অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నీతి కథలు - I V

నీతి కథలు - I V

అమూల్యమైన బహుమతి

ఒక ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం 200 మంది వరకు ఉన్నారు. ఆయన అందరిని ఇలా అడిగాడు - "ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి?" అంతే చేతులు ఒక్కటొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులెత్తారు.

"నేను మీలో ఒకరికి ఈ వెయ్యి రూపాయల నోటు ఇస్తాను. కాని దానికి ముందు నేనొకటి చేస్తాను" అంటూ ఆ నోటును చేతితో నలపటం మొదలెట్టాడు. రెండు నిమిషాల తరువాత మళ్ళీ అడిగాడు. ఇప్పుడు ఈ నోటు ఎవరిక్కావాలి?". అయినా చేతులు లేపడం ఆగలేదు.

"సరే!" అంటూ ఆయన తన చేతిలోని ముడతలు పడి నలిగిన వెయ్యిరూపాయల నోటును కింద పడేసి బూటు కాలితో నలపడం మొదలెట్టాడు. కొద్ది సేపటి తరువాత దాన్ని చేతిలోకి తీసుకుని "ఇప్పటికీ ఇది ఎవరిక్కావాలి?" అని అడిగాడు. నలిగిపోయి, మాసిపోయినా ఆ నోటు కోసం చేతులు లేపడం ఆపలేదు సభికులు.

"ప్రియ మిత్రులారా? మనం ఇప్పటి వరకు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాం. డబ్బుకు ఎంత చిరుగులు పడినా, నలుగులు పడినా, దాన్ని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అది దాని విలువను ఎంత మాత్రం కోల్పోలేదు కాబట్టి ఈ నోటు ఇప్పటికీ వెయ్యిరూపాయల నోటే. ఈ నోటులాగే మన జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ఎందుకూ పనికిరాని వారమని,

మన బ్రతుకులు వ్యర్ధమని అనుకుంటాం.కాని ఏం జరిగినా, ఏం జరగబోతున్నా మన విలువను మాత్రం కోల్పోం. మనల్ని ప్రేమించే వారికి మనం ఎల్లప్పుడూ అమూల్యమైన బహుమతులమే" అని వివరించాడు ఉపన్యాసకుడు.

మరుక్షణం ఆ హాలు చప్పట్లతో మారుమోగి పోయింది.

ఆత్రపడ్డ నక్క

ఓ అడవిలో రెండు నక్కలు ఎంతో స్నేహంగా కలసి మెలసి తిరిగేవి. మోసానికి, జిత్తులకు, ఆశకు నక్కలు పెట్టింది పేరు. ఆ నక్కలు కలసి మెలసి తిరుగుతున్నాయి గాని, హృదయంలో ఒకదాన్ని చూస్తే ఒకదానికి జుగుప్స. ఒక రోజు అవి రెండూ కలిసి ఆహారం కోసం ఆ అడవిలో వేటకు బయలుదేరాయి. అవి చెట్లూ, పుట్టలూ, గుట్టలూ, అంతటా తిరిగి తిరిగి అలసిపోయాయి. కాని, తినడానికి ఏ జంతు మాంసం దొరకనందున ఓ పెద్ద చెట్టు కిందకు చేరి విచారంతో పడుకున్నాయి. వాటికి బాగా ఆకలి వేసి నీరసంగా కళ్లు మూసుకుని కునుకు తీశాయి. ఆ రెండు నక్కల్లో ఒక నక్కకు ఆ శబ్ధం వినిపించింది. ఏమిటో అనుకొని, తన పక్కనే ఉన్న నక్క వైపు చూచింది. ఆ నక్క బాగా నిద్రపోతోందని గ్రహించి గబుక్కిన లేచి ఆ చెట్టు కిందపడ్డ దాని దగ్గరకి పరిగెత్తింది.

అదృష్టం. ఏదో కాని ఒక మాంసపు ఎముకను కొమ్మ మీదికి తెచ్చుకొని తింటున్నది. పొరపాటున జారి కింద పడిపోయిందని నక్క గ్రహించింది. ఎముక చుట్టూ ఎర్రని మాంసము చూడగానే పోయేప్రాణం లేచి వచ్చింది. ఆ ఎంత అదృషం ఆకలికి మాంసమున్న ఎముక దొరికిందని ఆత్రంగా నోటితో పట్టుకుంది. దూరంగా వున్న మరోనక్క లేచి పరుగు పరుగున తన దగ్గరకి రావడం చూసింది. అది వస్తే నన్నిక ఈ ఎముకను కొరక నివ్వదని గబుక్కున ఆ ఎముకను మింగింది. మింగేటప్పుడు ఆ ఎముక నక్కనోటికి అడ్డంగా పడింది. ఎముక అటు నోట్లోకి ఇటు బయటికి రాకుండా ఇరుక్కుపోవడం వల్ల నక్క నేలమీద పడి గిజగిజ తన్నుకోవడం రెండో నక్క చూసింది. రెండో నక్కకు ఏంచేయాలో తోచలేదు. ఎముక మింగుడు పడక ఊపిరి ఆడక నక్క ప్రాణం పోయింది. తినేటప్పుడు ఆత్రం పడి కంగారుగా మింగేయడం వల్ల నక్క ప్రాణాలే పోగొట్టుకుంది.

కనుక బాలలూ, ఎప్పుడు ఏదైనా తినేముందు ఆత్రపడకూడదు. నిర్భయంగా, శాంతంగా తినాలి. ఆత్రం పడనే కూడదు.

ఐకమత్యమే బలం

పూర్వకాలం ఉజ్జయినీ నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా అతనికి ఉన్న దిగులు ఒక్కటే. అది తన పిల్లల గురించే. అతని నలుగురు పిల్లలు పుట్టటంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అబ్బలేదు. ఇతరులు అంటే నిర్లక్ష్యం. లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు. వారికి వయస్సు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడంలేదు. కొంత కాలానికి షావుకారికి జబ్బు చేసింది. చనిపోతానేమోనని బెంగపట్టుకుంది.తను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారా అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది. బాగా ఆలోచించగా అతని ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.

నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలు తెప్పించాడు. ఒక్కొక్కడిని ఒక్కొక్క కట్టె తీసుకొని విరవమన్నాడు. నలుగురు తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచేసారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరవమన్నాడు. ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు. తరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు షావుకారు. నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు.నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు. చూశారా మీరు కలిసి కట్టుగా ఒక పని చెయ్యగలిగారు. ఎవరికి వారు చేయలేకపోయారు. "ఐకమత్యమేబలం" కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి అన్నాడు తండ్రి. నలుగురూ తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించి అలాగేనని తండ్రికి ప్రమాణం చేశారు.

ఖరీదైన కోటు

ఒక దొంగ... విలాసాలకు సరిపడేంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో దొరికినంత దోచుకుందామని ఒక సత్రంలో తలదాచుకున్నాడు. రెండు రోజులు గడిచినా తన పాచిక పారక పోవడంతో నిరాశచెంది, ఏదో ఆలోచిస్తూ గది బయటకొచ్చి నిలబడ్డాడు. ఎంతో ఖరీదైన కొత్త కోటు వేసుకున్న సత్రం యజమాని తన గది ముందు కుర్చీలో కూర్చొని ఉండటం గమనించిన దొంగ మెల్లగా వెళ్లి అతనితో మాటలు కలిపాడు.

వారి ముచ్చట్లు మంచి ఊపుమీదుండగా దొంగ అత్యంత భయంకరంగా, అచ్చం తోడేలులా ఆవలించాడు. అదివిన్న యజమానికి ఒళ్లు జలదరించి "ఎందుకింత భయంకరంగా ఆవలిస్తావు?" అని అడిగాడు. "అది ఒక పెద్ద కధ. మీరు నమ్మినా, నమ్మలేకపోయినా చెప్పడం నా కర్తవ్యం. నేను ఇలా ఎప్పుడైతే మూడోసారి ఆవలిస్తానో, అప్పుడు నేను తోడేలులా మారిపోయి మనుషుల మీద దాడి చేస్తాను. ఇది గతజన్మలో నేను చేసిన పాపాల ఫలితం. అలా జరగకుండా ఉండాలంటే ఆ సమయంలో ఎవరైనా నా దుస్తులను గట్టిగా పట్టుకోవాలి. లేదంటే నేను నా దుస్తులన్నీ చింపేసి తోడేలులా మారిపోతాను" అని నమ్మబలికాడు దొంగ. ఇదంతా చెబుతూనే రెండోసారి కూడా ఆవలించాడు.

అది విన్న సత్రం యజమాని అక్కడి నుండి లేచి పారిపోవడానికి ప్రయత్నించగా, "అయ్యా! ఎక్కడికెళ్తున్నారు. నన్ను పట్టుకోండి. లేదంటే నేను నా దుస్తులు చింపుకుని తోడేలులా మారిపోతాను." అంటు అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. దొంగ చేతిలో నుంచి తప్పించుకోవాలని చుశాడు సత్రం యజమాని. సాధ్యం కాకపోవడంతో కోటును వదిలించుకుని తప్పించుకుని కాళ్లకు బుద్ధిచెప్పాడు. కోటు దొంగ చేతిలోనే ఉండిపోయింది. దొంగ తన పంటపండిందనుకుని కోటుతో ఉడాయించాడు.

మర్యాదరామన్న కథలు

సుబ్బన్న, ముత్యాలమ్మ దంపతులకు చాలా ఏళ్ళుగా సంతానం లేక పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతూ భద్రాద్రి రాముని దర్శనం చేసుకున్నారు. శ్రీరాముని వరప్రసాదంలా చిట్టడవిలో ఒక పిల్లవాడు దొరికాడు - ఆ గొర్రెల కాపరి దంపతులకు, రామన్న అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. రామన్నకు వయసు పెరిగినా, బుద్ధి వికసించలేదు. చదువు అబ్బలేదు. కులవృత్తి అయిన గొర్రెలు కాచుకు రమ్మని అడవికి పంపితే, అతడి అమాయకత్వం వల్ల దొంగలు గొర్రెల్ని తోలుకుపోయారు. తండ్రి "నీ మొహం చూపించ వద్ద" ని వెళ్ళగొట్టాడు. రాత్రయింది. అక్కడే అడవిలోని పాడుబడ్డ గుడిలో తలదాచుకున్నాడు. అమ్మవారి అనుగ్రహంతో రామన్నకి అఖండమైన తెలివితేటలు లభించాయి. "అదృష్టం నిన్ను వరిస్తుంది. నువ్వు ఏదంటే అది జరిగి తీరుతుంది" అని, వరం ఇచ్చింది కాళికాదేవి. ఒక వృద్ధ పండితుని రూపంలో నిజంగానే రామన్నకు అదృష్టం కలిసి వచ్చింది. అప్పటి నుంచీ రామన్న కాస్తా మర్యాద రామన్నగా అందరి మన్ననలూ అందుకోసాగాడు. తల్లిదండ్రులు ఆనందించారు. రామన్నకి ధర్మ బద్ధమైన న్యాయవేత్తగా - తగువుల తీర్పరిగా కొద్ది కాలానికే గొప్ప పేరొచ్చింది. ఒక పేదరాశి పెద్దమ్మకు, నలుగురు దొంగలతో తగువొచ్చింది. అసలు ఒప్పందం ప్రకారం, వాళ్ళెప్పుడో అమెకు దాచమని ఇచ్చిన వెయ్యి వరహాలూ, నలుగురూ కలిసి అడగ వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలి. బయట మిగతా ముగ్గురు దొంగలు మాట్లాడుకుంటూండగా, వాళ్ళని చూపిస్తూ నలుగో దొంగ, పెద్దమ్మ నుంచి మూట అందుకుని అటునుంచి అటే ఉడాయించాడు.

ఏదో పని మీద రాజధానికి బయల్దేరిన మర్యాద రామన్నతో చెప్పుకుంది పేదరాశి పెద్దమ్మ. దొంగలు ఆమెను న్యాయాధికారి వద్దకు తీసుకు వెళ్ళగా, అతడూ వారినే సమర్ధించిన సంగతీ చెప్పింది. అంతా విని, "ప్రభువులకు పొయ్యేకాలం. రాజోద్యోగి తప్పు చేస్తే, అది ప్రభువు చేసినట్టే" అన్నాడు రామన్న. రాజును తిట్టాడని భటులు రామన్నను బంధించి, కొలువులో హాజరు పెట్టారు. రామన్న తనకు అపచారం చెయ్యలేదని, తీర్పు అతడినే చెప్పమనీ కోరాడు ప్రభువు. ప్రస్తుతం ముగ్గురు దొంగలే ఉన్నారు. వారిలో ఆఖరి వాడిని తీసుకురాగలిగితే, ఒప్పందం ప్రకారం వారికి పెద్దమ్మ వరహాలు చెల్లిస్తుంది అని తీర్పు చెప్పాడు. నాల్గోవాడు దొరకడం కల్ల. అదీ రామన్న యుక్తి. తీర్పు అందరికీ నచ్చింది. ప్రభువు కూడా రామయ్యను తీర్పులు చెప్పే న్యాయాధికారిగా ఉండవలసిందిగా కోరాడు.

శేషయ్య అనే రైతు, పెళ్ళి వేడుకల కోసం, ఖాన్ దగ్గర గుర్రం అద్దెకు తీసుకున్నాడు. దురదృష్టవశాన అది మరణించింది. శేషయ్య గుర్రం ఖరీదు ఇస్తానంటే, ఖాన్ మొండిగా ఆ గుర్రమే తెచ్చిమ్మంటాడు. మర్యాద రామన్న యుక్తిగా ఈ ఫిర్యాదు మర్నాటికి వాయిదా వేశాడు. ఖాన్, మర్నాడొచ్చేటప్పుడు స్వయంగా శేషయ్యను పిలుచుకు రమ్మన్నాడు. ఆ రాత్రి శేషయ్య ఇంట్లో, తలుపు తోయగానే పగిలేలా కుండలు పేర్పించాడు. ఖాన్ వచ్చి తలుపు తోసేసరికి కుండలన్నీ పగిలాయి. తన కుండలే కావాలి అని పేచీతో ఎవరికి వారే న్యాయస్థానానికి వచ్చారు. చనిపోయిన ఆ గుర్రానికీ, పగిలిన ఈ కుండలకీ చెల్లు! ఒకసారి పోయినవి కొన్ని తిరిగి అదే స్థితిలో దొరకవు అని తీర్పు చెప్పి సభాసదులను సంతోషపెట్టాడు మర్యాద రామన్న.

రంగమ్మకీ, గంగమ్మకీ వీశెడు నెయ్యి బాకీ దగ్గర తగువొచ్చింది. రెండు గేదెల పాడి వున్న రంగమ్మ దగ్గర, ఎనిమిది గేదెలకు ఆసామీ అయిన గంగమ్మ వీశెడు నెయ్యి అప్పు తీసుకోవడమా? నిజంగానే ఇది జరిగినా, ఎవరూ రంగమ్మను నమ్మలేదు. పైగా గంగమ్మనే సమర్ధించారు. ఫిర్యాదు దివాణానికి చేరింది. మర్యాద రామన్న తీర్పు మరునాటికి గాని, చెప్పనన్నాడు. ఆ రాత్రి గంగమ్మ ప్రవర్తనను భటులతో ఆరా తీయించి, మర్నాడు ఇద్దరూ రాగానే, చెరో చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నాడు. రంగమ్మకి ఒక్క చెంబుతో సరిపోయింది. గంగమ్మకి నాలుగు చెంబులు నీళ్ళిచ్చినా, కాళ్ళు పూర్తిగా తడవలేదు. దీనిని బట్టి, రంగమ్మ ఉన్నంతలోనే సర్దుకొని, ఇతరులకు అప్పు ఇవ్వగల స్థితిలో ఉన్నదని, గంగమ్మ దుబారా మనిషి అని తేల్చేశాడు మర్యాదరామన్న. రంగమ్మ దగ్గర గంగమ్మే అప్పు పుచ్చుకున్నదని, మర్యాదగా బాకీ తీర్చకపోతే దండించవలసి ఉంటుందనీ తీర్పు చెప్పి, ప్రశంసలు పొందాడు.

తీర్థ యాత్రలకు వెడుతూ, సూరయ్య పుట్ల కొద్దీ ఇనుమును దాచమని మిత్రుడైన పేరయ్యకు అప్పగించాడు. సూరయ్య వెళ్ళాక, ఇనుము ధర బాగా పెరగడంతో, అదంతా అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు పేరయ్య. సూరయ్య తిరిగి వచ్చి, తన ఇనుము సంగతి అడగ్గా, "అదా! ఇంకెక్కడుంది? ఎలుకలు అంతా ఎప్పుడో తినేశాయి కదా! నేనేం చేసేది?" అంటూ దీర్ఘాలు తీశాడు పేరయ్య. సూరయ్య, మర్యాదరామన్న దగ్గరకెళ్ళి చెప్పాడు. మర్యాదరామన్నకి సూరయ్య చెపుతున్న దాంట్లో అబద్ధం లేదు అనిపించడంతో, పేరయ్య సంగతి ఆరా తీయించాడు. పేరయ్య ఇంటికి వెళ్ళి, పాత స్నేహం ప్రకారం, అతని కొడుకుని విందుకు పిలవమన్నాడు రామన్న. విందుకు వచ్చిన పేరయ్య కొడుకును ఒక గదిలో బంధించేలా చేశాడు. ఎంతకూ కొడుకు రాకపోవడంతో, విందు పేరుతో తన కొడుకును సూరయ్యే ఏదో చేసి ఉంటాడని, నేరుగా ఏమీ అనకుండా, రామన్నకు ఫిర్యాదు చేశాడు. ఇలా జరుగుతుందని రామన్న ఊహించినదే అయింది. సరిగ్గా సూరయ్య అప్పుడే అక్కడకు వచ్చాడు. కొడుకు గురించి రామన్న ఎదుటనే పేరయ్య అడుగ్గా, అతడి కొడుకుని గద్దలు ఎత్తుకు పోయాయి. నేనేం చేసేది అని తొణక్కుండా జవాబు చెప్పాడు సూరయ్య. "ఎంత చోద్యం కాకపోతే, మనిషంత మనిషిని గద్దలు ఎత్తుకు పోవడమా?" అడిగాడు పేరయ్య.

"పుట్ల కొద్దీ ఇనుము మింగేసిన ఎలుకలే ఉన్నప్పుడు, మనుషుల్ని ఎత్తుకుపోయే గద్దలు ఉండడంలో వింతేముంది" అన్నాడు సూరయ్య. తత్తరపోయాడు పేరయ్య. నిజమా? కాదా? ఏమిటి కథ? అని గద్దించాడు మర్యాదరామన్న. తలూపాడు పేరయ్య. సూరయ్య, రామన్నకు దండాలు పెట్టుకుంటూ, అందరితోనూ "ధర్మప్రభువు మర్యాద రామన్న" అని బతికినంత కాలం చెప్పుకుంటూ ఉండేవాడు. రామన్న ఇలాంటి తీర్పులెన్నో ఇచ్చాడు. చరిత్రలో నిలిచిపోయాడు.

మోసపోయిన మోసగాడు

రామశింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి ఒక ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, ఒక కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య. రెండవ వాడి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచు సుస్తీగా ఉండేవాడు. ఒకరోజు ఇద్దరు కొడుకులనూ పిలిచి తన ఆస్తిని వారిరువురూ చెరి సమానంగా పంచుకోమని చెప్పాడు. "మీరిద్దరూ కలిసి మెలిసి ఉండండి. పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య మూడవ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు" అని సోమయ్య వాళ్ళకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య ఇద్దరు కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్నీ, తెలివితక్కువతనాన్నీ, చూసి అతణ్ని మోసగించడానికి రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో వున్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్ళను పంచవలసివచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు! "తమ్ముడూ! ఈ కోళ్ళను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది.

నువ్వు చిన్నవాడివి. ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించడం కోసం ఈ కోళ్ళను నేనే తీసుకొని, ఆ కష్టమేదో నేనే పడతాను" అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. "తమ్ముడూ! కోళ్ళను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో!" అన్నాడు రాజయ్య. అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్ళను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ళ వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకు వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య ఎటువంటి ఆదాయం రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమైంది. దానికి రోజూ అతను తిండి పెట్టవలసి వస్తోంది. వాడు విచారంగా ఉండేవాడు. ఒకరోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకొన్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడ్డంలో తర్ఫీదును ఇచ్చాడు.

ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరికి ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకు వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఎంతో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకొని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్ళను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండడం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని అలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పట్నానికి వెళ్ళాడు పనిమీద. రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి, దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోకి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలోంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు.

అందుచేత ఆ అన్నాన్ని అది తినడం మాని, అన్నం మెతుకుల్ని కాళ్ళతో అటూ ఇటూ జిమ్మేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటూ ఇటూ తిరుగుతూ కుక్క జిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి! అన్నంతో పాటు వాటి పొట్టల్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గూళ్ళలోకి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి వుంటుందని అతను భావించాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యధాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. అతను అశ్చర్యపోయాడు కుక్క బతికుండడం చూసి. తర్వాత రాజయ్య కోళ్ళగూళ్ళ వద్దకు వేళ్ళాడు. కోళ్ళ గూళ్ళ ముందు కొన్ని లోపల కొన్ని కోళ్ళు చచ్చిపడి ఉండడం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి, దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్ళు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థ బుద్ది మార్చుకొని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు.

పేదరాశి పెద్దమ్మ కథ

అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉందట. పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. వారికి మంచి మనువులు చూసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను - అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది.

చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు బాగా ఉన్నోళ్ళు . అక్కడ పది రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది. సున్ని ఉండలు చేసి పెడుతుంది. అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను. బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని - అంది పెద్దమ్మ. పెద్దపులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలి పెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. పది రోజులు అయ్యింది. పదిహేను రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా! ఇదే దారి కదా. అప్పుడు పడతా పెద్దమ్మ పని - అని కాచుకొని కూచుంది పులి. పెద్దమ్మ మూడు నెలలు అచట గడిపింది. ఇక బయలుదేర వలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా.

బయలు దేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురూ తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చింది. బానలో పెద్దమ్మను కూచో పెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలి పెట్టింది. బాన దొర్లుతూ అడవినబడి పోతాఉంది. బానలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చేయలేదు - అనుకుంది. "బానా బానా దొర్లు,దొర్లు" అంటూ పాడుకుంటుంది. బాన అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బానలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బానను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాన ఢాం అని పగిలిపోయింది. ముక్కలయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను - అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులీ! పెద్దపులీ!ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి వస్తాను. అపుడు హాయిగా తిందువుగాని - అంది పెద్దమ్మ. పులి "సరే" అని వదిలి పెట్టింది.

పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. రెండు గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది. కాని పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా! ముందే ఆలోచించింది. రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిల తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. మూడవ కూతురు ఇంటికి చేరుకుంది. కనుక మనం ఉపాయంతో బతకాలి. తెలివిగా మెసలడం నేర్చుకోవాలి. సమయానికి తగిన ఆలోచన చేయాలి. అలా ఉంటే హాయిగా జీవించగలం.

పిసినారి పేరయ్య

చాలా మందికి సంతకాలు చేయడం వచ్చింది. పేపరు చదువుతున్నారు. మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. పంతులుగారిపైన అందరికీ గౌరవం, ప్రేమ. రాగానే పాదాలంటేవారు. ఆయన ఆశీర్వదించేవారు. రాత్రి బడికి పంతులుగారు వచ్చారు. చేతిలో వేమన శతకం ఉంది. వారంతా ఆ కథలు వినాలని అడిగారు. ఆయన అంగీకరించారు. అందరూ పుస్తకాలు చదువుతారు. వేమన జీవితం చదివాడు. ఎదుటివారిని చదివాడు. అనుభవం గడించాడు. యోగిగా మారాడు. చెప్పడం ప్రారంబించారు పంతులుగారు. నా చిన్నతనంలోని ఒక సంఘటన చెపుతాను. మా గ్రామంలో ఒక దుకాణం ఉండేది. ఆ దుకాణంలో సరుకులు అన్నీ దొరికేవి. యజమాని పేరు పేరయ్య. పేరయ్యకు పేరాశ. మంచి మాటకారి. అందరితో కలుపుగోలుతనంగా ఉండేవాడు. అప్పులు ఇచ్చేవాడు. బేరం అధికంగా ఉండేది. అందరూ ఆ దుకాణంలోనే కొనేవారు. అయితే అతను పరమలోభి. కడుపునిండా తినేవాడు కాడు. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడు. భార్య పేరు లీల. మంచి మనిషి. అయినా మొగుడికి భయపడేది. సొంతంగా ఏమీ చేసేది కాదు. ఆమెనూ కడుపు నిండా తిననిచ్చేవాడు కాదు. కొడుకు పేరు బాలరాజు. పదకొండు సంవత్సరాల వయస్సు. అక్షరం రాదు. ఎప్పుడూ ఏదో ఒకటి తినాలి. చొక్కా ధరించడు. నిక్కరుతో ఉండేవాడు. ఇది తండ్రికి నచ్చదు. బాదుతూ ఉండేవాడు. బాలరాజు ఏడిచి గోలచేసేవాడు.

అందరూ మంచి కూరలు అమ్మేవారు. పేరయ్య పుచ్చూ చచ్చూ అమ్మేవాడు. ఎక్కువ ధర తీసుకునే వాడు. మాటలు మాత్రం మంచిగా ఉండేవి. బాగా సంపాదించాడు. పొలం కొన్నాడు. భవనం కట్టించాడు. పొలం వెళ్ళేవాడు. అజమాయిషీ చేసేవాడు. ఇంట్లో వారికి మంచి దుస్తులు ఉండవు. మంచి తిండి ఉండదు. రూపాయికీ తనకూ లంకె. ఎవరు పిలిచినా వెళ్ళి తినేవాడు. తనకు అయిన వారికి గూడా ఏది విదిలించేవాడు కాడు. చీకటి పడేది. ధనం దాచిన పెట్టె వద్దకు వెళ్ళేవాడు. దానిని చూసుకుంటూ మురిసి పోయేవాడు. అక్కడే నిదురించేవాడు. భార్యకు నలతగా ఉంది. లేవడం లేదు. పేరయ్యకు బాధలేదు. ఆమెకు వైద్యం లేదు. నీరసంగా వుండేది. పాలు పితకమనేవాడు. ఇంటి చాకిరీ చేయించేవాడు. నీరు తోడించేవాడు. కొడుకేమీ చేయడు. పాపం ఆమెకు జ్వరం మొదలయింది. అందరూ వైద్యునికి చూపించమన్నారు. అదే నయమవుతుందనేవాడు. అన్నిటికీ మిరియాల కషాయమే మందు అనేవాడు. రోజు రోజుకూ ఆమెకు సుస్తీ ఎక్కువయింది. పేరయ్యకు ఖర్చు అంటే భయం. వైద్యుని కలవలేదు. ఆమె మంచం మీద వుంది. కదలలేక పోతోంది. కాఫీ అడిగే వారు లేరు. పేరయ్య బేరం చేస్తూనే వుండేవాడు. మందూ లేదు, మాకూ లేదు. అమె మరణించింది.

కొడుకు కాసేపు ఏడిచాడు. చిరు తిండి ప్రారంభించాడు. పేరయ్యకు బాధేలేదు. మందుల పైకం మిగిలిందని ఆనందం. దహనం చేయించాడు. బంధువులకు తెలియదు. కర్మకాండలు లేవు. పైకం మిగిలిందని పేరయ్య ఆనందం. బంధువులు కూడా వచ్చేవారు కారు. అతని సంగతి అందరికీ తెలుసు. పనిమనిషి కుదిరింది. పేరయ్యకు పని జరిగిపోతోంది. కొడుకు జులాయిగా మారాడు. చదివించమనేవారు ఊరివారు. పైకం దండగ అనేవాడు పేరయ్య. బాలరాజు తిండికి ముందుండే వాడు. తరువాత కోతి కొమ్మచ్చులు ఆడేవాడు. అయినా పేరయ్యకు చీకూ చింతా కలుగలేదు. చివరకు జులాయిగా మారాడు. ఇంటికి పేచీలు, కొట్లాటలు తెచ్చేవాడు. దుకాణంలో కరివేపాకు వుండేది. కానీ కరివేపాకు మరొకరిని అడిగేవాడు. ఏమిటంటే మంచిది కాదు అనేవాడు. పాడి గేదెను కొనడు, మజ్జిగ ఎదురింటి వారిని అడిగేవాడు. వంటపని ఒకరికి పురమాయించేవాడు. ఒకరి సహకారం వొకరికి అవసరమంటాడు. తన పైకం మాత్రం తీయడు. ఎదుటి వారిని అడిగేవాడు. అందరూ హేళన చేసేవారు. తనకు రోగం వచ్చేది. జీలకర్ర, మిరియాలు నమిలేవాడు. వైద్యం చేయించుకునేవాడు కాదు. శరీరం శాశ్వతం కాదనేవాడు. పైకం దాపరికం దేనికని అడిగేవారు. పైసా యే పరమాత్మా హై అనేవాడు.

మరికొంత పొలం బేరం చేశాడు. ఇంకో రెండు ఇండ్లు కొన్నాడు. అయినా వొంటికి సుఖం లేదు. మంచి లేదు. బాలరాజుకు చిరుతిండి ప్రధానం. ఇంకేమీ అవసరం లేదు. పేరయ్య ధనాన్ని ప్రేమించాడు. ధనం గురించే ఆలోచించాడు. మనుషులను నమ్మలేకపోయాడు. ప్రేమించలేకపోయాడు. దొంగల భయం. కంటికి నిదురరాదు. తిండి సహించేది కాదు. ఆరోగ్యం పాడైంది. పక్షవాతం వచ్చింది. వైద్యుని చూడలేదు. పైకం పాడవుతుంది. అదీ అతని ఆలోచన. చేసేవారు లేరు. కొడుకును నమ్మడు. బాలరాజు బరి తెగించాడు. దొరికింది దుబారా చేయసాగాడు. పేరయ్య బావమరిదికి ఈ తంతు అంతా తెలిసింది. అయినా రాలేకపోయాడు. ఇతరుల సలహా మీద బావమరిదిని పిలిపించాడు పేరయ్య. కొడుకుని దారి చేయమని అడిగాడు. పైకం యీయనని చెప్పాడు. అందరూ మందలించారు. అయినా వినలేదు. బావమరిదికి అక్కగారి మీద అభిమానం. బాలరాజును తీసుకుపోయాడు. ఆ ఊరి నదికి వరద వచ్చింది. చాలా ప్రాణాలు పోయాయి. నీరు ఊరంతటినీ ముంచింది. పేరయ్య పెట్టెను కౌగిలించుకున్నాడు. వదలలేదు. నీరు బాగా త్రాగాడు. వరద నీటిలో హరీమన్నాడు. పెట్టెను కౌగిలించుకున్నాడు. ప్రాణం నిలుపుకోలేకపోయాడు.

అందుకే వేమన చెప్పింది. లోభిని ఎవరూ ఏమీ చేయనవసరం లేదు. పైకం అడిగితే చాలు పడి చస్తాడు అని నీతిని చెప్పాడు. సంపాదించాలి. సంపాదించింది అనుభవించాలి. అతడే మనిషి. ఇది మనకు వేమన తెలియ చేసిన నీతి. మరిచిపోకండి. అంటూ పంతులు గారు పాఠం ముగించారు.

సాటివారికి సాయం

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరిలో అచ్చమ్మ అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకి దేవుడు అంటే మక్కువ. పాప భీతి ఎక్కువ. ఆమె భర్త మరణించాడు. ఆమెకి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రామయ్య, చిన్నవాడు అంజయ్య. ఆ ఇద్దరు పిల్లలనూ అల్లారు ముద్దుగా పెంచి పెద్ద జేసింది. ఒకసారి చిన్నవాడు అంజయ్యకి జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా జబ్బు తగ్గలేదు. జబ్బు తగ్గితే తిరుపతి కొండకు వస్తామని మొక్కింది. శ్రీ వేంకటేశ్వర స్వామికి ముడుపు కట్టింది. ఏమైతే నేం? అంజయ్యకి జబ్బు తగ్గింది. కానీ కొండకి వెళ్ళలేదు. మొక్కు తీర్చలేదు. ఇలావుండగా ఒకనాడు దేవుని పటం ముందు ముడుపు కనిపించలేదు. కంగారు పడిపోయింది. అచ్చమ్మ "ఏరా!స్వామి ముడుపు కనిపించటం లేదు. ఏమైందిరా" అని కేకలు పెట్టింది. "నేనే తీశానమ్మా" అన్నాడు అక్కడే వున్న అంజయ్య. "అపచారం!అపచారం!ఆ ముడుపు ఎందుకు తీశావురా? అంది అచ్చమ్మ చెంపలేసుకొంటూ. "లేదమ్మా! ఆ పాతిక రూపాయలూ నారయ్యకు ఇచ్చాను" అన్నాడు అంజయ్య. "వాడికెందుకు ఇచ్చావురా? వాడికేమొచ్చిందిరా?" "ఏమొచ్చేదేమిటమ్మా! జ్వరమొచ్చింది. డబ్బు ఇస్తేగానీ మందు ఇవ్వనన్నాడు డాక్టరు. అందుకని...." అని అంజయ్య అంటూ ఉండగానే - ఎంత ఘోరం" అంటూ చిందులు తొక్కింది అచ్చమ్మ.

ఇంతలో పొలం నుంచి పెద్ద కొడుకు రామయ్య వచ్చాడు. వస్తూనే తల్లి కేకలు విన్నాడు. "ఏమిటమ్మా! ఏం జరిగింది?" అని అడిగాడు. జరిగింది అంతా చెప్పింది అచ్చమ్మ. "ఏరా అంజీ!నిజమేనా?" అని తమ్ముడ్ని అడిగాడు రామయ్య. "నిజమే అన్నయ్యా! కాని ఆ డబ్బులు నా కోసం తీసుకోలేదు. నారయ్యకి జ్వరం తగ్గటానికి మందుల కోసం ఆ డబ్బు ఖర్చు చేశాను అన్నాడు అంజయ్య. భేష్!మంచి పని చేశావురా!" అని మెచ్చుకొన్నాడు రామయ్య. "ఏమిట్రా! తప్పు అని చెప్పకపోగా నీవూ వాడినే సమర్థిస్తున్నావా?" అని ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకుంది అచ్చమ్మ. "అవునమ్మా! చిన్నవాడు అయినా మన అంజయ్య చేసిన పని చాల గొప్పది. ఆపదలో ఉన్న మానవుని ఆదుకోవటం మానవ ధర్మం. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా!. కనుక దేవుని సొమ్ము ఖర్చు పెట్టినా తప్పు లేదు-ముప్పులేదు. "ఆపదలో ఉన్న ఒక అనాధ బాలునికి తన సొమ్ము సాయపడిందని భగవంతుడు ఆనందిస్తాడు." - అన్నాడు రామయ్య. "నిజమే బాబూ! మీరు ఇద్దరూ నా కళ్ళు తెరిపించారు. మానవ సేవే మాధవ సేవని చెప్పే వారే గాని చేసేదెవరు?" "ఒరే అంజయ్యా! వయస్సు చిన్నది అయినా నీ మనస్సు వెన్నరా." అని అంజయ్యని మెచ్చుకొంది అచ్చమ్మ.

అప్పుడే బీరువాలో నుంచి పాతిక రూపాయలు తీసుకొచ్చాడు రామయ్య. అమ్మ చేతికిచ్చి "అమ్మా! ఈ సొమ్ము తీసుకో! మళ్ళీ స్వామి వారికి ముడుపు కట్టుకో! ఇక నీ ముడుపు యధావిధిగా ఉంటుంది. నీ దడుపూ తొలగిపోతుంది!" అన్నాడు నవ్వుతూ.

శరభయ్య బద్దకం

ఒక ఊరిలో శరభయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా బద్దకం. ఒక రోజు అతను ఎప్పటిలాగే ఎడ్లబండి నడుపుకుంటూ వెళ్తున్నడు. అది వర్షకాలం, ఆ ముందురోజే కుంభవృష్టి కురవడంతో రోడ్డంతా బురదగా, మడ్డిగా ఉంది. ఏదో పరధ్యానం లో ఉండి బండి తోలుతున్న శరభయ్యకు ఎవరో కుదిపేసినట్లు అనిపించడంతో బండి దిగి చూసాడు.

అతని బండి చక్రం ఒకటి బురదలో కూరుకుపోయింది. వెంటనే శరభయ్య దానిని భుజాలతో తీయడానికి ప్రయత్నించకుండా దేవుణ్ణి ప్రార్ధించడం మొదలుపెట్టాడు. దేవుడా నా బండి చక్రం బురదలో కూరుకుపోయింది. ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ అరవడం ప్రారంభించాడు.

తన భుజాలను ఉపయోగించి బండి చక్రాన్ని సులువుగా పైకి తీయగలడు శరభయ్య. కానీ, ఏమాత్రం ప్రయత్నించకుండా దేవుడే రావాలి తన బండిచక్రం తీయాలి అని బీష్మించుకు కూర్చున్నాడు శరభయ్య. పది నిమిషాల తర్వాత వర్షం మొదలైంది. అంతే బండిచక్రం మరింతగా బురదలో కూరుకుపోయింది. ఆ రాత్రంతా బద్దకస్తుడైన శరభయ్య అలాగే వానలో తడుస్తూ కూర్చున్నాడు. కానీ, ఆ చక్రాన్ని పైకి తీయడానికి ఎంతమాత్రం ప్రయత్నించలేదు. మరుసటి రోజు ఉదయం ఇక మరోదారిలేక ఎలాగోలా చక్రాన్ని పైకి తీసి తన దారిలో తాను వెళ్ళిపోయాడు.

పరమానందయ్య శిష్యులు చేసిన శొంఠి వైద్యం

ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారస్థుడు వున్నాడు. అతనికి పరమానందయ్యగారంటే ఎంతో భక్తి. పరమానందయ్యగారి తండ్రి, తాతల కాలం నుండి కుటుంబ గురువులు. అందువల్ల ఆయన పరమానందయ్యగారిని దైవసమానంగా భావిస్తున్నాడు. ఆయన మాట వేద వాక్యంగా భావించి పాటిస్తాడు. అప్పుడప్పుడూ ఆయన పరమానందయ్యగారి వద్దకు వచ్చి తృణమో పణమో యిచ్చి వెళుతూ వుంటాడు.

రామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు. కిరాణా దుకాణం, బట్టల దుకాణం నడిపేవాడు. అనేక అబద్దాలు ఆడి, మోసాలు చేసి విశేష ధనం, భూమి సంపాదించాడు. కానీ భార్యా పిల్లలు దక్కలేదు. నా అనే దిక్కులేక, గ్రామస్థులతో, సరిపడక మనసు బాగులేనప్పుడూ, ఏదయినా అనారోగ్యం వచ్చినప్పుడూ పరమానందయ్యగారి వద్దకు వెళ్ళి, రెండురోజులు ఉండి పోతుండేవాడు.

ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రామయ్యకు కడుపునొప్పి పట్టుకొంది. ఎన్నాళ్ళకూ తగ్గలేదు. మంచం పట్టాడు. తన స్థితి పరమానందయ్యగారికి ఉత్తరం ద్వారా తెలియచేసి ఒకసారి రమ్మని ప్రార్థించాడు. రామయ్య ఉత్తరం చదువుకొని పరమానందయ్యగారు శిష్య సమేతంగా మరునాడు అతని గ్రామం వెళ్ళారు. గురువుగారిని చూచి రామయ్య చాలా మర్యాద చేసి తన బాధను గురించి వివరంగా చెప్పాడు. పరమానందయ్యగారు 'నేను వచ్చానుగదా భయపడకు! ఇదొక గొప్ప రోగమా? దీనికి నా శిష్యులు చికిత్స చేయగలరు. రెండు రోజులలో నీ సమస్త బాధలూ తీరిపోతాయి. నిర్భయంగా వుండు'. అని ధైర్యం చెప్పాడు. శిష్యులను పిలిచి ఆయనకు చేయవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పారు.

గురువుగారి ఆజ్ఞ దొరకడం తడవుగా ఒక శిష్యుడు తన సంచిలో వున్న శొంఠి పొడుము తీసి కాస్త పంచదార కలిపి రామయ్యకు ఇచ్చి గోరువెచ్చని నీళ్ళు త్రాగించాడు. ఆ విధంగా మూడు పూటలు యిచ్చేసరికి రామయ్యగారికి కడుపునొప్పి తగ్గి ఆకలి పుట్టింది. రామయ్య చాలా సంతోషించాడు. రెండవ రోజున మరొక శిష్యుడు శొంఠి మెత్తగా దంచి కషాయం కాచి త్రాగించాడు. రామయ్య శరీరమంతా వేడి పుట్టింది. మూడవరోజున మరొక శిష్యుడు శొంఠి గంధం తీసి రామయ్య శరీరమంతా పట్టించాడు. దాంతో రామయ్య శరీరమంతటా మంటలు పుట్టాయి. ఆ బాధ భరించలేక రామయ్య గట్టిగా ఏడవనారంభించాడు. అది చూసి పరమానందయ్యగారు 'భయపడకు! రోగం తగ్గేముందు అలాగే వుంటుందని ' ధైర్యం చెప్పాడు. రామయ్య నిజమే కావచ్చుననుకొని మంటను ఓర్చుకొంటున్నాడు. నాలుగవరోజున మరొక శిష్యుడు శొంఠి నూరి ముద్దచేసి రామయ్య నడినెత్తిమీద వేసి కట్టుకట్టాడు. ఉన్న బాధలు చాలక తలపోటు పట్టుకొని పిచ్చిగా అరుస్తూ బాధపడసాగాడు.

అతని స్థితి చూసి పరమానందయ్యగారు శిష్యులను పిలిచి కొంపముంచారు. రామయ్య చచ్చేస్థితిలో వున్నాడు అని బాగా ఆలోచించి చికిత్స సాగించాడు. గురువు గారి మాటలు విని శిష్యులు చాలా బాధపడ్డారు. ఇంత కష్టపడి చికిత్స చేస్తుంటే గురువుగారు మెచ్చుకోవడంలేదని ఆగ్రహించి 'గురువుగారూ! మీరేం దిగులుపడకండి. రామయ్య చచ్చినా అతని ప్రాణాలు మాత్రం పోనియ్యం' అని వాగ్దానం చేశారు. రాత్రి శిష్యులంతా కలసి ఆలోచించసాగారు. మనం ఎన్నిరకాల చికిత్సలు చేసినా రోగం తగ్గలేదు. రోగం తగ్గినా తగ్గకపోయినా ప్రాణం పోకుండా చూడాలి అని నిశ్చయించుకొన్నారు. ఒకనాడు ప్రాణం ఎటువేపునుంచి పోతుందో తెలుసుకోవాలన్నాడు. మరొకనాడు తెలుసుకోవడానికేముంది? కడుపులోనుంచి పోతుంది అన్నాడు. ఇంకొకడు ముక్కులో నుంచి పోతుందన్నాడు. వేరొకడు కళ్ళలోనుంచి పోతుందన్నాడు. ఈ విధంగా తలోక విధంగా చెప్పి ఎటూ నిర్ధారణ చేసుకోలేక పోయారు. వారిలో ఒక బుద్దిమంతుడు యిలా చెప్పాడు. మన శరీరంలో నవరంధ్రాలున్నాయంటారు. ఆ రంధ్రాలను వెతికి మూసివేస్తే ప్రాణం ఎటూపోలేక చచ్చినట్టు పడివుంటుంది. అన్నాడు. అతని బుద్ది కుశలతకు అంతా మెచ్చుకొన్నారు.

తమ వద్దనున్న శొంఠినంతా తీసి మెత్తగా దంచి ముద్ద చేసి రామయ్యను బలవంతంగా కదలకుండా పట్టుకున్నారు. అతని నవరంధ్రాలలో శొంఠి ముద్దకూర్చారు. ఎప్పుడైతే నోరు, ముక్కు రంధ్రాలు మూసివేశారో అప్పుడే అతని పంచప్రాణాలు గాలిలో కలసిపోయాయి. కదలక మెదలక పడి వున్నాడు. అతడు బాధ తగ్గి హాయిగా నిద్రపోతున్నాడని శిష్యులనుకొన్నారు. మంచం చుట్టూ కూర్చొని కునుకుతున్నారు. తెల్లవారింది గురువుగారు నిద్ర నుంచి మేల్కొని రామయ్య వున్న గదిలోనికి వచ్చారు. మంచం వద్దకు వెళ్ళి రామయ్య చెయ్యిపట్టుకొని నాడి చూశారు. గుండె మీద చెయ్యి పెట్టి చూశాడు. కొంప మునిగింది! రామయ్య చనిపోయాడు. లేవండిరా! వెధవల్లారా. అని బిగ్గరగా అరిచారు. శిష్యులు గురువు గారి కేకలు విని త్రుళ్ళిపడి లేచారు. తాము చేసిన ఘనకార్యం గురించి చెప్పబోయారు, మీ తెలివి తక్కువ వైద్యము వల్ల రామయ్య చనిపోయాడు. ఎవరైనా ఈ సంగతి తెలుసుకొంటే చావగొట్టి చెవులు మూస్తారు. ఇతనికి దహన సంస్కారాలు చేయించాలి. కావలసిన వాళ్ళెవరూ లేరు. ఇరుగు పొరుగు వారికి ఈ సంగతి చెప్పి తీసుకొనిరండి అని పంపారు.

రామయ్య అంటే ఆ ఊళ్ళో వున్న వారికందరికీ చాలా కోపంగా వుంది. వాడు చస్తే మాకేం? బ్రతికితే మాకేం? మేము మాత్రం రాము. అని కబురు చేశారు. అంతట పరమానందయ్యగారు అతని శిష్యుల సహాయంతో దహన సంస్కారాలు జరిపారు. రామయ్య అంతకుముందే తాను చనిపోయిన తరువాత తన ఆస్తి అంతా తమ గురువుగారైన పరమానందయ్యగారి మఠమునకు యిస్తానని వాగ్దానం చేసి వీలునామా వ్రాసిపెట్టాడు. దాని ప్రకారం రామయ్య ఆస్థిని గైకొని శిష్యసమేతంగా స్వగ్రామం బయలుదేరారు పరమానందయ్యగారు.

శ్రధ్ధ లోపించిన పూజ

ఒక ఊరిలో ఒక ధనికుడు నివసించుచుండెను. అతనికి ఆస్తిపాస్తులు కొల్లలుగా గలవు. వ్యాపారము, వ్యవసాయము రెండింటియందును అతడు ధనమును బాగుగా గడించి శ్రీమంతుడయ్యను.

రెండు మూడు పెద్ద భవనములు కూడ అతనికి కలవు. అతని ఇంటిలో ఎందరో పరిచారికులు, సేద్యగాళ్ళు, గుమస్తాలు పనిచేయుచుందురు. ఒకనాడా ధనికునకు సత్యనారాయణవ్రతము చేయవలెనని సంకల్పము కలిగినది. తదనుసారము పురోహితునతో సంప్రదించి పూజకై ఒకరోజును నిర్ణయించి, ఆపూజకు కావలసిన పదార్ధములన్నియూ రాసుకొని గుమస్తాచేత వాటిని తెప్పించెను. సరిగా ముహూర్తము వేళకు సత్యనారాయణ పటము పూజామందిరములో ప్రతిష్ఠించబడెను. పూజాద్రవ్యములన్నియూ సమకూర్చబడెను. సమయానుకూలముగా పురోహితుడు పూజ ప్రారంభించెను. ధనికుడు, అతని భార్య పీటలమీద ఆసీనులైరి.

భగవంతునకు చేయవలసిన షోడశోపచారములతో ధూపము, దీపము పూర్తి అయినవి. తదుపరి నైవేద్యము తెప్పించబడెను. దానిని దేవుని పటము ముందు పళ్ళెరములోనుంచి నీటతో మంత్రోచ్చారణపూర్వకంగా సంప్రోక్షించి, 'ఓం ప్రాణాయ స్వాహా' అను మంత్రము చెప్పుచూ నైవేద్యమును దేవునకు అర్పించుటకై చేతిని పటమువైపు చూపుమని ధనికునితో చెప్పెను. కానీ ధనికుడు చేతిని తన పొట్టవైపు చూపించుచుండెను. "అట్లు చేయవద్దు అది అపచారము" అని పురోహితుడు చెప్పగా అంతట శ్రీమంతుడు "నైవేద్యము తినునది నేనేకదా, పటము తినదు కదా! అట్లు చూపినచో తప్పేమి?" అని అడిగెను.

"అప్పుడు పురోహితుడు తినువారు మీరే అయినను దేవునకు సమర్పించుచున్నట్లు భావనచేసి ఆ ప్రకారము దేవునకు చేయవలెను. భావన ప్రధానము" అని చెప్పగా ధనికుడు అట్లే చేసెను.

తెలివిగల బాలుడు

ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతనికి పెద్ద భవనం ఉంది. చాలామంది పనివారున్నారు. కాని చాలా క్రూరుడు. ఇతరులను హింసించడం, ఇతరులను బాధించడం అతనికి ఆనందం. అలా చాలామందిని బాధపెట్టాడు. ఒక రోజున ఆ భవనం వద్దకు పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా పెట్టించమన్నాడు. వెంటనే నవాబు లేచి ఆ బాలుణ్ణి పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చున్నాడు. పనివాళ్ళను పిలిచాడు. నీళ్ళు, పళ్ళు తెమ్మన్నాడు. భోజనం వడ్డించమన్నాడు. పనివారు లోపలికి వెళ్ళారు. ఉత్త చేతులతో వచ్చారు. ఇద్దరికి వడ్డించినట్లు నటించారు. ఆ నవాబు తిన్నట్లు నటించాడు. పేద బాలుడిని తినమన్నాడు. కాని ఎదురుగా తినడానికి ఏమిలేదు. బాలుడికి అర్థం కాలేదు. నవాబు చేతులు కడిగినట్లు నటించాడు. పనివారితో మిఠాయిలు తెమ్మన్నాడు. వారు తెచ్చినట్లు నటించారు. నవాబు తిన్నట్లు నటించాడు. మధు పానీయాలు తెమ్మన్నాడు. పనివారు తెచ్చినట్లు నటించారు. నవాబు తాగుతున్నట్లు నటించాడు.

చాలా బాగుంది. చాలా పాతది. బాగా తాగమని బాలుడికి చెప్పాడు. ఆనందంగా తాగమన్నాడు. ఆ పేద బాలుడికి ఆకలి అవుతున్నది. కనీసం తాగటానికి నీరు కూడా లేదు. నవాబు మోసం గ్రహించాడు. బుద్ది చెప్పాలనుకున్నాడు. తాను తూగుతున్నట్లు లేచాడు. ముసలి నవాబును తన్నాడు, తిట్టాడు. దానికి నవాబుకు కోపం వచ్చింది. ఏం చేస్తున్నావు? తెలుసా? అని అరిచాడు. మీరిచ్చిన మత్తు పానీయంతో నాకు మత్తెక్కింది. నాకేం తెలియటంలా అన్నాడు. మళ్ళీ నవాబును కొట్టబోయాడు. నవాబుకు దానితో తప్పు తెలిసింది. ఆ పేద బాలుడి తెలివికి మెచ్చుకున్నాడు. మంచి భోజనం పెట్టించాడు. ఆనాటి నుంచి ఇతరులను హింసించడం మానుకున్నాడు. దాన ధర్మాలు చేయసాగాడు.

అడవి మొక్కలు

ఒకసారి అక్బరు చక్రవర్తి అడవికి వేటకు వెళ్ళినప్పుడు కొండజాతికి చెందిన స్త్రీలు ఎవరి సహాయం లేకుండానే కట్టెలు కొట్టడం, రాళ్లు ఎత్తడం వంటి కఠినమైన పనులు చేయడం చూశాడు. ఎంతో ఆశ్చర్యానికి గురైన అక్బరు "చూశావా బీర్బల్‌! మన అంత:పుర స్త్రీలు ఇలాంటి పనులు ఎప్పుడైనా చెయగలరా? ప్రతి పనికి సేవకులు, పరిచారకులు... ఇలా ఎందరో కావాలి. దీనికి కారణం మన స్త్రీలను మనం ఎక్కువగా గారాబం చేయడమే. అందుకే వాళ్ళలా మరీ నాజూకుగా తయారవుతున్నారు" అన్నాడు.

ఆ తరువాత అక్బరు కోటకు తిరిగి వెళ్లాక కూడా ఈ విషయమే మహారాణితో చర్చిస్తూ ఆమెను ఎగతాళి చేశాడు.

దానితో రాణి మనసు గాయపడింది. అక్బరు చక్రవర్తికి తన తప్పు తెలియజేయాలనుకుని బీర్బల్‌ని పిలిపించి జరిగినదంతా చెప్పింది. చక్రవర్తి ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని బీర్బల్‌కి కూడా అనిపించింది.

బీర్బల్‌ వెంటనే చక్రవర్తి తోటను పరిరక్షించే తోటమాలిని పిలిచి "ఈ రోజు నుండి మొక్కలకు నీళ్ళు పోయడం మానెయ్యి. పాదుషాగారు ఏమైనా అంటే నా పేరు చెప్పు" అని చెప్పాడు.

బీర్బల్‌ ఊహించినట్టుగానే వారం రోజుల తరువాత అక్బరు నుండి పిలుపు వచ్చింది.

"ఏమిటి బీర్బల్‌ నువ్వు చేసిన పని. మొక్కలకు నీళ్ళు పెట్టొదని తోటమాలికి చెప్పావా? నీకేమైనా పిచ్చి పట్టిందా?" అని చాలా కోపంగా అడిగాడు అక్బరు.

"ప్రభూ, రాజుగారి తోటకు చెందిన మొక్కలకు అనవసరంగా గారాబం చేయడం జరుగుతోంది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమేమీ లేదు. అడవిమొక్కలను ఎవరు సమ్రక్షిస్తారు? ఎవరు నీళ్ళు పెడతారు? వాటంతట అవే పెరగవా? రేగుపండ్లు, నేరేడుపండ్లు ప్రత్యేకమైన శ్రద్ధ లేకపోయినా ఎంతో మధురంగా ఉండవా? మరి అలాంటప్పుడు ఈ మొక్కలు నీళ్ళు పోయకుంటే బతకలేవా?" అని నెమ్మదిగా చెప్పాడు.

అక్బరు ముఖం కోపంతో ఎర్రబడింది. "నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఎంతో నాజూకుగా పెంచుకుంటున్న మొక్కలను అడవి మొక్కలతో పోలుస్తావా?" కాస్త గట్టిగానే అరిచాడు అక్బరు.

"క్షమించండి ప్రభూ! నేను మతి ఉండే మాట్లాడుతున్నాను. మీరు కొండజాతి స్త్రీలతో అంత:పుర రాణులను పోల్చినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది" చేతులు జోడించి చెప్పాడు బీర్బల్‌.

దానితో అక్బరు చక్రవర్తికి తన తప్పు తెలిసి వచ్చింది.

ఆత్మవిశ్వాసము

కళింగ, విదర్భ రాజ్యాలు ప్రక్క ప్రక్కనే ఉండేవి. ఎప్పుడూ గొడవలుపడుతూ వుండేవారు. విదర్భసైన్యము పెద్దది. కళింగసైన్యము తక్కువ. కళింగ రాజ్య సైనికులు తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి అవమానమనీ తలుస్తూ సేనాధిపతి విక్రమ్ వెంట బయలుదేరారు.

సేనాధిపతి విక్రమ్ వెంట వెళుతున్నారేగానీ, గెలుపు సాధించే నమ్మకము ఎవరిలోనూలేదు. వాళ్ళ గుసగుసలాడుకోవటం సేనాధిపతి విక్రమ్ గమనించాడు. వెళ్ళే మార్గములో ప్రాచీన కాళికాలయము వుంది. సైనికులలో ఆత్మవిస్వాసము కలిగించే ఉద్దేశముతో కాళికాలయము వద్ద గుర్రాన్ని ఆపి లోపలికివెళ్ళి కాళికాదేవికి నమస్కరించి బయటకు వచ్చి "మీలో యుద్దములో మనం గెలవగలమన్న నమ్మకం లేనట్టుగావుంది. ఈ విషయంలో కాళీమాత సంకల్పము ఎలా వుందో తెలుకుందాం" అని వెండి నాణెము తీసి చూపించి "నేను బొమ్మా బొరుసు వేస్తాను. నాణెముపై గల రాజముద్రిక పడిందంటే కాళీమాత దీవించినట్టే. విజయము మనదే. బొరుసుపడితే ఓటమిగా తీసుకుందాం" అని నాణెము కుడి చేతిలోకి పైకి ఎగురవేశాడు.

నేలమీదపడిన నాణెముపై రాజముద్రిక కనిపించగానే వారిలో ఉత్సాహము ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకుసాగింది. గెలుపుతమదేననే ఆత్మవిశ్వాసము కలిగింది. శత్రుసైనికులను చీల్చి చెండాడి విజయాన్ని కైవసము చేసుకున్నారు. యుద్ధము ముగిసిన తర్వాత అల్ప సంఖ్యాకులమయిన మనం విజయం సాధించటం ఆశ్చర్యముగా వుంది అన్న దళనాయకునితో సేనాధిపతి విక్రమ్ నవ్వుతూ తాను కాళికాదేవి ఆలయము వద్ద బొమ్మా బొరుసు వెండి నాణెము చూపించాడు. రెండువైపులా రాజముద్రిక వుండటం గమనించి తిరిగి సేనాధిపతి విక్రమ్‌కి ఇచ్చాడు.

అబద్దం తెచ్చిన అనర్థం

జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు. వాసు కొంటెకుర్రవాడు. అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు. విద్యార్ధి తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు. ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది. ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్‌ను షాపు యజమానికి ఇచ్చాడు. ఆ షాపు యజమాని జరిగినదంతా తెలుసుకొని బాబూ! నీకు ఇనుము గుచ్చుకుంది కాబట్టి సెప్టిక్ అవుతుంది. నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్‌కు చూపించుకో అని సలహా ఇచ్చాడు. ఇంటిలోకి వెళ్ళగానే వాసుని చూసి ఏంటిరా! కాలికి ఏమి అయింది? ఎందుకు అలా కాలు కుంటుతున్నావు? అని అడిగింది ఆదుర్దాగా వాసు తల్లి. బడి నుంచి ఇంటికి వస్తుంటే దారిలో కాలికి రాయితగిలి కింద పడ్డాను అని జవాబిచ్చాడు. బడికి ఎగనామం పెట్టి సైకిల్‌పై తిరుగుతూ క్రింద పడ్డానని చెబితే అమ్మ తిడుతుందని అబద్దం చెప్పాడు వాసు.

చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అంటూ కాలికి పసుపు రాసింది. అలా రెండు రోజులు గడిచిపోయాయి. వాసు కాలు బాగా వాచింది. కాలు కదపడానికి రావడం లేదు. అప్పుడు జగన్నాథం వాసుని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు డాక్టరు కాలికి దెబ్బను చూసి ఎలా తగిలింది అని అడిగాడు. బడి నుంచి వస్తుంటే జారి క్రిందపడ్డాను. రాయి గుచ్చుకుంది. అని మరలా అబద్దం చెప్పాడు వాసు. నిజం చెప్పకపోతే నీ కాలు తీసేయాల్సివస్తుంది అని డాక్టరు చెప్పేసరికి జరిగినదంతా చెప్పాడు వాసు. చూశారండీ మీ వాడు మీతో అబద్దం చెప్పాడు. ఇంకా రెండు రోజులు అలాగే ఉంటే సెప్టిక్ అయి కాలు తీసేయవలసి వచ్చేది. అంటూ టి.టి ఇంజక్షన్లు, మందులు ఇచ్చాడు. ఛీ! ఛీ! కనీసం సైకిలుషాపు యజమాని చెప్పినప్పుడే డాక్టరు దగ్గరికి వెళ్ళివుంటే ఎంత బాగుండేది. నిజం దాచిపెట్టినందుకు నా ప్రాణానికే ముప్పు వచ్చింది అందుకే పెద్దలు అబద్దం ఆడకు నిజం దాచకు అంటారు. ఇంకెప్పుడూ ఇలా చేయకూడదు అనుకున్నాడు వాసు మనసులో. ఆరోజు నుంచి వాసు అబద్దం ఆడడం మానేశాడు. బడికి సక్రమంగా వెళుతూ, పాఠాలు బాగా చదువుతూ మంచి మార్కులతో పాసయ్యాడు. చిన్న వయసులో తప్పులు తెలుసుకున్న వాసుకి మంచి భవిషత్తు వుంటుంది.

అద్భుత ఫలాలు

ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలకి పొరుగు దేశపు రాజు కొన్ని ఫలాలను బహుమతిగా పంపించాడు. వాటితో పాటు ఆ రాజు ఒక లేఖ కూడా రాశాడు. 'మహారాజశ్రీ శ్రీకృష్ణదేవరాయలవారికి భక్తితో వ్రాయునది, మా దేశంలో తప్ప ఇంకెక్కడా కాయని అపురూపమైన అద్భుత ఫలాలను మీకు బహుకరిస్తున్నాను. వీటిని తిన్న వారు దీర్ఘాయుష్కులవుతారు. వారికి వృద్ధాప్య మరణమే తప్ప అకాల మరణం ఉండదు' అని ఆ లేఖ సారాంశం.

శ్రీకృష్ణదేవరాయల ముఖం ఆనందంతో పొంగిపోయింది. సభలోని వారంతా ఎంతో అపురూపంగా ఆ ఫలాలను తాకి చూడసాగారు. తెనాలిరామకృష్ణుడి వంతు రాగానే కుతూహలం ఆపుకోలేక ఒక పండును తీసుకొని కొంచెం కొరికి రుచి చూశాడు. రామకృష్ణుడి చర్యకు అంతా ఆశ్చర్యకితులయ్యారు. దేవరాయల ముఖం కోపంతో జేవురించింది. "నా కోసం పంపిన ఫలాల్ని నువ్వు ఎంగిలి చేస్తావా? ఎంత ధైర్యం నీకు? అందరి ముందు నన్ను అవమానించినందుకు నీకు మరణశిక్ష వేస్తున్నాను." అని రాయలవారు కోపం పట్టలేక రామకృష్ణుడిని ఉరి తీయమని సైనికులను అదేశించాడు.

"అయ్యో పొరుగురాజు ఎంత మోసం చేశాడు?! అనవసరంగా ఆయన మాటలు నమ్మాను కదా! ఆ ఫలాలను తిన్న వారికి దీర్ఘయుష్షు ఉంటుందని చెప్పాడు. ఒక చిన్న ముక్కతిన్నందుకే నేను చనిపోబోతున్నాను. మరి పూర్తి ఫలం తిన్నవారి పరిస్ధితి ఏమవుతుందో?" అంటూ అందరూ వినేలా బాధపడ్డాడు రామకృష్ణుడు.

ఆ మాటలు విని అందరి ముఖంలో నిజమే కదూ! అన్న భావం తొంగిచూసింది. రాయల వారిలో కూడా ఆ అభిప్రాయమే కలిగింది. విపత్తు సమయంలో కూడా ఎంతో సమయస్పూర్తిగా ఆలోచించగల రామకృష్ణుడి విజ్ఞతకు ఆయన సంతోషించారు. రామకృష్ణుడిని క్షమించడమేకాక బహుమతిగా కొన్ని ఫలాలను ఇంటికి తీసుకువెళ్ళమని నవ్వుతూ ఇచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు.

అక్కరకురాని బహుమానం

అడవికి రాజైన సింహం దగ్గర ఒక ఉడుత సేవకుడిలా ఉండేది. ఏ పని చెప్పినా చీకటిలో చేసేసి రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకుంది. ఉడుత పనికి మెచ్చుకుని, సింహం ఒక మంచి బహుమానం ఇస్తానని ప్రకటించింది. "ఏమిటా బహుమానం, మహారాజా?" అని ఆత్రుతగా అడిగింది ఉడుత. "నువ్వు పదవీ విరమణ చేసే సమయానికి నీకు ఓ బండెడు బాదం గింజలు ఇప్పిస్తాను. అదే బహుమానం" అంది సింహం.

బహుమానం తెలుసుకుని ఉడుత మహా సంబరపడిపోయింది. అందరూ ఆహారం కోసం కష్టపడుతున్న సమయంలో తను సుఖంగా ఇంట్లో కూర్చుని హాయిగా జీవితాంతం తింటూ గడపవచ్చని ఆనందించింది. తనంత అదృష్టం ఇంకెవరికి రాదని, మిగతా ఉడుతలు జీవితాంతం కష్టపడినా అన్ని బాదం పప్పులు కూడబెట్టలేవని అది చాలా సంతోషించింది. రోజూ, తనకు పట్టిన అదృష్టాన్నే తలచుకుంటూ కాలం గడిపేది. అలా అలా కాలం గడిచి, ఉడుత ముసలిది అయింది. ఇక పదవీ విరమణ చేసే సమయం వచ్చింది.

పదవీ విరమణ చేసే రోజున సింహం తనమాట ప్రకారం ఒక బండెడు బాదం గింజలను ఉడుతకు ఇచ్చింది. ఆనందంగా బండినిండా ఆహారాన్ని పెట్టుకుని ఇంటికెళ్ళిన ఉడతకు మిగతా ఉడుతలన్నీ స్వాగతం పలికాయి.

స్నానపాదులన్నీ పూర్తి చేసి, ఇక బాదం పప్పులు తిందాం అనే సమయానికి తనకు ముసలితనం వల్ల పళ్ళన్నీ ఊడిపోయాయన్న విషయం గుర్తుకొచ్చింది. బాదం గింజలపై ఎంతోకాలంగా ఆశ పెంచుకున్న అవి ఇప్పుడు నిరుపయోగంగా ఎదురుగా ఉన్నాయని చాలా బాధపడింది..

అమూల్యమైన బహుమతి

ఒక ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం 200 మంది వరకు ఉన్నారు. ఆయన అందరిని ఇలా అడిగాడు - "ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి?" అంతే చేతులు ఒక్కటొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులెత్తారు.

"నేను మీలో ఒకరికి ఈ వెయ్యి రూపాయల నోటు ఇస్తాను. కాని దానికి ముందు నేనొకటి చేస్తాను" అంటూ ఆ నోటును చేతితో నలపటం మొదలెట్టాడు. రెండు నిమిషాల తరువాత మళ్ళీ అడిగాడు. ఇప్పుడు ఈ నోటు ఎవరిక్కావాలి?". అయినా చేతులు లేపడం ఆగలేదు.

"సరే!" అంటూ ఆయన తన చేతిలోని ముడతలు పడి నలిగిన వెయ్యిరూపాయల నోటును కింద పడేసి బూటు కాలితో నలపడం మొదలెట్టాడు. కొద్ది సేపటి తరువాత దాన్ని చేతిలోకి తీసుకుని "ఇప్పటికీ ఇది ఎవరిక్కావాలి?" అని అడిగాడు. నలిగిపోయి, మాసిపోయినా ఆ నోటు కోసం చేతులు లేపడం ఆపలేదు సభికులు.

"ప్రియ మిత్రులారా? మనం ఇప్పటి వరకు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాం. డబ్బుకు ఎంత చిరుగులు పడినా, నలుగులు పడినా, దాన్ని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అది దాని విలువను ఎంత మాత్రం కోల్పోలేదు కాబట్టి ఈ నోటు ఇప్పటికీ వెయ్యిరూపాయల నోటే. ఈ నోటులాగే మన జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ఎందుకూ పనికిరాని వారమని,

మన బ్రతుకులు వ్యర్ధమని అనుకుంటాం.కాని ఏం జరిగినా, ఏం జరగబోతున్నా మన విలువను మాత్రం కోల్పోం. మనల్ని ప్రేమించే వారికి మనం ఎల్లప్పుడూ అమూల్యమైన బహుమతులమే" అని వివరించాడు ఉపన్యాసకుడు.

మరుక్షణం ఆ హాలు చప్పట్లతో మారుమోగి పోయింది.

అమూల్యమైన బహుమతి

ఒక ప్రముఖ వ్యక్తితో వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం 200 మంది వరకు ఉన్నారు. ఆయన అందరినీ ఇలా అడిగాడు... "ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి?" అంతే చేతులు ఒక్కటొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులెత్తారు.

"నేను మీలో ఒకరికి ఈ వెయ్యిరూపాయల నోటు ఇస్తాను. కాని దానికి ముందు నేనొకటి చేస్తాను" అంటు ఆ నోటును చేతితో నలపటం మొదలెట్టడు. రెండు నిమిషాల తర్వాత మళ్ళీ అడిగాడు. "ఇప్పుడు ఈ నోటు ఎవరిక్కావాలి?" అయినా చేతులు లేవడం ఆగలేదు.

"సరే!" అంటు ఆయన తన చేతిలోని ముడతలు పడి నలిగిన వెయ్యిరుపాయల నోటును కింద పడేసి బూటు కాలితో నలపడం మొదలెట్టాడు. కొద్ది సేపటి తర్వాత దాన్ని చేతిలోకి తీసుకుని "ఇప్పటికీ ఇది ఎవరిక్కావాలి?" అని అడిగాడు. నలిగిపోయి, మారిపోయినా ఆ నోటు కోసం చేతులు లేవడం ఆపలేదు సభికులు.

"ప్రియ మిత్రులారా? మనం ఇప్పటి వరకు ఒక విలువైన పాఠం నేర్చుకున్నాం. డబ్బుకు ఎంత చిరుగులు పడినా, నలుగులు పడినా దాన్ని అందరు కోరుకుంటారు. ఎందుకంటే అది దాని విలువను ఎంత మాత్రం కోల్పోలేదు కాబట్టి ఈ నోటు ఇప్పటికీ వెయ్యిరూపాయల నోటే. ఈ నోటులాగే మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మనం ఎందుకు పనికిరాని వారమని, మన బ్రతుకులు వ్యర్ధమని అనుకుంటాం. కాని ఏం జరిగినా, ఏం జరగబోతున్నా మన విలువను మాత్రం కోల్పోం. మనల్ని ప్రేమించే వారికి మనం ఎల్లప్పుడూ అమూల్యమైన బహుమతులమే" అని వివరించాడు ఉపన్యాసకుడు.

మరుక్షణం ఆ హాలు చప్పట్లతో మారుమోగిపోయింది.

అనుభవించని ఐశ్వర్యం

కనకయ్య వొట్టి లోభి, ఎంతో ఐశ్వర్యం వుంది. అయినా తను తినేవాడు గాదు, ఒకరికి పెట్టేవాడు కాదు. కనకయ్య పీనాసి అని అందరికీ తెలుసు. అయినా ఊరిలోని వారు - ఏ కొంచెమైనా సహాయం చేయక పోతాడా? అని తరచుగా అతని వద్దకు వచ్చేవారు. సహాయం చేయమని కోరేవారు. కాని కనకయ్య వాళ్ళకు, ఏవేవో సాకులు చెప్పి పంపించేసే వాడు. గడ్డి పరక అంత సాయం కూడా చేసేవాడు గాదు.

"సహాయం చెయ్యి" అంటూ ఊరిలో వాళ్ళ పోరు, రోజురోజుకూ అధికం కావడం వల్ల - కనకయ్యకు చికాకు ఎక్కువైపోయింది. వాళ్ళ పోరు వదల్చు కోవాలని అనుకొన్నాడు. పొలాలు, నగలు మొదలైనవన్నీ అమ్మేసి, బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో వున్న ఓ చిట్టడవిలో - ఎవరికీ కనపడని చోట - ఆ బంగారాన్ని భద్రంగా దాచి పెట్టాడు! రోజూ ఉదయమే లేచి తన బంగారం పాత్రను చూసుకోవడం కోసం అడవికి వెళ్ళి వస్తూండేవాడు - ఇలాగ కొన్నాళ్ళు దొర్లి పోయాయి.

కనకయ్య రోజూ అడవికి వెళ్ళి వస్తూ ఉండటం ఓ దొంగ కనిపెట్టాడు. రహస్యంగా ఆను పానులన్నీ గమనించాడు. ఓ నాడు సాయంత్రం అడవికి వచ్చి, పాత్రలోని బంగారాన్ని తవ్వుకొని పట్టుకొని పోయాడు. మరునాడు, ఉదయం, మాములుగా కనకయ్య అడవికి వచ్చి చూసుకొంటే - తాను పాతి పెట్టిన చోట బంగారం లేదు. కాళీ గొయ్యి కనపడింది. కనకయ్య గుండె బద్దలయినంత పని అయింది. బంగారాన్నంతా ఎవరో ఎత్తుకు పోయారని దుఃఖం పొంగి పొరలింది. లబలబా నెత్తీ నోరూ బాదుకొంటూ ఊరి బైటకు వచ్చి ఓ చెట్టు మొదట్లో కూర్చన్నాడు ఏడుస్తూ..

ఆ దారినే వెళుతున్న ఆ ఊరి ఆసామి ఒకడు - కనకయ్యను చాశాడు. "ఎందుకు ఏడుస్తున్నావు" అని అడిగి కారణం తెలిసికొని, అన్నాడు.

"ఎందుకు ఏడుస్తున్నావు? ఆ బంగారం నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడూ అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవడం ఎందుకు! ఆ బంగారం నీ దగ్గరవున్నా, లేకపోయినా ఒకటే! అనుభవించలేని ఐశ్వర్యం ఎందుకు? పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడు కొనడానికి అనేక అవస్ధలు పడ్డావు - ఇప్పుడు అది పోయింది కనుక నీ బాధ విరుగుడయింది. ఇక హాయిగా నిద్రపో..."

కనకయ్య ఏడుపు మాని 'నిజమే సుమీ' అనుకొంటూ ఇంటికి పోయాడు - కళ్ళు తుడుచుకొంటూ...

అపాయానికి ఉపాయము

అపాయానికి ఉపాయము ఎంత ముఖ్యమో, ఉపాయానికి అపాయము లేకుండా జాగ్రత్త పడటం అంతే ముఖ్యము.

ఉపాయములో ఎలాంటి అపాయమున్నా తప్పించుకోవచ్చు. తెలివి, ఆలోచన సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు త్రాగించవచ్చు. అలా సింహాన్ని చంపిన చిన్న కుందేలు కథ.

అరణ్యంలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి. అన్నింటికి రాజు సింహం. అది చాల పౌరుషము కలది. తన పంతం చెల్లాలనే పట్టుదల కలది. పై పెచ్చు క్రూర స్వభావమున్నది. అందుచేత అది ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. అది ఇష్టము వచ్చినట్లు వేటాడి జంతువుల్ని చంపి తినేది. జంతువుల శవాల్ని పోగులు పెట్టేది. ఆ సింహం వేటకు బయలుదేరితే జంతువులన్నీ ప్రాణరక్షణ కోసం పరుగు తీసేవి. సింహం ఇష్టం వచ్చినట్లు చంపటం వల్ల అన్నీ కలిసి ఆలోచించి రోజుకు ఒకరు చొప్పున ఆహారంగా వెళ్ళాలని తీర్మానించుకుని, సింహానికి తెలియజేయగా సింహం అంగీకరించింది.

కష్టపడకుండా నోటి దగ్గరికి ఆహారము రావటంవలన దానికి బాగానే ఉంది. జంతువులు తమ వంతు ప్రకారము ఆహారముగా వెళుతున్నాయి. చిన్న కుందేలు వంతు వచ్చింది. మూడు సంవత్సరాలు నిండిన తనకి అప్పుడే ఆయుర్దాయము చెల్లిపోయిందని బాధపడింది. అయితే కుందేలు మిగతా జంతువుల వలె గాక తెలివిగలది, ఆలోచించగలిగింది. ఉపాయముతో అపాయము తప్పించుకోవాలని ఆలోచించసాగింది. దానికి ఉపాయము తోచింది. వెంటనే ఆచరణలో పెట్టింది. సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం వేళ దాటి పోతున్నందున కుందేలు పై మండిపడి 'ఇంత ఆలస్యము ఎందుకు జరిగింది?' అని భయంకరంగా గర్జించింది. అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో నమస్కరించి ఇలా అంది.

"మహారాజా! నేను మామూలు వేళకు బయలు దేరాను దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తానే ఈ అడవికి మహారాజు, మరొకడు రాజు కాడు అని నన్ను తనకు ఆహారము కమ్మన్నది. నేను అతి కష్టము మీద ఒప్పించి మీ దర్శనము చేసుకుని తిరిగి వస్తానని చెప్పి వచ్చాను.

"ప్రభూ! ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో దూషించింది. మీకు పౌరుషం లేదన్నది గాజులు వేసుకోమని" చెప్పింది. మిమ్మల్ని వెక్కిరించింది. ఈ మాటలు చెప్పి కుందేలు సింహం వైపు చూసింది అప్పటికే సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోపంగా "నేనే ఈ అడవికి రాజుని" ఎక్కడో చూపించు దానిని నా పంజాతో కొట్టి చంపేస్తా" నంటూ ఆవేశముగా కుందేలు వెంట నడిచింది. కుందేలుని తొందర చేసి బయలుదేరిన వారిరువురు పాడు బడిన బావి దగ్గరకు వచ్చారు. శత్రుసింహానికై వెదక సాగింది. ఇక ఆలస్యం చేయక కుందేలు ఇలా చెప్పింది. "మహారాజా! మిమ్మల్ని వెక్కిరించి, దూషించిన సింహం ఆనూతిలో ఉంది. వెళ్ళి చంపండి". అంది.

కుందేలు మాటలకి సింహం గర్జించి నూతి గట్టుపైకి దూకి లోపలి చూసింది ఈ సింహం గర్జించగానే ఆ సింహం గర్జించింది. ఈ సింహం పంజా పై కెత్తగానే ఆ సింహం పంజా పైకెత్తింది ఈ సింహం ఏంచేస్తే అది అలా చేయసాగింది. సింహానికి కోపం ఎక్కువై నూతి గట్టు మీద నుండి నూతిలోకి దూకింది అంతే నీటిలో మునిగి చచ్చిపోయింది. ఆ నూతి నీటిలో తన నీడ పడి మరో సింహంలా కనిపించిందని కోపముతో ఉన్న అడవి రాజు పసికట్ట లేక పోయింది. కుందేలు పన్నిన ఉపాయం వలలో చిక్కుకుని సింహం చచ్చిపోయింది. అపాయానికి ఉపాయము ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది చిన్న కుందేలు.

చెడుస్నేహం

ఒకసారి నీటిలో సరిగా ఈదలేని తేలు నదిని దాటాలన్న తన ముచ్చటను తీర్చుకోవాలనుకుని ఒక తాబేలు దగ్గరకు వచ్చి "నేను నీ వీపు మీద ఎక్కుతాను. నన్ను నది దాటిస్తావా?" అని అడిగింది. బదులుగా తాబేలు, "నేను నది మధ్యలో ఉన్నప్పుడు నువ్వు నీ కొండితో కుట్టావంటే నేను మునిగిపోతాను కదా!" తన సందేహం వెలిబుచ్చింది.

దర్జాగా తాబేలు వీపుపైకెక్కిన తేలు, నది మధ్యభాగంలో ఉండగా తాబేలును తన పదునైనకొండితో కరవడంతో నొప్పికి విలవిల్లాడిన తాబేలు నది మట్టానికి చేరుకుంది. దానితోపాటే తేలు కుడా నది మట్టానికి చేరువైంది.

ఆ సమయంలో తాబేలు... తేలును "నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు నన్ను కుట్టవని చెప్పావు కదా! మరి ఎందుకు కుట్టావు?" అని అడిగింది. "నేను ఎవరినైనా కుట్టే సమయంలో నేనేం చేస్తానో నాకే తెలియకుండా జరిగిపోతుంది. అది నా స్వాభావిక లక్షణం. దానికి నేనేమీ చేయలేను." చెప్పింది తేలు మునిగిపోతూ.

చేతకాని పని హాని

అది ఒక పెద్ద చెరువు. కొంతమంది పల్లె కారులు, చెరువులో వలలు విసురుతూ చేపలు పట్టు కొంటున్నారు. మధ్యాహ్నం దాకా చేపలు పట్టి, భోజనం వేళ అయినందున, వలలను గట్టు మీద ఆర బెట్టి ఇళ్ళకు వెళ్ళిపోయారు.

ఆ చెరువు గట్టు మీద ఓ చెట్టు వుంది. కొమ్మల్లో కూర్చుని వున్న కోతి పల్లె కారులు వలలు విసరడం చూసింది. పల్లెకారులు వలలను విసురుతూ వుంటే, చక్రాల్లా విచ్చుకొని ఆ వలలు నీళ్ళ మీద పడుతూ వుండడం కోతికి ఎంతో ముచ్చట కలిగింది. తాను కూడా అలా వలలను విసరాలని సరదా పుట్టింది. చెట్టు దిగి, అందులో ఒక వలను తీసి చెరువులోకి విసిరితే అది తన కాళ్ళకే చుట్టుకుంది. వలను విసరడం చేతకాక కాళ్ళకు చుట్టుకొన్న వలను తీసుకోవడానికి ప్రయత్నిచడంవలన, ఆ కోతి ఎంతో జంజాటన పడిపోయింది. ఆ జంజాటనతో వల అంతా దాని ఒంటి నిండా చుట్టుకొని పోయింది. కాళ్ళు చేతులు కట్టివేసినట్లు అయిపోయి కేరు కేరుమని అరుస్తూ గిలగిల కొట్టుకోసాగింది. ఇంతలో పల్లె కారులు అక్కడకి వచ్చారు. కోతి అవస్థ చూసి, జాలి కలిగి మెల్లిగా వలను వూడదీశారు.

అంతసేపు పడిన జంజాటనతో కోతి అలిసి పోయి, ఆ పక్కనే వాలిపోయింది! పల్లెకారులు కోతిని చూసి ఇలా అనుకున్నారు "ఏ పని అయినా తెలియకుండా చేయకూడదు, పని నేర్చుకోకుండా చేయడానికి పూనుకోకూడదు" పిచ్చికోతి మనషులు చేసినట్లు చేయబోయి, వలలో చిక్కుకుంది. ఇలాంటి వాటినే 'కోతిచేష్టలు' అంటారు, అని మెల్లిగా కోతిని లేవదీసి చెట్టు దగ్గరకు చేర్చారు.

చీమ - రాజు

మహేంద్రపుర రాజ్యాన్ని విజయసింహుడు పరిపాలించేవాడు. అతను ప్రజలను తన బిడ్డల్లా చూసుకుంటూ ప్రజారంజకంగా పాలించేవాడు. విజయ సింహుని తరువాత అతని కుమారుడు విక్రమసింహుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. విక్రసింహుడు కూడా తండ్రి లాగా పరిపాలించాలనుకున్నాడు. కాని మంత్రి, తక్కిన అధికారులు అతనికి సహకరించేవారు కాదు.

ఒకరోజు రాత్రి నా తండ్రి ఎంత ప్రజారంజకంగా పరిపాలించాడు. నేను అలా పరిపాలిద్దాం అనుకుంటే మంత్రి, అధికారులు సహకరించడం లేదే?? ప్రజలకు నా మీద నమ్మకం పోతుందేమో. నేను ఈ బాధ్యత మోయలేనేమో, ఎక్కడికైనా దూరంగా పారిపవాలి!" అని మనసులో అనుకుంటూ మంచం మీద నుంచి లేచాడు. రాజభవనం ద్వారం దాటి బయటకు వచ్చాడు. "ఎంత దూరం పారిపోగలను? నేను ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను గుర్తుపడతారు," అని మళ్లీ తన మనసులో అనుకుని, తిరిగి మందిరానికి వచ్చాడు. అలా కొంచెం సేపు ఆలోచించి, చివరికి రాజభవనం మీద నుండి దూకి చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ప్రజలను బాగా పరిపాలించలేకపోతున్నాననే బాధ అతను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.

విక్రమసింహుడు రాజభవనం మీదకి చేరుకున్నాడు. ఏదో ఆలోచిస్తూ భవనం గోడ దగ్గర నిలబడ్డాడు. అక్కడ అతనికి ఒక చీమ తన నోటితో ఒక చక్కెర పలుకును కరుచుకొని గోడ వారగా వెళ్లడం కనిపించింది. ఆ చీమ అలా వెళుతూ గోడ పగుళ్లలో ఉన్న తన నివాసంలోకి వెళ్లిపోయింది. అది చూసిన విక్రమసింహుడు, ఔరా! ఈ చీమను చూడు. ఈ రాజభవనంలో ఎక్కడో మూలన ఉన్న వంట గది నుండి పంచదార పలుకుని కరుచుకొని, మూడు అంతస్తులు ఉన్న ఈ రాజ భవనం మీదకు చేరింది. ఒక చిన్న చీమనే ఇంత పైకి రాగలిగితే, దాని కన్నా ఎన్నో రెట్లు పెద్దగా, బలంగా ఉన్న నేను నా ప్రజల సంక్షేమం కోసం పాటుపడలేనా? అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతనిలో ఉన్న నిరాశ పటాపంచలయ్యింది.

చనిపోదాం అనుకున్న విక్రమసింహుడు తన మనస్సు మార్చుకుని, కొత్త ఉత్సాహంతో తన మందిరానికి చేరుకున్నాడు. అప్పటి నుండి మంత్రులను, అధికారులను తనకు సహకరించేలా చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు.

చీమ యుక్తి

అది ఒక పెద్ద చీమల బారు. పప్పు బద్దలను నోట కరుచుకొని, ఆ చీమలు వాటి కలుగులోకి పోతున్నాయి. చీమలు పట్టుకొని వస్తున్న ఆ పప్పులను చూడగానే ఓ తొండకు నోరు వూరింది. మెల్లిగా చీమల బారు పక్కగా చేరి చీమల నోట్లో వున్న పప్పు బద్దలను లాగుకొని తినడం మొదలు పెట్టింది. చీమలకు భయం వేసి, చెల్లా చెదురుగా తిరుగుతున్నాయి కంగారుగా! చీమల నాయకురాలు పెద్ద కండ చీమ, చీమల కంగారు చూసింది. గబగబా చీమల దగ్గరకు వచ్చి వాటికి సంజ్ఞ చేసి, దగ్గరలో వున్న ఓ కలుగు దగ్గరకు వెళ్ళి కూర్చుంది.

కండ చీమ సంజ్ఞ చిన్న చీమలకు ఎంతో ధైర్యం వచ్చింది. మళ్ళీ, పప్పు బద్దలను నోటకరచుకొని, తొండకు దొరకకుండా అవి కండ చీమ ఉన్న కలుగు దగ్గరకు చేరాయి, గుంపుగా!ఆ చీమల గుంపు దగ్గర బోలెడు పప్పులు ఒక్క సారిగా తినెయ్యవచ్చునని తొండ ఆ కలుగు దగ్గరకు చేరింది. చీమలను చెదరకొట్టడం మొదలు పెట్టింది.

కలుగు వెలుపల అలికిడి అవుతూ ఉండడం కలుగులో ఉన్న పాము గమనించింది. తొండను పట్టుకుంటే మంచి ఆహారం దొరుకుతుందని కలుగులోంచి అమాంతంగా తొండ మీదకు దూకి, తొండను నోట కరచుకొని కలుగులోకి దూరిపోయింది. ఇదంతా భయం భయంగా చూస్తూ వున్న చీమలకు ధైర్యం వచ్చి, కండ చీమ చుట్టూ చేరాయి. కండ చీమ యుక్తికి ఉబ్బి తబ్బిబ్బయ్యాయి!

'మన నోటి దగ్గర ఆహారాన్ని లాగుకొంటున్న తొండను దిగమింగింది పాము' అన్నట్లుగా గర్వంగా చూసింది కండచీమ! తన ఎత్తు ఫలించినందుకు

ఎంతో ఆనందించింది. అందుకే "ఉపాయం వుంటే అపాయం తప్పించు కోవచ్చును" అంటారు పెద్దలు.

దశరధ రాముడు

పదేళ్లుగా ఒంటరిగా ఉంటున్న రాజయ్యకు ఇప్పుడు ఒక తోడు దొరికింది. ఓ రోజున ఊరి శివారులో ఓ బుల్లి కుక్కపిల్ల తోక ఊపుకుంటూ అతడిని వెంబడించింది. అదిలిస్తే ఆగిపొతుంది. నడుస్తుంటే అతడిని వెంబడిస్తుంది. "నేను వెతుకుతున్నది నిన్నే" అన్నట్లుగా చూస్తున్నది. అదిలించడం మానేసి, మిన్నకుండిపోయాడు రాజయ్య. అతడిని వదిలిపోలేదు అది. చూపు మరల్చుకోకుండా గునగునమంటూ ఇంటి దాకా వచ్చేసింది. ఆ క్షణం నుండి ఆ ఇల్లే దానికి ఆవాసమైపోయింది. అతను, ఆ కుక్కపిల్లా - ఇద్దరే ఆ ఇంట్లో!

వయసు పైబడిన రాజయ్య ఓపిగ్గా తన పనులు తానే చేసుకుంటాడు. నెల నెలా వెళ్లి పింఛను తీసుకుంటాడు. అవసరమైనప్పుడు బజారుకు వెళ్లి వస్తాడు. చారెడు బియ్యం ఉడుకేసుకుంటే రోజు గడిచిపోతుంది. పట్టెడన్నం తాను తిని, మిగిలింది కుక్కకు పెడతాడు. రాజయ్య కన్ను అయితే, తాను కంటిరెప్ప అన్నట్లుగా సందడి చేస్తుంటుంది కుక్కపిల్ల. అతను ఎక్కడుంటే, అదీ అక్కడే!

ఇంటికి వచ్చిన రోజునే దానికి "ఒరే దశరధ రాముడూ" అని పేరు పెట్టుకున్నాడు రాజయ్య. "ఒరే దశరధ రాముడూ!" అని రోజుకి ఎన్నిసార్లు పిలుచుకుంటాడో! దాని ఒళ్లు నిమురుతూ ఎన్ని మురిపాలు పోతాడో! కాలం గడుస్తున్నది. కుక్కపిల్ల పెద్దదైంది. రాజయ్యకు అదే తోడూ నీడా అయింది. అతను క్రమంగా కృశించి పోతున్నాడు. దశరధ రాముడి కళ్ళలో దిగులు గూడు కట్టుకుంటున్నది. పగలు రాత్రి అది అతడి కాళ్ల వద్దే పడి ఉంటోంది.

ఆఖరికి రాజయ్య కన్నుమూశాడు. కుక్కకు కన్నీళ్లు ఆగలేదు. దూరాభారం కదా, మర్నాటికి గానీ రాలేకపోయాడు కొడుకు 'దశరధ రామయ్య.' పన్నేండేళ్ల తరువాత మళ్లీ ఇదే రావడం! అతనితో బాటే అతని భార్య, పిల్లలు!

తల కొరివి పెట్టి తిరుగు ప్రయాణం కట్టాడు కొడుకు. కుక్క వీధిన పడింది. అది వీలు చూసుకుని రోజుకొకసారైనా శ్మశానానికి వెళుతుంది. రాజయ్యను పాతిపెట్టిన మట్టిదిబ్బ మీద కాసేపు మౌనంగా కూచుని లేచి వస్తుంటుంది. ఆ వీధిలోని వాళ్లు ఇప్పటికీ దాన్ని "దశరధ రాముడూ" అనే పిలుస్తుంటారు.

దేశభక్తి

మన ప్రధమ స్వాతంత్రోద్యమ రోజులు. 1857 వ సంవత్సరంలో మహారాష్ట్రుల పీష్వా నానా సాహెబ్ స్వాతంత్ర్య సంగ్రామంలో నాయకత్వం వహించిన ఆయనను పట్టి ఇచ్చిన వారికి బ్రిటీషు ప్రభుత్వం అర్థలక్షరూపాయలు బహుమతి ప్రకటించింది. నానాసాహెబ్ ఎవరికీ అందకుండా రహస్యంగా తిరుగుతుండేవారు. ఓ రోజు ఆయనకు ఆకలిగా ఉంది. ఆయనకు తెలిసిన దేశభక్తురాలి ఇంటికి వెళ్ళాడు. నానాసాహెబ్‌కు ఆమె భోజనం పెట్టింది. నానాసాహెబ్ అంటే ఆమెకు చాలా గౌరవం. ఆ సమయంలో తలుపు చప్పుడయింది. ఆమె లేచి వచ్చి తలుపులు తీసింది. ఎదురుగా ఆమె భర్త. ఆమె భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్. భయంతో దిక్కులు చూస్తున్న భార్యతో మనింటివైపు నానాసాహెబ్ వచ్చినట్లు సూచన అందింది. నానాసాహెబ్ ఎక్కడున్నాడో నీకు తెలుసా? అరెస్టు చేసి ప్రభుత్వానికి అప్పజెబితే యాభైవేలు మన స్వంతమవుతాయి. అంటూ ఇంటిలోనికి నడవబోయాడు ఇన్‌స్పెక్టర్. ఆమె భయంతో వణికిపోతూ కోపంగా భర్త వైపు చూసి మీరు నానాసాహెబ్ గారిని పట్టిస్తారా? దేశం కోసం పోరాడుతున్న ఆయనను పట్టిస్తే మీకు పాపం చుట్టుకుంటుంది. ఇదే దేశ ద్రోహం ఆ పాపపు డబ్బు మనకొద్దు అంది ఆ దేశభక్తురాలు.

పిచ్చిదానా! యాభైవేలరూపాయలు ఊరకే వస్తూంటే వదులుకోవటం మూర్ఖత్వం. నానాసాహెబ్‌ను అరెస్ట్ చేసి ఆ బహుమతి డబ్బు సంపాదిస్తా అన్నాడు. భార్యా, భర్తల మధ్య వాగ్వివాదము మొదలైంది. వీరి మాటలు వింటున్న నానాసాహెబ్ తాను దాగివున్న గది నుండి బయటకి వచ్చాడు. నా కారణంగా మీ కుటుంబంలో కలతలు రావటం నాకిష్టంలేదు. చేతనైతే అరెస్ట్ చేయండి అన్నాడు. తనకందిన సూచన ప్రకారం నానాసాహెబ్ తన ఇంట్లోనే దాగి వుండటం చూసి ఆ ఇన్‌స్పెక్టర్ కు చాలా సంతోషం కలిగింది. వెంటనే పిస్తోలు గురిపెట్టి హేండ్సప్ అన్నాడు. ఆయన మహనీయుడు, దేశభక్తుడు, ఆయన్ని అరెస్ట్ చేస్తావా? అంటూ ఆమె భర్త మీదకు వచ్చింది.

ఆమెను దూరంగా త్రోయడంతో పిస్తోలు జారి క్రిందపడింది. వెంటనే ఆ వీరనారీమణి పిస్తోలుతో తన చాతిలో పేల్చుకుంది. మీకు యాభైవేల రూపాయల పాపపు సొమ్ము కావాలి. ఆ పాపపు సొమ్ములో నేను భాగం పంచుకోలేను. నీలాంటి దేశద్రోహితో జీవించలేను. అంటూ ఆమె ప్రాణం వదిలింది. అమ్మా! సోదరీ! ఏంటమ్మా ఇలా నీ ప్రాణాలు తీసుకున్నావు. అంటూ పరుగున వచ్చాడు నానాసాహెబ్. ఆమెరక్తంతో తిలకం దిద్దుకున్నాడు. నన్ను అరెస్టుచేసి, నీ వృత్తి ధర్మాన్ని నిర్వహించు ఇన్‌స్పెక్టర్ అన్నారు నానాసాహెబ్. నానాజీ! నేను ద్రోహిని. నన్ను క్షమించండి. నా కర్తవ్యం ఏమిటో నాకు బోధపడింది. నా జీవితాన్ని ఇప్పుడు దేశం కోసం ధారపోస్తాను. మీరు ఇక్కడి నుండి వెంటనే పారిపోండి. ఈ భారతభూమి మీ కోసం ఎదురుచూస్తోంది. అంటూ ఆయనను పంపించివేసాడు ఇన్‌స్పెక్టర్. ఇలా ఎందరో దేశభక్తుల త్యాగఫలమే నేటి మన స్వాతంత్ర్యం.

దేశ సేవ

శౌరికి చిన్నతనం నుంచి దేశసేవ చేయాలని కోరిక, వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశసేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు. 'స్వయంగా సంపాదించే మార్గం చూసుకో! నాతో పొలం పనులకు రా!' అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి.. అయితే శౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు. ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి! స్వార్థం మానుకోవాలి! అనేవాడు. కొందరు ఊరి పెద్దలు 'ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థంకావు'. రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో! అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది! అన్నారు.

శౌరి రాజధానికి వెళ్ళాడు. ఉద్యానవనంలో రాజు గారిని కలిశాడు. దేశసేవ చేయడానికి ఊరువదిలి వచ్చాను! అన్నాడు. తన గురించి అంతా చెప్పాడు. రాజు శౌరిని అభినందించాడు. కొన్నాళ్ళు నా అతిధిగా వుండు! అన్నాడు. మర్నాడు శౌరి సత్రం ఖాళీ చేశాడు. రాజుగారు వాడిని విడిదికి తీసుకువెళ్ళాడు. అది చాలా విశాలమైన భవంతి. ఇంటినిండా సేవకులు వాళ్ళు ముందుగదిని అలంకరిస్తున్నారు. 'ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో!' నేను నాలుగు రోజులలో వస్తాను! అని వెళ్ళిపోయాడు రాజు. లోపలి గదిలోకి అడుగుపెట్టి, నిర్ఘాంతపోయాడు శౌరి, లోపల ఇరవై గదులు వున్నాయి. అన్నీ బూజు పట్టి ఉన్నాయి. పైగా గబ్బిలాల కంపు! పరదాలు చిరిగి తలుపులు విరిగి, గచ్చులు పగిలి వుంది! పెరడంతా పిచ్చిమొక్కలు! శౌరి పనివాళ్లతో 'లోపలి గదులు శుభ్రం చేయండి!' అన్నాడు. నాలుగు రోజులలో మొత్తం భవంతి శుభ్రపడింది. కొత్తపరదాలు కిటికీలు అమిరాయి పెరడు శుభ్రపడింది. పూల మొక్కలు, పళ్ళ మొక్కలు నాటబడ్డాయి. ఆరోజు రాజుగారు శౌరి ని చూడవచ్చారు. ఆయన భవంతిని చూసి, 'అద్భుతంగా వుంది! భవంతి స్వరూపమే మారిపోయింది!' అంటూ శౌరిని మెచ్చుకున్నాడు. 'వీళ్ళు ఇరవై గదులను పాడుపెట్టారు ముందుగదినే అలంకరిస్తూ కూర్చున్నారు ముందుగది ఎంత అందగా వున్నా ఏం లాభం! ఇల్లంతా భూతాలకొంపలా ఉన్నప్పుడు' అన్నాడు శౌరి.

నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను, దేశం అంటే రాజధాని నగరం మాత్రం కాదు! ముందుగదిని అలంకరించినట్లుగా రాజధానినే అభివృద్దిపరచుకుని ప్రయోజనం లేదు. నువ్వు అన్ని గదులు బాగుపరిచావు. అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి! అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు. శౌరి శ్రద్దగా ఆయన మాటలు వింటున్నాడు. రాజుగారు మళ్ళీ నోరు విప్పారు. ప్రతివాళ్ళు తమ ఇంటిని, ఊరుని బాగు చేసుకోవాలి! అదే నిజమైన దేశసేవ! అందుకు రాజధానికి రావలసిన పనిలేదు! అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోకి తీసుకురండి. చదువురాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి. పూడికలు తీయండి! రహదారులు బాగు చేయండి! రోడ్లు వెంట చెట్లు నాటండి. శ్రమ దానానికి మించిన దేశసేవ లేదు. దేశసేవ పేరుకోసం కాదు. దేశం కోసం చేయాలి! అన్నారు. శౌరి కళ్ళముందు తెరలు తొలగి పోయాయి. ఈ రోజే మా ఊరికి వెళతాను ఉపన్యాసాలు మాని నడుంకట్టి పని చేస్తాను. అప్పుడు మానాన్న సంతోషిస్తాడు. మా ఊరు, వాడా బాగుపడుతుంది. అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు శౌరి.

ధర్మబుద్ధి

పూర్వము రంగాపురం అనే గ్రామములో ధర్మయ్య అనే ఆసామి కలడు. ఆయన భార్య సుమలత. వారిద్దరూ ధర్మబుద్ధిగలవారు. పాపభీతి, దైవభక్తిగలవారు. వారు వ్యాపారము లో బాగా సంపాయించటమేగాక దాన ధర్మాలు చేయటంలో కూడా కీర్తి ప్రతిష్ఠలు గడించారు. పేదలకు భోజనము పెట్టందే తినేవారుకాదు. ధర్మయ్య, సుమలత దంపతులకు ముగ్గురు కుమారులు కలిగి యుక్తవయసుకి వచ్చారు. విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. పెద్దవాడికి వివాహము చేశారు. పెద్ద కోడలు రాగానే దానధర్మాలు తగ్గించకపోతే మాకు ఏమి మిగులుతుందని రోజుకు ముగ్గురికంటే ఎక్కువమందికి పెట్టటానికి వీల్లేదంది. సరేనన్నారు ధర్మయ్య, సుమలత.

రెండో కోడలు రాగానే ఇద్దరికంటే ఎక్కువమందికి పెట్టటానికి వీల్లేదంది. మూడో కోడలు రాగానే దానధర్మాలు పూర్తిగా మానాలని చెప్పింది. ఈ విధంగా జరిగినందు వలన ధర్మయ్య సుమలత దంపతులకు విచారము కలిగింది. వారి కీర్తి ప్రతిష్ఠలకి భంగము కలిగినందువల్ల అక్కడ వుండలేక తీర్ధయాత్రలకని చెప్పి కొంతపైకము తీసుకుని వెళ్ళారు.

తీర్ధయాత్రలు చేస్తూ వెళుతున్నవారికి గోదావరి నదీ తీర ప్రదేశములో పాడుబడిన ఆలయము కనిపించింది. అక్కడే ఆశ్రమం నిర్మించుకుని తనకు తెలిసిన ఆకు పసర్లతో పేద ప్రజలకు వైద్యం చేయసాగారు. ఆయన హస్తివాసివల్ల దూర ప్రాంతమునుండి రావడం ప్రారంభించారు. ఆయన ఎవర్నిఏమీ అడగనప్పటికీ డబ్బు విపరీతముగా వచ్చింది. ఆ ధనముతో కూలీలను పెట్టి ఆలయము నిర్మించాలనే ఆలోచన కలిగింది. వచ్చిన వారందరకీ సుమలత భోజనము పెట్టి పంపేది. వారికి ఏలోటు లేకుండా జరిగిపోతోంది.

కొంత కాలము గడిచేసరికి ధర్మయ్య కొడుకులు ఆస్తి పోగొట్టుకుని వీధుల పాలయ్యారు. దేశాటనకి బయలుదేరగా గోదావరి నదీతీర ప్రాంతములో ఆలయము నిర్మిస్తున్నారని విని అక్కడికి వెళ్ళారు. దూరము నుంచే సుమలత కొడుకుల్ని, కోడళ్ళల్ని గుర్తించింది. వారిని రమ్మని పిలిచింది. పెద్దకోడలిని పిలిచి రోజుకు ముగ్గురికంటే పెట్టరమ్మా, అని రెండవకోడలితో ఇద్దరికంటే పెట్టరమ్మానీ, మూడో కోడలితో ఎవరికీ పెట్టరమ్మా అనగానే ముగ్గురు కోడళ్ళు నిశ్చేష్టులయ్యారు. అత్తగారుగా గుర్తించి క్షమించమని ప్రార్ధించారు.

సుమలత వారినందరినీ దగ్గరకు తీసుకుని వారికి పట్టిన దుర్ధశకి విచారించింది. ధర్మయ్య తన కొడుకుల్ని దగ్గరకు పిలిచి, తన దగ్గరే వుంచుకున్నాడు. వారు కూడా కష్టపడి పని చేస్తూ, దాన ధర్మములు చేస్తూ సంతోషముగా జీవించారు.

దొంగలో మార్పు

రాంబాబు అయిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచి ఇతరుల వస్తువులు దొంగతనం చేయడం అలవాటు. స్కూలులో తన తోటి పిల్లలకి చెందిన పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు, కూడా ఎవరికీ తెలియకుండా తీసుకువస్తుంటాడు. స్కూల్లో ఇంటర్‌వెల్ ఇచ్చిన సమయంలో పిల్లలందరూ బైటికి వెళ్ళిపోతే వారి స్కూలు బ్యాగులను పరిశీలన చేస్తుంటాడు. ఒకసారి ధీరజ్ అనే కుర్రవాడు రంగురంగుల బొమ్మల పుస్తకం తెస్తే దానిని మాయం చేసాడు. వాడు ఏడుస్తూ రెండురోజులు బడికి కూడా రాలేదు. స్కూల్లో అమ్మే నోటుపుస్తకాలు కొనుక్కోవడానికి కృష్ణప్రసాద్ అనే కుర్రవాడు నోటుపుస్తకంలో అయిదు, పది రూపాయల నోట్లు పెట్టుకుని బడికి తీసుకువస్తే ఎవరికీ తెలియకుండా వాటిని తస్కరించాడు.

దొంగతనాలు చేయడం రాంబాబుకి ఎంతో సరదాగా ఉండేది. వస్తువులు పోయినవారు ఏడుస్తున్నా, బాధపడుతున్నా సంతోషించేవాడు. ఇతరుల వస్తువులు దొంగతనంగా తీసుకు వస్తున్నానని తల్లిదండ్రులకు కూడా తెలియనిచ్చేవాడుకాదు. ఆ అలవాటు ఎందుకు వచ్చిందో తెలియదు గానీ దొంగతనం చేయడంలో సరదా ఉండేది. ఇతరుల వసువులు మాయం చేస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడు. శనివారం సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మురళీ అనే కుర్రవాడు ఖరీదైన అందమైన చెప్పులు తొడుక్కొని వచ్చాడు. క్లాస్ రూం బయట విప్పి అందరూ లోపల కూర్చుంటారు. టీచర్‌ని పాస్‌కి వెళతానని బయటికి వచ్చి ఆ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళి దూరంగా తుప్పల్లో పడవేసి ఏమీ ఎరగనట్టు మళ్ళీ క్లాస్‌రూం లోకి వచ్చేసాడు. ఆ తర్వాత ఆ చెప్పులు ఎలా పోయాయన్న విషయం ఎవరికీ తెలియలేదు. చెప్పులు పోగొట్టుకున్నందుకు మురళీని వాళ్ళ నాన్నగారు చితక్కొట్టారు.

రాంబాబు మామయ్య అమెరికాలో ఉంటున్నాడు. ఒకనాడు అమెరికా నుంచి వచ్చినప్పుడు రాంబాబుకి ఒక కారు బొమ్మను ప్రజెంట్ చేసాడు. నేలమీద పెట్టి ఆ కారుకి కీ ఇస్తే అది అటు ఇటూ తిరుగుతుంది. దానికి ఏ వస్తువైనా అడ్డువస్తే హారన్ కూడా కొడుతుంది. ఈ కారు బొమ్మ రాంబాబుకి ఎంతో నచ్చింది. ఇంటి పక్క పిల్లలకు, స్కూలు పిల్లలకు ఈ బొమ్మని చూపించి నడిపించి ఆనందించేవాడు. ఈ కారు బొమ్మ ఇండియాలో ఎక్కడా దొరకదని దేశం మొత్తం మీద తన దగ్గరే ఉందని మురిసిపోయేవాడు. ఒకనాడు ట్యూషన్‌కి కారు బొమ్మని తీసుకువెళ్ళి అక్కడ పిల్లలందరికీ చూపించాడు. వచ్చే సమయానికి ఆలస్యమైపోయి చీకటి పడిపోయింది. ప్లాస్టిక్ సంచిలో పెట్టుకొని పుస్తకాలతో పట్టుకొని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి సైకిల్ మీద బ్యాగుతో సహా కారుని గద్దలా తన్నుకుపోయాడు. రాంబాబు దొంగ దొంగ అంటూ అరచుకొని సైకిలు వెంట పరుగెట్టినా ఫలితం కనిపించలేదు. ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాడు. అన్నం కూడా తినాలనిపించలేదు. బెంగపెట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఎంత ఊరడించినా ఊరుకోవడం లేదు. రాంబాబు ఫ్రెండ్స్ సానుభూతి చూపిస్తూంటే మరీ ఏడుపు వస్తుంది.

ఒక రోజు బీరువా మీద పుస్తకాలు సర్దుతుండగా అట్టపెట్టె కింద పడి దొంగతనంగా తెచ్చిన పెన్నులు, పెన్సిళ్ళు ఇతర వస్తువులు కిందపడ్డాయి. వాటిని చూసిన రాంబాబు మనసు చలించిపోయింది. మన వస్తువులు ఇతరులు తస్కరిస్తే ఎంత బాధ కలుగుతుందో మొదటిసారి అర్థమైయింది. తాను చేసిన దొంగతనాల కారణంగా తన ఫ్రెండ్స్ ఎంతలా బాధపడ్డారో అప్పటి నుంచి ఇతరుల వస్తువుల మీద ఆశపడకుండా దొంగతనాల జోలికి పోకుండా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.

ప్రోత్సాహం

ఒక వ్యక్తి కారులో ప్రయాణిస్తూ కొండలు, గుట్టల మధ్య దారితప్పి పోయాడు. రహదారిపైకి రావాలని ప్రయాణించి ప్రమాదవశాత్తూ ఒక ఊబిగుంటలోకి చిక్కుకు పోయాడు. అతనికి దెబ్బలేమి తగలకపోయినా, అతని కారు లోతైన బురదలో కూరుకుపోయింది. ఆ వ్యక్తి సహాయం కోసం అర్ధిస్తూ పక్కనే ఉన్న పొలంలోని రైతు దగ్గరకు వెళ్లాడు.

"గంగ మీ కారుని ఈ ఊబిలో నుండి బయట పడేయగలడు." అని ఒక ముసలి గుర్రాన్ని చూపిస్తూ చెప్పాడు రైతు. ఆ వ్యక్తి ముసలి గుర్రం వైపు చూసి రైతుని చూస్తు, "ఈ ముసలి గంగ అంత పని చేయగలదా?" అని అడిగాడు. ప్రయత్నిస్తే పోయేది లేదు కదా అని అనుకున్న వ్యక్తి సరేనంటూ రైతు, ముసలి గుర్రంలతో పాటు ఊబిగుంట వైపు నడిచారు.

రైతు గుర్రాన్ని కారుకు తాడుతో కట్టి "రాధా, రాణీ! రాజా, గంగా! గుర్రం ఒకే ఉదుటున కారును ఊబిగుంటలో నుంచి పైకి లాగేసింది.

ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి రైతుకు కృతజ్ఞ్తలు చెప్పి, "నువ్వు గంగ అని పిలిచేముందు అన్ని పేర్లెందుకు పిలిచావు?" అని అడిగాడు.

రైతు చిరునవ్వుతో, "ముసలిదైన గంగ ఒక గుడ్డిగుర్రం. దానితో పాటు మరికొన్ని గుర్రాలు కుడా కలిసి పనిచేస్తున్నాయంటే అది ఆ పని చేసేందుకు జంకదు. అదొక్కటే పనిచేస్తున్నానని అనిపిస్తే భయంతో ఆ పనిని సరిగాచేయలేదు" అని చెప్పాడు.

పులి మేకపిల్ల

ఒక మేకలమందలో బుజ్జి మేకపిల్లొకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్లకు ఏ మాత్రం తీసిపోయేది కాదు. ఒకరోజు యజమాని మేకలను కొండ దిగువకి మేత కోసం తోలుకె్ళ్ళాడు. ఆ కొండ పైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకుని వెనుకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజా వణికిపోయింది. ఎలాగోలా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది.

పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధంకాగానే "పులిరాజా! ఒక్క నిమిషం ఆగండి. మీకు నేను మూడు నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలెయ్యాలి" అంది మేకపిల్ల.

మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో "సరే చెప్పు" అంది పులి కుతూహలంగా.

"నువ్వు మిగతా పులులతో 'ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది. అయినా చంపకుండా వదిలేశానూ అని చెబితే అవి నమ్మవు నిజమేనా?"

"నిజమే!" అని తలూపింది పులి.

"అలాగే నేనూ మా మేకలతో నన్ను ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు. నిజమేనా?" అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది.

"ఇక మూడో నిజం. చాలాసేపటి నుండి నేను నీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు నిజమే కదూ!" అంది మేకపిల్ల.

అంత చిన్న పిల్ల తనముందు నిలబడి అంత ధైర్యంగా మాట్ల్లాడటం చూసి పులికి ముచ్చటేసింది.

"నిజమే. నువ్వు చాలా తెలివైన దానివి. నిన్ను వదిలేస్తున్నాను పో" అంది.

రామన్న తీర్పు

ఒకసారి మర్యాదరామన్న కొలువుకు ఇద్దరు వ్యక్తులు ఒక ఫిర్యాదుతో వచ్చారు. వారిద్దరిలో ఒకరు ఆ ఊరిలో పేరున్న ధనికుడు, మరొకరు రైతు.

"మా పూర్వికులకు చెందిన విలువైన వజ్రం ఒకటి నా దగ్గర ఉండేది. ఇతను వ్యాపార నిమిత్తం పొరుగుదేశం వెళ్తూ నకలు కోసం నా వజ్రాన్ని అడిగి తీసుకుని వెళ్ళాడు. తిరిగి వచ్చాక వజ్రం కోసం వెళితే ఇవ్వడం లేదు" అని రైతు ఫిర్యాదు చేశాడు.

'నీ సమాధానం ఏమిట'ని రెండో వ్యక్తి వైపు చూశాడు మర్యాదరామన్న. అప్పుడు ధనికుడు తన చేతిలో ఉన్న కర్రను పట్టుకోమని రైతుకు ఇచ్చి, కొంచెం ముందుకు వచ్చి చేతులు జోడించి "రైతు చెప్పింది నిజమే. అతని దగ్గరున్న వజ్రం లాంటిది కొండానికి, పొరుగుదేశంలో ఉన్న వ్యాపారులకు చూపించడానికి తీసుకెళ్లింది వాస్తవమే, అయితే నేను ఇంటికి చేరుకున్న క్షణమే అతన్ని పిలిపించి ఆ వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను. రైతు దురాశతో నా దగ్గరున్న వజ్రాల్లో ఒకదాన్ని పొందటానికి ఎత్తు వేస్తున్నాడు" అని చెప్పాడు.

ఆలోచనల్లో పడిపోయాడు రామన్న. ఇచ్చినప్పుడుగాని, పుచ్చుకున్నప్పుడుగాని చూసిన సాక్ష్యులు ఎవరూ లేరు. వ్యవహారమంతా కేవలం ఇద్దరి మద్యే గడిచింది.

"చూడండి! మీ లావాదేవీలో దేవుడే సాక్షి. మీకు ఇంకొక్క అవకాశం ఇస్తున్నాను. దేవుడు మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి" అని ఆదేశించాడు రామన్న.

ధనికుడు వెంటనే తన కర్రను మళ్ళీ రైతు చేతిలో పెట్టి, రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్టుగా పైకెత్తి "ఆ భగవంతుని సాక్షిగా నేను నిజమే చెబుతున్నాను. రైతుకు నేను వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను" అని ప్రమాణం చేశాడు. ధనికుడు ప్రవర్తన నిశితంగా గమనించిన రామన్నకు విషయం మొత్తం అర్ధమ్మయింది.

ధనికుడు రైతు చేతుల్లోంచి కర్రను తీసుకోబోయాడు. "ఆగు! ఆ కర్రను తీసుకోవద్దు. అది రైతుకు పరిహారంగా ఇవ్వబడుతోంది" అని తీర్పు చెప్పాడు. అది విని రైతు, ధనికుడు ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

"ఇంటికి వెళ్ళి ఆ కర్రను జాగ్రత్తగా విరగ్గొట్టి చూడు" అని రైతుకు చెప్పి పంపించేశాడు. ఆ తీర్పుతో నిరాశచెందిన రైతు రామన్నను రెట్టించే ధైర్యం లేక ఇంటికి వెళ్ళి కర్రను పగలగొట్టి చూశాడు. అందులోంచి అతను ధనికుడికి ఇచ్చిన వజ్రం బయటపడింది.

రెండు నాలుకలవాడు

ఒక అడవిలో ఒక నక్కను కొన్ని తోడేళ్లు తరుముతున్నాయి. నక్క గుక్క తిప్పుకోకుండా, ప్రాణభయంతో, ఊపిరి బిగబట్టి పరుగుతీస్తోంది. తోడేళ్లు తమ ఆహారాన్ని వదలలేక మరింత వేగంగా దూసుకొస్తున్నాయి. నక్క ఇక పరిగెత్తలేక ఒక గుడిసె వెనకాల దాక్కుంది. ఆ గుడిసె ముందు చెట్టుపై ఒకతను కట్టెలు కొడుతున్నాడు. నక్క అతన్ని చూసి "అయ్యా! నేను ప్రాణ భయంతో పరిగెత్తుకు వస్తున్నాను. నన్ను తోడేళ్లు తరుముతున్నాయి. అవి వస్తే దయచేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు" అని అంది. బదులుగా అతను "సరే ! నువ్వు ప్రాణం అరచేతిలో పెట్టుకుని వస్తున్నావు. నువ్వు ఇక్కడ దాక్కున్నావని చెప్పనులే" అన్నాడు.

అంతలో తోడేళ్లు రొప్పుతూ అతని ముందుకొచ్చాయి. " అయ్యా! మేము ఒక నక్క కోసం వెతుకుతున్నాం. ఆ నక్క గాని ఇటు వైపు వచ్చిందా? చెప్పండి. మీకు మేము రుణపడి ఉంటాం", అని అన్నాయి తోడేళ్లు ముక్తకంఠంతో. కొద్దిసేపు ఆలోచించి ఆ కట్టెలు కొట్టేవాడు, ఒక వైపు చేయి నక్కవైపు, మరో చేయి రోడ్డువైపు చూపిస్తూ, " అటుగా వెళ్ళింది" అని పలికాడు. అతని సంజ్ఞను అర్ధం చేసుకోలేని వెర్రి తోడేళ్లు అతను చూపించిన రోడ్డువైపు పరిగెత్తాయి. "హమ్మయ్య" అని బయటకొచ్చిన నక్క తన దారిలో తాను వెళ్తుంటే కట్టెలు కొట్టేవాడు నక్కతో, " నువ్వు మామూలు వాడివి అయితే కృతజ్ఞతలు చెప్పేదాన్ని. కానీ నువ్వు రెండు నాలుకలవాడివి. నావైపు చూపిస్తూ మరోవైపు వెళ్లిందని చెప్పావు. నీలాంటి వాడికి కృతజ్ఞతలు చెప్పడం కూడా సంస్కారం అనిపించుకోదు" అంది నక్క.

ఆధారము: రమేష్ బాబు, టీచర్, పశ్చిమ గోదావరి

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate