అడవికి రాజు సింహం. సింహం అడవిలోని జంతువులను ప్రేమగా చూసుకునేది. ఎందుకంటే సింహం తన ఆహారపు అలవాట్లను కొంతవరకు మార్చుకుంది. సింహానికి సన్నిహితంగా ఒక జింక ఉండేది. సింహం దగ్గర దాని పరపతి రోజురోజుకూ పెరిగిపోవడం చూసిన జింక శత్రువులు అసూయాతో రగిలిపోయారు. ఎలాగైనా జింకను అవమానం పాలు చేసి సింహం దగ్గర జింక ఆట సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురు చూడసాగారు.
ఇలాంటి సమయంలో ఒంటి కన్ను కుందేలు ఒకటి అడవికి కొత్తగా వచ్చింది. ఆ కుందేలు సింహం ఆశ్రయాన్ని పొందాలని వస్తుండగా, దానికి జింక శత్రువులు కనిపించారు. దానిని జింక శత్రువులు, సింహం దగ్గరకు తీసుకెళ్లాయి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని సింహం ఆ ఒంటికన్ను కుందేలును అడిగింది. అప్పుడు కుందేలు రాజా నేను పేదరాలిని నేను కొంత వరకు చదువుకున్నాను. నాకు ఒక కన్ను లేదు. నాకు తెలిసిన అక్షరాలను నేను జంతువులకు చెబుతూ జీవించడానికి వచ్చాను అని చెప్పింది. దానికి సింహం అంగీకరించి, మిగిలిన జంతువులకు ఒంటికన్ను కుందేలును పరిచయం చేసింది. అలా కొన్ని రోజులు గడిచాయి.
ఒకరోజు ఆ సింహం ఒంటికన్ను కుందేలును పిలిచి నిన్ను ఒక విషయమడిగితే మీరు బాధపడరు కదా! అని సింహం అడిగింది. అయ్యో మీరు ఈ అడవికి రాజు, మీరు చాలా మంచివారు. మీరు ఏమి అడిగినా బాధపడను అని కుందేలు చెప్పింది. 'మీరు పుట్టుకతోనే ఒంటికన్నుతో పుట్టారా? అని అడిగింది సింహం. అదా, ఆ విషయం ఇప్పుడు చెప్పి ఏమి ప్రయోజనం? అదంతా పెద్దకథ. నిజంగానా ఈ పరిస్థితికి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటికన్ను కుందేలు చెప్పింది. ఏమిటీ? మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది. అవును మీ అడవిలోనే అని కుందేలు జవాబు చెప్పింది. నేను నా కుమారుని చదువు కోసం అప్పు చేయవలసి వచ్చింది. అప్పుడు ఈ అడవిలోని జింకను ఒకదాన్ని కలిసి విషయం చెప్పాను. దానికి జింక డబ్బు అయితే ఇస్తాను, కానీ ఆ డబ్బు తీర్చే వరకు నా దగ్గర ఒకకన్ను కుదవ పెట్టాలని షరతు పెట్టింది. ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు. నా కన్ను, జింక దగ్గర కుదవపెట్టి నా కుమారుని చదివిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే మనుషులు బాగా చదువుకొని భూమిని వదిలి వేరే గ్రహాల పైకి కూడా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కదా అని కుందేలు చెప్పింది.
కుందేలు కథ విన్న సింహానికి, జింక పై విపరీతమైన కోపం వచ్చింది. కుందేలు పై జాలి కలిగింది. జింకను పిలిపించి కుందేలు చెప్పినదంతా తెలియజేసి ఇది నిజమేనా అని గట్టిగా అడిగింది. జింక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇది నా శత్రువులు పన్నిన కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది. తన ముఖంలో ఎలాంటి తేడా చూపకుండా ఔను, సింహం గారూ! కుందేలు చెప్పినదంతా నిజమే. తను నా దగ్గర తీసుకున్న సొమ్ము పది లక్షలు తీర్చి, తన కన్ను తీసుకో మనండని చెప్పింది. ఇంకా 50 రోజులు గడువు ఉంది అని చెప్పింది జింక. సరే గడువులోగా తన డబ్బు తిరిగి ఇచ్చి నీకన్ను తీసుకో అని చెప్పి సింహం వెళ్లిపోయింది.
జింక తన స్నేహితురాలైన కొంగ సాయంతో కొన్ని చేపల కళ్లను రసాయనంతో గాజుకుండీలో భద్రపరిచింది. సింహం తన సింహాసనంపై కూర్చుంది. ఇంతలోగా కుందేలు వచ్చి పది లక్షలు డబ్బును జింక ముందు ఉంచింది. నా కన్ను నాకు ఇవ్వు అని కుందేలు అడిగింది. జింక తన దగ్గర ఉన్న గాజుకుండీ తెచ్చి కుందేలుకు చూపింది. ఇందులో నీకన్ను భద్రంగా ఉంది. నీ కన్ను నీవు తీసుకో అంది జింక. కానీ కుందేలు ఇందులో నా కన్ను లేనేలేదు అంది. నీ కన్ను ఇందులోనే ఉంది.
ఎందుకంటే, ఇంకా కొన్ని చిన్నా పెద్దా జంతువులు కూడా వాటి కళ్లు కుదవ పెట్టి డబ్బులు తీసుకున్నాయి. నీవు నీకన్నును గుర్తించుకోనట్లున్నావు కదా అంది. నీ రెండో కన్ను తీసి ఇవ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకు ఇస్తాను అంది. నేను నాకంటిని ఎలా తీసివ్వాలి అంది కుందేలు. నీవు నా దగ్గర కుదవపెట్టిన నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇయ్యి అంది. ఇదంతా కలిసి పన్నిన కుట్ర అయి ఉంటుంది అని తెలుసుకుంది. ఇంకా ఆలస్యం ఎందుకు నీకంటిని తీసివ్వు అంది సింహం. ఇంక ఆ కుందేలు నోట నుంచి మాట రాలేదు. భయంతో అక్కడి నుంచి పారిపోయింది. అది చూసిన సింహం జింకను తన మంత్రిగా నియమించుకుంది. అందుకే, ఆపదలు, కష్టాలు కలినప్పుడు ఎదుర్కొని వాటిని జింకలా పరిష్కరించుకోవాలంటారు.
ఆధారం: వి. లక్ష్మిఅంజలి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020