ఇద్దరు మిత్రులు జీవనోపాధి కోసం పొరుగూరికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. కాని దారిలో ఒక అడవి వస్తుంది. అది దాటితేకాని పొరుగూరికి చేర లేరు. అడవిలో రక రకాల జంతువులు ఉంటాయని వారికి తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసి ఎదిరించాలని ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం మొన్నాడు పొరుగూరికి బయలుద్యారారు. అలాగే అడవిలోకి ప్రవేశించారు. గట్టిగా ఒకళ్ళ చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడుచుకుంటూ అడవి దాటుతుంటే, హటాత్తుగా ఒక ఎలుగుబంటి కనిపించింది. వెంటనే ఇద్దరూ భయ పడిపోయారు. “ఏం చేద్దాం?” అనుకున్నారు. మొదటివాడు “చెట్టు ఎక్కేద్దాము,” అని సలహా ఇచ్చాడు. “కాని నాకు ఎక్కడం రాదే!” అని రెండో వాడు అన్నాడు. “నాకు వచ్చు కదా” అని మొదటి వాడు చేయి వదిలించుకుని గబ గబా పక్కనున్న చెట్టు ఎక్కేసాడు. రెండో వాడికి చెట్టు ఎక్కడం రాదు కదా! ఏం చేస్తాడు? మొదటి వాడేమో ఇలాంటి పరిస్థితిలో వంటరిగా వదిలేసాడు! వెంటనే రెండోవాడు నేల మీద శవంలా పడుక్కున్నాడు. చడి చప్పుడు చేయకుండా అలాగే పడున్నాడు. ఎలుగుబంటి దగ్గిరకి వచ్చింది. పాపం ఊపిరి కూడా బిగించుకుని అలాగే స్థిరంగా వున్నాడు. ఎలుగుబంటి చని పోయిన జీవులని తినదు. అలా కదలకుండా పడివున్న రెండో వాడు చనిపోయాడనుకుంది. ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసి కొంత సేపటికి వదిలి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయాక రెండో వాడికి ఉపశమనం కలిగింది. హమ్మయ్య! అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు. మొదటి వాడు చెట్టు మీంచి దిగాడు. ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసినప్పుడు ఏదో చెవిలో రహస్యం చెప్పిందనుకుని మొదటి వాడు అపోహ పడ్డాడు. “ఎలుగుబంటి నీకు అంత సేపు చెవిలో ఏమి చెప్పింది” అని అడిగాడు. “అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులు కారు, అని నాతొ ఎలుగుబంటి చెప్పింది” అని రెండో వాడు జవాబు చెప్పాడు. ఆధారం : పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో…