నీటి ప్రవాహ ధాటికి చాలా ఇళ్ళు నేలమట్టమయ్యాయి. బళ్ళు కొట్టుకుపోయాయి. ప్రాణనష్టం కూడా జరిగింది. పంటనష్టం జరిగింది. నీటికి, నీటి ప్రవాహానికి అంత శక్తి వుంటుంది. నీటికి ఊర్థ్వపీడనం మరియు అథోపీడనం కూడా వుంటుంది. ఈ రెండు పీడనాలు ఒకే సమయంలో మనం గమనిస్తాం. ఎలాగంటారా రండి చేసి చూసి తెలుసుకుందాం.
కావలసిన పరికరాలు : రెండు వైపులా తెరచివున్న రేకు డబ్బా, దళసరి కాగితం (కార్డుబోర్డు), కత్తెర, ఒక బకెట్లో నీరు, ఒక గ్లాసు.
విధానం : ఓ టేబుల్ పై దళసరి కాగితం పరచి దాని పై రెండువైపులా తెరచివున్న (అంటే అడుగు భాగం లేని డబ్బా అన్నమాట) రేకు డబ్బాను వుంచి, డబ్బా పరిధి కంటే కాస్త పెద్దగా కాగితాన్ని కత్తెరతో కత్తిరించండి. అరచేతిపై కాగితాన్ని, దానిపై డబ్బాను వుంచి నీరు గల బకెట్లో మెల్లగా దించండి. రేకుడబ్బా సగం మునిగిన తరువాత రెండవ చేతితో డబ్బా అంచు పట్టుకొని మొదటి చేతిని మెల్లగా తీసివేయండి. చేతిని తీసివేసిన డబ్బా క్రింది. దళసరి అట్టముక్క డబ్బాను అంటి పెట్టుకునే వుంటుంది . ఎందుకు? ... ఆ ....కరెక్ట్. నీటి ఊర్థ్వపీడనం వల్ల దళసరి కాగితం పైకి నెట్టబడి డబ్బాకు అంటిపెట్టుకుని వుంటుంది. డబ్బాలోని నీరు కూడా ప్రవేశించదు.
ఇప్పుడు గ్లాసును తీసుకొని దాంట్లో నీరు తీసుకొని మెల్లగా బకెట్ నీటి మట్టం వెలుపల గల డబ్బా కంఠం గుండా నీరు పోయండి. డబ్బాలో, నీటిమట్టము పెరుగుతూ, బకెట్ నీటి మట్టానికి సమానంగా వచ్చినప్పుడు నీరుపోయడం ఆపండి. అంతే! ఆశ్చర్యంగా దళసరి కాగితం రేకు డబ్బాను వీడి బకెట్ నీటిలో క్రిందిభాగాన్ని చేరుతుంది. ఎందువల్ల? ఏమి జరిగింది? తెలుసుకుందామా...
వివరణ : ఊర్థ్వపీడనం(పైకి పీడనం) వల్ల దళసరి కాగితం డబ్బాకు అంటుకొని నీరు కూడా డబ్బాలోనికి పోకుండా వుంది కదా. మనం నీరు, పై నుండి పోసినప్పుడు నీటి అథోపీడనం (క్రిందికి పీడనం) వల్ల పేపరు పై క్రిందికి పీడనం పెరుగుతుంది. డబ్బాలో నీటి మట్టం, బకెట్లోని నీటి మట్టము రెండూ సమానం. అయినప్పుడు ఊర్థ్వపీడనం (క్రిందికి ఒత్తిడి), అథోపీడనం (పైకి ఒత్తిడి) రెండూ సమానం అయి పరస్పరం రద్దు అయిపోయింది. అందుకే దళసరి కాగితం డబ్బా నుండి విడిపోయి, భారం వల్ల నీటి అడుగు భాగానికి చేరుతుంది. చూసారా! ఒకేసారి మనం నీటి ఊర్థ్వపీడనం, అపీడనం రెండూ గమనించాం కదా. అదన్నమాట.
ఆధారం: యుగంధర్ బాబు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/30/2020