"పేదవారి ఆపిల్" గా పిలుచుకునే జామకు పండ్లలో విశిష్ట స్థానం ఉంది. అందులో అధికంగా లభించే విటమిన్-సి, ఇతర ఔషధ గుణాల వల్ల మధుమేహంతో బాధపడే వారికి జామ పండ్లు మంచి ఆహారం. దేశీయంగా, అంతర్జాతీయంగా సుమారు 40 దేశాలలో జామ మార్కెట్ అవుతోంది. సంప్రదాయ పద్ధతిలో జామ సాగు చేపట్టినప్పుడు చెట్లు బాగా పెద్దగా పెరిగి సరైన దిగుబడి ఇవ్వలేక పోతున్నాయి. ఈ పద్ధతిలో ఎకరానికి కేవలం 4-5 టన్నుల దిగుబడి మాత్రమే లభిస్తుంది. కనుక ప్రస్తుత సాగు పద్ధతిలో మార్పు చేసి దిగుబడులు అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక, అత్యధిక సాంద్రతలో మొక్కలు నాటి సాగుచేసే పద్ధతి ఊపందుకుంటోంది. ఈ అత్యధిక సాంద్రత పద్ధతినే మెడో పద్ధతిగా కూడా పిలుస్తున్నారు. ఈ పద్ధతిలో వెుక్క వరిమాణాన్ని అవసరం మేరకు నియంత్రించాలి. తద్వారా వెలుతురు ప్రసరణ బాగా జరిగేటట్లు చూడడం వలన వివిధ సాగు పనులు, ఉదా కొమ్మ కత్తిరింపులు, సస్యరక్షణ చర్యలు, మొదలగునవి తేలికగా చేయవచ్చు.
వాణిజ్య రకాలైన అలహాబాద్ సఫేద్, లక్నో-49 అధిక సాంద్రత, అత్యధిక సాంద్రత విధానానికి బాగా అనుకూలం.
మెడొ పద్ధతిలో ఎకరానికి 2000 మొక్కలు 2 మీ X 1 మీ. దూరంలో నాటుతారు. అదే మన సాంప్రదాయ పద్ధతిలో 6 మీ. X 6 మీ. దూరంతో ఎకరానికి 112 మొక్కలు నాటేవారు. జామను అధిక సాంద్రత పద్ధతిలో కింద తెలిపిన దూరం పాటించి నాటుకోవచ్చు.
దూరం/మీ |
మొక్కలు/ఎ |
దిగుబడి/ఎ |
3 x 1.5 |
888 |
10 - 12 టన్నుల 3వ సంవత్సరంలో |
3 x 3 |
444 |
7 - 8 టన్నులు |
6 x 3 |
222 |
5 - 6 టన్నులు |
2 x 1 |
2000 |
16 - 20 టన్నులు |
ఎక్కువ చలి ఉండే డిసెంబర్ - జనవరి నెలల్లో తప్ప సంవత్సరంలో ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఒకటిన్నర అడుగుల పరిమాణంతో పొడవు, వెడల్పు, లోతు ఉండే గోతులు తీసి 10-15 కిలోల పశువుల ఎరువు, 500 గ్రా. సూపర్ ఫాస్ఫేట్ కలిపి నింపుకోవాలి.
ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను, అడ్డదిడ్డంగా ఉన్న కొమ్మలను తీసివేయాలి. గత సంవత్సరం కాపు కాసిన కొమ్మలను నాల్డింట మూడవ వంతు కత్తిరిస్తే పక్క కొమ్మలపై కాపు బాగా వస్తుంది. కాయలను చిన్న కొమ్మలతో పాటు కోయడం ద్వారా కూడా ఇదే రకమైన ఫలితాన్ని పొందవచ్చు.
కాపు పూర్తయిన తర్వాత మే మాసంలో 50 శాతం వరకు కొమ్మలను కత్తిరించాలి. తద్వారా వర్షాకాలపు కాపును నియంత్రించవచ్చు.
అధిక సాంద్రతలో మొక్కలను సిఫారుసు చేసిన ఎరువుల మోతాదు (ప్రతి చెట్టుకు)
చెట్టు వయస్సు |
యూరియా |
ఎస్.ఎస్.పి |
||
జూన్ |
సెప్టెంబర్ |
సెప్టెంబర్ |
జూన్ |
|
1 |
90 |
40 |
185 |
50 |
2 |
180 |
110 |
370 |
100 |
3 |
370 |
115 |
555 |
150 |
4 |
360 |
150 |
740 |
200 |
5 ఆ పైన |
450 |
190 |
900 |
250 |
సాధారణంగా జామలో సంవత్సరానికి రెండుసార్లు కాపు వస్తుంది. ఈ విధంగా వచ్చే దిగుబడిలో కాయ సైజు, నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి వాణిజ్య రీత్యా సంవత్సరం మొత్తంలో చలికాలంలో (మృగ్ బహార్) పంట తీసుకోవడం వల్ల దిగుబడి బాగుంటుంది. కాపుని నియంత్రించేందుకు ఈ కింది వివరించిన ఏదో ఒక పద్ధతిని అవలంబించాలి.
ఫిబ్రవరి నుండి మే నెల వరకు నీటిని పూర్తిగా నిలపాలి. దీని ఫలితంగా చెట్టు ఏప్రిల్ – మే నెలల్లో ఆకులను పూర్తిగా రాల్చివేసి నిద్రావస్థకు చేరుకుంటుంది. జూన్ నెలలో చెట్టు చుటూ పాదు చేసి ఎరువులు వేయాలి. 20-25 రోజులలో కొత్త చిగురు వచ్చి శీతాకాలంలో కాపు వస్తుంది.
కాయ కోత పూర్తి అయిన తరువాత మే మాసంలో 50 శాతం వరకు కొమ్మలను కత్తిరించాలి. ఈ విధంగా చేయటం వలన వర్షాకాలంలో వచ్చే కాపును నియంత్రించుకోవచ్చు.
తీసుకునే కాలంపై ఆధారపడి ఉంటుంది. వర్షాకాలం పంట కంటే శీతాకాలం పంటలో జామ నాణ్యత బాగా ఉంటుంది. పూత తరువాత 4-5 నెలలకు జామ కోతకు వస్తుంది. జామ కోతకు వచ్చినప్పుడు ఆకుపచ్చ రంగు నుండి లేత ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఒక చెట్టులో అన్ని కాయలు ఒకే మారు పక్వదశకు రానందున జామ కాయలను పలుమార్లు కోయవలసి వస్తుంది. వర్షాకాలపు పంటలో 2-3 రోజుల వ్యవధిలో, శీతాకాలపు పంటలో 4-5 రోజుల వ్యవధిలో కాయలు కోయాలి.
జామ కాయ కోసేటప్పుడు తొడిమెతో రెండు ఆకులు ఉండేటట్లుగా కోసినట్లయితే కాయ తాజాగా ఉండి దూర ప్రాంత రవాణాకు అనుకూలంగా ఉంటుంది. కోసిన కాయలను ప్లాస్టిక్ క్రేట్లలో ఉంచినట్లయితే కాయ నిల్వ శాతం పెరుగుతుంది. పక్వానికి రాని చీడపీడలు సోకిన కాయలను ఏరివేయాలి.
శీతాకాలపు కాపు సెప్టెంబర్ నుండి జనవరి వరకు కోతకు వస్తుంది. మంచి యాజమాన్య పద్ధతిలో నాటిన తోటలు రెండవ సంవత్సరంలో కాపుకు వస్తాయి. నాటిన మూడో సంవత్సరం నుండి లాభదాయకమైన దిగుబడులు వస్తాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉన్న కాయలు కోయాలి. అధిక సాంద్రతలో జామ సాగు చేసినప్పుడు చెట్టుకు 10-15 కిలోల చొప్పున ఎకరాకు 8 నుండి 10 టన్నులు. అత్యధిక సాంద్రతలో సాగు చేసినప్పుడు 10 నుండి 20 టన్నుల దిగుబడి పొందవచ్చు.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/18/2020