অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

చెఱకు

చెఱకు

  1. సాగుపద్దతి
  2. రకాలు – వాటి లక్షణాలు
  3. విత్తన ఎంపిక, విత్తన రేటు మరియు విత్తనశుద్ది
  4. ప్రత్యేక విత్తనపు తోటల పెంపకము
  5. నాటే సమయం
  6. నాటే విధానం
    1. చెఱకు ముచ్చెకళ్ళ నుండి నారును పెంచి నాటే పధ్ధతి (బడ్చిప్ పధ్ధతి)
    2. ఒంటి కన్ను ముచ్చెలను నేరుగా ప్రధాన పొలంలో నాటుట
  7. ఎరువుల యాజమాన్యం
  8. నీటి యాజమాన్యం
  9. కలుపు నివారణ, అంతరకృషి
  10. సస్యరక్షణ
    1. ఆశించు పురుగులు – వాటి నివారణ చర్యలు
    2. కనిపించే తెగుళ్ళు – వాటి నివారణ చర్యలు
  11. చెఱకు చెత్త పరుచుట, మొక్క మొదళ్ళకు మట్టిని ఎగదోయుట మరియు నిలగట్టుట
  12. అంతర పంటల సాగు
  13. తోట నరుకుట
  14. మోడెం తోటల సాగు
  15. చౌడు భూములలో చెఱకు సాగు
  16. బెల్లం తయారీలో మెళకువలు
    1. పెనాలు
    2. రసాన్ని శుభ్రపరచడం
    3. బెల్లం తయారీలో హైడ్రోసు వాడకుండుట
    4. బెల్లం తోడుకొని పరిస్దితుల్లో పంచదార లేదా బెల్లం పొడి కలపడం
    5. బెల్లం వండటం

మన రాష్ట్రంలో చెఱకు పంటను సుమారు 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ, 37 లక్షల టన్నుల చెఱకును ఉత్పత్తి చేస్తున్నాము. చెఱకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, బగాస్సె, మొలాసిస్ మరియు ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెఱకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార దిగుబడి పొందటానికి శీతోష్ణస్థితులు, రకములు, సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ మరియు సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇటివలి కాలంలో రాష్ట్రంలో చెఱకు విస్తీర్ణం తగ్గడానికి ముఖ్యమైన కారణం కూలీల కొరత మరియు నీటి ఎద్దడి. చెఱకు సాగులో యంత్ర పరికరాలను ఉపయోగించవలసిన అవసరం రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. మారుతున్నా ఆర్ధిక, సామజిక పరిస్థితుల నేపధ్యంలో మానవశ్రమ అవసరం ఉన్న చెఱకు సాగుపై దీని ప్రభావం కనిపిస్తూనే ఉంది. చెఱకు నాటడానికి, కలుపుతీతకు, పై పాటుగా ఎరువులు వేయడానికి కూలీల కొరత సమస్యగా తయారౌతున్నది. రైతులు సకాలంలో చెఱకు నరికించి ఫ్యాక్టరీకి తోలడానికి నానా పాట్లు పడవలసి వస్తున్నది. అయితే చెఱకు సాగులో పూర్తి యాంత్రీకరణ పద్ధతిలో చెఱకు నాటడం మొదలు, కలుపు తీయడం, ఎరువులు వేయడం, మట్టిని ఎగద్రోయడం, పంటపై సస్యరక్షణ మందులు పిచికారి చేయడం మరియు చెఱకు కోత వంటివి అవలంభించడంవల్ల, సాగు ఖర్చు తగ్గి అదనపు ఆదాయం పొందవచ్చని పరిశోధనా ఫలితాలు తెలియజేస్తూన్నాయి. నీటి వనరులను పొదుపుగా, సమర్ధ నిర్వహణతో వృధా కాకుండా వాడుకోవడంతో అధిక ప్రయోజనం పొందవచ్చు. చెఱకు పంటకు పిలక దశ అత్యంత కీలకమైన తేమ సున్నితమైన దశ. ఈ దశ వేసవిలో రావడం వలన పంటపై ఒత్తిడి ఏర్పడి పిలకల సంఖ్య గణనీయంగా తగ్గి దీని ప్రభావం పంట దిగుబడి పై చూపుతుంది. పరిమిత నీటి వనరులతో బిందు సేద్య పధ్ధతి పాటించడం వలన నీటి వినియోగ సామర్ద్యం పెరిగి అంతరపంటల సాగు ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అంతే కాకుండా చెఱకు పంటను ఒక మొక్క తోట మరియు 2-3 మోడెంలు చేయటం వలన విత్తనపు ఖర్చుతో పాటు పొలం తయారీ ఖర్చు కూడా తగ్గి చెఱకు సాగులో ఎంతో లాభం చేకూరుతుంది. కాని మోడెం తోటలలో సరియైన యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం వల్ల దిగుబడులు తగ్గి సరాసరి ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది.

సాగుపద్దతి

అనువైన వాతావరణం

ఎక్కువ సూర్యరశ్మి వర్షపాతం, గాలిలో తేమ హెచ్చుగా ఉన్నప్పుడు చెఱకు ఏపుగా పెర్గుతుంది. రాత్రి వేళల కన్నా పగటి వేళలు అధికంగా ఉంటే (జూన్ – జూలై) పెరుగుదలకు అనుకూలం. గాలిలో తక్కువ తేమ, వెచ్చని పగళ్ళు మరియు చల్లటి రాత్రులు ఉంటె రసంలో పంచదార శాతం పెరుగుతుంది. గరిష్ఠ మరియు కనిష్ఠ ఉష్ణోగ్రతలకు మధ్య హెచ్చు వ్యత్యాసం (నవంబర్ నుండి మొదలవుతుంది) ఉంటె గడలలో చక్కర కూడిక అధికంగా ఉంటుంది.

నేలలు మరియు నేల తయారీ

  • చెఱకు సాగుకు నీటి సదుపాయం కలిగిన నల్ల రేగడి, ఒండ్రు మరియు మెరక భూములు (తోట భూములు) మిక్కిలి అనువైనవి. తేమను పోషకాలను ఎక్కువగా నిలుపుకోలేని తేలిక నేలలను (ఇసుక నేలలు) సేంద్రియ పదార్ధాలు వేసి అభివృద్ది పరచి తెఱకు నాటుకోవాలి.
  • సారహీనమైన, తక్కువ లోతు కలిగిన మరియు నేల పైపొర గట్టిపడే భూములను లోతైన దుక్కి చేసి ఎకరాకు ఒక టన్ను పొడిగా చేసిన వేరుశనగ తొక్కలను లేదా వరి ఊకను వేసి అభివృద్ధి పరుచుకోవాలి.
  • పాలచౌడు భూముల్లో చెఱకు నటేటప్పుడు, ముందుగా లవణాలను మురుగు నీటి కాలువల ద్వారా తీసి వేయాలి. లవణాలు పరిమితి నేలలో సెం.మీ.కు రెండు మిల్లీమోస్ ల కన్నా ఎక్కువ ఉండకూడదు. క్షార భూములను జిప్సం వేసి అభివృద్ధిపరిచి నాటుకోవాలి.
  • చెఱకు పంట ఒక మొక్కతోట మరియు రెండు మోడెం తోటలుగా రెండు నుండి మూడు సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి నేలను 45 సెం.మీ.ల లోతు వరకు ఇనుప నాగలితో దున్ని మెత్తగా దుక్కి చేయాలి. 4 నుండి 6 వారాలు ముందు సేంద్రియ ఎరువులను వేసి కలియదున్నాలి.
  • చదును చేసిన తరువాత కాలువలను, బోదెలను రిడ్జ్ మార్ లేదా రెక్కల నాగలితో వేసుకోవాలి. కాల్వ వెడల్పు 30 సెం.మీ. మరియు లోతు 20 సెం.మీ.లు ఉండాలి.
  • నీటి ముంపుకు గురయ్యే నల్ల రేగడి మరియు ఒండ్రు నేలల్లో చెఱకు నాటడానికి ముందే ప్రతీ 24 మీ.ల దూరానికి 60 సెం.మీ.ల వెడల్పు, 40 సెం.మీ.ల లోతు గల మురుగు నీటి కాలువలను తీసుకోవాలి.

రకాలు – వాటి లక్షణాలు

రకం తల్లిదండ్రులు చెఱకు దిగుబడి (ట/ఎ) పంచదార శాతం చెఱకులో బెండు పూత పూయు స్వభావం నీటి ఎద్దడికి తట్టుకునే శక్తి తెగుళ్ళకు నిరోధక శక్తి
స్వల్పకాలిక రకాలు
కో 6907 కో 740 x కో 1287 40 17 - 18 స్వల్పం పూయదు తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు తెగులును సహజ పరిస్దితుల్లో తట్టు కుంటుంది. గడ్డి దుబ్బు తెగులు సోకదు. కార్శి తోటలు కాటుక మరియు త్రుప్పు తెగులుకు ఎక్కువగా నావుతాయి.
కో 8014 (మహాలక్ష్మి) కో 740 x కో 6304 32-36 16-17 ఉంటుంది స్వల్పం తట్టుకోలేదు కాటుక, ఎర్రకుళ్ళు తెగుళ్ళను నిరోధిస్తుంది. గడ్డి దుబ్బు తెగులుకు లోనవుతుంది.
83 ఎ 30 కొఎ 7601 x కొఎ 7602 38-40 19 ఉండదు పూయదు తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు, కాటుక మరియు గడ్డి గుబ్బు తెగుళ్ళకు లోనవుతుంది.
కో 94008 కో 7201 x కో 775 48 19.5 ఉంటుంది స్వల్పం ఒక మోస్తారుగా తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు తెగులును ఒక మోస్తారుగా తట్టుకుంటుంది.
కో సి 671 క్యూ 63 x కో 775 48 17.8 ఉంటుంది పూస్తుంది తట్టుకోలేదు ఎర్రకుళ్ళు మరియు గడ్డి దుబ్బు తెగులుకు లొంగిపోతుంది.
87 ఎ 298 (విశ్వామిత్ర) కో 7704 x కో సి 67 44 18 - 19 స్వల్పం స్వల్పం తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు మరియు గడ్డి దుబ్బు తెగులుకు లొంగిపోతుంది.
83 ఆర్ 23 (వసుధ) కో 740 x కో 6806 48 19.5 లేదు స్వల్పం తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది
2003 వి 46 (భరణి) 86 ఎ 146 x 83 వి 50 18 లేదు పూయదు తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది.
మధ్యకాలిక రకాలు
కో 86032 (నయన) కో 62198 x కో సి 671 50 - 25 18 లేదు పూయదు తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. కాటుక తెగులును తట్టుకుంటుంది.
కో 7850 కో 740 x కో 6806 36 - 40 19 లేదు పూయదు తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. కాటుక తెగులును తట్టుకుంటుంది. ఆకుమాడు, గడ్డిడుబ్బు, మొవ్వుకుళ్ళు తెగుళ్ళకు లోనవుతుంది.
85 ఆర్ 186 కో 7219 x కో 6806 48 16 - 17 స్వల్పం స్వల్పం తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు తెగులుకు లోంగిపోతుంది.(కో సి 671 తెగ)
97 ఆర్ 129 కో 86011 x కో 775 50 19 లేదు పూయదు తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. త్రుప్పు తెగులుకు లోనవుతుంది
97 ఆర్ 401 కో సి 671 జి.సి 58 8.5 లేదు స్వల్పం తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు, కాటుక తెగుళ్ళను తట్టుకుంటుంది.
కో 7219 (సంజీవని) కో 449 x కో 658 44 - 46 18 - 19 స్వల్పం - తట్టుకుంటుంది గడ్డిదుబ్బు తెగులును తట్టుకుంటుంది. ఎర్ర కుళ్ళు తెగులును సహజ పరిస్థితుల్లో తట్టుకుంటుంది.
దీర్ఘకాలిక రకాలు
కో 419 పిఓజె 2878 x కో 290 52 16 - 17 స్వల్పం పూయదు బాల్యదశలో తట్టుకోలేదు ఎర్రకుళ్ళు కాటుక తెగుళ్ళను తట్టుకుంటుంది. పురుగును కొంత వరకు తట్టుకుంటుంది.
కో 62175 - 50 - 55 16.8 స్వల్పం పూయదు బాల్యదశలో తట్టుకోలేదు ఎర్రకుళ్ళు కాటుక తెగుళ్ళను తట్టుకుంటుంది. గడ్డిడుబ్బు తెగులుకు లోనవుతుంది. పోలును పురుగును కొంత వరకు తట్టుకుంటుంది.
కో ఆర్ 8011 కో 740 x కో 6304 40 - 42 18 - 19 స్వల్పం పూయదు తట్టుకుంటుంది కాటుక తెగులును తట్టుకుంటుంది. ఎర్ర కుళ్ళు తెగులును సహజ పరిస్దితులలో తట్టుకుంటుంది.
కో ఆర్ 8001 కో 740 x కో 1287 40 - 45 17 - 18 ఉంటుంది పూస్తుంది తట్టుకుంటుంది ఎర్రకుళ్ళు తెగులును తట్టుకుంటుంది. కాటుక, గడ్డి దుబ్బు తెగుళ్ళకు లోనవుతుంది.

విత్తన ఎంపిక, విత్తన రేటు మరియు విత్తనశుద్ది

  • పూత పూయని చెఱకుల చిగురు భాగం లేదా 7-8 నెలల వయస్సు గల లేవడి తోటల నుండి విత్తనమును ఎంపిక చేసుకోవాలి.
  • 90 సెం.మీ.ల ఎడంతో ఉండే చాళ్ళలో ఎకరాకు 16,000 మూడు కళ్ళ ముచ్చెలు లేదా దూరపు చాళ్ళలో 20,000 - 24,000 రెండు కళ్ళ ముచ్చెలను కొట్టి నాటుకోవాలి.
  • రెండు కళ్ళ ముచ్చెలను దూరపు చాళ్ళ పద్ధతిలో నటుకున్నట్లయితే ఎకరాకు ఉండవలసిన మొక్కల సాంద్రతను బట్టి నాటుకోవాలి.
  • నాటుటకు ముందు ముచ్చెలను 200 లీ. నీటికి 125 గ్రా. కార్బెండాజిమ్ లేదా 200 మి.లీ. ప్రొపికోనజోల్ మరియు 600 మి.లీ. మలాధియన్ లేదా 50 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందులో 15 నిమిషాలు ఉంచినట్లయితే పొలుసు పురుగు, చేదలు, వేరు పురుగు మరియు అనాసకుళ్ళ తెగులును అరికట్టవచ్చు.

ప్రత్యేక విత్తనపు తోటల పెంపకము

  • చెఱకు విత్తనాన్ని ముదురు తోటల నుండి సేకరించిన యెడల పై మూడో వంతు గడ భాగం నుండి 3 లేదా 2 కళ్ళ ముచ్చెలను తీసుకోవాలి.
  • ముచ్చెలను వేడి నీటిలో 52o సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 2 గంటలు ఉంచి శుద్ధి చేయాలి. ముచ్చెలను శుద్ధి చేయడం ద్వారా కాటుక, అకుమాడు, గడ్డిడుబ్బు తెగుళ్ళను నివారించవచ్చు. విత్తన శుద్ధి చేసిన విత్తన్నాని మాత్రమే లేవడి తోటల పెంపకానికి వాడాలి.
  • పొలుసు పురుగు నివారణకు ముచ్చెలను నాటే ముందు లీటరు నీటికి 2 మి.లీ. మలాధియాన్ లేదా డైమిధోయేట్ మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి.
  • లేవడి తోటలు 7-8 నెలలు పెరిగిన తరువాత జూలై నుండి ఆగష్టు నెలల్లో కొట్టి తిరిగి నాటాలి.

నాటే సమయం

చెఱకును డిసెంబర్ మాసంలో మొదలుకొని మర్చి వరకు నాటవచ్చు. స్వల్పకాలిక రకాలను ముందుగా గానుగాడుటకు డిసెంబర్ – జనవరిలోనూ, మధ్యకాలిక చెఱకు రకాలను జనవరి మాసంలో మరియు ఆడ్సాలి పంటను ఆగష్టు నుండి సెప్టెంబర్ మాసాలలో నాటుకోవాలి.

నాటే విధానం

బోదెలలో నీరు పెట్టి ఇంకిన తర్వాత వెనుకకు నడుచుకుంటూ, అన్ని కళ్ళూ ప్రక్కకు ఉండేటట్లు 2 సెం.మీ. లోతు మించకుండా నాటాలి.

నాటే పద్ధతులు

బోదెలు – కాలువల పధ్ధతి :

బోదెలు – కాలువల పద్ధతిలో నేలను మెత్తటి దుక్కి చేసి ఎత్తు, పల్లాలు లేకుండా చదును చేసి తర్వాత కర్ర నాగలితో గానీ, రెక్క నాగలితో గానీ, ట్రాక్టరుతో నడిచే రిడ్జ్ నాగలితో గాని 90 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ. లోతు గల కాలువలను వేసుకోవాలి.

దూరపు చాళ్ళ పధ్ధతి:
  • బిందు సేద్య పద్ధతిలో యంత్రీకరణను అవలంభిస్తూ చెఱకును సాగు చేయుటకు దూరపు చాళ్ళ పధ్ధతి అనువైనది.
  • ఈ పద్ధతిలో చాళ్ళను 4 లేదా 5 అడుగుల దూరంలో వేసి సిఫారసు మేరకు ఎకరాకు 20,000 రెండు కళ్ళ ముచ్చెలను నాటి సాగు చేయవచ్చు. దీని వలన విత్తనం ఆదా అయి అంతర పంటల సాగుకు కూడా అనువుగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో డ్రిప్ పధ్ధతి ద్వారా నీటిని సమర్దవంతంగా, పొదుపుగా ఉపయోగించవచ్చు.
  • వ్యవసాయ పరిశోధనా స్దానం, బసంత్ పూర్ లో జరిపిన పరిశోధనల్లో ఎకరాకు 20 వేల రెండు కళ్ళ ముచ్చెలను 5 అడుగుల దూరంలో నాటడం వలన 3 అడుగుల దూరంలో నాటిన దాని కంటే ఎక్కువ దిగుబడి నమోదు చేసారు.
  • చాళ్ళ దూరం ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాక్టరు ద్వారా అంతర సేద్యం మరియు మట్టిని బోదేలలో ఎగద్రోయడం వంటి పనులు చేయడం ద్వారా సాగు ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ పద్ధతిలో తోటకు సరిపడా గాలి, వెలుతురు అందడం వల్ల గడలు బాగా ఎదిగి, గడ బరువు పెరిగి, అధిక దిగుబడి వల్ల చెఱకు సాగు లాభసాటిగా ఉంటుంది.

జంట చాళ్ళ పధ్ధతి

  • నీటి ఎద్దడి గల భూములలో చెఱకు సాగు చేయడానికి మరియు అంతర పంటలు వేసుకోవడానికి ఈ పధ్ధతి అనువైనది.
  • ఈ పద్ధతిలో చాళ్ళ మధ్య 2.5 అడుగుల దూరం ఉంచి, జంట చాళ్ళ మధ్య దూరం 5 అడుగులు ఉంచినప్పుడు అంతర పంటల సాగుకు అనువుగా ఉండి గడ దిగుబడులు అధికంగా ఉంటాయి.
  • జంట చాళ్ళ మధ్య దూరం ఎక్కువగా ఉండడం వల్ల సూర్యరశ్మి బాగా ప్రసరిచి పిలకలు బాగా తొడిగి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
  • మామూలు పద్ధతిలో కంటే ఈ పద్ధతిలో బిందు సేద్యానికయ్యే ఖర్చు సుమారు 41% వరకు తగ్గుతుంది.

రెండు చాళ్ళ ఒక చాలు విడిచి నాటే పధ్ధతి

  • ఈ పద్ధతిలో కాలువలను 2 లేదా 3 అడుగుల దూరంలో వేసి ప్రతి రెండు వరుసలకు ఒక కాలువ నాటకుండా ఖాళీగా వదిలివేయాలి. ఇలా చేయడం వల్ల జంట చాళ్ళు ఏర్పడి వెడల్పు పెరుగుతుంది. ఇలా ఏర్పడిన ఖాళీ స్ధలంలో అంతరపంటలు సాగు చేయవచ్చు.
  • నీటి ఎద్దడి ప్రాంతాలలో జంట చాళ్ళ ద్వారా నీరు పెట్టి చాళ్ళ మధ్య చెఱకు చెత్త పల్చగా పరిచినచో తేమ నిల్వ ఉండి, కలుపు ఉధృతిని తగ్గించవచ్చు. సాధారణ పద్దతిలో సమానంగా దిగుబడులు వస్తాయి. ఎకరాకు ఒక టన్ను విత్తనం ఆదా అవుతుంది.

చెఱకు ముచ్చెకళ్ళ నుండి నారును పెంచి నాటే పధ్ధతి (బడ్చిప్ పధ్ధతి)

  • ప్రస్తుతం పెరుగుతున్న సాగు ఖర్చులను తగ్గించుకొని, నికర ఆదాయం పెంచుకోవడానికి ఈ పద్ధతి అనువైనది. ఈ పద్ధతిలో చెఱకు విత్తనపు ఖర్చును దాదాపు నాలుగింట మూడు వంతులు తగ్గించుకోవచ్చు.
  • ఈ పద్ధతిలో మూడుకళ్ళ ముచ్చెలకు బదులుగా చెఱకు కన్నులను మాత్రమే యంత్రం సహాయంతో వేరుచేసి విత్తనంగా వాడుతారు. కన్నులు వేరు చేయగా మిగిలిన చెఱకు గడలను బెల్లం లేదా పంచదార తయారికి వినియోగించుకోవచ్చు.
  • ప్లాస్టిక్ ట్రేలలోని గుంతలను 1/3 వంతు వరకు కోకోపీట్ తో నింపుకొని విత్తనశుద్ది చేసిన కన్నులు పైకి ఉండేటట్లు వాలుగా ఉంచాలి.
  • చెఱకు మొలక శాతం తొందరగా రావడానికి ట్రేలను ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చుకొని ప్లాస్టిక్ షీట్ ను గాలి తగలడుండా కప్పాలి.
  • మొలకెత్తిన ట్రేలను 4వ రోజు హరిత గృహంలోకి మార్చుకొని రోజు విడిచి రోజు రోజ్ క్యాన్ తో అవసరాన్ని బట్టి తడుపుకోవాలి.

ఒంటి కన్ను ముచ్చెలను నేరుగా ప్రధాన పొలంలో నాటుట

  • ఒంటి కన్ను ముచ్చెల ద్వారా నారును పెంచి ప్రధాన పొలంలో తగినంత దూరంలో నాటిన మొక్కలు చాలా బలంగా తెగుళ్ళను తట్టుకొని ఏకరీతిగా కనిపిస్తూ అధిక దిగుబడిని ఇస్తాయి.
  • ఒంటి కన్ను ముచ్చెలను నేరుగా ప్రధాన పొలంలో నాటు పద్ధతిలో ఒంటి కన్ను మొగ్గలను చాళ్ళలో 30-45 సెం.మీ.ల ఎడంతో నాటాలి. భూమిలో తేమ ఉండి, కనుమొగ్గలు కూడా పైకి ఉండేలా చూసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం

  • చెఱకులో ఎరువుల యాజమాన్యం ముఖ్యంగా నేలలు స్వభావం, నీటి లభ్యత, పంట కాలపరిమితి మీద ఆధారపడి ఉంటుంది. పంటకు సిఫారసు చేయబడిన ఎరువుల మోతాదును సకాలంలో, సరియైన పద్ధతిలో అందించడం ద్వారా చెఱకులో ఆశించిన దిగుబడులు పొందవచ్చు.
  • రసాయనికి ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడటం వలన రసాయనక ఎరువుల మోతాదును కొంత వరకు తగ్గించువచ్చు.
  • సేంద్రియ ఎరువులను వాడటం వలన నేలలో సేంద్రియ పదార్ధం క్రమేపి పెరిగి భూభౌతిక స్దితి మెరుగుపడుతుంది. అంతే కాకుండా రసాయన ఎరువుల ద్వారా లభ్యంకాని చాలా సుక్ష్మపోషకాలు పంటకు కావలసిన పరిమాణంలో లభ్యమై పంట దిగుబడులు పెరుగుటకు దోహదపడతాయి.
  • ఫిల్టరుమడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరానికి 5-6 టన్నుల బాగా ఎండిన ఫిల్టరుమడ్డిని భూమిలో వేసి కలియ దున్నాలి. ఒక టన్ను ఫిల్టరుమడ్డి వాడటం వలన 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పోటాష్ ను పంటకు అందించవచ్చు.
  • సేంద్రియ ఎరువులు లభ్యంకాని ప్రదేశాలలో పచ్చిరోట్ట పైర్లు అయిన లెగ్యూం జాతికి చెందిన జనుము, పిల్లిపెసర, అలసంద మరియు గ్లైరిసీడియా వండి వాటిని పెంచి పుతకు రాక ముందు లేదా 60 రోజుల వయస్సులో నేలలో వేసీ కలియదున్నాలి లేదా చెఱకు మొక్క మొదళ్ళలో వేసి మట్టి కప్పవలెను. ఈ విధంగా చేయడం వల్ల భుస్వభావం మెరుగుపడటమే కాకుండా భూమికి నీటిని నిలుపుకొనే శక్తి పెరిగి చెఱకు పంట బాగా పెరుగుటకు దోహదపడుతుంది.
  • చెఱకు రైతులు భుసార పరీక్షనుసారంగ ఎరువులను వేసుకోవడం మంచిది. దీని వల్ల రసాయనిక ఎరువులకయ్యే ఖర్చు తగ్గి పంట ఉత్పాదకత పెరుగుతుంది.
  • ఎకరా చెఱకుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం మరియు 48 కిలోల పోటాష్ లను అందించే ఎరువులను వేసుకోవాలి. నిజామాబాద్, కామారెడ్డి పరిసర చెఱకు పండించు ప్రాంతాల్లో నేలలో భాస్వరం నిల్వ మోతాదులు అధికంగా ఉన్నట్లు పరిశోధనా ఫలితాలు తెలియజేస్తున్నాయి.
  • సిఫార్సు చేయబడిన ఎరువుల్లో నత్రజని ఎరువులను నాటిన 45-60 రోజులకు మరియు 90 రోజులకు మొక్కల మొదళ్ళ మధ్య 5 సెం.మీ. లోతులో సమపాళ్ళలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్య భాస్వరం ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ ఉన్నప్పుడు, ఎకరాకు 40 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులనుఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. భూమిలో లభ్యమమే పోటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 48 కీలలో పోటాష్ నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి.
  • నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ (2 కిలోలు ఎకరాకు) లేదా అజోస్పైరిల్లం (4 కిలోలు ఎకరాకు) 500 కిలోల పశువుల ఎరువుతో కలిపి 2 దఫాలుగా నాటిన 3వ రోజున సగబాగం మరియు 45వ రోజున మిగిలిన సగభాగాన్ని వేసుకున్నట్లైతే నత్రజని ఎరువులను సుమారు 25% వరకు ఆదా చేసుకోవచ్చు.
  • ఎకరాకు 3 కిలోల ఫాస్ఫోబాక్టీరియా ను ముచ్చెలు నాటిన తరువాత 6వ రోజున జివతడి ఇచ్చే ముందు వేసుకుంటే భాస్వరపు ఎరువులలో సుమారు 25% వరకు ఆదా చేసుకోవచ్చు.
  • జింక్ ధాతు లోపం కనిపించిన మొక్కలలో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి, లోపం ఎక్కువైనపుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యం అవుతాయి. లోపం కనిపించిన తోటకు లీటరు నీటికి 2 గ్రా. జింక్ సల్ఫేట్ ను (0.2% ద్రావణం) వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను నేలలో వేసి కలియ దున్నడం వలన ఈ ధాతు లోపం రాకుండా నివారించుకోవచ్చు.
  • సాదారణంగా కార్మి తోటల్లో తొలిదశలో ఇనుప ధాతు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఇనుప ధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈనెల మధ్య భాగంలో ఏర్పడతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 10 గ్రా. అన్నభేది (ఫెర్రస్ సల్ఫేట్) మరియు 2 గ్రా. నిమ్మ ఉప్పును లీటరు నీటికి చొప్పున కలిపి మొక్కలపై వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.
  • మెదక్ మరియు సంగారెడ్డి జిల్లాల్లోని చెఱకు సాగు చేసే ప్రాంతాల్లో మాంగనీసు లోపం గమనించడం జరిగినది. మాంగనీసు లోపం వల్ల చెఱకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలు ఈనెల పక్కన కనబడతాయి. ఈనెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో క్రుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి, చారలు చారలుగా ఆకులు నిలువునా చీల్చినట్టు కనబడుతాయి. మాంగనీసు లోప నివారణకు ఎకరాకు 2.5 కిలోల మాంగనీసు సల్ఫేట్ 450 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.

నీటి యాజమాన్యం

చెఱకు పంటకు సుమారు 1900-2700 మి.మీ. నీరు అవసరమవుతుంది. పంట మొదటి నాలుగు నెలలను బాల్యదశ లేదా పిలకలు పెట్టె దశ అంటారు. పిలకలు పెట్టె దశ అత్యంత కీలకమైన తేమ సున్నిత దశ. ఈ దశలో నీటి ఎద్దడి వలన పిలకల సంఖ్య తగ్గి గడ బరువు మరియు దిగుబడి తగ్గుతుంది. కాబట్టి ఈ దశలో పంటకు ఆరు రోజులకొకసారి నీరు పెట్టాలి. సాంప్రదాయ పద్ధతిలో బోదెలు-కాలువల పద్ధతిలో నీరు పెట్టవచ్చును. బిందు సేద్యం పద్దతి అవలంభించడం వలన పరిమిత నీటి వనరులను పొదుపుగా వాడుకోవచ్చు. జంట చాళ్ళ పద్దతిలో చెఱకు సాగు చేసినపుడు, బిందు సేద్యం పధ్ధతికయ్యే ఖర్చును 50% వరకు తగ్గించుకోవచ్చును. ఈ పరిస్దితుల్లో యూరియా మరియు మ్యురేట్ ఆఫ్ పోటాష్ (2.5%) లను పైరు మీద పిచికారి చేయాలి.

కలుపు నివారణ, అంతరకృషి

ముచ్చెలు నాటిన వెంటనే 3వ రోజున అట్రజిన్ 50% పోడిమందును ఎకరానికి 2 కిలోలు లేదా 70% డబ్ల్యు.పి గల మెట్రిబుజిన్ 600 గ్రా. మందును లేదా 23.5% ఇసి గల అక్సిప్లోరోఫిన్ 400 మి.లీ మందును 200 లీటర్లు నీటిలో కలిపి పంటపై పిచికారి చేసి కలుపును నివారించుకోవచ్చు. తోట నాటిన 30-50 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి 2-3 సార్లు గోర్రుతో లేదా దంతెతో అంతరకృషి చేయాలి లేదా కూలీలతో కలుపు తీయించాలి లేదా ఎకరాకు 500 గ్రా. 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడి మందు మరియు 300 గ్రా. మెట్రిబుజిన్ 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కరాకు 1300 గ్రా. 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడి మరియు ఒక లీటరు గ్రామోకోన్ 24% మందును 450 లీటర్లు నీటిలో కలిపి చెఱకు ఆకులపై పడకుండా వరుసల మధ్య మాత్రమే నాటిన 40 మరియు 60 రోజులకు పిచికారి చేయాలి. తుంగ జాతి కలుపు అధికంగా ఉన్న సందర్భాలలో ఎకరానికి 36 గ్రా. హేలోసల్ఫ్యూరాన్ మిధైల్ మందును 200 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

సస్యరక్షణ

ఆశించు పురుగులు – వాటి నివారణ చర్యలు

క్ర. సం పురుగులు లక్షణాలు ఉధృతి పెరగడానికి అనుకూల పరిస్దితులు నివారణ చర్యలు
1. పీక పురుగు, కాండం తొలుచు పురుగు బాల్య దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెఱకును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెఱకు పై ఎక్కువగా వస్తుంది. వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండి, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు, పంట నీటి ఎద్దడికి గురి అయినపుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. పురుగు ఆశించి తోటలలో 1.6 మి. లీ. మోనొక్రోటోఫాస్ లేదా 2.5 మి. లీ. క్లోరోపైరిఫాస్ 20 ఇ.సి లేదా 0.75 మి. లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా ఫిప్రోనిల్ 2 మి. లీ. లేదా ధయోమిధాక్సామ్ 0.75 మి. లీ. 1 లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 గ్రా. గుళికలను ఎకరాకు 7.5కిలోల చొప్పున నేలలో వేసుకోవాలి. ట్రైకోగ్రామా ఖిలోనిస్ గ్రుడ్లు పరాన్న జీవిని ఎకరాకు 20,000 చొప్పున చెఱకు నాటిన 30 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. జివనియంత్రణ పద్ధతిలో గ్రాన్యులో వైరస్ మందును ఎకరానికి 100 లార్వాల్ ఈక్వలాంట్స్ లేదా 300 వైరస్ లార్వలను పంట నాటిన 30 రోజుల తర్వాత 2 సార్లు పిచికారి చేస్తే పీక పురుగును సమర్దవంతంగా నివారించుకోవచ్చు.
2. పొలుసు పురుగు కణుపు ఏర్పడినప్పటి నుంచి చెఱకు నరికే వరకు పైరును ఆశిస్తుంది. నీటి ఎద్దడి పరిస్దితుల్లో ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కలిగి ఉన్న జూలై – సెప్టెంబరు నెలల మధ్య కాలం పోలును పురుగు అభివృద్ధికి అనుకూలం. పోలును పురుగు వ్యాప్తిని అరికట్టడానికి ఆకులు రెలచి (మొవ్వులో కనీసం 8 ఆకులు ఉంచి) డైమిధోయేట్ 1.7 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
3. తెల్ల దోమ పురుగు ఆకుల అడుగు భాగాన అంటుకొని ఆకుల లోని రసాన్ని పిల్చి వేయటం వలన పైరు పెరుగుదల తగ్గి పోతుంది. ఆకులు నారింజ రంగుగా మారి మొక్కలు గిడసబారి పొతాయి. నీటి ముంపునకు గురైన ఇవక తీతసౌకర్యం లేని, సిఫారసు చేసిన ఎరువులు వేయలేని పొలాల్లోనూ, మెడెం తోటల్లోనూ తెల్లదోమ ఎక్కువగా వస్తుంది. పురుగు ఆశించినపుడు 1.6 మి. లీ. మోనొక్రోటోఫాస్ లేదా 1.7 మి. లీ. డైమిధోయేట్ ను లీటరు నీటికి కలిపి 10-12 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి ఆకుల క్రింది పైభాగాలు తడిచేలా పిచికారి చేయాలి. పురుగు ఆశించిన ఆకులను రెలచి నాశనం చేయాలి.
4. పిండినల్లి పురుగులు ఆకు తోడిమలకు, చెఱకు గడలకు మధ్య గుంపులు గుంపులుగా చేరి గడల నుండి రసాన్ని పిల్చి వేస్తాయి,. ఉధృతంగా ఉన్నప్పుడు మొవ్వు ఎండి పోతుంది. పంట పక్వానికి వచ్చినపుడు పిండి నల్లి తాకిడి ఎక్కువగా ఉంటుంది. వర్ష భావ పరిస్దితులు ప్రధానంగా పిండినల్లికి అనుకూలం. ఎదిగిన తోటల్లో పురుగు నివారణకు ఆకులు రెలచి, బహిర్గతమైన కణుపుల మీద 1.7 మి. లీ. డైమిధోయేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఇటివల కాలంలో పంటపై ఆశిస్తున్న పిండినల్లి (డిస్మికాకస్ కారెన్స్) నివారణకు కూడా పైన సూచించిన మందులతో ఆకులు తడిచేట్లుగా పిచికారి చేసి నివారించవచ్చు.
5. వేరు లేద్దె పురుగు తేలిక నేలల్లో ఎక్కువగా కనిపించి మొక్కల వేర్లను తినివేయడం వలన మొక్కలు చనిపోతాయి. తేలిక పాటి నేలల్లో తగినంత తేమ లేని భూముల్లో వేరు పురుగు అధికంగా కనిపిస్తుంది. ఎదిగే తోటల్లో ఈ పురుగు నివారణకు ఫోరెట్ 10% గుళికలను ఎకరాకు 8 కిలోల చొప్పున మొక్కల మొదళ్ళ దగ్గర గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేస్తె ఈ పురుగు వల్ల కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. జీవ రసాయన మందులైనటువంటి మెటారైజం అనైసాప్లియే మరియు బవేరియ బసియానా లను 5 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళలో చల్లుకోవాలి లేదా పేని బాసిల్లస్ పాపిలియే అనే బాక్టీరియాను లీటరు నీటికి 2 గ్రా,. కలిపి కూడా పిచికారి చేయాలి లేదా ఫిప్రోనిల్ 40% మరియు ఇమిడాక్లోఫ్రిడ్ 40% మందును ఎకరాకు 150 గ్రా. చొప్పున 400 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. వేరుపురుగులు ఆశించే ప్రాంతాలలో ఆఖరి దుక్కిలో ఎకరాకు 200 కిలోల వేప పిండిని వేసి కలియ దున్నాలి. తొలకరి వర్షాలు పడినవెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా దాదాపు 50% ఫ్రౌడ పెంకు పురుగులను నిర్మూలించవచ్చు.
6. దూదేకుల పురుగు పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులు గుంపులుగా చేరి ఆకుల నుండి రసాన్ని పిల్చి వేయడం వలన ఆకులు వడలి పోయి, ఎండిపోతాయి. అధిక నత్రజని ఎరువుల వాడకం వల్ల ఉధృతి పెరగవచ్చు మలాధియాన్ 2 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి పురుగును నివారించుకోవచ్చు.
7. చెదలు విత్తనపు ముచ్చెలకు ఇరువైపుల నుండి ప్రవేశించి లోపలి పదార్దం తినిడం వలన మొలకశాతం తగ్గుతుంది. ఎదిగిన తోటల్లో కూడా మెత్తని లోపలీ పదార్దం తిని కేవలం దోల్లలు మిగిల్చి వేస్తాయి. తేలిక పాటి నేలల్లో చెద పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తక్కువ వర్షపాత ప్రాంతాల్లో నీటి వసతి తక్కువ గల ప్రాంతాల్లో సాగుచేసే చెఱకును చెదలు ఆశించే అవకాశ ముంది. చెద పురుగులు నివారణకు పుట్టలను త్రవ్వి రాణి ఈగలను చంపాలి. క్లోరిపైరిఫాస్ 50 మందును లీటరు నీటికి 5 మి. లీ. చొప్పున కలిపి ఒక్కొక్క పుట్టలో 20 నుంచి 30 లీటర్లు మందు ద్రావణం వేయాలి మరియు ఎదిగిన తోటల్లో చెదలు ఆశించినప్పుడు పైన పేర్కొన్న ద్రావణాన్ని లీటరు నీటికి 5 మి. లీ. కలిపి బోదెల పై పోయాలి లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 17.8 ఎస్.ఎల్ 0.25 మి. లీ. మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
8. ఎర్రనల్లి (లక్క తెగులు) ఈ పురుగు ఏప్రిల్ – మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువగా ఉంటుంది. ఆకు అడుగుభాగాన అసంఖ్యాకంగా ఈ పురుగులు చేరి రసాన్ని పీల్చడం వలన ఆకు ఎర్రగా మారుతుంది. వేసవి కాలంలో వానజల్లులు పడినప్పుడు, ఆ జల్లుల మధ్య బెట్ట సమయంలో లక్క తెగులు ఎక్కువగా కన్పిస్తుంది. నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి. లీ. స్పైరోమెసిఫెన్ లేదా 5 మి. లీ. డైకోఫాల్ లేదా 1.5 మి. లీ. ప్రోపోర్గైట్ కలిపి ఆకుల అడుగు భాగం తడిచేటట్లు పిచికారి చేయాలి.
9. తెల్ల పేను (ఊలి ఎఫిడ్) ఈ పురుగు యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిళితమై మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగుల విసర్జన, తియ్యని జిగట పదార్దం లాగా ఉండి కిందున్న ఆకుల పై భాగాన పడి దాని మీద సుటీమోల్ద్ అనే నల్లని శీలీంధ్రం పెరిగి ఆకు మసి బారుతుంది. వాతావరణం మబ్బుగా ఉండి 19-35o సేల్సియేస్ మరియు 80-90 % గాలిలో తేమ ఉన్నప్పుడు ఈ పురుగు బాగా అభివృద్ది చెందుతుంది. పురుగు ఆశించిన ఆకులను తీసి తగల బెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెఱకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. లీటరు నీటికి 1.6 మి. లీ. మోనొక్రోటోఫాస్ లేదా 1.7 మి. లీ. డైమిధోయేట్ లేదా 1 గ్రా. ఎసిఫేట్ ను కలిపి పిచికారి చేయాలి.

కనిపించే తెగుళ్ళు – వాటి నివారణ చర్యలు

క్ర.సం తెగుళ్ళు లక్షణాలు ఉధృతి పెరగడానికి అనుకూల పరిస్దితులు నివారణ చర్యలు
1. కాటుక తెగులు తెగులు సోకిన మొక్కల్లో మొవ్వు పొడవైన నల్లని కొరడాగా మారుతుంది. నీటి ఎద్దడి గల పరిస్దితులు కాటుక తెగులు ఉధృతికి అనుకూలం. మూడు కళ్ళ ముచ్చెలను వేడి నీటిలో (52 o సెల్సియస్ వద్ద 30 ని.) లేదా తేమతో మిళితమైన వేడి గాలిలో (54 o సెల్సియస్ వద్ద 2.5 గం.) విత్తనశుద్ది చేసి లేవడి తోటలను పెంచి వాటి నుండి వచ్చిన ముచ్చెలను నాటినట్లయితే తెగులును నివారించవచ్చు. విత్తనపు ముచ్చెలను ప్రోపికోనజోల్ (0.5 మి. లీ. / లీటరు)మందు ద్రావణంలో 5 ని. ముంచి నాటుకోవాలి. మోడెం తోటల్లో ప్రోపికోనజోల్ (1.0 మి. లీ. / లీ.) మందును కార్మి చేసిన వెంటనే మరియు 30-35 రోజులకొకసారి పిచికారి చేయాలి.
2. ఎర్రకుళ్ళు తెగులు తెగులు ఆశించినపుడు తొలిదశలో పై నుండి 3, 4వ ఆకులు పసుపు పచ్చగా మారుతాయి. ఆ తర్వాత మొవ్వంతా వడలి పోతుంది. తెగులు సోకిన గడలను నిలువుగా చిల్చితే పులిసిన పిండి పదార్దపు వాసన వస్తుంది. చెఱకు లోపల ఎర్రకుళ్ళు తెగులు సోకిన భాగం ఎర్రగా మారి అక్కడక్కడ తెల్లని అడ్డు చారలు కనిపిస్తాయి. తెగులు సోకిన చెఱకు కొంత కాలానికి వడలి చనిపోతుంది. చెఱకు దిగుబడి, రసనాణ్యత తగ్గి పోతుంది. నీటి ఎద్దడి మరియు నీటి ముంపుకు గురైన తోటలలో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా కనబడుతుంది. విత్తనపు ముచ్చెలను నాటే ముందు వేడి నీటిలో 52 o సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కార్బండాజిమ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి 30 ని. శుద్ధి చేయాలి. ఎర్రకుళ్ళు తెగులు తట్టుకునే రకాలైన కో ఎ 7602, కో 7706, 83 ఆర్ 23, కో టి 8201, 87 ఎ 298 లను సాగు చేయాలి.
3. గడ్డి దుబ్బు తెగులు తెగులు సోకిన మొక్కల ముడళ్ళ నుండి సన్నని కురచగా ఉన్న తెల్లని పిలకలు ఎక్కువగా వస్తాయి. ఆకులు పాలిపోయి చాలా చిన్నవిగా ఉండి మొక్కలు గడ్డి దుబ్బుల వలే ఉంటాయి. కార్మి తోటల్లో ఎక్కువగా కనబడతాయి. అధిక నత్రజని ఎరువుల వాడకం బెట్ట పరిస్దితులు ఈ తెగులు ఉధృతికి అనుకూలం. విత్తనపు ముచ్చెలను వేడి నీటిలో గాని, తేమతో మిళితమైన వేడి గాలిలో కాని శుద్ధి చేయాలి. తెగులును వ్యాప్తి చేసే కీటకాలను అరికట్టడానికి లీటరు నీటికి 1.7 మి. లీ. డైమిధోయేట్ ను కలిపి పిచికారి చేయాలి. పొలంలో కలుపు లేకుండా చూడాలి. తెగుళ్ళను తట్టుకునే రకాలను సాగు చేయాలి.
4. వడలు తెగులు తెగులు సోకిన మొక్కల ఆకులు నీటి ఎద్దడికి గురైన మొక్కల ఆకుల వలే వడలి పోతాయి. చెఱకు గడలో గుల్ల ఏర్పడటం వలన బరువు తగ్గుతుంది. నీటి ఎద్దడి నీటి ముంపుకు లోనైన తోటల్లో ఇది హెచ్చుగా వస్తుంది. జూన్-జూలై నేలల్లో నాటిన తోటలు ఎక్కువగా లోంగిపోతాయి. వేసవిలో దగ్గర దగ్గరగా నీరు కట్టాలి. నాటుకొనే ముందు ట్రైకోడెర్మా విరిడితో శుద్ధి చేసుకొని నాటుకోవాలి
5. అనాసకుళ్ళు తెగులు ముచ్చెలు నాటడం ఆలస్యం అయినపుడు విత్తనపు ముచ్చెలు మొలకెత్తక కుళ్ళి పోతాయి. ఈ ముచ్చెల నుండి పండిన అనాస పండు వాసన వస్తుంది. నల్ల రేగడి నేలల్లో మురుగు సౌకార్యం లేనపుడు దీని ఉధృతి పెరుగుతుంది. ముచ్చెలను 0.5% కార్బండాజిమ్(150 గ్రా. మందు 300 లీ. నీటిలో) మందు ద్రావణంలో నాటడానికి 15 ని. ముందు అరికట్టవచ్చును.
6. మొవ్వుకుళ్ళు తెగులు తెగులు సోకిన మొక్కల్లో మొదలు భాగం పాక్షికంగా తెల్లగా అవుతుంది. మొవ్వు ఆకులు చిన్నగా ఉండి సరిగా విడివడవు. ఒక్కొక్కప్పుడు చుట్టుకొని పోతాయి. ఆకుల మొదళ్ళలో పాలిపోయిన భాగంలో ఎర్రటి చారలు ఏర్పడి చార వెంబడి ఆకు చిట్లి పోతుంది. మొవ్వు కుళ్ళి పొతే మొక్క ఎదుగుదల లేక చనిపోతుంది. వర్షాలు తొందరగా మే-జూన్ నేలల్లో ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినపుడు మువ్వు కుళ్ళు తెగులు ఉధృతంగా వస్తుంది. మొవ్వు కుళ్ళు తెగులు గాలి, వర్షపు జల్లుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కార్బండాజిమ్ ఒక గ్రా. లేదా మాంకోజేబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి తెగులు ఉధృతిని బట్టి 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి నివారించుకోవచ్చు.
7. ఆకు మాడు తెగులు ఈ తెగులు ఒక రకమైన బాక్టీరియా వల్ల వస్తుంది. ఆకుల మీద సన్నటి, పొడగాటి తెల్లటి చారలు ఏర్పడి, ఆ చారల వెంబడి ఆకుల కోన నుండి క్రిందకు. వంగడం జరుగు తుంది. తెగులు సోకిన గడలలోని కళ్ళు కింద కానుపుల నుండి మొదలై క్రమేపి పై కానుపుల వైపుగా మొలకెత్తుతాయి. ఈ మొలకలు పాలిపోయి క్రమేపి ఎండిపోతాయి. నీటి ఎద్దడి పరిస్దితులు దీని ఉధృతికి అనుకూలం. చెఱకు నరికే కత్తులను అడపాదడపా 5 % ఫార్మలిడ్డహైడ్ ద్రావణంలో ముంచి శుద్ధి చేయడం, విత్తనపు ముచ్చెలను 52 o సెల్సియస్ వద్ద కార్బండాజిమ్ 0.5% మందు కలిపి 30 ని. శుద్ధి చేయడం ద్వారా తెగులును నివారించవచ్చు.
8. త్రుప్పు తెగులు ఆకు అడుగు భాగంలో సన్నగా పసుపు లేదా నారింజ రంగులో ఉండే బొబ్బలు ఏర్పడుతాయి. దుబ్బులో ఉండే అన్ని మొక్కలకు తెగులు సోకి సుమారు 70% విస్తీర్ణానికి వ్యాప్తి చెందు తుంది. తెగులు ఉధృతమైనపుడు ఆకు తొడిమల మీద కూడా త్రుప్పు తెగులు బొబ్బలు ఏర్పడి తెగులు సోకిన మొక్కలు దూరం నుంచి చూస్తే ముదురు గోధుమ రంగులో కన్పిస్తాయి. ఈ తెగులు పంట తొలిదశ నుండి తోట నరికే వరకు ఆశిస్తుంది. నత్రజని ఎరువు అధిక మోతాదులో వాడితే దీని ఉధృతి పెరుగుతుంది. అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం మరియు గాలిలో హెచ్చు తేమ త్రుప్పు తెగులు వృద్ది చెందడానికి వ్యాప్తికి బాగా దోహదపడుతుంది. మాంకోజేబ్ 3 గ్రా. లేదా ట్రైడిమార్ఫ్ ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించుకోవచ్చు.
9. పసుపు ఆకు తెగులు ఈ తెగులు వైరస్ వలన సోకుతుంది. తెగులు సోకిన మొక్కల్లో 4వ ఆకు నుండి క్రింది వైపుకు ఆకులు పసుపుపచ్చ రంగుకు మారుతాయి. చివరన ఉన్న విచ్చుకొని ఆకులు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. తర్వాత క్రమేపి ఆకుల చివర నుండి క్రిందికి ఎండిపోయి చుట్టుకొని ఉంటాయి. ఆకులలోని మధ్య ఈనె మాత్రం పసుపు పచ్చగా మారి తర్వాత ఈనెకు రెండు వైపులా పసుపు రంగు విస్తరిస్తుంది. వాతావరణం మబ్బుగా ఉండి, 22 o -29 o సెల్సియస్ మరియు 70-80% గాలిలో తేమ ఉన్నపుడు ఈ పురుగు బాగా అభివృద్ధి చెందుతుంది. పెనుబంక పురుగు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడుతుంది. దీని నివారణకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చివేయాలి. తెగులు సోకిన మొక్క తోటల నుండి విత్తనాన్ని సేకరించరాదు. తెగులును వ్యాప్తి చేసే పెనుబంక నివారణకు డైమిధోయేట్ 1.7 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

చెఱకు చెత్త పరుచుట, మొక్క మొదళ్ళకు మట్టిని ఎగదోయుట మరియు నిలగట్టుట

మొక్క తోటలో చెఱకు నాటిన 3వ రోజున చెఱకు చెత్తను నేలపై పలుచగా (1.25 ట/ఎ) పరవాలి. నీటి ఎద్దడి పరిస్దితుల్లో చెఱకు నాటిన 3వ రోజున ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెఱకు చెత్త కప్పడం ద్వారా భూమిలోని తేమ త్వరగా కోలోకుండా నివారించడంతో పాటు కలుపు, పీక పురుగుల ఉధృతి తగ్గించవచ్చు. వర్షాకాలంలో కాలువలు ఎగద్రోసే సమయంలో 2 కిలోలు ఎకరానికి క్రుళ్ళబెట్టె శిలీంద్రం, 8 కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్ లను వేసి మట్టితో కప్పితే మంచి సేంద్రియం ఎరువుగా మారుతుంది.

తుఫాను గాలుల వలన తోటలు పడిపోయినపుడు చెఱకు దిగుబడి, రసనాణ్యత తగ్గుతుంది. తోట వయస్సు 4 నెలలు ఉన్నప్పుడు (జూన్ – జూలై మాసాల్లో) మొక్కల వరసల మొదళ్ళకు ఎత్తుగా మట్టిని ఎగద్రోయాలి. తోట 6 నెలలు వయసు ఉన్నపుడు గడల సంఖ్య స్దిరపడిన తర్వాత మొక్కల మొదళ్ళకు 2వ సారి మట్టిని ఎగద్రోయాలి.

పంట పెరుగుదలను బట్టి 2-3 సార్లు జడచుట్టే పధ్ధతి ద్వారా చెఱకును నిలగాట్టాలి.

అంతర పంటల సాగు

చెఱకును దూరపు చాళ్ళలో సాగు చేసే సందర్బంలో అంతర పంటలుగా పప్పుధాన్యపు పంటలు, కూరగాయలు టమాట, ఉల్లి, బంగాళదుంప, తీగజాతి కూరగాయలు పుచ్చ, చిక్కుడు, తీగ కూరగాయలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. చెఱకు నాటిన రోజునే బోదెలను చదును చేసి అంతర పంటను బోదెల మీద వరుసల్లో నాటుకోవాలి. పుచ్చ మరియు తీగ జాతి కూరగాయలను ఒక వరుసలో నాటుకోవాలి. జంట చాళ్ళ పద్ధతిలో చెఱకును నాటినపుడు అంతర పంటల సాగు మరింత అనుకూలంగా ఉంటుంది. అంతర పంటల సాగు వల్ల పరాన్నభుక్కల సంఖ్య పెరిగి పీక పురుగు ఉదృతి తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. పచ్చిరోట్టాను ఇచ్చే జీలుగ, జనుము విత్తనాలను పెడల మీద చల్లి మొగ్గ దశలో పీకి చాళ్ళలో చెఱకు మొక్కల మొదళ్ళలో వేసి మట్టి కప్పితే పంటకు సేంద్రియ ఎరువు రూపంలో అధిక పోషకాలు అందుతాయి.

తోట నరుకుట

గడలలో సుక్రోజ్ శాతాన్ని చేతి రిఫ్రాక్టోమీటర్ అనే పరికరం ద్వారా అంచనా వేయవచ్చు. గడలలో 85% రసశుద్దత, 18% సుక్రోజ్ ఉన్నపుడు పంట పక్వానికి వచ్చినట్లుగా నిర్ధారించి తోటలను భుమట్టానికి నరకాలి. పురుగులు, తెగుళ్ళు, నీటి ముంపు మరియు నీటి ఎద్దడికి గురైన తోటలను ముందుగ కొట్టాలి. చెఱకు తోటలు నరకడంలో మోడెం తోటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నరికిన చెఱకు నుండి ఎండు ఆకులు, ఆకు తొడిమలు తొలగించి శుభ్రమైన చెఱకునే గానుగాడుటకు సరఫరా చేయాలి. తోటలు నరికిన 24 గం. లోపు చెఱకు బెల్లం తయారీకి గాని, పంచదార కర్మాగారానికి గానీ పంపాలి. నరికిన 24 గంటలలో గానుగాడుకుంటే అధిక రసనాణ్యత కలిగి ఉండి పంచదార, బెల్లం రికవరీ అధికంగా ఉంటుంది.

మోడెం తోటల సాగు

మొక్క తోటల కన్నా మేడెం తోటలే త్వరగా పక్వానికి వస్తాయి. మోడెం సాగులో మొక్క తోటల కంటే తక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాకుండా మెడెం తోటలు మొదటి రోజుల్లో నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. పుతకు రాని, తెగుళ్ళను తట్టుకునే రకాల నుంచి మెడెం తోటలు సాగు చేయవచ్చు. కో 6907, కో 8014, 83 ఆర్ 23, కో 86032, 97 ఆర్ 129 రకాల నుంచి మెడెం తోటలను సాగు చేయుట లాభదయకము. లోతైన కాల్వలలో నాటిన మొక్క తోటల నుండి పెంచిన మెడెం తోటలు అధిక దిగుబడులు ఎస్తాయి. పొలంలో పదును తక్కువగా ఉన్నప్పుడు, దుబ్బులు కదలకుండా పదునైన పారలతో వరుసలలోని మోళ్లను చేక్కినప్పుడు భూమి లోపలి కణుపుల నుండి పిలకలు వస్తాయి. మెడెం చేసిన వెంటనే మెట్రిబుజిన్ పొడి మందును ఎకరాకు 600 గ్రా. 450 లీ. నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్దవంతంగా నివారించవచ్చు. మెడం తోటల్లో ఖాళీలు ఉన్నపుడు 6 వారాల వయస్సు గల పాలిధీన్ సంచులలో పెంచిన అదే రకపు మొలకలతో ఖాళీలను నింపాలి.

మొక్క తోటకు ఎకరాకు సిఫారసు చేసిన నత్రజని కన్నా 45 కిలోల అందనంగా 2 దఫాలుగా మోళ్ళు చెక్కిన వెంటనే ఒకసారి మరియు 45 రోజులకు మరోసారి వేయాలి. ఇనుప ధాతు లోప నివారణకు లీటరు నీటికి 10 గ్రా. అన్నభేది మరియు 2 గ్రా. నిమ్మ ఉప్పు కలిపిన ద్రావణాన్ని ఎకరాకు 200 లీ. చొప్పున పైరు 45-60 రోజుల వయస్సులో వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. మెడెం చేసిన వెంటనే వరుసల మధ్య ఎకరాకు 1.25 టన్నుల చెఱకు చెత్తను కప్పితే కలుపు మరియు పీక పురుగు వ్యాప్తిని తగ్గించవచ్చు. డెస్క్ ఆఫ్ బ్యారర్ అను పల్లెపు నాగలిని మెడెం వరుసల మధ్య నడిపించినపుడు, వరుసల్లోని మట్టి రెండు వైపులకు సమానంగా విసరడం వల్ల చెఱకు చెత్త సులువుగా కుళ్ళి సేంద్రీయ ఎరువుగా మారుతుంది. అంతే కాకుండా మొదళ్ళ వద్దనున్న పాత వేర్లు తెగి కొత్త వేర్లు వచ్చి నీటిని, పోషకాలను సమర్దవంతంగా గ్రహిస్తాయి. ఎక్కువ పంచదార లేదా బెల్లం పొందడానికి మోడెం తోటలను 9-10 నెలలు వయస్సు పైబదినపుడు మాత్రమే నరకాలి.

చౌడు భూములలో చెఱకు సాగు

చౌడు భూములలో చెఱకు సాగు చేయడానికి కో 7219, కో టి 8201, 97 ఆర్ 129, 83 ఎ 30 రకాలను ఎంచుకోవాలి. ఎకరాకు 18,000 ముదురు మూడుకళ్ళ ముచ్చెలను పైపైన నాటాలి. పాల చౌడు తీసి వేయడానికి పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసి మంచి నీటితో నిలగట్టి, తర్వత నీటిని తీసి వేయాలి. పచ్చి రొట్ట ఎరువులు లేదా పచ్చి ఆకు ఎరువులను నేలకు అందివ్వడం ద్వారా నేలలో సేంద్రియ పదార్ధం పెరిగి లవణత తగ్గుతుంది.

బెల్లం తయారీలో మెళకువలు

బాగా పక్వానికి వచ్చిన చెఱకు బెల్లం తయారికి ఉపయోగించాలి. చెఱకును భుమట్టానికి నరికి, వెంటనే గానుగాడించి బెల్లం తయారు చేసుకోవాలి. చచ్చిన, ఎలుకలు కొట్టిన, గాలి పెడలతో వచ్చిన పిలకల వంటి చెఱకు గడలను ఏరివేసి మంచి చెఱకు ఉపయోగించి బెల్లం చేయాలి. అనివార్య పరిస్దితుల్లో వెంటనే బెల్లం చేయలేని పక్షంలో చెఱకు మోపులను నీడలో గుట్టలుగా పేర్చి చెఱకు చెత్త కప్పి పలుచగా నీరు చల్లితే చెఱకు తూకం, రాసనాణ్యత తరుగుదలకు తక్కువ అవకాశం ఉంటుంది. తక్కువ శక్తితో ఎక్కువ రసపు దిగుబడికి గానుగ సామర్ధ్యం పెంపొందించేందుకు నిలువు క్రష్ర్లు వాడి ఒక టన్ను చెఱకు నుండి 650 కిలోల రసం, 120 కిలోల బెల్లపు దిగుబడి పొందవచ్చు. ఫలితంగా ఒక టన్ను చెఱకు నుండి 10-20 కిలోల బెల్లం అదనంగా పొందవచ్చు. రోలర్లపై ఉండే నొక్కులు పిప్పితో నిండి ఉండకుండా శుభ్రపరచాలి. ఒకే సమయంలో 2-3 చెఱకు గడలు మాత్రమే గానుగాడుకోవాలి. గోనుగాడిన రసాన్ని పులిసిపోకుండా, త్వరగా పెనములో పోసి మరగబెట్టాలి. బెల్లం తయారీలో ఉపయోగించు పరికరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. చెఱకును గానుగాడే సమయంలో విద్యుత్ అంతరాయం వలన రసం పులియకుండా ఉండటానికి 107 o సెల్సియస్ వరకు రసాన్ని మరిగించి తర్వాత నిల్వ ఉంచి, బెల్లం చేస్తే నాణ్యత తరుగుదల తక్కువగా ఉంటుంది.

పెనాలు

బెల్లం తయారీకి ఉపయోగించు పెనాలు వెడల్పుగా ఉండి (240-270 సెం.మీ.) లోతు తక్కువగా (45 సెం.మీ.) ఉండాలి. పెనం గోడలు 16 గేజి ఇనుప రేకులతోనూ, అడుగున 18 గేజి కళాయి రేకుతోను చేయడం మంచిది.

రసాన్ని శుభ్రపరచడం

రసాన్ని శుభ్రపరచడానికి ఆమ్ల స్దితిలో ఉదజని సూచిక 5.2 ఉన్న రసానికి సున్నం కలిపి, 5.8 వరకు తీసుకోని రావాలి. ఈ విధంగా చేయడానికి ప్రత్యేక ఉదజని సూచిక కాగితాలు ఉపయోగించాలి. సోడా కలిపితే బెల్లం మొత్తబడి నాణ్యత దెబ్బతింటుంది. పక్వానికి వచ్చిన చెఱకు రసానికి ఉదజని సూచిక 5.8 వచ్చే వరకు, పక్వానికి రాని చెఱకు అయితే 6.4 వచ్చే వరకు, రసం విరిగిన చెఱకుకు అయితే 6.6 వచ్చే వరకు సున్నం కలిపి మంచి బెల్లం తయారు చేయవచ్చు. బెండ మొక్కల గుజ్జు వంటి వృక్ష సంబంధమైన పదార్దాలను సున్నంతో కలిపి నాణ్యమైన బెల్లం తయారు చేయవచ్చు.

బెల్లం తయారీలో హైడ్రోసు వాడకుండుట

హైడ్రోసులో గంధకం ఉంటుంది. ఒక క్వింటా బెల్లంలో 7 గ్రా.ల కంటే ఎక్కువ సల్ఫర్ డై ఆక్సైడ్ ఉంటె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. 400 లీ. రసానికి 100 గ్రా. హైడ్రోసు వేసి తయారు చేసిన బెల్లంలో ఒక క్వింటాలుకు 7-12 గ్రా. సల్ఫర్ డై ఆక్సైడ్ ఉంటుంది. రైతులు ఎక్కువ పరిమాణంలో (1-2 కిలోలు) హైడ్రోసు వేసి తెల్లని బెల్లం చేస్తే సల్ఫర్ డై ఆక్సైడ్ పరిమాణం ఉండవలసిన దాని కన్నా 2-3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. హైడ్రోసు వేసిన బెల్లం రుచికి వెగటుగా ఉండి రంగు 2-3 వారాలకు మించి ఉండక, త్వరగా మెత్తబడి, ఎక్కువ కాలం నిల్వ ఉండదు. వినియోగదారులు బెల్లం రంగుకు ప్రాధాన్యం ఇవ్వకుండా నాణ్యతను గమనించాలి. హైడ్రోసు వాడిన బెల్లాన్ని ప్రోత్సహించాకూడదు.

బెల్లం తోడుకొని పరిస్దితుల్లో పంచదార లేదా బెల్లం పొడి కలపడం

పక్వతకు రాని చెఱకు లేదా ఆలస్యంగా నరికిన చెఱకు లేదా నీటి ఎద్దడికి లోనైనా చెఱకు లేదా పొలుసు పురుగు సోకిన చెఱకు గడల నుండి చేసిన బెల్లం తోడుకునట్లైతే పాకాన్ని దించి, చిక్కబడిన తర్వాత 5-10 కోలోల బెల్లపు పొడి లేదా పంచదార కలిపితే తోడుకొని అచ్చులు పోసుకోవడానికి వీలుగా ఉండి, బెల్లం నాణ్యత పెరుగుతుంది.

బెల్లం వండటం

రసం మరిగేటపుడు ఎప్పటికప్పుడు తెట్టును పూర్తిగా తీసివేయాలి. తెట్టును తీసివేసిన తర్వాత రసాన్ని మరిగించాలి. బురద పొంగు సమయంలో రసం పొంగుతుందనుకుంటే నువ్వుల నునెను చిలకరించాలి. పాకం ఉష్ణోగ్రత 118 o సెల్సియస్ వచ్చినపుడు పెనం దించాలి. పెనం దించిన తరువాత చంద్ర వంక బల్లతో బాగా కలిపి కొంత చల్లారిన తర్వాత 5 ని. కలుపకుండా ఉంచితే బెల్లం మంచి రావ్వకట్టు కలిగి ఉంటుంది. బెల్లం చల్లబడి గట్టిబడటం ప్రారంభం కాగనే వివిధ రకాల అచ్చులలో వేసుకోవచ్చు.

వాతావరణం మబ్బుగా ఉండి 19-85 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మరియు 80-90 శాతం గాలిలో తేమ ఉన్నప్పడు తెల్ల పేను (ఊలి ఎఫిడ్) అభివృద్ధి చెందుతుంది. వీటి నివారణకు పంటకు సిఫార్పు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగులబెట్టాలి. లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 1.7 మి.లీ. లీటరు లేదా ఎసిఫేట్ 1 గ్రా.ల మోతాదులో నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు.

పంట పెరుగుదలను బట్టి మొక్కల మొదళ్ళకు మట్టిని ఎగదోయాలి. జడచుట్టే పద్ధతి ద్వారా చెఱకును నిలపెట్టాలి.

నవంబర్–డిసెంబర్ మాసాల్లో చెరకును నాటుటకు అక్టోబరు నుంచే నేలను తయారు చేసుకోవాలి. ఇందుకు గాను ముందుగా నేలను లోతు దుక్కి చేసుకోవాలి. ఆ తర్వాత పశువుల లేదా కంపోస్టు ఎరువులను ఎకరానికి 10 టన్నుల చొప్పన వేసి చెరకును నాటుటకు 4 నుంచి 6 వారాల ముందు పళ్ళెపు దంతితో భూమిలో కలియదున్నాలి. బరువు నేలల్లో 5-6 టన్నులు వేసుకోవాలి. ఫిల్టరు మడ్డి దొరుకు ప్రాంతాల్లో ఎకరానికి 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియదున్నాలి. ఒక టన్ను ఫిల్టరు మడ్డి వాడడం వల్ల 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం మరియు 2 కిలోల పొటాష్ను పంటకు అందించవచ్చు. ఈ ఎరువులు లభ్యం కాని ప్రాంతాల్లో పచ్చి రొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి వాటిని దంతితో కలియదున్నితే పంట ఎరువు త్వరగా చివికి సారవంతమైన సేంద్రియ ఎరువుగా మారుతుంది.

ఈ సమయంలో నాటుకునే రైతులు నీటి ఎద్దడిని తట్టుకునే రకాలైన 83 ఆర్ 23, 85 ఆర్ 186, కో 86032, కో 99004 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. వనరులు తక్కువగా ఉండే తేలిక నేలల్లో స్వల్పకాలిక రకాలైనటువంటి కో ”8014, 83 ఎ 30, 87 ఎ 298, 83 ఆర్ 23, 2003 వి 46 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాలలో మధ్య కాలిక రకాలైనటువంటి కో 86032, 85 ఆర్ 186, 97 ఆర్ 129, కో 7219, 97.

ఆర్ 401 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎటువంటి చీడపీడలు, తెగుళ్ళు ఆశించనటువంటి ఆరోగ్యకరమైన, నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి.

చెరకు తోటల కోత కూడా ఈ మాసం నుండి మొదలవుతుంది. పక్వానికి వచ్చిన చెరకును గుర్తించడానికి కొన్ని మెలకువలు పాటించాలి.

  • పక్వానికి వచ్చిన తోటల ఆకులు ఆకుపచ్చ రంగు పోయి పసుపు రంగులోకి మారుతాయి.
  • ప్రోటలో కొత్తగా మొవ్వటాకులు రావటం అగిపోతాయి.
  • చిట్టచివరి నాలుగైదు చెరకు కణుపులు దగ్గర దగ్గరగా ఏర్పడి, వాటి నుండి పుట్టు ఆకులు ఇంచు మించు ఒకే చోట కుచ్చు వలే బయలుదేరును.
  • కొన్ని రకాలలో పూత పూయుట కనబడుతుంటుంది.

మన రాష్ట్రంలో సాగు చేసే స్వల్పకాలిక చెరుకు రకాలు నాటిన ఎనిమిది నెలలలో పక్వానికి వస్తాయి. ఇతర ప్రాంతాల కంటే శీతాకాలంలో రాత్రి పూట చలి ఎక్కువగా ఉండటం వలన గడలలో చక్కెర కూడికకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భంలో చెరకు పక్వత వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కనిష్ణ, గరిష్ట ఉష్ణోగ్రతలలో వ్యత్యాసము ఎక్కువగా ఉండాలి. గాలిలో తేమ తక్కువగా ఉండాలి. చెరకు నరకడానికి ముందు వరాలు లేకుండా ఉండాలి.

చీడపీడలు ఆశించిన తోటలను వీలైనంత త్వరగా ఫ్యాక్టరీకి తోలాలి లేదా బెల్లం తయారీకి వాడాలి. చెరుకును నరికేటప్పడు భూమట్టానికి కొంచెం క్రిందగానే నరకాలి. మొదలు కణుపులలో పంచదార పాలు ఎక్కువగా వుండటం వలన పంచదార, బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికినప్పడు కారి చేసిన తోటలోని వేళ్ళ లోతుగా చొచ్చుకొని పోయి, తోట బలంగా పెరిగి వరా కాలంలో వచ్చే ఈదురుగాలులు మరియు వరాలకు తట్టుకుని తోట నిలకడగా ఉండి, గడలు బాగా ఎదిగి మంచి దిగుబడినిస్తాయి.

తెలంగాణ ప్రాంతంలోని చెఱకు మిల్లులు అన్ని కూడా నవంబరు మాసంలో ప్రారంభిస్తారు. సాధారణంగా ఆత్యధిక చెక్కర కుడిక గల చెఱకు రకాలను మాత్రమే ప్రారంభపు చెఱకుగా గానుగాడుటకు అనుమతిస్తారు. ఈ పక్వదశలో చెఱకు పంటకు చిడపిడలు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యంగా రసం పిల్చు పురుగులు తెల్ల పేను (ఊలీ ఎఫేడ్), దూదేకుల పురుగు (పైరిల్లా), పిండి నల్లి, పోలును పురుగు మరియు పసుపు నల్లి ఉధృతి తగ్గాలంటే తప్పనిసరిగా పై 8 ఆకులు వదిలి, పురుగులు ఆశించిన ఆకులను రెలచి వేయడం లేక జడ చుట్టూకోవడం చేయుట వలన ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది. అంతేకాకుండా పిండినల్లి, పొలుసు పురుగులు ఎండకు, గాలికి బహిర్గతం కావడం వల్ల వాటి ఉధృతి కొంత వరకు తగ్గుతుంది. తోటకు జడ చుట్టు వేయడం వలన గాలి, వెలుతురూ తగిలి రసం పిల్చు పురుగులు ఆశించే స్ధాయి తగ్గడమే కాకుండా, పురుగు మందుల పిచికారి చేపట్టడం సులభతరం అవుతుంది. పంట ఎదుగుదలను బట్టి చెఱకు తోటలు పడిపోకుండా అవసరం మేరకు రెండవసారి జడచుట్లు వేసుకోవాలి.

పొలుసు పురుగు కణుపు ఏర్పడినప్పది నుంచి చెఱకు నరికే వరకు పైరుసు ఆశిస్తుంది. నీటి ఎద్దడి పరిస్ధితుల్లో ఎక్కువ నష్టం కలిగిస్తుంది. పొలుసు పురుగు ఆశించని తోటల నుంచి విత్తనపు చెఱకును సేకరించాలి. పొలుసు పురుగు వ్యాప్తి అరికట్టడానికి ఆకులు రెలచి (మొవ్వులో కనీసం 8 ఆకులు ఉంచి) డైమిధోయేట్ 1.7 మి.లీ లేక మలధియాన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెల్లపేను (ఊలి ఎఫిడ్) ఈ పురుగు పిలక దశ నుండి చెఱకు నరికే వరకు పైరును ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు, పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడాతాయి. మొదటి అంచులు, తర్వత మొత్తం ఆకులు క్రమేపి ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జన ఆకులు క్రమేపి ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జన తియ్యని జిగట పదార్ధం లాగా ఉండి కిందున్న ఆకుల పైభాగాన పడి, దాని మీద సుటిమోల్ట్ అనే నల్లని శిలింధ్రం పెరిగి ఆకు మసిబారుతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెఱకు దిగుబడి 26శాతం పంచదార దిగుబడులు 24 శాతం తగ్గిపోతాయి. వాతావరణం ముబ్బుగా ఉండి 19-35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మరియు 80-90 శాతం గాలిలో తేమ ఉన్నప్పుడు పురుగు బాగా అభివృద్ధి చెందుతుంది. గాలి ద్వారా 1.5-2.0 కిలో మీటర్ల దూరం వరకు ఈ పరుగులు వ్యాప్తి చెందగలవు. విత్తనాన్ని ఆరోగ్యవంతమైన తోటల నుండి సేకరించాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగులబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెఱకు ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. లీటరు నీటికి మలాధియాన్ 1.7 మి.లీ లేదా ఎసిఫేట్ 1 గ్రా. మోతాదులో కలిపి పిచికారి చేయాలి.

చెఱకు సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత వ్యవసాయ పరిశోధన స్థానం-బసంతపూర్, ఫోన్ నెం. 9849535756

ఆధారం:  వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/10/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate