অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నీతి కథలు - VI

ముంగీస - పిల్లాడు

ఎంతవారయినా తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకొని బాధ పడతుంటారు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు. శివరామపుంలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరటిలో ఉన్న కుంకుడు చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగీస ఉండేది. అది విష్ణుశర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒక రోజు విష్ణుశర్మ ప్రక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్యగది లోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణుశర్మ భార్య వంటగదిలో పనీపాట చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చుసి పాముని గమనించింది.

ఇన్నాళ్ళ నుంచి తనకి అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య ఋణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పాముని పట్టుకుని క్రిందకు దూకింది. పాము ముంగీస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగీస పాముని చంపింది. ఆ తరువాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తల పెట్టిందని భావించింది. విష్ణుశర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను దాని మీదకు విసిరింది. ఆ దెబ్బకి పాపం ముంగీస చచ్చిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా ఉండటం చూసి విష్ణుశర్మ భార్య ప్రక్కనే చచ్చిపడి ఉన్న పాముని చూసి జరిగిన విషయం అర్ధం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగీస ను చంపినందుకు బాధపడింది.

ముసలి నక్క

ఒక అడవిలో ఒక ముసలి నక్క ఉండేది. దానికి పళ్లన్నీ ఊడిపోయాయి. అది ఆహారం కోసం వెదుకుతుండగా, ఏనుగు మృతదేహం దాని కంటపడింది. ఆ చనిపోయిన ఏనుగు పక్కన కూర్చుని దానికి కాపలా కాస్తున్నట్లు నటించి ఏదైనా జంతువు వస్తే దానితో ఏనుగు చర్మాన్ని కొరికించి, ముక్కలు చేయించి మాంసం తినాలని అనుకుంది.

అప్పుడే అటుగా వస్తున్న సింహంతో "మృగరాజా! నేను ఈ ఏనుగుకు కాపలా ఉన్నాను. కావాలనుకుంటే ఈ ఏనుగు మాంసాన్ని తినవచ్చు" అని చెప్పింది నక్క. "నేను చనిపోయిన జంతువులను తినను" అని తన దారిన తాను వెళ్లింది సింహం.

మరికొద్ది సేపటికి ఒక పులి అటుగా రావడంతో "పులిరాజా! ఈ ఏనుగును ఆరగిస్తారా?" అంది నక్క. "నేను ఏనుగుల మాంసాన్ని ఇష్టపడను" అనుకుంటూ వెళ్లిపోయింది పులి.

పులి వెళ్లీ వెళ్లగానే అటు వైపు వచ్చింది ఒక కోతి. కోతిని చూసిన నక్క ఈ సారి ఎలాగైనా తాననుకున్నది సాధించాలని, "ఇప్పుడే ఒక సింహం ఈ ఏనుగుని చూసి నన్నిక్కడ కాపలా పెట్టి వెళ్లింది. నీకు తినాలనిపిస్తే ఈ ఏనుగును తిను, నేను సింహం వస్తూ ఉంటే నీకు సైగ చేస్తాను" అని నక్క చెప్పింది కోతితో. కోతి ఏనుగు మృతదేహంపై ఎక్కి తన వాడియైన పళ్లతో ఏనుగు చర్మాన్ని ముక్కలుగా చించేసింది. అప్పుడే నక్క "మిత్రమా పారిపో సింహం వచ్చేసింది" అని అరవగానే కోతి ప్రాణభయంతో కనబడకుండా పారిపోయింది. ఇక తినడమే ఆలస్యమని ఏనుగు శరీరం మీదికెక్కిన నక్కకు "మిత్రమా! పారిపో" అంటూ ఒక అరుపు వినిపించింది. ఒక బలమైన నక్క అటుగా పరుగెత్తుకువచ్చి ఏనుగు మాంసాన్ని తినసాగింది. రెండు నక్కల మధ్య పోరు జరిగినా ముసలినక్క బలమైన నక్క దెబ్బలకు భరించలేక" నాకు కూడా ఏనుగు మాంసమంటే ఇష్టంలేదు" అని అక్కడి నుంచి పారిపోయింది.

మూడు చేపలు

మంచిని ఎవరు చెప్పినా వినాలి. అలాకాక అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఆ మంచిమాటలను పెడచెవిన పెడితే అందుకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఇతరులందరూ అబద్దాలు చెప్పేవాళ్ళు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. అలాంటి పొరపాటులు ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు తెస్తాయి అది ఎలాగో ఈ మూడు చేపల కధ ద్వారా తెలుసుకుందాం.

అంబాపురం సమీపంలో ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువు నీటి గడ్డితోను నాచుతోను నిండి ఉండేది. ఆ చెరువులో ప్రభవ, విభవ, ఆశ్లేష అనే మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉండేవి. ప్రభవ మంచి తెలివి కలది ఏ విషయం ఇతరులతో చెప్పించుకోకుండా ఇట్టే పసికట్టి సమయానికి తగ్గట్టుగా మసులుకునేది. విభవ కొంచెం మందబుద్ధి ఏవిషయం అయినా నిదానంగా ఆలోచించి నడుచుకునేది. ఆశ్లేష అహంకారి అన్నీ తనకే తెలుసునని మిగిలిన రెండు చేపలకంటే తానే తెలివైన దానినని విర్రవీగుతూండేది.

ఈ ముడు చేపల మధ్య గుణగణాలలో తేడాలు ఉన్నా ఒకే జాతికి చెందిన చేపలు కావటం వల్ల వాటి మధ్య స్నేహం ఏర్పడింది. ఒకనాడు కొందరు జాలరులు వచ్చి చెరువును పరిశీలిస్తూ మాట్లాడుకోవడం ప్రభవ విన్నది. వెంటనే తన మిత్రులైన విభవ, ఆశ్లేష దగ్గరకు వచ్చి 'మిత్రులారా! ఇప్పుడే ఇద్దరు జాలరులు మాట్లాడుకోవడం విన్నాను...' రెండు, మూడు రోజులలలో వచ్చి ఈ చెరువులో నీళ్ళు తోడి చేపలు పట్టుకుందాం అనుకుంటున్నారు. అందుకే మనం తొందరగా ఇక్కడికి దగ్గరలో ఉన్న మరో చెరువులోకి వెళ్ళిపోదాం ' అంటూ చెప్పింది. దాని మాటలకు ఆశ్లేష పగలబడి నవ్వి 'నువ్వు పిరికిపందవు' అంటూ ఎగతాళి చేసింది. విభవ మాత్రం 'ఇంకా రెండు మూడు రోజులు ఆగి కదా! అప్పుడు ఆలోచిద్దాం' అంది. ప్రభవ మాత్రం ఆ రాత్రికే వేరే చెరువుకు వలస వెళ్ళిపోయింది. రెండు రోజుల తరువాత వద్దామనుకున్న జాలరులు మర్నాడు ఉదయమే ఆ చెరువులో చేపలు పట్టుకునేందుకు వచ్చారు. చెరువులో కొంతభాగం బురుదమట్టితో గోడగా కట్టి ఇందులో నీళ్ళను తోడి అవతలకు పోసి ఆ తరువాత మిగిలిన కొద్దినీళ్ళల్లోకి వలలు వేసారు. దానితో చెరువులోని చేపలన్నీ వలలోకి చిక్కాయి.

'అయ్యో! మిత్రుడు చెప్పిన మాటలు వినకుండా ఈ జాలరులకు చిక్కామే' అంటూ విభవ, ఆశ్లేష భాధపడ్డాయి. ఆ సమయంలో విభవకు ఒక ఉపాయం తట్టింది. అది ఆశ్లేషకు చెబితే తనని ఎక్కడ ఎగతాళి చేస్తుందో అని చెప్పకుండా ఆ ఉపాయంతో తాను మాత్రమే జాలరుల నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంది. జాలరులు వలలోంచి ఒక్కొక్క చేపను తీసి బ్రతికున్నదా లేదా అని పరీక్షించి బుట్టలో వేసుకుంటున్నారు. అది గమనించిన విభవ జాలరి తనని వలలోంచి బయటకు తీసి పరీక్షిస్తున్నప్పుడు ఊపిరిబిగపట్టి చనిపోయినట్లు నటించింది. అది నిజంగా చచ్చిపోయింది అనుకున్న జాలరి దానిని చెరువు గట్టు మీదే వదిలేసి వెళ్ళిపోయాడు. జాలరి కనుమరుగు కాగానే విభవ మళ్ళీ చెరువులోని నీళ్ళలోకి గెంతి తన ప్రాణాలను కాపాడుకుంది. అహంకారంతోను, మూర్ఖత్వంతోను విర్రవీగిన ఆశ్లేష మాత్రం జాలరుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది.

