నదులు మూసీనది రాష్ట్రరాజధాని నగరంలో ప్రవహించే మూసీనదిని ప్రాచీనకాలంలో ముచికుంద అని వ్యవహరించేవారు. రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండల్లో జన్మించిన మూసీ నగరం మధ్య నుంచి ప్రవహించి నల్గొండ జిల్లా వాడపల్లిలో కృష్ణానదిలో కలుస్తుంది. 1908లో ఈ నదికి వచ్చిన వరదలు నగరంలో తీవ్ర నష్టం కలిగించాయి. భవిష్యత్తులో మూసీ వరదలతో నష్టం వాటిల్లకుండా చూసేందుకు అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రముఖ ఇంజీనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి పిలిపించారు. విశ్వేశ్వరయ్య సూచనల మేరకు ఉస్మాన్సాగర్ (గండిపేట) ఈసా నదిపై హిమాయత్ సాగర్ ఆనకట్టలను నిర్మించారు. అనేక శతాబ్దాలుగా నగర ప్రజల జీవనంతో మమేకమైన మూసీ కాలక్రమంలో కాలుష్యసాగరంగా మారింది. జనావాసాలు పెరిగిపోవడం, పారిశ్రామీకరణ.. తదితర కారణాలతో మూసీ కాలుష్యంలో మునిగిపోయింది. ఆధారము: ఈనాడు