కనులులేని వాడు కాళ్ళుపోయిన వాడు
ఉభయులరయ గూడియుండునట్లు
పేద పేదగూడి పెనగొనియుందురు
విశ్వదాభిరామ! వినుర వేమ!
“కళ్లు లేని వ్యక్తి కాళ్లు లేని వ్యక్తి కలిసి ఉంటున్నట్లు పేద వాళ్లంతా కలిసి బతుకుతుంటారు”. అనేక కారణాల చేత కొంతమందికి కళ్లు ఉండవు. మరికొందరికి కాళ్లు ఉండవు. ఈ అసౌకర్యం పుట్టుకతోనే కలగవచ్చు. పుట్టినాక కలగవచ్చు. అయితే వాళ్లు కూడా బతకాలి. వీళ్లకు ఇతరుల సహాయం అవసరం. మానవత్వం ఉన్నవాళ్లు వీళ్లకు సహాయం చేస్తుంటారు. అన్నం పెట్టే వాళ్లుంటారు. వీధులు దాటించే వాళ్ళుంటారు. ఇలా అనేక రకాలుగా సహాయం అందిస్తుంటారు. కళ్లు లేని వాళ్లు సినిమా పాటలో, భక్తి గీతాలో పాడుతూ అడుక్కుంటూ ఉండడం మనం పట్టణాలలో, నగరాలలో చూస్తుంటాం. వీళ్లను ఒకప్పుడు 'అంగ వికలాంగులు' అనేవాళ్లం. ఆంగ్లంలో 'ఫిజికల్లీ హండీకాప్ట్' అనే వాళ్లు. ఇప్పుడు 'ఫిజికల్లి డిజేబుల్డ్' అంటున్నారు. అవయవాలన్నీ బాగా ఉన్న వాళ్లు అవయవాల లోపం ఉన్న వాళ్లకు సహాయం చేయడం ఒక దృశ్యం అయితే వాళ్లు వాళ్లు కలిసి తిరుగుతూ ఉండడం మరో దృశ్యం. కళ్ళులేని వ్యక్తి కాళ్లు లేని వ్యక్తి వరస్పరం సహకరించుకుంటూ బతకడం గురించి వేమన ఈ పద్యంలో చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడంటే అవయవాల అసౌకర్యం ఉన్న వాళ్లు కలిసి ఉన్నట్లే, పేద వాళ్లు కూడా ఐకమత్యంగా ఉంటారు అని చెప్పడానికి పేదవాళ్ళు పేదవాళ్ళు కలిసి ఉంటే ఏమిటి? అది వేమన చెప్పాలా? అని ఎవరికైనా అనిపించవచ్చు. ఒక హెచ్చరిక చేయడానికే వేమన ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఆర్థిక అసమానతలున్న సమాజంలో పిడికెడు మంది సంపన్నులుంటే, గంపెడు మంది పేదవాళ్లుంటారు. ఈ కొద్దిమంది సంపన్నులు, ఆ ఎక్కువ మంది పేదల శ్రమను దోచుకుంటూ ఉంటారు. పేదలు శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళ శ్రమ దోపిడికి గురౌతూ ఉంటుంది. అయితే ఇది ఎల్లకాలమూ సాగదు. పేదలు తమ శ్రమ దోపిడికి గురౌతున్నదని తెలిసినా విధి లేక కొన్నాళ్లు భరిస్తారు. తర్వాత ప్రశ్నిస్తారు. ఆ తర్వాత ప్రతిఘటిస్తారు. ఆ తర్వాత తిరుగుబాటు చేస్తారు. శ్రమదోపిడికి వ్యతిరేకంగా, ఆ సన్నివేశాన్ని గుర్తు చేసి పేదరికం లేని సమాజాన్ని నిర్మించుకోమని వేమన సూచించాడు. రచయితలు తాము నివసించే సమాజం ఎలా ఉందో పరిశీలిస్తారు. ఆ సమాజం ఇంకెలా ఉండాలో సూచిస్తారు. అందుకే వాళ్లను క్రాంతదర్శులు అంటారు. వేమన అలాంటి క్రాంతదర్శి అయిన కవి. ఆయన మన కన్నా మూడు వందల ఏళ్ళ క్రితం బతికినా, ఎంతో ముందు చూపుతో, మనం ఇవాళ చేసే ఆలోచనల వంటి ఆలోచనలు చేశాడు. వేమనను చదవడం వల్ల మనకు కలిగే లాభం ఏమిటంటే మనం ఎలా ఉండాలో, ఎలా ఉండ కూడదో తెలియడమే.
ఆధారం: ప్రొ. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/18/2020