অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శాస్త్రీయ విజ్ఞానం II

శాస్త్రీయ విజ్ఞానం II

  1. రాత్రి వేళల్లో కాంతి పడితే పిల్లి - పులి కళ్ళు మెరుస్తాయెందుకు?
  2. పిల్లి ఎక్కువగా నాలుకనే ఎందుకు వాడుతుంది ?
  3. కొంత ఎత్తు నుంచి పిల్లులను వదిలితే అవి ఎపుడూ తమ నాలుగు కాళ్లపైనే నేలపై దిగుతాయి. ఎందువల్ల?
  4. పశువులు రంగులు చూస్తాయా?
  5. రేడియం స్టిక్కర్‌లో మెరుపు దేని నుంచి వస్తుంది?
  6. అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?
  7. బెర్ముడా ట్రయాంగిల్‌లో మిగతా ప్రాంతాలలో కన్నా ఎక్కువ నౌకలు మునిగిపోవడానికి కారణం ఏమిటి?
  8. ఒకోసారి సముద్ర తీరం పక్కనే బావి తవ్వినా మంచినీరు పడుతుంది. ఒకోసారి సముద్రాలకు దూర భూముల్లో బావి తవ్వినా ఉప్పు నీరు పడవచ్చు. బావి నీటి రుచికి కారణాలేంటి?
  9. సెల్‌ఫోను టవర్ల వల్ల ప్రమాదం ఉందంటారు. పైగా ఎక్కువసేపు మాట్లాడితే ఫోను వేడెక్కుతుంది. ఎందుకు?
  10. వూసరవెల్లి తన శరీరపు రంగును మారుస్తూ ఉంటుంది. ఎందుకు?
  11. ఊసరవిల్లి ఏక కాలములో అన్నివైపులా ఎలా?చూడగలుగు తుంది ?
  12. కళ్లఅద్దాల్లో ఆ మార్పులేల?
  13. ఓల్టేజి విలువలు తక్కువైనపుడు, విద్యుత్‌ పరికరాల్లో కరెంటు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఎందుకు?
  14. కొన్ని రకాల టానిక్కులు గాజు సీసాలలో, మరి కొన్ని ప్లాస్టిక్‌ సీసాల్లో వస్తున్నాయి. గాజు సీసాలలో ఉంచే వాటిని ప్లాస్టిక్‌ బాటిళ్లలో ఉంచకూడదా?
  15. జిల్లేడు పాలు విషం అంటారు. కానీ జున్ను తయారీలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల హాని కలుగదా?
  16. రసాయనాలను గాజు సీసాలలో నిల్వ చేస్తారెందుకని? వాటిలో ఉంచకూడనివి కూడా ఉంటాయా? మరి వాటినెలా నిల్వ చేస్తారు?
  17. ఐదేళ్ల లోపు పిల్లల మెదడు చురుగ్గా ఉంటుందని, ఏది చెప్పినా బాగా గుర్తుపెట్టుకుంటారని అంటారు. నిజమేనా?
  18. క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా?
  19. 70mm సినిమాథియేటర్‌కు, 35mm థియేటర్‌కు తేడా ఏంటి?
  20. రాత్రివేళల్లో అప్పుడప్పుడు చంద్రుడి చుట్టూ వలయాలు కనిపిస్తాయి. అవి చూసిన పెద్దవాళ్లు చంద్రుడు గుడి కట్టాడంటారు. దీనికి కారణం ఏమిటి?
  21. వర్షం వచ్చేముందు మేఘాలు నల్లగా ఉంటాయి ఎందుకు?
    1. జవాబు1
    2. జవాబు 2
  22. మేఘాలు గాలి కన్నా బరువైనవి కదా? మరి కింద పడవెందుకు?
  23. కోకో కోలా కనిపెట్టిందెవరు ?
  24. కోకోనట్‌ క్రాబ్ కధేమిటి ?
  25. చలికాలములో కొబ్బరి నూనె గడ్డకడుతుందెందుకు?
  26. నాణెము నీళ్ళలో వేస్తె పెద్దదవుతుందా?
  27. ఆపిల్‌ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా మారుతుంది. ఎందుకు?
  28. దుకాణాల్లో చూసిన వస్త్రాల రంగులు బయటకు వచ్చిన తర్వాత మరోలా కనిపిస్తాయి. ఎందుకు?
  29. ఖండాలు కదులుతూ ఉంటాయంటారు. నిజమేనా?
  30. భూమి నుంచి పైకి పోయే కొలదీ వేడి తగ్గిపోతూ ఉంటుందంటారు. ఎందువల్ల?
  31. కరోనా లో అంత వేడేల?
  32. జంతువులు కన్నీరు కారుస్తాయా? 'మొసలి కన్నీరు' అనే పదం ఎలా వచ్చింది?

రాత్రి వేళల్లో కాంతి పడితే పిల్లి - పులి కళ్ళు మెరుస్తాయెందుకు?

రాత్రి వేళల్లో కాంతి పడితే పిల్లి - పులి కళ్ళు లాంటి జంతువుల కళ్ళు మెరుస్తాయెందుకు అనే విషయం మీకు తెలుసా ! తెలియకపోతో ఇది ఓక సారి చదవండి.
పిల్లి, పులి లాంటి జంతువుల కను గుడ్డు పై భాగంలో టాపిటం ల్యూసిడం అనే ప్రత్యేకమైన సన్నని పొర ఉంటుంది ఈ పొరకు కాంతిని పరావర్తనం చేసే భౌతిక ధర్మం ఉంది. కొంతమేరకు పారదర్శకంగా ఉండే ఈ పొర కుంభాకారదర్పణం ఆకారంలో ఉంటుంది. కుంభాకార దర్పణంపై కాంతి కిరణాలు పడినప్పుడూ అవి పరావర్తనం చెంది మన కంటిని చేరుతాయి. ఆ కిరణాల వల్లనే మనకు ఆయా జంతువుల కళ్ళూ మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ పొర వలనే ఆ జంతువులు చీకట్లో కూడా పరిసరాలను చూడగలుగుతాయి.
రాత్రివేళ బస్సు లో వెళుతున్నప్పుడు ఆ బస్సు లైట్ కాంతిలో జంతువుల కళ్ళు విభిన్న రంగుల్లో మెరుస్తూ కనిపిస్తాయి .. పిల్లి కళ్ళు పచ్చగా , పశువుల కళ్ళు ఎర్రగా మెరవడం గమనించే ఉంటారు . ఇదంతా ఆయా జీవుల కంటి నిర్మాణం లో నున్న తేడాలు , కంటి లోపల కాంతిని గ్రహించే రెటీనాలో ఉండే స్పటికపు పొర కాంతిని ప్రతిఫలించే లక్షణము వలన , రెటీనాకు సరఫరా అయ్యే రక్తం ఈ స్పిటిక నిర్మాణములో వున్న తేడాలను బట్టి ఒక్కొక్క జీవి కళ్ళు ఒక్కొక్క రంగును బయటకు ప్రతిఫలిస్తాయి . . ఆ రంగులొ ఆ జీవుల కళ్ళు మెరుస్తూ కనిపిస్తాయి .

పిల్లి ఎక్కువగా నాలుకనే ఎందుకు వాడుతుంది ?

పిల్లి తన శరీరాన్ని ముఖ్యం గా కాళ్ళను నాలుకతో నాకుతూ కనిపిస్తుంది . అది దాని శరీర శుభ్రతకు , శుచికి , ఆరోగ్యానికి సంబంధించిన విషయము . తిన్న ఆహారము తాలుకు అవశేషాలను నోటిదగ్గర వుండన్వ్వదు . అలా నిలిచి వుంటే నాటిమీద సూక్ష్మజీవులు చేరి అనారోగ్యము రావచ్చు . . . అందువల్ల పిల్లి పెదవులను , మీసాలను నాకి శుభ్రం చేసుకుంటుంది . ఉష్ణోగ్రత అధికం గా ఉన్నప్పుడు శరీర భాగాలను నాకి చల్లపరచుకోవడం కుడా ఈ ప్రయత్నం లో భాగమే .

కొంత ఎత్తు నుంచి పిల్లులను వదిలితే అవి ఎపుడూ తమ నాలుగు కాళ్లపైనే నేలపై దిగుతాయి. ఎందువల్ల?

జవాబు: కొంత ఎత్తు నుంచి పిల్లులు కిందికి పడేటప్పుడు అవి గిర్రున తిరుగుతూ చక్రభ్రమణాలు చేస్తున్నా చివరికి నేలను తాకేముందు రెండు కాళ్లపైనే దిగుతాయి. వాటి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. నేలను తాకే ముందు వాటి నాలుగు కాళ్లు కింది వైపునకే తిరిగి నేలను నిదానంగా, నిటారుగా తాకుతాయి. ఇలా దిగడం వల్ల నేలను ఢీకొనేటపుడు ఉత్పన్నమయే అధిక తాకిడి ప్రభావం నుంచి ప్రాణాపాయం లేకుండా పిల్లులు తప్పించుకోగలుగుతాయి. అందువల్లనేమో 'పిల్లులకు తొమ్మిది జన్మలుంటాయనే' నానుడి ప్రాచుర్యంలో ఉంది.
కొంత ఎత్తు నుంచి కిందికి ఏ వస్తువునైనా వదిలితే, భూమ్యాకర్షణ శక్తి వలన దాని వేగం కాలంతో పాటు హెచ్చుతూ, నేలను తాకే ముందు వేగం గరిష్ఠం అవుతుంది. దీనిని త్వరణ వేగం అంటారు. కానీ ఎత్తు నుంచి కిందికి పడే పిల్లి తన శరీర భాగాలను నేలకు ఎంత సమాంతరంగా చాస్తుందంటే, అపుడు అది గాలిలో ఎగిరే ఉడుతను పోలి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గాలి నిరోధం దాని శరీరంపై పనిచేయడంతో అది కిందికి పడే వేగం తక్కువగా, సమంగా ఉంటుంది. శరీరాన్ని బాగా చాచడం వల్ల పడేటపుడు ఉత్పన్నమయే అభిఘాత తీవ్రత దాని శరీరంలోని కణజాలం గుండా చెల్లాచెదరవుతుంది. చివరగా పిల్లి పేరాచూట్‌లాగా నేలపైకి నిదానంగా దిగుతున్నట్లు నాలుగు కాళ్లపై నేలపైకి సురక్షితంగా దిగుతుంది.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

పశువులు రంగులు చూస్తాయా?

జవాబు: పశువులు రంగుల్ని చూడలేవనేది నిజమే. రంగులంటే మనం చూసే సప్తవర్ణాలు, వాటి కలయికల వల్ల ఏర్పడే ఫలిత వర్ణాలే. తెలుపు, నలుపుల్ని కూడా మనం రంగులంటాం కానీ అవి నిజానికి రంగులు కావు. ఇక పశువులు కేవలం నలుపు, తెలుపు ఛాయల్ని మాత్రమే చూడగలుగుతాయి. సినిమాల్లో ఎర్ర చీర కట్టుకున్న హీరోయిన్‌ను ఎద్దు తరిమినట్టు చూపించే దృశ్యాలన్నీ నాటకీయత కోసమే. ఎర్ర చీరయినా, పసుపు చీరయినా, ఆకుపచ్చ చీరైనా పశువులకు బూడిద (గ్రే) రంగులో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి నల్లటి దుస్తులు పశువులకు స్పష్టంగానే కనిపిస్తాయి.

రేడియం స్టిక్కర్‌లో మెరుపు దేని నుంచి వస్తుంది?

జవాబు: రేడియం స్టిక్కర్లలో వాడే పదార్థం రేడియం మూలకం కాదు. రేడియం మూలకం రేడియో ధార్మికత ద్వారా వెలుగును ఇవ్వడాన్ని మొదట మేడం మేరీక్యూరీ కనుగొన్నారు. అందుకనే ఆమెను 'రేడియం మహిళ' అంటారు. ఆ రేడియం పదార్థం రేడియో ధార్మికత ద్వారా వెలుగునిచ్చినట్లే, రేడియం స్టిక్కర్లు కూడా కాంతిని విరజిమ్మడాన్నిబట్టి 'రేడియం స్టిక్కర్లు' అంటున్నారు.రేడియం మూలకపు వెలుగు, రేడియం మూలకపు కేంద్రకానికి (Nucleus)  సంబంధించిన అంశం. కానీ రేడియం స్టిక్కర్ల ద్వారా వచ్చే వెలుగు కేంద్రకానిది కాదు. ఆ వెలుగు రేడియం స్టిక్కర్‌ పదార్థాల ఎలక్ట్రాన్ల ద్వారా వస్తుంది. రేడియం స్టిక్కర్లలో ఫ్లోరసెంట్‌ (Fluorescent) ధర్మంగల సేంద్రీయ, నిరింద్రియ పదార్థాలు  వాడతారు. వీటిమీద సూర్యకాంతిగానీ, వాహనాల హెడ్‌లైట్‌ కాంతిగానీ పడ్డపుడు వాటిలోని ఎలక్ట్రాన్లు ఉత్తేజం (Excite) చెందుతాయి. దీన్నే కాంతి శోషణం అంటారు. ఉత్తేజం పొందిన ఆ ఎలక్ట్రాన్లు తిరిగి తమ పూర్వస్థానానికి చేరే క్రమంలో కాంతిని వెలువరిస్తాయి. ఇది అన్నివైపులకు ప్రక్షేపణ చెందుతుంది. ఆ వెలుగునే మనం చూస్తాము.మరో రకమైన రేడియం స్టిక్కర్లను వాడుతున్నారు. రంగుల్లో ఉండే సాధారణ ప్లాస్టిక్‌ రిబ్బన్‌ల మీద చాలా సన్నని గాడులు ఉంటాయి. ఇటువంటి రిబ్బన్‌ల నుంచి అక్షరాల రూపాలను కత్తిరించి అతికిస్తారు. వీటిమీద వాహనాల కాంతి పడ్డపుడు ఆ కాంతి గాడులమీద వివర్తనం(Diffraction) చెంది వివిధ దిశల్లో పరిక్షేపణ చెందుతాయి. దాన్నే మనం స్టిక్కర్ల కాంతిగా చూస్తాం.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి. ఎందుకు?

జవాబు:ఏదైనా వస్తువు, ఉదాహరణకు తిరుగుతున్న బొంగరం, ఒక అక్షం ఆధారంగా తన చుట్టూ తాను తిరుగుతుందంటే, అది పరిభ్రమణం చేస్తుందని అంటాం. అంతరిక్షంలోని నక్షత్రాలు, గ్రహాలు ఇలా పరిభ్రమణాలు చేస్తుండడానికి కారణాన్ని భౌతిక శాస్త్ర నియమం 'కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం' ద్వారా వివరించవచ్చు. ఈ నియమం ప్రకారం పరిభ్రమణం చేస్తున్న వస్తువు ఏ కారణం లేకుండా దానంతట అది ఆగిపోదు. పరిభ్రమణం చేస్తున్న బొంగరం కొంతసేపటికి ఆగిపోవడానికి కారణం దాని 'ములుకు'కు నేలకు మధ్య ఉన్న ఘర్షణ (friction) ప్రభావమే. ఆ ఘర్షణ లేకుంటే పరిభ్రమణంలో ఉన్న బొంగరం ఆగకుండా అలా తిరుగుతూనే ఉంటుంది.ఇక నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణ విషయానికి వస్తే, అవి తమ చుట్టూ తాము పరిభ్రమిస్తున్న వాయుధూళి సముదాయం ఘనీభవించడం వల్ల ఏర్పడినవే. ఈ వాయుమేఘాలు గురుత్వ ప్రభావం వల్ల క్రమేపీ తమలోకి తాము కుంచించుకుపోవడంతో కాలక్రమేణా నక్షత్రాలు, వాటి చుట్టూ గ్రహ వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఈ వాయు మేఘాలు కుంచించుకుపోయేకొలదీ వాటి భ్రమణ వేగాలు ఎక్కువయ్యాయి. ఐస్‌పై స్కేటింగ్‌ చేస్తూ తమ చుట్టూ తాము తిరుగుతున్న స్కేటర్లు తాము దూరంగా బార చాపిన చేతులను తమ శరీరానికి దగ్గరగా తెస్తున్నపుడు వారి పరిభ్రమణ వేగం ఎక్కువవుతున్నట్లు. ఇలా పరిభ్రమిస్తున్న వాయు మేఘాలు క్రమేపీ నక్షత్రాలుగా మారుతున్నపుడు ఆ మేఘాలలోని అతి కొద్ది శాతం పరిభ్రమణ చలనం మాత్రమే నక్షత్రాలకు బదిలీ అవుతుంది. లేకపోతే ఆ చలన వేగానికి నక్షత్రాలు తునాతునకలై పోతాయి. ఇలా జరగకుండా నిరోధించడానికే ఆ నక్షత్రాల నుంచి గ్రహాలు ఏర్పడి, వాయుమేఘాల తొలి పరిభ్రమణ వేగం అంటే తొలి కోణీయ ద్రవ్యవేగాన్ని తలాకొంచెం పంచుకున్నాయి. అందువల్లే నక్షత్రాలు, గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతుంటాయి.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

బెర్ముడా ట్రయాంగిల్‌లో మిగతా ప్రాంతాలలో కన్నా ఎక్కువ నౌకలు మునిగిపోవడానికి కారణం ఏమిటి?

జవాబు : బెర్ముడా అనే ప్రాంతం పశ్చిమ అట్లాంటిక్‌ సముద్రంలో బెర్ముడా ద్వీపాలు, దక్షిణ ఫ్లోరిడా ప్యూర్టోరికాల మధ్య త్రిభుజాకారంలో ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు, ఆకాశంలోని విమానాలు కొన్ని హఠాత్తుగా అదృశ్యమయ్యాయి. ఇలా జరగడానికిగల కారణాలను వివరించడానికి శాస్త్రజ్ఞులు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. బెర్ముడా ప్రాంతపు సముద్ర లోతుల్లో మీధేన్‌ హైడ్రేట్‌ నిక్షేపాలున్నాయి. ఈ రసాయనిక పదార్థం వెలువరించే వాయువు మంచు స్ఫటికాల రూపంలోకి మారుతుంది. భూకంపాల వల్ల ఈ నిక్షేపాలకు నష్టం వాటిల్లినపుడు ఈ వాయువు పెద్ద బుడగల రూపంలో సముద్రపు నీటి ఉపరితలం చేరుకోవడంతో అక్కడి నీటి సాంద్రత తటాలున ఒక నాటకీయ రూపంలో తగ్గిపోవడంతో అక్కడికి చేరుకున్న నౌకలు నీటిపై తేలియాడే ప్లవన శక్తి (buoyancy)ని కోల్పోయి మునిగిపోతాయి. మరో సిద్ధాంతం, మిగతా ప్రాంతాల్లోలా కాకుండా అక్కడ ఉండే విద్యుత్తు అయస్కాంత క్షేత్రాలు (electro magnetic field) ఉహించని రీతిలో తటాలున మారుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతంలోకి ప్రవేశించే యంత్ర భాగాలు పనిచేయకపోవడంతో అవి ప్రమాదానికి గురవుతాయి.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

ఒకోసారి సముద్ర తీరం పక్కనే బావి తవ్వినా మంచినీరు పడుతుంది. ఒకోసారి సముద్రాలకు దూర భూముల్లో బావి తవ్వినా ఉప్పు నీరు పడవచ్చు. బావి నీటి రుచికి కారణాలేంటి?

జవాబు: బావుల్లో ఊరే నీటి రుచికి సముద్రమే కారణం కానక్కర్లేదు. చాలా మటుకు భూమి పొరల్లో ఉండే భూగర్భజలం (ground water) బావుల్లోకి ఊటలాగా చేరుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లోని భూగర్భాల్లో సముద్రపు నీరే చేరి ఉంటుందనుకోకూడదు. అది నిజమైతే సముద్రాల ఉపరితలంపై ఉండే విపరీతమైన ఒత్తిడి బావుల్లో నీరు పొంగిపొర్లాలి. అలా జరగడం లేదు కదా! కాబట్టి ఆ బావుల్లోకి చేరే నీరు చాలా సార్లు అక్కడి భూమి పొరల్లో ఇంకి ఉన్న లవణాల కారణంగా ఉప్పగా ఉండే అవకాశాలున్నా, కొన్ని సార్లు మంచి నీరు కూడా ఊరుతుంది. అలాగే సముద్రాలకు దూరంగా ఉండే పీఠభూముల్లో కూడా ఉప్పు నీరు పడే అవకాశాలు లేకపోలేదు. అది అక్కడి భూముల తత్వంపై ఆధారపడి ఉంటుంది. నేలల్లోని లవణాలుంటే వాటిని కరిగించుకున్న నీరు ఉప్పగా ఉంటుంది. సాధారణంగా భూగర్భజలాల్లో లవణ శాతం, సరస్సులు నదుల్లోని నీళ్ల లవణ శాతం కన్నా ఎక్కువ ఉంటుంది.

-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

సెల్‌ఫోను టవర్ల వల్ల ప్రమాదం ఉందంటారు. పైగా ఎక్కువసేపు మాట్లాడితే ఫోను వేడెక్కుతుంది. ఎందుకు?

జవాబు: సమాచార రంగంలో సెల్‌ఫోను వ్యవస్థ విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చింది. దేశ జనాభా సుమారు 120 కోట్లు ఉండగా మన దేశంలో సుమారు 80 కోట్ల వరకు సెల్‌ఫోను నంబర్లు చలామణీలో ఉన్నట్టు తెలుస్తోంది. 2జీ, 3జీ, 4జీ వంటి ఆధునిక ఎలక్ట్రానిక్‌ సాంకేతిక రూపాల్లోకి మాటలతోనే కాకుండా దృశ్య రూపేణా అందర్నీ తీసుకు రాగలిగింది. విద్యుదయస్కాంత తరంగాలను వాహకాలుగా వాడుకుంటూ అబ్బురపర్చే ఎలక్ట్రానిక్స్‌ మాడ్యులేషన్ల పద్ధతిలో వివిధ సెల్‌ఫోను సంస్థలు పనిచేస్తున్నాయి.

ఇన్ని కోట్ల ఫోన్లున్నా మాట్లాడాలనుకున్న వ్యక్తి సెల్‌ నెంబర్‌ సరిగ్గా నొక్కగానే వారితో వెంటనే మాట్లాడగలగడం సెల్‌ఫోను వ్యవస్థలో ఉన్న సాంకేతిక వైశిష్టతే. సెల్‌ఫోనుల్లో సూక్ష్మ తరంగాల్ని వాడతారు. సుమారు 800 కిలోహెర్ట్జ్‌ నుంచి సుమారు 3 గెగాహెర్ట్జ్‌ ఉన్న సూక్ష్మ తరంగాల్ని సెల్‌ఫోను టవర్ల ద్వారా బకదాని నుంచి మరో సెల్‌ఫోనుకు సంధానం చేస్తారు.సెల్‌ఫోను వ్యవస్థలో టవర్లు చాలా కీలకమైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలిబుచ్చిన ప్రకటన ప్రకారం సెల్‌ఫోను టవర్ల వల్ల దగ్గరున్న ప్రజలకు, పక్షులకు ఏ మాత్రం హాని లేదు. కానీ సెల్‌ఫోనును అదే పనిగా చెంప దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటే ఆ సూక్ష్మ తరంగాల ధాటికి తల భాగంలో వేడెక్కి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎలక్ట్రానిక్‌ పరికరం ఏదైనా అదే పనిగా వాడినట్లయితే వేడి ఉత్పన్నం కావడం సహజం. ఇందుకు సెల్‌ఫోన్లు మినహాయింపు కాదు.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య,నిట్‌,వరంగల్‌;జనవిజ్ఞానవేదిక,శాస్త్రప్రచారవిభాగం(తెలంగాణ)

వూసరవెల్లి తన శరీరపు రంగును మారుస్తూ ఉంటుంది. ఎందుకు?

జవాబు: వూసరవెల్లి తన శరీరపు రంగును పరిసరాలకు అనుగుణంగా మారుస్తుందనుకోవడం నిజం కాదు. కానీ దాని శరీరపు రంగులు మారతాయనేది మాత్రం నిజం. పరిసరాల్లోని ఉష్ణోగ్రత, వెలుతురు తీవ్రతల్లోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా దాని చర్మం స్పందిస్తూ ఉంటుంది. అవి ఒకదానితో ఒకటి సందేశాలు పంపుకోవడం, వాటి మానసికావస్థను తెలియ పరుచుకునే క్రమంలో కూడా ఈ రంగుల మార్పిడి ఉపయోగపడుతూ ఉంటుంది. వాటి చర్మంలో ఉండే జీవకణాల్లో పలు యాంత్రిక నిర్మాణాల చర్యల వల్ల రంగుల మార్పు జరుగుతుంది. చర్మంలోని క్రోమోటోఫోర్స్‌ (chromotophores) అనే ప్రత్యేకమైన జీవకణాల వల్ల వేర్వేరు రంగులు ఒకేచోట ఏర్పడడమో లేక వివిధ ప్రదేశాలకు విస్తరించడమో జరుగుతుంది. వివిధ రకాలైన క్రోమోటోఫోర్స్‌ వేర్వేరు రంగులను మెరిసే స్ఫటికాల రూపంలో కలిగి ఉంటాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్

ఊసరవిల్లి ఏక కాలములో అన్నివైపులా ఎలా?చూడగలుగు తుంది ?

ఉసరవిల్లి ఏకకాలం లో అన్ని వైపులా చూస్తుంది. ఎదురుగా ఆహారము కోసం వెదుకుతూనే , వెనకనుంచి పొంచి ఉన్నా శత్రువును పసిగట్టగలదు. ఇదెలా సాధ్యం?.. దీనికి వళ్ళంతా కళ్లు ఉండవు . మనలాగే రెండే ఉంటాయి . కాని కనుగుడ్డు దేనికదే అటు ఇటు తిరుగు తుంది. ఒక కన్ను పైకి చూస్తుంటే , మరొకటి ఎదురుగా గాని , కిందికి గాని చూస్తూ ఉంటుంది . ఏదైనా ఆహారము , పురుగు దృష్టి లో పడినప్పుడు మాత్రం రెండు కళ్లు దాని మీదే చుపు కేంద్రీకరిస్తాది ..మరో విశేసం .. . ఉసరవిల్లి డి బైనాక్యులర్ విజన్ ! .ఈ చూపుతో లక్ష్యన్ని సూటిగా గురిచూసి తన పొడవాటి నాలుకను బాణం లా విసురుతుంది . దీనికుందే గుగురుకు కీటకం అటుక్కుపోతుంది. మరుక్షనమ్ నోటిలోకి లాగేసుకుని గుటుక్కున మింగుతుంది.

కళ్లఅద్దాల్లో ఆ మార్పులేల?

జవాబు: కళ్లకు ధరించే కొన్ని కళ్లజోళ్ల కటకాలు (lenses ) నీడలో తెల్లగా ఉండి, వెలుగులోకి రాగానే నల్లగా మారతాయి. మరలా నీడలోకి వచ్చిన కొంతసేపటికే యథాప్రకారం తెల్లగా మారతాయి. ఈ కటకాలను ఫొటోక్రోమిక్‌ లెన్సులు (photo chromic lenses) అంటారు. ఇవి మొదటిసారిగా 1960లో మార్కెట్లోకి వచ్చాయి. ఈ కటకాలను తయారుచేసే గాజులో సిల్వర్‌ హాలైడ్ల అణువులు ఉంటాయి. ఈ అణువులకు సూర్యకిరణాల్లోని అతి నీలలోహిత కాంతి సోకగానే ఒక రకమైన మార్పునకు లోనవుతాయి. సిల్వర్‌ హాలైడ్లలో ఉండే సిల్వర్‌ హాలోజన్‌ కణాలు విడివడి సిల్వర్‌ కణాలు తెల్లగా ఉండే కటకాలను నల్లగా మారుస్తాయి. ఈ ప్రక్రియలో కంటికి కనబడే కాంతి వర్ణపటంలోని కొంత కాంతి శోషింపబడుతుంది. మరలా నీడలోకి రాగానే కటకాలపై అతి నీలలోహిత కిరణాలు పడకపోవడంతో అంతకుముందు సూర్యరశ్మిలో విడివడిన సిల్వర్‌, హాలోజన్‌ అణువులు మళ్లీ కలిసిపోతాయి. దీంతో కటకాలు మునుపటి తెల్లని కాంతిని తిరిగి పొందుతాయి.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌

ఓల్టేజి విలువలు తక్కువైనపుడు, విద్యుత్‌ పరికరాల్లో కరెంటు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఎందుకు?

జవాబు: మనం ఇళ్లలో వాడే విద్యుత్‌ పరికరాలను రెండు రకాలుగా విభజింపవచ్చు. ఒక రకం విద్యుచ్ఛక్తిని ఉష్ణశక్తిగా మార్చే ఎలక్ట్రిక్‌ ఐరన్‌, ఎలక్ట్రికల్‌ హీటర్‌. ఎలక్ట్రిక్‌ బల్బులయితే, మరోరకం విద్యుత్‌ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చే ఎలక్ట్రిక్‌ మోటార్లు లాంటివి.
మొదటి రకం పరికరాల్లో వాటి గుండా ప్రవహించే విద్యుత్‌ ప్రవాహం (ఎలక్ట్రిక్‌ కరెంటు) ఓల్టేజి వర్గమూలానికి (square root) అనులోమానుపాతంలో ఉంటుంది. అందువల్ల సప్లయి అయ్యే విద్యుత్‌ ఓల్టేజి తక్కువగా ఉంటే, కరెంటు విలువలు కూడా తక్కువగా ఉంటాయి.

రెండవ రకం ఎలక్ట్రిక్‌ మోటార్ల విషయంలో అవి పనిచేయడానికి కావలసిన విద్యుత్‌ సామర్థ్యం (ఎలక్ట్రిక్‌ పవర్‌) ఆ పరికరాలపై, (మామూలుగా వాటు (watts)లేక కిలోవాట్ల (kw)లో) బిగించబడిన ప్లేట్లపై మార్కు చేసి ఉంటుంది. అలాంటి పరికరాల్లో ప్రవహించే ఎలక్ట్రిక్‌ కరెంటు, వాటికి అప్లయి చేసిన ఓల్టేజికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే, అప్లయి చేసిన ఓల్టేజి విలువలు తక్కువగా ఉంటే వాటిపై పనిచేసే ఎలక్ట్రిక్‌ మోటార్లు చెడిపోతాయి. కారణం, అవి ఎక్కువ ఎలక్ట్రిక్‌ కరెంటును రాబట్టడంతో వాటిలో ఉండే విద్యుత్‌ ప్రవహించే తీగ చుట్టలు అతిగా వేడెక్కి కాలిపోతాయి.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

కొన్ని రకాల టానిక్కులు గాజు సీసాలలో, మరి కొన్ని ప్లాస్టిక్‌ సీసాల్లో వస్తున్నాయి. గాజు సీసాలలో ఉంచే వాటిని ప్లాస్టిక్‌ బాటిళ్లలో ఉంచకూడదా?

జవాబు: పదార్థాల రసాయనిక స్వభావాన్ని బట్టి నిల్వ ఉంచే పాత్రల్ని ఎన్నుకోవాలి. ఉదాహరణకు వూరగాయల్ని అల్యూమినియం, రాగి, ఇత్తడి, వంటి పాత్రల్లో నిల్వ ఉంచకూడదు. అందుకే వాటిని పింగాణీ పాత్రల్లో నిల్వ ఉంచుతారు. వూరగాయల్లో ఉన్న ఆమ్లత్వం(Acidity)పాత్రల లోహాల్ని ఆక్సీకరణం(Oxidation) చేయడం వల్ల ఏర్పడే లవణాలు(Salt) వూరగాయల్ని పాడయ్యేలా చేస్తాయి. అదే పింగాణీ మీద ఆమ్ల ప్రభావం దాదాపు శూన్యం.అదే విధంగా ఆల్కహాలు, ఈథర్‌, క్లోరోఫాం వంటి సేంద్రియ ద్రవాల్ని ప్లాస్టిక్‌ బాటిళ్లలో నిల్వ ఉంచరు. ఎందుకంటే ఈ ద్రావణులు (solvents)ప్లాస్టిక్‌ పదార్థాల్ని కరిగించుకుంటాయి. అంటే పాత్ర ఖరాబు కావడంతో పాటు లోపలున్న పదార్థాలు కూడా చెడిపోతాయి. ఇలాంటి వాటిని గాజు పాత్రల్లోనే ఉంచాలి. అలాగే కొన్ని ద్రవాల్ని పారదర్శకంగా (Transparent)ఉండే గాజు పాత్రల్లో ఉంచరు. ఎందుకంటే అవి కాంతి సమక్షంలో చెడిపోయే లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి దట్టమైన గోధుమ రంగు (Deep brown)గాజు పాత్రల్లో ఉంచుతారు. హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లాన్ని గాజు పాత్రల్లో ఉంచరు. ఇది గాజుని తినేస్తుంది. దీన్ని విధిగా ప్లాస్టిక్‌ సీసాలోనే నిల్వ ఉంచాలి. అందువల్ల రకరకాల టానిక్కులను వాటిలో ఉండే పదార్థాలకు అనుగుణంగా తగిన పాత్రల్లోనే ఉంచుతారు.

- ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక

జిల్లేడు పాలు విషం అంటారు. కానీ జున్ను తయారీలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల హాని కలుగదా?

జవాబు: జిల్లేడు చెట్టును ప్రాచీన కాలం నుంచీ ఓ ఔషధ మొక్క (medicinal plant)గా వాడుతున్నారు. అతి తక్కువ మోతాదులో జిల్లేడు ఆకులు, కాండపు పొడిని ఉబ్బసం, విరేచనాలు, జ్వరం, వికారం, అజీర్తి వంటి జబ్బుల్ని నివారించేందుకు ఆయుర్వేద పద్ధతిలో వాడుతున్నారు. వాటిని ఎప్పుడూ నేరుగా ఎందులోనూ వాడరు. ఎందుకంటే ఇందులో కాలోట్రోపిన్‌ అనే విష రసాయనం ఉంటుంది. అందువల్లనే జిల్లేడు ఆకుల్ని పశువులు కూడా తినవు. జిల్లేడు పాలు కళ్లలో పడితే ప్రమాదం. చర్మం మీద పడితే కొంచెం బొబ్బలు వస్తాయి. దాన్ని జున్ను తయారీలో వాడడం మంచిది కాదు.

ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

రసాయనాలను గాజు సీసాలలో నిల్వ చేస్తారెందుకని? వాటిలో ఉంచకూడనివి కూడా ఉంటాయా? మరి వాటినెలా నిల్వ చేస్తారు?

జవాబు: గాజు సీసాల్లో రసాయనాలను ఉంచడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి గాజు రసాయనికంగా స్థిరమైనది. ఆమ్లాలు, క్షారాలు, విషాలు, నూనెలు, సేంద్రీయ పదార్థాలు ఏవీ గాజుతో చర్య చెందవు. రెండోదేమిటంటే గాజు పారదర్శకత వల్ల లోపల ఏముందో, ఎలా ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
కాంతి సమక్షంలో చర్యలకు లోనయ్యే కొన్ని రసాయనాలను రంగు గాజు పాత్రలలో ఉంచుతారు. ఉదాహరణకు హైడ్రోజన్‌ పెరాక్సైడు, అసిటోన్‌, బెంజిన్‌ వంటి ద్రవాలను గోధుమ రంగు పారదర్శక గాజు పాత్రల్లో నిల్వ ఉంచుతారు.ఎలాంటి గాజు సీసాల్లోనూ నిల్వ చేయలేని పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం (HF) ను గాజు పాత్రల్లో ఉంచకూడదు. గాజులోని సిలికేట్లతో అది రసాయనిక చర్య జరపడమే అందుకు కారణం. చటుక్కున మండే దహనశీలత (imflammability) ఉన్న పదార్థాలను కూడా గాజు పాత్రల్లో ఉంచరు. పొరపాటున పగిలితే ప్రమాదం కాబట్టి.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

ఐదేళ్ల లోపు పిల్లల మెదడు చురుగ్గా ఉంటుందని, ఏది చెప్పినా బాగా గుర్తుపెట్టుకుంటారని అంటారు. నిజమేనా?

జవాబు: ప్రతి జీవికి పరిసర పరిజ్ఞానం పొందడానికి జ్ఞానేంద్రియాలు ఉంటాయి. అవి మానవుడిలో పరిణామక్రమంలో బాగా అభివృద్ధి చెందాయి. మనం చర్మం (స్పర్శ), కళ్లు (దృష్టి), చెవులు (శ్రవణం), ముక్కు (ఘ్రాణం), నాలుక (రుచి) అనే పంచేంద్రియాల ద్వారా మాత్రమే ప్రకృతి జ్ఞానం పొందుతాం. ప్రకృతి పరిజ్ఞానానికి, తెలివి తేటలకు ఇంతకు మించి మరే ద్వారమూ లేదు.
మన మెదడులోనే మనం సంతరించుకున్న జ్ఞాన ముద్రలు, సమాచారం భద్ర పరిచి ఉంటాయి. ఆసక్తి అనేది మానవుడికే ఉంది. ఆసక్తి అంటే తెలుసుకోవాలనే కుతూహలం. పుట్టినప్పట్నించి పెరిగే క్రమంలో తొలి దశల్లో ఆసక్తి అమితంగా ఉంటుంది. క్రమేపీ మెదడులో కూడా సమాచారం నిల్వ అవుతూ ఉంటుంది. ఐదేళ్ల వయసు వచ్చేటప్పటికే మనకు తెలిసిన సమాచారంలో సుమారు 60 శాతం పోగవుతుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. అభ్యసనం చర్చలు తదితర సామూహిక కార్యకలాపాలు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌, కన్వీనర్‌, --శాస్త్రప్రచారవిభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)

క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా?

రకరకాల బహుమతులు.. బొమ్మలు.. కేకులతో.. క్రిస్‌మస్‌ పండుగ చేసుకుంటున్నారు కదా! మరి క్రిస్‌మస్‌ చెట్టు ఎలా పుట్టిందో తెలుసా? శాంతాక్లాజ్‌ తాతయ్య ఎవరో తెలుసా? ఆ కథలేంటో తెలుసుకుందామా!
వరాలిచ్చే చెట్టు! --క్రిస్మస్‌ నాడు చెట్లను అందంగా అలంకరిస్తారు కదా, మరి ఆ అలవాటు ఎలా మొదలైందో తెలుసా? దాని వెనుక కొన్ని కథలు కూడా ఉన్నాయి.చాలా ఏళ్ల క్రితం క్రీస్తు పుట్టిన రోజున చర్చికి వెళ్లి రకరకాల బహుమతులను క్రీస్తుకు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లాడికి పాపం... ఏమివ్వాలో తెలియలేదు. ఏది కొనాలన్నా చేతిలో సెంటు కూడా లేదు. ఏం చేయాలో తోచని ప్లాబోకి తన ఇంటి ముందు ఓ అందమైన మొక్క కనిపించింది. దానిని తీసి చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన అందరూ ప్లాబో కానుక చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూ దానిని బాల ఏసు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యం...! వెంటనే ఆ చిన్న మొక్క అప్పటికప్పుడే ఎదిగిపోయి బంగారు వృక్షంగా మారిపోయింది. పవిత్ర హృదయంతో తీసుకొచ్చిన ఆ కానుకనే జీసెస్‌ స్వీకరించాడని అందరూ నమ్మారు. అప్పటి నుంచి క్రిస్మస్‌ చెట్టుని అలంకరిస్తున్నారు.
ఇలాంటిదే మరో కథ కూడా ఉంది.
చలిగాలులు వీస్తున్నాయి. మంచు కురుస్తోంది. చిన్న పాకలో అన్న వాలంటైన్‌, చెల్లి మేరీ నాన్న కోసం ఎదురుచూస్తున్నారు. ఏదైనా తిని రెండు రోజులైంది. నీర్సంగా ఉన్నారు. ఇంతలో నాన్న వచ్చాడు. చేతిలో రొట్టెముక్క! దాన్నే మూడు భాగాలు చేసుకుని ప్రార్థన చేయసాగారు. 'ఓ జీసస్‌ మాలాగే ఈ లోకంలో ఆకలితో ఉన్న వాళ్లందరీ కడుపు నింపు'. ప్రార్థన తర్వాత తినబోతుండగా తలుపు చప్పుడైంది. తీసి చూస్తే ఆరేళ్ల పిల్లాడొకడు చలికి వణికిపోతూ 'ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తారా?' అని అడిగాడు. లోపలికి రమ్మన్నారు. 'తిని నాలుగు రోజులైంది' అన్నాడా పిల్లాడు దీనంగా. తమ రొట్టె ఇచ్చి, రగ్గు కప్పి పడుకోబెట్టారు. అతడి ఆకలిని తీర్చగలిగామన్న తృప్తితో వాళ్లు నిద్రపోయారు. అర్థరాత్రి అన్నాచెల్లెల్లిద్దరికీ మెలకువ వచ్చింది. పైన మిలమిలలాడే నక్షత్రాలు. ఎగురుతున్న దేవదూతలు. వాళ్లింటికి వచ్చిన పిల్లాడు ఎవరో కాదు. బాల ఏసు! తల మీద బంగారు కిరీటంతో విలువైన బట్టలతో మెరిసిపోతున్న అతడు, 'మీ దయ గొప్పది. పరలోకపు తండ్రి మీకు మేలు చేస్తాడు' అని దీవించాడు. వాళ్లింటి బయట ఎండిన కొమ్మని నాటాడు. అది చూస్తుండగానే చిగురించి పెరిగి పెద్దదైంది. దాన్నిండా బంగారు యాపిల్‌ కాయలు! అదే మొట్టమొదటి క్రిస్‌మస్‌ చెట్టు.
బహుమతుల తాతయ్య!
ఎర్రటి గౌను, టోపీ, తెల్లగడ్డంతో బహుమతులిచ్చే శాంతాక్లాజ్‌ తాతయ్య అసలు పేరు తెలుసా? నికోలస్‌. క్రీస్తుశకం 270 కాలంలో ఇప్పటి టర్కీ ప్రాంతంలోని ఓ చర్చిలో బిషప్‌. గుర్రం మీద తిరుగుతూ పేదవారికి సాయం చేస్తుండేవాడు. ఓ రోజు ముగ్గురు కూతుళ్లకు పెళ్లి చేయలేక బాధపడతున్న పేదవాడు కనిపించాడు. అతడికి సాయం చేయడానికి బంగారు నాణాలు నింపిన మూడు మూటల్ని వాళ్లింటి పొగగొట్టంలోంచి పడేశాడు. ఆ డబ్బుతో పేదవాడు ఎంతో సంబరంగా కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. అలా ఎంతమందికో తనెవరో తెలియకుండా బహుమతులు ఇచ్చే అతడికే సెయింట్‌ హోదా లభించింది. అతడే శాంతాక్లాజ్‌!
* ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్‌ చెట్టు ఎక్కడుందో తెలుసా? అబుదాబిలో ఓ హోటల్లో. 40 అడుగుల ఎత్తున నిర్మించిన దీని విలువ కోటి పది లక్షల డాలర్లు. ఈ చెట్టుని 181 వజ్రాలు, ముత్యాలు, విలువైన రాళ్లతో అలంకరించారు.
* క్రిస్మస్‌ చెట్టును మొదటిసారిగా అలంకరించింది 1510లో. ఇళ్లల్లోకి తీసుకువచ్చి చెట్టును పెట్టే సంప్రదాయం వచ్చింది 16వ శతాబ్దంలో.
* అమెరికాలో ఏటా మూడు కోట్ల క్రిస్మస్‌ చెట్లు అమ్ముడవుతాయి. పది లక్షల ఎకరాల్లో వీటిని పెంచుతారు.

70mm సినిమాథియేటర్‌కు, 35mm థియేటర్‌కు తేడా ఏంటి?

జవాబు:మనం సాధారణంగా ఎడమ నుంచి కుడికి ఎక్కువ విస్తారాన్ని, పై నుంచి కిందికి తక్కువ విస్తారాన్ని చూస్తుంటాము. అందువల్లనే సినిమా థియేటర్లలో తెర ఎడమ కుడి దిశల్లో (అడ్డంగా) ఎక్కువగానూ, పైనుంచి కిందికి (నిలువుగా) తక్కువగానూ ఉంటుంది.ఇలా అడ్డానికి, నిలువుకి ఉన్న నిష్పత్తిని ఆస్పెక్ట్‌ నిష్పత్తి (aspect ratio) అంటారు. చాలా కాలం పాటు (నేటికీ చాలా చోట్ల) ఇది 4:3 నిష్పత్తిలో ఉండేది. సినిమా స్కోపు ప్రక్రియలో ఇది 16:9 లేదా 37:20 లేదా 47:20 నిష్పత్తిలో ఉంటుంది. ఆ విధంగా క్రమేపీ నిలువు కన్నా అడ్డం పెరుగుతూ వచ్చింది. తద్వారా కుడి నుంచి ఎడమకి ఎక్కువ విస్తారంలో దృశ్యాల్ని తెరమీద చూసే అవకాశం ఏర్పడింది. ఇంకో మాటలో చెప్పాలంటే 4:3aspect ratio ఉన్న తెర మీద కన్నా సినిమా స్కోపు తెరమీద ఎక్కువ మంది పాత్రలను, దృశ్యాలను మోహరించవచ్చును. సాధారణ తెర అయినా, పైన చెప్పిన మూడు రకాల సినిమా స్కోపు తెర అయినా, దాని మీదకు బొమ్మను పంపే ఫిల్మ్‌లో దృశ్యం పొడవు, వెడల్పుల నిష్పత్తి మాత్రం మారదు. మామూలు ప్రొజెక్టరులో రీళ్లుగా తిరిగే ఫిల్మును 35mm ఫిల్మ్‌ అంటారు. ఎందుకంటే దాని అడ్డం 35 మిల్లీమీటర్లు, నిలువు సుమారు 26 మిల్లీమీటర్లు ఉంటుంది. ఇంత చిన్న ఫిల్ము నుంచి ప్రకాశవంతమైన కాంతి మామూలు థియేటర్లలోని (35mm) తెరమీద పడ్డం వల్ల బొమ్మల స్పష్టత పెద్దగా తగ్గదు. కానీ ఇదే ఫిల్మును చాలా పెద్ద తెరమీద ప్రదర్శించినప్పుడు బొమ్మల స్పష్టత తగ్గి పోతుంది. అందువల్ల 35 mm ఫిల్ము కన్నా ఎక్కువ వైశాల్యం ఉన్న ఫిల్మును ఆయా పెద్ద థియేటర్లలో వాడతారు. ఇలాంటి పెద్ద థియేటర్లలో వాడే ఫిల్మ్‌ అడ్డం కొలత 70mm ఉంటుంది.

రాత్రివేళల్లో అప్పుడప్పుడు చంద్రుడి చుట్టూ వలయాలు కనిపిస్తాయి. అవి చూసిన పెద్దవాళ్లు చంద్రుడు గుడి కట్టాడంటారు. దీనికి కారణం ఏమిటి?

జవాబు: చంద్రుడి చుట్టూ అలా ఏర్పడే వలయాన్ని ఇంగ్లిషులో 'హాలో' అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్నే వరదగుడి అంటారు. వాతావరణంలో మంచు స్ఫటికాలతో కూడిన మేఘాలు ఉన్నప్పుడు, వాటి ద్వారా చంద్రుని కాంతి ప్రసరించినప్పుడు ఈ వలయం ఏర్పడుతుంది. అలాంటి మేఘాల్లో సాధారణంగా ఆరుముఖాలున్న సూక్ష్మమైన మంచు స్ఫటికాలు ఉంటాయి. వీటి గుండా వెళ్లే చంద్రుని కాంతి కిరణాలు వక్రీభవనం (refraction) చెందితే, వీటి ఉపరితలంపై పడిన కాంతి పరావర్తనం (reflection) చెందుతుంది. వక్రీభవనం వల్ల చంద్రకాంతి విశ్లేషణ చెంది రంగురంగులాగా కనిపిస్తుంది. పరావర్తనం చెందిన కాంతి తెల్లని రంగులోనే వలయంలాగా ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రకాంతి ఆ మంచు స్ఫటికాలపై 22 డిగ్రీల కోణంలో పడుతుంది కాబట్టి, అంతే వ్యాసం ఉండే వలయం చంద్రుని చుట్టూ ఏర్పడుతుంది. వలయం లోపలివైపు ఎరుపురంగు, బయటివైపు నీలం రంగు ఉంటాయి. ఈ వలయం ఏర్పడినప్పుడు వర్షం కరిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేఘాల్లోని మంచుస్ఫటికాలు ద్రవీభవించి చినుకుల్లా కురిసే అవకాశం ఉంది కదా!

వర్షం వచ్చేముందు మేఘాలు నల్లగా ఉంటాయి ఎందుకు?

జవాబు1

వర్షం వచ్చే ముందు నల్లని మెఘాలు కమ్ముకుంటాయి . అంతకు ముందు అవి నీలం , తెలుపు రంగుల్లో ఉంతాయి .ఆ నల్లని మేఘాలను శాస్త్రపరిభాషలో " కుమ్యులో నింబస్ " మేఘాలలు అంటారు . ఆ మేఘాలలొ దట్టంగా పేరుకున్న నీటి బిందువులు , మంచు అందుకు కారణము ,. ఆ దట్టమైన పొరవలన ఆ మేఘాలలో నుండి కాంతి కి్రణాలు ప్రయాణం చేయలేవు . ఫలితంగా మనకు నల్లగా కనిపిస్తాయి . ధూళిరేణువులు , కాలుష్యకారకాల వల్ల కుడా నల్లరంగు వస్తుంది .

జవాబు 2

ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక వస్తువుపై కాంతి కిరణాలు పడినపుడు ఏమవుతుందోననే విషయాన్ని చూద్దాం. ఏదైనా వస్తువుపై కాంతికిరణాలు పడినపుడు కాంతిలోని కొంతభాగం వెనుదిరిగి వస్తుంది. దీన్ని పరావర్తనం అంటారు. కాంతిలోని కొంత భాగాన్ని వస్తువు శోషిస్తుంది. కొంత భాగం వస్తువులోంచి పయనించి అవతలవైపు నుంచి బయటకు వస్తుంది. అద్దం లాంటి తళతళమెరిసే వస్తువుపై కాంతి పడినపుడు, అందులోని ఎక్కువ శాతం పరావర్తనం చెందుతుంది. నల్లగా ఉండే వస్తువుపై కాంతిపడితే ఎక్కువ కాంతిని అదిశోషిస్తుంది. గాజు లాంటి పారదర్శక పదార్థంపై కాంతి పడితే, చాలా వరకు కాంతి అందులో నుంచి బయటకు వస్తుంది.ఇపుడు మన ప్రశ్న విషయానికి వస్తే, సూర్యరశ్మికి భూమిపై ఉండే నీరు ఆవిరి అవడం వల్ల మేఘాలు ఏర్పడతాయని మనందరికీ తెలుసు. తక్కువ స్థలంలో ఎక్కువ నీటి బిందువులు గుమికూడి ఉన్న మేఘం ఎక్కువ కాంతిని శోషించుకుంటుంది. అందుకే ఆ మేఘం నల్లగా కనిపిస్తుంది. ఎక్కువ నీటి బిందువులు ఉన్న ఆ మేఘం త్వరగా వర్షిస్తుంది. కొన్ని నీటి బిందువులు, చాలా వరకు చిన్న మంచు స్ఫటికాలు ఉండే మేఘంపై పడే కాంతి చాలా వరకు పరావర్తనం చెందడం వల్ల అది తెల్లగా కనిపిస్తుంది. ఈ మేఘాల్లోనే పారదర్శకమైన మంచు స్ఫటికాలు ఉంటే వాటి గుండా కాంతి కిరణాలు చొచ్చుకుపోయి ఆ మేఘాలు పారదర్శకంగా కనిపిస్తాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్‌

మేఘాలు గాలి కన్నా బరువైనవి కదా? మరి కింద పడవెందుకు?

జవాబు :ఒక వస్తువు గాలిలో తేలుతుందా లేక పడిపోతుందా అన్న విషయం బరువును బట్టి ఆధారపడదు. శాస్త్రీయంగా బరువు అంటే భారం (Weight). దీని విలువ వస్తువు ద్రవ్యరాశి, గురుత్వ త్వరణాల (Acceleration due to gravity)లబ్దానికి సమానం. దీన్ని బట్టి కాకుండా వస్తువుల సాంద్రతను (Density) బట్టి వస్తువు తేలడం, కిందపడటం ఆధారపడుతుంది. గాలికన్నా మేఘాల సాంద్రత తక్కువ. మేఘాల్లో నీటి శాతం ఎక్కువ ఉన్నపుడు మేఘాల సాంద్రత కొంచెం పెరగడం వల్ల కిందకు రావడానికి ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో అవి తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతానికి దిగడం వల్ల నీటి బిందువులు వర్షించి మేఘాల సాంద్రత తిరిగి తగ్గి అలాగే ఉండిపోతాయి. కాబట్టి మేఘాలు కింద పడవు.మేఘాలు వాయు రూపంలోను, కొన్ని కొన్ని అణువులు బృందాలుగా కొల్లాయిడల్‌ రూపంలోను ఉన్న భౌతిక పదార్థాలు. భూమికి ఆకర్షణ ఉన్నంత మాత్రాన భూమ్మీద ఉన్నవన్నీ నేల మీదకు పడవు. ఆ మాటకొస్తే మేఘాలే కాదు. భూ వాతావరణంలో కొన్ని వందల కిలోమీటర్ల పైవరకు విస్తరించి ఉన్న ఆక్సిజన్‌ నైట్రోజన్‌ వంటి రూప పదార్థాలు కూడా భూమి మీద పడటం లేదు. అణువుల మధ్య పరస్పర తాడనాలు, వికర్షణలు ఎపుడూ ఉంటాయి.భూమికి చేరువగా ఉన్న గాలి పొరల కన్నా కొంచెం పైనున్న పొరల సాంద్రత తక్కువగా ఉండటం వల్ల పైపొరల్లోని పదార్థాలు కింది పొర మీద తేలి ఉంటాయి. మేఘాల సాంద్రత, మేఘాల కింద ఉన్న గాలి సాంద్రత కన్నా తక్కువ కాబట్టి మేఘాలు గాల్లో పైపొరలో ఉంటాయి. మేఘాలలోని నీటి అణు బృందాల్లో అణువుల సంఖ్య పెరిగినా, వాతావరణ ఉష్ణోగ్రత తగ్గినా మేఘాల సాంద్రత పెరుగుతుంది. అపుడవి నేలకు మరింత దగ్గరవుతాయి. కొన్ని పర్వత ప్రాంతాల్లో మేఘాలు కొండల నేలల్ని తాకుతూ ప్రయాణిస్తుంటాయి. ఉష్ణోగ్రత మరీ తగ్గినట్లయితే ఆ మేఘాల్లో ఉన్న నీటి తుంపర్లే నీటి బిందువులుగా మారి వర్షపు చినుకుల్లా వాన కురుస్తుంది. అపుడిక మేఘాలు భూమి మీద రూపం మార్చుకుని పడ్డట్టే!
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక@ఈనాడు హాహ్ బుజ్జీ.

కోకో కోలా కనిపెట్టిందెవరు ?

మంచి నీళ్ళు కూడా తాగడం మానేసి కోకోలా తాగుతున్నాం మనం. అంత పిచ్చి పట్టుకుంది మనకు కోకో కోలా మీద. ఈ కూల్ డ్రింక్ లో రసాయన ఎరువులు ఉన్నాయనీ అందువల్ల ఇది తాగితే ప్రమాదమని గతంలో పెద్దస్థాయిలో వార్తలొచ్చాయి. ఈ వార్తల్లో నిజాలున్నప్పటికీ మనం దీనిని తాగడం మానలేదు. ప్రపంచం మొత్తాన్ని ఇంత తీవ్రంగా బానిసలుగా చేసుకున్న ఈ శీతలపానియాన్ని డాక్టర్ జాన్ స్టిత్ పెంబర్‌టన్ (1830-1888) అనే ఆయన కనిపెట్టాడు. ఈయనది అమెరికాలోని అట్లాంటాలో ఉన్న జార్జియా టౌను. ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తుండిన పెంబర్‌టన్ రకరకాల పానియాలను తయారు చేస్తుండేవాడు. కోకా ఆకులను ఉపయోగించి అతడు తయారు చేసిన ఫ్రెంచ్ వైన్ ఆ రోజుల్లో చాలా ఆదరణ పొందింది. అయితే 1885లో అట్లాంటాలో ఫ్రెంచ్ వైన్ వంటి మత్తుపానియాలను నిషేధించారు. దాంతో పెంబర్‌టన్ రాబడిపోయింది. అప్పుడతడు మత్తు స్వభావం లేని కొత్త పానియాన్ని కనిపెట్టాలని నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత అతడు కోకా ఆకులకు, కోల నట్‌ను కలిపి, దానికి చక్కెర, సిట్రిక్ ఆసిడ్ మరికొన్ని సుగంధ ద్రవ్యాలను జత చేసి మే 8, 1886 న కోకో కోలా ను తయారు చేసి అమ్మడం మొదలెట్టాడు. ఎంతో ప్రసిద్ది పొందిన ఈ పానియాన్ని అతడు ఫ్రాంక్ రాబిన్ సన్, డేవిడ్‌రో అనే మిత్రులతో తయారు చేసి అమ్మడం మొదలెట్టాడు. ఆ తర్వాత ఆ మిత్రులతో గొడవ రావడంతో కోకా కోలా ఫార్ములాను వాళ్ళకు అమ్మేశాడు. ఇప్పుడు మనం తాగుతున్న కోకో కోలాకు, పెంబర్‌టన్ ఒరిజినల్ కోకో కోలాకు రుచిలో ఎంతో మార్పు వచ్చింది. కాలానుగుణంగా కోకో కోలా రుచి మార్చుకున్నా దాని 'ఫార్ములా' ఇప్పటికీ సీక్రెట్ గానే ఉంది.

కోకోనట్‌ క్రాబ్ కధేమిటి ?

కొబ్బరి చెట్టు.. చకచకా ఎక్కేస్తుంది.. కొబ్బరి కాయను చీల్చి తినేస్తుంది.. ఏంటో తెలుసా? ఓ పీత! ప్రపంచంలోనే పెద్దది!!ఓసారి పీతను తల్చుకోండి. ఎంతుంటుంది? మహా అయితే అరచెయ్యంత అనబోతున్నారా? అయితే ఆగండి. ఏకంగా ఆరడుగుల పొడవుండే పీత ఒకటుందని తెలుసా! అదే కోకోనట్‌ క్రాబ్‌. మరి పేరులో కొబ్బరెందుకో వూహించగలరా? ఈ మహా పీత గారు చకచకా కొబ్బరి చెట్టెక్కేసి, అక్కడున్న కాయని చీల్చి మరీ తినేస్తుంది. దీనికుండే పది కాళ్లలో ముందరుండే రెండూ బలంగా, పొడవుగా, కత్తెరలాంటి కొండెలతో ఉంటాయి. వాటితో ఇది పచ్చి కొబ్బరి కాయ లోపలి కంటా చిల్లు చేసి, అందులో గుజ్జునంతా జుర్రుకోగలదు.కొబ్బరి చెట్లు పెరిగే సముద్ర తీర ప్రాంతాల్లోనే బతికే ఇవి ప్రపంచంలోనే పెద్ద పీతలు. అందుకే ఒకోటీ ఆరడుగుల పొడవుతో ఏకంగా 17 కిలోల బరవు వరకూ పెరుగుతాయి. అన్నట్టు.. దీనికి మరో పేరు కూడా ఉంది. అదేంటో తెలుసా? దొంగపీత! దీన్ని ఆయా ప్రాంతాల వారు రాబర్‌ క్రాబ్‌ (Robber Crab) అంటారు. ఎందుకో తెలుసా? ఇవి తీరం దగ్గరుండే ఇళ్లు, గుడారాలలోకి దూరి చిన్న కుండల్లాంటి మట్టి పాత్రల్ని, మెరిసే వెండి వస్తువుల్ని ఈడ్చుకుని పోతుంది. ఎందుకో ఎవరికీ తెలీదు. బహుశా తినేవనుకుంటుందో ఏమో!రాత్రి మాత్రమే సంచరించే వీటి జీవనం కూడా చిత్రమే. ఆడ పీతలు సముద్రంలో గుడ్లు పెడితే, అవి నీటిలో లార్వాలుగా మారతాయి. ఆపై అవి నీటి అడుక్కి చేరి వేరే జీవుల గుల్లల్లో చేరతాయి. దానంత ఎదిగాక ఇంకా పెద్ద ఆల్చిప్పలాంటి గుల్లను ఎంచుకుంటాయి. ఇలా కొంత కాలం అయ్యాక ఇక పూర్తిగా భూమి మీదకి వచ్చేస్తాయి. ఒక దశ వచ్చాక వీటి మొప్పలు, ఊపిరితిత్తుల్లాగా పనిచేయడంతో ఇక నీటిలో శ్వాసించలేవు. భూమ్మీదకి వచ్చాక కొబ్బరి చిప్పల్ని మోసుకుంటూ కొన్నాళ్లు తిరుగుతాయి. శరీరం గట్టి పడ్డాక దాన్ని వదిలేసి చకచకా విహరిస్తాయి. తీరాల్లో బొరియలు చేసుకుని, అందులో కొబ్బరి పీచును పరుచుకుని కాలక్షేపం చేస్తుంటాయి. కేవలం కొబ్బరి గుజ్జునే కాకుండా పళ్లు, ఆకులు, తాబేళ్ల గుడ్లని కూడా లాగిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వీటిని వండుకుని తింటారు. వీటి ధర కూడా ఎక్కువే.

చలికాలములో కొబ్బరి నూనె గడ్డకడుతుందెందుకు?

జ : ఇళ్ళ లో పలురకాల నూనెలు వాడుతుంటాం ... వీటిలో ముఖ్యమైనది తలమీద రాసుకునే కొబ్బరి నూనె , వంటలకు ఉపయోగించే శనగనూనె . వీటిలో కొబ్బరి నూనె చలికాలములో గడ్డకడుతుంది. కారణము అయా నూనెలలో ఉండే కొవ్వు ఆమ్లాలు. కొబ్బరి నూనె లో సంతృప్త కొవ్వు ఆమ్లాలు 90 శాతము వరకు ఉన్నందున ఉష్ణోగ్రత తగ్గగానే గడ్డకడుతుంది. శనగ నూనె లో అసంతృప్త కొవ్వులు అధికము కాబట్టి గడ్డకట్టవు . అసంతృప్త కొవ్వులకు తక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత ఉండగా సంతృప్త కొవ్వులకు ఎక్కువ ఘనీభవన ఉష్ణోగ్రత ఉండును . నూనెలలో ఈ తేడా కనిపిస్తుంది.

నాణెము నీళ్ళలో వేస్తె పెద్దదవుతుందా?

నీళ్ళలో పూర్తీ గా మునిగి ఉన్న రూపాయి నాణెము పెద్దది గా మారినట్లు కనిపిస్తుంది . దీనికి కారణము నాణెము పెద్దది గా కనిపించేలా చేస్తున్న కాంతికిరణం , గాలిలో నుండి నీటిలోకి వెళ్ళినప్పుడు కాంతి వేగం తగ్గి వక్రీభావనానికి గురికవటమే . ఈ వక్రీభవనం వల్ల పాత్ర అడుగున ఉన్న నాణెం కొంచెం పెద్దది గా కనిపిస్తుంది ... అంతే కాని వాస్తవానికి నాణెం తడిసి పెద్దది గా మారటం ఎమాత్రం జరుగదు .
Source: స్వాతి వారపత్రిక 03-07-2009

ఆపిల్‌ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్‌గా మారుతుంది. ఎందుకు?

జవాబు: ఆపిల్‌ పండులో 'టానిక్‌ యాసిడ్‌' అనే రసాయనిక ద్రవం ఉంటుంది. మనం ఆపిల్‌ పండును ముక్కలుగా కోసినప్పుడు ఆ భాగాలకు గాలి తగులుతుంది కదా? అప్పుడు వాటిలోని టానిక్‌ యాసిడ్‌కి, గాలిలోని ఆక్సిజన్‌కి మధ్య రసాయనిక చర్య జరుగుతుంది. ఫలితంగా పాలీఫినాల్స్‌ (poly phenols) అనే పదార్థం ఏర్పడుతుంది. ఆక్సీకరణం (Oxidation) అనే ఈ చర్య వల్ల ఏర్పడే పాలీఫినాల్స్‌ బ్రౌన్‌ రంగులో ఉంటాయి. అందువల్లే ఆపిల్‌ ముక్కలు ఆ రంగులోకి మారతాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే కోసిన భాగంపై నిమ్మరసం చల్లాలి. ఇందులో ఉండే సిట్రిక్‌ యాసిడ్‌ ఆపిల్‌ పండులో ఉండే టానిక్‌ యాసిడ్‌పై పొరలాగా ఏర్పడి ఆక్సీకరణం జరగకుండా అడ్డుకుంటుంది.

-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

దుకాణాల్లో చూసిన వస్త్రాల రంగులు బయటకు వచ్చిన తర్వాత మరోలా కనిపిస్తాయి. ఎందుకు?

జవాబు :దుకాణాల్లో ప్రకాశవంతమైన వెలుగునిచ్చే బల్బులు (Incadescent Light bulbs), ఫ్లోరోసెంటు ట్యూబులు కాంతిని వెదజల్లుతుంటాయి. దుకాణాల బయట ఉండేది సూర్యకాంతి. ఈ కాంతులన్నీ మనకు తెల్లని కాంతిలాగా అనిపించినా, వాటి తరంగదైర్ఘ్యాలు (wavelengths) అంటే రంగులు వేర్వేరుగా ఉంటాయి. ఒక కాంతి పక్కన మరొక కాంతిని ఉంచి నిశితంగా పరిశీలిస్తే గాని ఆ విషయం తెలియదు.భౌతిక శాస్త్రవేత్తలు ఒకో కాంతికి ఒకో 'వర్ణ ఉష్ణోగ్రత' (colour temparature)ను నిర్ణయిస్తారు. ఇన్‌కాండిసెంటు బల్బులు 'వెచ్చని కాంతి'ని వెలువరిస్తే, ఫ్లోరోసెంటు ట్యూబులు 'చల్లని కాంతి'ని ఇస్తాయి. సూర్యకాంతిని 'తటస్థకాంతి'గా నిర్ధరించారు. ఈ వివిధ కాంతుల తరంగాలు వస్త్రాలపై పడినప్పుడు వాటిలో కొన్ని పరావర్తనం (reflection) చెంది మన కంటికి చేరుతాయి. కంటిని చేరుకునే కాంతి వర్ణపటం (spectrum) ఆ వస్త్రంపై పడే కాంతిజనకం (light source) యొక్క కాంతిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వివిధ రంగుల కాంతులతో చూసిన వస్త్రాల రంగులు వేర్వేరుగా ఉంటాయి. కానీ సూర్యకాంతిలో చూసిన వస్త్రాల రంగులు ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ఉంటాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు,-హైదరాబాద్‌

ఖండాలు కదులుతూ ఉంటాయంటారు. నిజమేనా?

జవాబు: కొయ్యలు నీటిపై తేలుతాయి. కారణం వాటి సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండడమే. ఖండాల (Continents) విషయం కూడా అంతే. ఖండాలకు సంబంధించిన భూఫలకాలను 'టెక్టానిక్‌ ప్లేట్స్‌' అంటారు. వీటి పైనే పర్వతాలూ, సముద్రాలూ కూడా ఇమిడి ఉంటాయి. ఈ భూఫలకాలు చాలా బరువైన గ్రానైట్‌ రాళ్లతో కూడి ఉన్నా అవి భూగర్భంలో ఉండే శిలాద్రవంపై తేలుతూ ఉంటాయి. భూగర్భంలో ఉండే అత్యంత ఉష్ణోగ్రత వల్ల రాళ్లు సైతం కరిగిపోయే ఈ శిలాద్రవం చిక్కని బెల్లంపాకంలాగా ఉంటుంది. దీనిపైనే భూఫలకాలు, నీటిపై తెప్పల్లాగా తేలుతూ ఉంటాయి. ఈ శిలాద్రవాన్నే Mantle అంటారు. ఈ శిలాద్రవం సాంద్రత ఘనపు సెంటీమీటర్‌కి సుమారు 3.5 గ్రాములుంటుంది. గ్రానైట్‌ సాంద్రత ఘనపు సెంటీమీటర్‌కి 2.7 గ్రాములుంటుంది. అందువల్ల తక్కువ సాంద్రత ఉన్న ఖండాలు శిలాద్రవంపై తేలుతుంటాయి. ఈ భూఫలకాలు శిలాద్రవంపై తేలుతూ ఉండడమే కాకుండా కదులతూ ఉంటాయి. దీనికి కారణం భూ ఆవరణం 3000 కిలోమీటర్ల లోతు కలిగి ఉండడమే. ఆ ఆవరణం అడుగు భాగంలోని ఉష్ణోగ్రత అనేక వేల డిగ్రీలు ఉండడంతో అక్కడ నుంచి తక్కువ సాంద్రత గల ఉష్ణ ప్రవాహాలు (Heat Currents) నిదానంగా ఆవరణ పై భాగానికి చేరుకుంటాయి. అక్కడ ఆ ప్రవాహాల ఉష్ణోగ్రత తగ్గి, సాంద్రత హెచ్చడంతో మరలా అవి ఆవరణ కింది లోతులకు చేరుకుంటాయి. వీటిని సంవహన ప్రవాహాలు (Convection Currents) అంటారు. వీటి కారణంగా భూ ఆవరణలోని రాతిద్రవం ఒక భారీ కన్వేయర్‌ బెల్ట్‌లాగా పైకీ కిందకీ తిరుగతూ ఉండడం వల్ల ఉత్పన్నమైన బలంతో శిలాద్రవంపై తేలుతున్న ఖండాలు కదులుతూ ఉంటాయి.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్‌

భూమి నుంచి పైకి పోయే కొలదీ వేడి తగ్గిపోతూ ఉంటుందంటారు. ఎందువల్ల?

జవాబు: సూర్యకిరణాలు వాతావరణం గుండా ప్రయాణించి భూమిని చేరుతాయనేది తెలిసిందే. వాతావరణంలోని గాలి లోంచి కిరణాలు ప్రయాణించినప్పటికీ గాలి స్వల్పశోషణం (poor absorber) కాబట్టి, వాటిలోని వేడిని అంతగా గ్రహించలేదు. గాలి కంటే భూమి వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. భూమి వేడెక్కడం వల్ల దానిని అంటిపెట్టుకున్న గాలి ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలా వేడెక్కిన గాలి సాంద్రత తగ్గుతుంది. దాంతో ఆ గాలి తేలికయి భూమి నుంచి ఎత్తుకు ప్రయాణిస్తుంది. భూమి నుంచి ఎత్తుకు వెళ్లే కొలదీ వాతావరణ పీడనం తగ్గుతుంది. అందువల్ల ఆ ప్రాంతంలోకి వెళ్లిన వేడిగాలి అక్కడ వ్యాకోచిస్తుంది. ఏ వాయువైనా వ్యాకోచిస్తే దాని ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి అక్కడకు వెళ్లిన గాలి చల్లబడుతుంది.ఈ విధంగా భూమి నుంచి పైపైకి పోయే గాలి ఉష్ణోగ్రత ప్రతి కిలోమీటరుకు 9 డిగ్రీల సెంటిగ్రేడు వరకు తగ్గుతుంటుంది. అందువల్లనే వేసవి కాలంలో ఎత్తుగా ఉండే ప్రదేశాలైన ఊటీ, డార్జిలింగ్‌ లాంటి పర్వత ప్రదేశాలలో వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ భూమి నుంచి 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు వెళితే అక్కడ మళ్లీ వేడిగానే ఉంటుంది. ఎందుకంటే భూమి ద్వారా వేడెక్కి పైకి వెళుతూ వ్యాకోచించి చల్లబడే గాలి అంత ఎత్తుకు చేరుకోలేదు.

కరోనా లో అంత వేడేల?

సూర్యుని అంతర్భాగం నుంచి ఎంతో దూరం లో ఉండే చివరి పొర "కరోనా" ఉష్ణోగ్రత ఎందుకంత ఎక్కువగా ఉంటుంది ?.సూర్యుని ఉపరితలం తో పాటు చుట్టూ ఉండే వాతావరణాన్ని - కాంతి మండలం (Photosphere)  వర్ణ మండలం (Chromosphere) , కాంతి వలయం (Corona) అనే మూడు భాగాలు గా విభజించ వచ్చు . సూర్యుని వాతావరణం లో అట్టడుగున ఉండే కాంతి మండలం ఉష్ణోగ్రత 5500 కేల్విన్లు ఉంటే , వర్ణ మండలం లో ఉష్ణోగ్రత ౪౫౦౦ కేల్విన్ల నుండి 10,000 కేల్విన్లు వరకు ఉంటుంది . ఈ మండలం తన కింద ఉండే కాంతి మండలం లో ఉత్పన్నమైన ఉష్ణం వల్ల వేడెక్కుతుంది .. కరోనా సూర్యుని వాతావరణం లోని చివరి ఉపరితల పొర . దీని ఉష్ణోగ్రత 2,౦౦౦,౦౦౦ .కేల్విన్ల నుండి 5,౦౦౦,౦౦౦ కేల్విన్ల వరకు ఉంటుంది . కరోనా లో ఉష్ణానికి కారణం సూర్యునిలో ఉండే "కరోనియం" అనే మూలకము.కాంతి మండలాన్ని సలసల మరుగుతున్న నీటి ఉపరితలం తో పోల్చవచ్చు . ఇక్కడ అత్యంత ఉష్ణోగ్రతలో ఉన్న ప్రవాహి ద్రవ్యం (Fluid) పైకి , కిందికి ఎగిసి పడుతూ విపరీతమైన శబ్దం కలిగి ఉంటుంది . ఈ శబ్దతరంగాలు కరోనాలోకి చొచ్చుకొని రావడం తో అక్కడి ఆ ధ్వని శక్తి ఉష్ణ శక్తి గా మారుతుంది . కరోనా లో ఉన్న పదార్ధం కాంతి మండలం లోని పదార్ధం తో పోలిస్తే అతి సుక్ష్మమ గా పల్చగా ఉండటం తో అక్కడకు చొచ్చుకొని వచ్చిన ధ్వని శక్తి ఉత్పాదించిన ఉష్ణ శక్తి వల్ల ఆ పొర అతి త్వరగా , సులభం గా వేడెక్కుతుంది . దీనితో కరోనా లోని ఉష్ణోగ్రత సూర్యుని అంతర్భాగం లోని ఉష్ణోగ్రత కన్నా ఎన్నోమిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది . సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడినపుడు కరోనా తీవ్రత , తీక్షణ లను ప్రకాశవంతమైన తెలుపు రంగులో సునిషితం గా చూడవచ్చును . ఆ స్థితి నే " డిమాండ్" రింగ్ అంటారు .

జంతువులు కన్నీరు కారుస్తాయా? 'మొసలి కన్నీరు' అనే పదం ఎలా వచ్చింది?

జవాబు: మన కంట్లో ఏదైనా నలుసులాంటిది పడినప్పుడు, ఉద్వేగానికి గురైనప్పుడు కనుకొలుకుల్లో ఉండే భాష్ప నాళాల్లో (tear ducts) ఉండే ద్రవం కంటిలోకి ఊరి బయటకి జారుతుంది. అదే కన్నీరు. చాలా వరకూ జంతువులు కూడా ఇలాగే కన్నీరు కారుస్తాయి. కానీ మొసలికి మనలాగా కంటిలోపల భాష్పనాళాలు ఉండవు. జలచరమైన అది ఆహారాన్వేషణలో నేలపైకి వచ్చినప్పుడు దాని దేహం కళ్లతో సహా పొడిబారిపోతుంది. అది ఏదైనా జంతువును పట్టుకుని నమిలేప్పుడు దాని కింది దవడ మాత్రమే కదులుతుంది. పై దవడకు చలనం అంతగా ఉండదు. ఆ క్రమంలో మొసలి చాలా శ్రమ పడవలసి వస్తుంది. దాని ముఖంలోని కండరాలకు, గొంతుకు చాలా వత్తిడి కలుగుతుంది. అప్పుడు గొంతులో ఉండే ప్రత్యేకమైన గ్రంథుల నుండి ప్రొటీన్లతో కూడిన ద్రవం మొసలి కంటిలోనుంచి బయటకు ప్రవహిస్తుంది. అది చూస్తే ఆ మొసలి ఆ జంతువును తింటున్నందుకు జాలితో ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. అది నిజం కాదు కాబట్టే కల్లబొల్లి ఏడ్పులు ఏడుస్తూ జాలి నటించే వారిని 'మొసలి కన్నీరు' కారుస్తున్నారనడం వాడుకగా మారింది.

ఆధారము: డా.వందనా శేషగిరిరావు గారి బ్లాగు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate