చినీ బత్తాయి తోటలలో ఎక్కువ దిగుబడికి, నాణ్యతకు స్టూల పోషకాలయిన నత్రజని, భాస్వరం, పొటాషు లతో పాటు సూక్ష్మధాతువులయిన జింక్, మెగ్నిషియం, మాంగనీస్, ఇనుము, బోరాన్, రాగి వాడకం కూడా చాలా ముఖ్యమైనది. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గించి రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం, నేలలో ఉదజని సూచిక 8.0 కంటే ఎక్కువగా ఉండడం, నేలలో సున్నం కలిగి ఉండడం, సాగునీటిలో హానికర లవణాలు ఉండడం, నీటి ఎద్దడి లాంటి ప్రతికూల పరిస్థితుల్లో చెట్లలో సూక్ష్మధాతు లోపాలు కనిపిస్తాయి. సూక్ష్మధాతువులు చెట్టుకు తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ అవి లోపిస్తే వాటి ప్రభావం నాణ్యత, ఉత్పత్తులపై ఎంతగానో ఉంటుంది.
జింకు ధాతువు లోపమున్నప్పుడు ఆకులు చిన్నవిగా, సన్నవిగా ఉండి ఆకుల ఈనెలు, వాటి పక్కనున్న కణజాలాలు ఆకుపచ్చగా ఉండి, ఈనెల మధ్య భాగం పాలిపోయి పసుపు రంగులో ఉంటుంది. పాలిపోయిన ఆకులు తొందరగా రాలిపోతాయి. ఆకులు దగ్గర దగ్గరగా కుచ్చగా ఏర్పడి కొమ్మల ఎదుగుదల తగ్గుతుంది. కొమ్మలు చివరి నుండి కిందకు ఎండుకుంటూ వస్తాయి. అంతేకాకుండా పూత తక్కువగా రావడం, పిందె తక్కువగా ఏర్పడి ఎక్కువగా రాలిపోవడం, కాయల సైజు తక్కువగా ఉండడం, పండు చప్పగా ఉండడం జరుగుతుంది.
జింకు ధాతువు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 5 గ్రా, జింక్ సల్ఫేట్, 1.5 గ్రా. సున్నం + 10 గ్రా. యూరియాను కలిపిన ద్రావణాన్ని చెట్టు కొత్త చిగురు తొడుగుతున్న సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
ఈ ధాతువు లోపం చినీ బత్తాయి తోటలలో చాలా ఎక్కువగా ఆకు తొడిమ వద్ద మధ్య ఈనెకు ఇరువైపులా త్రిభుజాకారపు లేదా బెల్లం లాగా ఆకుపచ్చని భాగం ఉండి, మిగిలిన ఆకు అంతా పాలిపోయిన లేదా కంచు రంగుకు మారుతుంది. ఈ ధాతువు లోపం ఉన్నప్పుడు ఆకులు తొందరగా రాలడం కాపు తక్కువగా రావడం, కాయసైజు, నాణ్యత తగ్గడం జరుగుతుంది.
మెగ్నిషియం ధాతువు లోపాన్ని సవరించడానికి లీటరు నీటికి 2 గ్రా. మెగ్నిషియం సల్ఫేట్, 10 గ్రా. యూరియా కలిపిన ద్రావణాన్ని చెట్టు కొత్త చిగురు వచ్చేటప్పుడు 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
ఈ ధాతులోపం వలన ఈనెలు ఆకుపచ్చగా ఉండి, మిగిలిన భాగం అంతా లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగు ఉండి, లోపం తీవ్రమైనప్పుడు ఆకంతా తెల్లగా మారుతుంది. ఈనెలు ఆకుల్లో అల్లినట్లు కనిపిస్తాయి. కాయ సైజు తగ్గి నాణ్యత లోపిస్తుంది. రెమ్మలు చివరి నుంచి కిందకు ఎండుకుంటూ పోతాయి. ఈ ధాతులోపం సవరణకు లీటరు నీటికి 2 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రా. నిమ్మ ఉప్పు + 10 గ్రా. యూరియా కలిపిన ద్రావణాన్ని చెట్టు కొత్త ఆకు తొడిగే సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. నిమ్మ ఉప్పుకు బదులుగా నిమ్మరసాన్ని వాడవచ్చు.
జింకు ధాతులోపం మాదిరిగానే ఈనెల మధ్యభాగం పచ్చదనం కోల్పోయి ఆకుసైజు మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఈ ధాతులోపంతో జింకు ధాతు లోపం కలిసినప్పుడు ఎండుపల్ల ఎక్కువగా పడుతుంది. ఆకుల ఈనెల మధ్యభాగం ఏనుగు దంతం ఆకారంలో మచ్చలుండటం మాంగనీస్ ధాతులోపం ముఖ్యలక్షణం.
ఈ ధాతులోపం సవరించడానికి లీటరు నీటికి 2 గ్రా. మాంగనీస్ సల్ఫేట్ + 10 గ్రా. యూరియా కలిపిన ద్రావణాన్ని చెట్టు కొత్త ఆకు తొడిగే సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి.
ఆకులు మందంగా చర్మంలో ఉండి, జీవం కోల్పోయి ఉంటాయి. ఆకు అడుగు భాగాన ఈనెలు ఉబికి కొన్ని పగిలి ఉంటాయి. కొన్ని ఆకులు వంకర తిరిగి మూసుకొని ఉంటాయి. కాయలు గట్టిపడి వికృతాకారంగా ఏర్పడి పగులుతాయి. కాయతోలు మందమై తెల్లని తొక్కలో గోధుమ రంగు మచ్చలుంటాయి.
ఈ ధాతులోప సవరణకు లీటరు నీటిలో 2 గ్రా. సాల్యుబోర్ లేదా బోరాక్స్ + 10 గ్రా. యూరియా కలిపిన ద్రావణాన్ని చెట్టు కొత్త ఆకు తొడిగే దశలో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది.
రైతులు రాగి సంబంధ శిలీంధ్ర నాశకాలు పిచికారీ చేయడం వలన ఈ లోపం అంతగా కనిపించదు. బతాయి తోటల్లో రాగి ధాతులోపం అరుదుగా కనిపిస్తుంది.
చాలా సందర్భలలో ఒకే తోటలో గానీ, ఒకే చెట్టులోగానీ పలు సూక్ష్మధాతులోపాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు సూక్ష్మధాతువుల మిశ్రమం ద్రావణం చెట్టుపై కొత్త ఆకు తొడిగే సమయంలో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. సూక్ష్మధాతువుల మిశ్రమ ద్రావణాన్ని తయారు చేయడానికి లీటరు నీటికి 5 గ్రా, జింక్ సల్ఫేట్, 2 గ్రా. మెగ్నిషియం సల్ఫేట్, 2 గ్రా. మాంగనీస్ సల్ఫేట్, 2 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రా. బోరాక్స్, 6 గ్రా. సున్నం, 10 గ్రా. యూరియా, 0.5 మి.లీ. సబ్బునీరు వంతున కలపాలి. సూక్ష్మధాతు ద్రావణాన్ని పిచికారీ చేసేటప్పుడు 10 లీ. ద్రావణానికి 5 మి.లీ. సబ్బునీరు (ఆప్పా, శాండోవిట్) కలపడం వల్ల ధాతువుల పనితనం పెరుగుతుంది.
చీని బత్తాయి తోటలలో సూక్ష్మధాతు మిశ్రమ ద్రావణాలను సూక్ష్మధాతు లోప సవరణకు ఆకులు చిగురించే సమయాల్లో పిచికారీ చేసుకోవాలి. చీని బత్తాయి తోటలు సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు జూలై, జనవరి మాసాల్లో చిగురిస్తాయి.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక
చివరిసారిగా మార్పు చేయబడిన : 3/19/2020