పెరుగుతున్న జనాభా దృష్ట్యా పంటల అధిక దిగుబడుల కొరకు రసాయనిక ఎరువుల వాడకం నానాటికి పెరుగుతున్నది. వాటి ధరలు, కొరత కూడా ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్దితులలో తక్కువ ఖర్చుతో సమర్ధవంతమైన పోషక విలువలను అందిచే జీవన ఎరువులను వాడటం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తునారు. జీవన ఎరువుల వాడకం వలన లాభాలు జీవన ఎరువులు తక్కువ ఖర్చుతో సమర్ధవంతమైన పోషక విలువలను అందజేస్తాయి. వీటి వాడకం వలన భూమి, వాయు కాలుష్యాలు తగ్గుతాయి. తద్వారా భూసారం పెరుగుతుంది. జీవన ఎరువుల వల్ల ఉత్పన్నమయ్యే విటమిన్లు, హార్మోన్ల ద్వారా పంట బాగా పెరిగి అధిక దిగుబడులను పొందవచ్చును. రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. జీవన ఎరువులలో పంటలకు కావలసిన పోషక పదార్దాలైన నత్రజని, భాస్వరాలను లభింపజేసే సుక్ష్మజీవులు అధిక మొత్తంలో ఉంటాయి. వాతావరణంలో నురింట ఎనభై భాగాల నత్రజని వాయు రూపంలో ఉంటుంది. ఈ నత్రజనిని మొక్కలు నేరుగా గ్రహించలేవు. కొన్ని సుక్ష్మజీవులు మాత్రమే వాయు రూపంలోని నత్రజనిని వాతావరణం నుండి గ్రహించి మొక్కలు గ్రహించగలిగే అమ్మోనియా లాంటి పదార్ధలుగా మార్చగలవు దీనినే నత్రజని స్దిరీకరణ అంటారు. నత్రజని స్ధిరీకరణ చేసే జీవన ఎరువులు రైజోబియం : రైజోబియం బాక్టీరియా జాతికి చెందినది. ఇది లేగ్యుమ్ జాతి పంటల వేర్ల బుడి పెల యందు నివాసం ఏర్పరచుకొని పంట కాలంలో నత్రజని స్ధిరీకరణ చేస్తుంది. ఉదా : కంది, పెసర , మినుము , శనగ, వేరుశనగ , సోయా చికుడు అజోటోబాక్టర్ : పంట యొక్క వేర్ల దగ్గరగా నివసిస్తూ వాతావరణంలోని నత్రజనిని గ్రహించి, దానిని అమ్మోనియాగా మార్చి మొక్కలకు అందిస్తుంది. ఉదా : గోధుమ, బార్లీ, వరి, మొక్కజొన్న, పొగాకు, టి, కాఫీ, పండ్లు, పూల మొక్కలు. అజోస్పైరిల్లం : పంట వేర్ల దగ్గరగా నివసిస్తూ వాతావరణంలోని నత్రజనిని గ్రహించి, దానిని అమ్మోనియాగా మార్చి మొక్కలకు అందిస్తుంది. ఉదా: వరి, రాగి, జొన్న, చెకు, పత్తి, కూరగాయలు, పశుగ్రాస పంటలు, ఉద్యాన పంటలు. భాస్వరం కరగదీసే బాక్టీరియా (పి.ఎస్.బి) : మొక్కలకు లభ్యం కాని భాస్వరం నేలల్లో 60 శాతం వరకు ఉంటుంది. పి.ఎస్.బి వేసినపుడు ఈ బాక్టీరియా భాస్వరాన్ని కరగదీసి మొక్కలకు అందిస్తుంది. ఉదా. అన్ని పంటలు. జీవన ఎరువులు ఉపయోగించే విధానం విత్తన శుద్ధి : 100 గ్రా. బెల్లం లేదా పంచదార ఒక లీటరు నీటిలో వేసి 15 ని. మరిగించి పూర్తిగా, చల్లారిన తరువాత 500గ్రా. కల్చర్ పొడిని వేసి బాగా కలిపి ఒక ఎకరానికి సరిపడే విత్తనాలకు సమానంగా అంటేటట్లు కలుపుకోవాలి. దుక్కిలోవేయడం : 2-3 కిలోల కల్చర్ పొడిని 100 కిలోల బాగా మాగిన పశువుల ఎరువులో కలిపి ఆఖరి దుక్కిలో తేమ ఉన్నప్పుడు వేయాలి. నారు శుద్ధి : ఒక కి. గ్రా. కల్చర్ పొడిని 10 లీటర్లు నీటిలో బాగా కలిపి ద్రావణం తయారు చేసి, నారు వేర్లను ముంచి అరగంట తర్వాత నాటాలి. వాడకంలో జాగ్రత్తలు భూమిలో వేసేటప్పుడు బెట్టకు గురికాకుండా తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ప్యాకేట్లను చల్లని, తెమలేని ప్రదేశంలో సూర్యరశ్మి, వేడి తగలకుండా భద్రపరచాలి. రైజోబియం వాడేటప్పుడు దుక్కిలో ఎక్కువ మోతాదు నత్రజని వాడరాదు. నత్రజని ఎక్కువైతే వేర్లకు బుడిపెలు రావు. గడువు తేదీలోపు మాత్రమే సూచించిన పంటలకు వాడాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక