90 40 185 50
2 380 110 370 100
3 370 115 555 150
4 360 150 740 200
5, ఆపై 450 190 900 250

నీటి యాజమాన్యం

దూరం 3 మీ. * 1 . 5 మీ.; 3 మీ. * 3 మీ మరియు 6 మీ. * 3 మీ.

సంవత్సరం

డ్రిప్ ద్వారా నీరు

(లీటర్లు ఒక రోజుకు మొక్కకు)

1వ సం

4-6

2వ సం

8-12

3వ సం

15-20

4వ సం

25-30

5వ సం ఆపైన

35-40

అధిక సాంద్రత పద్దతిలో (2 మీ. * 1 మీ.)

సంవత్సరం

డ్రిప్ ద్వారా నీరు  (లీటర్లు ఒక రోజుకు మొక్కకు)

1వ సం

2-3

2వ సం

4-5

3వ సం

6-8

4వ సం

10-12

5వ సం ఆపైన

14-16

కాపు నియంత్రణ

సాధారణంగా జామ సంవత్సరానికి రెండు కాపులనిస్తుది. నీటి వసతి ఉన్నట్లయితే సంవత్సరం అంతా దిగుబడి వస్తూనే ఉంటుంది. ఈ విధంగా వచ్చే దుగుబడిలో కాయ సైజు, నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి వాణిజ్యరిత్యా సంవత్సరం మొత్తంలో చలికాలం (మృగ్బహర్) పంట తీసుకోవడం వల్ల కాయ నాణ్యత, దిగుబడి బాగుంటుంది. కాపుని నియంత్రించేందుకు ఈ క్రింద వివరించిన ఏదో ఒక పద్ధతిని పాటించాలి.

తడి ఇవ్వడం ఆపాలి

ఫెబ్రవరి నుంచి మే నెల వరకు నీటి తడులు ఇవ్వడం పూర్తిగా ఆపి వేయాలి. దీని ఫలితంగా చెట్టు ఏప్రిల్ – మే నెలల్లో ఆకులను పూర్తిగా రాల్చి, నిద్రావస్దను చేరుకుంటుంది. జూన్ నెలలో చెట్టు చుట్టూ పాదు చేసి ఎరువులు వేయాలి. 20-25 రోజులలో క్రొత్త చిగుర్లు వచ్చి శీతాకాలంలో కాపు వస్తుంది.

కొమ్మల కత్తిరుంపు

కాపు పూర్తి అయిన తరువాత కాపు ఇచ్చిన కమ్మలను నాల్గింట మూడు వంతులు కత్తిరించాలి. ఈ విధంగా చేయుట వలన వర్షాకాలంలో వచ్చే కాపును నియంత్రించవచ్చు.

పూతను అరికట్టటం

ఎండాకాలంలో వచ్చే పూతను అరికట్టుటకు కొమ్మల పై 10 శాతం యూరియా పిచికారి అవసరం లేని పూతను నియంత్రించవచ్చు.

పండ్ల కోత

పూత తరువాత 4-5 నెలలకు జామ కోతకు వస్తుంది. కోతకు వచ్చినప్పుడు ఆకుపచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ రంగుకు కాయ మారుతుంది. జామ కాయ కోసేటప్పుడు తోడిమెతో రెండు ఆకులు ఉండి, దూర ప్రాంత రవాణాకు అనుకూలంగా ఉంటుంది.

సస్యరక్షణ

పురుగులు

  1. పండు ఈగ : కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 2 మి. లీ. మిధైల్ యుజినాల్, 3 గ్రా. కార్బోఫ్యురాన్ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని పోసి తోటలో అక్కడక్కడ చెట్ల కొమ్మలకు వ్రేలాడదీయాలి. దీని వలన మగ ఈగలు ఆకర్షించబడి, మందు ద్రావణంలో పడి చానిపోతాయి. 2 మి. లీ. మలాధియాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  2. తెల్ల సుడిదోమ : వీటి పిల్ల పురుగులు ఆకుల పై తెల్లని దూది వంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసం పిలుస్తాయి. ఆశించిన ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. ఫెబ్రవరిలో చాలా తీవ్రస్దాయికి చేరి నష్టం కలుగచేస్తాయి. దీని నివారణకు రాత్రులందు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను తెల్లదోమ ఆశించిన చెట్ల వద్ద ఉంచాలి. ప్రాధమిక దశలో ఆశించిన కొమ్మలను కత్తిరించి వేసి వీటి తీవ్రతను తగ్గించవచ్చు. వీటి ఉధృతి ఎక్కువైనచో ఫాస్పోమిడాన్ లేక డైక్లోరోవాస్ 1 మి. లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  3. పిండినల్లి : చిన్న, పెద్ద పురుగులు కొమ్మల చివర, కాయలను ఆశించి రసాన్ని పిలుస్తాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్ధాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు ఆశిస్తుంది. ఆశించిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. ఎసిఫేట్ 75 యెస్.పి 1 గ్రా. లేదా 1 మి. లీ. డైక్లోరోవాస్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  4. నులి పురుగులు : ఇవి ఆశించిన చెట్ల ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోవడం, కమ్మలు ఎండి పోవడం, తక్కువ దిగుబడి ఇవ్వడం వంటి చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు, 250గ్రా. వేప పిండి, నులి పురుగుల గుడ్డు పై పరాన్నజీవిగా ఉండే శీలీంధ్రం పేసిలోమైసెన్ లీలాసినస్ 25గ్రా. తో పాటు, 60గ్రా. కార్బోఫ్యురాన్ గుళికలను చెట్టు పాదులో వేయడం ద్వారా వీటి ఉధృతిని అరికట్టవచ్చు.

తెగుళ్ళు

  1. ఎండు తెగులు : తెగులు ప్రారంభమైన కొద్ది కాలంలో ఆకులు పసుపుపచ్చ రంగుకు మారుతాయి. కొమ్మలు పై నుండి క్రిందకి ఎండుతాయి. ఎక్కువగా చెట్టు క్రింది భాగం కొమ్మల క్రిందకి ఎండుతాయి. ఆకులు వడలిపోయి రాలిపోతాయి. చెట్టు మోడుబారుతుంది. ఈ తెగులు తీవ్రత తగ్గించేందుకు వర్షపునీరు మొక్కల మొదళ్ళలో నిల్వకుండా చూడాలి. మొక్కకు కిలో చొప్పున జిప్సం వేసి, పచ్చిరోట్ట లేదా పశువుల ఎరువు ఎక్కువగా వేసుకోవాలి. 90 కిలోల పశువుల ఎరువుకు 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి అనే జివశిలింrధ్రనాశినిని కలిపి ప్రతి చెట్టుకు పాడుచేసి 30-40 కిలోలు వేయాలి. తెగులు ఆశించిన మొక్కలకు కార్బండాజిమ్ లేదా బెనోమిల్ 1 గ్రా. లేదా కాపర్ అక్సిక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో మూడు సార్లు మొదలు చుట్టూ నేల తాడిచెటట్లు పోయాలి.
  2. ఆంత్రాక్నోస్ మరియు కాయ కుళ్ళు : లేత కొమ్మలు, ఆకులు మరియు కాయలు గోధుమ రంగుకు మారి తర్వాత నల్లగా మారి కొమ్మ మొత్తం ఎండిపోతుంది. పూర్తిగా మాగిన పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు చిన్న చిన్న గుంతలుగా ఏర్పడుతాయి. ఈ మచ్చల మధ్య భాగంలో గులాబీ రంగును కలిగి ఉంటాయి. ఇలా ఏర్పడిన రెండు, మూడు రోజుల్లో పండ్లు కుళ్ళిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటిలో కలిపి కాయ తయారయ్యే సమయంలో 10-15 రోజుల వ్యవధిలో కాయ పూర్తిగా తయారయ్యే వరకు పిచికారి చేయాలి.
  3. గజ్జి తెగులు : ఇది ప్రధానంగా పచ్చికాయల పై కనిపిస్తుంది. కాయల పై చిన్న త్రుప్పు రంగులో లేదా గోధుమ రంగులో ఉన్న మచ్చలు పగలకుండా కన్పిస్తాయి. కాయ సైజు పైరిగే కొద్ది మచ్చలు పెరిగి, కాయలు పగిలి అంచులు ఎత్తుగా ఉంటాయి. ఈ తెగులు సోకిన కాయలు సరిగ్గా పెరగక, గట్టిగా ఉండి రాలటం జరుగుతుంది. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి 2-3 సార్లు 15 రోజులు వ్యవధితో పిచికారి చేయాలి.

జామ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : అసిస్టెంట్ ప్రోఫెసర్ మరియు హెడ్, ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట ఫొన్ నెం. 9441168156

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate