అనగనగా ఒక కట్టెలుకొట్టే వాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడే వాడు. తెల్లారకుండానే అడవిలోకి వెళ్లి, కట్టెలు కొట్టుకుని, ఊరిలో ఆ కట్టెలు అమ్ముకుని జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. అలా ఉండగా ఒక రోజు కాలవ గట్టున చెట్టు నరుకుతుంటే తన గొడ్డలి నీళ్ళల్లో పడి పోయింది. నీళ్ళల్లో చాలా సేపు గొడ్డలిని వెతుక్కున్నాడు. కానీ లాభం లేక పోయింది. ఎక్కడా గొడ్డలి దొరకలేదు. కాలవ గట్టున కూర్చుని, అయ్యో అని బాధ పడుతూ ఎడిచాడు. రెక్క ఆడనిదే డొక్క ఆడాడు, అన్నట్టు, పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. గొడ్డలి లేకపోతే కట్టెలు కొట్ట లేడు. కట్టెలు కొట్టక పొతే, అవి అమ్మ లేడు. అమ్మక పొతే, డబ్బు ఉండదు. డబ్బు లేకపోతే, కుటుంబమంతా పస్తులు ఉండాలి. ఇవన్నీ తలుచుకుని కళ్ళు మూసుకుని గట్టిగా వన దేవతని ప్రార్థించాడు. ఎలాగైనా గొడ్డలి దొరికేలా చూడు తల్లీ, అని మనసారా మొక్కు కున్నాడు. దేవత ప్రత్యక్షం అయ్యింది. విషయం తెలుసుకుని, నదిలోకి దిగి, ఒక బంగారు గొడ్డలి తీసింది. “ఈ గొడ్డలి నీదా?” అని అతన్ని అడిగింది. అతను, “కాదమ్మా, ఇది నాది కాదు” అని చెప్పాడు. దేవత మళ్ళీ నీళ్ళల్లో దిగి, ఒక వెండి గొడ్డలి తీసింది. “ఈ గొడ్డలి నీదా?” “కాదమ్మా, ఇది కూడా నాది కాదు” అని అతను బదులు చెప్పాడు. ఈ సారి దేవత చాలా సేపు నీళ్ళల్లో వెతికింది. వడ్డున కట్టెలుకొట్టే వాడు చాలా ఖంగారు పడుతున్నాడు. తొందరగా దొరికితే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉండగా, దేవత ఒక మామూలు ఇనుప గొడ్డలి చూపించి, “ఇది నీదా?” అని అడిగింది. సంతోషంతో అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అమ్మయ్య అనుకుని, “అవునమ్మ! ఇదే నాది!” అని అందుకోవడానికి చేతులు జాపాడు. వన దేవత అతని నిజాయితీని మెచ్చుకుని, అతని ఇనుప గోడ్డలు ఒకటే కాక, ఆ బంగారం గొడ్డలి, వెండి గొడ్డలీ కూడా అతని చేతుల్లో పెట్టింది. “నీ నిజాయతీ నాకు నచ్చింది, ఇవి కూడా ఈ రోజు నుంచి నీవే!” అని చెప్పింది. కట్టెలు కొట్టే వాడు కళ్ళకి అద్దుకుని మూడు గోడెల్లూ తీసుకున్నాడు. ఆ రోజు బజారులో ఒక వ్యాపారస్తుడికి వెండి గొడ్డలి, బంగారం గొడ్డలి అమ్మాడు. వచ్చిన సొమ్ముతో కుటుంబ పరిస్థితులు మార్చోవాలనుకున్నాడు. అవి కొనుక్కున్న షావుకారు, “ఇవి నీకు ఎక్కడివి?” అని ఆశ్చర్యంగా అడిగాడు. కట్టెలు కొట్టేవాడు జరిగిందంతా చెప్పాడు. ఆ షావుకారుకి అత్యాశ కలిగింది. వెంటనే అతను కూడా ఒక గొడ్డలి తీసుకుని వెళ్లి, కాలవలోకి విసిరేసి, వన దేవతని ప్రార్థించాడు. వన దేవత ప్రత్యక్షం అయ్యింది. షావుకారు, “నా గొడ్డలి ఏట్లో పడిపోయింది, కొంచం సహాయం చేయి తల్లీ” అని ప్రాధేయ పడ్డాడు. వన దేవత నీళ్ళల్లో దిగి, ముందర లాగానే ఒక బంగారం గొడ్డలి తీసింది. “ఇది నీదా?” అని అడిగింది. ఆ షావుకారు కళ్ళు తిరిగాయి. అంత బహుమూల్యమైన గొడ్డలి కళ్ళెదురుగా కనిపిస్తుంటే, ఉండ పట్టలేక, “అవునమ్మ! ఇది నాదే!” అని అబద్ధం చెప్పాడు. వన దేవతకి కోపం వచ్చింది. “అబద్ధం!” అని మాయం అయిపొయింది. షావుకారుకి కొత్త బంగారం గొడ్డలి దొరకలేదు సరికదా, తెచ్చుకున్న పాతది కూడా కాలవలో ఎక్కడా కనిపించ లేదు. ఇందుకే పెద్దలు ఎప్పుడు నిజం చెప్పమంటారు. నిజం చెప్పే వాళ్ళకీ ఎప్పటికో అప్పటికి మంచి జరుగుతుంది. కానీ అబద్ధం ఆడే వాళ్లకి మట్టుకు ఏదో ఒక రోజు మొదటికే మోసం వస్తుంది. ఆధారం : పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో…