మన రాష్ట్రంలో జామ సుమారుగా 6230 హెక్టార్లలో సాగు చేయబడుతూ 84,190 టన్నుల దిగుబడినిస్తుంది. ఖమ్మం, వరంగల్, జయశంకర్ భూపాల పల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్గండ, వికారాబాదు, మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా సాగులో ఉంది.
చౌకగా దొరికే జామ పండ్లలో, నారింజ పండు కంటే 2.5 రెట్లు ఎక్కువగా ‘సి’ విటమిన్ మరియు ‘ఎ’ విటమిన్, పాంటోధేనిక్ ఆమ్లం, రైబోఫ్లావిన్, నియాసిన్ మరియు భాస్వరం కలిగి ఉండటం వల్లనే “పేదవాడి పండుగా”, “ఉష్ణమండల ఆపిల్” గా జామ అందరికి అందుబాటులో ఉన్నది.
వేడితో కూడిన పొడి వాతావరణంలో పెరిగిన తోటల్లో పండ్ల నాణ్యత ఎక్కువ. జామలో మంచి పూత, పిందె ఏర్పడటానికి 23-38o సెం.గ్రే ఉష్ణోగ్రత మిక్కిలి అనుకూలం. రాత్రి ఉష్ణోగ్రత తక్కువ (10o సెం.గ్రే) ఉన్నప్పుడు అంటే చలికాలంలో పండు నాణ్యత బాగా ఉంటుంది. పండు పక్వదశలో అధిక వర్షపాతం ఉన్నట్లయితే కాయ నాణ్యత తగ్గుతుంది.
నీరు ఇంకే నేలలు, లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు జామ సాగుకు అత్యంత అనువైనని. ఈ పంట చావుడును కూడా కొంత వరకు తట్టుకుంటుంది. ఉదజని సూచిక 6.0 నుండి 8.2 వరకు ఉన్న నెలల్లో జామను సాగు చేయవచ్చు.
జామలో తెల్ల, ఎర్ర కండ గల రకాలు ఉన్నాయి.
అలహాబాద్ సఫేదా : మధ్యస్ద పరిమాణం, గుండ్రని పండ్లు, కండ తెల్లగా, మంచి నాణ్యత కల్గి ఉంటుంది. గింజలు చిన్నవిగా, మృదువుగా ఉంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 60-80 క్వింటాళ్ళు.
లక్నో – 49 (సర్దార్) : పండ్లు తెల్లటి కండతో, లేతాకు పచ్చరంగులో, గుండ్రంగా, గరుగ్గా ఉండి, పెద్ద పరిమాణంలో (కాయ 150-220 గ్రా. బరువు) మంచి రుచిగా ఉంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 60-80 క్వింటాళ్ళు.
సఫేద్ జామ (అలహాబాద్ సఫేదా x కోహిర్) : పండ్లు మధ్యస్దంగా, గుండ్రంగా, పలుచటి తోలుతో మంచి రుచిగా ఉంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 80-100 క్వింటాళ్ళు. గింజ మృదువుగా ఉంటుంది.
కోహిర్ సఫేదా (కోహిర్ x అలహాబాద్ సఫేదా) : అత్యధిక దిగుబడి నిస్తుంది, పండ్లు పెద్దగా, గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి.
అర్క మృదుల : పండ్లు గుండ్రంగా, పెద్దవిగా, గింజలు మెత్తగా ఉండి, కండ తెలుపు రంగులు, తియ్యగా ఉండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
ఆర్క అమూల్య (సీడ్ లెస్ జామ x అలహాబాద్ సఫేదా): కాయలు మధ్యస్ధంగా, తెల్లకండతో తియ్యగా ఉంటాయి. మృదువైన విత్తనాలు కలిగి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
శ్వేత : అధిక విటమిన్ ‘సి’ అధిక తీపితో, అత్యధిక దిగుబడి నిచ్చే తెలుపు కండ రకం. పండు గోళాకారంలో, 225 గ్రా. బరువుతో, తెలుపు రంగుతో ఎరుపు మచ్చలు కలిగి ఉంటుంది. గింజలు మృదువుగా ఉండి, నాటిన ఆరవ సవత్సరంలో ప్రతి చెట్టు సుమారు 100 కిలోల దిగుబడి నిస్తుంది.
ఎర్రని గుజ్జు గల జామ పండ్ల వాడకం నిల్వ పదార్ధాల తయారీ పరిశ్రమలలో ఎక్కువగా ఉంది.
రెడ్ ప్లష్ : కాయ ముదురు ఆకుపచ్చ రంగుతో గరుకుగా ఉండి, కండ ఎరుపు రంగులో ఉంటుంది. గింజలు గట్టిగా ఉంటాయి. ఎకరాకు సంవత్సరానికి దిగుబడి 70-80 క్వింటాళ్ళు.
లలిత్ : అలహాబాద్ సఫేదాతో పోలిస్తే 24% దిగుబడి ఎక్కువ ఇస్తుంది. నిల్వ పదార్ధాలు తయారికి అనువైన ఎరుపు కండ రకం.
కిరణ్ : ఎరుపు కండతో, మృదువైన గింజలున్న రకం. లైకోపిన్ అధికంగా ఉంటుంది. జామ పల్ప్ తయారికి అనువైనది.
ఈ రకాలతో పాటు రాయపూర్ ప్రైవేటు రకాలు, విదేశీ రకాలైన తైవాన్ తెలుపు, తైవాన్ పింక్ రకాలను కూడా సాగు చేసుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, అత్యధిక లాభాలను రైతు సోదరులు పొందవచ్చు.
జామను నేల అంటు, మొగ్గంటు, వెడ్జ్ గ్రాఫ్టింగ్ పద్ధతులలో ప్రవర్ధనం చేయవచ్చు. మన రాష్ట్రంలో నేల అంటు పధ్ధతి ద్వారా వాణిజ్య పరంగా జామను ప్రవర్దనం చేయచున్నారు.
మొక్కలను జూన్ – జూలై, అక్టోబరు-నవంబర్ మాసాలలో నటుటకు అనుకూలం. మొక్కలను నాటేందుకు తొలకరి వర్షాలు పడినప్పుడు నేలను బాగా దున్ని 60 x 60 x 60 ఘ.సెం.మీ పరిమాణం గల గుంతలను తయారుచేసుకొని, ప్రతి గుంతను పై మట్టితోపాటు 20 కిలోల పశువుల ఎరువు, 500గ్రా. సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో వేప పిండి కలిపిన మట్టి మిశ్రమం తో నింపాలి. నులి పురుగుల నివారణకు గుంతలో 50 గ్రా. కార్బోఫ్యురాన్ గుళికలను అడుగున వేయాలి.
మొక్కల మధ్య దూరాన్ని నేల లోతు, భూసారం, సాగు నీటి సౌకర్యం, రైతు సామర్ధ్యం, అభిలాషను బట్టి నిర్ణయించుకొని సి.ఐ.ఎస్.హచ్, లక్నో పరిశోధనా స్దానం సిఫార్సు చేసిన ఈ క్రింది పద్దతులలో జామను సాగు చేసుకోవచ్చు.
తక్కువ విస్తిర్ణంలో ఎక్కువ సాంద్రతలో మొక్కలను నాటటం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చును. ఈ పద్దతులలో మొక్కలు నాటుటకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అధిక సాంద్రత పద్దతులలో మొక్కలు నాటిన మొదటి సంవత్సరం నుండి కొమ్మ కత్తిరింపులు, శిక్షణ (ఫ్రూనింగ్, ట్రైనింగ్) ల ద్వారా చెట్టున ఎక్కువగా, పెరగనివ్వక, పొట్టిగా, నిర్దిష్ఠ ఆకారంలో పెంచాలి. కాబట్టి రైతులు నేల సారం, నీటి వసతి మరియు కొమ్మ కతిరింపులు గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకొని క్రింది పద్ధతులలో మొక్కలు నాటుకోవాలి.
నాటే పద్ధతి | మొక్కల మధ్య దూరం | మొక్కల సంఖ్య/ఎకరాకు | దిగుబడి |
---|---|---|---|
పరిమిత సాంద్రత పద్ధతి | 6 x 6 మీ. | 112 | 8 టన్నుల |
5 x 5 మీ | 160 | 10 టన్నుల | |
పాక్షిక సాంద్రత పధ్ధతి | 6 x 3 మీ. | 222 | 18.8 టన్నుల |
అధిక సాంద్రత పధ్ధతి | 3 x 3 మీ. | 444 | 19.6 టన్నుల |
అత్యధిక సాంద్రత పధ్ధతి | 3 x 1.5 మీ. | 885 | 22.2 టన్నుల |
మెడో పద్ధతి | 2 x 1 మీ. | 2000 | 25 టన్నుల |
నాటిన 2 లేక 3 నెలలకు మొక్కలను సక్రమంగా పెంచుటకు ట్రైనింగ్ మరియు ఫ్రూనింగ్ తప్పనిసరిగా చేయాలి. కత్తిరింపులు 3 సార్లు ఈ విధంగా చేపట్టాలి.
ఈ పద్ధతులలో చెట్లను 2.5 మీ. ఎత్తు మరియు 2 మీ. వెడల్పు ఉండేటట్లు కత్తిరించి చెట్టు పెరుగుదలను నియంత్రించాలి.
క్రమ పద్ధతిలో కత్తిరింపుల ద్వారా మొక్క పరిమాణం నియంత్రించబడి, మొక్క పొట్టిగా ఉండి నాటిన మొదటి సంవత్సరంలోనే ఎకరాకు 5 టన్నులు దిగుబడి వస్తుంది. ఈ పద్ధతిలో కత్తిరింపులు ఈ క్రింద చెప్పినట్లు చేసుకోవాలి.
ఈ విధంగా సంవత్సరానికి 3 సార్లు కొమ్మ కత్తిరింపులు చేయుట ద్వారా మొక్క పెరుగుదలను నియంత్రించి ప్రతి కొమ్మలో పూత, పిందే ఏర్పడేటట్లు చేయవచ్చును. అదే విధంగా ఒక సంవత్సరం తరువాత కొమ్మ కత్తిరింపులను మే-జూన్, సెప్టెంబరు-అక్టోబరు, జనవరి-ఫెబ్రవరి మాసాలలో చేపట్టాలి. ఈ పద్ధతిలో చెట్టు నాటిన మొదటి సంవత్సరంలోనే కాపుకు వస్తుంది.
మొక్క వయస్సుని, నాటుకొన్న పద్ధతిని బట్టి క్రమబద్ధంగా ఎరువులు వేసి జామలో అధిక దిగుబడి, మంచి నాణ్యత గల పండ్లను పొందవచ్చు.
నత్రజనిలో సగభాగాన్ని పశువుల ఎరువు, వేప పిండి రూపంలో ఇవ్వవచ్చు. ఇందుకోసం 5 సంవత్సరాలు, ఆపై వయస్సు ఉన్న ప్రతి చెట్టుకి 100 కిలోల పశువుల ఎరువులను వేసుకోవాలి. పిందే, కాయగా పెరిగే దశలో 1 శాతం యూరియా (10 గ్రా. లీటరు నీటికి) పిచికారి చేయడం వల్ల కాయ పరిమాణం పెరిగి దిగుబడి అధికంగా వస్తుంది. పోషక లోపాల నివారణకు 4గ్రా. జింక్ సల్ఫేటు తో పాటు 2గ్రా. బోరాక్స్ ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పంట తొలి దశలో ఆకులు రంగు కోల్పోయి, వాలిపోయి ఉంటాయి. వేసవి కాలంలో ఆకులు ఎరుపు రంగుకు మారుతాయి. 2 గ్రా. ల. మెగ్నిషియం సల్ఫేట్ లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసి ఈ లోపపాన్ని నివారించవచ్చు.
నాటుకొనే పద్ధతి | చెట్టు వయస్సు (సం.) | యూరియా (గ్రా.) | సింగల్ సూపర్ఫాస్ఫేట్ (గ్రా.) | మ్యురేట్ ఆఫ్ పోటాష్ (గ్రా.) | |
---|---|---|---|---|---|
జూన్ | సెప్టెంబరు | సెప్టెంబరు | జూన్ | ||
పరిమిత సాంద్రత పద్ధతి | 1 | 108 | 108 | 250 | 170 |
2 | 217 | 217 | 500 | 240 | |
3 | 325 | 325 | 750 | 510 | |
4 | 434 | 434 | 1000 | 680 | |
5, ఆపై | 542 | 542 | 1250 | 850 | |
పాక్షిక, అధిక, అత్యధిక సాంద్రత పధ్ధతి | 1 | 182 | 78 | 375 | 100 |
2 | 364 | 156 | 750 | 200 | |
3 | 546 | 234 | 1125 | 300 | |
4 | 782 | 312 | 1500 | 400 | |
5, ఆపై | 910 | 390 | 1875 | 500 | |
మెడో పధ్ధతి | 1 | 90 | 40 | 185 | 50 |
2 | 380 | 110 | 370 | 100 | |
3 | 370 | 115 | 555 | 150 | |
4 | 360 | 150 | 740 | 200 | |
5, ఆపై | 450 | 190 | 900 | 250 |
దూరం 3 మీ. * 1 . 5 మీ.; 3 మీ. * 3 మీ మరియు 6 మీ. * 3 మీ.
సంవత్సరం |
డ్రిప్ ద్వారా నీరు (లీటర్లు ఒక రోజుకు మొక్కకు) |
---|---|
1వ సం |
4-6 |
2వ సం |
8-12 |
3వ సం |
15-20 |
4వ సం |
25-30 |
5వ సం ఆపైన |
35-40 |
అధిక సాంద్రత పద్దతిలో (2 మీ. * 1 మీ.)
సంవత్సరం |
డ్రిప్ ద్వారా నీరు (లీటర్లు ఒక రోజుకు మొక్కకు) |
---|---|
1వ సం |
2-3 |
2వ సం |
4-5 |
3వ సం |
6-8 |
4వ సం |
10-12 |
5వ సం ఆపైన |
14-16 |
సాధారణంగా జామ సంవత్సరానికి రెండు కాపులనిస్తుది. నీటి వసతి ఉన్నట్లయితే సంవత్సరం అంతా దిగుబడి వస్తూనే ఉంటుంది. ఈ విధంగా వచ్చే దుగుబడిలో కాయ సైజు, నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి వాణిజ్యరిత్యా సంవత్సరం మొత్తంలో చలికాలం (మృగ్బహర్) పంట తీసుకోవడం వల్ల కాయ నాణ్యత, దిగుబడి బాగుంటుంది. కాపుని నియంత్రించేందుకు ఈ క్రింద వివరించిన ఏదో ఒక పద్ధతిని పాటించాలి.
ఫెబ్రవరి నుంచి మే నెల వరకు నీటి తడులు ఇవ్వడం పూర్తిగా ఆపి వేయాలి. దీని ఫలితంగా చెట్టు ఏప్రిల్ – మే నెలల్లో ఆకులను పూర్తిగా రాల్చి, నిద్రావస్దను చేరుకుంటుంది. జూన్ నెలలో చెట్టు చుట్టూ పాదు చేసి ఎరువులు వేయాలి. 20-25 రోజులలో క్రొత్త చిగుర్లు వచ్చి శీతాకాలంలో కాపు వస్తుంది.
కాపు పూర్తి అయిన తరువాత కాపు ఇచ్చిన కమ్మలను నాల్గింట మూడు వంతులు కత్తిరించాలి. ఈ విధంగా చేయుట వలన వర్షాకాలంలో వచ్చే కాపును నియంత్రించవచ్చు.
ఎండాకాలంలో వచ్చే పూతను అరికట్టుటకు కొమ్మల పై 10 శాతం యూరియా పిచికారి అవసరం లేని పూతను నియంత్రించవచ్చు.
పూత తరువాత 4-5 నెలలకు జామ కోతకు వస్తుంది. కోతకు వచ్చినప్పుడు ఆకుపచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ రంగుకు కాయ మారుతుంది. జామ కాయ కోసేటప్పుడు తోడిమెతో రెండు ఆకులు ఉండి, దూర ప్రాంత రవాణాకు అనుకూలంగా ఉంటుంది.
జామ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా : అసిస్టెంట్ ప్రోఫెసర్ మరియు హెడ్, ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట ఫొన్ నెం. 9441168156
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021