অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పెసర ,మినుములు

పెసర ,మినుములు

మన రాష్ట్రంలో ఖరీఫ్ లో సాగు చేసే అహారాలలో పెసరు ముఖ్యమైన పంట. సుమారు 1.5 లక్షల హెక్టార్లలో సాగులో వుండి. ఎక్కువగా నల్గొండ, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ మరియు ఖమ్మం జిల్లాలో సాగు చేస్తారు. మన రాష్ట్రంలో మినుము సుమారు 55,000 హెక్టార్ల విస్తిర్ణంలో సాగు చేయబడుతుంది. నిజామాబాద్, మెదక్ మరియు ఆదిలాబాద్ జిల్లల్లో ఎక్కువ సాగు చేస్తారు.

నేలలు

తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. చౌడు నేలలు మరియు మురుగు నీరు నిలిచే నేలలు పనికిరావు.

పంటకాలం

పెసర, మినుము తొలకరిలో, రబీ మరియు వేసవిలో పండిస్తారు. కొన్ని ప్రాంతాలలో వరి మాగాణులలో కూడా పండిస్తారు.

అనుకూలమైన సమయం

ఖరీఫ్ :

జూన్ 15 నుండి జూలై 15

రబీ :

15 సెప్టెంబర్ నుండి అక్టోబర్

ఖరీఫ్ వరి తర్వాత

15 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు (ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు)

వేసవి

ఫెబ్రవరి నుండి మార్చ్ 15 వరకు

రకం పంటకాలం/ఋతువు (రోజులు) దిగుబడి (క్వి/ఎ) గుణగణాలు
ఎమ్.జి.జి. – 295 60-65 ఖరీఫ్, రబీ 5-6 మొక్కలు నిటారుగా పెరగుతాయి. కాపు మొక్క పైభాగానే ఉండి, గింజ మధ్యస్థ లావుగా, సాదాగా ఉంటుండి. నల్లమచ్చ తెగులును తట్టుకొంటుంది. మోవ్వుకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకొంటుంది.
డబ్ల్యు.జి.జి.-37 (ఏకశిల) 60-65 ఖరీఫ్, రబీ, వేసవి 5-6 గింజలు ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుటాయి. రాష్ట్రమంతటా, అన్ని కాలాల్లో పండించటానికి అనుకూలమైనది. ఎల్లో మొజాయిక్ తెగులును తట్టుకొంటుంది.
టి.ఎమ్. 96 – 2 60-65 ఖరీఫ్, రబీ, వేసవి, మెట్ట మరియు మాగాణి 4-6 అధిక తేమను మరియు బూడిద తెగులును తట్టుకొంటుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి. వరి మాగాణులకు అనువైనది.
యమ్.జి.జి. – 348 (భద్రాద్రి) 65 ఖరీఫ్, రబీ 4-5 మొక్క పొట్టిగా ఉండి అంతరపంటకి అనుకూలం. రబీలో సాగుకు మిక్కిలి అనుకూలమైనది. బెట్టను కొంత వరకు తట్టుకుంటుంది.
యమ్.జి.జి.-347 (మధిర పెస 65-70 ఖరిఫ్, రబీ, వేసవి 4-6 మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాయ మొక్క పై బాగానే ఉండి, గింజ లావుగా, సాదాగా ఉంటుంది. మోవ్వుకుళ్ళు మరియు ఆకుమచ్ట తెగుళ్ళను తట్టుకొంటుంది.
యమ్.జి.జి.-351 (శ్రీ రామ) 70-75 రబీ, వేసవి, మాగాణి 5-6 మొక్కలు నిటారుగా పెరగుతాయి, పొడవైన కాయలు సాదా గింజలు కలిగి కొంత మేరకు పల్లాకు తెగులు, బెట్టను తట్టుకోనును
డబ్ల్యు.జి.జి-42 (యాదాద్రి) 58-60 ఖరీఫ్, రబీ, వేసవి 4-6

పొడవైన కాయలు కలిగి, లావు మెరుపు గింజలు కలిగి పల్లాకు తెగులు తట్టుకొనును. ప్రత్తిలో అంతరపంటకు అనువైనది.

మినుము రకాలు

రకం పంటకాలం/ఋతువు (రోజులు) దిగుబడి (క్వి/ఎ) గుణగనాలు
యల్.బి.జి-752 75-80 6-7 పల్లాకు తెగులు తట్టుకొను పాలిష్ రకము. వరి మాగాణులలో ఆలస్యంగా విత్తుటకు కూడ అనువైన రకము.
ఎల్.బి.జి-20 (తేజ) 70-75 5-7 పాలిష్ రకం, కాయపైన నూగు వుండదు. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది
ఎల్.బి.జి-623 (లాం 623) 75-80 6-7 పాలిష్ రకం. గింజలు లావుగా ఉంటాయి. బూడిద తెగులును కొంత వరకు తట్టుకొంటుంది.
డబ్ల్యు.బి.జి – 26 (వరంగల్-26) 70-75 4-5 సాదా రకం. కాయల మీద నీగు వుండదు. మొక్కలు గుబురుగా ఉంటాయి. కాపు అడుగు భాగాన కేంద్రీకృతమై ఆకులో కప్పబడి వుంటుంది. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది.
యం.బి.జి.-207 (మధిర మినుము - 207) 75-80 5-6 పాలిష్ రకము. బెట్టను తట్టుకొంటుంది. పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకొంటుంది. తొలకరి మరియు రబీకి అనుకూలము.
పి.యు. 31 70-75 5-6 సాదా రకము. కాయల మీద నూగు ఉంటుండి. పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకొంటుంది.
ఎల్.బి.జి – 787 (తులసి) 80-85 7-8 అన్ని కాలాలకు అనవైనది. మెరుపు గింజలు కలిగి మధ్యస్ఖలావుగా వుంటాయి. కాయలు ప్రధాన కాండముపై కాయను. పల్లాకు తెగులు తట్టుకోనును.

ఈ రకాలన్ని అన్ని కాలాలకు అనుకులిస్తాయి. వీటిని రబీ మరియు వేసవిలో, మెట్టలో మరియు వరి మాగాణుల్లో కూడ వేసుకోవచ్చు. తక్కువ కాలంలో పండే రకాలు కావున తేమను ఎక్కువగా నిలుపుకోలేని భూములకు అనుకూలం.

వరి మాగాణులకు అనువైన మినుము రకాలు :

రకంపంటకాలం/ఋతువు (రోజులు) దిగుబడి (క్వి/ఎ) గుణగణాలు
ఎల్.బి.జి. – 645 85-90 8-10 లావు పాటి పాలిష్ రకం. ఎండు తెగులును తట్టు కొంటుంది. కాయలు పొడువుగా యుండి నూగు ఉండదు.
ఎల్.బి.జి. – 685 85-90 8-9 ఎండు తెగులును తట్టుకొనే పాలిష్ రకం. కాయలపై నూగు తక్కువగా వుంటుంది. కాయల కణుపుల వద్ద కూడా కాస్తుంది. ఆలస్యంగా విత్తేందుకు అనుకూలం.
ఎల్.బి.జి. –648 90-95 8-9 పాలిష్ రకం. ఎండు తెగులును తట్టుకుంటుంది. పైరు తీగ వేస్తూ విస్తరించి పెర్గుతుంది. కాయలపై నూగు కలిగి వుంటుంది. బూడిద, అకుమచ్చ, తుప్పు తెగుళ్ళను కొంత వరకు తట్టుకొంటుంది.
ఎల్.బి.జి. –709 80-85 6-7 పాలిష్ రకము, కాయలపై నూగు వుంటుంది, మాగాణి భూములలో ఆలస్యంగా డిసెంబర్ చివరి వరకు విత్తుటకు అనువైనది.
ఎల్.బి.జి. –752 75-80 6-7 పల్లాకు మరియు ఎండుతెగులును తట్టుకుంటుంది. వరి మాగాణులలో ఆలస్యంగా విత్తుటకు కూడ అనువైనది.

విత్తన మోతాదు :

6-8 కిలోలు ఎకరాకు (ఖరీఫ్, రబీ, వేసవి)

ఖరిఫ్ వరి తర్వాత :

12-14 కిలోలు ఎకరాకు.

విత్తనశుద్ధి :

కిలో విత్తనానికి 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5గ్రా. థయోమీథాక్సామ్ లేదా 5 మి.లీ. మోనొక్రోటోఫాస్ ను కలిపి విత్తనశుద్ది చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు రసంపీల్చు పురుగులు బారి నుండి రక్షించుకోవచ్చు. మొదటిసారి పంటను పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించాలి. 200 గ్రా. రైజోబియం కల్చర్ ఎకరా విత్తనాలకు బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదటి శిలింధ్రనాశక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి.

విత్తే దూరం

ఖరిఫ్ మరియు రబీలో సాళ్ళ పద్ధతిలో ఆరుతడి పంటగా విత్తినప్పుడు సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 10 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి. వేసవిలో ఆరుతడి పంటగా విత్తినప్పుడు సాలుకు సాలుకు మధ్య 22.5 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి.

మొక్కల సాంద్రత / ఎకరాకు

ఆరుతడి పంటగా ఖరిఫ్ మరియు రబీలో : 1,33,333. వేసవిలో : 1,81,818

విత్తు పద్ధతి

నాగలితో లేదా కల్టివేటరుతో ఒకసారి ఆ తర్వాత గోర్రుతో రెండు సార్లు మెత్తగా దున్ని చదునుచేసి విత్తుటకు సిద్ధం చేయాలి. సాళ్ళ పద్ధతిలో నాగలి లేదా గొర్రుతో విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్ కల్టివేటర్ లేదా సీడ్ డ్రిల్ కమ్ ఫర్టిలైజర్ తో బోదె కాలువల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. వరి మాగాణుల్లో వరి కోయడానికి 2-3 రోజుల ముందుగా మినుము విత్తనాన్ని వెదజల్లుకోవాలి. భూమిలో వున్న తేమను ఉపయోగించుకొని గింజలు మొలకెత్తుతాయి.

అంతర పంటలు / పంటల సరళి

  • పెసర + కంది (7:1)
  • పెసర + ప్రత్తి (2:1 లేదా 1:1)
  • మొక్కజొన్న – పెసర / మినుము
  • వరి – మొక్కజొన్న – పెసర / మినుము
  • పెసర – వేరుశనగ – పెసర
  • వేరుశనగ – పెసర
  • మొక్కజొన్న – వేరుశనగ – పెసర
  • వరి – పెసర / మినుములు
  • ప్రత్తి – పెసర / మినుము

సమగ్ర ఎరువుల యాజమాన్యం

సేంద్రీయ ఎరువులు

చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మోళ్ళను రోటావేటర్ తో భూమిలో కలియదున్నాలి.

జీవన ఎరువులు

రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించవలెను. 100 మి.లీ. నీటిలో 10 గ్రా.ల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లర్చవలెను. చల్లార్చిన ద్రావణం 8 కిలోల వితనలపై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లుగా జాగ్రత్త వహించవలెను. ఈ పక్రియను పాలిథీన్ సంచులను ఉపయోగించి చేసుకోవలెను. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

ఎకరాకు 2 కిలోల ఫాస్పోబ్యాక్టర్ ను 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తనం విత్తేటప్పుడు గాని సాళ్ళలో పడేటట్లు వేసుకొనవలెను. ఈ ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యoకాని రూపంలో ఉన్న భాస్వరమును లభ్యమగు రూపంలోకి మర్చి మొక్కలకు అందుబటులోకి తెచ్చును.

రసాయనికి ఎరువులు

ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం నిచ్చే ఎరువులు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. అనుగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డి.ఎ.పి.ని వాడాలి. వరి తర్వాత మాగాణిలో విత్తుకున్నప్పుడు ఎరువులు వేయడం వీలుపడదు. అవసరం మేరకు పోషకాలను పై పాటుగా పిచికారి ద్వారా అందించాలి. భూసార పరీక్షా ఆధారంగా సిఫార్సు మేరకు రసాయనికి ఎరువులు వేయాలి.

సుక్ష్మ పోషక లోపాలు – యాజమాన్యం

పోషకధాతు లోపాలు ముఖ్య గుర్తింపు లక్షణాలు అనుకూల వాతావరణం / పరిస్థితులులోప సవరణ చర్యలు
జింకు ఎదుగుదల లోపించడం, చిట్టి ఆకులు ఏర్పడుట, కణుపుల మధ్య దూరం తగ్గి ఆలస్యంగా పుతకు వచ్చును. ఇసుక నేలలు, వరి మాగాణి, క్రోత్తగా చదును చేసిన నెలల్లో ఉదజని సూచిక ఎక్కువ వున్న ( 8.5) నేలల్లో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి. పైరుపై లోప లక్షణాలు కనబడినప్పుడు వెంటనే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ పిచికారి చేయాలి.
ఇనుము లేత ఆకులలో ఈనెల మధ్య హరితాన్ని కోల్పోయి పసువు రంగు లేదా తెలుపు వర్షం దాల్చును. సున్నపు నిల్వలు, ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువ ఉన్న నేలలు, మురుగు నీరు నిల్చే నేలలు లీటరు నీటికి 5 గ్రాముల ఫెర్రాస్ సల్ఫేట్ (అన్నభేది) ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల తేడాలో రెండు సార్లు పిచికారి చేయాలి.

పెసర, మినుము - సస్యరక్షణ : వివిధ పరిశోధన కేంద్రాలలో నిర్వహించబడిన పరిశోధన ఫలితాల ఆధారంగా ఈ క్రీంది సస్యరక్షణ చర్యలు మరియు మందులు సూచించడినవి.

పురుగులు పేర్లు ముఖ్య గుర్తింపు లక్షణాలు అనుకూల వాతావరణ పరిస్దితులు / ఉధృతిగా ఉండు కాలంపురుగు మందులు (మోతాదు లీటరు నీటికి)జీవ రసాయనాలు
చిత్త పురుగులు ఆకుల దశలో ఆశించి రంధ్రాలు చేస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు తొలి దశలోనే చనిపోతాయి. బెట్ట వాతావరణం, దుక్కి సరిగా తయారు కానప్పుడు (మట్టి పెల్లలు) 2.5 మి. లీ. క్లోరిపైరిఫాస్ లేదా 1.6 మి. లీ. మోనోక్రోటోఫోన్ లేదా ఎసిఫేట్ 1 గ్రా.
పొగాకు లద్దె పురుగు ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీకి తినటం వలన ఆకులు జల్లెడుగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను, పిందెలను కూడా తింటాయి. ఈ పురుగు రాత్రి పూట ఎక్కువగా తింటూ, పగలు మొక్కల మొదళ్ళలోను, భూమి నెర్రెలలోనికి చేరతాయి. అన్ని రకాల వాతావరణం పరిస్థితులలో వచ్చును 1. గ్రుడ్ల సముదాయాలను ఏరి వేయాలి. 2. జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. 3. ఎకరాలకు 30,000 ట్రైకోగ్రామ బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి. 4. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసి పురుగు ఉధృతిని గమనించాలి. 5. ఎకరాకు ఎన్.పి.వి. 200 యల్.ఇ ద్రావణాన్ని సాయంకాలం పిచికారి చేయాలి. 6. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో విషపు ‘ఎర’ ముద్దల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనొక్రోటోఫోస్ 500 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 500 మి.లీ. లేదా కార్బరిల్ 50 శాతం 500 గ్రా. 5 కిలోల తవుడు, అరకిలో బెల్లం సరిపడే నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంకాలం సమయంలో వెదజల్లాలి. 7. చివరిగా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా నోవాల్యురాన్ 1 మి.లీ. లేదా ధయోడికార్బ్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
తెల్లదోమ అకుల్లోని రసాన్ని పిలుస్తాయి. అంతేకాక ఎల్లోముజాయిక్ అనే వైరస్ వ్యాధిని (పల్లాకు తెగులు) కూడా వ్యాపింప చేస్తాయి. 7-10 రోజుల బెట్ట వాతావరణం, పొడి వాతావరణం 1.6 మి.లీ. మొనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. మిథైల్ డేమటాన్ ను లేదా ట్రైజోఫాన్ 2.0 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా డైఫెన్ తయూరాన్ 1.5 గ్రా.
తామర పురుగులు తొలి దశలో లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల నుండి రాసాన్ని పిలుస్తాయి. ఆకులు దొప్పగా మారుతాయి. మొక్కలు గిడసబారి ఎదుగుదల కుంటుపడుతుంది. వీటి వల్ల అకుముడత ఆనే వైరస్ వ్యాధి కూడ వ్యాపిస్తుంది. బెట్ట పొడి వాతావరణం మరియు పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ 75 యస్.పి 1 గ్రా. లేదా ఫిప్రొనిల్ 2.0 మి. లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి. లీ.
మారుక మచ్చల పురుగు పురుగు మొగ్గ, పూత, దశలో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్దాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు జేర్చి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది. గూడు దగ్గర లార్వా విసర్జితములు కనిపిస్తాయి. గూళ్ళు విప్పినచో తెల్లపు వర్ణం కలిగి వెన్ను పై మచ్చలు కలిగిన పిల్ల పురుగులు గమనించ వచ్చు. ఉధృతి ఎక్కువగా ఉన్నచో పూత గెల బూజుగా మారును. పూతదశలో మేఘావృతమైనప్పుడు, పొగ మంచు మరియు అడపాదడపా చిరు జల్లులు కురిసినప్పుడు 1. పూత దశలో తప్పనిసరిగా పైరుపై 5% వేప గింజల కాషాయం లేదా వేప నూనె 5.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే రెక్కల పురుగు గ్రుడ్లు పెట్టడానికి ఇష్టపడవు, అంతేకాక అప్పటికే పంట మొక్కల పై ఉన్న గ్రుడ్లు కూడా పగిలి చనిపోతాయి. తక్కువ కాల పరిమితి గల పైర్లలో ఇది అత్యంత ఉపయోగకరం. 2. మొగ్గ, పూత దశలో అక్కడక్కడా కొన్ని పూమొగ్గలను సేకరించి వాటిని తెరిచి పిల్ల పురుగులు ఉన్నాయోమోనని పరిశీలించాలి. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. ధయోడికార్బ్ 1.0 గ్రా. లేక ఎసిఫేట్ 75 యస్.పి 1.0 ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 3. పంటలో గూళ్ళు గమనించి నట్లయితే నివారణకు ఎసిఫేటు 1.0 గ్రా. లేక క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేక నోవాల్యురాన్ 1.0 మి.లీ. లో ఏదో ఒక మందుతో పాటుగా తప్పని సరిగా ఊదర స్వభావం కలిగిన డైక్లోరోవాస్ మందును 1.0 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. మరల అవసరమైతే మందులను మర్చి మర్చి 2-3 సార్లు పూత మరియు కాయ దశల్లో పిచికారి చేయాలి. 4. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేక ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రా. లేక ప్లూబెండమైడ్ 0.2 మి.లీ. లేక క్లోరాంట్రానిలిప్రొల్ 0.3 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.
శనగపచ్చ పురుగు తల్లి పురుగు లేత చిగుళ్ళపై, పూమొగ్గలపై లేత పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లని పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన నార పురుగులు మొగ్గల్ని తొలిచి కయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయటుంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి.పురుగు తిన్న కాయకి గుండ్రటి రంధాలు కనిపిస్తాయి. వర్షం లేదా చిరు జల్లులు పడినప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు. మొగ్గ లేదా తొలి పూత దశలో 5% వేప గింజల కాషాయం లేదా వేపనూనె 5 మి.లీ. లేదా క్వినోల్ఫాస్ 2.0 మి.లీ. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, ఇండాక్సాకార్బ్ 1.0 మి.లీ. లేదా స్పైనోశాడ్ 0.3 మి.లీ. లేదా క్లోరాoట్రానిలిప్రొల్ 0.3 మి.లీ. ప్లూబెండమైడ్ 0.2 మి.లీ./లీ. లేదా లామ్డాసైహలోత్రిన్ 1 మి.లీ./లీ. బ్యాసిల్లస్ తురింజెన్సిస్ 300 గ్రా./ఎకరాకు. హెలికోవెర్పా – యన్.పి.వి 100-200 మి.లీ./ఎకరాకు, బెవేరియా బాసియానా 1200 గ్రా./ఎకరాకు.
కాండపు ఈగ (ఇది ఎక్కువగా మినుములో ఆశించును) పిల్ల పురుగులు భూమికి దగ్గరగా ఉన్న కాండం మొదలు లోపలికి వెళ్లి లోపల కణజాలాన్ని తిని డోల్లగా మారుస్తాయి. పురుగు ప్రవేశించిన ప్రాంతం ఉబ్బి మొక్క ప్రక్కకు వాలిపోతుంది. మొక్కలు చనిపోతాయి. కాండం చీల్చి చూసినప్పుడు పిల్లపురుగులు కనిపించును. బెట్ట మరియు తక్కవ వర్షపాతం నమోదు కావడం మోనోక్రోటోఫాస్ 1.6 లేదా ఎసిఫేట్ 75 యన్.పి 1.0 గ్రా. లేక డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్ళ పేర్లు ముఖ్య గుర్తింపు లక్షణాలు అనుకూల వాతవరణ పరిస్థితులు/ఉధృతిగా ఉండు కాలం తెగుళ్ళ మందులు (మోతాదు లీటరు నీటికి)
తెగుళ్ళ మందులు (మోతాదు లీటరు నీటికి) ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీని వలన కాయల్లో గింజలు సరిగా నిండవు. వర్షాల వలన, వేడిమి మరియు గాలిలో ఎక్కువ తేమ వలన లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజేబ్ లేదా 1 గ్రా. క్లోరోథాలోనిల్ లేదా1 గ్రా. కార్బ్oడాజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిథైల్ ను కలిపి పిచికారి చేయాలి.
బూడిద తెగులు ముదురు ఆకులపై, బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి, అవి క్రమేణా పెద్దవై ఆకుల పైన, క్రింది భాగాలకు మరియు కొమ్మలు, కయలకు వ్యాపిస్తుంది. గాలిలో తేమ శాతం 80-85% ఉన్నప్పుడు చిరు జల్లుల లేదా వర్షాల వలన, పొడి వాతావరణం 22-26 సె. ఉన్నప్పుడు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1 గ్రా. ధయోఫానేట్ మిధైల్ లేదా 2 మి.లీ. హెక్సానజోల్ పిచికారి చేయాలి. మైక్లోబూటానిల్ 0.5 గ్రా. లేదా డైఫెన్ కోనాజోల్ 1.0 మి.లీ. కలిపి 10-15 రోజులు వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
బాక్టీరియా అకుమచ్చ తెగులు ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి. గాలిలో ఎక్కువ తేమ వరుసగా వర్షం పడినప్పుడు, చిరుజల్లులు పడినప్పుడు. తెగులు నివారణకు 10 లీటర్ల నీటికి 30 గ్రా. కాపర్ అక్సిక్లోరైడ్ మరియు 2 గ్రా. ప్లాంటోమైసిన్ ను కలిపి పిచికారి చేయాలి.
అకుముడత తెగులు (మొవ్వు కుళ్ళు) తామర పురుగుల వల్ల ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలి పోతాయి. ఆకులు అడుగు భాగం లోని ఈనెలు రక్తవర్ణాన్ని పోలి వుంటాయి. లేత దశలో వ్యాది సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు, ఎక్కువ తేమ వలన విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. నివారణకు ఎసిఫేట్ 75 యస్.పి 1 గ్రా. లేదా డైమిధోయేట్ 2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. యం.జి.జి – 295 పెసర రకం ఈ తెగులును కొంత వరకు తట్టుకొంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే గమనించి పీకి తగులబెట్టడం ద్వారా, పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు.
పల్లాకు (ఎల్లో మొజాయిక్) తెగులు తొలుత లేత ఆకుల పై లేత పసుపు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత నిండు పసుపు రంగుకు మారును. పసుపు మరియు ఆకుపచ్చ మచ్చలతో ఆకులు కనబడును. ఆ తర్వాత కాయల పైనా కూడా మచ్చలు ఏర్పడి గింజ కట్టకుండా పోవును. తెగులు ఆశించిన మొక్కలు ఆలస్యంగా మొగ్గ తొడిగి పూత, కాత తక్కువగా ఉండును. ఈ వైరస్ తెగులు తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందును. పొడి వాతావరణం వలన, బెట్ట పరిస్థితుల వలన విత్తనశుద్ధి చేసి విత్తుకొనవలెను. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి మొనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేక డైమిధోయేట్ 2 మీ.లీ. లేదా ట్రైజోఫాస్ 1.5 మీ.లీ. లేదా ఎసిఫేట్ 1.0 గ్రా. లేదా ఎసిటామిప్రిడ్ 0.3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. మందును కలిపి పిచికారి చేసి నివారించవచ్చు. పెసరలో డబ్ల్యు.జి.జి. 37, డబ్ల్యు.జి.జి.- 42 , యం.జి.జి. 351 రకాలు ఈ తెగులును కొంత వరకు తట్టుకోగలవు. మినుములో పల్లాకు తెగులును తట్టుకునే ఎల్.బి.జి. – 752, ఎల్.బి.జి. – 787, పి.యు. 31 రకాలను సాగు చేయాలి. తెగులు సోకిన మొక్కలను తొలిదశలో గమనించిన వెంటనే పీకి కాల్చి వేయాలి.
ఎండు తెగులు ఈ తెగులు వరిమాగాణుల్లో విత్తిన మినుముకు ఎక్కువగా ఆశిస్తుంది. ఆశించిన మొక్కల కాండం చుట్టూ బూజు ఏర్పడి ఆకులు వడలిపోవును. ఈ తెగులు తీవ్రత ఎక్కువైనచో మొక్కలు ఎండిపోయి, చనిపోవును. వరి మాగాణుల్లో నీరు నిల్వ ఉండే భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది యల్.బి.జి. – 648, 685, 709, 752 రకాలకు ఈ తెగులును కొంత వరకు తట్టుకునే శక్తి కలదు.
పక్షి కన్ను తెగులు ఈ తెగులు సోకిన ఆకుల పై లేత పసుపు రంగు అంచులతో కూడిన చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. చలి వాతావరణం ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా. మాంకోజేబ్ లేదా హెక్సాకొనాజోల్ 2.0 మి.లీ. లేదా 3 గ్రా. కాపర్ ఆకీక్లొరైడ్ కలిపి పిచికారి చేయాలి.
త్రుప్పు లేదా కుంకుమ తెగులు (ఇది మినుములో ఎక్కువగా ఆశిస్తుంది) ఆకు ఉపరితలం పైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడుతాయి. పైరు పూత దశలో ఈ తెగులు లక్షణాలు కనిపిస్తాయి తర్వాత కుంభాకృతితో కూడిన గుండ్రని మచ్చలు కుంకుమ/త్రుప్పు రంగును పోలి ఉంటాయి. అధిక తేమ మరియు చల్లని వాతావరణం, రబీ పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల మాంకోజేబ్ + 1 మీ.లీ. డైనోకాప్ లేక 1 మి.లీ. ట్రైడిమార్ఫ్ లేక 1 గ్రా. బైలాటాన్ కలిపి పిచికారి చేయాలి.
సీతాఫలం తెగులు తెగులు సోకిన మొక్కల లేత ఆకులు ముడతలుగా ఏర్పడి మందంగా పెద్దవిగా పెరుగుతాయి. మొక్కలు పూత పూయక వెర్రి తలలు వేస్తాయి. పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు మరియు పేనుబంక పెనుబంక నివారణకు లీటరు నీటికి డైమిధోయేట్ 2 మి.లీ. మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. తెగులు సోకిన మొక్కలను పీకి తగుల బెట్టాలి. తెగులు సోకని మొక్కల నుంచి వితనాన్ని సేకరించి వాడాలి.

సమగ్ర కలుపు యాజమాన్యం

విత్తే ముందు :

ప్లూక్లోరాలిన్ 45% ఎకరాకు 1 నుండి 1.2 లీటర్లు చొప్పున 200 లిటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారి చేసి, భూమిలో కలియదున్నాలి.

మొలకత్తక ముందు

పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్లు నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటిరోజు గాని పిచికారి చేయాలి.

మొలకెత్తిన తర్వాత :

పైరు విత్తిన 20 రోజులలో వెడల్పాకు కలుపు నివారణకు ఇమజితాఫిర్ (పర్సుట్) 300 మి. లీ. ఎకరాకు లేదా గడ్డిజాతి కలుపు నివారణకు ఎకరాకు 400 మి.లీ. క్విజాలఫాప్ ఇథైల్ (టర్గానూపర్) లేదా ప్రొఫాక్విజాఫాప్ 10% ఇసి 250 మి.లీ. పిచికారి చేయాలి. కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు నేలలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి.

ఖరీఫ్ వరి మాగాణులలో రబీ పెసర విత్తుకున్నప్పుడు కలుపు నివారణ

ఖరిఫ్ వరి అడుగులలో విత్తనం చల్లిన 21 – 28 రోజుల మద్య ఫినాక్సిప్రాప్ ఇథైల్ 250 మి.లీ. లేదా సైహలోఫాప్ బ్యుటైల్ 300 మి.లీ. లేదా సోడియం ఎసిఫ్లోర్ ఫెస్ + క్లొడినాఫాస్ ప్రొపార్జిల్ 400 మి.లీ. కలుపు 3-4 ఆకుల దశలో వున్నప్పుడు 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేయాలి. క్విజల్ ఫాఫ్ ఇథైల్ 400 మి.లీ. ఎకరాకు (చిప్పెర గడ్డి మరియు గడ్డిజాతి కలుపు నివారణకు), ఇమాజితాఫిర్ 250 మి.లీ. ఎకరానికి (వెడల్పాకు లేదా బంగారు తీగ కలుపు నివారణకు), పై మందులను ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 25 రోజుల వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.

నీటి యాజమాన్యం: పెసర, మినుము ఖరీప్ లో వర్షధారంగా పండిసాయిరూ. బెట్ట పరిస్దితులలో అవసరం మేరకు కీలక దశలో 1 - 2  తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చును. రబీ, వేసవిలో నీటిపారుదల క్రంద పండిసరు. సాధారణంగా పంట కాలానికి 300 - 450 మి. మీ. నీరు అవసరం ఉంటుంది.

కీలక దశలు: పూత మరియు కాయ తయారయ్యే దశలో పంట బెట్టకు గురికాకుండా చూడాలి. బెట్ట పరిస్ధతులలో 2  శాతం (20 గ్రాములు నీటికి) యూరియా ద్రావణాన్ని అవసరాన్ని బట్టి 2 లేదా 3  సార్లు పిచికారీ చెయాలి.

పంటకోత: సాధారణంగా  పూత దశ నుండి 30 - 40 రోజులకు పెసర, 40 - 50 రోజులకు మినుము పరిపక్వతకు చేరుకుంటుంది. కాయలు మెదట పసుపు రంగుకు, ఆ తర్వాత నలుపు రంగుకు మారతాయి. ఆకులు పసుపు వర్ణం దాల్చి నిదానంగా ఎండిపోవును. 80 % కాయలు ఎండిన దశలో పంటను కోసినచో అత్యధిక నాణ్యత కలిగి ఉండును. పంటను మనుషుల ద్వారా కాయలు కోయటా కానీ లేదా కొడవలి ఉపయెగించి మొక్కలు కోయటా లేదా యంత్రములచే కూడా కోయునప్పుడు ఆకుల పసరు వలన గింజ రంగు ఆకర్షణ  తగ్గే ప్రమాదం ఉంది. పంట పరిపక్వత దశలో కోతకు వారం రోజుల ముందు పారాక్వాట్ 4 . 0  మి. లి. ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినచో ఆకులు ఎండి రాలిపోవును. తద్వారా నాణ్యమైన ఉత్పత్తి లభించును. ఈ పక్రియ అంత పొడి వాతావరణంలో సకాలంలో చేసి పంటను కోయవలెను. ఆలస్యంగా కోసినచో కాయలు చిట్లి పోయి పశులు, కీటకాలు ద్వారా నష్టం వాటిల్లును.

కోతనంతర జాగ్రత్తలు: మనుషులు ద్వారా కోసిన మినుము పంట కందం, ఆకులు, ఎండే వరకు పొలంలో చిన్న కుప్పలుగా వేసి 2 - 3  రోజులు ఎండిన తర్వాత జాగ్రత్తగా నురపడి కళ్ళం పై గాని, టార్పాలిన్ ఉపయెగించి నూర్పిడి యంత్రం (అలలరప్ త్రేషర్) ఉపయెగించి నూర్పిడి చేయవలెను. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి చెత్త చెదారం, మట్టి తదితరవి లేకుండా శుభ్రపరచి బాగా ఎండనివ్వాలి. నూర్పిడి సరిగా చేయని యెడల లేదా సరిగా ఎండని ఎదల చెత్త, దుమ్ము, ధూళి తదితరవాన్ని నిల్వలో కీటకాలకు నిలయంగా మరి, అలాగే సరిగా అరణి పాశురంలో భుజు తెగులు ఆశించి నిల్వలో అపార నష్టం వాటిల్లును. కావున జాగ్రత్తగా  నూర్పిడి చేసి శుభ్రపరిచి 9 - 10 శాతం తేమ ఉండేలా ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి.

పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడానికి జాతీయ వ్యవసాయ సహకార సమాఖ్య (నఫెడ్) ద్వారా పెసర మరియు మినుములో నిర్దారించిన నాణ్యతా ప్రమాణాలు.

క్ర. సంఖ్యాప్రమాణాలు అత్యధిక పరిమితి శాతం (ప్రతి క్వింటాలు తూకానికి)
1. దుమ్ము, ధూళి, చెత్త, పుల్లలు, రాళ్ళూ, మట్టి మరియు ఇతర పంటల గింజలు. 2.0
2. ఇతర పప్పుదినుసుల గింజలు 3.0
3. బాగా రంగు మారినవి/ అంతర్గతంగా దెబ్బతిని నాణ్యతను ప్రభావితం చేసేవి 3.0
4. పాక్షికంగా రంగు మారినవి/ పైపైన దెబ్బతిని నాణ్యత ప్రభావితం కానివి 4.0
5. పరిపక్వత చెందని మరియు ముడుత గింజలు 3.0
6. పుచ్చులు 4.0
7. తేమ 12.0

ఉత్పత్తుల నిల్వ, మెళకువలు మరియు సస్యరక్షణ

పెసర మరియు మినుము నిల్వలో గాలిలో తేమను ఆకర్షించి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. కోత సమయంలో నూర్పిడిలో జాగ్రత్త వహించి నిల్వలో అశ్రద్ద వహించిన కీటకాలు, బూజు, ఎలుకలు మరియు ఇతర శిలింధ్రాల ద్వారా అపార నష్టం వాట్టిల్లును. ఉష్ణోగ్రత, గాలిలో తేమ మరియు గింజలలో తేమ నిల్వలో నాణ్యతను ప్రభావితం చేసే అంశాలు. బాగా ఎండిన గింజలు బిన్స్ లో గానీ, గోనె సంచులలో గానీ, పాలిథీన్ సంచులలో గానీ నిల్వ చేయవచ్చును.

నిల్వలో బ్రూచిడ్స్, పెన్సిలియం, ఆస్పరిజిల్లన్ శీలింధ్రము ఆశించి ఎక్కువగా నష్టపరుచును. సాధారణoగ పంట పొలంలో, గోదాంలో, పాత సంచులలో అప్పటికే ఆశించి ఉన్నచో నిల్వలో సులువుగా వ్యాప్తి చెంది నష్టంచేయును. కావున వీటి యొక్క ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలను (గోనె సంచులు) శుభ్రపరుచుకోవాలి. గొనె సంచులను 10 శాతం వేప ద్రావణం పిచికారి చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గొనె సంచులను వాడాలి లేదా సంచులపై మలాధియాన్ 10 మి.లీ. లేదా డెల్టామెత్రిన్ 2 మి.లీ. లేదా డైక్లోరోవాస్ (0.05%) ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తరువాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి.

  • బస్తాలు నిల్వ చేసే గది గోడల పైన, క్రింద 20 మి.లీ. మలాధియాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. నింపిన బస్తాలను చెక్క బల్లల పై వరుసలలో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి.
  • గృహ అవసరాలకై కొద్ది మొత్తంలో నిల్వ చేసేటప్పుడు వంటనూనేలు లేదా ఆముదం నూనె లేదా వేప నూనె ప్రతి కిలో గింజలకు 5.0 మి.లీ. చొప్పున కలిపి నిల్వ చేసినచో నిల్వలో పురుగుల వలన నష్టం జరుగకుండా నివారించవచ్చును. గ్రుడ్లు పోదగకుండా నివారించబడి, లార్వా గింజలలోకి చొరబడకముందే చనిపోవడానికి దోహదపడును.

ముఖ్య సూచనలు

  • పెసరలో ఖరిఫ్ లో అధిక దిగుబదినిచ్చు యం.జి.జి 295, యం.జి.జి. 347, టి.యం.- 96-2, డబ్యు.జి.జి. 37, డబ్యు.జి.జి. 42, రబీలో యం.జి.జి. 295, టి.యం – 96-2, డబ్యు.జి.జి.–37, డబ్యు.జి.జి. 42 మరియు యం.జి.జి. 351, వేసవిలో యం.జి.జి. 351, డబ్యు.జి.జి. 37, డబ్యు.జి.జి. 42 రకాలను సాగు చేయవలెను.
  • మినుములో అధిక దిగుబదినిచ్చు పల్లాకు తెగులును తట్టుకునే పి.యూ.31, యల్.బి.జి. 752, యల్.బి.జి. 787 యం.బి.జి. 207 రకాలను ఖరీఫ్ మరియు రబీలో సాగుచేయవలెను.
  • అన్ని కాలాలో సకాలంలో విత్తుకోనవలెను. సాళ్ళ పద్ధతి అవలంభించవలెను.
  • విధిగా విత్తనశుద్ది చేసి విత్తుకోనవలెను.
  • విత్తిన 25-30 రోజుల వరకు కలువు లేకుండా జగ్రత్తపడవలెను.
  • అవసరం మేరకు కీలక దశలో నీటి తడులు ఇవ్వవలెను. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు.
  • ఎట్టి పరిస్థితులలో పొలంలో నీరు నిల్వకుండా జాగ్రత్తపడాలి.
  • బెట్ట పరిస్థితులలో కీలక దశలలో 2% యూరియా పిచికారి చేసినచో దిగుబడి పెరుగును. రసం పీల్చే పురుగులైన తామర పురుగు, తెల్లదోమ మరియు పేనుబంకలను సకాలంలో అదుపుచేయాలి.
  • సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి శనగ పచ్చ పురుగును మరియు మారుకా మచ్చల పురుగును నివారించావలెను.
  • విత్తడం నుండి కోత వరకు యాంత్రిక పద్దతులు అవలంభించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగును.

విత్తనోత్పత్తి

  • నీటి వసతి కలిగి ఉన్నప్పుడు రబీ లేదా వేసవిలో విత్తనోత్పత్తి చేపట్టినట్లయితే నాణ్యమైన విత్తనం పొందవచ్చు.
  • నీరు బాగా యింకే తటస్థ నెలల్లో విత్తనోత్పత్తి చేపట్టాలి, మురుగు నీరు నిల్చే చౌడు నేలలు పనికిరావు.
  • స్వపరాగ సంపరక్కముతో ఫలదీకరణ జరిగి వృద్ధి చెందే పెసర, మినుము లాంటి పంటలలో విత్తనోత్పత్తి చాలా తేలికైన పని.
  • నాణ్యమైన బ్రీడరు విత్తనాన్ని పరిశోధన స్థానం నుండి సేకరించి విత్తనోత్పత్తికి వాడుకోవాలీ.
  • ప్రధాన పొలము బాగా తయారుచేసి సిఫార్సు మేరకు సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు వేయవలెను. నాణ్యమైన అధిక దిగుబడికై పంటకు సిఫారుసు చేయబడిన అత్యుత్తమ సేద్య పద్ధతులు పాటించాలి.
  • తమ ప్రాంతానికి అనువైన, చీడపీడలు – రోగ నిరోధక శక్తి కలిగిన అధిక దిగుబడి నిచ్చు రకాలు ఎన్నుకోవాలి.
  • పెసర/ మినుము విత్తనోత్పత్తికి ఎనుకొన్న పొలము ఇతర పెసర/మినుము పొలము నుండి మూల విత్తనానికి 10 మీ., సర్టిఫైడ్ విత్తనానికి కనీసం 5 మీటర్లు వేర్పాటు దూరం ఉండేలా చూడాలి.
  • ఎకరానికి ఆరు కిలోల విత్తనం వాడి విధిగా విత్తన శుద్ధి చేసి వరుసలలో విత్తవలెను.
  • విత్తేటప్పుడు రంగులో తేడా ఉన్న విత్తనాలు, రంగు మారిన విత్తనాలు, పుచ్చులు వేరు చేసి ఒకే రకమైన విత్తనం విత్తుకోవాలి. తద్వారా ఆదిలోనే కేళీలను నివారించవచ్చు.
  • విత్తనపు పంటకు అంతరకృషి సకాలంలో చేసి 25-30 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి.
  • కీలక దశలో పైరు బెట్టకు రాకుండా జాగ్రత్తపడాలి.
  • పైరు మొలక దశ నుండి కోత సమయం వరకు బెరకు మొక్కలను, ఎత్తు, రంగు, మరే విధంగానైన తేడాగా ఉన్న మొక్కలు కనిపిస్తే పీకి వేయాలి. అదే విధంగా తెగులు సోకిన మొక్కల్ని తిసివేయాలి.
  • అవసరమైన సస్యరక్షణ చర్యలను సకాలములో తీసుకోవాలి.
  • పరిపక్వత దశకు చేరినప్పుడే (కాయలు పూర్తిగా నలుపు రంగుకు మారతాయి) పైరును కోసి, ప్రత్యేకముగా నూర్చి, సూచించిన తేమ శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. కోత సమయంలో గాని, కళ్లంలో గాని తగు వేర్పటు దూరాన్ని పాటించి కల్తిలకు తావు లేకుండా చూడాలి.
  • విత్తనం నిల్వ చేసుకొనుటకు కొత్త సంచులను మాత్రమే వాడి కల్తీని నిరోధించడమే కాకుండా ధాన్యపు నిల్వలో పురుగు రాకుండా నిరోధించవచ్చును.
  • విత్తన సంచులను గాలి, వెలుతురు పుష్కలంగా లభించే పరిశుభ్రమైన ప్రదేశములలో నిల్వ ఉంచాలి. సంచులను నేలపై కాకుండా బల్లలపై ఉంచినట్లయితే తేమ శాతంలో మార్పు రాదు. విత్తనం ఆరోగ్యకరంగా ఉంటుంది.

విత్తన నాణ్యతా ప్రమాణాలు

క్రమ సంఖ్య ప్రమాణాలుమూల విత్తనంసర్టిఫైడ్ విత్తనం
1. విత్తన భౌతిక స్వచ్ఛత 98% 98%
2. భౌతిక ఇతర పదార్థాలు (అత్యధికంగా) 2% 2%
3. ఇతర పంటలు విత్తనాలు (అత్యధికంగా) 5/కిలో విత్తనానికి 10/కిలో విత్తనానికి
4. కలుపు మొక్కల విత్తనాలు (అత్యధికంగా) 5/కిలో విత్తనానికి 10/కిలో విత్తనానికి
5. ఇతర గుర్తించదగిన రకాలు (అత్యధికంగా) 10/కిలో విత్తనానికి 20/కిలో విత్తనానికి
6. మొలక శాతం 75 75
7. తేమ శాతం 9 9
పెసర, మినుము సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత (అపరాలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం. వరంగల్, ఫోన్ నెం. 9704222742, 9849133493

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate