অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వరిలో సేంద్రియ ఎరువుల వాడకం

వరిలో సేంద్రియ ఎరువుల వాడకం

పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ళ ఎరువు వంటి సేంద్రియ ఎరువులను, రసాయనిక ఎరువుతో కలిపి వాడినట్లయితే భూసారాన్ని కాపాడుకొంటూ 20-25 శాతం వరకు నత్రజనిని ఆదాచేయవచ్చు. వరి పోలాల్లో నాటడానికి ముందు అపరాలు, జీలుగ, జనుము, పిల్ల పెసర లాంటి పచ్చిరోట్ట పైరును పెంచి ముందే కలియదున్నటం ద్వారా భూసారం పెరగడమే కాక సుమారు 20-25 శాతం నత్రజనిని ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన నీలి ఆకుపచ్చనాచు, అజోల్లా, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబ్యాక్టిరియా మొదలగు జవన ఎరువులను వాడి నాత్రజని, భాస్వర మోతాదును 10-20 శాతం తగ్గించవచ్చు.

అజోల్లా వాడడం కోసం వరి పొలం దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి పలుచగా నీరు నిలువగట్టి 100-150 కిలోల అజోల్లా వేసి 2-3 వారాలు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. ఇది ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజనిని నెలకు అందిస్తోంది. అజటోబ్యాక్టర్ వాడుటకు ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400గ్రా. కల్చరును పట్టించాలి. లేదా 1 కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేల పై చల్లాలి. దీని వలన ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఎరోబిక్ వారిలో మాత్రమే ఇది అవసరం. ఫాస్పోబ్యాక్టీరియా భాస్వరపు జీవన ఎరువులలో ముఖ్యం. భూమిలో లభ్యంకాని స్ధితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఫాస్ఫోబ్యాక్టరియా లేదా అజోస్పైరిల్లంను అజటోబ్యాక్టర్ లాగే వినియోగించాలి.

స్వల్పకాలిక రకాలకు నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి, నాటడానికి ముందు దమ్ములోను, బాగా దుబ్బుచేసే దశలోను, అంకురం తొడిగే దశలోను, చొరవ పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి, 36-48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. మధ్య దీర్ఘకాలిక రకాలకు 4 దఫాలుగా 15-20 రోజులకు ఒకసారి నత్రజనిని వేయాలి. నత్రజనిని చివర్ దఫా అంకురం దశలో వేయాలి. ఆ తర్వాత వేయకూడదు.

  • ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న వేపతో పూయబడిన యూరియాని వాడుకోవాలి. లేనిఎడల 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి కలిపి 24 గంటల తర్వాత వెదజల్లితే నత్రజని వినియోగం పేరుగుతుంది.
  • మొత్తం భాస్వం ఎరువును దమ్ములోనే వేయాలి. ఆ తర్వాత కాం ప్లేక్స్ రూపంలో వేయకూడదు.
  • పోటాష్ ఎరువును రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. చల్కా (తేలిక) భూముల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి.
  • జింకు ధాతు లోపం వలన పైనుంచి 3 లేదా 4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోతుంది. ఎక్కువ లోపం ఉన్నప్పుడు ముదురాకు చివర్లలో , మధ్య ఈనేకు ఇరు పక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనబడతాయి. ఆకులు చిన్నవిగా, పెళుసుగా మారతాయి. మొక్కలు గిదబారి దుబ్బు కూడా చేయవు. నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు. దీని నివారణకు ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి రబీ సీజన్ లో , ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సేల్ఫేట్ వేయాలి లేదా 10 కిలోల జింక్ సల్ఫేట్ ను 200-250 కిలోల పశువుల పేడ లేదా వర్మీకంపోస్టుతో కలిపి 20-30 రోజుల పాటు గొనె సంచిలో ఉంచి మగ్గనిచ్చి, ఆ తర్వత చివరి దుక్కిలో వేయాలి. పైరుపై జింకు లోపం కన్పించగానే లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2,3 సార్లు పిచికారీ చేయాలి...
  • ఇనుప ధాతులోపం వలన లేత చిగురాకులు తెల్లగా మారి, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటుక రంగు మచ్చలు ఆకులు నిర్జీవమవుతాయి. పిలకలు తగ్గి, ఎత్తుపెరగదు. వర్షాధార నారుమళ్ళలో, మెట్టవరిలో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. నీరు నిల్వ ఉండే తడి నారుమళ్ళు పోస్తే ఈ సమస్య రాదు. దీని సవరణకు లీటరు నీటికి 20 గ్రా. అన్నభేది, 2 గ్రా. నిమ్మ ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాధడత కలిగిన ద్రావణాన్ని (5-10గ్రా. అన్నభేది) వాడాలి.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

చివరిసారిగా మార్పు చేయబడిన : 12/18/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate