অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆవాలు

మన దేశంలో సాగయే నూనె గింజలు పంటల్లో, ఆవాలు అత్యధిక విస్తర్ణంలో సాగవుతున్న పంట. ఈ పంటను ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రంలలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుచున్నది. అవాలులో 37-42 శాతం నూనె ఉంటుంది. గత 2-3 సం”ల తరబడి ఆవాలు పంట వేయడానికి ఉత్తర తెలంగాణాలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ నీటి వనరులు, సులభ యాజమాన్యము మరియు స్దిర మార్కెట్ ధర వలన రబీలో ఈ పంట లాభదాయకమైనదిగా చెప్పవచ్చు.

విత్తే సమయము

అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు ఈ పంటను విత్తుకోవచ్చును.

నేలలు

ఆవాలు పంటను ఒక మోస్తరు బరువైన నేలల్లో సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చును. అయితే ఈ పంటను తేలిక పాటి నేలలు, నల్లరేగడి నేలలు మరియు ఒండ్రు నేలల్లో కూడా పండించవచ్చును.

విత్తన మోతాదు

2.0-2.5 కిలోలు ఎకరానికి

విత్తే దూరం, విత్తే పద్ధతి

ఎకరా మోతాదు విత్తనానికి కనీసం 5 కిలోల ఇసుక కలిపి గొర్రు సహాయంతో 45 సెం.మీ. వరుసల మధ్య, 15-20 సెం.మీ. మొక్కల మధ్య దూరం ఉండేలా విత్తాలి.

విత్తనశుద్ధి

కిలో విత్తనానికి 3గ్రా. కాప్టాన్ తో విత్తనశుద్ధి చేయాలి.

రకాలు

పూసా అగ్రాని, వరుణ, పుసమహాక్, నరేంద్ర అగేతి అనే ప్రాచుర్యంలో ఉన్న రకాలను ఎంచుకోవచ్చు. అలాగే ప్రైవేటు రంగానికి చెందిన శ్రద్ధ, 45 ఎస్ 42, 45 ఎస్ 46, కోరల్ 432 రకాలను కూడా వేసుకోవచ్చు. పై రకాలన్నీ 120-125 రోజులు కాల వ్యవధి కలిగి ఎకరాకు 6-8 క్వింటాళ్ళ దిగుబడిస్తాయి.

ఎరువుల యాజమాన్యం

ఎకరాకు 2-3 టన్నుల పశువుల ఎరువుని విత్తే ముందు వేసుకోవాలి. నత్రజని, భాస్వరం మరియు పొటాషియం 24 కిలోలు, 16 కిలోలు మరియు 16 కిలోలు నిచ్చే ఎరువులను ఒక ఎకరానికి వేయాలి. రెండవ దఫా నత్రజనిని పూత వచ్చే ముందు (55-60 రోజులు) వేయాలి.

కలుపు యాజమాన్యం

పంట విత్తిన వెంబడే లేదా మరుసటి రోజు పెండిమిథాలిన్ 30 శాతం 600 మీ.లీ. ఒక ఎకరానికి సరిపోయేలా 200 లీటర్లు నీటిలో కలిపి నేలపై పిచికారి చేయాలి. మొలకెత్తిన 3 వారాలలోపు కుదురుకు ఒక మొక్క ఉండేలా మొక్కలను పలుచన చేయాలి. పైరు 30 మరియు 60 రోజుల దశలో వరుసల మధ్య అంతరసేధ్యం చేయాలి.

నీటి యాజమాన్యం

ఆవాల పంట సాగుకు సుమారు 300-400 మి.మీ. నీరు అవసరమవుతుంది. మొత్తంగా 3-4 తడులు ఇచ్చి మంచి దిగుబడులు సాధించవచ్చును. కొమ్మలు ఏర్పడే దశ (30-40 రోజులు) మరియు పూత కాయ ఏర్పడే దశలు (60-80 రోజులు) కీలకమైనవి.

అంతర పంటలు, పంటల సరళి

ఖరీఫ్ మొక్కజొన్న, సోయాబీన్, ప్రత్తి తర్వాత ఆవాల పంటను సాగు చేయవచ్చును.

శనగ : ఆవాలు, 5:1 లేదా 3:1 నిష్పత్తిలో అంతర పంటల సాగు లాభదాయకము.

సస్యరక్షణ

సాపై

ఈ పురుగు ఆకులపై చిన్న చిన్న రంద్రాలు చేసి తింటూ, కేవలం ఈనేలను మాత్రమే మిగులుస్తుంది. ఈ పురుగు నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెల్ల త్రుప్పు తెగులు

ఆకుల పై తెల్లటి బుడిపెల్లాంటి పదార్దం ఏర్పడుతుంది. ఈ తెగులు నివారణకు ప్రోపికోనజోల్ 1 మి.లీ. లీటరు కలిపి పిచికారి చేయాలి.

పంట కోత

పంట పక్వానికి వచ్చినపుడు కాయలు పసుపు రంగుకు మారుతాయి. మొక్కలను కోసి ఎండిన తర్వాత కర్రలతో కొట్టి విత్తనాన్ని కాయల నుంచి వేరుచేయాలి. విత్తనాలలో తేమ 8-9 శాతం వరకు వచ్చేలా ఎండబెట్టాలి.

దిగుబడి

ఎకరాకు 5-6 క్వింటాళ్ళు సాధించవచ్చును.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate