మనం పండించే రకరకాల పంటలో ఎన్నో రకాల చీడపీడలు, బాక్టీరియా, వైరస్లు ఆశించి నాణ్యత, దిగుబడులు క్షీణిస్తున్నాయి. వీటి సమస్యలు తగ్గించడానికి చాలా రకాల పురుగు మందులు మనం వాడుతున్నాం. కాని వీటిని సరైన పద్దతులలో పాటించక పోవడం వలన పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. కావున ఈ సమస్యలు తగ్గించడానికి రైతులు కొన్ని రకాల మెళకువలు, జాగ్రత్తలు పాటిస్తే పంట ఖర్చులనే కాకుండా, మనం విషపు బారిన పడకుండా మనల్ని మనం కాపాడవచ్చు. పురుగు మందుల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి వివిద పంటల మీద చీడపీడల్ని నివారించడానికి వివిద రకాల మందులు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కావున మనకు అవసరమయ్యే మందును, అవసరమైన పంటకు మాత్రమే వాడాలి. కొన్నిమందులు కొన్ని పైర్లమీద మాత్రమే వాడాలి. కావున అవసరమయ్యే మందులు మాత్రమే వాడి ఖర్చును తగ్గించుకోవచ్చు. తగిన మోతాదులో మందును వాడాలి మనం వాడే పురుగు మందును మోతాదు మేరకే సిఫార్సు చేసిన ప్రకారం వాడాలి. పురుగు చావాలనే కోరికతో ఎక్కువ మోతాదులో మందులు వేయడం వలన ఖర్చు పెరగడమే కాకుండా, పుపుగులు ఆ మందుకు రోగనిరోధక శక్తిని పెంచుకుంటాయి. అవసరమైతేనే పురుగు మందులు వాడాలి ఒకటి, పెండు చోట్ల కనబడగానే ఎక్కువ విలువ (ఖరీదు0 గల మందులను వాడరాదు. అదేవిధంగా ఎక్కువ గాఢత గల మందులు వాడరాదు. ఇలా వాడటం వలన మేలు చేసేటువంటి కందిరీగలు, తేనేటీగలు, అక్షింతల పురుగులు వంటివి చనిపోతాయి. అందువల్ల మరీ ఎక్కువగా చీడపీడలు ఆశించనప్పుడే మందులు వాడి ఖర్చును, విషపూరితాన్ని తగ్గించుకోవాలి. మందును చల్లడానికి సరైన పరికరాలు వాడటం పురుగు మందులను చల్లడానికి మంచి స్ప్రేయర్లు, డస్టర్లు మాత్రమే వాడాలి. చాలా వరకు చేత్తో (పొడి మందులు) చల్లడం చేయవద్దు. ఇలా చేయడం వల్ల సరిగ్గా మందు పైరుపై పడక వృధా అవుతుంది. సరైన మోతాదు నీటిలో పురుగు మందును కలపాలి రైతులు మందులు వాడే క్రమంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు సిఫార్సు చేసిన మందులను సరైన మోతాదు నీటిలో కలిపి మాత్రమే పిచికారీ చేయాలి. సాధారణంగా ఎకరాకు 200 లీటర్ల నీటిని ఒక ఎకరాకు మందును పిచికారి చేయడంలో వాడుకోవాలి. మందును వాడేటప్పుడు తగిన శ్రద్ధ, జాగ్రత్త అవసరం ప్రతి రోజు రైతు తమ పైరును జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మంచి పూత దశలో లేదా కాయ దశలో చీడపీడల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు మందులు చల్లే పనిని ప్రారంబించాలి. ఈ మందులు వాడే మందు మొక్క ఆరోగ్య పరస్థితిని గమనించి, వ్యవసాయ, ఉద్యాన అధికారులను సంప్రదించి వారి సలహా మేరకే సిఫార్సు చేసిన మందును వాడాలి పురుగు మందులు వాడేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు పైరుకు చీడపీడలు ఆశించినప్పుడు మొక్కను లేదా పైరును అనుభవం, పరిజ్ఞానం ఉన్న వ్యవసాయం, ఉద్యాన అధికారికి చూపించి వారు సిఫార్సు చేసిన మందును వాడాలి. సిఫార్సు చేసిన మొతాదులో వాడాలి. మందు పిచికారి చేసేటప్పుడు ఆకులపై, కింది భాగంలో తడిసేలా పిచికారి చేయాలి. మిగిలిన పాత, తేదీ అయిపోయిన మందులు వాడకూడదు. రెండు మూడు రకాల మందులు వాడేటప్పుడు వాటి యొక్క కలిసిపోయే తత్వాన్ని గమనించి మాత్రమే వాడుకోవాలి. మందును కలపడానికి కొలమానికను వాడాలి. వివిద డబ్బా మూతలు, సీసా మూతలు వాడకూడదు. మందును పిచికారి చేసే ముందు, మందును డ్రమ్ములో లేదా బకెట్ లో కలుపుకొని, తరువాత స్ప్రేయర్ లో నింపుకొని పిచికారి చేయాలి. ఈ పురుగు మందులు విషపూరితాలు కావున, చిన్న పిల్లలకు దూరంగా ఉంచాలి. పిచికారి చేసే సమయంలో రక్షణా దుస్తులు ధరించాలి. ఆరోగ్యం సరిగా లేని వారు పిచికారి చేయరాదు. మందును కలిపేటప్పుడు చేత్తో కలపరాదు. పుల్లను లేదా కర్రను ఉపయోగించాలి. మందు సీసా మూతను నోటితో తీయరాదు. స్ప్రేయర్ నాజిల్ కి ఏదైనా అడ్డుపడితే నోటితో ఊది తీయరాదు. మందు చల్లేటప్పుడు గాలికి ఎదురుగా చల్లరాదు. మందు చల్లుతూ సిగరేట్, తమలపాకు, బీడి వంటివి సేవించరాదు. కాలపరిమితి దాటిన మందులు వాడరాదు. పురుగు మందు వాడే ముందు లేబుల్ ను వివరణ పత్రాన్ని పూర్తిగా చదివి తగిన సూచనలు పాటించాలి. మందులను మార్చి, మార్చి వాడాలి. కల్తీ మందులు వాడరాదు. మందును చల్లిన తరువాత శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. చీడపీడల మందును పిచికారీ చేసే సమయంలో ఉప్పు నాటిని వాడరాదు. ఉదజని సూచిక 8 కి మించి ఉన్న లేదా ఉదజని సూచిక 5 కి తక్కువ ఉన్న నీటిని వాడకూడదు. ఉప్పునీటిలో కలిపి వాడితే అవి అడుగున పేరుకుపోతాయి. కొన్ని పైర్ల ఆకులు సన్నగా ఉండడం వలన పిచికారీ చేసిన మందు నిలవదు. ఇలాంటి సమయంలో మందు నీటిలో శాండోవిట్ లేదా టీపాల్ లాంటి పదార్థాన్ని కలిపి చల్లాలి. ఆధారం: పాడిపంటలు మాస పత్రిక