అందుకే పిల్లలు! మంచి మాటని ఎవరు చెప్పినా వినాలి. దాన్ని తప్పకుండా ఆచరించాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు పెద్దలకో... మనకంటే తెలివైన వారికో చెప్పి ఆ నిర్ణయం మంచిదో, చెడ్డదో తేల్చుకోవాలి.

నారాయణ సాయం

రంగాపురం అనే గ్రామంలో నారాయణ అతి పెద్ద భూస్వామి, కాని పరమ పిసినారి. పిల్లికి కుడా బిచ్చం పెట్టడని అందరూ అనుకుంటారు. నారాయణ ఇంటి పక్కనే ఉండే ఒక పూరిపాకలో లక్ష్మి అనే అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉండేది. వాళ్ళు చాలా పేద వాళ్ళు. ఒకసారి లక్ష్మి తల్లికి విపరీతమైన జబ్బు చేసింది. అక్కడా, ఇక్కడా పాచి పనిచేస్తూ ఆకలి తీర్చే తల్లే మంచాన పడడంతో పట్టుమని పన్నెండేళ్లు లేని లక్ష్మికి ఏం చేయాలో పాలుపోలేదు. తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలని అనుకుంది.

తమ పాక పక్కన గల భవంతిలో నివాసముండే నారాయణ ఒక్కడే దిక్కనుకుంది లక్ష్మి. అతని దగ్గరికెళ్ళి "అయ్యా! మా అమ్మ మంచాన పడింది. వైద్యం చేయించకపోతే పరిస్ధితి వికటిస్తుంది. మాకు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది. వైద్యం ఎలా చేయించేది? మీరు దయచేసి కాస్త డబ్బు సహాయం చేస్తే మా అమ్మకు వైద్యం చేయిస్తాను" అని బతిమిలాడింది. కనికరమేలేని నారాయణ "ఛీ పో!" అంటూ ఛీత్కరించుకున్నాడు. అక్కడే ఉన్న సురయ్య అనే కూలీ ఇదంతా గమనించాడు. లక్ష్మి ఆవేదనను చూసి కరిగిపోయిన సూరయ్య ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాడు.

లక్ష్మి చేసేదేమీ లేక మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి పాడుబడిన దేవాలయంలో కూర్చుంది. దేవుడి ముందు మోకరిల్లి తన గోడును వినిపించింది. "ఎలాగైనా నువ్వే సహాయం చేయాలి," అంటూ వేడుకుంది. దేవాలయంలో నుంచి బయటకు వస్తుండగా గర్భగుడిలో నుంచి ఒక గొంతు వినిపించింది. "అమ్మా లక్ష్మి! నీ గోడు విన్నాను. ఇక్కడ నీ కోసం కొంత డబ్బు పెట్టాను, తీసుకెళ్ళి మీ అమ్మకు వైద్యం చేయించు" అని పలికిందా గొంతు. అది విన్న లక్ష్మి సంతోషంగా వెనక్కి వచ్చి డబ్బు తీసుకుని అక్కడ ఎవరూ కనబడకపోయేసరికి "ఎవరు మీరు?" అని ప్రశ్నించింది. "నేను ఇప్పటి వరకు నీ బాధను విన్న దేవుడిని" అని సమాధానం వచ్చింది. "వెళ్ళు త్వరగా వెళ్ళి మీ అమ్మ వైద్యం సంగతి చూడు" అని మళ్ళీ పలికిందా గొంతు.

ఏమీ ఆలోచించకుండా డబ్బులు తీసుకుని వెళ్ళి తన తల్లికి వైద్యం చేయించింది లక్ష్మి. లక్ష్మికి దేవుడు డబ్బు ఇచ్చాడన్న సంగతి ఊరంతా తెలిసి నారాయణ చెవిలో కూడా పడింది. అతను "అవునా" అన్నట్టుగా ఊరుకున్నాడు.

సహాయం చేయగల స్తోమత ఉండీ లక్ష్మిని ఆదుకోని నారాయణ సిరిసంపదలు, చాలీచాలని జీవితంలో నారాయణ వద్ద పనిచేస్తున్న సూరయ్య మంచి వ్యక్తిత్వం ముందు దిగదుడుపే కదా!

సూరయ్య లాగ సహాయం చేసి కూడా పేరు బయటపెట్టుకోని వాళ్ళు మహనీయులు.

నక్క సమయస్పూర్తి

ఒక నక్క ప్రమాదవశాత్తు ఒక ముళ్ళ పొదలో చిక్కుకుపోయింది. అది ఎంతగా పెనుగులాడినా బయటకు రాలేకపోయింది. దాని తోక చివరి భాగం ముళ్ళ కంచె మధ్యలో ఇరుక్కు పోయింది.

ముళ్ళపొద దట్టంగా ఉండటం దానిలో వివిధ రకాల చీమలు, దోమలు, విషకీటకాలు ఉన్నాయి. నక్క ముళ్ళలో ఇరుక్కు పోవడం గమనించిన దోమల గుంపు దానిపై తమ తడాఖా చూపెట్టాయి. దాంతో నక్క శరీరమంతా విపరీతంగా దద్దులు వచ్చి రక్తం కారడం మొదలయ్యింది. తన రక్తం తాగుతున్న దోమలను నక్క ఏమీ చేయలేక నీరసపడి పోయి, సహాయం కోసం వేచి చూస్తోంది.

అదే సమయంలో అటుగా వస్తున్న ముళ్ళపందిని నక్క తనను దోమల బారి నుండి కాపాడమని బతిమాలింది. ముళ్ళపంది ముళ్ళను తొలగించి,నక్కను కాపాడింది. ముళ్ళపందికి కృతజ్ఞతలు చెప్పిన నక్క దోమల గుంపును మాత్రం కదిలించవద్దని ప్రాధేయపడింది.

దోమల గుంపును ఎందుకు కదిలించవద్దని ముళ్ళపంది అడిగితే, నన్ను కరిచి అవి ఇప్పటి వరకు ఎంతో రక్తాన్ని తాగాయి. వాటిని గనుక వెంటాడితే ఇప్పుడు మరో దోమల గుంపు వచ్చి నా మిగిలిన రక్తాన్ని కూడా తాగుతాయి అని అన్నది నక్క. నక్క సమయస్పూర్తికి, దూరాలోచనకి ముగ్దురాలైన ముళ్ళపంది సరేనని అక్కడి నుండి వెళ్ళిపోయింది.

నిదానమే ప్రధానం

ఒక ఊరిలో రంగా అనే యువకుడు ఉండేవాడు. అతడు బాధ్యతలు లేకుండా, తిరిగే దుందుడుకు స్వభావం గలవాడు. రంగా భవిష్యత్తు గురించి అతని తెల్లిదండ్రులు బాధపడసాగారు.

అదే ఊరిలో ఉండే ఒక వర్తకుడు రైతుల దగ్గర కొబ్బరికాయలు కొని పట్నంలో అమ్మేవాడు. రంగా తండ్రి ఆ వర్తకుడిని బ్రతిమిలాడగా, ఆ వర్తకుడు రంగాకి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.

ఆ వర్తకుడు రంగాను పిలిచి దగ్గర్లోని పట్టణంలో కొబ్బరికాయలు అమ్ముకుని రమ్మని పంపించాడు. సరేనన్న రంగా కొబ్బరికాయలను గుర్రపుబండిలో నింపుకుని పట్టణంవైపు బయల్దేరాడు. పట్టణానికి దగ్గరి దారిలో వెళ్దామనుకున్నాడు. దారిలో అతనికి ఒక బాలుడు కలిశాడు. రంగా ఆ బాలుణ్ణి "బాబూ! ప్రధాన రహదారిని చేరుకునేందుకు ఇంకా ఎంతసేపు పడుతుంది?" అని అడిగాడు, దానికి ఆ అబ్బాయి - "నెమ్మదిగా వెళ్ళు, పదిహేను నిమిషాల్లో చేరుకుంటావు, కాని వేగంగా వెళ్తే మాత్రం కనీసం గంట పడుతుంది" అని బదులిచ్చాడు.

రంగాకి ఆ అబ్బాయి మాటలు అర్ధంకాలేదు. అతను అత్యంత వేగంగా బండిని ముందుకు దూకించాడు. కొద్ది దూరం ప్రయాణించగానే బండి చక్రం ఒకటి రాయి తగిలి ఇరుక్కుపోయింది. ఆ కుదుపుకు కొబ్బరికాయలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. అవన్నీ తీసి బండిలో ఎక్కించేందుకు రంగాకి చాలా సమయం పట్టింది. ఆ అబ్బాయి చెప్పిన మాటలు రంగాకి అప్పటికి గాని అర్ధంకాలేదు.

ఆ సంఘటనలో రంగా తన జీవితానికి సరిపడా గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు నుండి రంగా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏ పనిచేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయసాగాడు.

నిద్ర మొహం నస్రు

నస్రు చాలా తెలివిగలవాడే కాని ఉదయాన్నే నిద్రలేవడం అతని వల్ల అయ్యేది కాదు. బారెడు పొదెక్కేవరకూ బద్దకంగా నిద్రపోవడం అతనికి చాలా ఇష్టం.

అతని అలవాటు మాన్పించడానికి అతని తండ్రి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీలుపడలేదు.

ఒక రోజు నస్రు తండ్రి ఉదయాన్నే లేచి అలా ఊరి చివరకు నడకకు బయలుదేరాడు. దారిలో అతనికి బంగారు నాణాలున్నసంచి ఒకటి కనిపించింది. అది ఎవరో పారేసుకున్నట్టుంది. దాన్నితీసుకుని ఇంటికి వచ్చేసరికి నస్రు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు.

నస్రు తండ్రి నస్రుపై చెంబెడు నీళ్లు కుమ్మరించాడు, నస్రు నిద్రలేచి, ఎందుకు నాన్నా ఇలా చేశావని అడిగాడు.

ఉదయాన్నే నిద్రలేవడం వల్ల బోలెడు లాభం ఉంది. చూడు, నాకు సంచి నిండా బంగారు నాణాలు దొరికాయి అదే నేనూ నీలా పడుకుని ఉంటే ఇలా ధన లాభం కలిగేదా? అన్నాడు తండ్రి.

లాభం గతేమో గాని, ఆ ధనం పోగొట్టుకున్నవాడికి మాత్రం బోలేడు నష్టం కలిగింది. నీకంటే ముందు నిద్రలేవడం వల్లే కదా అతను పారేసుకున్న డబ్బు నీకు దొరికింది అంటే ముందుగా నిద్రలేవడం వల్ల నష్టమేగా? అని మళ్లీ ముసుగుతన్ని పడుకున్నాడు నస్రు.

ఏం చెప్పాలో తెలియక నస్రు తండ్రి వెనుదిరిగాడు.

నిజమైన మేధావి

రాజు తెలివైన కుర్రాడు. ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్తుగా అతనికో గొంతు వినిపించింది. అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషిలాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్ధించింది.

చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏ మాత్రం అనుమానం రాని రాజు సీసామూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ, మధ్య నుంచి ఒక భయంకరమైన భుతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో "ఎవరు నువ్వు?" అని అడిగాడు. "నేను భూతాన్ని, ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్చగా ఉన్నాను. నిన్ను తినేస్తాను" అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం.

తెలివైన రాజు, "నేను నిన్ను నమ్మను. ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు?" అని అడిగాడు. దానికి ఆ భూతం "ఎందుకు ప్రవేశించలేను. కావాలంటే చూపిస్తాను" అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చెయకుండా రాజు వెంటనే ఆ సీసా బిరడా బిగించేశాడు. అది చూసిన భూతం "దయచేసి నన్ను విముక్తుడిని చేయి. నేను నీకు ఏ మాత్రం హాని చేయను" అని బతిమాలసాగింది. "నేను నిన్ను ఎలా నమ్ముతాను? నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు" అన్నాడు రాజు. భూతం "నేను నీకు అపకారం చెయ్యను. అంతేకాకుండా నీకొక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి. హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారుతుంది" అని చెప్పింది.

దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో... అది చెప్పిన సంగతి కుడా గుర్తుంచుకుని మరి దేనినీ ముట్టుకోకుండా నేరుగా వెళ్లి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అనతికాలంలోనే సంపన్నుడయ్యాడు రాజు.

నిజమైన సంపద

పూర్వం అవంతీ రాజ్యాన్ని పాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు, విలాసాలలో మునిగి తేలుతూ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు. రాజ్యపాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవటంతో మంత్రి, తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ, ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు.

ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలినడకన దేశసంచారం చేస్తూ అవంతీ రాజ్యంలో ప్రవేశించాడు. తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి, వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని చూడ సంకల్పించాడు. చిత్ర మేమిటోగాని ఆరోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోకి తోడ్కొనిపోయి సకల మర్యాదలు చేశాడు. తన యోగదృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు, "రాజా! నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్లటం తధ్యం. ఈరోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడి పోతాయి. అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని, ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు. ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును నింపు" అని హితబోధ చేశాడు.

ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు. "నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతివాక్యాలు పలుకుతున్నావు. నాకున్న ఈ రాజ్యం, అష్టైశ్వర్యాలు అనంతమైనవి. నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు. నేను ఒక వేలు ఎత్తానంటే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిల్చుంటారు. సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాము లేకపోతే ఈ పాటికే నిన్ను ఊచకోత కోయించేవాళ్లం," కళ్లు నిప్పులు కక్కుతుండగా ఆసాధువును భటులతో బయటకు గెంటివేయించాడు.

కొన్నిరోజుల తర్వాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకుని వేటకు బయలుదేరాడు. అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్లాడు. ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడి రాజుగారికి కనిపించింది. ఆ అందమైన లేడిని ఎలాగైనా పట్టి, బంధించి, తన ఇష్ట సఖికి కానుకగా ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి. వెంటనే తన రధాన్ని దాని వైపుకి ఉరికించాడు. ప్రశాంతంగా నిల్చొని గడ్డి తింటున్న ఒక అందమైన లేడి ఈ హాడావిడికి బెదిరి ముందుకు ఉరికింది. దాని వెనకాల రాజ పరివారమంతా పరుగులు తీసింది. ప్రాణభీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను, పుట్టలను అతి లాఘువంగా దాటుకొని పరుగెత్తుతున్న ఆ లేడిని ఎలాగైనా బంధించాలన్న కోరిక రాజులో దృఢపడింది. ఎటువెళ్తున్నాడో చూసుకోకుండా ఆ లేడి వెనుకే రధాన్ని పరుగెత్తించాడు. ఈ విధంగా వారు ఒక దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు. వీరి వేగాన్ని అందుకోలేక రాజపరివారమంతా చెల్లాచెదరయింది. లేడిని పట్టుకోవడమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు. ఇంతలో తీవ్రంగా అలిసిపోయిన ఆ గుర్రం మూర్చపోయింది. ఆ గుర్రం నుంచి సింహగుప్తుడుకూడా కిందపడిపోయి తీవ్రమైన గాయాలపాలై స్పృహతప్పి పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతంగుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహతప్పి ఉన్న సింహగుప్తుని చూసి ఆనందంతో మీదపడి నిలువుదోపిడీ చేశారు. చివరకు రాజు గారి ఒంటిమీద ఒక అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్లి పోయారు. ఇరుగు పొరుగు రాజ్యాలపాలిట సింహ స్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్దిసమయం ఉండిపోయాడు. తెలివి వచ్చి తన పరిస్థితి తెలుసుకొని అవాక్కయ్యాడు. అవంతీ రాజ్యానికి మహారాజైన తనను, తన పరివారమంతా విడిచివెళ్లారు. విలువైన ఆభరణాలన్నీ క్షణాలలో మాయమై పోయాయి. తాగడానికి మంచినీటి చుక్కయినా లేదు. ఎండతీవ్రత, దాహం, ఆకలి తీవ్రంగా బాధిస్తున్నాయి. ఆదుకునే నాథుడే లేడు. సరిగ్గా అప్పుడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

వెంటనే "ఓ భగవంతుడా! ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలియవచ్చింది. ఇకనుంచి ఈ ధన, కనక, వస్తు, వాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితమంతా మంచి పనులకే వినియోగిస్తాను. దయచేసి నన్ను కాపాడు" అని అతి దీనంగా ప్రార్ధించాడు.

ఇంతలో దూరము నుంచి సింహగర్జన వినిపించింది. సింహగుప్తుడి హృదయం భయాందోళనలతో నిండిపోయింది. ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకొని భగవన్నామస్మరణ ప్రారంభించాడు. భగవంతుడు రాజు ప్రార్ధన విన్నాడో ఏమో, ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోకి వచ్చింది. "బతుకుజీవుడా" అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతివేగంగా ముందుకు ఉరికించాడు. చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకో గలిగాడు. ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి, ప్రజా శ్రేయస్సుకై పాటుపడ సాగాడు.

నోరుమూయించడం

వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడతనికి మంత్రిగా ఉండేవాడు. రాజపురోహితుడు వట్టి వాగుడుకాయ. అతను ఇంకొకరికి మాట్లాడే అవకాశమే యివ్వకుండా పటపటవాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకీ ఇతరులకీ కూడా దుర్భరంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురుచూస్తున్నాడు రాజు.

ఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటివాడుండేవాడు. కాళ్ళు వంకరయినా రాళ్ళు విసరడంలో బహునేర్పరి. పిల్లలు తనిని బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగరద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడొక పెద్దమర్రిచెట్టుండేది. పిల్లలు వాడికి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టివుండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మో, గుర్రం బొమ్మో తెప్పించమనేవారు. కుంటివాడు గులకరాళ్ళు విసిరి మర్రిఆకు చెట్టుమీదుండగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేలమీద గుట్టగా పడివుండేవి.

ఒకరోజు రాజు ఉద్యాన వనానికి పోతూ ఆ ఆకులగుట్టని చూసి 'వీటినిలా కోసిన వారెవరు?' అని అడిగారు. పిల్లలు కుంటివాడిని ఒంటరిని చేసి పారిపోగా కుంటివాడు 'నేనే మహారాజా' అంటూ విషయమంతా వివరించాడు. రాజు పరివారాన్ని దూరంగా పంపి ఆ కుంటివాడిని 'ఏమయ్యా! మావద్ద ఒక వదరబోతున్నాడు. నీ విద్యతో అతని నోరుకట్టించగలవా?' అని అడిగాడు. తప్పకుండా అన్నాడు కుంటివాడు.

రాజు తనిని తన భవనానికి తీసుకొనిపోయి గది మధ్యగా తెర అడ్డం కట్టించి తెరకు చిన్న రంధ్రం చేయించి చిల్లుకి దురుగా పురోహితుడి ఆసనం వేయించి ఆయనవచ్చి కూర్చోగానే మాటలు మొదలు పెట్టాడు. అలవాటుప్రకారం పురోహితుడు తెరిచిన నోరు మూయకుండా మాట్లాడెయ్యడం మొదలు పెట్టాడు. తెర ఇవతల కుంటివాడు మేకపెంటికలను గొట్టంలోంచి తెరలోని చిల్లు ద్వారా పురోహితుడు తెరిచిన నోటిలోకి గురిచూసి కొట్టసాగాడు తన గొట్టంతో. పురోహితుడు మాట్లాడడంలో మునిగిపోయి వాటిని మింగేయసాగాడు. అలా చాలా మేక పెంటికలని తెరలోని కన్నం ద్వారా తన గొట్టంతో అతని నోటిలోనికి గురిచూసి పంపాడు కుంటివాడు. పురోహితుడి కడుపులోకి పోయిన మేకపెంటికలు ఉబ్బిపోయి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు రాజు అయ్యా! మీరు వాక్‌ప్రవాహంలో మునిగిపోయి నోటిలోకి మేక పెంటికలు పోవడం గమనించలేదు. ఇప్పుడవి కడుపులో ఉబ్బి బాధిస్తున్నాయి. ఇంటికి వెళ్ళి వాంతికి సాధనం చెయ్యండి, సర్దుకోండి. అని పంపేశాడు. అప్పటి నుంచి పురోహితుడు నోరు తెరిస్తే ఒట్టు. రాజుకి యితరులకీ సుఖంగా ఉంది. రాజు కుంటివాడికి సంవత్సరానికి లక్షరూపాయల ఆదాయం ఇచ్చాడు. ఎదుటివారి పరిస్థితిని ఇబ్బందిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి.

ఒంటె ఇద్దరు వ్యాపారులు

ఒక ఊరిలో ఒక కూరగాయల వ్యాపారి, ఒక కుమ్మరి పక్క పక్క ఇళ్లలో ఉండేవారు, పక్కనే ఉన్నా, ఇద్దరికీ క్షణం కూడా పడేది కాదు. చీటికీ మాటికీ తగాదాలు పెట్టుకునేవారు. ఒకరోజు ఇద్దరికీ తమ తమ సరుకులను పట్నంలో అమ్మాలంటే వాటిని మోసుకుపోయేందుకు ఒక ఒంటె అవసరమయింది.

వేరువేరుగా రెండు ఒంటెలను అద్దెకు తీసుకునే బదులు ఇద్దరు కలిసి ఒకే ఒంటెను అద్దెకు తీసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుందని అనుకున్నారు ఇద్దరూ. ఒకే ఒంటెను అద్దెకు తీసుకుని ఇద్దరూ చెరోవైపు సామానులను కట్టుకున్నారు. ఇక ప్రయాణం మొదలుపెట్టారు.

వేరువేరుగా రెండు ఒంటెలను అద్దెకు తీసుకునే బదులు ఇద్దరు కలిసి ఒకే ఒంటెను అద్దెకు తీసుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుందని అనుకున్నారు ఇద్దరూ. ఒకే ఒంటెను అద్దెకు తీసుకుని ఇద్దరూ చెరోవైపు సామానులను కట్టుకున్నారు. ఇక ప్రయాణం మొదలుపెట్టారు.

పంటలో వాటా

నజీరుద్దీన్‌ ముల్లాగా మారాక స్వంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బావుంటుందని అనుకున్నాడు. ఒక ఆసామి దగ్గరకు వెళ్ళి, పొలం అద్దెకిస్తే వ్యవసాయం చేసుకుంటానన్నాడు.

ఆ ఆసామి జిత్తులమారి. నజీరుద్దీన్‌ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, "అలాగే!నా భూమిలో నీవు పంట వేసుకో. కాని అద్దె కట్టాలి"అన్నాడు.

"అలాగే.అద్దె ఎంత?" అడిగాడు నజీరుద్దీన్‌.

"పొలం పండిన తర్వాత, భూమిపైన ఉన్న పైరంతా నాకిచ్చేయాలి. అదే అద్దె" అన్నాడు. ఆ కుటిల ఆస్వామి.

" అలాగే". అని నజరుద్దీన్‌ ఆ రోజునుండే పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు.

కొంతకాలానికి పొలం పండే సమయం వచ్చింది. కోత కూడా అయిపోయిందని తెలిసిన ఆసామీ తన వాటా కోసం నజరుద్దీన్‌ దగ్గరకి వెళ్ళాడు.

"భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచుల్లో ఎక్కించాను. తీసుకువెళ్ళండి"అన్నాడు.

ఆసామి సంచుల్లో చూస్తే అన్నీ ఆకులే ఉన్నాయి. తనను మోసం చేశాడని న్యాయ మూర్తి దగ్గర ఫిర్యాదు చేశాడు.

ఆయన నజీరుద్దీన్‌ని కూడా పిలిపించి విచారించాడు."

ఈ ఆసామి చెప్పేది నిజమేనా?" అని అడిగాడు.

"అవును. నిజమే" అన్నాడు నజీరుద్దీన్‌.

"మరి మోసం చేశావెందుకు?" అడిగాడు. మోసం ఏం ఉంది? ఆయన భూమిపైన పైరు కావాలన్నాడు. నేను వేరుశనగ వేశాను. ఆయన కోరినట్టే భూమిపైనదంతా ఆయన కిచ్చి, గింజలు నేను తీసుసున్నాను". అన్నాడు నజీరుద్దీన్‌.

నజీరుద్దీన్‌ తెలివికి న్యాయమూర్తి మెచ్చుకుని, అన్యాయమైన వాటా అడిగినందుకు ఆసామిని చివాట్లు పెట్టాడు.

పాలు ముట్టని పిల్లి

విజయనగరములో నివసించుచున్న ప్రజలకు ఎలుకల బాధ భరించరానిదైనది. ప్రభుత్వము ప్రజలను పిల్లులను పెంచమని ప్రోత్సహించినిది. రాయలవారు ప్రభుత్వోద్యోగులకు పిల్లులను ఉచితంగా ఇప్పించారు. పిల్లులను పెంచుటకు పాలు అవసరము. కావున ఒక్కొక్క ఆవును కూడా ఇప్పించినారు.

ప్రభుత్వోద్యోగులతోపాటు కవులకు, పండితులకు కూడా ఒక్కొక్క పిల్లిని, ఒక్కొక్క ఆవును ఇచ్చినారు. అందరితోపాటు రామకృష్ణ కవికి కూడా ఒక పిల్లిని, ఒక ఆవును ఇచ్చినారు. రామకృష్ణుడు పిల్లిని సరిగా పెంచలేదు. ఆవు ఇచ్చిన పాలన్నీ తమ కుటుంబంలోని వారికి ఉపయోగించసాగాడు. పిల్లి చాలినంత ఆహారంలేక ఆకలితో చాలా బాధపడుతూ వుండేది. ఆ ఆకలి తీర్చుకొనుటకు రాత్రింబవళ్ళూ మేల్కొని వుండి కనబడిన ఎలుకనన్నిటినీ చంపి తినసాగింది. క్రమంగా ఇరుగు పొరుగు ఇండ్లలో కూడా దూరి ఎలుకలను వేటాడి తిని ఆకలి తీర్చుకోసాగింది. అందువలన రామకృష్ణుని ఇంటిలోగాని, ఇరుగు పొరుగు ఇండ్లలో గాని ఎలుకలు కనిపించకుండా పోయాయి. పిల్లికి ఆహారంగా ఉపయోగపడుతున్న ఎలుకలు కూడా దొరకనందుకు అది బాగా చిక్కిపోయి నడవలేని స్థితిలో ఉన్నది.

ఇట్లు జరుగుతుండగా రాయలవారు తాము ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన పిల్లులను చూచి, బాగా పెంచిన వారికి బహుమతి ఇవ్వబడనున్నట్లు ప్రకటించారు. తమవద్ద నుండి పిల్లులను తీసుకొని వెళ్ళినవారంతా వాటిని పౌర్ణమినాడు తప్పక తీసుకొనివచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు. ఆ ప్రకటన విషయం రామకృష్ణకవి తెలుసుకొని ఆలోచనలో పడ్డాడు. ' ఆవు ఇచ్చిన పాలన్నీ నేను, మా కుటుంబ సభ్యులం హాయిగా త్రాగేశాం. పిల్లికి ఒక్కనాడయినా పాలు ఇవ్వలేదు. సరిగా తిండికూడా పెట్టలేదు. అది ఇప్పుడు చచ్చేస్థితిలో వుంది. దీనిని తీసుకొని వెళ్ళి రాయలవారికి చూపిస్తే సరిగా పెంచలేదని ఏమైనా అనవచ్చు, శిక్షించవచ్చు, జరిమానా విధించవచ్చు. పౌర్ణమి ఇక వారం దినాలున్నది. ఈ గండం నుంచి బయటపడడమెలా అని దీర్ఘంగా ఆలోచించాడు. కొంతసేపైన తర్వాత భార్యను పిలిచి ఒక గిన్నెలో బాగా వేడిగా వున్న పాలు తెమ్మన్నాడు. భార్య ఒక గిన్నెలో వేడి వేడి పాలు తీసుకొని వచ్చింది. ఆ గిన్నెని ఒకచోట పెట్టి పిల్లిని తీసుకొనివచ్చి దానిచేత త్రాగించుటకు ప్రయత్నించాడు. పాలను చూచి అది ఎంతో ఆనందించింది, ఆనందించి త్రాగబోయింది. మూతి కాలింది. అరుస్తూ పారిపోయింది. దానిని మళ్ళీ తీసుకొనివచ్చి పాలదగ్గర విడిచిపెట్టాడు. ఎంత ప్రయత్నించినా అది పాలు ముట్టుకోలేదు. ఆ విధంగా కొన్ని సార్లు జరిగింది. ఏమైనా పిల్లి పాలు ముట్టడంలేదు. అది పాలను చూసి ముఖం త్రిప్పుకోవటం మొదలుపెట్టింది. రామకృష్ణుని చేతుల నుండి తప్పించుకొని పారిపోవుటకు ప్రయత్నించింది. కాని పాలు త్రాగుటకు సిద్దపడలేదు. దాని ప్రవర్తనను చూసి రామకృష్ణుడు ఎంతో సంతోషించాడు. గండం తప్పించుకొని గట్టెక్కగలననుకున్నాడు.

పౌర్ణమినాడు రాయలవారి సమక్షంలో పిల్లుల ప్రదర్శన ప్రారంభమైనది, ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లులను ఎత్తుకొని తెచ్చి రాయలవారికి చూపిస్తున్నారు. ఒక పిల్లికంటే ఒకటి బాగా బలిసి వున్నది. అతిగా బలిసి అడుగు తీసి అడుగువేయలేక ఆయాసపడే స్థితిలో వున్నవి. ఎలుక కనపడినా పరుగెత్తి వెళ్ళలేనంత లావుగా వున్నవి. తాము ఇచ్చిన పిల్లులు తమ ఉద్యోగులు బాగా పెంచుతున్నారని రాయలవారు సంతోషిస్తున్న సమయంలో రామకృష్ణకవి తాను పెంచుటకు తీసుకొని వెళ్ళిన పిల్లిని తీసుకొనివచ్చి రాయలవారికి చూపించినాడు. అది బాగా కృశించిపోయి రేపోమాపో చస్తుందేమో అనుకొనేటట్లు వున్నది.

ఆ పిల్లిని చూడగానే రాయలవారికి ఆగ్రహం, ఆశ్చర్యం రెండూ కలిగాయి. రామకృష్ణ కవిగారు! మీ పిల్లి ఇలా వుండడానికి కారణం ఏమిటని అందరు పిల్లులూ ఒకదాని కంటే ఒకటి బలిసి ఎంతో అందంగా వుండగా మీ పిల్లి బక్కచిక్కి ఈ క్షణమో, మరుక్షణమో ప్రాణం వదిలేదానిలా వుందేం? మేము ఇచ్చిన ఆవుపాలు దీనికి పట్టడంలేదా? అని అడుగగా, రామకృష్ణుడు వినయంగా మహాప్రభు! ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు ఇన్ని అన్నీ కావు. అసలు పాలు ముట్టదు. అప్పుడప్పుడు కాస్త పప్పు అన్నం తింటుందనుకోండి. ఎప్పుడూ దీని దృష్టి ఎలుకలమీదే! దీని పుణ్యమా అని మేమేగాక, మా ఇరుగు పొరుగు ఇండ్ల లోని వారుకూడా ఎలుకల బాధ లేక హాయిగా వున్నారు అని చెప్పినాడు.

రామకృష్ణుని మాటలు విని రాయలవారేగాక సభలో వున్న మంత్రులు మున్నగువారు కూడ ఎంతో ఆశ్చర్యపడ్డారు. రాయలవారు, ఆయన మాటలు నమ్మలేదు. ఒక రాజభటుని పంపి పాలు తెప్పించి ఒకచోట పెట్టించారు. తమ పిల్లితో ఆ పాలు త్రాగించండి అని ఆజ్ఞాపించారు! రామకృష్ణుడు పట్టుకొనివున్న పిల్లిని తీసుకొనివెళ్ళి పాల ముందు నిలబెట్టాడు. అది ఆ పాలను చూడగానే ముఖం ప్రక్కకు త్రిప్పుకోసాగింది. రామకృష్ణుడు ఎంత ముందుకు నెట్టినా అది పాల వద్దకు పోక వెనుకకు తిరిగి వస్తున్నది. అది చూచి అంతా ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణకవి చెప్పిన మాటలు నిజమే అనుకోసాగారు.

ఎవరు ఏమనుకున్నా రాయలవారు మాత్రం రామకృష్ణుని మాటలు నమ్మలేదు. ' లోకంలో పాలుత్రాగని పిల్లి వుంటుందా? రామకృష్ణుడు ఏదో కొంటె పని చేసివుంటాడు. అందువల్లనే ఈ పిల్లి పాలు త్రాగుటకు భయపడుతున్నది ' అని ఆ పిల్లిని దగ్గరకు తెప్పించుకొని దాని నోరుపరీక్షించి చూచినారు. పిల్లి మూతి కాలిన మచ్చలు కనబడినవి. నాలుక చివర వాతపడినట్లున్నది. వాటిని చూచి రాయలవారు కోపించి రామకృష్ణకవీ! పిల్లి పాలు త్రాగకుండ మీరేదో చత్కారం చేసినట్లు గ్రహించాము. మీరు నిజం చెపితే క్షమించి విడిచిపెడతాను లేకుంటే కఠిన శిక్ష విధిస్తాను. అని బెదిరించగా, రామకృష్ణుడు జరిగిన విషయమంతయు చెప్పి ' మహాప్రభూ! మీరు మా ఎలుకల బాధ తీర్చుటకై పిల్లిని, దానిని పెంచుటకు ఆవును ఇచ్చినారు. ఆ పిల్లివలన మా యింటిలోని ఎలుకల బాధయే గాక, మా ఇరుగు పొరుగుల ఎలుకల బాధకూడా పోయినది. మీరు ఎవరినైనను పంపి మా ఇంటిలో పరిసరములో ఎక్కడైతే ఎలుకలు కనబడతాయో తెలుసుకొని రమ్మనండి, నేను నా పిల్లిని, ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టుటయేగాక, మాకు నిత్యం కావలసిన పాలు, పెరుగు, నెయ్యి మొదలగువానిని లోటు కలుగకుండ ఆవును కూడ ఇచ్చినందుకు మీకు నేను కృతజ్ఞతాపూర్వక వందనము అర్పించుకొనుచున్నాను. నా పిల్లివలె ఇచటికి తేబడిన ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టగలదేమో పరీక్ష పెట్టి చూడుము. కడుపునిండాతిని, బలిసిన పిల్లులు ఎలుకలను పట్టుటకు ప్రయత్నించునా? ఇచ్చటికి వచ్చినవారినడిగి తెలిసికొని నన్ను శిక్షించుటయో, రక్షించుటయో చేయండి అని చెప్పాడు.

రామకృష్ణుని మాటలు విని రాయలవారు అచ్చటికి బలిసిన పిల్లులను తెచ్చి వారిని విచారించగా వారి ఇండ్లలో ఎలుకల బాధ పూర్తిగా పోలేదని చెప్పిరి. రామకృష్ణుని ఇంటి పరిసరములలో నున్నవారిని విచారించగా తమకు ఎలుకలబాధ ఏ మాత్రం లేదని చెప్పిరి. ఆ సమాచారం తెలుసుకొని రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరియైనదేనని మెచ్చుకొని, వందవరహాలు బహుమతిగా యిచ్చి సత్కరించారు.

పారని పన్నాగం

ఒక ముసలి పిల్లి తనకి ఇష్టమైన ఆహారం, ఎలుక పిల్లలను పట్టుకోలేక చతికిలపడిపోయింది. పారిపోతున్న ఎలుకలను పట్టుకునేంతలోనే అవి చేజారిపోతున్నాయి. వయసు మీద పడుతుండడంతో ఇక ఎలుకలను పట్టడం తనవల్ల కాదని నిర్ణయించుకుంది.

ఎలుకలను చంపి తినేందుకు తన ఒళ్ళు కరగకుండా, ఆయాసం రాకుండా ఉండే ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించింది. ఎలుకలు బొయ్యారం దగ్గర్లోని గోడవద్ద ఒక తలదిండు కవర్‌ను మెడవరకు కప్పుకుని తలకిందులుగా నిలబడింది. ఎలుకలు తను చనిపోయిందనుకుని తన దగ్గరకు వస్తాయని, గుట్టు చప్పుడు కాకుండా వాటిని గుటుక్కుమనిపించవచ్చని ఆలోచించింది ముసలి పిల్లి. చిట్టెలుకలన్నీ తమ బొయ్యారపు ద్వారం దగ్గర నిలబడి పిల్లిని చూస్తున్నాయి. అది గమనించిన ఒక తెలివైన ముసలి ఎలుక పిల్లి పన్నాగాన్ని అర్ధం చేసుకుంది. కాని ఈ విషయం చెబితే చిట్టేలుకలు నమ్మవని దానికి తెలుసు కాబట్టి వాటిని కాపాడాలంటే తను కూడా పిల్లిలాగా అబద్ధపు ఆలోచన చేయాలని భావించింది. అంతే, అనుకున్నదే తడవుగా చిట్టెలుకల వద్దకు వచ్చి ఆహా ఎంత మంచి బ్యాగు. నేనెప్పుడూ పిల్లి తలతో ఉన్న ఇలాంటి బ్యాగ్‌ను చూడలేదే! చాలా బావుంది కదా! అంది. అది బ్యాగేనని తలపోసిన చిట్టెలుకలు వాటి దారిన అవి వెళ్లిపోయాయి. ముసలి పిల్లి ఆశలు అడియాశలయ్యాయి.

పావురాళ్ళు-రాళ్ళు

పావురాలంటే వెంకయ్యకు ఎంతో ఇష్టం. రకరకాల పావురాలను తెచ్చి పెంచుతూ ఉంటాడు!అరలు అరలుగా గూళ్ళతో నిండిన పెట్టెలు ఇంటి వసారాలో చూడ ముచ్చటగా అమర్చి పెట్టాడు. పప్పులు, పళ్ళు పెట్టి సరదాగా పెంచడం వల్ల, ఆ పావురాలు బాగా బలిసి, నవనవలాడుతూ ఎంతో అందంగా ఉంటాయి.

ఓ నాడు, గూళ్ళల్లోని పావురాలనన్నిటినీ విడిచి పెట్టి వెంకయ్య వాటికేసి సరదాగా చూస్తూ అరుగు మీద కూర్చున్నాడు. వయ్యారంగా అడుగులు వేస్తూ, ఆ పావురాలు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే హంసల్లా ఉన్నాయని అనుకొంటూ వెంకయ్య మురిసి పోతున్నాడు!

అంతలో ఆ పావురాలు నేలమీద వున్న చిన్నచిన్న రాళ్ళ పిసళ్ళను వెదుక్కొంటూ వాటిని మింగుతున్నాయి. అది చూసిన వెంకయ్యకు ఆశ్చర్యం కలిగింది! అసహ్యం కూడా వేసింది; "మంచి మంచి పప్పులు, పళ్ళు పెడుతూవుంటే, ఇవి రాళ్ళు మింగుతున్నాయేమిటి?" అని కోపం కూడా వచ్చింది. వెంటనే, ఛీ!మట్టి తినే ఈ పావురాలను పెంచడం నాదే తప్పు" అనుకొంటూ, చేతిలో ఉన్న కర్రను, వాటి మీద బలంగా విసిరాడు. కర్రదెబ్బ తప్పించుకొని పావురాలన్ని ఎగిరి పోయాయి కానీ, పావురాలతో పాటు రాతి పిసళ్ళను మింగుతూవున్న ఓ పిచ్చుకకు బలంగా దెబ్బ తగలడం వల్ల పక్కకు ఒరిగి పడిపోయింది.

'అయ్యో' అనుకొంటూ దగ్గరకు వచ్చిన ఓ పావురంతో అంది, ఆ పిచ్చుక, బాధపడుతూ "మన బతుకు పద్దతి ఇతడికి తెలియదు అతడు పెట్టే పప్పులు, పళ్ళు, బలమైన ఆహారం తింటున్నాం. అవి జీర్ణం కావడానికి రాళ్ళు తింటాం. ఇది మన తిండి పద్ధతి! ఆ విషయం తెలుసుకోక, అతడు మనలను కొట్టి తరుముతున్నాడు. ఇటువంటి తెలివి తక్కువవాడి వద్ద ఉండడం మనదే తప్పు, ప్రమాదం కూడానూ, పద, పోదాం" అంటూ పావురం సాయంతో పిచ్చుక ఎగిరి పోయింది! పావురాలన్నీ తలొక దిక్కుకూ ఎగిరిపోయాయి.

నిశ్చేష్టుడై వెంకయ్య అలానే కూర్చుండి పోయాడు, ఆకాశంలోకి ఎగిరి పోతున్న పావురాల కేసి చూస్తూ...!

పారిన పథకం

గౌరీపురంలో వుండే సూరమ్మకు గయ్యాళితనము, ధనాశ ఒక పాలు ఎక్కువగానూ, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగానూ వుండేవి. ఆమెకు ఇద్దరు పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్ళుగా వుండగానే భర్తపోగా, ఉన్న ఆస్తినే కర్పూరంలా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్ళి చేసింది. ఇక పెళ్ళికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు.

గోపాలుడు బాగా చదువుకొని కచ్చేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపెళ్ళి వారి నుంచి పెద్దగా కట్న కానుకలు లాగి, తన పూర్వవైభవాన్ని పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్నీ వారి ఆస్తిపాస్తులు తూకం వేసి తిరగ్గొట్టడం ప్రారంభించింది. తల్లి సంగతి ఇలా వుండగా గోపాలుడి ఆశలూ, కోరికలూ అందుకు భిన్నంగా వున్నవి. తాముంటున్న వీధిలోనే, నాలుగిళ్ళ అవతల వున్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహమాడాలన్నది అతడి ఆలోచన. నిర్మల చురుకుదనమూ, సహనమూ గల పిల్ల. అయితే, తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుందన్న ఆశ మాత్రం అతడికి లేదు. అందుకు, నిర్మల కుటుంబం ఆర్థికంగా తమకంటే తక్కువ స్థితిలో వుండడం ఒక కారణమైతే, నిర్మల తండ్రి రామయ్యకూ, తన తల్లికీ మధ్య ఏవో కుటుంబాల పాత తగువుల కారణంగా నివురుకప్పిన నిప్పులాంటి శత్రుత్వం వుండడం మరొక కారణం.

ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అని గోపాలుడు చాలాకాలం మధనపడి చివరకు ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకుని, తను కోరుకుంటున్నదేమిటో వివరంగా చెప్పి, మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్నతల్లి! ఆమెలో మార్పు కోరుకోవడమే గాని ఏమీ చెయ్యలేని అసహాయ పరిస్థితి నాది. అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖ జీవితం గడపాలంటే, నీ వంటిదాని సహకారం అవసరం. నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో, మన పెళ్ళికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు.

తల్లిలాగా కాకుండా మంచివాడూ, నెమ్మదస్థుడూ అయిన గోపాలుడంటే నిర్మలకు ఇష్టమే. ఆ ఇష్టాన్ని సూచిస్తూ, సిగ్గుతో తలవంచుకుని కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న నిర్మల, చివరకు, ఉపాయానికేం ఆలోచించవచ్చుకాని ఎటుతిరిగీ అత్తయ్యను కాస్త అయినా కష్టపెట్టక తప్పదు. అన్నది. దీనికి గోపాలుడు నవ్వి ఉన్నది మొండి జబ్బని తెలిశాక దాన్ని పూర్తిగా మందులతోనే తగ్గించమని పట్టుబట్టే మూర్ఖుణ్ణి కాదు, నిర్మలా! అన్నాడు. గోపాలుడికి తన మీద ఉన్న అభిమానానికీ, నమ్మకానికీ కృతజ్ఞతగా చూసిన నిర్మల, అయితే సరే! సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి, నీకు చెబుతాను అన్నది. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకం రూపొందించడమూ, గోపాలుడు దానికి అంగీకరించడమూ జరిగాయి.

ఆ రోజు నుంచి వారం గడవకుండా, ఒక విచిత్రం జరిగింది. ఒకనాటి తెల్లవారుఝామున, ఇంటి ముంగిట కళ్ళాపి చల్లడానికి నిర్మల వచ్చేసరికి, వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు. నిర్మల చప్పున తండ్రిని పిలిచి, సాధువును లోపలకు చేర్చి ఉపచారాలు చేసింది. కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువును, మరి రెండు రోజుల్లో బాగా కోలుకున్నాడు. క్రమంగా అతణ్ణి గురించిన వివరాలు తెలియవచ్చాయి. సాధువు పేరు కరుణానందుడు. అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు. గత నూట పది సంవత్సరాలుగా హిమాలయ పర్వత సానువుల్లో ఏకాంత జీవనం సాగిస్తూ, అనేక మహిమలు గడించాడు. మరొక రెండు సంవత్సరాల్లో నిర్వాణం చెందనున్నాడు. గురువు ఆదేశానుసారం, తాను నిర్వాణం చెందేలోగా, జనావాసాలన్నీ కాలినడకన తిరిగి, తన మహిమలన్నీ మంచివాళ్ళకూ, కరుణాహృదయులకూ ధారపోస్తున్నాడు. అలా తిరుగుతూనే ప్రయాణభారం, వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ వివరాలన్నీ ఇరవై నాలుగు గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి. ఊరివాళ్ళలో కొందరు పూలు, పండ్లు తీసుకెళ్ళి కరుణానందుడి దర్శనం చేసుకురాసాగారు. ఒకరిద్దరు మంచివాళ్ళకు మాత్రం, ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం లభించింది. అటువంటి వారిలో సూరమ్మ ఇంటికెదురుగా వుంటున్న గంగాధరం ఒకడు. గంగాధరాన్ని కరుణించిన సాధువు, అతడికి ఏదో మహిమ కూడా ప్రసాదిస్తానని చెప్పాడు.

ఈ సంగతంతా సూరమ్మకు తెలిసింది. మొదట రామయ్య ఇంటికి వెళ్ళడానికి సందేహించిన సూరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకొని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది. తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు. అతడు లోపల దీక్షలో కూర్చుని, నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల, సూరమ్మకు తెలిసినదేమంటే సాధువు, నిర్మలకు మహాలక్ష్మీ మంత్రం ఉపదేశిస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమీ శుక్రవారం నాడు, ఆ మంత్రాన్ని ఎనిమిదిసార్లు జపిస్తే, ఇంట్లోని ప్రతి మూలలోనూ నూట ఎనిమిది చొప్పున బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి!

ఇది వింటూనే సూరమ్మకు, నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది. ఇంతలో లోపలి తతంగం అంతా ముగిసినట్టు తెలియవచ్చింది. సూరమ్మ లోపలికి పోయి, సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి, అతణ్ణి తన ఇంటికి రావలసిందిగా ప్రార్థించింది. సాధువు మందహాసం చేస్తూ, ఇప్పుడు వీలుకాదు, తల్లీ! ఏచోటా వారం రోజులకు మించి వుండరాదని గురువాజ్ఞ. మరొక ఆరునెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మీ మంత్రం జరిపించబోతున్నది. ఉపదేశించిన గురువుగా నన్ను, ఆరోజున ఇక్కడికి వచ్చి, నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతుంది. అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను, అన్నాడు. సూరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి మీ ఇష్టం . స్వామీ కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది. ఏమిటో చెప్పు అన్నాడు సాధువు.

మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే, నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామీ! ఎంతోకాలంగా దాన్ని నా కోడలిని చేసుకోవాలనుకుంటున్నాను. కానీ దాని తండ్రికి నేనంటే పిసిరంత గౌరవం కూడా లేదు, అన్నది సూరమ్మ. సూరమ్మ మాట వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకొని కొద్దిసేపు తర్వాత తెరచి నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు! వాడు కచ్చేరీ ఉద్యోగం చేస్తున్నాడు అవునా? అని ప్రశ్నించాడు. అవును స్వామీ! అంటూ సూరమ్మ ఆనందంగా జవాబిచ్చింది.

సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను పిలిపించి రామయ్యా! ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు. నీ కూతురు నిర్మలకు తగినవాడు అన్నాడు. రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞ స్వామీ అన్నాడు. ఆ తర్వాత నెల తిరక్కుండానే రామయ్య నిర్మలకూ, గోపాలుడికీ వివాహం జరిపించాడు. వివాహం అయిన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీలచేత పాడుపడినట్టున్న పెద్ద పెరడును బాగుచేయించి, రకరకాల కూరగాయల మొక్కలు నాటింది. ఆ పెరట్లోనే ఒక మూలగా పాకవేయించి, అందులో రెండు గేదెల్ని కొనితెచ్చిపెట్టి పాలవ్యాపారం ప్రారంభించింది. ఈ విధంగా నాలుగునెలలు గడిచేసరికి కూరగాయలూ, పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సూరమ్మ అక్కడా ఇక్కడా చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనుక వేసింది.

తన కోడలు ఏ మంత్రం జపించకుండానే డబ్బు సంపాదిస్తున్నదని సూరమ్మ సంతోషించినా, రాబోయే శ్రావణమాసంలో మహాలక్ష్మీ మంత్రం జపించి, ఆమె కూడబెట్టబోయే బంగారు నాణాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది. కొన్నాళ్ళకు శ్రావణమాసం వచ్చింది. ఒకనాటి ఉదయాన రామయ్య, గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు. తనను చూడగానే పొంగిపోతూ అతిధి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు, ఏం సూరమ్మా! ఇల్లు కళకళలాడుతున్నది. నీ కోడలు మంత్రం జపించకుండానే, నీ ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందన్నమాట! అంటూ తను పెట్టుకున్న నకిలీ గడ్డమూ, జడలూ తీసి పక్కన పెట్టాడు. సూరమ్మ నిర్ఘాంతపోతూ చూసి ఏమిటీ మోసం? అంటూ కోపంగా మరేదో అనబోయింది. కాని, కరుణానందుడిగా వేషం వేసుకు వచ్చిన వృద్దుడు ఆమెను వారిస్తూ నన్ను నానా మాటలు అనబోయేముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మా! అన్నాడు. అతణ్ణి పరీక్షగా చూసిన సూరమ్మ అతణ్ణి గుర్తుపట్టి తడబడుతూ మీరా! అంటూ తల వంచుకున్నది.

అప్పుడు వృద్దుడు శాంతంగా గుర్తుపట్టావు గదా! అని, అక్కడే వున్న గోపాలుడికేసి తిరిగి, నాయనా! నేను నీ నాన్నకు స్వయానా పినతండ్రిని మీ అమ్మకు పిన మామగారిని. నాకు అప్పట్లో ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటుండేది. అది మా అన్నయ్యకు అంటే, మీ తాతకు ఇష్టం ఉండేదికాదు. నా అభిరుచి వదులుకోలేక, నేను మరొక ఊరు వెళ్ళిపోయాను. వృద్దురాలైన అత్త మామల్ని మీ అమ్మ నానాబాధలు పెట్టి కట్టుబట్టలతో వీధిలోకి తరిమేసింది. ఆ తర్వాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచినా, వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకూ కొడుకు కోసం బాధపడుతూనే వున్నారు, అంటూ ఆగి సూరమ్మను ఏం తల్లీ నేను చెప్పిన దాంట్లో అబద్దం పాలు ఏమీ లేదుగదా? అని ప్రశ్నించాడు.

సూరమ్మ వెలవెలపోతూ, తల పక్కకు తిప్పుకున్నది. వృద్దుడు ఒక్క క్షణం ఆగి, గోపాలుడితో ఇదంతా ఈ రామయ్యకూ, గంగాధరానికీ తెలుసు. నువ్వు నిర్మలను చేసుకోవడానికి నిశ్చయించుకున్న తర్వాత, నిర్మల రూపొందించిన పథకంలో, సాధువు పాత్రకు రామయ్యా, గంగాధరం నన్ను ఒప్పించారు. ఆపైన జరిగినదంతా తెలిసిందే! ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది. అంటూ సూరమ్మ వైపు తిరిగి, అత్త మామలను కాల్చుకుతిన్న నీ వంటి దానికి, నిర్మల లాంటి కోడల్ని తీసుకువచ్చి, నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాలిని చేశాడు. నిర్మల గుణగణాలు నీకు తెలియడం కోసమే, ఈ ఆరునెలలు గడువు ఇచ్చాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని సవ్యంగా ప్రవర్తించావా సరేసరి, లేదా నిర్మల కూడా ఒకనాటి సూరమ్మలా ప్రవర్తిస్తుంది. అన్నాడు.

ఆఖరికి పరిస్థితి అంతా పూర్తిగా అర్థం చేసుకున్న సూరమ్మ బొట బొటా కన్నీళ్ళు కారుస్తూ మామయ్యా! నా తప్పు నాకు తెలిసింది. మీరు చెప్పినట్లు నిర్మల నా కోడలవడం నా అదృష్టం. ఈ ఆరు నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మే అన్నది. సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధువు వేషంలో వున్న ఆమె పినమామతో పాటు అక్కడ వున్నవారందరూ చాలా సంతోషించారు.

పరోపకారి

ఒక ఊరిలో రామారావు అనే ఒక ధనవంతుడుండేవాడు. ఆయన చాలా ఉదార స్వభావం గలవాడు. అనేక విద్యాసంస్థలకు, అనాధ శరణాలయాలకు విరివిరిగా దానధర్మాలు చేసిన మనసున్న మనిషి. రామరావు తన దానగుణం వల్ల ఎంతో పేరు గడించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా అవడం వలన ఆయన గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు.

రామారావు దగ్గర చాలాకాలం నుండి పని చేస్తున్నాడు దానయ్య. ఒకరోజు దానయ్య రామరావును "అయ్యా! తమకు ఏమి తక్కువ? ఇన్ని సంపదలుండి మీరు విలాసవంతమైన జివితాన్ని కోరుకోరు. ఉదయం, సాయంత్రం పనివాళ్ళతో కలిసి పనిచేస్తారు. సరైన బట్టలు కూడా వేసుకోరు. అనుభవించడానికేగా ఈ సంపదంతా" అని అడిగాడు. దానికాయన ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.

కొంతకాలం తర్వాత వ్యాపారాల్లో నష్టాలు సంభవించాయి. ఆయన మంచిగుణం వలన ఇల్లు మాత్రమే మిగిలింది. అయినా ఆయన దిగాలుపడకుండా సంతోషంగానే ఉండసాగాడు. అప్పుడు దానయ్య "అయ్యా! ఇన్నాళ్ళు అంత ధనవంతుడిగా ఉండి మీరు ఇంత పేదవాడిగా కూడా ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు?" అని అడిగాడు.

చిరునవ్వుతో రామరావు "దానయ్య! నేను ధనవంతుడిగా ఉన్నా బీదవాడిగానే జివించాను, సుఖం అనేది శాశ్వతం కాదు, ఒక చుట్టం వంటిది. ధనమున్నదని విలాసవంతమైన జీవితానికి అలవాటుపడితే, ధనంలేని రోజు బ్రతుకు నరకంలా ఉంటుంది. నా స్థితి బాగున్న సమయంలో ఎందరికో సాయం చేసాను, వారిలో కొందరు నాకు ఈ స్థితి లో సహాయం చేస్తున్నారు" అన్నాడు. ఆ తర్వాత మిత్రులు, శ్రేయోభిలాషుల సహాయంతో వ్యాపారంలో ప్రవేశిఇంచి ఆయన మంచిగుణం వలన త్వరలోనే పూర్ణస్థితికి చేరుకున్నాడు. రామారావు వ్యక్తిత్వం, కీర్తిప్రతిష్టలు ఆయన్ని ఈ స్థితికి చేరుకునేలా చేశాయి.

పరోపకారం

ఒక అడవిలో నది ఒడ్డున ఓ మర్రిచెట్టు ఉన్నది. దానిపై ఒక పావురం నివసించేది. అది చాలా మంచిది. ఎవరికి కష్టం కలిగినా సాయం చేసేది. ఆ పావురానికి పాటలు పాడటమంటే భలే ఇష్టం తన పనంతా అయిపోయాక చెట్టు పై పాటలు పాడుతూ గడిపేసేది.

ఓ రోజు పావురం పాటపాడుతూ నదిలో నీరు తాగటానికి వచ్చింది. ఇంతలో నదీ ప్రవాహంలో కొట్టుకు పోతున్న చీమ ఒకటి కనిపించినది.దాన్ని ఎలాగయినా కాపాడాలనుకొంది పావురం. ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. వెంటనే మర్రిచెట్టు ఆకు నొకదానిని తీసుకొని చీమ పక్కన పడేసింది. 'ఓ చీమా ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో ' అని అరచింది. అంతే, చీమ వెంటనే ఆ ఆకు మీదకు వెళ్ళిపోయింది. ఆకు అలా తేలుతూ నది ఒడ్డున ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరిపోయింది. 'నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యావాదములు అంటూ పావురానికి చీమ కృతఙ్ఞతలు చెప్పింది. చీమ కొంత దూరం ప్రయాణం చెస్తూ విల్లు అమ్ములతో అటువైపు వస్తున్న ఒక వేటగాణ్ణి, ఆ వేటగాడు పక్షులకోసం నాలుగు వైపుల గాలించడం, చెట్టు కొమ్మపై కూర్చుని తినడంలో నిమగ్నమైన పావురాన్ని కూడా వేటగాడు చూసాడు. చీమ కూడా చూసింది.

ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనుక దాక్కొని బాణం ఎక్కు పెట్టి పావురానికి గురి పెట్టాడు. ఇది గమనించిన చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాణ్ణి కుట్టింది. బాణం మాత్రం దూసుకుంటూ వెళ్ళి పోయింది. బాధతో వేటగాడు అరిచాడు. బాణం గురి తప్పింది. పావురం అక్కడి నుండి మరోచోటుకు ఎగిరిపోయింది. తాను ఎలా రక్షింపబడ్డానన్న సంగతి పావురానికి తెలియలేదు. కానీ చీమకు మాత్రం తాను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమకు సంతోషంగా ఉన్నది. మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది.

ఆధారము: రమేష్ బాబు, టీచర్, పశ్చిమ గోదావరి

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate