దోసోను పెనం మీద బాగా మాడ్చుకు తింటే, ఆ మాడు వల్ల కాన్సర్ వస్తుంది. బంగాళాదుంపను నూనెలో కరకరలాడే దాకా వేపుకు తింటే క్యాన్సర్ వస్తుంది. ఈ సంగతులు ఇప్పటి దాకా అనుమానంగానే ఉండేవి. ఇందుకు అసలైన ఆధారం ఇప్పుడు దొరికిందంటున్నారు పరిశోధకులు. అక్రిలమైడ్ అనే ఒక రసాయనం జంతువులలో క్యాన్సర్ లక్షణాలను కలిగించగలుగుతుందని తెలుసు. వేపుడు, బేకింగ్ చేసినప్పుడు ఈ రసాయనం తయారవుతున్నదని పరిశోధకులు వేరువేరుగా చేసిన రెండు పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఇంతవరకూ అందరూ భయపడుతూ వచ్చిన సంగతి ఇప్పుడు నిజమని తెలిసిపోయింది.
అక్రిలమైడ్ అనే రసాయనం చిప్స్ లోనూ, బిస్కట్స్ లోనూ ఉందని, వాటికి వాడిన ముడి పదార్థాలలో మాత్రం లేదని స్వీడన్ లో కనుగొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థవారు, తాగేనీటిలో ఒకంతకన్నా ఎక్కువ ఉండడం మంచిది కాదని సూచించారు. ఎక్కువ వేడిమిలో వండిన తిండిలో అది ఆ లిమిట్ కన్నా చాలా ఎక్కువగా ఉందని తెలిసింది.
పచ్చి పిండికన్నా, కాలిన రొట్టె, బేక్ చేసిన బ్రెడ్ రుచిగా ఉంటాయి. ఉడికించిన ఆలుగడ్డలకన్నా, చిప్స్ మరెంతో రుచిగా ఉంటాయి.
ఇందుకు కారణమైన రసాయన చర్యను మిలార్డ్స్ రియాక్షన్ అంటారు. చక్కెర పదార్థాలు చుట్టూ ఉండగా, మాంసకృత్తులను మరీ ఎక్కువ వేడిమికీ గురి చేస్తే, తిండి పదార్థాలను మంచి మంచి రుచీ, రంగూ వస్తాయి. అదే చర్య ..అదే వేపుడులోని రుచికి గల రహస్యం. కానీ, ఈ చర్య జరుగుతున్నప్పుడే, క్యాన్యర్ లక్షమాలను కలిగించగల అక్రిలమైడ్ రసాయనం కూడా పుడుతుంది. ఆలూ, మరికొన్ని రకాల కాయధాన్యాలలో అస్పరాజిన్ అనే అమైనో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. అది అక్రిలమైడ్ లాగే ఉంటుంది. చక్కెర పదార్థాలతో బాటు ఈ రసాయనాన్ని 185 డిగ్రీల సెంటిగ్రేడు వరకు వేడిచేస్తే, అది కూడా అక్రిలమైడ్ గా మారిపోతుంది. వంట చేసేటప్పుడు పదార్థాలలో అంతులేని రసాయన చర్యలు జరుగుతాయి. వాటిని మనం పట్టించుకోము. మరెన్నో రకాల అమైనో ఆమ్లాలు కూడా క్యాన్సర్ కారక రసాయనంగా మారతాయి. అంటారు. పరిశోధకులు స్టాడ్లర్. వంట పద్ధతులను మరింతగా పరిశీలిస్తే ఈ రసాయనం తయారయ్యే తీరు తెలుస్తుందని కూడా అంటున్నారు.
చిప్స్ తయారుచేసే నూనె, ఎంత ఎక్కువ వేడిగా వుండే, అంత కరకరలాడే చిప్స్ వస్తాయి. అంతగానూ అక్రిలమైడ్ పుడుతుంది. వంట ఎక్కువకాలం సాగినా ఈ రసాయనం తయారవుతుంది. ఉడికించిన పదార్థాలలో ఈ రసాయనం కనిపించలేదు. నాటి వంట వేడిమి తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని పరిశోధకులు అభిప్రాయం.
రసాయనం మామూలు తిండిలో కన్నా వెయ్యిరెట్లు ఎక్కువగా ఉంటే, ఎలుకల్లో, డ్రాసొఫిలా అనే దోమలాంటి కీటకాల్లో క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి. మనుషుల్లో కూడా అక్రిలమైడ్ వల్ల ఇటువంటి లక్షణాలు కలుగుతాయనడానికి సూటిగా నిదర్శనాలు లేవు,. క్యాన్సర్ గురించిన అంతర్జాతీయ సంస్థవారు 1994 లోనే, రసాయనం వల్ల క్యాన్సర్ బహుశ రావచ్చునని వర్గీకరించారు. ఎలుకలు ఉడికించిన తిండిని నిత్యమూ తినవు. మనుషులు మాత్రం వేలాది సంవత్సరాలుగా ఉడికించిన తిండినే తింటున్నారు. వేడిచేసిన తిండి అంటే వేపుడులో పుట్టిన రసాయనానికి కూడా మనుషులు అలవాటు పడిపోయి, టాలరెన్స్ ద్వారా వ్యాధి రాకుండా ఉందని అనుమానం. ఒళ్ళు పెరగడం, డయాబెటిస్, కూరలు, పండ్లు తినకపోవడం నిజానికి ఈ రసాయనం కన్నా ఎక్కువ అపాయకరమైనవని అభిప్రాయం.
అక్రిలమైడ్ రసాయనం, మనుషుల శరీరాల మీద చూపించే ప్రబావం గురించి మరింతగా పరిశోధనలు జరగవలసి ఉందని, అంతకు ముందే, విషయాన్ని భయంకరంగా వర్ణించడం కుదరదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు తెలియజేశారు.
రచయిత: కె.బి.గోపాలం
చివరిసారిగా మార్పు చేయబడిన : 8/4/2022