ఆహార దాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినప్పటికీ పంటల సాగులో విచక్షణా రహితంగా వినియోగించే రసాయనాల ద్వారా అనేక అనార్థాలు సంభవిస్తున్నాయి. నేల భౌతిక లక్షణాలు దెబ్బతిని నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతున్నాయి. సూక్ష్మ పోషక లోపాలు తపచుగా కనబడుతున్నాయి. ఉత్పాదకత తగ్గి, ఖర్చు పెరిగిపోతుంది. ఈ నేపధ్యంలో నేల సహజత్వాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు సాధించేందుకు పచ్చిరొట్ట పైర్లు ఎంతగానో సహకరిస్తాయి.
పచ్చిరొట్ట ఎరువులు
తేలికగా చివికి పోయే స్వభావం కలిగే నేలకు సత్తువను చేకూర్చే పంటలు కానీ, అటువంటి లక్షణాలు గల పంటల ఆకులను గానీ పచ్చిరొట్ట ఎరువులు అంటారు.
పచ్చిరొట్ట పంటల సాగు
- పచ్చిరొట్ట పైర్లను పొలంలో చల్లి అవి పెరిగాక అదే పొలంలో కలియదున్ని పంట వేసుకోవడం.
ఉదా:లుగ, జనుము, పిల్లి పెసర, అలసంద, వెంపల్లి, ఉలవ, పెసర.
- పచ్చిరొట్ట ఆకులను బయట నుండి సేకరించి పొలంలో కలియదున్ని కుళ్ళనిచ్చి తర్వాత పంట వేసుకోవడం.
ఉదా:గ్లైరిసీజియా, జిల్లేడి, గానుగ, నేల తంగేడు.
- పొలం గట్లవెంట, బావుల దగ్గర గ్లైరిసీడియా చెట్లు నాటితే ఒక్కో చెట్టు ఏటా రెండుసార్లు (జులై, డిసెంబర్ నెలల్లో) 100-125 కిలోల పచ్చిరొట్టనిస్తుంది.
పచ్చిరొట్ట పైర్లు – లక్షణాలు
- త్వరగా ఎదిగి ఎక్కువ ఆకులు, పచ్చికాండం ఇవ్వగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి.
- మొక్క భాగాలు మృదువుగా, పెళుసుగా, రసపూరితంగా ఉండి త్వరగా కుళ్ళే స్వభావం కలిగి ఉండాలి.
- అన్ని రకాల నేలలు, వాతావరణ పరిస్తితులు, నీటి ఎద్దడిని తట్టుకునే సామర్థ్యం కలిగి, పప్పుజాతికి చెందిన మొక్కలై ఉండాలి.
- విత్తనం తక్కువ ధరకు మార్కెట్ లో లభ్యం అయ్యేదిగా ఉండాలి.
పచ్చిరొట్ట పంటలు – విత్తే సమయం, జాగ్రత్తలు
పచ్చిరొట్ట పైర్లను మే, జూన్ లేదా తొలకరి వర్షాలు మొదలైనప్పుడు నాటుకోవచ్చు. పచ్చిరొట్ట దిగుబడి, నత్రజని స్థిరీకరణ పచ్చిరొట్ట, పైరు దశ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణ దిగుబడి రావడానికి 45 రోజుల సమయం పడుతుంది. పూత దశలో కలియదున్నడం వల్ల అత్యధిక సత్తువను చేకూరుస్తుంది. రోటావేటరు లేదా పవర్ టిల్లర్ సహాయంతో కలియదున్నుకోవచ్చు. సత్రజని వృధాగా పోకుండా ఉండటానికి కనీసం 15 నుండి 22 సెం.మీ. లోతులో కలియదున్నాలి. మురుగునీరు పోయే సౌకర్యం లేని వరి పొలాల్లో పచ్చిరొట్ట కుళ్ళుతున్నప్పుడు మధ్యలో అయారయ్యే కొన్ని వాయువులు అప్పుడే నాటిన వరి మొక్కలకు హాని కలిగిస్తాయి. కావున కలియదున్నిన 2 వారాల తర్వాత మాత్రమే నాట్లు వేసుకోవలి.
పచ్చిరొట్ట పైర్లు – ప్రయోజనాలు
- పచ్చిరొట్ట పైర్లు నేలలో కుళ్ళేటప్పుడు జరిగే రసాయన ప్రక్రియల వల్ల భూమిలోని పోషక పదార్ధాలు మొక్కలకు సులభంగా లభ్యమవుతాయి.
- పచ్చిరొట్ట పైర్లు సాగువలన నేల భౌతిక లక్షణాలు వృద్ధి చెందటమే కాకుండా నత్రజని ఎరువుల వాడకాన్ని 25-30 శాతం వరకు తగ్గించవచ్చు.
- నేల నీటి నిల్వ సామర్థ్యం వృద్ధి చెందడంతో పాటు నేల కోతను కూడా అరికడుతుంది.
- పచ్చిరొట్ట ఎరువులు సంద్రీయ ఎరువులు. నీటి ద్వారా నేలలో నేలు చేసే సూక్ష్మ జీవుల వృద్ధి చెంది మొక్కలకు రోగ నిరోదక శక్తిని పెంచడంతో పాటు నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళను అరికడుతుంది.
- భూమి గుల్లబారి పంట మొక్కల వేర్లకు అవసరమయ్యే గాలి, నీరు పుష్కలంగా అందుతాయి.
- దీర్ఘకాలిక పంటల్లో, పండ్లతోటల్లో పచ్చిరొట్ట పైర్లు సాగు చేసి పూత దశలో కలియదున్నడం వల్ల నేల సారవంతం అవుతుంది.
- చౌడు సమస్యను తొలిగించడంతో పాటు భూసార పరిరక్షణకు తోడ్పడతాయి.
- ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాలలో వరి పంట ముందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం వల్ల ముందు పచ్చిరొట్ట సాగు చేయడం వల్ల బియ్యంలో విటమిన్లు, మాంసకృత్తుల శాతం పెరిగినట్లు పరిశోధనా ఫలితాలలో వెల్లడైంది. దిగుబడి కూడా దాదాపు 15-20 శాతం పెరుగుతుందని రుజువైంది.
అందువలన రైతులు సరైన పచ్చిరొట్ట పైర్లను మార్కెట్ లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకొని సాగు చేసుకోవడం శ్రేయస్కరం.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక