చాలా మంది రైతులు సకాలంలో మంచి వర్షాలు కురుస్తాయని ముందుగా నార్లు పోసుకొని, సరైన సమయంలో వర్షాలు పడక బోర్లలో, బావులలో సరిపడే నీరు లేక ప్రధాన పొలం తయారీ ఆలస్యం కావడం వలన అదునులో నాట్లు వేయలేక ముదురు నార్లు వేసుకోవాల్సి వచ్చి దిగుబడులు తగ్గుతున్నాయి.
ఈ సమస్యను అధీగమించడానికి వరిలో చేపట్టవలసిన నీటి యాజమాన్య పద్ధతుల గురించి కింద తెలియచేయడం జరిగింది.
ఆరుతడి వరి (ఎరోబిక్ రైస్) : ఆరుతడి వరి పద్ధతిలో వరిని సాధారణంగా పండించే, పంట అవసరం మేరకు నీటిని పెట్టడం ద్వారా పండించే విధానాన్ని ‘ఆరుతడి వరి’ అని అంటారు. ఈ వరిని ముఖ్యంగా మాగాణి భూముల్లో, సాధారణ పద్ధతిలో సాగు చేయడానికి నీటి లభ్యత తకువగా ఉన్న ప్రాంతాల్లో పండించే భూముల్లో అడపా దడపా నీరు అందించే సౌకర్యం కలిగిన ప్రాంతాల్లో చెరువుల కింద సాగుచేసే పరిస్ధితుల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది.
ఆరుతడి పద్ధతిలో సాగుచేయడానికి లోతైన వేరు వ్యవస్ధ కలిగి, చేట్టును తట్టుకునే స్వల్పకాలిక రకాలు (ఎం.టి.యు – 1010, ఐ.ఆర్. - 64) అనుకూలం. తొలకరి వర్షాలను సద్వినియోగం చేసుకొని పలుమార్లు దున్ని, మెత్తని దుక్కి చేసి కలుపు సమస్యను లేకుండా చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 24 కిలోల భాస్వరం, 16కిలోల పోటాష్ ఎరువులు వేసి కలియదున్ని బాగా చదును చేయాలి. నేల సమతలంగా, చదునుగా లేనట్లయితే తేమ సరిగా అందక మొలక సరిగా రాదు. పంట ఎదుగుదల కూడా సమానంగా ఉండదు. ఎకరానికి 25-30 కిలోల విత్తనం ఉపయోగించాలి. విత్తే ముందు 3 గ్రా. కర్బండిజమ్ కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తనశుద్ధి చేయాలి.
శుద్ధి చేసిన విత్తనాన్ని నేరుగా చదును చేసిన పొలంలో 20 సెం.మీ దూరంలో నాగటి సాలు వెనకగనీ, గోర్రుతో గాని, విత్తనాన్ని ఒకేసారి వేసి గొర్రుతో గానీ వేసుకోవచ్చు.
పోటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో సగభాగం మిగిలిన సగభాగం నత్రజని ఎరువుతో పాటు అంకురం ఏర్పడే దశలో (పొట్టదశ) వేసుకోవాలి. ఆరుతడి వరిలో ఇనుపధాతు లోపం వలన ఆకులు తెల్లుగా పాలిపోయి ఎదుగుదలతగ్గుతుంది. ఈ లోప లక్షణాలు వెంటనే లీటరు నీటికి 20గ్రా. అన్నభేది, 2 గ్రా. నిమ్మఉప్పు కలిపి పిచికారీ చేయాలి. పంటకు ప్రతి 7-10 రోజులకు ఒకసారి అవసరం మేరకు నీటి తడులు పెట్టాలి. అయితే పంటకు కావాల్సిన తేమను అందించడం, పంట కీలక దశల్లో బెట్టకు గురికాకుండా చూడడం ప్రధానమైన అంశం. అధిక వర్షాలు నమోదయినప్పుడు నీటి తడులు అవసరం ఉండదు. ఈ విధంగా వర్షాకాలంలో చేసే 3-4 తడులతో వరిసాగు చేసుకొనే అవకాశం ఉంది. నీటిని 40-50 శాతం మేర ఆదా చేసుకోవచ్చు.
శ్రీవరి సాగు పద్ధతి : ఈ పద్ధతిలో ఎకరాకి 2 కిలోల విత్తనంతోనే వరి చాలా ఆరోగ్యంగా పెంచవచ్చు. వేర్లు విస్తారంగా వ్యాప్తి చెంది, లోతుకు చొచ్చుకుపోయి, భూమి పొరల నుండి పోషక పదార్దాలను తీసుకోగలుగుతాయి. కాబట్టి ఈ పద్ధతి ఖచ్చితంగా వరి పండిస్తే సాధారణ వరికి అవసరమయ్యే నీటిలో 60 శాతం నీరు మాత్రం సరిపోతుంది. ఈ పద్ధతిలో పాటించాల్సిన ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు.
లేత నారు నాటడం : 8 నుండి 12 రోజుల వయస్సు గల రెండు ఆకుల నారును మాత్రమే నాటాలి. దీనివలన అధిక సంఖ్యలో పిలకలు వేస్తాయి. వేర్లు బాగా వ్యాపిస్తాయి.
జాగ్రత్తగా నాటటం : నారుమడి నుండి మొక్కను జాగ్రత్తగా, వేరు, బురద, గింజతో సహా తీసి పొలంలో పై పైన నొక్కి పెట్టాలి. లోతుగా నాటకూడదు. దీనివలన పీకేటప్పుడు సహజంగా ఉండే తీవ్రమైన ఒత్తిడి మొక్క గురికాకుండా, త్వరగా పెరిగి అధిక సంఖ్యలో పిలకలు వస్తుంది.
దూరదూరంగా నాటడం : మొక్కకు మొక్కకు, సాలుకు సాలుకు మధ్య 25 సెం.మీ దూరం ఉండేటట్లు నాటాలి. భూసారం ఎక్కువగా ఉండే భూముల్లో ఇంకా ఎడంగా కూడా నాటుకోవచ్చు.
కలుపు నివారణ : పొలంలో నీరు నిలవకుండా చూస్తాం కాబట్టి కలుపు సమస్య ఎక్కువ. కలుపు నివారణకు రోటరీ / కొనోవీడర్ తో నాటిన 10 రోజులకు మూడు సార్లు నేలను కదిలిస్తే , కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. ఈ విధంగా చేయడం వలన సుమారు ఎకరాకు 400 కిలోల పచ్చిరొట్ట భూమికి చేరుతుంది.
నీటి యాజమాన్యం : నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. పొలం తడిగా గానీ నీరు నిలవకూడదు. నీరు ఎక్కువైతే బయటకు పోవడానికి వీలుగా ప్రతి 2 మీటర్లకి ఒక కాలువ ఏర్పాటు చేయాలి. దాంతో వేర్లు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి.
సేంద్రియ ఎరువులు : సేంద్రియ ఎరువులు బాగా వాడి భూసారం పెంచాలి. ప్రస్తుత పరిస్ధితుల్లో రసాయనిక ఎరువులు కూడా పైరుకు తొలిదశలో వాడవచ్చు. కానీ. ముందు, ముందు ఎరువులు వాడి , రసాయనికి ఎరువుల వాడకం తగ్గించాలి.
ఈ పద్ధతిలో భూమిలోని సుక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. ఈ సుక్ష్మజీవులు సహజంగానే పైరుకు కావాల్సిన పోషక పదార్ధాలను అందజేస్తాయి. కాబట్టి ఈ పద్ధతిని భూసారాన్ని పెంచుతు సుస్ధిర దిగుబడులు ఇవ్వగలదు.
ప్రత్యామ్నయ తడి, అరబెట్టడం అనేది రైతులకు నీటిని ఆదా చేసే సాంకేతిక పరిజ్ఞానము. దీని ద్వారా దిగుబడి తగ్గిపోకుండా వరి పొలాలలో నీటిని ఉపయోగించుట.
ప్రత్యామ్నయ తడి, ఆరబెట్టడంలో పొలంలో నీరు కనిపించకుండా పోయిన కొన్ని రోజల తరువాత పొలంలో నీరు పెట్టడం జరుగుతుంది. తడుల సంఖ్య నేల రకం, వాతావరణం, పంట దశను బట్టి మారుతుంది. సాధారణంగా 1-10 రోజుల వరకు వ్యవధి ఉంటుంది.
ఈ పద్ధతిలో 30 సెం.మీ గల ప్లాస్టిక్ పైప్ కు 15 సెం.మీ. వరకు చుట్టూ రంధ్రాలు చేసి పొలంలో ఇన్స్టాల్ చేస్తారు. దీనినే ఫీల్డ్ వాటర్ ట్యూబ్ అంటారు. గొట్టం లోపల నుండి మట్టిని తీసివేయడం ద్వారా రంధ్రాల ద్వారా నీరు ఫిల్డ్ వాటర్ ట్యూబ్లోకి వస్తుంది. ఫీల్డ్ వాటర్ ట్యూబ్ ను ఉపయోగించడం ద్వారా ప్రత్యామ్నాయ తడి, అరబడడం అమలు చేయడానికి ఒక సురక్షితమైన ఆచరణియమార్గం. పొలంలో నీటి స్ధాయి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఎప్పుడైతే నీటి మట్టం 15 సెం.మీ. కంటే తక్కువగా పడిపోయినప్పుడు, 5 సెం.మీ. లోతు వరకు నీటిని పునర్వ్యవస్ధికరించాలి. కాని పొట్ట దశ (పూత దశ) లో నీటి ఎద్దడి లేకుండా చేసుకోవాలి. కలుపు మొక్కల సమాన్య అధికంగా ఉన్నప్పుడు ఎ.డబ్ల్యు.డి.ని 2-3 వారాలు వాయిదా వేయాలి. ఇలా చేయడం ద్వారా నీటి ద్వారా కలుపు మొక్కలు అణిచివేతకు, ప్రతిభావంతంగా కలుపు నాశకాలు పనిచేయడానికి వీలుంటుంది.
పై పద్ధతుల ద్వారా నీటి ఆదా చేయడమే కాకుండా ప్రతికూల పరిస్ధితుల నుండి వరి కాపాడుకోవచ్చు.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/2/2023