మన రాష్ట్రంలో పొద్దుతిరుగుడు పంట సాధారణ విస్తరణం 4,300 హెక్టార్లు
ఖరీఫ్ లో తేలికపాటి నేలల్లో జూన్ రెండవ పక్షం నుండి జులై రెండవ పక్షం వరకు మరియు బరువైన నేలల్లో ఆగస్టు రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో నవంబర్-డిసెంబర్ మరియు వేసవిలో జనవరి మొదటి పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నీటి పారుదల క్రింద సాగు చేసుకోవచ్చు. పుష్పించే దశ మరియు గింజ గట్టిపడే దశలో ఎక్కువ పగటి కాలం (8-10 గంటలు) మరియు సూర్యరశ్మి ఉంటే, గింజలు బాగా నిండి నూనె శాతం పెరుగుతుంది.
నీరు నిల్వ ఉండని ఎర్ర చల్కా, ఇసుక, రేగడి మరియు ఒండ్రు నేలలు ఈ పంట సాగుకు శ్రేష్ఠమైనవి. వర్షాధరంగా పండించేందుకు బరువైన నల్లరేగడి నేలలు, నీటి వసతి వున్నట్లయితే తేలిక నేలలు అనుకూలమైనవి.
హైబ్రిడ్ | పంట కాలం (రోజులు) | దిగుబడి (కిలోలు/ఎకరానికి) | నూనె శాతం |
కెబిఎన్ హెచ్-44 | 90-95 | 560-600 | 38 |
ఎన్ డిఎస్ హెచ్-1 | 80-85 | 600-700 | 40 |
డిఆర్ఎస్ హెచ్-1 | 90-95 | 600-700 | 40 |
పైన తెలుపబడిన హెబ్రిడ్లతో పాటు, ప్రైవేటు రంగ హెబ్రిడ్లను కూడా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చును.
ప్రొద్దుతిరుగుడు ఏక పంటగా లేదా వేరుశనగ+ప్రొద్దుతిరుగుడు 4:2, కంది+ప్రొద్దుతిరుగుడు 1:2 నిష్పత్తిలో ఖరీఫ్ లో సాగు చేయవచ్చును.
చిరుధాన్యాలు (జొన్న, సజ్జ), అవరాలు (కంది, మినుము), వేరుశనగ మొదలగు పంటలతో పంట మార్పిడి చేయవచ్చును.
ఎకరాకు 2.5-3.0 కిలోల విత్తనం అవసరమవుతుంది.
నెక్రోసిన్ వైరస్ తెగులు సవస్యను అధిగమించడానికి థయోమిథాక్సమ్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు ఇప్రొడియాన్ 25%+ కార్బండాజిమ్ 25% మందును 2 గ్రా. కిలో విత్తనానికి వాడి విత్తనశుద్ధి చేసుకోవాలి.
బోదేలు చేసి విత్తనం నాటినట్లయితే పంటకాలంలో వివిధ దశల్లో నీటి తడులు ఇవ్వడానికి, పైపాటుగా ఎరువులు వేయడానికే కాకుండా మొక్కలకు తగినంత పటుత్వం కూడా లభిస్తుంది.
తేలిక నేలల్లో 45 సెం.మీ X 20-25 సెం.మీ. నల్లరేగడి నేలల్లో 60 సెం.మీ X 30 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తనం మొలకెత్తిన 10-15 రోజుల తరువాత కుదురుకు ఆరోగ్యకరమైన ఒక మొక్క ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి. ఈ విధంగా చేయటం వలన మొక్కల మధ్య నీరు మరియు పోషకాల కోసం పోటి తగ్గి పువ్వు పరిమాణం పెరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది.
ఎకరాకు 2-3 టన్నుల పశువు, ఎరువును విత్తే ముందు వేయాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేయబడిన మోతాదులో పోషకాలు వాడాలి. వర్షాధారపు పంటకు 24 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం మరియు 12 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువులను సగం విత్తే ముందు, మిగాతా సగం 2 దఫాలుగా వేయాలి. గంధకం తక్కువగా ఉన్న నేలల్లో జిప్సం 55 కిలోలు/ఎకరాకు వేస్తే నూనె శాతం పెరుగుతుంది. పైరు పూత దశలో (ఆకర్షకపత్రాలు వికసించే దశలో) 2 గ్రా. బోరాక్స్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పురుగు/తెగులు | గుర్తించు లక్షణాలు | అనుకూల పరిస్థితులు | నివారణ చర్యలు |
పచ్చదీపపు పురుగులు | దీపపు పురుగులు ఆశిస్తే, ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి, పూర్తిగా ముడుచుకొని దోనెల లాగా కనిపిస్తాయి. | వాతావరణంలో ఉష్ణోగ్రతలు 30 డి. సెం. కంటే ఎక్కువైనప్పుడు మరియు పైరు బెట్టకు గురైనప్పుడు వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. | మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
తెల్లదోమ | తెల్లదోమ ఆకుల అడుగు భాగాన రసాన్ని పీల్చడం వలన, మొక్కలు గిడసబారి పోతాయి. | ట్రైజోఫాస్ 2.5 మి.లీ. లేదా ధయోమిధాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. | |
తామర పురుగులు | ఆకులు, పువ్వుల నుండి రసాన్ని పీలుస్తాయి. నెక్రోసిన్ వైరస్ తెగుల్లను పరోక్షంగా వ్యాప్తి చేసి నష్టాన్ని కలుగ చేస్తాయి. | వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడు పురుగుల ఉధృతి ఎక్కువవుతుంది. | (1) థయోమిథాక్సమ్ 3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మి.లీ. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ది చేయాలి. (2) ఇమిడాక్లోప్రిడ్ 4 మి.లీ/ 10 లీ. నీటికి లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
పొగాకు లద్దె పురుగు | గుంపులుగా ఆకులపై పత్ర హరితాన్ని గోకి తింటాయి. దీని వలన ఆకులు జల్లెడ ఆకులుగా మారుతాయి. | పైరు 30 రోజుల దశ నుండి ఈ పురుగు ఆశిస్తుంది. | ఈ పురుగు నివారణకు నోవాల్యూరాన్ 1.0 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి లేదా సాయంత్రం వేళల్లో విషపు ఎరను చల్లి నివారించుకోవచ్చు. |
బీహరి గొంగళి పురుగు | పురుగులు ఉధృతంగా ఆశిస్తే మొక్కలు మోడు బారిపోతాయు. | పుష్పించే దశలో ఎక్కువగా ఆశిస్తుంది. | క్లోరిపైరిఫాస్ 2 మి.లీ.+ డైక్లోరోవాస్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
శనగ పచ్చ పురుగు | లార్వాలు పువ్వులు, గింజల మధ్యన చేరి వాటిని తింటు అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. | పుష్పించే దశలో ఆశిస్తుంది. | థయోమికార్బ్ 1 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
అల్జర్నేరియా ఆకుమచ్చ తెగులు | ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, ఆకులు మాడిపోయినట్లు అవుతాయి. | పైరు 25 రోజుల నుండి 65-70 రోజుల వరకు ఈ తెగులు ఆశించి నష్టం చేస్తుంది. | ప్రోపికొనజోల్ 25% ఇసి 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
బూడిద తెగులు | ఆకులపై, అడుగుభాగాన బూడిదలాంటి పొడి కప్పబడి ఉంటుంది. | తేమ తక్కువగా ఉండే వేడి వాతావరణంలో తెగులు తీప్రత ఎక్కువగా ఉంటుంది. | డినోక్యాప్ 1 మి.లీ. లేదా ప్రోపికొనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
నెక్రోసిస్ తెగులు | ఆకులు సరిగ్గా పెరగక గిడస బారి పోతాయి. పువ్వు సరిగ్గా విచ్చుకోక మెలిక తిరిగి వంకరగా మారుతుంది. | తామర పురుగుల ద్వార వ్యాప్తి చెందుతుంది. | (1) విత్తనశుద్ధి చేయాలి. (2) పార్థీనియం కలుపును నివారించాలి. (3) ఇడిమాక్లోప్రిడ్ 4.0 మి.లీ/ 10 లీ. నీటికి లేదా థయోమిథాక్సమ్ 0.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
నేలల రకాన్ని బట్టి, పగటి ఉష్ణోగ్రతను బట్టి ఎర్ర నేలల్లో 8-10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15-20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి. మొగ్గ తొడుగు దశ, పువ్వు వికసించు దశ మరియు గింజకట్టే సమయం కీలక దశలు.
పెండిమిథాలిన్ 5 మి.లీ. లీటరు నీటికి కలుపుకొని విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు గాని నేలపై పిచికారి చేయాలి. పంట విత్తిన 25-30 రోజుల తరువాత గుంటక/దంతితో అంతరసేద్యం చేయాలి.
ఈ పంటకు ముఖ్యంగా రామచిలుకల బెడద ఎక్కువ. వీటి రాక నివారణకు పైరును కనీసం సామూహికంగా 20-25 ఎకరాల్లో వేయాలి. రిబ్బనులను పైరుపైన అడుగు ఎత్తున, సూర్యరశ్మి రిబ్బనుపై పడేలా కట్టాలి. శబ్ధం చేయడం, దిష్టి బొమ్మలను ఉపయోగించి పక్షులను పారద్రోలాలి.
పువ్వు వెనుకభాగం నిమ్మ పచ్చరంగుకి మారిన తరువాత, పువ్వులను కోసి 2-3 రోజుల పాటు ఆరనివ్వాలి.
ఎకరాకు సుమారు 400 కిలోలు వర్షాధారం క్రింద, 400-600 కిలోల నిశ్చిత వర్షపాత పరిస్థితులలో, 800-900 కిలోలు నీటి పారుదల క్రింద దిగుబడి సాధించవచ్చును.
ఆధారం: వయసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021