অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నల్గొండ దర్శనీయ ప్రదేశాలు

నల్గొండ, తెలంగాణ లోని నల్గొండ జిల్లలో ఒక మునిసిపల్ పట్టణం. ఈ పట్టణం పేరు రెండు తెలుగు పదాలు నల్ల, కొండల కలయిక, అంటే నలుపు రంగు, కొండ అని అర్ధం. అందుకని స్థానిక భాషలో ఈ పట్టణానికి నల్ల కొండ అని అర్ధం. ప్రారంభంలో ఈ నల్గొండ ప్రాంతం నీలగిరి అని పిలిచేవారు. బహామనీల కాలంలో ఈ పట్టణాన్ని నల్లగొండ అని మార్చారు. నిజాం పాలనా కాలంలో అధికారిక అవసరాలకు ఈ పేరును నల్గొండ గా పలికేవారు. అయితే, స్థానికులు ఇప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని నల్లగొండ గానే పిలుస్తారు. ఈ ప్రాంతం అనేక రచనలలో పైగా ప్రసిద్ధ తెలంగాణా విమోచన పోరాట కవిత్వంలో కూడా ఇలాగే పలుకుతున్నారు. చాల మంది ప్రజలు ఈ ప్రాంతాన్ని అధికారిక పత్రాలలో కూడా ఇలాగే పలకాలనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.

తెలంగాణా ఉద్యమం ప్రధాన౦గా నల్లగొండ, వరంగల్ జిల్లాల చుట్టు తిరుగుతున్నందువలన ఈ ఉద్యమంలో నల్గొండ ఒక కీలక భాగమైంది. దాదాపు ఈ రెండు జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాలు తెలంగాణా ఉద్యమంలో పాలుపంచుకు న్నాయి. ఈ ఉద్యమం ఆంధ్ర మహా సభ, కమ్యునిస్టుల రూపకల్పన. మార్షల్ లా ఈ ప్రాంతంలో 1946 నుండి ప్రాబల్యంలో ఉంది.చాల మంది ప్రజలు భూస్వామ్య ప్రభువుల సైన్యం రజాకార్ల చేతులలో ప్రాణాలు కోల్పోయారు. నిజాం సైన్యం కూడా ఈ రెండు జిల్లాలలో ఈ ఉద్యమ మద్దతుదారులను అనేక మంది చంపి విధ్వంసం సృష్టించింది. ఫలితంగా 3000-5000 గ్రామాలను స్వతంత్రం చేసి, ఒక్కొ గ్రామానికి నాయకులను నియమించారు. భూస్వామ్య ప్రభువుల నుండి భూమిని స్వాదీనం చేసుకొని అవసరమైన, వ్యవసాయం చేసే ప్రజానీకానికి పంచారు. ఈ యుద్ధం చివరకు భారత బలగాలచే అంతమొందించబడి, భారత యూనియన్లో హైదరాబాద్ ప్రాంతంతో బాటుగా నల్లగొండ, వరంగల్ జిల్లాలు భాగమయ్యాయి.

పర్యాటక ఆకర్షణలు

ప్రస్తుతం, నల్గొండ ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక కోణం దృష్ట్యా ఒక ముఖ్య భాగం. కారణం నల్గొండకు వాటిపై ఆధారపడే ఏ విధమైన ఇతర ప్రధాన వ్యాపారాలు లేకపోవడం వలన ఆర్ధిక వనరులు ప్రధాన౦గా పర్యాటక రంగం నుండే లభిస్తాయి. మట్టపల్లి, పిల్లలమర్రి, రాజీవ్ పార్క్, ఫణిగిరి బౌద్ధ స్థలాలు, పానగల్ దేవాలయం, నందికొండ, లతీఫ్ షాహ దర్గా, కొల్లంపాకు జైన దేవాలయం, రాచకొండ కోట, మేళ్ళచెర్వు, దేవరకొండ కోట, భువనగిరి కోట నల్గొండ లోని కొన్ని చూడదగిన ఆసక్తికర ప్రాంతాలు. ఈ అన్ని ప్రాంతాలు నల్గొండ చరిత్రలో చాల ప్రాముఖ్యతను కల్గి ఉన్నాయి.

ఈ ప్రాంతం ఏ జాతీయ రహదారి పైన నేరుగా కలవనప్పటికి నల్గొండ కు రైళ్ళు, రోడ్డు మార్గాల ద్వారా చేరడం సులువు. నల్గొండ రైలు స్టేషన్ గుంటూరు – సికింద్రాబాద్ రైల్వే లైన్ పై ముఖ్య మైనది, ఈ పట్టణంలో ఆగే అనేక రైళ్ళు ఉన్నాయి. రోడ్డు రవాణా వ్యవస్థ కూడా బాగుండటమే కాక చాల బస్సులు తరుచుగా నల్గొండ కు వస్తు, పోతూ ఉంటాయి. దగ్గరి విమానాశ్రయం హైదరాబాద్.

ఈ ప్రాంతం ఉష్ణమండల వాతావరణంతో కూడిన తీవ్రమైన పొడి, వేడి వాతావరణాన్ని కల్గి ఉంటుంది. నల్గొండ వర్షాకాలంలో సగటు వర్షపాతాన్ని నమోదు చేసుకొంటుంది, శీతాకాలాలు కొంత చలిగా ఉంటాయి. శీతాకాలంలో మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాల ప్రభావం సాయంత్రానికి తగ్గి, సాయంత్రం నుండి రాత్రి వరకు ఆహ్లాదకరం ఉంటుంది కనుక ప్రజలు ఈ సమయంలో నల్గొండ సందర్శనకు ప్రాధాన్యతను ఇస్తారు.

నాగార్జునసాగర్

నాగార్జునసాగర్, ప్రపంచంలో ఉన్న బౌద్ధులకు ముఖ్యమైన స్థలము. ఇది దక్షిణ భారత రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ లో ఒక చిన్న పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ఒక పవిత్రమైన స్థలంగా ప్రసిద్ధి చెందుతూ అదే విధంగా ఒక ముఖ్యమైన పర్యాటక స్థలంగా కూడా ప్రసిద్ధి చెందుతూ ఉంది. పురాతన రోజుల్లో దీనిని విజయపురి అని కూడా పిలిచేవారు.కాలక్రమేణ ఒక బౌద్ధ భక్తుడు నాగార్జున పేరుతొ ఈ పట్టణం యొక్క పేరు ఏర్పడింది. ఆయన భగవత్స్వరూపమైన బుద్ధుడికి ఒక గొప్ప ఆరాధ్య భక్తుడే కాదు అక్కడి ప్రజలచేత కూడా కీర్తించపడ్డాడు. అతను మొదటి శతాబ్దం ఏ.డి. చివరి వరకు,అంటే 60 సంవత్సరాల వరకు బుద్ధుల సంఘ నాయకుడిగా ఉన్నారు. దీనివలన దక్షిణ భారతంలో సహస్రాబ్ది ప్రారంభ కాలము నుండే ఇది ఒక ముఖ్యమైన బౌద్ధుల పవిత్రమైన స్థలంగా ఉందని తెలుస్తుంది.

పురాతన తవ్వకాలలో ఈ ప్రాంతంలో బౌద్ధ మతం ప్రసిద్ధి చెందినట్లుగా సాక్ష్యాధారాలు కనిపించాయి. ఈ ఆధారాలు అన్నీ స్తూపాలు మరియు శిల్పాల రూపంలో బుద్ధుడి జీవిత చరిత్ర గురించి, అతనియొక్క బోధనల గురించి ఉన్నాయి. ఈ సాక్ష్యాధారాలవలన నాగార్జునసాగర్ ఒక ముఖ్యమైన పురావస్తు స్థలంగా కూడా పేరు పొందింది.

నాగార్జునసాగరులో పర్యాటకులు చూడవలసిన స్థలాల్లో ముఖ్యమైనవి నాగార్జునసాగర్ డాం, ఎత్తి పోతల జలపాతాలు మరియు నాగార్జునకొండ ఉన్నాయి. ఈ పట్టణం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 150 కి.మీ.దూరంలో ఉన్నది. హైదరాబాద్ నుండి ఈ పట్టణాన్ని రోడ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు. నాగార్జునసాగర్ చేరుకోవటానికి అనేక బస్సు సర్వీసులు పెద్ద నగరాలనుండి మరియు పట్టణాలనుండి నడుపబడుతున్నాయి. బస్సు ప్రయాణం ఉత్తమం ఎందుకంటె ఈ పట్టణానికి చేరుకోవాలంటే అక్కడ రైల్వే స్టేషన్ కాని, విమానాశ్రయం కాని లేవు.

నాగార్జునసాగర్ సందర్శించటానికి శీతాకాలం బాగుంటుంది. ఎందుకంటే ఉష్ణమండల వాతావరణ పరిస్థితుల మూలంగా, వేసవిలో అతివేడి, చలికాలంలో కొద్ది చలి ఉంటుంది.

లతీఫ్ శేబ్ దర్గా

నల్గొండ లోని లతీఫ్ షేబ్ దర్గా, ఈ ప్రాంత౦లొ ఉన్న మత సామరస్యానికి ఉత్తమ ఉదాహరణ. ఈ దర్గా ముస్లి౦ సన్యాసికి చెందినప్పటికీ అన్ని మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు. ఈ ప్రాంతం పర్వతరోహకులకు ప్రియమైన రెండు రెండు కొండల పైన ఉంది. అందుకని, సన్యాసి ఆశీస్సుల కోసం వచ్చే వారితో బాటుగా అనేక మంది పర్యాటకులను కూడా ఈ దర్గా వద్ద గమనించవచ్చు.

ఈ దర్గా వద్ద ప్రార్ధన చేస్తే కోరికలు ఫలిస్తాయని విశ్వసిస్తారు. కనుక, ఈ దర్గాలో ప్రార్ధించి, ఈ సన్యాసి ఆశీస్సులు పొందడానికి దగ్గర దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారు. ఈ దర్గాలో ప్రతి ఏట ఉరుసు అనే ఉత్సవం జరుగుతుంది. ఎంతో ప్రసిద్ది చెందిన ఈ ఉత్సవానికి ఆ రోజున లక్షల మంది భక్తులు రావడమే కాక స్వచ్చందంగా చాల పనిని కూడా చేస్తారు. ఈ దర్గా కు చాల దగ్గరలో మరొక కొండ ఉంది అదే కాపురాల గుట్ట కొండ.

మట్టపల్లి

నల్గొండ పట్టణానికి అతి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఉన్న మట్టపల్లి ఒక చిన్న కుగ్రామం. ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం ఉన్నందున ఈ గ్రామం పర్యాటకులలో పేరొందింది.

ఇది మనసుకి, శరీరానికి ప్రశాంతతను అందిస్తుంది కాబట్టి ప్రతి పర్యాటకుని జాబితాలో ఈ గ్రామం ఉండాలి. దట్టమైన అడవుల మధ్యలో, పవిత్ర నది పక్కన ఉన్న ఈ గ్రామం సాటిలేని ప్రశాంతతను ఆనందాన్ని అందిస్తుంది.హిందూ కధనం ప్రకారం వేదాద్రి, వేథపురం, మంగళగిరి, వాడపల్లితో పాటు పంచ నరసింహ క్షేత్రాలలో మట్టపల్లి ఒకటి.

నాలుగు వివిధ దిక్కులకు ప్రాతినిధ్యం వహించే ఇతర ప్రదేశాలకు మట్టపల్లి కేంద్ర ప్రాంతం. మట్టపల్లి ఒకే ఒక తీర్ధ యాత్ర స్థలం, అందులో మట్టపల్లి దేవుడు ఒక్కడే దేవుడని, దీనికి సాటి వచ్చే ప్రాంతం ఏదీ లేదని, నరసింహ స్వామి కి సాటి వచ్చే దేవుడు లేడనీ చెప్తారు.”

ఫణిగిరి బౌద్ధ ప్రాంతాలు

ఫణిగిరి, నల్గొండ పట్టణం నుండి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బౌద్ధ ప్రాంతం. ఆంద్ర ప్రదేశ్ పురావస్తు, మ్యూజియాల శాఖ వారు ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపిన తర్వాత ఈ మధ్య కాలంలో కనుగొనబడింది.ఫణిగిరి లో ఒక పెద్ద స్తూపం ఉన్న ఒక పెద్ద సముదాయం, స్తూపాలు నిర్మించిన రెండు పెద్ద సభామందిరాలు ఉన్నాయి.

ఈ ప్రాంతపు పరిమాణాన్ని బట్టే ఈ ప్రాంతం బౌద్ధ కేంద్రంగా ఎంత ప్రాముఖ్యత కల్గిందో తెలుసుకోవచ్చు. ఈ సముదాయంలో నేల మీద ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉన్న పెద్ద పాదముద్రలు బుద్ధనివిగా భావిస్తున్నారు.

ఈ సముదాయంలో బౌద్ధ సన్యాసులకు చెందిన విహారాలు అనే నివాస ప్రదేశాలు మూడు ఉన్నాయి. ఫణిగిరి బౌద్ధ ప్రాంతం పాము పడగ కొండగా ప్రసిద్ది చెందిన ఒక కొండ పైన ఉంది. ఈ కొండ ఆకారం పాము పడగను పోలి ఉండటం వలన దీనికా పేరు వచ్చింది.

భువనగిరి కోట

భువనగిరి కోటను చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు నిర్మించాడు. ఈ కోటను 12వ శతాబ్దంలో ఒక సమయంలో రాజ్యాన్ని పరిరక్షించే నిమిత్తం నిర్మించారు.ఈ కోట 40 ఎకరాలలో కొండ పైన నిర్మించారు. భూ మట్టం నుండి ఈ కోట 500 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ కోట దాని ప్రత్యేక నిర్మాణ శైలి వలన పర్యాటకులలో ప్రసిద్ధ గమ్యస్థానమైంది.

కోడిగుడ్డు ఆకారంలోని ఈ కోటకు రెండు ప్రధాన ద్వారాలు ఉంటాయి. ఈ కోటకు వెలుపల దీనిని చేరడానికి అసాధ్యమైన రీతిలో టన్నుల కొద్ది కందకాన్ని తవ్వారు. కోట లోపల భూగర్భ గదులు, రహస్య బాటలు ఉన్న పొడవాటి దారులు, ఉచ్చుద్వారాలు, ఆయుధాలు భద్రపరిచే ఒక రహస్య గది, గుర్రపు శాల కూడా ఉన్నాయి.

మేళ్లచెర్వు

మేళ్ళచెర్వు, నల్గొండ పట్టణానికి దగ్గరలో నల్గొండ జిల్లలో ఉన్న ఒక గ్రామం. ఆసక్తి కరంగా ఈ గ్రామం విజయవాడకు కాలువ ద్వారా కలపబడింది. ఈ గ్రామం చరిత్ర ప్రియులలో ప్రసిద్ది, కారణం కాకతీయ రాజుల కాలం నాటి అద్భుత నిర్మాణశైలిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విషయం అర్ధం చేసుకోవడానికి కేవలం మేళ్ళచెర్వు లోని కొన్ని ప్రసిద్ధ ఆలయాలను చూడటమే మన చేయవలసిన పని.

ఈ ప్రాంతంలో అతి ముఖ్య దేవాలయం స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం. ఈ దేవాలయంలో ఒక ఆకర్షణీయ లక్షణం ఆలయ౦ పైన లింగం ఉండటం. లింగం పైన 2 అంగుళాలు రంధ్రం ఉంది, ఇది ఏడాది పొడవునా ఏ సమయంలోనైన నీటితో నిండి ఉంటుంది. ఈ కారణంగానే మేళ్ళచెర్వు గ్రామ౦ దక్షిణాది కాశిగా పేరొందింది. దీని ఎత్తు ఒక స్థిరమైన వేగంతో పెరగడమనేది ఈ దేవాలయానికి సంబందించిన మరొక ప్రసిద్ధ విశ్వాసం

కొల్లంపాకు జైన దేవాలయం

కొల్లంపాకు జైన దేవాలయం, నల్గొండ పట్టణానికి దగ్గరలో హైదరాబాద్ కు 79 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైన మతం ఆంద్ర ప్రదేశ్ లో ప్రాచుర్యంలో లేనప్పటికీ ఇక్కడ జైన దేవాలయం వుండడం ఆశ్చర్యకరమైన విషయమే. ఈ దేవాలయం జైన మతానికి చెందినా పురాతన ఆలయం, కాని ఏళ్ళ కొద్ది నిర్లక్ష్యం వలన ఈ రెండు వేల ఏళ్ళ నాటి ఈ దేవాలయం శిధిలావస్థ లో ఉంది.

అయినప్పటికీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, పురావస్తు శాఖ వారి సంయుక్త ప్రయత్నాల వలన ఈ దేవాలయం ప్రస్తుత౦ ప్రాముఖ్యత చెందుతూ, పర్యాటకులు తరచుగా సందర్శించే కేంద్రమైంది. కాని ఈ పవిత్ర ప్రాంతానికి పూర్వపు వైభవం రావడానికి ఇంకా చాల పని చేయవలసిన అవసరం ఉంది. ప్రధానంగా వైష్ణవులు వుండే రాష్ట్రంలో జైన దేవాలయం ఉండటం కూడా ఒక అద్భుతమైన విషయ౦.

నంది కొండ

నంది కొండ, కృష్ణ నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం నాగార్జున సాగర్ కు అతి చేరువలో ఉంది. నందికొండ గ్రామం, విజయపురి పట్టణ సముదాయం నుండి చేరదగినంత దూరంలో ఉంది. ఈ పట్టణ సముదాయం ఇక్ష్వాకు వంశస్తుల పురాతన రాజధాని.నందికొండ, నల్గొండ దగ్గరలోని ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్య స్థానం, కారణం ఈ ప్రాంతంలోని తవ్వకాలలో బయట పడిన బౌద్ధ మఠాలు, సభామందిరాలు, స్తంభాల అనే వాస్తవం వలన ఇది ఒక ముఖ్య బౌద్ధ ప్రాంతమైంది.ఇది చరిత్ర ప్రియులు, తమలో ఒక పురావస్తు శాస్త్రవేత్త దాగి ఉన్నవారు కూడా తప్పక చూడవలసిన ప్రాంతం.

బౌద్ధ మఠాలే కాక ఇక్కడ ఇక్ష్వాకులకు చెందిన కోట శిధిలాలను కూడ మనం గమనించవచ్చు. ఈ కోట ఈ ప్రాంతంపై ఈ వంశ౦ సాగించిన అధికారం, ప్రభావాలను గుర్తు చేసే ఒక మచ్చుతునక. ఆ కాలపు కొన్ని అవశేషాలు ఇక్కడి నుండి తరలించారు, ఇవి ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖకు చెందిన మ్యూజియం వారి ఆస్థి.

దేవరకొండ కోట

దేవరకొండ కోట, నల్గొండ జిల్లా లోని దేవరకొండ పట్టణంలో (ఒక మండలం కూడా) ఉంది. ఈ కోట ఏడు కొండలతో చుట్టబడిన ఒక కొండ పై ఉంది. అప్పట్లో ఎంతో ప్రాముఖ్యత వహించిన ఈ కోటను 14వ శతాబ్ద౦లో రేచెర్ల వెలమ రాజుల నిర్మించిన. ఈ కోటను నిర్మించడంలో ప్రధాన భావన శత్రువులకు దుర్భేద్యమైన బలమైన కోట కలిగి ఉండడమే. శతాబ్దాల నిర్లక్ష్యం వలన నాశనమై ప్రస్తుత౦ ఈ కోట శిధిలావస్థలో ఉంది.

ఈ ప్రాంతం కేవలం పురాతత్వ శాస్త్రవేత్తలలో మాత్రమే ఆసక్తి కల్గిస్తుంది, వారు భూమిని తవ్వి కోల్పోయిన చరిత్ర లోని భాగాల కోసం వెతుకుతుంటారు. దురదృష్టవశాత్తూ, రాష్ట్ర ప్రభుత్వం కోట శిధిలాలను పరిరక్షించడానికి ఏమి చేయడం లేదు, పైగా ఈ ప్రాంతాన్ని అల్లరి మూకలు, సోమరిపోతులు నాశనం చేస్తున్నారు. ఈ కోటను నల్గొండ, హైదరాబాద్, శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి రోడ్డు మార్గాన చేరవచ్చు.

రాచ కొండ కోట

రాచకొండ కోట, ఈ ప్రాంతాన్ని 14 వ,15వ శతాబ్దాలలో పాలించిన వెలమ దొరల రాజధానిగా ఉండేది. ముస్లిం బహమనీ రాజులతో వెలమ రాజులు కూటమిని ఏర్పాటు చేయడం వలన వారు దక్షిణాది పాలకులలో ఏమాత్రం జనామోదం లేని రాజులే కాక కొండవీడు ప్రాంతానికి చెందిన రెడ్డి రాజులతో నిరంతరం యుద్ధం చేసేవారు. వెలమలు వరంగల్ కాపయ్య నాయకులతో కూడా ఎప్పుడు పోరాడుతుండేవారు.

వెలమ రాజులు తమను దాడుల నుండి కాపాడుకోవడానికి కోటను నిర్మించారు, కాని ముస్లిం పాలకులు అక్రమ రీతిలో వారిపై దాడి చేసి వెలమ రాచరిక కుటుంబాన్ని తమ దాసులుగా మార్చారు. వెలమలు ఒక బ్రాహ్మణునిచే ఇక ఎన్నడు పాలించలేరని కూడా శపించబడ్డారు. ఈ శాపం కారణంగానే రాచకొండ కోట ప్రస్తుతం సంపూర్ణ శిధిలావస్థలో ఉందని కొంత మంది ప్రజలు విశ్వసిస్తారు.

అయితే, సూర్యాస్తమయానికి ముందు ఈ కోటను చూసేందుకు ప్రాధాన్యత నిచ్చే పర్యాటకుల, ఆసక్తి గల స్థానికులు ఇక్కడకు వస్తుంటారు.

పానగల్ దేవాలయం

పానగల్ సోమేశ్వర ఆలయం, నల్గొండ పట్టణానికి దగ్గరలో నల్గొండ జిల్లా లో భాగమైన పానగల్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాద్ నగరానికి 101 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చరిత్రకారుల ప్రకారం, పానగల్ కాకతీయ రాజుల రాజధానిగా ఉన్నప్పుడు అభివృద్ది చెందిన పట్టణం. కాకతీయులు ఈ ప్రాంతాన్ని11వ శతాబ్దంలో కొంత కాలం పాటు తమ రాజధానిగా చేసారు. అదే సమయంలో ఈ గ్రామంలో వారు ఈ దేవాలయాన్ని నిర్మించారు.

ఈ దేవాలయం 66 స్తంభాల గొప్ప నిర్మాణం. ఈ స్తంభాలపై అంతర్భాగమైన అందమైన చెక్కడాలు ఉన్నాయి. మండపానికి ఎదురుగా మధ్యలో ఒక నంది విగ్రహం ఉంది. ఇక్కడ ఆలయం లోపల శివుని విగ్రహం ఉంది. దేవాలయ గోడల పైన గొప్ప హిందూ పురాణాలు రామాయణ, మహాభారత దృశ్యాలను చూడవచ్చు.

రాజివ్ పార్క్

రాజీవ్ పార్క్, భారతదేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ రాజీవ్ గాంధీ పేరు కల్గి ఉండి నల్గొండ పట్టణంలోని పార్కులలో ప్రసిద్ది చెందింది. పట్టణంలో ఒక ముఖ్య పర్యాటక ఆకర్షణగా పేరున్న ఈ పార్కును పెద్ద సంఖ్యలో స్థానికులు కూడా సందర్శిస్తారు. పట్టణంలో కేంద్ర ప్రాంతంలో ఉన్న దీనిని చక్కగా నిర్వహిస్తున్నారు.

ఈ పార్కు చక్కటి కృత్రిమ పచ్చిక బయళ్ళు, అనేక పుష్పాల సంస్తరాలు ఉన్నాయి. సరైన కాలంలో ఈ పూలు దివ్యంగా పుష్పించి పార్కును రంగులమయం చేస్తాయి. ఈ పుష్పాలు విదేశీ, అరుదైన రకాలకు చెందినవి. పార్కు ప్రాంగణంలో బారులు తీరిన అనేక చేతులు ఉన్నాయి.

పార్కు లో ఉన్న సంగీత ఫౌంటెన్ ను సాయంత్రం పూట పర్యాటకుల వినోదం కోసం దేదీప్యమానంగా వెలిగిస్తారు. కొన్నిసార్లు, వినోద కార్యక్రమాలను పిల్లల కోసం ఈ పార్క్ లో నిర్వహిస్తారు. పార్కు ప్రవేశానికి ఎటువంటి రుసుము లేదు, కాని పార్క్ బయట ఒక బోర్డు పై పార్క్ లో ఎటువంటి చెత్త వేయ రాదనే గట్టి హెచ్చరిక కనబడుతుంది.

ఎత్తిపోతల జలపాతాలు

ఎత్తిపోతల జలపాతాలు నాగార్జునసాగర్ పట్టణానికి చాల సమీపంలో ఉన్నాయి మరియు నాగార్జునసాగర్ డాంకు 11 కి.మీ. దూరంలో ఉన్నాయి. కృష్ణ నదికి ఉపనది అయిన చంద్రవంక 70 అడుగుల ఎత్తు నుండి ఉధృతంగా ప్రవహించటం వలన ఈ జలపాతాలు ఏర్పడ్డాయి. నిజానికి, చంద్రవంక వాగు, తుమ్మల వాగు మరియు నక్కల వాగు అనే మూడు నదుల కలయికే ఈ జలపాతాలు. ఈ జలపాతాల నీరు నాగార్జునసాగర్ డాం నుండి కృష్ణ నదిని చేరుతుంది. ఈ జలపాతం నదికి 3 కి.మీ. దూరంలో ఉంటుంది.

ఈ జలపాతాలు పర్యాటకులకు ఒక గొప్ప ఆకర్షణగా ఉన్నాయి మరియు సంవత్సరం అంతా చాలామంది పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ఈ జలపాతాల స్థలం నిజంగా ఉత్కంఠ భరితమై ఉంటుంది. ఈ జలపాతాలు అడవి మధ్యలో ఉండి మరియు ఉధృతంగా ప్రవహిస్తూ పర్యావరణానికి అందాన్నిచేకూరుస్తున్నాయి. ఈ జలపాతాలకు దగ్గరలో ఉన్న కొండ మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక దృక్కోణం నిర్మించింది. రంగనాథ మరియు దత్తాత్రేయ ఆలయాలు ఈ జలపాతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి.

నాగార్జునకొండ

నాగార్జునకొండ ఒక పురాతన బౌద్ధ ద్వీప నగరం. ఇది ఆంధ్రప్రదేశ్ నల్గొండ జిల్లాలో ఒక భాగంగా ఉన్నది. ఈ పట్టణం నాగార్జునసాగరుకి చాలా సమీపంలో ఉన్నది మరియు హైదరాబాదుకి 150 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ ద్వీప పట్టణం 1960లొ రూపు దిద్దుకొన్నది. ఎందుకనగా నాగార్జునసాగర్ డాం కడుతున్నప్పుడు కొండ మునిగిపోయింది. ఈ పట్టణం భారత దేశం యొక్క ప్రసిద్ధి చెందిన ఒక బౌద్ధ స్థలంగా పేరు పొందింది మరియు ఇక్కడికి దేశ విదేశాలనుండి సందర్శకులు వస్తుంటారు. పురాతన కాలంలో నీటిలో మునిగిన కొండను శ్రీ పర్వత అని పిలుస్తుండేవారు.

ఈ ద్వీపానికి బౌద్ధ మత ప్రచారకుడు,బౌద్ధ సన్యాసి అయిన నాగార్జునుడిని గౌరవిస్తూ నాగార్జునకొండ అని పేరు పెట్టారు. ఈ పట్టణం బుద్ధుడు ఉన్నప్పుడు, తరువాత కూడా ఒక అధ్యయన కేంద్రంగా నిరూపించపడింది. ఇక్కడ చాల బౌద్ధ ఆరామాలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మరియు వీటిలో విద్యను అభ్యసించటానికి విద్యార్థులు దూరప్రాంతాలనుండి కూడా వస్తారు.

నాగార్జునసాగర్ ఆనకట్ట

నాగార్జునసాగర్ డాం ప్రారంభించేనాటికి అది ప్రపంచంలోకల్లా ఇటుక,రాతితో నిర్మించబడ్డ పెద్ద ఆనకట్ట. ఆంధ్ర ప్రదేశ్ నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగరు పట్టణానికి సమీపంలో ఈ ఆనకట్ట ఉన్నది.

నాగార్జునసాగర్ ఆనకట్ట కృష్ణ నది మీద నిర్మించబడింది. ఆనకట్ట మీద ప్రాజెక్ట్ వర్క్ 1955 లో ప్రారంభమైంది మరియు 1967 లో ముగిసింది. ఈ ఆనకట్ట 11.472 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి రిజర్వాయర్ సృష్టించడానికి సామర్థ్యం కలిగి ఉంది. ఇది 490 అడుగుల ఎత్తు ఉండి మరియు 1.6 కిలోమీటర్ల పొడవు ఉండి, సందర్శకులకు కనువిందు చేస్తుంది. ఇది 42 అడుగుల వెడల్పు మరియు 45 అడుగుల పొడవు కొలత గల మొత్తం 26 గేట్లు కలిగి ఉంది.

ఈ ఆనకట్ట భారత దేశ చరిత్రలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది దేశంలో మొట్టమొదటి హరిత విప్లవాన్ని తెచ్చింది. నీటి పారుదల కోసం మరియు జలవిద్యుత్తును పరిసర ప్రాంతాలకు అందిచటం కోసం కట్టబడిన మొట్టమొదటి ఆనకట్ట.

ఆధారము: నేటివ్ ప్లానెట్.కం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate