অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వాణిజ్య విద్య

వాణిజ్య విద్య

భవితకు కామర్స్‌ కోర్సులు!
పదో తరగతి తర్వాత తీసుకునే ఇంటర్మీడియట్‌ గ్రూపు... విద్యార్థి కెరియర్‌ మార్గాన్ని దాదాపు నిర్ణయించేస్తుంది. ‘ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లలో ఏదో ఒకటి’ అనే మూస ఆలోచన నుంచి బయటపడి కామర్స్‌లో భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలనే ధోరణి పెరుగుతోంది. ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఎన్ని రకాల మార్గాలున్నాయి? ఆ సంగతులేమిటి?
సామాన్య గుమాస్తాల నుంచి దేశ ఆర్థిక రంగాన్ని శాసించే ఆర్థిక నిపుణుల వరకూ కామర్స్‌ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి. దీనిలో ఏ కోర్సు తీసుకుని చదివినా జీవితంలో స్థిరపడవచ్చు. దేశంలో అకౌంటెంట్ల కొరత ఏ స్థాయిలో ఉందో వ్యాపార రంగంలో ఉన్నవారికి తెలుసు. కామర్స్‌ రంగానికి ఇంతటి ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో పది తరువాత కామర్స్‌ రంగంవైపు ఎలా వెళ్లవచ్చు అనేది విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
సైన్స్‌ సబ్జెక్టు అయిన మ్యాథ్స్‌; కామర్స్‌ సబ్జెక్టులైన ఎకనామిక్స్‌, కామర్స్‌ల కలయికే ఈ గ్రూపు. ‘మ్యాథ్స్‌ అంటే మక్కువే కానీ ఫిజిక్స్‌, కెమిస్ట్రీలంటే భయం’ అనుకునేవారు నిశ్చింతగా ఇంటర్‌లో ఎంఈసీ గ్రూపు తీసుకోవచ్చు. సైన్స్‌, కామర్స్‌ల మేలు కలయిక కాబట్టి దీన్ని చదవటం వల్ల కెరియర్‌ను ఎలాగైనా మలుచుకోవచ్చు.
ఇంటర్‌లో ఎంఈసీ చదివి భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, సీఎస్‌, లా వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు, బి.ఎస్‌.సి., బి.కాం, బి.బి.ఎం వంటి డిగ్రీలు చేసి ఎం.కాం. ఎం.బి.ఏ. ఎం.సి.ఏ వంటి కోర్సులు పూర్తి చేయవచ్చు. సివిల్స్‌, గ్రూప్స్‌, బ్యాంక్‌ పరీక్షలూ, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే కూడా ఇంటర్‌లో ఎంఈసీసి గ్రూపు నేపథ్యం ఉపయోగపడుతుంది.

సీఈసీ
ఇది కామర్స్‌, ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్టుల కలయిక. ఈ గ్రూపు చదివినవారికి సైన్స్‌ గ్రూపువారికి మాదిరే మంచి అవకాశాలున్నాయి. ఇంటర్‌లో సి.ఇ.సి. చదివి, డిగ్రీ పూర్తిచేసి అనేక రంగాల్లో ప్రవేశించవచ్చు. లా పూర్తి చేయడానికీ; సివిల్స్‌, ఇతర పోటీ పరీక్షలు రాయడానికీ సి.ఇ.సి. గ్రూపులోని సబ్జెక్టులే కీలకం. ఎక్కువశాతం జనరల్‌ నాలెడ్జ్‌, సమాజానికి, రాజ్యాంగానికి సంబంధించి, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ అంశాలతో కామర్స్‌ను అనుసంధానం చేయడం వల్ల ఈ గ్రూపునకు ప్రాధాన్యం పెరిగింది.
‘కామర్స్‌ కెరీర్‌ కావాలి కానీ మ్యాథ్స్‌ అంటే భయం’ అనుకునేవారు నిశ్చింతగా ఈ గ్రూపు తీసుకోవచ్చు. సి.ఇ.సి. గ్రూపు తీసుకొని సి.ఎ., సి.ఎం.ఎ., సి.ఎస్‌. వంటి వృత్తివిద్యాకోర్సులు పూర్తి చేయవచ్చు.
కంపెనీ సెక్రటరీ కోర్సు
ఐదు కోట్లకు పైబడి మూలధనమున్న కంపెనీలు, స్టాక్‌ ఎక్సే్చజ్‌లలో నమోదు కావాలనుకుంటున్న కంపెనీలు తప్పనిసరిగా పూర్తిస్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాల్సివుంటుంది. నేర్పుతో, ఓర్పుతో వ్యాపారవేత్తలకు ఎప్పటికప్పుడు సమయానుగుణంగా సలహాలు, సూచనలు ఇచ్చేవారే కంపెనీ సెక్రటరీలు.
సి.ఎస్‌. కోర్సును ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ICSI)నిర్వహిస్తుంది. ఇది పార్లమెంటు ఆమోదించిన ఒక చట్టబద్ధమైన సంస్థ. సి.ఎస్‌. కోర్సును ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ అనే మూడు స్థాయుల్లో పూర్తి చేయవలసివుంటుంది.
* సి.ఎస్‌. ఫౌండేషన్‌: సి.ఎస్‌. ఫౌండేషన్‌ పరీక్షను కూడా సి.ఎ. కోర్సులోని సి.పి.టి. పరీక్ష మాదిరిగా ప్రవేశపరీక్ష రూపంలో నిర్వహించబోతున్నారు. అంటే ఈ పరీక్షను మల్టిపుల్‌ చాయిస్‌ పద్ధతిలోకి మార్చారు. పరీక్ష మొత్తం 200 ప్రశ్నలు, 400 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు అన్నమాట. ఈ పరీక్షను జూన్‌, డిసెంబర్‌లలో ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు.
* సి.ఎస్‌. ఎగ్జిక్యూటివ్‌: సి.ఎస్‌. ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించినవారు నేరుగా ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష (రెండు మాడ్యూల్స్‌గా 7 పేపర్లు) రాయవచ్చు. ఈ పరీక్ష కూడా జూన్‌, డిసెంబర్‌లలో ఏటా రెండుసార్లు జరుగుతుంది.
ఎగ్జిక్యూటివ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు 15 నెలల పాటు మేనేజ్‌మెంట్‌ శిక్షణ, మరో మూడు నెలలపాటు ప్రాక్టికల్‌ శిక్షణ తీసుకోవల్సి ఉంటుంది.
* సి.ఎస్‌. ప్రొఫెషనల్‌: ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాంలో ఉత్తీర్ణత సాధించినవారు/ ఉత్తీర్ణత సాధించి మేనేజ్‌మెంట్‌ శిక్షణ పూర్తిచేసుకున్నవారు ప్రొఫెషనల్‌ ప్రోగ్రాం చదవడానికి అర్హులు. ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష రాసిన సంవత్సరం తరువాత ఈ ప్రొఫెషనల్‌ పరీక్ష (మూడు మాడ్యూల్స్‌గా 9 పేపర్లు) రాయాల్సివుంటుంది. మాడ్యూల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి 50 శాతం సగటు మార్కులను సాధిస్తే విద్యార్థి మాడ్యూల్‌/ ప్రొఫెషనల్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటిస్తారు.
* CA, CMA, CS కోర్సులే కాకుండా మిగతా కామర్స్‌ కోర్సులైన M.Com, MBA చేసినవారికి కూడా మెరుగైన అవకాశాలున్నాయి.
సీఎంఏ కోర్సు
సీఏతో పాటు సీఎంఏ (ఐసీడబ్లు్యఏ) కోర్సుకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది. ఉద్యోగావకాశాల పరంగా అనుకూలమై, సులువుగా తక్కువ సమయంలో పూర్తిచేయగలిగిన కోర్సు ఇది. సీఏ కష్టం అనుకునే విద్యార్థులు సాధారణంగా బీకాం గానీ, ఎంబీఏ గానీ చేస్తారు. కానీ అదే సమయంలో సీఎంఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సును పూర్తిచేసి, త్వరగా స్థిరపడవచ్చనే అవగాహనతో దీనివైపు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు.
ఐసీడబ్లు్యఏ కోర్సును ఇప్పుడు సీఎంఏ (కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌)గా వ్యవహరిస్తున్నారు. ఇది చదవాలంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్‌వారైనా అర్హులే. దీనిలో ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్‌, ఫైనల్‌ అనే మూడు దశలుంటాయి.
* సీఎంఏ ఫౌండేషన్‌: ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులకు సీఎంఏ ఫౌండేషన్‌ పరీక్ష దేశవ్యాప్తంగా ప్రతి ఏడాదీ మార్చి, జూన్‌, సెప్టెంబరు, డిసెంబరులలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను 200 మార్కులకు ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల రూపంలో ఒకేరోజు నిర్వహిస్తారు. దీనిలో 50 శాతం లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. అలాంటివారిని ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటిస్తారు.
* సీఎంఏ ఇంటర్‌ (సీఎంఏ ఎగ్జిక్యూటివ్‌) కోర్సు : సీఎంఏ ఫౌండేషన్‌ కోర్సు పూర్తిచేసినవారు సీఎంఏ ఇంటర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఏడాది తర్వాత సీఎంఏ ఇంటర్‌ పరీక్ష రాయటానికి అర్హులు. ఇది పూర్తయినవారు ఒక ప్రొఫెషనల్‌ కాస్ట్‌ ఎకౌంటెంట్‌ దగ్గర/ గుర్తింపు పొందిన సంస్థల్లో ఆర్నెల్లపాటు ప్రాక్టికల్‌ శిక్షణ పొందాల్సివుంటుంది.
* సీఎంఏ ఫైనల్‌ కోర్సు: ప్రాక్టికల్‌ శిక్షణ పూర్తయిన విద్యార్థి ఫైనల్‌ పరీక్షను రాయవచ్చు. ఇది పూర్తిచేసినవారిని ఇన్‌స్టిట్యూట్‌ వారి కంప్యూటర్‌ శిక్షణ పూర్తయ్యాక క్వాలిఫైడ్‌ కాస్ట్‌ ఎకౌంటెట్లుగా పరిగణిస్తారు.
సీఏ కోర్సు
ఒకప్పుడు దీన్ని డిగ్రీ తరువాత చేసేవారు. తరువాత ఇంటర్‌ పూర్తిచేశాక చదివే అవకాశం కల్పించారు. ఇక ఇప్పుడైతే సి.ఏ. ఇనిస్టిట్యూట్‌ వారు పదో తరగతి తరువాతే ఈ కోర్సులో ప్రవేశించే అవకాశం కల్పించారు.
* ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థి సీఏ కోర్సుకు నమోదు చేసుకొని సీఏ కెరియర్‌ను ప్రారంభించవచ్చు.
* ఇంటర్‌ MEC/MPC/BiPC/CEC/HECఇలా ఏ గ్రూప్‌ వారైనా ఈ కోర్సు చదవవచ్చు. అయితే చాలామంది ఇంటర్‌లో ఎం.ఇ.సి. గ్రూపుతోపాటే సి.ఎ. కూడా ఏకకాలంలో చదవటానికే సుముఖత చూపిస్తున్నారు. దీనివల్ల వారు దాదాపు 6 నెలల సమయాన్ని ఆదాచేసుకుంటున్నారు. 
* ఇంటర్‌ ఎంఈసి లేదా సీఈసీ గ్రూపు తీసుకొని ఇంటర్‌తోపాటు సీపీటి (కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్టు)ని సమాంతరంగా పూర్తి చేయవచ్చు. ఈ లక్ష్యంతోనే రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఇంటర్‌తోపాటుగా లాంగ్‌ టర్మ్‌ సీపీటీ కోచింగ్‌ను అందిస్తున్నాయి.
* ఇంటర్‌ MPC/BiPC/HECగ్రూపు వారు ఇంటర్‌ తరువాత 6 నెలలకు సీపీటీ పూర్తి చేయవచ్చు.
* తరువాత 9 నెలలకు ఐపీసీసీ, అది పాసైన రెండున్నర సంవత్సరాలకు సీఏ ఫైనల్‌ పరీక్ష రాసి, సీఏ కోర్సు పూర్తిచేయవచ్చు.
* అంటే ఇంటర్‌ తరువాత కేవలం 4 సం॥లకే సీఏ కోర్సును పూర్తిచేసి జీవితంలో స్థిరపడవచ్చు.
posted on 1.2.2016

 

మార్కెట్ నిర్దేశకులు... కామర్స్ నిపుణులు
ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. చిన్న, మధ్యతరహా వ్యాపారాల స్థానంలోకి మల్టీ లెవెల్ మార్కెట్లు, బహుళజాతి కంపెనీలు ప్రవేశించాయి. ఫలితంగా కంపెనీల సమర్థ నిర్వహణకు వాణిజ్య నిపుణులకు డిమాండ్ పుంజుకుంది. మార్కెట్ అవసరాలకు తగిన నిపుణులను తీర్చిదిద్దడంలో అనేక యూనివర్సిటీలు విలువైన వాణిజ్య కోర్సులను అందిస్తున్నాయి. వాటి గురించిన సమాచారం తెలుసుకుందాం.
కామర్స్ సబ్జెక్టుతో ఇంటర్ పూర్తిచేసిన తర్వాత ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉంటాయి? ఉన్నవాటిలో దేన్ని ఎంచుకోవాలి? ఏ కోర్సుతో ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి? ఏ కాలేజీలో చేరాలి? అందులో సీటు ఎలా సంపాదించాలి? ఎంచుకున్న కోర్సు ఎన్నేళ్లకు పూర్తవుతుంది? మొదలైన అనేక ప్రశ్నలు విద్యార్థులకు ఎదురవుతుంటాయి. అధ్యాపకులు, స్నేహితులు, తల్లిదండ్రుల సలహాలు, సోషల్ మీడియా కొంతవరకు మాత్రమే సందేహాలను నివృత్తి చేస్తాయి. అంతిమ నిర్ణయం విద్యార్థులు ఎవరికి వారే స్వయంగా తీసుకోవాలి.
కామర్స్‌కు అనుకూలం
భారతదేశం రెండంకెల ఆర్థిక వృద్ధి సాధించాలని కోరుకుంటోంది. వచ్చే రెండు దశాబ్దాల్లో వ్యాపార అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కామర్స్, సోషల్ సైన్సెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ భాగం ఆర్థిక సేవలు, దాని అనుబంధ రంగాల నుంచే వస్తోం దన్నది గమనించాల్సిన విషయం. ఇలాంటి ఆర్థిక, వ్యాపార వాతావరణంలో కామర్స్, సంబంధిత కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉత్తమ అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు.

ఉన్నత విద్యావకాశాలు
ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో క్రమేణా నాణ్యత క్షీణించడం, ఆర్థికంగా భారంగా మారుతుండటంతో విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు ఆలోచిస్తున్నారు. మారుతోన్న ఆర్థిక పరిస్థితుల్లో కామర్స్ ఆకర్షణీయమైన కెరీర్‌ను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో, సులభంగా కామర్స్ సంబంధిత కోర్సులు పూర్తి చేయవచ్చు.
* బీకాం: ఇంటర్ కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంప్రదాయ కోర్సు ఇది. వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు బీకాం డిగ్రీలో కూడా అనేక రకాల స్పెషలైజేషన్‌లను ప్రవేశపెడుతున్నాయి. అవన్నీ కూడా ప్రారిశ్రామికంగా అవసరమమ్యేవి, ఉద్యోగావకాశాలు కల్పించేవే.
* బీకాం (ఆనర్స్): ఇది పూర్తిగా వ్యాపార, ఆర్థిక అంశాలతో రూపొందించింది. అనువర్తనకు అధిక ప్రాధాన్యం ఉన్న కోర్సు.
* బీకాం (కంప్యూటర్స్): కామర్స్‌లో కంప్యూటరీకరణకు ఈ కోర్సు దోహదపడుతుంది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా బీకాం డిగ్రీని ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. కార్పొరేట్ అకౌంటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్, సేల్స్ ప్రమోషన్స్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి.
* బీకాంతోపాటు సీఏ, సీఎస్, సీడబ్ల్యూఏ కోర్సులను అనుబంధ ప్రోగ్రామ్‌లుగా చదివే కొత్త ధోరణి పెరుగుతోంది. ఇందులో విద్యార్థులు బీకాం కోర్సును పూర్తిచేయడంతోపాటు వారి అభిరుచిని బట్టి సీఏ, సీడబ్ల్యూఏ కోర్సులకు అవసరమైన శిక్షణ లభిస్తుంది. సీఏలాంటి కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఒకవేళ వీటిలో విజయం సాధించలేకపోయినా బీకాం డిగ్రీ వస్తుంది కాబట్టి విద్యార్థి సమయం వృథా కాదు.
* ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్:
బీకాం-ఎల్ఎల్‌బీ లాంటి ఇంటెగ్రేటెడ్ కోర్సులు కూడా కామర్స్ విద్యార్థులకు ఉపయుక్తమైనవే. సాధారణంగా ఇవి అయిదేళ్ల కోర్సులు. ఒకేసారి రెండు డిగ్రీలు రావడం ఈ కోర్సుల ప్రత్యేకత. అయితే ఒక కోర్సు పూర్తయ్యాక (మూడేళ్ల తర్వాత) మధ్యలో చదువు ఆపేయడం వీలుకాదు. ఆపితే ఒక్క డిగ్రీ కూడా లభించదు.
* ప్రొఫెషనల్ కోర్సులు:
సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, సీఎఫ్ఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేస్తే అద్భుతమైన ఉద్యోగావకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు. సాధారణ డిగ్రీలతో పోలిస్తే ఇవి కొంచెం కష్టమైన కోర్సులు. సాధారణ డిగ్రీల్లా ఇవి క్యాంపస్ ప్రోగ్రామ్‌లు కాదు. విద్యార్థి వ్యక్తిగతంగా ఎక్కువ శ్రద్ధ, బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
* ప్రొఫెషనల్ కోర్సుల్లో సీఏకు మంచి అవకాశాలు ఉన్నాయి. బాగా శ్రమిస్తేనే సీఏలో ఉత్తీర్ణులు అవుతారు. దీంతో పోలిస్తే కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సులు కొంత సులభం. చాలా తక్కువ శాతం మంది మాత్రమే సీఏ కోర్సును పూర్తి చేయగలుగుతున్నారు.
కామర్స్, సంబంధిత విభాగాల్లో ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ పూర్తయ్యాక ఎన్నో రకాల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పీజీ, ఒకేషనల్ కోర్సులు, పోటీ పరీక్షలు ఇలా చాలా మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని...

* హయ్యర్ డిగ్రీ ప్రోగ్రామ్స్:
బీకాం పూర్తయిన విద్యార్థి ఎంకాంలో చేరొచ్చు. అయితే సాధారణ ఎంకాం కంటే ఎంబీఏ, ఎంఏ (ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్), మాస్టర్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్ (ఎంఐఎఫ్ఏ) మొదలైన కోర్సులతో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ కంట్రోల్, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ కోర్సులు చేయవచ్చు.
* పరిశోధన వైపు వెళ్లాలనుకునే వారికి ఆకర్షణీయమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అకౌంట్స్, ఫైనాన్స్ విభాగంలో డాక్టరేట్ల కొరత అధికంగా ఉంది. వీరికి టీచింగ్ ఒక మంచి కెరియర్. బోధన రంగంలో కూడా ప్రస్తుతం మంచి వేతనాలు లభిస్తున్నాయి.
* సర్టిఫికెట్ కోర్సులు:
ఎన్‌సీఎఫ్ఎం అండ్ సెబీ లాంటి సంస్థలు పలు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువే. ఫైనాన్షియల్ అనాలసిస్, ఫారెన్ ట్రేడ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మొదలైనవి మరికొన్ని సర్టిఫికెట్ కోర్సులు.
* పోటీ పరీక్షలు:
డిగ్రీ తర్వాత యూపీఎస్సీ, బ్యాంకింగ్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదలైన నియామక, పోటీ పరీక్షలు రాయొచ్చు.
* సొంతగా ప్రాక్టీస్
సీఏ, సీడబ్ల్యూఏ, సీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారికి కెరియర్ పరంగా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సొంతగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ నిపుణుల కొరత చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల పెద్ద కంపెనీల్లో ఉద్యోగులుగా చేరితే మొదట్లోనే ఏడాదికి నాలుగు నుంచి అయిదు లక్షల వేతనం తేలిగ్గా లభిస్తుంది.
* మంచి సంస్థల్లో ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారికి ఏడాదికి కనీసం మూడు లక్షలు, బీకాం వారికి రూ.1.2 లక్షల వరకు వేతనంగా పొందే వీలుంటుంది. ఇవన్నీ సాధించాలంటే మంచి అకడమిక్ రికార్డుతోపాటు విద్యార్థి దశలో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. చాలా వరకు కాలేజీలే ఇలాంటి అదనపు సామర్థ్యాల్లో శిక్షణ అందిస్తున్నాయి. లేకపోతే మంచి శిక్షణ సంస్థలో చేరి ఈ సామర్థ్యాలను పెంపొందించుకోవాలి.
* కష్టపడే తత్వం, తెలివితేటలు ఉన్న విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్‌ల కంటే కామర్స్ మంచి కెరియర్‌ను ఇస్తుంది. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఇదొక ఉత్తమమైన, తక్కువ పోటీ ఉన్న విభాగం అనడంలో సందేహం లేదు.
* కొన్ని ముఖ్యమైన కామర్స్ కాలేజీలు
* శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ
* సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా
* లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్, ఢిల్లీ
* లయోలా కాలేజ్, చెన్నై
* హన్స్‌రాజ్ కాలేజ్, ఢిల్లీ
* క్రిస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు
* శ్రీ నార్సిమోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, ముంబయి
* మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్, చెన్నై
* హిందూ కాలేజ్, న్యూఢిల్లీ
* స్టెల్లా మేరీస్ కాలేజ్, చెన్నై
వీటిలో ఎక్కువ విద్యాసంస్థలు 50-70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనవారికి ప్రవేశం కల్పిస్తున్నాయి. కొన్ని కాలేజీలు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులను కోర్సులకు ఎంపిక చేస్తాయి. ఇంకొన్ని సంస్థలు మేథ్స్‌లో మార్కుల శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.
కొన్ని ప్రముఖ కంపెనీలు
* ఎర్నెస్ట్ అండ్ యంగ్
* డెలాయిట్
* కేపీీఎంజీ
* బెయిన్ అండ్ కంపెనీ
* కాగ్నిజంట్-బీపీఓ
* హెచ్ఎస్‌బీసీ
* జీఈ క్యాపిటల్
* గూగుల్
* క్రిసిల్
* ఇన్ఫోసిస్ టెక్
* హిందూస్థాన్ యూనీలీవర్
* కన్సల్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్
* ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్
ఉద్యోగుల ఎంపికకు చాలా సంస్థలు కొంచెం కఠినమైన నియామక ప్రక్రియలను అనుసరిస్తున్నాయి. కొన్ని క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. ఏదైనా కంపెనీకి ఉద్యోగం కోసం వెళ్లే ముందు ఆ సంస్థ అనుసరిస్తున్న ఎంపిక ప్రక్రియను, అక్కడి పని వాతావరణాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

ఆదార౦:ఈనాడు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate