వేపాకులా ఉంటుందని కరివేపాకు నల్ల (కరి) వేప అని అంటారు. కరివేపాకు ముర్రయా కొమెనిగి (స్ప్రింగెల్) రూటేసి జాతికి చెందిన మొక్క. ఇది నిలువుగా పెరిగే బహు శాఖీయ, బహు వార్షిక పొద. దీనిలో స్వజాతి సంపర్కం జరుగుతుంది. మొట్ట మొదటిగా దీని ఉనికిని భారతదేశంలో గుర్తించారు. ఇది భారతదేశం అంతటా ఉంటుంది. ఒక్క ఎత్తైన హిమాలయాల్లో తప్ప రావి నుండి సిక్కిం వరకు, అస్సాం, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. కరివేపాకు అకులను ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం లో , శ్రీలంకలో విరివిగా సువాసన కొరకు వాడతారు. తూర్పు ప్రాంతాలైనా బర్మా, మలేషియా, దక్షిణ ఆఫ్రికా దేశాలలో కూడా కరివేపాకును అధిక మొత్తంలో పండిస్తారు. ఈ మధ్యకాలంలో కరివేపాకు వాణిజ్య పంటగా ప్రధాన్యత సంతరించుకుంది.
ఇది 37 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతను, 16 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. కానీ 16 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉంటె మొక్క పెరుగుదల తగ్గుతుంది. నేలలు : వివిధ రకాల నేలల్లో కరివేపాకును సాగు చేయవచ్చు. నీరు నిలవని తేలికపాటి గరప నేలలు అనుకూలం. నీరు నిలిచే నల్లరేగడి భూములు సాగుకు పనికిరావు. మురుగు నీటి పారుదల వసతిగల ఎర్ర గరప నేలలు, ఒండ్రు నేలలు మంచివి. నీరు ఎక్కువయితే తట్టుకోలేదు.
సాధారణంగా ఖరిఫ్ (జూలై - ఆగస్టూ) లో విత్తుతారు.సాధారణంగా ఖరిఫ్ (జూలై - ఆగస్టూ) లో విత్తుతారు.
దేశవాళీ రకాలు : ముదురు ఆకుపచ్చ రంగు గల ఆకులు, కాడలు కలవి. లేత ఆకుపచ్చ రంగు గల కాడలున్నవి.
సువాసిని : ధార్వాడ్ వారు సువాసిని (డి.డబ్ల్యు.డి - 1) అనే కరివేపాకు రకాన్ని విడుదల చేసారు. ఈ రకం ఆకులు ముదురు ఆకుపచ్చరంగులో మెరుస్తూ ఎక్కువ సువాసన కలిగి ఉంటాయి. పిలక మొక్కల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతాయి. మెట్ట ప్రాంతానికి అనుకూలం. కానీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలను ఈ రకం అంతగా తటుకోలేదు. నునేశాతం 5.2 శాతం. ఈ రకం 60 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కూడా సువాసనను కోల్పాదు. అందుకని ఆరబెట్టి పొడి చేసుకోవడానికి ఇది మిక్కిలి అనువైన రకం.
డి.డబ్ల్యూ.డి. – 2 : ఈ రకం ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సువాసన తక్కువ కానీ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. కణుపుల మధ్య దూరం చాలా ఎక్కవ. నునేశాతం 4.09 శాతం డబ్ల్యూ.డి – 1 కన్నా ఎక్కువ దిగుబడి ఇస్తుంది.
సెంకాంపు : ఇది తమిళనాడులోని కోయంబత్తూరూ జిల్లాలోని కరమాడై ప్రాంతంలో పండించాబడే రకం. ఆకు కాడ ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ఆకు ఎక్కువ నూనేశాతం, సువాసన కలిగి ఉంటుంది.
భువనేశ్వర్ : నీటి పారుదుల ప్రాంతాల్లో ఎక్కువగా సాగుచేయబడుతుంది.
నారుపోయడం : కరివేపాకు ముఖ్యంగా విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువ దిగుబడి గల మొక్కల నుండి బాగా పండిన పండ్లను సేకరించి వాటిని నారు మొలకల ఉత్పాత్తికి వాడాలి. ఈ విత్తనాలను నర్సరీ నందు కానీ లేక పాలిబ్యాగుల్లో (1:1:1 నిష్పత్తిలో ఇసుక : మట్టి : పశువుల ఎరువు నింపబడినవి) విత్తుకోవాలి. ఎకరానికి 250 కిలోల కాయలు లేదా 80-100 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను సేకరించి వెంటనే విత్తుకోవాలి. ఆలస్యంగా నాటుకుంటే మొలకశాతం తగ్గుతుంది. నారుమడులు (1 మీ. * 1 మీ. విస్తీర్ణంలో, 15 సెం.మీ ఎత్తుతో) తయారు చేసి వరుసల్లో 10 సెం. మీ. ఎండంతో విత్తనాలను విత్తుకోవాలి. గడ్డి కప్పి రోజుకు రెండుసార్లు నీటిని చల్లాలీ. పెద్ద మొక్కల చుట్టూ ఉన్న చిన్న మిక్కల్ని వేర్లతో జాగ్రత్తగా తీసి వర్షాకాలంలో వెంటనే మరల నాటడం వలన కూడా కరివేపాకు వ్యాప్తి చెందుతుంది.
నేల తయారీ : విత్తనాన్ని నేరుగా భూమిలో పెట్టడం ద్వారా మొక్క పెరుగుదలలో లోపాలు ఉండవచ్చు. కాబట్టి 1-1.5 సంవత్సరాలు మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందవచ్చు.
మొదటగా నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45*45*45 సెం.మీ. గుంతలను 1*1 మీ. దూరంలో తీయాలి. ఒక హెక్టారుకు పదివేల మొక్కలు అవసరం అవుతాయి. పశువుల ఎరువు ప్రతి గుంతకు 10 కిలోల చొప్పున వేయాలి.
ఎరువులు : సాధారణంగా కరివేపకు కృత్రిమ ఎరువులు వాడరు. కానీ అధిక దిగుబడులు కోసం హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు, 60:10:10 కిలోల నిష్పిత్తిలో నత్రజని : భాస్వరం : పోటాష్ వేయాలి. సగ భాగం నత్రజని, మొత్తం భాగం భాస్వరం, పోటాష్ జూన్ మాసంలో వేయాలి. మిగతా సగం నత్రజని ఆరు మాసాల తర్వాత వేయాలి. ఈ ఎరువులు వర్షాకాలంలో వేసుకోవాలి.
నీటి యాజమాన్యం : మొక్కలు నాటిన వెంటనే బోదెల ద్వారా నీరు పెట్టాలి. వర్షం పడని సమయంలో వారానికి ఒకసారి నీరు పెట్టాలి.
అంతరకృషి – అంతర పంటలు : కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నాశనం చేయాలి. 1 మీ. ఎత్తు పెరిగిన తర్వాత మొక్క చివర్లను తుంచి వేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కవుగా వచ్చి గుబురుగా పెరుగుతుంది. పప్పుధాన్యాలు, ఆకు కూరలను అంతర పంటలుగా పండించవచ్చు.
సస్యరక్షణ : గొంగళి పురుగులు ఆకులను తిని నష్టపరుస్తాయి. నివారణకు మలాధియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పొలుసు పురుగులు కాండం పై చేరి రసాన్ని పిల్చి వేస్తాయి. మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. నివారణకు డైమిధోయేట్ 2 మి. లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేసిన తర్వాత 10 రోజుల వ్యవధి ఇచ్చి అకుకోయాలి. అకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రా. కార్బొండిజమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
దిగుబడి – కోత కోయటం : మొదటి సంవత్సరంలో నాటిన 7-15 నెలల్లో కోతకు వస్తుంది. మూడు సంవత్సరాల తర్వాత వాణిజ్య పరంగా కోతకు వస్తుంది. ఏడాదికి మూడు నుండి నాలుగు కోతలు వస్తాయి. ఎకరానికి ప్రతి కోతకు 1000 కిలోలు, సంవత్సరానికి 4000 కిలోల దిగుబడి వస్తుంది. ఇలా 20-25 సంవత్సరాల వరకు కోత కోయవచ్చు.
నిల్వ : ఆకును ఎండబెట్టి, పొడిచేసి నిల్వ చేసుకోవచ్చు. ఎండ బెట్టిన ఆకులు కూడా కొన్ని రోజుల వరకు రోజు వారి కూరలు, పచ్చళ్ళలో వాడుకోవచ్చు.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక
చివరిసారిగా మార్పు చేయబడిన : 10/16/2023