భూమితోనబుట్టు భూసారమెల్లను
తనువులోనబుట్టు తత్వమెల్ల
శ్రమములోనబుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ! వినురవేమ!
“భూమి మీద ఉత్పత్తయ్యే సకల వస్తువులు భూమి నుండే పుట్టుతున్నాయి. మనం చెప్పే తత్వమంతా మన శరీరం నుంచే పుట్టుతున్నది. ప్రతిదీ మానవుని శ్రమ నుంచే పుట్టుతున్నది.” ఒక ప్రాథమికమైన ప్రశ్న అనాధిగా మానవులను ఆలోచింపజేస్తున్నది. ఆ ప్రశ్నను మూడు రకాలుగా పేర్కొనవచ్చు.
ఈ ప్రశ్నకు రెండు వాదాలు సమాధానం చెబుతున్నాయి. అవి 1. దైవవాదం, 2. శ్రమవాదం. ప్రాచీన మతగ్రంథాలు, పురాణేతిహాసాలు దైవవాదాన్ని వినిపిస్తాయి. ఆధునిక శాస్త్రాలు శ్రమవాదం చేస్తాయి. దైవవాదం చైతన్యం ముందుగా ఉందని, పదార్థం తర్వాత కలిగిందని చెబుతుంది. ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడని అతడు భగవంతుడని చెబుతుంది. భగవంతుడు తన రూపంలో మానవున్ని సృష్టించాడని చెబుతుంది. శ్రమవాదం పదార్థం ముందుగా ఉందని, చైతన్యం తర్వాత కలిగిందని చెబుతుంది. ఈ సృష్టికి కర్త ఎవడూ లేడని, ప్రకృతి అనాధిగా ఉందని, కాలక్రమంలో మార్పులు జరిగి ప్రకృతి, ప్రకృతిలోంచి ప్రపంచం ఏర్పడ్డాయని చెబుతుంది. మానవుడే తన రూపంలో భగవంతుని సృష్టించాడని చెబుతుంది. ఈ రెండు వాదాలతో వేమన రెండో వాదం వినిపించారు. భూమి, మనిషి, మానవ శ్రమ. ఇదొక త్రిపుటి. ప్రకృతిలో మనం చూస్తున్నదంతా ఈ త్రిపుటి.
సారాంశం : మనిషి శ్రమతో సర్వమూ ఉత్పత్తి అవుతున్నదని వేమన చెప్పాడు. ఆధునిక శాస్త్రాలు ఈ కంటికి కనిపించే ప్రకృతి అంతా పదార్థమని, దానిని ఎవరూ సృష్టించలేరు, నాశనం చెయ్యలేరు అని చెబుతున్నాయి. వేమన ఈ వాదాన్నే స్థూలంగా వినిపించారు. మానవుని శ్రమ నుంచే అన్ని భావాలు, వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయని వేమన పేర్కొన్నారు. భౌతికవాద ఛాయలు వేమనలో పుష్కలంగా ఉన్నాయి.
ఆధారం: ప్రొ. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 11/20/2023