తాను కూర్చున చెట్టు కొమ్మను నరుక్కునే వాణ్ణి ఏమంటాము? మూర్ఖుడనో, తెలివి తక్కువ వాడో అని ఆ కదా! మనం నివసించడానికి ఆధారమయిన భూమిని నాశనం చేసే వాళ్లనేమనాలి? ఈ భూమిపై ఆవరించి ఉన్న వాతావరణాన్ని దెబ్బతీసే పనిని ఏమందాం! వాళ్లని ఏమన్నా మనం క్షేమంగా ఉండాలంటే, మనలాంటి కోటానుకోట్ల జీవులు బతికి బట్టకట్టాలంటే మనం ఆవాసం చేసే ఈ భూమి, ఈ నేల, ఈ నీరు, ఈ గాలి ఇవన్నీ మంచిగా ఉండాలి. ఉండి తీరాలి. ఒకప్పుడు మానవ జీవనానికి, ఆ మాటకొస్తే సకల జీవుల ఉనికికి, క్షేమానికీ భరోసా ఇచ్చిన భూ వాతావరణం ఎందుకు క్షీణి స్తున్నదో, ప్రమాదకరంగా తయారవుతున్నదో తెల్సుకోవాలి. అలా జరగకుండా నివారణా మార్గాలు వెతుక్కోవాలి. ఆ క్రమంలోనే ప్రతి సం. ఏప్రిల్ 22ను 'ధరిత్రీ దినం” (Earth Day)గా ప్రపంచం అంతా జరుపుకుంటున్నాం. పర్యావరణ చైతన్యాన్ని కల్గించడానికి, కాలుష్యం నుండి మనలను, మన వాతావరణాన్ని, మన నేలను, గాలిన, నీటిని కాపాడుకోవటానికి కార్యోన్ముఖుల్ని చేయటానికే ఈ సందర్భాన్ని - సైన్సు ఉద్యమకారులు ఉపయోగించుకుంటున్నారు.
1969లో యునెస్కో - (UNESCO) పర్యావరణ కాన్ఫరెన్స్ లో ఈ ఆలోచనను జాన్ మెకొనెల్ అనే ఆయన ప్రతిపాదించారు. 1970 నుండి అమెరికా, కెనడా వంటి దేశాల్లో అక్కడక్కడా దీన్ని ఆచరణలోకి తెచ్చారు. కానీ 1990 తర్వాత, ముఖ్యంగా 2000 వేల సం. నుండి పర్యావరణ అవగాహనను పెంచే ఈ “ధరిత్రీ దినం' కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకున్నాయి. ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో ఏప్రిల్ 22న దీనిని జరుపుతున్నారు. వసంత రుతు ఆగమనానికి గుర్తుగా ఈ టైమ్ లో దీనిని జరుపుతారు. మనదేశంలో, రాష్ట్రంలో వేసవి సెలవులకు ముందు మన స్కూళ్లలో విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించేందుకు కార్యక్రమం చేపట్టాలి. విద్యార్థులు తమ వేసవి సెలవుల్లో వారి వారి కుటుంబాల్లో, గ్రామాల్లో మన జీవనానికి ప్రమాదం వాటిల్లే కారణాలను వివరించే విధంగా సమాచారం అందించాలి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భూతాపం అనే గ్లోబల్ వార్మింగ్ (Global Warming) ప్రక్రియ వేగవంతం కావటం ప్రతిఒక్కరూ తీవ్రంగా ఆలోచించవలసిన సమస్య.
భూమి వేడెక్కడం అంటే ఏమిటి? వేడెక్కితే ఏమవుతుంది? దాని వలన వచ్చే నష్టాలేమిటి వంటి విషయాలను విద్యారలు తెల్సుకునేలా ప్రోత్సహించాలి. 1880 నుంచి భూమి పైన వాతావరణంలో ఉండే ఉష్ణోగ్రతల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు పరిశీలించినప్పుడు 1950 తర్వాత ఈ ఉష్ణోగ్రతల్లో విపరీత మార్పు కన్పించింది. 1950 నుండి 2000 సం. మధ్య ఉష్ణోగ్రతల్లో వచ్చిన పెరుగుదల అలాగే కొనసాగితే, కొనసాగనిస్తే భూగోళం ప్రమాదంలో పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నివారణకు చేపట్టవలసిన మార్గాలను సైతం సూచించారు. వాటి ఆయా దేశాల ప్రభుత్వాలు అమలు చేస్తున్నవా? ఉష్ణోగ్రతలు ఏమైనా తగ్గుముఖం పట్టాయా? ఆలోచించండి!
అసలు ఉష్ణోగ్రతలను పెంచే కారణాలు ఏమిటి? ఎందువలన వేడెక్కుతున్నది. భూవాతావరణం? దీనికి కొన్ని వాయువులు కారణం. ఆ వాయువులను హరిత గృహ వాయువులుగా (Greenhouse Gases) పేర్కొంటారు. వీటిలో ప్రధానమైనది CO2. కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలోకి అమితంగా విడుదలవటం వలన, విడుదలలైన CO2 మను పీల్చుకునే మొక్కలు, వృక్షాలు తగ్గిపోవటం వలన ప్రమాదం మరింత ఎక్కువవుతోంది. CO2 తో పాటు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడ్డ నేటి సమాజం మండే మంటకు ఆజ్యం పోస్తున్నది. అదేమిటంటే మనం వాడే ఆటోమొబైల్ వాహనాలు, కార్లు వగైరా. అవి విడుదల చేసే ప్రమాదకరమైన వాయువులు. మన ఆరోగ్యాన్ని దెబ్బతీయటమే కాక మన ఉనికికి ముఖ్యకారణమై భూమిని, భూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అంతే కాదు ఇళ్ళల్లో వాడే రిఫ్రిజిరేటర్లు వదిలే వాయువులు ప్రమాదకరంగా తయారైనాయి. వాటిని CFC వాయువులు (క్లోరో ఫ్లోరో కార్బన్) అంటారు. ఇటువంటి ఎన్నో ప్రమాద కారకాలను నియంత్రించవలసి ఉంది. అందుకు మీరేమైనా చేయూతనందించగలరా? ఆలోచించే సమయం వచ్చింది!
పోనీండి మాకేమిటి అనుకోవచ్చు. కాని దీని వలన వచ్చే మార్పులు చిన్నవి కావు. మన ఋతువుల్లో తేడాలొస్తాయి. అంటే సకాలంలో వానలు పడవు. లేదంటే ఒకో ప్రాంతంలో విపరీతమైన వానలు పడొచ్చు. దీనితో కరువు కాటకాలు, వరదలు, ముంపు ఇలా ఒక గొలుసు చర్యలాగా ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. ముంపంటే ఏదో ఒక చేనో, చెరువో అనుకునేరు అది ఒక దేశానికి దేశమే కావచ్చు. ఉదాహరణకు దీవులు, తీరప్రాంతాలు కనుమరుగుకావచ్చు. ఈ ధరిత్రీ దిన సందర్భంలో చెకుముకి నేస్తాలూ ఆలోచించండి.. ఆచరణలోకి దిగండి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020