ఏంట్రా రామూ ఈవారంలో రెండే రోజులు పాఠశాలకు వచ్చావు అని టీచరు అడిగితే, జ్వరం, విరేచనాలు వల్ల రాలేదు అని సమాధానం. వర్షాకాలం ప్రారంభంలో పాఠశాల విద్యార్థుల హాజరు తక్కువగా వుంటుంది. ఇది అందరు ఉపాధ్యాయులకు తెలిసిన విషయం. గ్రామీణ ప్రాంతాలలో అయితే వ్యవసాయ పనులు ఒక కారణం అయితే అనారోగ్యం రెండో కారణం. వర్షాకాలంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, జలుబు ఇవి పిల్లల్లో సాధారణంగా కనిపిస్తాయి.
ఇలా అనారోగ్యం పాలవడానికి ప్రధానకారణం. వ్యక్తిగత అపరిశుభ్రత. శుభ్రంగా ఉంటే 50% వ్యాధులు మనదరికి రావు. శుభ్రంగా వుండడమంటే ముఖాన్ని మాత్రమే సబ్బుతో నాలుగుసార్లు కడిగి పౌడరు అద్దడం కాదు. ముఖంతోపాటు చేతులు, పాదాలు శుభ్రం ! చేసుకుంటేనే పూర్తి శుభ్రత పాటించినట్లు, చేతులు సబ్బుతో కడుక్కోకుండా భోజనం చేసేవారి చెంతనే సూక్ష్మజీవులు నివాసం ఉంటాయి. మంచి నేస్తాలవుతాయి. మరి నేస్తాలంటే ఇచ్చి పుచ్చుకోవడం సహజం వారివి మనకిస్తారు. మనవి వారు తీసుకుంటారు. అందువల్లే మనకు జ్వరం తదితర అనారోగ్య లక్షణాలు. వైరస్ల వల్ల హైపటైటిస్, నులిపురుగుల వల్ల రక్తహీనత, ప్రోటోజోవా క్రిముల వల్ల విరేచనాలు పిల్లలలో కనిపిస్తాయి. దీనికి కారణం పిల్లలు మట్టిలో ఆటలాడటం, రోడ్డు ప్రక్కన మలవిసర్జనలు మన గ్రామీణ భారతంలో ఒక భాగం. పిల్లలు రోడ్ల వెంబడి నడుస్తూ పాఠశాలకు వెళతారు. వీరిలో ఎక్కువ మందికి చెప్పులు కూడా వుండవు. వాళ్ళ పాదాలకంటిన క్రిములు వారితోపాటు పాఠశాల మైదానికి చేరతాయి. వాటి జనాభాని పెంచుతాయి. పిల్లలు అదే మైదానంలో ఆటలాడ్డం, మట్టిలో చేతులు పెట్టడం సహజం. అలా గోర్ల వెనక్కు చేరిన క్రిములు. చేతులు సరిగా శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడం వల్ల మనలోపలికి ప్రవేశిస్తాయి.
మనం ఆహారాన్ని చేతితో కలుపుకొని చేతితోనే తింటాం. ఇతర దేశాల వారిలాగా స్పూన్లు వాడం. కాబట్టి చేతుల శుభ్రత వారికంటే మనకే ఎక్కువ అవసరం.
ఇక ప్రభుత్వ పాఠశాలల విషయానికొస్తే విద్యార్థులందరికి మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అందిస్తుంది. భోజనం చేసేముందు వీళ్ళందరూ చేతులు ఎలా శుభ్రం చేసుకుంటున్నారు? ఎక్కడున్నా సబ్బులను ఉపయోగిస్తున్నారా? అని పరిశీలిస్తే ఒక్క శాతం కూడా ఉందో లేదో? అదెక్కడన్నా సక్రమంగా నడుస్తుందంటే అక్కడి ఉపాధ్యాయుల సమిష్టి కృషి వల్లే అది సాధ్యమయిందనవచ్చు.
అపరిశుభ్రమైన చేతులు క్రిములకు అధికారిక నివాసాలు. వీటి నుంచి విద్యార్థులను రక్షించడానికి ఎవరు ముందుకు రావాలి? ప్రతి పనీ ప్రభుత్వాలే చేయాలా? మన పాఠశాల విద్యార్థుల ఆరోగ్య రక్షణలో ఉపాధ్యాయుల బాధ్యత గురుతరమైంది. వారు ఆలోచిస్తే పరిష్కారాలు చాలానే కనిపిస్తాయి. ప్రతి పాఠశాలలో విద్యార్థులు పుట్టిన రోజు పండుగలు జరుపుకుంటారు. స్వీట్లు, చాక్లెట్లు పంచుతారు. ఆ చేత్తోనే ఒక సబ్బును కూడా తోటి విద్యార్థుల కోసం ఇచ్చేలా ఉపాధ్యాయులు విద్యార్థులను చైతన్యపరచాలి. ఇలా సబ్బులను సేకరించి నిత్యం విద్యార్థులకు అందేలా చేయవచ్చు.
ప్రతి విద్యార్థి సంవత్సరానికి ఒక్కసారి తనవంతుగా ఒక సబ్బును పాఠశాలకు విరాళంగా అందించవచ్చు. అలా చేస్తే సంవత్సరం మొత్తం విద్యార్థులు పరిశుభ్రమైన చేతులతో ఆహారం' కార్యక్రమం కొనసాగించవచ్చు.
విద్యార్థుల హ్యాండ్ వాష్ కొరకు గ్రామస్తుల - సహకారం కోరవచ్చు. అయితే ఈ విషయంలో చొరవ చూపాల్సింది ఉపాధ్యాయులే. దీనివల్ల పాఠశాలలోనే కాదు ఇంటిలోనూ పరిశుభ్రత పట్ల పిల్లలు శ్రద్ధ వహిస్తారు. అలా బాల భారతాన్ని ఆరోగ్య భారతంగా తీర్చిదిద్దిన వారమవుతాం. ఒక మంచి పనితో ఇతరులకు ఆదర్శంగా ఉందాం. సమాజం పట్ల మన బాధ్యతను నెరవేర్చుదాం.
ఆధారం: డా. వీరమాచనేని శరత్ బాబు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/27/2020