పాలసాగరమున పవ్వళించినవాడు
గొల్లయిండ్ల పాలుకోరనేల
ఎదుటివారి సొమ్ములెల్ల వాడికి తీపి
విశ్వదాభిరామ! వినుర వేమ!
“పాల సముద్రంలో పడుకొని ఉండే మహా విష్ణువు, శ్రీకృష్ణుడుగా యాదవుల ఇండ్లల్లోని పాలు ఎందుకు కోరాడు? ఎవరికైనా పరుల సొమ్మంటే తీపిగనుక.” మానవ మనస్తత్వంలోని ఒక బలహీనత పరుల సొమ్ము మీద ఆశ, మనది కానిదానిని ఆశించడం తప్పు. కాని ఆశిస్తాం. ఇది వద్దు అని చెబుతున్నాడు వేమన. భగవంతుడనే వాడు ఒకడుంటే ఆ భగవంతుడు కూడా పరుల సొమ్ముకు ఆశపడడంలో మినహాయింపు కాదన్నాడు వేమన. మహావిష్ణువు ఆదిశేషుని పాన్పుగా చేసుకొని పాలసముద్రం మీద పవ్వళించి ఉంటాడని పురాణాలు చెబుతాయి. అలాంటి మహా విష్ణువు కూడా శ్రీ కృష్ణావతారంలో తమ ఇరుగు పొరుగు ఇండ్లలో పాలు దొంగిలించాడని భాగవత, హరివంశ కథ. మనంతట మనం హాయిగా బతికిపోగ తగినంత సంపద మనకున్నా, కొంచెమైనా ఇతరులది మనకు వస్తే బాగుండుననుకుంటాం. ఇది మన వ్యక్తిత్వంలోని లోపం. పేదవాడు బతకలేనివాడు ఇతరుల సొత్తును ఆశించడంలో అర్థముంది. మూలుగుతున్న ఆస్తి ఉండి కూడా అక్రమార్జనకు పూనుకోవడం నేరం. 'పొరిగింటి పుల్లకూర రుచి' అంటారు. పుల్లకూర ఆశిస్తే పోనీ అనుకుందాం. దేశాన్ని, రాష్ట్రాన్ని ఆశిస్తే ఎలా? ఇల్లు కట్టుకుంటున్నాం. మన జాగా ఉంది. ఆ జాగాకు పరిమితం కావాలి. కొంచెమైనా పక్కవాడి జాగాలోకి జరుగుదాం అనిపిస్తుంది. ఇంటి ముందు మెట్లు లేదా ప్రహరీనో, కొంచెమైనా పబ్లిక్ రోడ్ లోకి జరుపుదాం అనిపిస్తుంది. గ్రామాలలో పొలం గట్లు ఉంటాయి. మన పొలమేదో మనకుంది. వీలయినప్పుడు మన గెనాన్ని కొంచెం అవతలివాడి పొలంలోకి జరుపుదామనిపిస్తుంది. ఇవాళ మనదేశంలో అవినీతి మీద పెద్దఎత్తున ఉద్యమాలు నడుస్తున్నాయి. చర్యలు జరుగుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలలో అవినీతి నిర్మూలన ఒక హామీగా చేరుతున్నది. ఎందుకిదంతా? ఇతరుల సంపదపై ఆశ వల్లే. ఇతరుల అవసరాలపై ఆటాడదాం అనుకోవడం వల్లే. పొరుగింటి పుల్లకూర మీద ఆశతోనే అక్రమ సంపాదన వైపు దృష్టి మరలుతుంది. అయితే ఈ కోరికను చంపుకోవడం అంత సులభమేమీ కాదు. సాధన చెయ్యాలి. ఇంద్రియ నిగ్రహం చూపాలి. ధనకాంక్షని చంపుకోవాలి.
ఆధారం: ప్రొ. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020