దాశరధి... తెలుగు సమాజంలో, ప్రధానంగా తెలుగు సాహిత్యంలో ప్రత్యేక పరిచయం అవసరం లేని ప్రముఖ కవి. కొందరి దృష్టిలో అభ్యుదయకవిగా, మరికొందరి దృష్టిలో అద్భుత సినీ గేయ కవిగా, మొత్తం మీద అందరి దృష్టిలో ప్రముఖ కవిగా ఆధునిక తెలుగు సాహిత్యలో పేరుగడించిన వ్యక్తి దాశరథి, 1925 జులై 22 నాడు ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పెదగూడూరు గ్రామంలో జన్మించిన దాశరథి కృష్ణమాచార్యులు 1987 నవంబర్ 5న కీర్తిశేషులు అయ్యారు. దాశరథి తన మొత్తం 62 సం. రాల జీవితంలో తను జీవించిన కాలంలోని ప్రజలతోపాటు, తన తదనంతర తరాల వారు గుర్తుంచుకునేంత గొప్పగా తన సాహితీ కృషిని, జీవిత కార్యాచరణను సాగించారు. ఆయన తన ప్రఖ్యాత కవిత "ఆ చల్లని సముద్రగర్భం" లో వ్యక్తం చేసి శాస్త్రీయ దృక్పథాన్ని కొనసాగించాలని జనవిజ్ఞాన వేదిక సంకల్పించింది.
దాశరధి ఒక సమున్నత వ్యక్తిత్వం గల కవి. పీడిత ప్రజలకోసం ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నవాడు. ఆయన ఎంత గొప్ప కవో, అంత గొప్ప ప్రజాస్వామ్య వాది, స్వతంత్ర సమరయోధుడు, నిరంకుశ నిజాం పీడనలపై పోరాడిన ధీరుడు. ఒకవైపు బ్రిటిష్ వలస, నిరంకుశ నిజాం పాలనలకు వ్యతిరేకంగా సాహితీ క్షేత్రంలో కృషిచేశారు. మరోవైపు 'ఆంధ్రమహాసభ? ఆధ్వర్యంలో నిజాం అణచివేతలను ఎదిరించి ప్రజలతో కలిసి ప్రత్యక్షంగా పోరాట క్షేత్రంలో దిగాడు. చివరకు కఠిన కారాగారవాసాన్నీ ఎదుర్కొన్నాడు. అలా ఒకేసారి సాహిత్యం, పోరాటం - రెండింటిలో పాల్గొన్న సవ్యసాచి మన దాశరధి. బహుశా ఆధునిక తెలుగు సాహిత్యం తొలినాళ్ళలో ఆనాటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా అభ్యుదయ మార్గంలో సాహితీ సృజన చేసూ, దాని ఫలితంగా పాలకుల నిర్బంధానికి గురై జైలు శిక్ష కూడా అనుభవించిన తెలుగు కవి దాశరథి మాత్రమేనని అనడం అతిశయోక్తి కాదు. ఈ విధంగా తన మాటలకు, జీవితానికి తేడా లేకుండా జీవించిన వ్యక్తి దాశరధి.
నిజాం పాలనలో అనేక రకాల అణచివేతలకు గురైన తెలంగాణను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నిరంకుశ నిజాంపై గర్జించాడు. జైలు శిక్షా కాలంలో అక్కడ తనకిచ్చిన బొగ్గుతోనే జైలు గోడలపై తన ప్రఖ్యాత రచన "అగ్నిధార" ను రచించాడు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం (1946-51) నుండి, మలి దశ తెలంగాణ పోరాటం వరకు అన్ని తరాల ప్రజలు సగర్వంగా ప్రకటించుకునే 'నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని ఆయన నినదించింది కూడా ఈ జైలు గోదల మధ్యనే ఒక సాహితీ విశేషం. అలా ఆయన్ని ఖైదుచేసిన నిజామాబాద్ (ఇందూరు) ఖిల్లా జైలు నేటికీ ప్రఖ్యాతి గాంచింది. "మా తెలంగాణ ప్రజల నరాలను తెంపి అగ్నిలో మంచిన ఓ నిజాం పిశాచమా, నిన్ను పోలిన రాజు కానరాడు మాకెన్నడేని" అని నిజాం పై అగ్ని వర్షం కురిపించాడు దాశరథి, "నిజాం రాజు తరతరాల బూజు" అని దునుమాడుతూ, “చలో దగాకోరు, బటాచోరు నిజాం, దిగిపోమ్మని నగారాలు కొడుతున్నాయ్, దిగిపోవోయ్" అని నిజాం రాజుపై గర్జించాడు దాశరధి.
విముక్తి సాధించిన తర్వాత తెలంగాణ ఎవరిది? అది ఎవరికి దక్కాలి? ఈ ప్రశ్నలకు ఈ 'అగ్నిధార" లోనే ఆయన సమాధానం చెప్పి కవిగా తన దార్శనికతను చాటారు. నిరంకుశ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఈ తెలంగాణ రైతుదే అని చాలా విస్పష్టంగా ప్రకటించాడు. అలా ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముందు దృష్టి సారించాల్సింది వ్యవసాయ రంగంపైన. తక్షణం పరిష్కరించాల్సింది రైతు సమస్యలు. అలా ఆయన రచనల ప్రాసంగికత నేటికి కొనసాగటం ఆయన ముందుచూపుకొక నిదర్శనం.
అనేక మంది అభ్యుదయ కవులు, రచయితల వలె దాశరధి కూడా తన రచనలన్నింటా ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, సామాజిక దురాచారాలు, సాంసృతిక రుగ్మతలపై అక్షర బాణాలు ఎక్కుపెడుతూనే, మరొక ప్రధానమైన అంశాన్ని తన రచనల ద్వారా ప్రబోధించారు. అదే మానవ పరిణామం గురించిన శాస్త్రీయ అవగాహన. పరిణామం గురించిన మౌలిక అవగాహనను తక్కువ పదాలతో చాలా శక్తివంతంగా వ్యక్తంచేయడం కవిగా ఆయన ప్రతిభకు నిదర్శనం. భాష, భావం రెండింటిని తగుపాళ్ళలో ఉపయోగించిన కవి దాశరధి.
తన ప్రఖ్యాత "అగ్నిధార" కావ్యఖండికలోనే మానవ పరిణామాన్ని గురించి "?" (ప్రశ్నార్థకం) శీర్షిక గల కవితను పొందుపర్చాడు. "ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానల మెంతో" అంటూ ప్రారంభమయ్యే ఈ గేయంలో కేవలం రెండు పంక్తులలోనే మొత్తం భూమి పుటుక, మానవ పరిణామం గురించిన శాస్త్రీయ అవగాహనను చాలా సరళంగా తెలియజేశాడు. సూర్యుని నుంచి వేరుపడిన అనేక అగ్నిముద్దల్లో, చల్లబడిన ఒక మద్దయే మన భూమి. ఈ శాస్త్రీయ అవగాహనని ప్రజలకు తెలియచేసేలా 'భూగోళం పుటుక కోసం రాలిన సురగోళాలెన్నో" అని రాశారు. అలా చల్లబడిన ఈ భూగ్రహంపై కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జీవం ఏర్పడింది. ఈ జీవపదార్థాం అనేక మార్పులు చెందుతూ, నేటి అత్యున్నతమైన మానవుని రూపంగా ఆవిర్భవించింది. ఈ మానవ పరిణామాన్ని చాలా చక్కటి, చిక్కటి పదాలలో వ్యక్తం అయ్యేలా “ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో." అని రాశారు. ఇలా సంక్లిష్ట శాస్ర విషయాలను చాలా సులభశైలిలో పామరులకు కూడా అర్థం అయ్యేలా భూగ్రహ, మానవ పరిణామాల గురించి శాస్త్రీయ అవగాహనను కల్పించాడు.
తెలంగాణ ప్రజల కన్నీళ్ళను “అగ్నిధార"గా మలిచి నిజాం పాలనపై ఎక్కుపెట్టిన తన పద్యాలను పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం అద్భుత రచనలు దాశరథి చేశాడు. సముద్రం మనకు పైకి ప్రశాంతంగా అగుపించినా, తన గర్భంలో ఎన్నో అగ్ని పర్వతాలున్నాయని హెచ్చరించాడు. నల్లని, నిర్మల ఆకాశంలో మనకు కనిపించే సూర్యుడిలాంటి నక్షత్రాలు అనేకం ఉన్నాయని తెలియజేశాడు. ఇలా సముద్ర శాస్త్ర, ఖగోళ శాస్ర విశేషాలను ఈ కవితలో ప్రారంభంలోనే ప్రస్తావించాడు. రాజులతో నిండిన గత చరిత్ర నుండి, నేటి వర్తమాన ప్రపంచం వరకు సమస్యల పరిష్కారం పేరుతో సాగిన సాగుతున్న అకాల యుద్దల వల్ల అనేక మంది ప్రజలు బలవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అలాగే కులమతాల పేరుతో చాలా మంది అమాయకులు హత్యచేయబడుతున్నారని ఆవేదన చెందాడు. ఈ సమస్యలన్నీ నేటికీ కొనసాగటం ఒక హేయమైన వాస్తవం. సమస్యలను, బాధలను ఏకరువు పెట్టడమే కాకుండా వాటి పరిష్కారం కూడా ఆయన చాలా కవితాత్మకంగా ఇదే కావ్యంలో పేర్కొన్నారు. మంచిపాలన లక్ష్యం అన్నార్తులు, అనాధులుండని నవయుగం వైపుకు సమాజాన్ని నడిపించడమేనని విస్పష్టంగా ప్రకటించారు. కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పాలన సాగాలని, ఆ పాలనలో పిల్లల భవిష్యత్తుకు కూడా భరోసా ఉండాలని ఆయన వాంఛించాడు.
గత మూడు దశాబ్దాలుగా జనవిజ్ఞాన వేదిక ప్రధానంగా అక్షరాస్యతా ఉద్యమం, మద్యనిషేధ ఉద్యమం, వనితా కళా యాత్రలు, శాస్ర ప్రచారం, మూఢనమ్మకాల వ్యతిరేక కార్యక్రమాల సందర్భంగా శాస్ర విషయాలను - సాంసృతిక అంశాలను మిళితం చేసింది. ఈ అనుభవం నుండేదేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు తమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి సాంస్కృతిక రంగాన్ని ఉపయోగించుకోవడం మన అందరికి తెలుసు.
శాస్త్రీయ దృక్పథానికి, సాహిత్యానికి గల సంబంధం ఈనాటిది కాదు. ప్రధానంగా తెలుగు సాహిత్యంలో వేమన అతి చిన్న పదాలు, పాదాలతో కూడిన తన పద్యాల ద్వారా ఎన్నో హేతువాదధోరణులను ప్రజలలో విజయవంతంగా వ్యాప్తి చేయడం మన ఘనమైన సాహితీ వారసత్వం. ఆ క్రమంలో ఎందరో ప్రముఖ కవులు, రచయితలు, సంస్థలు, ఉద్యమాలు తమ కార్యాచరణలో సాహిత్యాన్ని ఒక ఆయుధంగా చేసుకొని తమ భావాలను ప్రజలలో వ్యాప్తి చేశారు. ఈ వెలుగులో దాశరథి సాహిత్యాన్ని ప్రధానంగా ఈ గేయాన్ని ప్రజలలో ప్రచారంలో పెట్టాలని జె.వివి సంకల్పించింది. ఈ నేపధ్యంలో ఎంతో విస్తృతమైన మన తెలుగు సాహిత్యంలో "పరిణామ గేయకర్త దాశరథి" అని సగర్వంగా జెవివి ప్రకటిస్తున్నది. ఈ కవిత ద్వారా దాశరథి రగిలించిన శాస్త్రీయ సృహ ఆధారంగా పురోగతి దిశగా మనందరం
ఏ గ్రహమూ చేయలేని పని
మన పుడమి చేసి చూపింది
నీటిని ఒడిసిపట్టి
తన ఖ్యాతిని చాటింది
చుక్క చుక్కని దరిజేర్చి
వాగులుగా మార్చింది వంకలుగా తీర్చింది
నదుల్ని సంద్రాల్ని ఓపిగ్గా మోస్తోంది
గ్రహరాశిలో తన వాసిని చాటింది
ఇక జలం జీవమై ప్రాణం పోసింది
ఏక కణం బహుకణమై పుడమిన విస్తరించింది
జీవకోటికి ఆధారమై అక్కునజేరింది
రక్తంలో భాగమై సారధిగా నిలిచింది
ఓజోను పొరను చించి ఉష్ణాన్ని పెంచావ్
చెట్లని హరించివేసి మోడుగా మిగిలావ్
ఎండిన గొంతుకతో నీటికై ఏడుస్తున్నావ్
అందుకే ఇకనైనా మేలుకో బిందు
బిందువునీ అందుకుని
జలానికి మళ్ళీ పురుడు పోయి
జన్మనిచ్చిన భువి రుణం తీర్చుకో
నీటి రాహితిని ఎదురొడ్డ
నదీమ తల్లి నీటితీరువా వాడుకో
పొలాల పంటలు పండించి పదుగురిని
అతిధిగా చూసుకో బతుకును మార్చుకో
రచయిత:-రాజా, సెల్:9490098908
చివరిసారిగా మార్పు చేయబడిన : 12/26/2023