ఒక ఊల్లోకి ఒక మంత్రగాడు వచ్చాడు. భూతాలను తరిమేస్తానన్నాడు. దయ్యాలు వదిలిస్తానన్నాడు. డబ్బులు గుంజసాగాడు.
ఒక పదేళ్ళ పిల్లవాడు ఆ మంత్రగాడి వెంటబడ్డాడు. నాకు దయ్యాన్ని చూపిస్తావా? అని అడిగాడు.
అలాగే చూపిస్తాను. అయితే ఒంటరిగా రాత్రికి శ్మశానానికి రావాలి. జడుసుకోగూడదు. సరేనా అన్నాడా మాంత్రికుడు.
ఆ పిల్లవాడు ఏ మాత్రం జంకలేదు. ఈ రోజే వస్తాను అని వెంటబడ్డాడు. మంత్రగాడు అలాగేనని తీసుకొనిపోయాడు. ఒక మర్రిచెట్టు మీద పిల్లాడిని , కూర్చోబెట్టాడు. దయ్యాన్ని పిల్చుకొస్తానని వెళ్లాడు. పిల్లవాడు కళ్ళు కాయలు కాచేలా రాత్రంతా చూచాడు. దయ్యం అంతులేదు. తెల్లారిపోయింది. మంత్రగాడూ పత్తాలేడు.
ఇంత గడుగ్గాయి పిల్లవాడు ఎవరనుకొన్నారు? ఆయనే వీరేశలింగం పంతులు.
దేన్నంటేదాన్ని వీరేశలింగం గుడ్డిగా నమ్మేవాడు గాదు. ప్రతిదాన్నీ ప్రశ్నించేవాడు.
ఒకసారి ఆయనింటి దూలానికి తేనెపట్టు పెట్టింది. అది అపశకునం అని అందరూ అన్నారు. ఇల్లు ఖాళీ చెయ్యమన్నారు. అయినా ఆయనేమీ లెక్కచెయ్యలేదు.
మరోసారి పెరటిలో అరటిచెట్టు మధ్యలోంచి గెలవేసింది. ఇది అరిష్టమని అంతా గోలపెట్టారు. మన వీరేశలింగం లెక్కచెయ్యలేదు. అలాగే వుంచి కాయలు పెద్దవయ్యాక కూర చేసుకొని తిన్నాడు.
మరోసారి కావాలని అమావాస్య రోజు ప్రయాణమే ఉద్యోగంలో చేరాడు.
ఇలాంటి వీరేశలింగం గార్కిఒక ప్రశ్న ఎదురైంది. ఆ కాలంలో ఆడపిల్లలకు చాలా చిన్నవయసులో పెళ్లిచేసే వారు. వాళ్లు పని తనంలోనే భర్తలను పోగొట్టుకునేవారు. వాళ్లకు మళ్లీ పెళ్లి ఎందుకు చెయ్యగూడదు? బతుకంతా అలాగే ఎందుకుండిపోవాలి? ఇదీ ఆయన వేసుకొన్న ప్రశ్న.
పుస్తకాలూ, పురాణాలూ తిరగేశాడు. ఎక్కడా అలా పెళ్లి చెయ్యగూడదని లేదని తేల్చాడు. అంతే రంగంలోకి దిగాడు. తన సొంతఖర్చుతో ఇలాంటి పెళ్లిళ్లకు పూనుకొన్నాడు.
ఇంకేముంది? పెద్దలంతా ఎదురు తిరిగారు. ఇది మన ఆచారం కాదన్నారు. పాపం అన్నారు. అలా చేసేందుకు వీల్లేదన్నారు. పైగా ఆయనపై దాడికి దిగారు. రౌడీల్ని పంపారు.
వీరేశలింగం చెక్కుచెదరలేదు. అన్నిటినీ తట్టుకొని అలాంటి పెళ్లిళ్లు 100 చేశాడు. ఆయన ఆడవాళ్ల కోసం బడి పెట్టాడు. ఒక పేపరు నడిపాడు. జీవితమంతా అశాస్త్రీయ అంశాలపై పోరాడాడు. అందుకే వీరేశలింగం మహానుభావుడు. అలుపెరుగని వీరుడు అంటాం మనం.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/4/2020