పప్పు ధాన్యాల సాగులో ప్రత్యేకమైనది సోయాబీన్. నల్లరేగడి భూముల్లో ఈ పంట మంచి దిగుబడులు ఇస్తుంది. ఇతర పప్పు ధాన్యాల పంటలతో పోలిస్తే ఎంతో లాభదాయకమైనది. మంచి పోషకాలున్న జె.ఎస్.335 రకం పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో నాలుగేళ్లుగా సోయాబీన్ పంట సాగు విస్తీర్ణం క్రమేణా పెరుగుతోంది. ఈ ఏడాది 6,232 హెక్టార్లలో ఈ పంటను సాగు చేస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు రాబట్టవచ్చని బసంత్పూర్-మామిడ్గి ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్కుమార్, సెల్: 9849535756 వివరించారు. ఎకరం పంట సాగు చేయడానికి రూ.15,000నుంచి రూ.20,000 వరకు ఖర్చు వస్తుందన్నారు. 14 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి తీయవచ్చని తెలిపారు. దీని ధర క్వింటాలుకు రూ.3,5000 నుంచి 4,000 వరకు పలుకుతుందని తెలిపారు. సోయా సాగుపై ఆయన అందించిన సలహాలు, సూచనలు... నీటి యాజమాన్య పద్ధతులు సోయా వర్షాధార పంట. ఇటీవల కురిసిన వర్షాల వల్ల నియోజకవర్గంలోని రైతులు సాగు చేసిన పంటలకు నీటి అవసరం లేదు. పూత దశలో ఉన్న పంటకు సరిపడా వర్షం కురిసింది. కాయ దశలోకి వచ్చిన తర్వాత వర్షం పడితే నీటి తడులు అవసరం లేదు. కలుపు నివారణ... సమస్యాత్మకమైన గడ్డిని నివారించేందుకు 200 లీటర్ల నీటిలో 250 మిల్లీలీటర్ల ఇమేజారియా మందును కలిపి గడ్డి జాతి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. పంటకు సోకే తెగుళ్లు... దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు, కాండం తినే పురుగు, కాండం తొలిచే పురుగు దాసరి పురుగు ఈ పురుగులు లేత గోధుమ రంగులో ఉండే ఈ పురుగులు ఆకులపై గుడ్లు పెడతాయి. ఇవి లద్దె పురుగులుగా మారి ఆకులకు రంధ్రాలు చేసి తింటూ పంటను నష్టపరుస్తాయి. నివారణ... మొదటి దశ లార్వాను గుర్తించి 5 మిల్లీలీటర్ల వేప నూనెను లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఎకరాకు 400 గ్రాముల బాక్టీరియా సంబంధిత మందులు వాడాలి ఎకరా పొలంలో 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటిలో 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును కలిపి పంటపై స్ప్రే చేయాలి. పొగాకు లద్దె పురుగు ఇవి ఆకులపై కుప్పలు కుప్పలుగా గుడ్లు పెడతాయి. పొదిగిన పిల్ల పురుగులు పచ్చని ఆకులను తింటాయి. లేత ఆకులను తిగనడంతో పాటు పువ్వులు, కాయలకు కూడా నష్టాన్ని కలుగజేస్తాయి. తెలుపు బూడిద రంగుల్లో ఉండే ఈ పురుగులు రాత్రి వేళ్లలో పంటలను తింటూ పగటి వేళ్లలో మొక్కల మొదళ్ల వద్ద ఉంటాయి. నివారణ... ఆకులపై గుడ్లు కనిపించిన వెంటనే వాటిని నాశనం చేయాలి. లార్వాలు ఉన్న ఆకులను తొలగించి దూరంగా పారేయాలి. పురుగులు తినే పక్షులను ఆకర్షించేందుకు పొలంలో టీ ఆకారంలో కర్రలు ఏర్పాటు చేసుకోవాలి. తొలి, మలి దశలో చేనుల్లో వేప నూనె పిచికారీ చేయాలి. లీటర్ నీటిలో 2.5 క్లోరోఫైరిపాస్ లేదా 1.6 మి.లీ. మోనోక్రొటోఫాస్ లేదా1 గ్రాము ఎసిపేట్ మందును స్ప్రే చేయాలి. కాండం తొలిచే పురుగు ఈ పురుగుకు సంబంధించిన తల్లి ఈగలు నలుపు రంగులో మెరుస్తూ ఆకుల మీద గుడ్లను పెడతాయి. పొదిగిన లార్వాలు ఆకు కాడల ద్వారా కాండంలోకి ప్రవేశించి కాండం లోపలి పదార్థాల నుంచి వేర్ల వరకు తినేస్తాయి. ఈ పురుగుల వలన 25శాతం వరకు పంట నష్టం కలుగుతుంది. నివారణ... రక్షణ కొరకు తొలి దశలో 10 గ్రాము ఫోరేట్ లేదా 3గ్రాముల కార్బోఫ్యురాన్ గుళికలను పొలంలో చల్లుకోవాలి. లీటర్ నీటిలో 1.6మిల్లీ లీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 1.5గ్రాముల ఎసిఫేట్ లేదా 2మిల్లీ లీటర్ల డైమిథోయేట్ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి. పెంకు పురుగు ఈ పురుగు కాండం మీద అర్ధ చంద్రాకారంలో రంధ్ర చేసి లోపలకు వెళ్తుంది. ఆడ పెంకు పురుగు కాండం మీద చుట్టూ రంధ్రాలు చేస్తుంది. ఫలితంగా చిగురు భాగానికి పోషకాలు అందక మొక్క ఎండిపోతుంది. రంధ్రాల్లో పెట్టిన గుడ్లు పొదగబడి లార్వాగా మారుతుంది. ఈ లార్వా కాండాన్ని తొలిచి తినుకుంటూ మొక్కలకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. నివారణ... చిగురులు ఎండిపోతున్న మొక్కలను పొలంలోంచి పీకేయాలి. ఇలా చేయడం వల్ల పురుగు ఉధృతిని కొంత వరకు అరికట్టవచ్చు. లీటర్ నీటిలో 2 మిల్లీ లీటర్ల క్లోరోఫైరిపాస్ లేదా 1.6మి.లీ మోనోక్రొటోఫాస్ లేదా 2.0మి.లీ ట్రైజోఫౠస్ మందును కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు