మొక్కకు కావలసిన స్థూల, సూక్ష్మ పోషక పదార్థాలైన నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, జింకు, రాగి మొదలగు మూలకాలను సరఫరా చేస్తుంది. నేల భౌతిక స్థితి గతులను మెరుగు పరుస్తుంది. అంటే నీరు నిల్వ ఉంచే శక్తి, నేలలో గాలి ప్రసరణ, మట్టి రేణువులు ఒక దాని కొకటి పట్టి ఉంచే శక్తి మెరుగుపడతాయి. భూసారం, నేల ఉత్పాదక శక్తి మెరుగవుతాయి. సేంద్రీయ ఎరువుల వాడకం వలన భూమిలో సూక్ష్మ పోషక పదార్థాల నిష్పత్తి మారుతుంది. దీనివలన భూమిలోని మొక్కలకు హాని కలిగించే నులి పురుగులు శిలీంద్రాలు కొంత వరకు అదుపులో ఉంటాయి. రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది. సేంద్రీయ ఎరువుల నుంచి నత్రజని మెల్లగా విడుదల అవడం వలన నత్రజని నష్టం తక్కువగా ఉంటుంది. నేలలోని సూక్ష్మజీవులకు మంచి ఆహారం గాను, అవి అభివృద్ధిచెంది చురుకుగ పని చేయడానికి ఉపయోగ పడుతుంది. పండ్లు, కూరగాయలు, ఇతర పంటలలో నాణ్యత పెరుగుతుంది. ఉప్పునేలలు, చౌడునేలలో లవణ, క్షార గుణాలు తగ్గించి పంటల దిగుబడులను పెంచడంలో దోహద పడుతుంది. బరువు నేలలు గుల్లబారి వేర్లు చక్కగా పెరగడానికి సహాయ పడుతుంది. నీరు ఇంకడం పెరిగి మురుగు సౌకర్యం మెరుగవుతుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచే శక్తి పెరగడానికి దోహద పడుతుంది. బెట్ట పరిస్థితిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. భూమిలోని వ్యాధికారక సూక్ష్మ జీవులను నశింపచేసి మొక్కలకు రక్షణ కల్పిస్తాయి. మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుంది. వాడటం తేలిక, వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇన్ని ఉపయోగాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు మనరైతు సోదరులు ఈ సేంద్రీయ ఎరువులను సాధ్యమైనంత మేరకు వాడి లాభదాయక పథంలో పయనించాలని ఆశిద్దాము. ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.