ఇంటర్మీడియట్ తరువాత ఏమిటి? ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవాలన్నా, సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో ఎన్నో యూనివర్సిటీలు పలు కోర్సుల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంటర్ తరువాత ఉపాధి అవకాశాలు కూడా అపారం. ఇంటర్మీడియట్ తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. ఈ రెండిట్లో ఏది అవసరమో ఎంచుకునేందుకు పలు రకాల పరిస్థితులు దోహదం చేస్తాయి. అంత త్వరగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేనివాళ్లు ఉన్నత విద్యవైపు దృష్టి సారిస్తారు. ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉంటే ఉద్యోగంలో చేరడం తప్పనిసరి. కోర్సులు ఇంజినీరింగ్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారిలో ఎక్కువ శాతం మక్కువ చూపేది ఇంజినీరింగ్ పైనే. అందుకే ఏటా ఇంజినీరింగ్కు రహదారి అయిన ఎంసెట్కు లక్షల్లో పోటీ పడుతుంటారు. సీట్లు పెరుగుతున్నా పోటీ మాత్రం తగ్గడంలేదు. ఉన్నతమైన భవిష్యత్తుకు స్థిరమైన బాటను వేస్తున్న ఇంజినీరింగ్ అంటే తల్లిదండ్రుల్లోనూ ఆసక్తి ఎక్కువే. ఇంజినీరింగ్ చేయడానికి జాతీయ, రాష్ట్రస్థాయుల్లో అనేక అవకాశాలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల్లో చదవాలంటే... తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ర్యాంక్ ఆధారంగా ముందు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చి తరువాత మిగతా రాష్ట్రాల వారికి సీట్లు కేటాయిస్తారు. జాతీయస్థాయి పరీక్షలు జాతీయ స్థాయిలో ఐ.ఐ.టి., ఎన్.ఐ.టి., ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్, బిట్స్ లాంటి సంస్థలు అత్యున్నత సాంకేతిక పరికరాలతో, ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఇంజినీరింగ్, మెడికల్, ఇతర డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తున్నాయి. అఖిల భారత స్థాయిలో జరిగే ప్రవేశ పరీక్షల ద్వారా వీటిలో సీటు లభిస్తుంది. జాతీయ స్థాయి పరీక్షలకు... సహజంగా డిసెంబరు- జనవరిలో ప్రకటనలు వస్తాయి. పరీక్షలు ఏప్రిల్, మే జూన్లో జరుగుతాయి. రాష్ట్రస్థాయి పరీక్షలకు ప్రకటనలు జనవరి - ఫిబ్రవరి మధ్య వస్తాయి. పరీక్షలు మే, జూన్లలో ఉంటాయి. అడ్మిషన్లు జూన్, జులైల్లో మొదలవుతాయి. ఎంసెట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరాలంటే ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. మంచి ర్యాంక్ తెచ్చుకుంటే కోరుకున్న కాలేజీలో సీటు వస్తుంది. రాష్ట్రంలో... కొన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో తప్ప ఇంజినీరింగ్ డిగ్రీ చేయాలంటే ఏకైక మార్గం - ఎంసెట్. ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - ఎంసెట్ పూర్తి రూపం. జె.ఎన్.టి.యు. ఎంసెట్ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఇంజినీరింగ్, వ్యవసాయ, వైద్య కళాశాలల్లో చేరవచ్చు. కోర్సులు: 1. బి.ఇ./ బి.టెక్. 2. బి.వి.ఎస్సి. అండ్ ఎ.హెచ్./ బి.ఎస్సి.(అగ్రి)/ బి.ఎస్సి.(హార్టికల్చర్)/ బి.ఎఫ్.ఎస్సి./ బి.టెక్. (ఎఫ్ఎస్.అండ్ టి)/ బి.ఎస్సి. (సి.ఎ.అండ్ బి.ఎం.) 3. ఎం.బి.బి.ఎస్/ బి.డి.ఎస్./ బి.ఎ.ఎం.ఎస్./ బి.హెచ్.ఎం.ఎస్/ బి.ఎన్.వై.ఎస్. 4. బి.ఫార్మా/ బి.టెక్(బయోటెక్నాలజీ), ఫార్మా-డి (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ). అర్హతలు: ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరడానికి ఇంటర్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ చదివి ఉండాలి. ఇతర కోర్సుల్లో చేరేందుకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్... http://www.apeamcet.org/ ఎంసెట్ రాయకపోయినా ఎంసెట్ రాయకపోయినా, సీటు సాధించలేకపోయినా ఇంజినీరింగ్ కలగానే మిగలాల్సిన పనిలేదు. నిజం చేసుకోవచ్చు. మరెన్నో మార్గాలు ఈ కోర్సు చేయడానికి ఉన్నాయి. అనుకోని కారణాల వల్ల ఎంతోమంది ఇంజినీరింగ్ చదవలేకపోతున్నారు. అంతమాత్రాన ఆ లక్ష్యం అక్కడితో ఆగిపోవాల్సిన అవసరంలేదు. ఇంజినీరింగ్తో సమానమైన డిగ్రీని అందించే సంస్థలు ఇంకా అనేకం ఉన్నాయి. వీటిలో ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన విద్యార్థులకు రెగ్యులర్ ఇంజినీరింగ్ డిగ్రీతో సమానమైన గుర్తింపు ఉంది. వీరు అన్ని రకాల పరీక్షలకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. దేశంలో ప్రస్తుతం అనేక సంస్థలు రెగ్యులర్ ఇంజినీరింగ్ కోర్సులతో సమానమైన ప్రత్యామ్నాయ కోర్సులను నిర్వహిసున్నాయి. ఇవి బి.ఇ./ బి.టెక్, డిప్లొమా సర్టిఫికెట్లను ప్రదానం చేస్తున్నాయి. మెకానికిల్ రంగంలో భారతదేశం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన నిపుణులను తీర్చిదిద్దడానికి 1914లో భారత్లో మొట్టమొదట ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా - ఐ.ఎం.ఇ.ఐ.) ఏర్పడింది. తరువాత 1920లో ఆవిర్భవించిన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) వృత్తి నిపుణులను అందించడంలో ప్రముఖ సంస్థగా పేరు గాంచింది. ఈ సంస్థలు అందించే కోర్సుల్లో తమకు నచ్చిన వాటిని విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం విద్యార్థులు తాము చేరదలుచుకున్న కోర్సుకు సంబంధించిన సంస్థలో మొదట తమ పేరు నమోదు చేసుకోవాలి. వీరిని స్టూడెంట్ మెంబర్గా పిలుస్తారు. తర్వాత ఆయా సంస్థలు నిర్వహించే పరీక్షలతోపాటు, ప్రాక్టికల్ పరీక్షల్లో కూడా అర్హత పొందితే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇస్తారు. డిగ్రీ అందుకున్న వారిని 'కార్పొరేట్ మెంబర్'గా గుర్తిస్తారు. పరీక్షల పద్ధతి: సాధారణంగా రెండు భాగాలుంటాయి. ఒక్కోభాగాన్ని సంస్థ నిర్దేశించిన సమయంలో పూర్తిచేయాలి.అభ్యర్థులు అన్ని పేపర్లలో కనీస, సగటు మార్కులు సాధిస్తే సంబంధిత సంస్థ నిబంధనలకు అనుగుణంగా 'అసోసియేటెడ్' హోదా లభిస్తుంది. నిర్ణీత కాలంలో అన్ని పరీక్షల్లో పూర్తి అర్హత సాధిస్తే మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఎం.ఐ.ఇ.)గా గుర్తింపు పొందుతారు. ఈ సంస్థల నిర్వాహకులు ఏవిధమైన స్టడీమెటీరియల్ను అందించరు. సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలను సూచిస్తారు. కొన్ని సంస్థలు తమ ప్రధాన కార్యాలయంలో లైబ్రరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మెటీరియల్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా), ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఇండియా), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా మొదలైన సంస్థలు తమ విద్యార్థులకు స్వయంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. జేఈఈ – మెయిన్, జేఈఈ అఢ్వాన్స్ డ్ భారతదేశం సాంకేతికంగా ఉన్నత స్థానానికి ఎదిగేందుకు నిపుణుల కొరత చాలా ఎక్కువగా ఉంది. మౌలిక వనరులు, ముడి పదార్థాలు పుష్కలంగా ఉన్నా సరైన పద్ధతిలో ఉపయోగించి దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచే మానవ వనరులే తక్కువగా ఉన్నాయి. దీనివల్ల నిర్ణీత అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే చాలా సమయం పడుతోంది. నిపుణులను తీర్చిదిద్దితే దేశ పురోగతి వేగంగా సాగుతుందనే సంకల్పంతో ఐ.ఐ.టి.(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లకు అంకురార్పణ జరిగింది. దేశంలో తొలిసారిగా 1950లో ఖరగ్పూర్లో మొట్టమొదటి ఐ.ఐ.టి.ని ఏర్పాటు చేశారు. తదనంతరం విద్యార్థుల సంఖ్యకు, అవసరాలకు తగినట్లు అనేక ఐ.ఐ.టి.లు వచ్చిచేరాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 ఐ.ఐ.టి.లు పనిచేస్తున్నాయి. అదనంగా బెనారస్ హిందూ యూనివర్సిటీని కూడా ఐ.ఐ.టి.గా మార్చడంతో ఈ సంఖ్య 16కి చేరింది. పాతవి: 1. ఐ.ఐ.టి ఖరగ్పూర్ (http://www.iitkgp.emet.in/) 2. మద్రాస్ (http://www.iitm.ac.in/) 3. ముంబయి (http://www.iitb.ac.in/) 4. కాన్పూర్ (http://www.iitk.ac.in/) 5. న్యూఢిల్లీ (http://www.iitd.ac.in/) 6. గౌహతి (http://www.iitg.ac.in/) 7. రూర్కీ. (http://www.iitr.ac.in/) 2008లో ఏర్పడినవి: 1) హైదరాబాద్; 2) రాజస్థాన్; 3) బీహార్; 4) ఒరిస్సా; 5) హిమాచల్ప్రదేశ్; 6) మధ్యప్రదేశ్ (ఇండోర్); 7) గుజరాత్ (గాంధీనగర్); 8) పంజాబ్ (రూప్నగర్). హిమాచల్ప్రదేశ్, ఇండోర్ సంస్థలు 2009 నుంచి ప్రవేశాలు ప్రారంభించాయి. మిగతా సంస్థలు 2008 నుంచే కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. ఐ.ఐ.టి. కోర్సులు: బి.ఇ., బి.టెక్., బి.ఆర్క్, బ్యాచ్లర్ ఆఫ్ డిజైన్. సీట్లు: 5500 (ఐ.ఐ.టి.లకు చెందినవి 4000 ఉండగా, మిగతావి అనుబంధ సంస్థలకు చెందినవి). అర్హతలు: ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులుండాలి. జేఈఈ – మెయిన్, జేఈఈ అఢ్వాన్స్ డ్ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, తదితర విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల ద్వారా ఆయా సంస్థల్లో సీట్లను భర్తీ చేస్తారు. పరీక్ష విధానం – 2013-14 విద్యా సంవత్సరం నుంచి జేఈఈ రెండు విభాగాలుగా జరుగుతోంది. అవి... జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్. జేఈఈ మెయిన్లో అగ్రస్థానంలో నిలిచిన 1.5 లక్షల మంది అభ్యర్థులను జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అనుమతిస్తారు. ఐఐటీలలో ప్రవేశానికి.. జేఈఈ అడ్వాన్స్డ్లో సంబంధిత కేటగిరీలో ర్యాంకుతోపాటు, అర్హత పరీక్షలో అగ్రశ్రేణిలో నిలిచిన 20 శాతం మంది అభ్యర్థుల్లో ఉంటేనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ 20 శాతం మందిని కూడా కేటగిరీల వారీగా తీసుకుంటారు. ఈ శాతం ఏటా మారవచ్చు, బోర్డులను బట్టి వేర్వేరుగా ఉండొచ్చు. ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర సంస్థల్లో ప్రవేశాల కోసం గతంలో నిర్వహించే ఏఐఈఈఈని జేఈఈ మెయిన్గా భావించవచ్చు. అలాగే గతంలోని ఐఐటీ - జేఈఈ పరీక్షను జేఈఈ అడ్వాన్స్డ్గా అర్థం చేసుకోవచ్చు. ఎన్ఐటీలలో ప్రవేశానికి బోర్డు మార్కులు, జేఈఈ మెయిన్ మార్కుల ఆధారంగా నిర్ధారించిన ఆలిండియా ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటారు. బోర్డు మార్కులకు 40 శాతం, జేఈఈ మెయిన్కు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. కేంద్ర నిధులతో నిర్వహిస్తున్న సంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలకు అనుబంధంగా కొనసాగే కాలేజీలు కూడా జేఈఈ మెయిన్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహించవచ్చు. రాష్ట్రాలు కోరితే, వారి నిబంధనల ప్రకారం వెయిటేజీ కేటాయించి, ప్రత్యేక మెరిట్ లిస్ట్ను తయారుచేస్తారు. ప్రస్తుతానికి గుజరాత్ ఒక్కటే ఇలాంటి మెరిట్ లిస్ట్ కోసం అభ్యర్థించింది. ఇంగ్లిష్, హిందీ భాషల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహిస్తారు. ఏదైనా రాష్ట్రం కోరితే సంబంధిత ప్రాంతీయ భాషలో కూడా ప్రశ్నపత్రం రూపొందిస్తారు. ఆయా రాష్ట్రాలు తమ పరిధిలోని యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ స్కోరును ప్రాతిపదికగా తీసుకుంటేనే ఇది వర్తిస్తుంది. జేఈఈ అడ్వాన్స్డ్ ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటుంది. నాటి పరీక్షలే... ఇంతవరకూ ఉన్న ఏఐఈఈఈ లాగా జేఈఈ-2013 మెయిన్స్ పరీక్ష ఉంది. అలాగే ఇంతవరకూ ఉన్న ఐఐటీ-జేఈఈలాగా జేఈఈ-2013 అడ్వాన్స్డ్ పరీక్ష ఉంది. కాకపోతే జేఈఈ మెయిన్స్ పరీక్ష, జేఈఈ అడ్వాన్స్డ్కు ముఖద్వారం (గేట్వే) అవుతుంది. ఏఐఈఈఈ, ఐఐటీ-జేఈఈలు ఎంతోకాలంగా విద్యార్థులు రాస్తున్న పరీక్షలే కాబట్టి ఇంక ఆందోళన దేనికి? అయితే ఇంటర్మీడియట్ మార్కులకు ప్రాధాన్యం పెరిగిందనేది గమనించాలి. ఈ ఒక్క విషయంలో విద్యార్థులు తగిన జాగ్రత్త తీసుకుంటే ఐఐటీల్లో ప్రవేశం ఏమంత కష్టం కాదు. ప్రవేశపరీక్షలో జరగబోతున్న మార్పులు అర్హతా నిబంధనలకు సంబంధించిన సాంకేతికపరమైనవే కానీ సబ్జెక్టు పరమైనవి కాదు! ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే... 1. ఇంటర్ లేదా సమానమైన బోర్డు పరీక్షలో ఆ సంవత్సరం ఉత్తీర్ణులైన టాప్ 20 పర్సంటైల్ విద్యార్థుల్లో ఉండాలి. 2. జేఈఈ మెయిన్స్లో ర్యాంకు సాధించాలి. అంతేకాకుండా మొదటి లక్షా యాబైవేలమందిలో ఒకడవ్వాలి. 3. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ర్యాంకు సాధించాలి. తుది పరీక్ష అయిన అడ్వాన్స్డ్లో సాధించే ర్యాంకు ఆధారంగానే సీటును కేటాయిస్తారు. మొదటి రెండూ eligibility conditions గానే ఉంటాయి. అంటే జేఈఈ మెయిన్స్ ర్యాంకు, ఇంటర్ మార్కులకు ఐఐటీలో సీటు కేటాయించడంలో ప్రాధాన్యం ఉండదు. అర్హతా నిబంధనల్లో తేడా ఈ పరీక్షలన్నిటికీ చదివే సిలబస్ ఒకటే అయినా బహుముఖ వ్యూహం అవసరం. ఇక్కడ విద్యార్థులు గమనించదగ్గ విషయం ఏమిటంటే- ఎన్ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ; ఐఐటీల్లో ప్రవేశం పొందడానికీ ఉన్న అర్హత నిబంధనల్లో వ్యత్యాసం! ఎన్ఐటీలూ, ఐఐఐటీల్లో ప్రవేశం పొందడానికి బోర్డు పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంస్థల్లో సీటు కేటాయించడం కోసం ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ, జేఈఈ మెయిన్స్ పరీక్ష మార్కులకు 60 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్ మార్కుల వెయిటేజీ నార్మలైజేషన్ జరిగిన తర్వాతే ఉంటుంది. ఐఐటీల్లో సీటు పొందడానికి ఇంటర్ మార్కులతో, జేఈఈ మెయిన్స్ ర్యాంకుతో ప్రత్యక్షంగా సంబంధం లేదు. కానీ జేఈఈ మెయిన్స్లో ఉత్తీర్ణులైనవారిలో మొదటి లక్షాయాబైవేలమందిలో, ఇంటర్లో ఉత్తీర్ణులైనవారిలో టాప్ 20 పర్సంటైల్లో ఉండాలి. ఇవీ అర్హతా నిబంధనలు. వీటిని అర్థం చేసుకుని తగిన ప్రిపరేషన్ వ్యూహం రూపొందించుకోవాలి. సబ్జెక్టుపరంగా ప్రాధాన్యం మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో గణిత, భౌతిక, రసాయన శాస్త్రాలకు సమ ప్రాధాన్యమే ఉంది. అయితే సబ్జెక్టుపరంగా ఆలోచిస్తే- భౌతికశాస్త్రంలోని ప్రశ్నలు మన రాష్ట్ర విద్యార్థులకు కఠినంగా ఉంటాయి. అందుకనే వీరు దీనిపై కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. గణితం స్కోరింగ్ సబ్జెక్టని తెలిసిందే. మంచి ర్యాంకు సాధనకు ఈ సబ్జెక్టును నమ్ముకోవాల్సిందే. మూడో ప్రాధాన్యం రసాయనశాస్త్రానిది. ఎందుకంటే- మిగిలిన రెండు సబ్జెక్టుల్లో ఎక్కువగా కాల్క్యులేషన్ ఆధారిత ప్రశ్నలుంటే దీనిలో కంటెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. కాల్క్యులేషన్లలో పొరపాట్లు జరిగే అవకాశం అధికం. ఇక ఇంటర్ పరీక్షలో కూడా టాప్ 20 పర్సంటైల్లో ఉండాలి కాబట్టి ఈ మూడు సబ్జెక్టులతో పాటు లాంగ్వేజెస్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. జేఈఈ మెయిన్లో రెండు పేపర్లు ఉంటాయి పేపర్ 1: ఇది బీఈ / బీటెక్ కోర్సులకు సంబంధించింది. ఇందులో మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు సమాన వెయిటేజీ ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. పేపర్ 2: ఇది ఆర్కిటెక్చర్ / ప్లానింగ్ కోర్సులకు సంబంధించిన పేపర్. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. అవి... మేథ్స్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, డ్రాయింట్ టెస్ట్. దీని వ్యవధి కూడా 3 గంటలు. ఈ. పరీక్షలో నాలుగు ఆప్షన్లతో కూడిన ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇస్తారు. వీటిలో సరైన సమాధానం ఒకటే ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 1/4 శాతం మార్కును తీసేస్తారు. జేఈఈ మెయిన్ పరీక్షను మూడుసార్లు రాయవచ్చు. వీటిని ఏటా వరుసగా రాయాలి. గత ఏడాది ఏఐఈఈఈ రాసుంటే, ఒక ప్రయత్నం పూర్తయినట్టే. జేఈఈ మెయిన్ను ఆన్లైన్ (కంప్యూటర్ ఆధారితం), ఆఫ్లైన్ (పేపర్, పెన్ను) పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. మెయిన్ పరీక్షకు సంబంధించిన తాజా సమాచారాన్ని(www.jeemain-edu.in) లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి (jeemain2013@gmail.com) కు మెయిల్ చేయవచ్చు. అడ్వాన్స్డ్ పరీక్ష సమాచారం (jee.iitd.ac.in) లో లభిస్తుంది. ఏవైనా సందేహాలుంటే (jeeadv@admin.iitd.ac.in) కు మెయిల్ చేయవచ్చు. ట్రిపుల్ ఐటీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) మార్కెట్కు కావాల్సిన సుశిక్షితులైన మానవ వనరులను తీర్చిదిద్దడానికి ఏర్పడినవే ట్రిపుల్ ఐటీలు (ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). 1998-2000 మధ్య కాలంలో వీటిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి ట్రిపుల్ ఐటీని హైదరాబాద్లోనే నెలకొల్పారు. మొత్తం కేంద్రాలు: 1) ఐ.ఐ.ఐ.టి. హైదరాబాద్ 2) బెంగళూరు 3) ట్రిపుల్ ఐటీ అండ్ మేనేజ్మెంట్, గ్వాలియర్ 4) ఐ.ఐ.ఐ.టి. అండ్ ఎం. కేరళ. 5) పుణే 6) అలహాబాద్ 7) భువనేశ్వర్ 8) ఢిల్లీ 9) ఐ.ఐ.ఐ.టి. డిజైన్ అండ్ మేనేజ్మెంట్, కాంచీపురం 10) ఐ.ఐ.ఐ.టి డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్, జబల్పూర్. హైదరాబాద్, బెంగళూర్ల్లోని ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నడుస్తుంటే, మిగతావి మొత్తంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అందుకనే ఈ రెండు సంస్థలు 2004-05 సంవత్సరం నుంచి పూర్తిస్థాయి యూనివర్సిటీలుగా మారిపోయాయి. యు.జి.సి. సలహా ప్రకారం వాటి పేరును 'ఇండియన్ ఇన్స్టిట్యూట్స్' నుంచి 'ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్'గా మార్చుకున్నాయి. వీటిలో చేరడానికి కూడా ఎ.ఐ.ఇ.ఇ.ఇ. రాయాల్సిందే. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నవంబర్, డిసెంబర్లలో ప్రకటనలు వెలువడతాయి. ఇవి కాకుండా రాష్ట్రంలో మరో మూడు ట్రిపుల్ ఐటీలు బాసర, నూజివీడు, ఇడుపులపాయల్లో ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి పదో తరగతి సరిపోతుంది. ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా 1948లో ఏర్పడిన ఈ సంస్థ అసోసియేట్ మెంబర్ షిప్ ఎగ్జామ్ ఇన్ ఏరోనాటికల్ సోసైటీ ఆఫ్ ఇండియా (ఎ.ఎం.ఎ.ఇ.ఎస్.ఐ)' నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తోంది. ఇది బి.టెక్.(ఏరోనాటికల్ ఇంజినీరింగ్)తో సమానం. అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులుండాలి. ప్రతి సంవత్సరం రెండుసార్లు అసోసియేట్ మెంబర్షిప్ పరీక్ష నిర్వహిస్తోంది. దీన్లో రెండు సెక్షన్లు (ఎ, బి) ఉంటాయి. సెక్షన్-ఎ: మొత్తం 10 కంపల్సరీ పేపర్లు ఉంటాయి. అన్నీ తప్పనిసరిగా రాయాలి. సెక్షన్-బి: సెక్షన్-ఎ పాసైనవారు మాత్రమే ఈవిభాగానికి అర్హులు. పరీక్షలు ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. అన్ని పేపర్లలో అర్హత పొందిన వారిని ఎ.ఎం.ఎ.ఇ.ఎస్.ఐ.గా గుర్తిస్తుంది. చిరునామా: The Programme Director 'AD'. DRDL Complex, PO. Kanchanbagh, Hyderabad-058 http://www.aesi-hyd.com/ ఐ.ఇ.టి.ఇ ఇన్స్టిట్యూషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐ.ఇ.టి.ఇ.) 1953లో ఏర్పడింది. ఈ సంస్థ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడే నిపుణులను అందించేందుకు కృషి చేస్తోంది. ఈ సంస్థ రెండు రకాల పరీక్షలను నిర్వహిస్తోంది. 1. డిప్లొమా మెంబర్ ఐ.ఇ.టి.ఇ. ( ఈ పరీక్షకు టెన్త్ రాసిన వారు హాజరు కావచ్చు) 2. అసోసియేట్ మెంబర్ (ఎ.ఎం.ఐ.ఇ.టి.ఇ): అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ అనేది ఎ.ఎం.ఐ.ఇ.టి.ఇ. పూర్తి రూపం. దీన్నే గ్రాడ్యుయేట్షిప్ ఎగ్జామ్గా కూడా పిలుస్తారు. సిలబస్ను 2009లో మార్చారు. 2009 జూన్ నుంచి కొత్త సిలబస్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అర్హతలు: ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. లేదా ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ చదువుతూ ఉండాలి. వయసు 16 సంవత్సరాలు నిండి ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ ఐ.ఇ.టి.ఇ చేసి, వయసు 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఈ పరీక్ష పాసైతే అసోసియేట్ మెంబర్షిప్కు అర్హత పొందుతారు. పరీక్షలో సెక్షన్- ఎ,సెక్షన్-బిలు ఉంటాయి. అభ్యర్థులు సెక్షన్-'ఎ'లోని అన్ని సబ్జెక్టులను ఒకేసారి రాయాల్సి ఉంటుంది. సెక్షన్-బి పరీక్షకు హాజరుకావాలంటే సెక్షన్-ఎలో కనీసం అర్హతగా పేర్కొన్న పేపర్లు పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండు సంవత్సరాలపాటు ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తి చేసి ఉండాలి. పరీక్షలు జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. పరీక్షల్లో అర్హత సాధించి ప్రాక్టికల్ శిక్షణ కూడా పూర్తిచేసిన వారికి ఎ.ఎం.ఐ.ఇ.టి.ఇ. సర్టిఫికెట్ ఇస్తారు. ఇది రెగ్యులర్ విధానంలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ కోర్సుతో సమానం. ఈ మెంబర్షిప్ సాధించిన వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో సూపర్వైజర్ పోస్టులకు, తత్సమాన స్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్లో... ఐ.ఇ.టి.ఇ. కేంద్రాన్ని 1973 లో ఉస్మానియా క్యాంపస్లో ఏర్పాటుచేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేసేందుకు తగిన సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. సబ్జెక్టుల్లో అనుభవం గడించిన వారు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. చిరునామా: IETE, Hyderabad Centre, Near O.U. Post Office, Osmania University Campurs, Hyd-500007. www.ietehyd.org, www.iete.info మెడిసిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అద్భుత ఫలితాలతో ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతోంది. నిన్నటివరకూ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం కొత్తది అనుకుంటే, నేడు బిగ్బ్యాంగ్ సిద్ధాంతం నూతన సిద్ధాంతాలకు ఆధారం అంటున్నారు. 1960లో అర్ధవాహక పరికరాలతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 20వ శతాబ్దాన్ని అర్ధవాహక శతాబ్దంగా అభివర్ణించారు. అలాగే 21 శతాబ్దాన్ని బయాలజీ శతాబ్దంగా వర్ణించవచ్చు. కంప్యూటర్, కమ్యూనికేషన్స్ రంగాల్లో వస్తున్న మార్పులు నేడు ఒక సంతృప్తికర స్థాయికి చేరాయి. ఇంతవరకు మెడికల్ విభాగానికి సంబంధించి పరిశోధనలు జరిగింది ఇల్నెస్ విభాగంలో మాత్రమే. అంటే ఒక వ్యాధి, దాని నిర్ధారణ, తగ్గించే విధానమనే చెప్పాలి. రాబోయేది వెల్నెస్ విభాగం. అంటే ఇక నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మ్యాటిక్స్లదే రాజ్యం. ఇదే ఈ శతాబ్దపు రిసెర్చి విభాగం. బయాలజీ విద్యార్థులకు (ఇంటర్ బై.పి.సి) రాష్ట్రంలో ఎంసెట్ ద్వారా, జాతీయ స్థాయిలో అఖిల భారత స్థాయి ప్రవేశ పరీక్షల ద్వారా అనేక కోర్సులు లభిస్తున్నాయి. వైద్య విద్య అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఎంబీబీఎస్. ఎంసెట్ రాస్తే... మంచిర్యాంకు వస్తే... తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ పూర్తిచేయవచ్చు. కానీ ఎంసెట్ రాయకపోయినా, మంచి ర్యాంకు రాకపోయినా వైద్య వృత్తిలో చేరాలనే లక్ష్యాన్ని మార్చుకోవాలా? అవసరంలేదు . మరికొన్ని మార్గాల్లో మరెన్నో కోర్సులు ఉన్నాయి. వాటిని పూర్తిచేసి వైద్యవృత్తిలో చేరి ప్రజలకు సేవచేయవచ్చు. ప్రధానంగా బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ లాంటి సంప్రదాయ కోర్సులతోపాటు ఆప్టోమెట్రీ, మెడీకల్ ల్యాబ్ టెక్నాలజీ, ఆక్యుపేషనల్ థెరెపీ, ఫిజియోథెరపీ లాంటి ఆధునిక చదువులు కూడా ఉన్నాయి. అభ్యర్థులు ఆయా ప్రకటనలు వెలువడినప్పుడు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత విద్యావకాశాలు: ఎంసెట్తో డిగ్రీ చేసి ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారికి లభిస్తున్న విద్యావకాశాలు ఇలా ఉన్నాయి. 1. ఎం.డి (డాక్టర్ ఆఫ్ మెడిసిన్) 2. ఎం.ఎస్ (మాస్టర్ ఆఫ్ సర్జరీ) 3. డి.ఎం/ఎం.కెమి. మెడిసిన్లో సూపర్స్పెషాలిటీ ప్రోగ్రామ్ 4. ఫోరెన్సిక్ మెడిసిన్లో పి.జి. ప్రోగ్రామ్. 5. ఏరోస్పేస్ మెడిసిన్ 6. ఏవియేషన్ మెడిసిన్ 7. డెర్మటాలజీ 8. పీడియాట్రిక్ 9. సైకియాట్రి.... ఇవి కొన్నిమాత్రమే. అభ్యర్థులు ఎంచుకున్న స్పెషలైజేషన్ల ఆధారంగా పి.జి. లేదా పి.జి డిప్లొమా తదితర కోర్సుల్లో చేరవచ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), ఇతర రాష్ట్రాల యూనివర్సిటీలు ప్రవేశ పరీక్షల ద్వారా మాత్రమే చేర్చుకుంటాయి. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు జాతీయస్థాయిలో ఎయిమ్స్, జిప్మర్ లాంటి సంస్థలు ఏటా డిసెంబరు మొదలు మార్చి వరకు ప్రవేశ ప్రకటనలు జారీ చేస్తాయి. ఎయిమ్స్ ప్రవేశ పరీక్ష సాధారణంగా జూన్ లో జరుగుతుంది. జిప్మర్ జూన్ మొదటివారంలో, ఎఎఫ్ఎంసి మే మొదటివారంలో నిర్వహిస్తాయి. ఎం.బి.బి.ఎస్. బ్యాచ్లర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచ్లర్ ఆఫ్ సర్జరీ అనేది ఎం.బి.బి.ఎస్.కు సంక్షిప్త రూపం. ఎం.బి.బి.ఎస్. డిగ్రీ చేస్తేనే డాక్టర్ అవుతారు. సమాజంలో డాక్టర్కు వృత్తిపరంగా ఎనలేని గౌరవం లభిస్తోంది. అంకితభావంతో కోర్సును పూర్తిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. కాలవ్యవధి: నాలుగున్నర సంవత్సరాలు. ఏడాదిపాటు ఇంటర్న్షిప్ చేయాలి. డాక్టర్ కావడమే లక్ష్యంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బై.పి.సి.లో చేరుస్తున్నారు. ఒకసారి డాక్టర్గా కెరీర్ ప్రారంభిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరంలేదు. భారతదేశంలో మొత్తం మెడికల్ కాలేజీలు 450 ఉండగా, వీటిలోని సీట్ల సంఖ్య దాదాపు 30000. ఈ సీట్ల కోసం ప్రతి సంవత్సరం ప్రయత్నిస్తున్న విద్యార్థుల సంఖ్య సుమారు లక్షకు పైగా ఉంటుంది. అంటే పోటీ 1 : 3 గా చెప్పవచ్చు. జాతీయ స్థాయిలో... AIIMS, JIPMER, AFMC, CMC, MGIMS, BHU మొదలైన ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశం కోసం ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. రాష్ట్రంలో... మన రాష్ట్రం విషయానికొస్తే మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ రాయాల్సిందే. 'ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్' అనేది ఎంసెట్ పూర్తి రూపం. ఈ పరీక్ష రాస్తే రాష్ట్రంలోని 33 కళాశాలల్లో ఎక్కడైనా చేరవచ్చు. నాలుగేళ్ల క్రితం ప్రతి మెడికల్ సీటుకీ కనీసం 100 మంది వరకు పోటీపడుతుండేవారు. ఈ పోటీ ఇప్పుడు చాలా తక్కువగా ఉంటోంది. ఎంసెట్ మెడికల్ విభాగపు పరీక్షకు గతంలో లక్షకు పైగా హాజరయ్యేవారు. అది ఇప్పుడు దాదాపు 30 వేలకు తగ్గింది. ప్రస్తుతం లభిస్తున్న ఎం.బి.బి.ఎస్. సీట్లు: 4400. అంటే పోటీ దాదాపు 1:6 మాత్రమే ఉంటోంది. పోటీ ఎంత తగ్గిందో ఊహించుకోవచ్చు. కాబట్టి విద్యార్థి లేదా తల్లిదండ్రులు 6 సంవత్సరాల తర్వాత అధిక ప్రాధాన్యం ఉన్న విభాగం ఏది అవుతుందో దాన్ని నేడు ఎంపిక చేసుకోగలగాలి. అప్పుడే ఆ విద్యార్థి భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుందని పేర్కొనవచ్చు. పారామెడికల్ వైద్య రంగంలో సేవలు అందించే వారిలో డాక్టర్లు, నర్సులతో పాటు పారామెడికల్ సిబ్బంది కూడా ముఖ్యమైన మానవ వనరులే. ల్యాబ్ లలో రక్తపరీక్షలు, ఎక్స్ రే, స్కానింగ్, తదితర విధులను నిర్వహించడదనికి ఆయా విభాగాల్లో అనుభవం కలిగిన సిబ్బంది కావాలి. వీరే పారామెడికల్ సిబ్బంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పారామెడికల్ ఇన్ స్టిట్యూట్లలో అనేక రకాల పారామెడికల్ కోర్సులను ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డు నిర్వహిస్తోంది. రెండేళ్ల కాలవ్యవధి కోర్సులు: మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, ఆప్టోమెట్రీ టెక్నీషియన్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, రేడియోథెరపీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ తదితర సబ్జెక్టులు. సంవత్సరం కాలవ్యవధి కోర్సులు: కార్డియాలజీ టెక్నీషియన్ ఇ.సి.జి. టెక్నీషియన్, కాథ్ లాబ్ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్, రేడియో గ్రాఫిక్ అసిస్టెంట్ మొదలైనవి. ప్రకటనలు మే, జూన్ లో వెలువడుతుంటాయి. ఇంటర్ తత్సమానం పాసైనవారు అర్హులు, ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. చిరునామా: ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు, రూమ్ నెం. 306, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్, కేంద్రీయ సదన్ వెనుక, కోఠి, హైదరాబాద్ - 500095. వెబ్ సైట్: www.appmb.org భవిష్యత్తు: పారామెడికల్ కోర్సులు చేసినవారు అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు, పరిశోధనశాలల్లో సంబంధిత విభాగంలో టెక్నీషియన్లుగా, అసిస్టెంట్ లుగా చేరవచ్చు. ఫార్మా-డి ఫార్మాస్యూటికల్ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని, క్లినికల్, రిసెర్చ్ రంగాల్లో నిపుణులను తయారుచేయడానికి వీలుగా ఈ కోర్సును రూపొందించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సే ఫార్మా-డి. ప్రవేశం: ఎంసెట్ ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. కాలవ్యవధి: ఆరు సంవత్సరాలు. మూడు సంవత్సరాల కాలేజీ చదవాలి. రెండు సంవత్సరాలు ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. చివరి సంవత్సరం పరిశోధన. 2008లో ఫార్మా-డి కోర్సును ప్రారంభించారు. దేశంలో 25కు పైగా కాలేజీల్లో ఈ కోర్సు ఉంది. ఆంధ్రప్రదేశ్లో 15 కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఒక్కొక్క కాలేజీకీ కేవలం 30 సీట్లు మాత్రమే కేటాయించారు. వీటిలో 50 శాతం సీట్లను ఎం.పి.సి. విద్యార్థులకు, మరో 50 శాతం సీట్లను బై.పి.సి. విద్యార్థులకు ఇస్తారు. ఫార్మా రంగంలో ప్రవేశించేవారికి రాబోయే కాలంలో విశేషమైన కెరీర్ ఉంటుంది. బి.డి.ఎస్. రాష్ట్రంలో ఎంసెట్ రాసే వారిలో ఎక్కువమంది ఎం.బి.బి.ఎస్. వైపు మొగ్గుచూపుతారు. తరువాతే మిగిలిన వాటివైపు దృష్టి సారిస్తారు. వాటిలో మొదటి ప్రాధాన్యం బి.డి.ఎస్.కే దక్కుతోంది. బ్యాచ్లర్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అనేది బి.డి.ఎస్.కు పూర్తి రూపం. కోర్సు కాలవ్యవధి: నాలుగున్నర సంవత్సరాలు. ఏడాదిపాటు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 1340కి పైగా సీట్లున్నాయి. బి.డి.యస్.లో అనాటమీతోపాటు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ సబ్జెక్టులను నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. డెంటిస్ట్రీలో ఆర్థోడెంటిక్స్, డెంటో-ఫేషియల్ ఆర్థోపిడిక్స్, డెంటల్ పబ్లిక్ హెల్త్ ఎండోడెంటిక్స్, ఆర్థోపిడిక్స్, పీరియాడెంటిక్స్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎం.డి.ఎస్.కూడా చేస్తే అవకాశాలు బాగా ఉంటాయి. కామర్స్ ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూపులకే కాదు; ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూపులకు కూడా మంచి ఉపాధి అవకాశాలున్నాయి. కానీ మనరాష్ట్రంలో ఇంజినీర్ / డాక్టర్ మోజుతో ఎక్కువమంది సైన్సు గ్రూపులనే ఎంచుకుంటున్నారు. కామర్స్, ఆర్ట్స్ల్లో చేరటానికి ఆసక్తి చూపించే విద్యార్థుల సంఖ్య కొద్ది సంవత్సరాలుగా పెరుగుతూవస్తోంది. ఈ నేపథ్యంలో వీరు ప్రవేశించగలిగే విభిన్న కెరియర్ మార్గాలను సమగ్ర కథనం! మనరాష్ట్రంలో ఇటీవలికాలంలో ఎక్కువమంది మొగ్గు చూపుతున్న సైన్సేతర గ్రూపు- ఎంఈసీ. అవగాహన పెరుగుతున్నప్పటికీ విద్యార్థుల సంఖ్యాపరంగా అది అంతగా ప్రతిఫలించటం లేదు. రాష్ట్రం మొత్తమ్మీద ఈ గ్రూపులో ఇంటర్ పూర్తిచేసే విద్యార్థులు ముప్పై వేలు దాటడంలేదు. వీరిలో అధికశాతం సీఏ లాంటి కోర్సులకు ఉత్సాహం చూపుతున్నారు. గతంలో కంటే సీఏ ఫైనల్ ఉత్తీర్ణత 25-30 శాతం వరకు పెరిగి, 2013లో మళ్లీ 5-7 శాతానికి పడిపోయింది. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూడాల్సివుంది. కామర్స్ విభాగం అనగానే గతంలో ఎక్కువగా విద్యార్థులు అకౌంటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ మొదలైన శాఖల్లోకి వెళ్లేవారు. అయితే ఇప్పుడు సాంప్రదాయిక బీకాం రూపంలో అంటే బీకాం (ఎకౌంటెన్సీ)/ బీకాం (మేనేజ్మెంట్)ల నుంచి కొత్త స్పెషలైజేషన్ రూపంలోకి డిగ్రీలు మారుతున్నాయి. ఉదాహరణకు బీఏఎఫ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎకౌంటింగ్ & ఫైనాన్స్), బీబీఐ (బ్యాచిలర్ ఇన్ బ్యాంకింగ్ & ఇన్స్యూరెన్స్), బీఎఫ్ఎం (బ్యాచిలర్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్). ఈ విధమైన డిగ్రీలు నేటి సమాజానికి అవసరం కాబట్టి ప్రాచుర్యం ఈ రూపంలో ఎక్కువగా ఏర్పడుతోంది. అయితే ఈ తరహా కోర్సులకు ఎంపీసీ విద్యార్థులు కూడా అర్హులే కాబట్టి అధికశాతం సీట్లను వారే కైవసం చేసుకుంటున్నారు. ఈ విధంగా డిగ్రీలు పూర్తిచేసినవారికి కూడా 2.5 లక్షల నుంచి 8.5 లక్షల వరకు (సగటున ఏడాదికి 3.5 లక్షల వరకు) వేతనాల అవకాశం ఏర్పడుతోంది. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) శరవేగంగా మారుతున్న వ్యాపార లావాదేవీలను దృష్టిలో ఉంచుకుని, వర్తమాన మానవ అవసరాలను పరిగణనలోకి తీసుకుని అధికశాతం విద్యార్థులు సీఏ వైపు అడుగులు వేస్తున్నారు. ఇంటర్మీడియట్ సీఈసీ, ఎంపీసీ విద్యార్థులు గత 5- 10 సంవత్సరాలుగా ఈ కోర్సు వైపు మొగ్గు చూపుతున్నారు. సీఏ చేయడానికి మొదట సీపీటీ (కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్)ను రాయాల్సి ఉంటుంది. ఇది మన ఎంసెట్ లాంటిదని చెప్పవచ్చు. 2012 నుంచి డిగ్రీ స్థాయిలో కామర్స్ విభాగంలో 55 శాతం, ఇతర డిగ్రీ విభాగాల్లో 60 శాతం మార్కులు సాధించినవారికి సీపీటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే వారు మొదటి దశ అయిన ఐపీసీసీకి నమోదు చేసుకోవచ్చు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు మొదట సీపీటీలో కనీస అర్హత మార్కులు సాధించాలి. ఇంటర్ తర్వాత 60 రోజులకు సీపీటీకి అర్హత సాధిస్తారు. ఈ పరీక్ష ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతుంది. సీఏ కోర్సుకు తొలిమెట్టయిన సీపీటీలో 4 పేపర్లుంటాయి. దీనికి 9 నెలల శిక్షణ ఉంటుంది. ఈ సీపీటీలో అర్హత సంపాదించాలంటే ప్రతి సెక్షన్లో కనీసం 30 శాతం మార్కులు సాధిస్తూ అన్నీ కలిపి 50 శాతం మార్కులు సాధించాలి. పరీక్ష 200 మార్కులకు జరుగుతుంది కాబట్టి కనీసం 100 మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్లు. ప్రతి సెక్షన్లో 30 శాతం మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు- ఈ రెండింటిలో ఏది పొందలేకపోయినా ఈ పరీక్ష తప్పినట్లే. మళ్లీ తర్వాత జరిగే సీపీటీకి తయారుకావాల్సివుంటుంది. సీపీటీ పరీక్ష విధానం సీపీటీ రెండు విభాగాలుగా ఉండి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. ఒక్కో విభాగం మళ్లీ 2 సెక్షన్లతో ఉంటుంది. ఇక్కడ గమనించదగ్గ అంశం- నెగెటివ్ మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులను మొత్తం మార్కుల నుంచి తగ్గిస్తారు. డిసెంబర్- 2012లో 194, జూన్- 2013లో 194, డిసెంబర్- 2013లో 191 అత్యధిక మార్కులను విద్యార్థులు సాధించారు. మొత్తమ్మీద డిసెంబర్ 2013లో సాధించిన 37.61 శాతం గత 5 సంవత్సరాల్లో పదిసార్లు జరిపిన పరీక్షల్లో ఎక్కువ శాతం అని చెప్పవచ్చు. ఈ కోర్సుకు ప్రాముఖ్యం పెరిగిందనడానికి మరో తార్కాణం పరీక్ష కేంద్రాలు. మొదట 310 ఉండే పరీక్ష కేంద్రాలను ప్రస్తుతం 390గా పెంచారు. ఆ తర్వాత... ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు (ఐపీసీసీ). ఇది సీఏ కోర్సులో రెండో దశ. సీపీటీ పూర్తి చేసినవారు దీనికి తమ పేరు నమోదు చేసుకోవాలి. దీనిలో గ్రూప్-1, గ్రూప్-2 ఉంటాయి. ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు కూడా. ఈ స్థాయికి కూడా 9 నెలల శిక్షణ ఉంటుంది. కనీసం విద్యార్థి ఒక్క గ్రూపు పాసైనా చాలు. అసిస్టెంట్షిప్ (ఫైనల్ దశ) అభ్యర్థి ఐపీసీసీ గ్రూపులో అర్హత సంపాదించిన తర్వాత మూడు సంవత్సరాల ఆర్టికల్షిప్ కోసం దరఖాస్తు చేసుకుని చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్షిప్ చేయాలి. రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఐపీసీసీ గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు రాసి అర్హత పొందాలి. మిగిలిన 6 నెలల కాలంలో ఆర్టికల్షిప్ను పూర్తిచేయాలి. 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా' (ఐసీఏఐ) దేశం మొత్తం మీద నిర్వహించే ఈ తుది పరీక్ష ఉత్తీర్ణత శాతం బహుస్వల్పంగా ఉంటుంది. సీఏ (ఫైనల్) నవంబర్- 2013 పరీక్ష ఫలితాలు గమనిస్తే 5.73 శాతం మాత్రమే. తుది పరీక్షలో సర్టిఫికెట్ పొంది సంస్థలో సభ్యుడిగా పేరు నమోదు చేసుకోవాలి. అప్పటి నుంచి అభ్యర్థి చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)గా పూర్తి అధికారిక హోదాలో ఏదైనా కంపెనీలో చేరవచ్చు/ కన్సల్టెన్సీని నెలకొల్పుకోవచ్చు. దీనిలో భాగంగా 35 గంటల ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను 100 గంటల కంప్యూటర్ శిక్షణను కూడా పొందాలి. ఈ కోర్సును అభ్యసించిన అభ్యర్థులు ఆడిటర్లుగా, టాక్స్ కన్సల్టెంట్లుగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లుగా బహుళజాతి సంస్థల్లో పనిచేయవచ్చు.. బ్యాంకింగ్, ఫారెక్స్ (ఫారెన్ ఎక్స్ఛేంజ్) మార్కెట్లలో కన్సల్టెంట్లుగా కూడా వ్యవహరించవచ్చు. న్యాయవిద్య చార్టర్డ్ అకౌంటెన్సీ తర్వాత అత్యధిక శాతం విద్యార్థులు ఆసక్తి చూపుతున్నది- న్యాయవిద్య. ఈ కోర్సు అభ్యసించదలిచిన విద్యార్థులు మొదట ఆలోచించేది LSAT (లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్)- దీనిలో దాదాపు 10 విశ్వవిద్యాలయాలున్నాయి. దీని తర్వాత CLAT (కామన్ లా అడ్మిషన్ టెస్ట్). ద్వారా నల్సార్ లాంటి లా స్కూళ్లలో ప్రవేశం దొరుకుతుంది. ఈ విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్యార్థుల కంటే కూడా మంచి భవిష్యత్తుకు అవకాశం ఉంది. క్లాట్ 200 ప్రశ్నలతో 200 మార్కులకు 2 గంటల కాలవ్యవధిలో జరుగుతుంది. దీనిలో 5 విభాగాలున్నాయి. వీటిలో 50 మార్కులతో జరిగే లీగల్ ఆప్టిట్యూడ్కు అధిక ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది. మొత్తం 1600 పైగా సీట్లు ఉన్నప్పటికీ మన రాష్ట్ర విద్యార్థులు హైదరాబాద్లో ఉన్న 70 సీట్లకే ప్రాధాన్యం ఇస్తుంటారు. - పి.వి.ఆర్.కె. మూర్తి, చైర్మన్, శ్రీ గాయత్రి విద్యాసంస్థలు. మేటి ఆర్ట్స్ బాటలు ఇంటర్లో ఆర్ట్స్ గ్రూపు చదివిన విద్యార్థులు ఎంచుకునేందుకు ఎన్నెన్నో వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాటలో కొనసాగినవారి భవిత ఉజ్వలంగా ఉంటుందని ఇప్పటికే ఎందరో నిరూపించారు. ఆ వృత్తివిద్యా కోర్సుల్లో కొన్ని ప్రధానమైనవి స్థూలంగా ... ఆంత్రప్రెన్యూర్షిప్ ఈ రోజుల్లో అందరూ ఉద్యోగం చేయాలనే కోరుకోరు. కొందరు స్వయంగా వ్యాపారాన్ని చేయాలనుకుంటారు. అయితే ఏం చేయాలన్నా ఆ బిజినెస్ను ప్రారంభించేముందు అందులోని కష్టనష్టాలు ఏమిటి, వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటారు. అటువంటి ఔత్సాహికులకు ఈ కోర్సు ఎంతగానో ఉపకరిస్తుంది. అటువంటి ఆంత్రప్రెన్యూర్షిప్ కోర్సును అందించే ఇన్స్టిట్యూట్లలో కొన్ని... ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, హైదరాబాద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రప్రెన్యూర్షిప్, గౌహతి ఆంత్రప్రెన్యూర్షిప్ & మేనేజ్మెంట్ ప్రాసెస్ ఇంటర్నేషనల్, ఢిల్లీ సింబయోసిస్ యూనివర్సిటీ, పూణే ది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, ఢిల్లీ అమితి బిజినెస్ స్కూల్, నోయిడా ఆంత్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, గాంధీనగర్ శేషాద్రిపురం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, బెంగళూర్ కళ్యాణ్ మహావిద్యాలయ, దుర్గ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రప్రెన్యూర్షిప్ & మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇటీవలి కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఎందరినో ఆకట్టుకుంటోంది. దీన్ని ఎంపిక చేసుకున్నవారికి ఉజ్వల భవిత ఉంటుందని ఎందరో ఫ్యాషన్ డిజైనర్లు నిరూపిస్తున్నారు. ఈ వృత్తివిద్యా కోర్సును ఎంపిక చేసుకునేవారికి ముఖ్యంగా గార్మెంట్ రంగంలో మంచి అవకాశాలుంటాయి. సృజనాత్మకత ఉన్నవారు ఈ కోర్సులో రాణిస్తారు. వివిధ సంస్థలు ఈ శిక్షణను డిప్లొమా కోర్సులనీ, గ్రాడ్యుయేట్ లెవెల్ కోర్సులనీ, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులనీ- ఇలా వివిధ స్థాయుల్లో ఇస్తున్నాయి. ఆయా కోర్సులను పూర్తిచేసినవారు గార్మెంట్ డిజైన్ టెక్నాలజీని, మాన్యుఫాక్చరింగ్ పరిజ్ఞానాన్ని పొంది ఫ్యాషన్ డిజైనర్లుగా అవతరించి ఉన్నత స్థానంలో నిలుస్తారు. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణను మనదేశంలో ఇచ్చే కొన్ని సంస్థలు... నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) పెరల్ అకాడమీ ఆఫ్ ఫ్యాషన్ (పీఏఎల్) సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎస్ఐడీ) నార్త్రన్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఐఎఫ్టీ) ఎస్ఎన్డీటీ ప్రేమ్లీల విఠల్దాస్ పాలిటెక్నిక్ ఆడియో విజువల్ మీడియా ఆడియో విజువల్ మీడియా కోర్సులు నేడు ఎంతగానో ప్రాచుర్యం పొందుతున్నాయి. జర్నలిజం, ఫిల్మ్మేకింగ్, మీడియా ప్రమోషన్, బ్రాండ్ ప్రమోషన్, ఫొటోగ్రఫీ, మీడియా సర్వీస్- ప్లానింగ్ ఇలాంటివే. ఈ కోర్సులను పూర్తిచేసినవారికి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో, సినిమా రంగంలో ఆడియో విజువల్ నిపుణులుగా అవకాశాలుంటాయి. ఈ కోర్సులను అందించే సంస్థల్లో కొన్ని... డా. అంబేద్కర్ మరఠ్వాడా యూనివర్సిటీ, ఔరంగాబాద్ ఫిల్మ్& టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూణే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, దెంకనాల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, న్యూఢిల్లీ మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్, జామియా మిల్లా ఇస్లామియా, న్యూఢిల్లీ ఎంఎస్ యూనివర్సిటీ, వడోదర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్ రవీంద్రభారతి యూనివర్సిటీ, కోల్కత రూపం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, జైపూర్ సత్యజిత్ రే ఫిల్మ్ & టెలివిజన్ ఇన్స్టిట్యూట్, కోల్కత సింబయోసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, పూణే యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, మైసూర్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, జైపూర్ విదేశీ భాషలు బహుళజాతి సంస్థల్లో కొన్ని తమ వ్యాపార కార్యకలాపాలను ఒక్క మనదేశంలోనే గాకుండా విదేశాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటాయి. అందువల్ల ఆయా దేశాల్లో తమ సంస్థ ప్రతినిధులుగా ఆ దేశ భాష వచ్చినవారికే ప్రాధాన్యమిస్తాయి. అటువంటి ప్రతినిధులకు ఆయాదేశ భాషల్లో శిక్షణను ఇచ్చేందుకు ఫారెన్ లాంగ్వేజ్ కోర్సులు ఎంతగానో ఉపకరిస్తాయి. ఆసక్తిగలవారికి ఆయా ఇన్స్టిట్యూట్లు స్పానిష్, ఫ్రెంచ్, జపనీస్ వంటి భాషా కోర్సులను అందిస్తుంటాయి. అటువంటి కోర్సులను అందించే సంస్థల్లో కొన్ని.. ఈఎఫ్ఎల్యూ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ & ఫారెన్ లాంగ్వేజెస్), హైదరాబాద్ స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, న్యూఢిల్లీ భారతీయ విద్యాభవన్, జవహర్లాల్ నెహ్రూ అకాడమీ ఆఫ్ లాంగ్వేజెస్, న్యూఢిల్లీ జపనీస్ ఇన్ఫర్మేషన్ & కల్చరల్ సెంటర్, న్యూఢిల్లీ రామకృష్ణ మిషన్, కోల్కత అలియన్స్ ఫ్రాంచైజ్ (భారత్లో 15 నగరాల్లో ఉన్నాయి). రాజస్థాన్ యూనివర్సిటీ, జైపూర్ ముంబై, కోల్కత, న్యూఢిల్లీ, చెన్నైల్లోని మ్యాక్స్ములర్ భవన్ పూణే యూనివర్సిటీ, పూణే ఇండో ఇటాలియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ముంబై బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి ఇవెంట్ మేనేజ్మెంట్ సంపన్నులు తమ ఇంట పుట్టినరోజు, నిశ్చితార్థం, వివాహ మహోత్సవం, వార్షికోత్సవం వంటి ఏ శుభకార్యం జరుపుకోవాలన్నా- కార్పొరేట్ సంస్థలవారు తమ సంస్థ వార్షికోత్సవం, ఉత్పత్తి ఆరంభం, విజయోత్సవం... ఇలా ఏది జరుపుకోవాలన్నా ఇవెంట్ మేనేజ్మెంట్ సంస్థలపై ఆధారపడుతున్నారు. ఖర్చు కాస్త ఎక్కువైనప్పటికీ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకూ అన్నీ వారే దగ్గరుండి ఏ అపశ్రుతీ, ఆటంకం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు బాధ్యత వహిస్తారు. సమయం కూడా సద్వినియోగం అవుతుంది. ఇవెంట్ మేనేజ్మెంట్ వారికి దేశవిదేశాల కంపెనీల నుంచి అవకాశాలు వస్తుంటాయి. తద్వారా ఆదాయంతో పాటు గౌరవం, గుర్తింపు కూడా లభిస్తాయి. అందువల్లనే ఇవెంట్ మేనేజ్మెంట్ వారికి అంతటి ప్రాధాన్యం. దీంతో యువత ఇవెంట్ మేనేజ్మెంట్ కోర్సులపై ఆకర్షితులవుతోంది. ఈ కోర్సులను మనదేశంలో అందించే ఇన్స్టిట్యూట్లలో కొన్ని... అమితి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇవెంట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం & ఫ్యూచర్ మేనేజ్మెంట్ ట్రెండ్స్ (ఐటీఎఫ్టీ) ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇవెంట్ మార్కెటింగ్ & మేనేజ్మెంట్ (ఐసీఈఎం) హోటల్ మేనేజ్మెంట్ ఆతిథ్య రంగంలో ఎదగాలనుకునేవారికి ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఎంతగానో దోహదపడుతుంది. ప్రముఖ హోటళ్లలో ఇపుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసినవారినే అధికంగా నియమించుకుంటున్నారు. అంతేకాదు, ఆ కోర్సు చేసినవారికి బహుళజాతి కంపెనీల్లో, ట్రావెల్ & టూరిజం రంగంలో ఎన్నో ఉద్యోగావకాశాలతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కోర్సును అందించే సంస్థల్లో కొన్ని... ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కాటరింగ్ టెక్నాలజీ & అప్త్లెడ్ న్యూట్రిషన్, హైదరాబాద్ వెల్కం గ్రూప్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ &అప్త్లెడ్ న్యూట్రిషన్, చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ & కాటరింగ్ టెక్నాలజీ, కోవలం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కాటరింగ్ టెక్నాలజీ & అప్త్లెడ్ న్యూట్రిషన్, అహ్మదాబాద్ డా.అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ & న్యూట్రిషన్, చండీఘర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కాటరింగ్ టెక్నాలజీ & అప్త్లెడ్ న్యూట్రిషన్, మీరట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐఐహెచ్ఎం), కలకత్తా. - పి.వి.ఆర్.కె. మూర్తి, చైర్మన్, శ్రీ గాయత్రి విద్యాసంస్థలు. కామర్స్ కోర్సులు ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులకు దీటుగా ఆర్ట్స్ విభాగం విద్యార్థులకు ప్రొఫెషనల్ కిరీటాన్ని అందించే కామర్స్ కోర్సులు ఎన్నో ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ గతిగమనాలను గమనిస్తూ... నిర్దేశిస్తూ... శాసిస్తూ సంతృప్తికరంగా సంపాదించుకునే అవకాశాలను కుప్పలుగా పోస్తున్నాయి ఈ కోర్సులు. పోటీ తక్కువ ఉద్యోగాలు ఎక్కువ. ఇంటర్లో ఏ గ్రూప్ చదివినా ఇందులో చేరవచ్చు. కొత్త కోర్సులు ఎన్ని వస్తున్నా వన్నె తగ్గని వాణిజ్య రంగంలోకి అడుగు పెట్టాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ఆర్థికవ్యవస్థలో మూలస్తంభాలుగా గురుతర బాధ్యతలు మోస్తూ మంచి జీతభత్యాలతో ఉన్నత జీవితాన్ని సాగించాలనుకుంటే కామర్స్ కోర్సులు చదవాల్సిందే. స్థిరమైన జీవితానికి పునాది వేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న కోర్సుల్లో అందరికీ అందుబాటులో బి.కాం., బి.బి.ఎ., బి.బి.ఎం ఉండగా ప్రొఫెషనల్ కోర్సుల్లో సి.ఎ., సి.ఎస్. మొదలైనవి ఉన్నాయి. ఐ.సి.ఎ.ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఐ.సి.ఎ.ఐ.కి. పూర్తి రూపం. దేశవ్యాప్తంగా సుమారు 117 బ్రాంచీలున్న ఈ సంస్థ సి.ఎ. కోర్సు అమలు తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. దీన్లో మూడు దశలున్నాయి. 1. కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సి.పి.టి.) ఇంటర్లో ఏ గ్రూప్ చదివినా (చివరి సంవత్సరం పరీక్షలు రాసిన వారు కూడా) ఆపైన డిగ్రీ చదివిన వారైనా ఈ పరీక్షకు మొదట తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇంటర్ పరీక్షలు రాసిన 60 రోజుల తరువాత సి.పి.టి. పరీక్షకు అర్హత పొందుతారు. ప్రతి సంవత్సరం జూన్- డిసెంబర్లో పరీక్ష జరుగుతుంది. దీన్లో 4 పేపర్లుంటాయి. 9 నెలలు శిక్షణ ఉంటుంది. 2. ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు (ఐ.పి.సి.సి) రెండో దశ. సి.పి.టి. పూర్తిచేసిన వారు దీన్లో పేరు నమోదు చేసుకోవాలి. దీన్లో గ్రూప్- 1, గ్రూప్-2 ఉంటాయి. ఒకేసారి రెండింటికీ దరఖాస్తు చేయవచ్చు. 9 నెలల శిక్షణ ఉంటుంది. ఒక గ్రూప్లో పాసైనా చాలు. 3. అసిస్టెంట్షిప్ (ఫైనల్ దశ) అభ్యర్థి ఐ.పి.సి.సి. గ్రూప్లో అర్హత సాధించిన తరువాత 3 సంవత్సరాల అర్టికల్ అసిస్టెంట్షిప్ కోసం దరఖాస్తు చేసుకుని ఛార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్షిప్ చేయాలి. రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తరువాత ఐ.పి.సి.సి. ఫైనల్ గ్రూప్ -1, గ్రూప్ -2 పరీక్షలు రాసి అర్హత పొందాలి. మిగిలిన ఆరు నెలల కాలంలో ఆర్టికల్షిప్ను పూర్తిచేయాలి. తుది పరీక్షలో సర్టిఫికెట్ పొంది సంస్థలో సభ్యుడిగా పేరు నమోదు చేసుకోవాలి. అప్పటినుంచి అభ్యర్థి ఛార్టర్డ్ అకౌంటెంట్ (సి.ఎ.)గా పూర్తి అధికారిక హోదాలో ఏదైనా కంపెనీలో చేరవచ్చు. లేదా కన్సల్టెన్సీని నెలకొల్పుకోవచ్చు. భవిష్యత్తు: ఆడిటర్లుగా, టాక్స్ కన్సల్టెంట్లుగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లుగా, మల్టీ నేషనల్ కంపెనీలకు పనిచేయవచ్చు. బ్యాంకింగ్, ఫారెక్స్ (ఫారిన్ ఎక్స్ఛేంజ్) మార్కెట్లలో కన్సల్టెన్సీలుగా వ్యవహరించవచ్చు. వెబ్సైట్: www.icai.org ఐ.సి.డబ్ల్యు.ఎ.ఐ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనేది ఐ.సి.డబ్ల్యు.ఎ.ఐ. పూర్తిరూపం. కంపెనీ లావాదేవీల నిర్వహణలో ఆదాయ, వ్యయ లెక్కింపులో నిపుణులైన అకౌంటెంట్లు కావాలి. అలాంటి వారిని తీర్చిదిద్దడానికి ఏర్పడిందే ఈ సంస్థ. మూడు స్థాయుల్లో కోర్సులను నిర్వహిస్తోంది. 1. ఫౌండేషన్ లెవెల్ దీనికి కనీస అర్హత ఇంటర్. వయసు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. మొత్తం నాలుగు పేపర్లుంటాయి. (అవి... అకౌంటింగ్, ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్, ఎకనమిక్స్ అండ్ బిజినెస్ ఫండమెంటల్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్). 2. ఇంటర్మీడియెట్ లెవెల్ దీనికి ఫౌండేషన్ లెవెల్ లేదా డిగ్రీ కనీస అర్హత. దీన్లో గ్రూప్-1, గ్రూప్-2 పేపర్లు ఉంటాయి. గ్రూప్-1లో ఫైనాన్షియల్ అకౌంటింగ్, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ లాస్ అండ్ ఆడిటింగ్, అప్లయిడ్ డైరెక్ట్ టాక్సెస్ సబ్జెక్టులుంటాయి. గ్రూప్-2లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఆపరేషన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అప్లయిడ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ సబ్జెక్టులు ఉంటాయి. 3. ఫైనల్ లెవెల్ ఐ.సి.డబ్ల్యు.ఎ.ఐ.కి ఇంటర్ పాసై ఉండాలి. ఇక్కడ గ్రూప్ -3, గ్రూప్-4 పేపర్లు ఉంటాయి. గ్రూప్-3లో క్యాపిటల్ మార్కెట్ ఎనాలసిస్ అండ్ కార్పొరేట్ లాస్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్, మేనేజ్మెంట్ అకౌంటింగ్- స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఇన్డైరెక్ట్ అండ్ డైరెక్ట్ టాక్స్ మేనేజ్మెంట్ సబ్జెక్టులు ఉంటాయి. గ్రూప్-4లో మేనేజ్మెంట్ అకౌంటింగ్- ఎంటర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్, కాస్ట్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్, బిజినెస్ వాల్యుయేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్టులుంటాయి. ఓరల్/ పోస్టల్ కోచింగ్ తప్పనిసరి. ప్రవేశం: సంవత్సరంలో ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చు. పరీక్షలు ప్రతిసంవత్సరం డిసెంబరు, జూన్లో జరుగు తాయి. శిక్షణ సమయం 6 నెలలు.డిసెంబర్లో పరీక్షలకు హాజరు కావాలనుకుంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కోచింగ్ తీసుకోవాలి. జూన్లో పరీక్షలు రాయాలనుకుంటే అక్టోబరు నుంచి మార్చి వరకు శిక్షణ తీసుకోవాలి. బి.కాం. ఇంటర్లో కామర్స్, ఆర్ట్స్ చేసిన వారికి సహజంగా అందుబాటులో ఉండే డిగ్రీ కోర్సు బి.కాం. (కాల వ్యవధి: 3 సంవత్సరాలు). కిరాణా షాపు దగ్గర నుంచి మల్టీనేషనల్ కంపెనీల వరకు అకౌంటెంట్లు తప్పనిసరి. కాలానుగుణంగా కొన్ని కోర్సులకు డిమాండ్ తగ్గినా, పెరిగినా బి.కాం. చేసిన వారికి అకౌంటెంట్ ఉద్యోగం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంది. అర్హతలు: ఈ కోర్సుకు సహజంగా ఇంటర్ సి.ఇ.సి. అభ్యర్థులే ఎక్కువగా దరఖాస్తు చేస్తారు. అయితే ఇతర గ్రూపులవారు కూడా దరఖాస్తు చేయవచ్చు. బి.కాం. స్పెషలైజేషన్లు: అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, కార్పొరేట్ అఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ స్టడీస్, ఇంటర్నేషనల్ బిజినెస్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్ మొదలైనవి. బి.కాం. తరువాత పలు రకాల స్పెషలైజేషన్లతో ఎం.కాం. చేయవచ్చు. భవిష్యత్తు కామర్స్ డిగ్రీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే డిగ్రీ స్థాయి పోటీ పరీక్షలు అన్నీ రాయవచ్చు. బ్యాంక్లో క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, రైల్వేల్లో టికెట్ కలెక్టర్లు, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్లో స్టాటిస్టీషియన్, కార్పొరేట్ కంపెనీల్లో అకౌంటెంట్లు, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్లుగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. హోటల్ మేనేజ్మెంట్, టూరిజం తదితర రంగాల్లో అకౌంటెన్సీ, మేనేజ్మెంట్ విభాగాల్లో చేరవచ్చు. బి.బి.ఎ. బి.బి.ఎం. వ్యక్తికైనా, వ్యవస్థకైనా సరైన మేనేజ్మెంట్ అవసరం. ఏ పని ఎప్పుడు చేయాలి? పోటీ వాతావరణంలో సంస్థ అభివృద్ధి చెందాలంటే కార్యక్రమాల అమలుకు సిబ్బందిని ఎలా ఉపయోగించాలి మొదలైన అంశాలను గుర్తించి కంపెనీ నిర్వాహకులకు వివరించడంలో మేనేజ్మెంట్ విభాగమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంస్థ రోజువారీ కార్యకలాపాల అమల్లో కీలక పనులు చేపట్టే మేనేజ్మెంట్ విభాగానికి అవసరమైన కోర్సుల్లో ముఖ్యమైనవి. 1. బి.బి.ఎ. (బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - స్పెషలైజేషన్లు - కంప్యూటర్ అప్లికేషన్స్, రిటెయిలింగ్ విత్ మాడ్యులర్ అప్రోచ్, మ్యాథ్స్). 2. బి.బి.ఎం. (బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్) వీటి తరువాత ఎం.బి.ఎ. కోర్సు చేయవచ్చు. భవిష్యత్తు మేనేజ్మెంట్ కోర్సులను చేసిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని సంస్థల్లో మేనేజ్మెంట్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్, స్థాయిలో కెరీర్ ప్రారంభించవచ్చు. సర్వీస్ పెరిగేకొద్దీ సంబంధిత విభాగంలో మేనేజర్ (ఉదా: పర్సనల్ మేనేజర్) స్థాయికి చేరుకోవచ్చు. మన రాష్ట్రంలోని అన్ని ప్రధాన యూనివర్సిటీలు (నాగార్జున, శ్రీవేంకటేశ్వర, ఉస్మానియా, ఆంధ్రా, కాకతీయ మొదలైనవి) తమతమ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో రెగ్యులర్, దూర విద్యా విధానంలో బి.కాం. బి.బి.ఎ. బి.బి.ఎం. కోర్సులను, డిప్లొమా, పీజీ డిప్లొమాలను అందిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో యూజీసీ గుర్తింపు పొందిన దాదాపు అన్ని యూనివర్సిటీలు రెగ్యులర్ దూరవిద్యా విధానంలో బి.కాం, బి.బి.ఎ.కోర్సులతో పాటు డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ అధ్యయనం దేశంలో షేర్మార్కెట్ గురించి ఇప్పుడు తెలియనివారు లేరు. షేర్ల లావాదేవీలన్నీ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్.ఎస్.ఇ.), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బి.ఎస్.ఇ.) ద్వారా జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలను చక్కబెట్టే వారు స్టాక్ బ్రోకర్లు. ఈ రంగంలో అనుభవజ్ఞులు, స్టాక్ మార్కెట్ అధ్యయనం చేసిన నిపుణుల అవసరం పెరుగుతోంది. వీరికి బి.ఎస్.ఇ., ఎన్.ఎస్.ఇ.లు 1. సర్టిఫికెషన్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ 2. సర్టిఫైడ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ ప్రొఫెషనల్ తదితర ప్రోగ్రాములను నిర్వహిస్తున్నాయి. ఇంటర్, ఆపైన అర్హతలున్న వారు ఈ కోర్సులు చేయడానికి అర్హులు. వెబ్సైట్: www.nseindia.com సర్టిఫికెట్ ఇన్ అకౌంటింగ్ టెక్నీషియన్స్ నిపుణులైన అకౌంటెంట్లకు నూతన విధానాలను నేర్పే దిశలో భాగంగా ఐ.సి.డబ్ల్యు.ఎ.ఐ-సర్టిఫికెట్ ఇన్ అకౌంటింగ్ టెక్నీషియన్స్ (సి.ఎ.టి.) కోర్సును రూపొందించింది. వివిధ కంపెనీల్లో, సంస్థల్లో విభిన్న వాతావరణాల్లో అకౌంటెంట్లు సమర్థంగా ఎలా పనిచేయాలో, క్లాసులో నేర్చుకున్న థియరీని విధులకు ఏవిధంగా వర్తింపజేయాలో ఇందులో తెలియజేస్తారు. అకౌంటింగ్లో మెలకువలు నేర్చుకోవడానికి ఆన్-జాబ్ అనుభవాన్ని అందిస్తారు. భవిష్యత్తు: ఐ.సి.డబ్ల్యు.ఎ.ఐ. చేసినవారు కంపెనీల్లో కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆడిటింగ్, ఇంటర్నల్ ఆడిటింగ్, సిస్టమ్స్ ఎనాలసిస్ అండ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, ప్రాసెస్ ఎనాలసిస్ (బి.పి.ఒ.), మేనేజ్మెంట్ రంగాల్లో చేరవచ్చు. కాలేజీల్లో లెక్చరర్లుగా కూడా చేరవచ్చు. సొంతంగా కన్సల్టెన్సీ ప్రారంభించుకోవచ్చు. వెబ్సైట్: www.icwai.org ఆధునిక కోర్సులు ఇంటర్ తరువాత సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరడం సాధారణం. కానీ ఇప్పుడు కొన్ని ఆధునిక కోర్సులకు ఆకర్షితులయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాలానుగుణంగా ఎన్నో సరికొత్త రంగాలు, వాటికి అవసరమైన కోర్సులూ ఆవిర్భవిస్తున్నాయి. వీటికి డిమాండ్ కూడా రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. కంప్యూటర్ల రాకతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఊపందుకుంది. పర్యావరణంలోని అసమతౌల్యం పర్యావరణ నిపుణులకు గిరాకీ పెంచింది. భూగర్భ పరిశోధనలకు, హోటల్ మేనేజ్మెంట్ రంగాల్లో ఔత్సాహికులకు ఇప్పుడు మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఇవే కాకుండా జెమ్మాలజీ, ఓషనోగ్రఫీ లాంటి పలు ప్రత్యేక రంగాలు ఆధునిక కోర్సులకు , ఉద్యోగాలకు దారి చూపుతున్నాయి. దేశంలోని అనేక యూనివర్సిటీలు రెగ్యులర్ కోర్సులతోపాటు ఆధునిక, ఉపాధికి అవకాశం ఉన్న అనేక కోర్సుల్లో డిగ్రీ, డిప్లొమా, పీజీ, పిహెచ్.డి. మొదలైన కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రకటనలు వెలువడినప్పుడు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ప్రైవేటు రంగంలో కార్పొరేట్ కంపెనీలు విస్తరించడం, ప్రజల్లో పర్యటక ప్రదేశాలపై మక్కువ ఎక్కువ కావడం లాంటి కారణాలతో దేశంలోనే కాదు, ప్రపంచంలోకూడా టూరిజం, హోటల్ మేనేజ్మెంట్ రంగాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. నిపుణుల అవసరం బాగా పెరిగింది. ఈ రంగానికి కావాల్సిన మానవ వనరులను తీర్చిదిద్దడానికి యూనివర్సిటీలు, విద్యా సంస్థలు డిగ్రీ, పీజీ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సుల ద్వారా టూరిస్ట్ గైడ్లు, హోటల్ ఎగ్జిక్యూటివ్లు, ఈవెంట్ నిర్వాహకులు తదితర హోదాల్లో ఉపాధి పొందవచ్చు. టూరిజం, హాస్పిటాలిటీ రంగంలో నిపుణులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. శిక్షణ సంస్థలు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, న్యూఢిల్లీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, న్యూఢిల్లీ. వీటితోపాటు వైజాగ్ లోని ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్, ఉస్మానియా, నాగార్జున యూనివర్సిటీలు, ఇతర సంస్థలు హోటల్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో కోర్సులు నిర్వహిస్తున్నాయి. వెబ్సైట్లు: http://www.ihmhyd.org (or) www.nchmct.org డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రమాదాల్లో కొన్ని మానవ తప్పిదాల వల్ల, మరికొన్ని ప్రకృతి పరంగా జరుగుతాయి. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు లావా వెదజల్లడం, కొండచరియలు విరిగిపడటం, తుపానులు, వరదలు, అగ్నిప్రమాదాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు. విమాన ప్రమాదాలు, గ్యాస్ లీకేజీ లాంటివి మానవ తప్పిదాలకు ఉదాహరణలు. ఇలాంటి సందర్భాల్లో ఏంచేయాలి? ప్రమాదాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వచ్చిన తరువాత ఎలాంటి చర్యలు చేపట్టాలి? మొదలైన విషయాలను వివరించేందుకు నిపుణుల సహకారం చాలా అవసరం. ఈ రంగానికి సమర్థులైన మానవ వనరుల అవసరం ఉందని గుర్తించిన యూనివర్సిటీలు, ఇతర శిక్షణ సంస్థలు రెగ్యులర్ దూర విద్యావిధానాల్లో 'డిజాస్టర్ మేనేజ్ మెంట్' పేరుతో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. వాటిలో కొన్ని.. 1. టాటా ఇన్ స్టిట్యూట్ ఆప్ సోషల్ సైన్సెస్, ముంబయి2. ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, చెన్నై.3. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ4. అన్నామలై యూనివర్సిటీ. 5. సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ 6. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్, భోపాల్. ఫ్యాషన్ టెక్నాలజీ ఆధునిక ప్రపంచంలో యువతరాన్ని అధికంగా ఆకర్షిస్తున్న రంగం ఫ్యాషన్ టెక్నాలజీ. ఫ్యాషన్ కెరీర్ గురించి పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని యూనివర్సిటీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) లాంటి సంస్థలు అనేక కోర్సులను అందిస్తున్నాయి. కేంద్రజౌళి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న నిఫ్ట్ ఇంటర్ వారికి ప్రత్యేకంగా ఫ్యాషన్ కోర్సులను నిర్వహిస్తోంది. వీటిలో బ్యాచ్లర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (లెదర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, నిట్వేర్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్ మొదలైనవి), బ్యాచ్లర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ మొదలైన కోర్సులు ఉన్నాయి. ఎంపిక నిమిత్తం ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ కోర్సులు చదవడం వల్ల ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, వెబ్, ఆడియో- విజువల్ మీడియా రంగాల్లో, టెక్స్టైల్ కంపెనీల్లో ఫ్యాషన్ డిజైనర్లుగా, ప్రొడక్ట్ డిజైనర్లుగా, కంప్యూటర్ గ్రాఫిక్ ఆర్టిస్టులుగా తదితర ఉద్యోగాల్లో చేరవచ్చు. వెబ్సైట్లు: www.nift.ac.in (or) www.pearlacademy.com ఫైర్ ఇంజినీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ అగ్నిప్రమాదాలను ఎలా అరికట్టాలో తెలుసుకోవడమేకాదు, ప్రమాదాలు ఏర్పడినప్పుడు ఏంచేయాలో, నష్టం నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందుగానే తెలుసుకుంటే ఎంతో మంచిది. దీనికోసం వివిధ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ ఇంజినీరింగ్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ -ఫైర్ సేఫ్టీలో డిప్లొమా కోర్సును నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటారు. అలాగే ఇగ్నో, ఎన్.ఐ.టి, తిరుచిరాపల్లి, అన్నామలై, తదితర వర్సిటీలు ఫైర్సేఫ్టీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వెబ్సైట్లు: www.nifsindia.net (or) www.ignou.ac.in విదేశీ భాషలు మాతృభాషతోపాటు ఇంగ్లిష్లో ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే ఒకప్పుడు ఉద్యోగానికి అర్హతగా గుర్తించేవారు. సరళీకరణ విధానాలతో ప్రైవేటురంగం బాగా విస్తరించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఖండాతర వ్యాప్తి చెందాయి. విదేశీ సంస్థలు, యూనివర్సిటీలు భారత్లో తమ కార్యకలాపాలు ఎక్కువ చేశాయి. ఫలితంగా విదేశీ భాషలు వచ్చిన వారికి అవకాశాలు అందుబాటులోకి రావడం ఎక్కువైంది. విదేశీ భాషలు ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ ఏదైనా కావచ్చు. వీటిని నేర్చుకుంటే చాలు రక్షణ, విదేశీ వ్యవహారాలు, బి.పి.ఒ., కె.పి.ఒ., విద్యారంగాల్లో అపార అవకాశాలున్నాయి. ఇంటర్ అర్హతతో బి.ఎ. (ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, స్పానిష్, చైనీస్, జపనీస్, పర్షియన్, అరబిక్ మొదలైనవి) లో చేరవచ్చు. ఈ కోర్సులను పలు యూనివర్సిటీలు నిర్వహిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి. English and Foreigh Language University(EFLU),Hyderabad. University, Delhi Delhi University సోషల్ వర్క్ రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఎదుటి వారి సహాయాన్ని పొందుతారు. కాలం మారేకొద్దీ సేవల రూపురేఖలు, అర్థాలు మారిపోతున్నాయి. ఇప్పుడు సేవ ఒక వృత్తిగా గుర్తింపు పొందింది. కొద్దోగొప్పో ఆర్థికంగా సంపాదిస్తూ సేవలను అందించడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సేవారంగలో ఎదిగేందుకు అనేక సంస్థలు సోషల్ వర్క్ డిగ్రీలను, పీజీలను అందిస్తున్నాయి. కోర్సులు: సోషల్ వర్క్లో డిగ్రీ, పీజీ ఇతర ఉన్నత కోర్సులు చేయవచ్చు. ఇంటర్ ఏ గ్రూప్ వారైనా డిగ్రీ కోర్సులో చేరవచ్చు. కొన్ని శిక్షణ సంస్థలు రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో బి.ఎ. సోషల్ వర్క్, ఎం.ఎ. సోషల్ వర్క్ కోర్సులున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ముంబయి. పుణే యూనివర్సిటీ, పుణే. జియాలాజికల్సైన్స్ భూమి గురించిన అధ్యయనశాస్త్రమే జియాలాజికల్సైన్స్. భూగర్భ పరిశోధనలు చేసే వారిని జియాలజిస్టులు, జియోఫిజిస్టులు, హైడ్రాలజిస్టులు, మెటీరియాలజిస్టులు, జియో కెమిస్టులు అంటారు. భూమిలో ఎన్ని పొరలు ఉన్నాయి? భూ అంతర్గతంగా సంభవిస్తున్న మార్పులేమిటి? ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన భూ భౌతిక వనరులను ఎలా కాపాడాలి లాంటి అనేక అంశాలను జియాలజిస్టులు పరిశీలిస్తారు. జియాలజీలో అనేక యూనివర్సిటీలు వివిధ కోర్సులు నిర్వహిస్తున్నాయి. బి.ఎస్సి. (జియాలజీ) బి.ఎస్సి. (అప్లయిడ్ జియాలజీ,/ జియోఫిజిక్స్) వీటిని రెగ్యులర్ యూనివర్సిటీల్లో చేయవచ్చు. ఇంటిగ్రేటెడ్ ఎం.ఎస్సి. అప్లయిడ్ జియాలజీ/ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ జియోఫిజిక్స్ (ఐఐటి, ఖరగ్పూర్, రూర్కీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్ల్లో చదవవచ్చు). వెబ్సైట్లు: www.andhrauniversity.info (or) www.ismdhanbad.ac.in వ్యవసాయ కోర్సులు దేశ జనాభాలో ఇప్పటికీ సుమారు 55 శాతం మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చడానికి నూతన, ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ దిగుబడులను పెంచేందుకు విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో ఈ రంగానికి అవసరమైన నిపుణులకు ప్రాధాన్యం పెరుగుతోంది. డిమాండ్కు తగిన విధంగా నిపుణులను తీర్చిదిద్దడానికి విద్యా సంస్థలు ఇంటర్ తర్వాత వివిధ వ్యవసాయ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం... వ్యవసాయ విద్యకున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం స్వాతంత్య్రానంతరం ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేతృత్వంలో 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ అమెరికాలోని లాండ్ గ్రాంట్స్ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. తదనుగుణంగా ప్రభుత్వం దేశంలోనే మొదటి వ్యవసాయ విశ్వవిద్యాలయం- జి.బి.పంత్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పంత్ నగర్లో (ఉద్ధమ్సింగ్ నగర్ జిల్లా) ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారు 62 విశ్వవిద్యాలయాలు వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన, గృహవిజ్ఞాన రంగాలకు సంబంధించిన కోర్సులను నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం, 52 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, 4 డీమ్డ్ వర్సిటీలు, 4 కేంద్రీయ విశ్వవిద్యాలయాలున్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు 15000 వ్యవసాయ పట్టభద్రులు, 11 వేల మంది పీజీ అభ్యర్థులు బయటకు వస్తున్నారు. రాష్ట్రంలో... ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (రాజేంద్రనగర్, హైదరాబాద్) వ్యవసాయ విద్యను అందిస్తోంది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం (తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా) ఉద్యాన విద్యను, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (తిరుపతి) పశువైద్య విద్యను అందిస్తున్నాయి. ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, ఉద్యాన రంగాల సర్వతోముఖాభివృద్ధికి 1964లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 1996లో దీన్ని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చారు. వ్యవసాయ కోర్సుల నిర్వహణలో పేరుగాంచిన ఈ వర్సిటీ అందిస్తున్న వ్యవసాయ సంబంధిత కోర్సుల వివరాలు... 1. బీయస్సీ (అగ్రికల్చర్) - (అర్హత: ఇంటర్ బైపీసీ) 2. బీయస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్- (అర్హత: ఇంటర్ బైపీసీ/ ఎంపీసీ). 3. బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్ - (అర్హత: ఇంటర్ ఎంపీసీ). 4. బీటెక్ (ఫుడ్ సైన్స్)- (అర్హత: ఇంటర్ బైపీసీ/ఎంపీసీ). 5. బీయస్సీ (ఆనర్స్) హోమ్ సైన్స్ - (అర్హత: ఇంటర్ బైపీసీ) 6. బి.యస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ - (అర్హత: ఇంటర్ బైపీసీ) 7. బి.యస్సీ (ఆనర్స్) ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ - (అర్హత: ఇంటర్ బైపీసీ). ఈ కోర్సుల కాలవ్యవధి 4 సంవత్సరాలు. బీయస్సీ (ఆనర్స్) హోమ్సైన్స్, బీయస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ, బీయస్సీ (ఆనర్స్), ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సులు మినహాయించి మిగిలిన బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఎంసెట్ ర్యాంకు తప్పనిసరి. హోమ్సైన్స్ విభాగంలోని కోర్సుల్లోకి కేవలం మహిళలను మాత్రమే తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ ప్రకటన ప్రత్యేకంగా విడుదల అవుతుంది. వర్సిటీ పరిధిలోని కళాశాలలు వ్యవసాయ కళాశాలలు - రాజేంద్రనగర్, తిరుపతి, బాపట్ల, మహానంది (కర్నూలు), అశ్వరావుపేట (ఖమ్మం), వైరా (శ్రీకాకుళం), రాజమండ్రి, జగిత్యాల. వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు - బాపట్ల, మడకశిర (అనంతపురం), సంగారెడ్డి (మెదక్). ఫుడ్ సైన్స్ కళాశాలలు - బాపట్ల, పులివెందుల (కడప). హోమ్సైన్స్ - గృహవిజ్ఞాన కళాశాల (సైఫాబాదు, హైదరాబాదు.) ఉపాధి అవకాశాలు: వ్యవసాయ సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణులైన పట్టభద్రులకు ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కంపెనీలు, వ్యవసాయ అభివృద్ధి నిర్వహణ సంస్థలు వ్యవసాయ అధికారులుగా, పర్యవేక్షక నిపుణులుగా అవకాశాలు కల్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులుగా చేరవచ్చు. వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, సహకార సంస్థల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలున్నాయి. విత్తన కంపెనీలు, పురుగు మందులు, ఎరువుల తయారీ సంస్థలు వ్యవసాయ పట్టభద్రులను తీసుకుంటున్నాయి. ఇక ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు మంజూరుకు, బీమా సంస్థల్లో వ్యవసాయ విషయనిపుణులుగా మంచి ఉద్యోగాలు అందుబాటులో ఉంటున్నాయి. అగ్రి క్లినిక్స్ ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టే వీలుంటోంది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయా వ్యవసాయంతోపాటు ఉద్యాన రంగానికి కూడా ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. కూరగాయల సాగు, పండ్లతోటలు, పూలు, ఔషధ, సుగంధ మొక్కల పెంపకం, ఉద్యానవనాల పర్యవేక్షణ తదితర కార్యక్రమాలన్నీ ఈ విభాగం కిందకే వస్తాయి. ఈ రంగాల్లో అవసరమైన నిపుణులను అందించేందుకు 2007లో డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. వర్సిటీ అందిస్తున్న కోర్సు: బీయస్సీ (ఆనర్స్) హార్టీకల్చర్ (అర్హత: ఇంటర్ బైపీసీ). వ్యవధి: నాలుగు సంవత్సరాలు. ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. చిరునామా: డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం, తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా. రాష్ట్రంలోని ఉద్యాన కాలేజీలు: రాజేంద్రనగర్, హైదరాబాద్, వెంకట రామన్నగూడెం, పశ్చిమ గోదావరి, మోజెర్ల, (కొత్తకోట, మహబూబ్నగర్), అనంతరాజుపేట వై.ఎస్.ఆర్. కడప). ఉపాధి అవకాశాలు: ఉద్యాన విద్యనభ్యసించే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానశాఖలో హార్టీకల్చర్ ఆఫీసర్లుగా ఉపాధి అవకాశాలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని విత్తన కంపెనీలు ఉద్యానవనాలకు కన్సల్టెంట్లుగా వీరినే నియమిస్తున్నాయి. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయా పాడి, పౌల్ట్రీ పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకం లాంటి వాటితో పశుసంవర్ధక రంగానికి విశేష ప్రాధాన్యం లభిస్తోంది. ఈ రంగం పురోగతి కోసం అవసరమైన నిపుణులను అందించేందుకు ప్రభుత్వం 2006లో తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసింది. 2007-08 విద్యా సంవత్సరం నుంచి ఈ వర్సిటీ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ సంస్థ అందిస్తున్న డిగ్రీ కోర్సుల వివరాలు... బీవీఎస్సీ అండ్ ఎ.హెచ్. - (5 సంవత్సరాలు, అర్హత: ఇంటర్ బైపీసీ). 2. బీఎఫ్ఎస్సీ- (4 ఏళ్లు, అర్హత: ఇంటర్ బైపీసీ). 3. బీటెక్ (డెయిరీ టెక్నాలజీ)- (4 సంవత్సరాలు, అర్హత: ఇంటర్ ఎంపీసీ). ఎంపిక: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా. వర్సిటీ పరిధిలోని ప్రధాన కళాశాలలు పశువైద్య కళాశాలలు - రాజేంద్రనగర్, తిరుపతి, గన్నవరం, విజయవాడ, ప్రొద్దుటూరు (కడప), కోరుట్ల (కరీంనగర్). మత్స్య కళాశాల - ముత్తుకూరు, (నెల్లూరు). డెయిరీటెక్నాలజీ-కామారెడ్డి(నిజామాబాద్). ఉపాధి అవకాశాలు: వెటర్నరీ సైన్స్ (పశు వైద్యం) చదివిన విద్యార్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్ర పశు సంవర్థక శాఖలో పశువైద్యులుగా చేరవచ్చు. వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శన శాలలు, డెయిరీ ఫారాలు, పౌల్ట్రీ ఫారాలు, పశువులకు వచ్చేవ్యాధుల నివారణకు ఉపయోగించే ఔషధాలను తయారు చేసే కంపెనీలు తదితర సంస్థల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. న్యాయవిద్య ప్రపంచీకరణ తర్వాత నేరాల స్వరూప, స్వభావాలు మారిపోయాయి. సంఖ్యతోపాటు సంక్లిష్టత కూడా పెరుగుతోంది. దీంతో న్యాయస్థానాల్లో కేసులు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో న్యాయవిద్య మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. సమాజంలో గౌరవంతోపాటు చక్కటి ఆదాయాన్ని అందించే న్యాయవిద్యకు రోజురోజుకూ ఆదరణ అధికమవుతోంది. డిమాండ్కు అనుగుణంగా సమర్థ న్యాయమూర్తులను, న్యాయవాదులను అందించడానికి పలు యూనివర్సిటీలు, సంస్థలు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. సమాజంలో న్యాయవాదులకు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా న్యాయవిద్యను సాధారణ కోర్సుల మాదిరి పరిగణించకూడదు. దీంట్లో సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించిన ఇండియన్ బార్ కౌన్సిల్ 1961 న్యాయవాదుల చట్టానికి అనుగుణంగా న్యాయ విద్యా తీరుతెన్నులను పర్యవేక్షిస్తోంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయ నిపుణుల డిమాండ్ రోజురోజుకు అధికం కావడాన్ని దృష్టిలోపెట్టుకుని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమర్థులైన న్యాయ నిపుణులను అందించేందుకు ఎల్ఎల్బీ మూడు సంవత్సరాల కోర్సులను యూనివర్సిటీల్లో ప్రవేశ పెట్టింది. తర్వాత 5 సంవత్సరాల (ఇంటిగ్రేటెడ్) కోర్సును ప్రారంభించింది. ప్రస్తుతం కొన్ని వర్సిటీలు ఎల్ఎల్బీ మూడు సంవత్సరాల కోర్సులతో పాటు, ఎల్ఎల్బీ అయిదు సంవత్సరాల 'లా కోర్సులు కూడా అందిస్తున్నాయి. దేశంలో లా డిగ్రీ అంటే 1985కు ముందు మూడేళ్ల కోర్సు మాత్రమే. న్యాయ విద్యను విస్తరించాలని లా కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సూచనలు చేయడంతో 1985లో బెంగళూరులో 'నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. అప్పటినుంచి 5 ఏళ్ల లా కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఏర్పడిన మొదటి లా వర్సిటీ ఇదే కావడం విశేషం. తర్వాత లా వర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి. అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి ఇంటర్ ఉత్తీర్ణత, మూడేళ్ల లా కోర్సుకు డిగ్రీ కనీస అర్హతలు. న్యాయ విద్యలో లభిస్తున్న డిగ్రీ కోర్సుల వివరాలు: 1) బీఏ ఎల్ఎల్బీ జనరల్, 2) బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్, 3) బీకాం ఎల్ఎల్బీ జనరల్, 4) బీకాం ఎల్ఎల్బీ ఆనర్స్, 5) బీబీఏ ఎల్ఎల్బీ జనరల్, 6) బీబీఏ ఎల్ఎల్బీ ఆనర్స్, 7) బీఎస్సీ ఎల్ఎల్బీ జనరల్, 8) బీఎస్సీ ఎల్ఎల్బీ ఆనర్స్. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రోగ్రాములు. కాల వ్యవధి అయిదేళ్లు. ఈ కోర్సుల్లో చేరడంవల్ల ఏడాది ఆదా కావడమే కాకుండా ఒకేసమయంలో రెండు డిగ్రీలు (ఉదా: బీబీఏ + ఎల్ఎల్బీ) పొందే వీలుంటోంది. ప్రవేశ విధానం న్యాయ విద్యలోకి ప్రవేశించేందుకు జాతీయ స్థాయిలో 'క్లాట్, ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా లా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. మన రాష్ట్రం విషయానికొస్తే... 3 లేదా 5 ఏళ్ల లా డిగ్రీ చేయడానికి లాసెట్ రాయాల్సి ఉంటుంది. లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్' (లాసెట్) 'లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్' (లాసెట్) పేరుతో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా ఉస్మానియా, ఆంధ్రా, కాకతీయ, పద్మావతి, శ్రీవేంకటేశ్వర, నాగార్జున మొదలైన వర్సిటీల లా కళాశాలల్లో చేరవచ్చు. అభ్యర్థులకు లాసెట్లో కనీసం 35 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు కనీస మార్కుల నిబంధన లేదు. లాసెట్ ఆధారంగా చేరదగిన కోర్సులు: ఎల్ఎల్బీ / బీఎల్ (కాలవ్యవధి 5 సంవత్సరాలు). ఈ కోర్సుకు ఇంటర్లో సగటున 45 శాతం మార్కులు ఉండాలి. 2) ఎల్ఎల్బీ / బీఎల్ (3 ఏళ్ల కోర్సు).(అర్హత: డిగ్రీలో సగటున 45 శాతం మార్కులు అవసరం.) వెబ్సైట్: www.aplawcet.org జాతీయ స్థాయిలో... న్యాయ విద్యను జాతీయ స్థాయి వర్సిటీల్లో చదవాలంటే ఆయా వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి... క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్). నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఢిల్లీ వర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్. కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్. క్లాట్ న్యాయ విద్యను మరింత విస్తృత పరచడంతోపాటు సమాజానికి నిపుణులైన, సమర్ధులైన న్యాయవాదులను అందించాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన నేషనల్ లా యూనివర్సిటీలు విద్యార్థులను చేర్చుకోవడానికి క్లాట్కు శ్రీకారం చుట్టాయి. ఈ సంస్థలు నిర్వహించే లా కోర్సుల్లో చేరేందుకు 2007 వరకూ జాతీయ స్థాయిలో విడివిడిగా ప్రవేశ పరీక్ష రాయాల్సి వచ్చేది. దీనివల్ల విద్యార్థులకు ఆర్థికంగా, విద్యా పరంగా అనేక సమస్యలు తలెత్తేవి. ఈ అంశాలను గమనించిన 7 నేషనల్ లా యూనివర్సిటీలు సమైక్యంగా ఒకే ఒక కామన్ ఎంట్రెన్స్ ఉండాలనే నిర్ణయానికి వచ్చాయి. దీని ఫలితమే 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్- క్లాట్ అందుబాటులోకి వచ్చింది. 2008లో మొదటిసారిగా క్లాట్ను నిర్వహించాయి. దీనికి మంచి ఆదరణ లభించడంతో 2009లో మరో 4 నేషనల్ లా యూనివర్సిటీలు క్లాట్లో చేరాయి. ప్రస్తుతం వీటి సంఖ్య 14కు పెరిగింది. అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హతతో కనీసం 50 శాతం మార్కులు ఉన్నవారు ఈ పరీక్షకు హాజరు కావచ్చు. వయసు 20 సంవత్సరాలు దాటకూడదు. చేరదగిన కోర్సులు 1. బీఏ/ బీఎస్సీ/ బీబీఏ/ బీఎస్డబ్ల్యూ/ బీకాం, ఎల్ఎల్బీ (ఆనర్స్): కోర్సుల కాల వ్యవధి 5 సంవత్సరాలు (ఇంటిగ్రేటెడ్ కోర్సులు). 2. పీజీ ప్రోగ్రామ్ ఎల్ఎల్ఎం: ప్రవేశ ప్రకటన మార్చిలో వస్తుంది. దరఖాస్తులను ఏప్రిల్ మొదటి వారంలోగా అందజేయాల్సి ఉంటుంది. వెబ్సైట్: www.clat.ac.in ఉస్మానియా లా కళాశాల దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన న్యాయ కళాశాలల్లో హైదరాబాద్లోని 'ఉస్మానియా లా కళాశాల అత్యంత ప్రముఖమైందిగా గుర్తింపు పొందింది. ఉస్మానియా వర్సిటీ ఇటీవలే జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ వర్సిటీల్లో 6వ స్థానంలో నిలిచింది. ఉస్మానియాలో లా కళాశాల 1918లో ఉర్దూ మీడియంలో ప్రారంభమైంది. అప్పటినుంచి నేటి వరకు తన ప్రాభవాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఉస్మానియా వర్సిటీ లా విభాగం మూడు, అయిదు సంవత్సరాల ''లా" కోర్సులను నిర్వహిస్తోంది. వర్సిటీ ''లా" విభాగం పరిధిలోని పది అనుబంధ న్యాయ కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బి.డి.యస్.లో అనాటమీతోపాటు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ సబ్జెక్టులను నిశితంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. డెంటిస్ట్రీలో ఆర్థోడెంటిక్స్, డెంటో-ఫేషియల్ ఆర్థోపిడిక్స్, డెంటల్ పబ్లిక్ హెల్త్ ఎండోడెంటిక్స్, ఆర్థోపిడిక్స్, పీరియాడెంటిక్స్ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఎం.డి.ఎస్.కూడా చేస్తే అవకాశాలు బాగా ఉంటాయి. లా యూనివర్సిటీ నల్సార్ లా యూనివర్సిటీ: నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ - నల్సార్ పూర్తి రూపం. ఈ వర్సిటీని 1998లో హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) (5 సంవత్సరాలు) కోర్సును అందిస్తోంది. క్లాట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్: www.nalsar.ac.in నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ: ఈ వర్సిటీ ఇంటిగ్రేటెడ్ బీఏ, ఎల్ఎల్బీ (ఆనర్స్) కోర్సును అందిస్తోంది. కాల వ్యవధి 5 సంవత్సరాలు. వర్సిటీ నిర్వహించే ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్ఈటీ) ర్యాంక్ ఆధారంగా చేరవచ్చు. పరీక్ష రాసేందుకు ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. వయసు 21 సంవత్సరాలు దాటకూడదు. వెబ్సైట్: nludelhi.ac.in నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ: మనదేశంలో 1986లో బెంగళూరులో ఏర్పడిన మొదటి లా విశ్వవిద్యాలయం ఇది. దీంట్లో 5 ఏళ్ల బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) ఉంది. క్లాట్ ద్వారా విద్యార్థులను చేర్చుకుంటారు. వెబ్సైట్: www.nls.ac.in కర్ణాటక స్టేట్లా యూనివర్సిటీ: కర్ణాటకలోని హుబ్లీలో ఉన్న కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీలో 1) బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్), 2) బీబీ ఎల్ఎల్బీ (ఆనర్స్) కోర్సులు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటుంది. ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. వెబ్సైట్: www.kslu.ac.in భవిష్యత్తు లా కోర్సులు (3, 5 సంవత్సరాలు) పూర్తి చేసినవారికి నేడు విపరీతమైన డిమాండ్ ఉంది. సామాజిక వాతావరణం న్యాయ శాస్త్ర అవసరాన్ని చెప్పకనే చెబుతోంది. సమాజంలో న్యాయ శాస్త్రానికి చిక్కని నేరాలు, అక్రమాస్తుల కేసులు, దొంగతనం కేసులు రోజురోజుకు పెరిగిపోవడం వల్ల, సత్వర పరిష్కారాల కోసం ప్రభుత్వాలు న్యాయస్థానాలను, న్యాయమూర్తుల సంఖ్యను పెంచక తప్పడంలేదు. అలాగే ప్రభుత్వ ప్రాసిక్యూటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వేతర, ప్రైవేటు సంస్థలు కూడా న్యాయపరమైన సలహా కోసం, న్యాయశాస్త్ర సహాయకులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. లా డిగ్రీ చేసినవారు రాష్ట్ర హైకోర్టులో ఖాళీలు వచ్చినప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్లుగా చేరవచ్చు. అంతేకాకుండా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీ), జనరల్పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా నియమితులవడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. న్యాయ వ్యవస్థను గ్రామస్థాయి వరకూ విస్తృత పరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వ్యవస్థలు ఆచరణలోకి వస్తే లా అభ్యర్థుల అవసరం చాలా ఉంటుంది. బ్యాంకులు, సెబి, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్, ఎల్ఐసీ హౌసింగ్కార్పొరేషన్, రైల్వే, పోలీస్ మొదలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో లా అభ్యర్థులకు లీగల్ ఆఫీసర్లుగా మంచి అవకాశాలున్నాయి. అలాగే కార్పొరేట్ రంగంలో అవుట్ సోర్సింగ్లో లీగల్ ప్రాసెస్ ఆఫీసర్లు (ఎల్పీవో)గా చేరవచ్చు. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (ఏపీ యూనివర్సిటీ ఆఫ్ లా పేరును ఇటీవల మార్చారు) ప్రత్యేకమైంది. దీనికి కడప, నిజామాబాద్ ప్రాంతాల్లో క్యాంపస్లు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కదాన్లో 60 సీట్లు ఉంటాయి. 'ఇంటిగ్రేటెడ్ బీఏఎల్ఎల్బీ (ఆనర్స్)' పేరుతో ఈ వర్సిటీ కోర్సును అందిస్తోంది. కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులు ఉన్నవారు మాత్రమే అర్హులు. దీన్లో విద్యార్థులను చేర్చుకోవడానికి జాతీయ స్థాయిలో జరిగే క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్)లో వచ్చిన ర్యాంకును ఆధారంగా తీసుకుంటారు. వెబ్సైట్: dsnlu.ac.in/index.html ఇంటిగ్రేటెడ్ కోర్సులు పీజీ చేయాలని ముందే నిర్ణయించుకున్నప్పటికీ డిగ్రీ ఒక చోట, పీజీ మరో చోట చేయాల్సి వచ్చి అభ్యర్థులు ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతుంటారు. అలాంటి అవస్థలను తొలగించే ప్రధాన ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రారంభించారు. దీని వల్ల ఎలాంటి అవరోధాలు లేకుండా డిగ్రీ, పీజీ వరుసగా పూర్తిచేయవచ్చు. విద్యార్థులకు ప్రవేశపరీక్షల ఒత్తిడిని తగ్గించి విద్యా సంవత్సరాన్ని ఆదాచేయాలనే ఉద్దేశంతో దేశంలో, రాష్ట్రంలోనూ విశ్వవిద్యాలయాలు అయిదేళ్ల కాల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటిని వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలతోపాటు జాతీయస్థాయిలో ప్రముఖ సంస్థలుగా పేరొందిన బిట్స్ పిలానీ, ఐసర్, సెంట్రల్ వర్సిటీలు కూడా ప్రవేశపెట్టాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ప్రధాన ఉద్దేశం ఇంటర్ తర్వాత పీజీ వరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా విద్యార్జన వరుసగా కొనసాగేలా చూడటం. కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా కూడా విద్యార్థిని ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దడం. పరిశోధనా రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారిని మేధావులుగా రూపొందించడం. ప్రయోజనం డిగ్రీ నుంచి పీజీ వరకు జరిగే అవిచ్ఛిన్న అధ్యయనం వల్ల సబ్జెక్టులపై పట్టు కుదురుతుంది. అధ్యాపకులు, తోటి విద్యార్థులతోనూ దీర్ఘకాల అనుబంధం వల్ల వారిసాయంతో కోర్సును విజయవంతంగా పూర్తిచేయవచ్చు. విద్యార్హతలు ఇంటర్ ఏ గ్రూప్ వారైనా ఈ కోర్సుల్లో చేరవచ్చు. కాకపోతే సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ చదివిన అభ్యర్థులు బీటెక్/ఎంటెక్/ ఎంఎస్ లాంటి కోర్సులు చేయవచ్చు. ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులతో ఇంటర్ చదివినవారు బీఏఎల్ఎల్బీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ/ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరవచ్చు. సర్టిఫికెట్ జారీ విధానం విద్యార్థి మొదటి మూడు సంవత్సరాలు పూర్తి చేసి వద్దనుకుంటే మూడేళ్ల కాల వ్యవధితో సాధారణ డిగ్రీ పట్టా ఇస్తారు. నాలుగేళ్లు చదివి ఆగిపోతే ఆనర్స్ డిగ్రీ (ఉదా: బి.ఎ./ బి.ఎస్సి. (ఆనర్స్)), పూర్తిగా 5 సంవత్సరాలు చదివితే పి.జి. (ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్సీ మొదలైనవి) సర్టిఫికెట్ లభిస్తుంది. రాష్ట్రంలో... ఇంటిగ్రేటెడ్ కోర్సుల విధానం మన రాష్ట్రంలో 2006లో ప్రారంభమైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ కోర్సులకు శ్రీకారం చుట్టింది. 2006లో జరిగిన యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్ (వీసీ)ల సమావేశంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. దీన్లో భాగంగా 2006 లో ఆంధ్రా, కాకతీయ, శ్రీ వేంకటేశ్వర, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2007లో నిజామాబాద్, కడప, రాజమండ్రి ప్రాంతాల్లోని వర్సిటీలకు విస్తరించారు. ఆంధ్రా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్రా యూనివర్సిటీ: రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులను మొదట విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ప్రారంభించారు. వీటిలో 1. ఎం.ఎస్.అప్లయిడ్ కెమిస్ట్రీ, 2. ఎం.ఎస్.జియాలజీ, 3. ఎం.ఎస్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 4. ఎం.ఎస్. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులుండాలి. 5. ఎం.ఎస్.ఎకనమిక్స్: ఈ కోర్సుకు ఇంటర్లో 50 శాతం మార్కులుండాలి. అన్నింటికి ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. వెబ్సైట్: www.andhrauniversity.info ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది. కోర్సుల్లో... 1. ఎం.ఎ. అప్లయిడ్ ఎకనమిక్స్, 2. ఎం.ఎస్సి. కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, 3. ఎం.బి.ఎ.ఉన్నాయి. వీటి కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఈ కోర్సులను మహాత్మాగాంధీ, తెలంగాణా, పాలమూరు యూనివర్సిటీల్లో కూడా నిర్వహిస్తారు. అన్ని రకాల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్లో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. వెబ్సైట్: www.osmania.ac.in యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ద్రవిడ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ వర్సిటీ) ఎంఏ, ఎంఎస్సీల్లో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది. కోర్సులు... 1. ఎంఎస్సీ ప్రోగ్రాములు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమికల్సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టొమెట్రీ అండ్ విజన్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ. 2. ఎంఏ ప్రోగ్రాములు: తెలుగు, హిందీ, ఉర్దూ, ఎకనమిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ. సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.uohyd.ac.in ద్రవిడ యూనివర్సిటీ: కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 1) ఎంకాం, 2) ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్)లో ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రాములను నిర్వహిస్తోంది. ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా చేరవచ్చు. వెబ్సైట్: www.dravidianuniversity.ac.in యోగి వేమన వర్సిటీ, నన్నయ వర్సిటీ యోగి వేమన వర్సిటీ: కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ఎంఎస్సీ (బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్సెస్) ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది. ఇంటర్లో సైన్స్ సబ్జెక్టులు చదివిన వారు అర్హులు. ఎంపిక నిమిత్తం వైవీయూ సెట్ రాయాల్సి ఉంటుంది. వెబ్సైట్: yogivemanauniversity.ac.in నన్నయ వర్సిటీ: రాజమండ్రిలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ సైన్స్ విభాగంలో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది. అవి... 1. ఎం.ఎస్. పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్. 2. ఎం.ఎస్. బయోటెక్నాలజీ అండ్ మైక్రోబయాలజీ 3. ఎం.ఎస్. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 4. ఎం.ఎస్. ఎకనమిక్స్. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్ష నిర్వహిస్తారు. సెంట్రల్ వర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ దేశంలోని 7 ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీలు కలిసి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవడానికి 'సెంట్రల్ వర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూ సెట్)ను నిర్వహిస్తున్నాయి. బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కాశ్మీర్, కేరళ, రాజస్థాన్, తమిళనాడులకు చెందిన ఈ వర్సిటీలు ఎంఏ, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములను అందిస్తున్నాయి. సీయూ సెట్ రాసేందుకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. వెబ్సైట్: www.cub.ac.in జాతీయ స్థాయిలో.... ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రాధాన్యాన్ని, వాటి ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాన్ని గుర్తించిన ఎయిమ్స్, ఐసర్ లాంటి పలు జాతీయ స్థాయి విద్యా సంస్థలు సైన్స్ సబ్జెక్టులతో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి... ఐఐఎస్ఈఆర్ బిట్స్- పిలానీ భారతీదాసన్ యూనివర్సిటీ ఐఐటీలు ఎయిమ్స్ పుదుచ్చేరి యూనివర్సిటీ వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదలైనవి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెండు రకాల ఇంటిగ్రేటేడ్ కోర్సులను అందిస్తోంది. అవి.. 1. ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్, 2. నానో టెక్నాలజీ. వీటి కాల వ్యవధి 5 సంవత్సరాలు. ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి మూడు సంవత్సరాలకు రూ.18,760లు ఫీజు చెల్లించాలి.అదేవిధంగా నాలుగు, అయిదు సంవత్సరాలకు రూ.32,500లు చెల్లించాల్సి ఉంటుంది. కోర్సులను సమర్ధంగా నిర్వహించేందుకు ఇప్పటివరకు రూ.1.20 కోట్లు వెచ్చించి అత్యాధునిక లైబ్రరీ, కంప్యూటర్లు, సెమినార్ హాలు, తరగతిగదులను ఏర్పాటు చేశారు. నానో టెక్నాలజీ: నానో టెక్నాలజీ రంగంలో నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కోర్సును నాగార్జున వర్సిటీలో 2007 లో ప్రవేశపెట్టారు. ఇందులో ఇప్పటివరకు ఎంసెట్, ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏఎన్ యూ సెట్ ద్వారా కూడా ప్రవేశాలు కల్పిస్తారు. మొదటి మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత విద్యార్థులు కోర్సు నుంచి వెళ్లిపోవాలనుకుంటే వారికి బీఎస్సీ డిగ్రీ ధ్రువపత్రం అందజేస్తారు. మొత్తం అయిదేళ్లు పూర్తిచేస్తే వారికి ఎంఎస్సీ నానో టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ కోర్సు ధ్రువపత్రం ఇస్తారు. ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా వివిధ పరిశ్రమల్లో శిక్షణ పొందేలా చూస్తారు. ఉద్యోగాలు డిగ్రీ పూర్తి చేస్తే తప్ప ఉద్యోగాలకు ఒక స్థిరమైన అర్హత రాదనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోనే బ్యాంకుల నుంచి త్రివిధ దళాల వరకు ఎన్నో రకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. చిన్న వయసులోనే ఉద్యోగ సంపాదనతో ఆర్థికంగా నిలదొక్కుకుని ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఉద్యోగంలోనూ క్రమంగా పై స్థాయికి చేరుకోవచ్చు. ప్రభుత్వ రంగంలో అనేక సంస్థలు ఇంటర్ అర్హతతో అనేక ఉద్యోగాలను అందిస్తున్నాయి. వీటికి సంబంధించిన ప్రకటనలు పత్రికల్లో వెలువడినప్పుడు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవియేషన్ కేడర్ అబ్జర్వర్ భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) ఏవియేషన్ కేడర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో 'అబ్జర్వర్గా (షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్) నియామకాలు చేపడుతుంటుంది. కేవలం అవివాహితులైన స్త్రీ, పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఇంటర్లో సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. పురుషుల ఎత్తు 162.5 సెం.మీ., మహిళలు 152 సెం.మీ. ఉండాలి. అర్హులైన వారిని సర్వీస్ సెలక్షన్ బోర్డ్ రెండు దశల్లో ఎంపిక చేస్తుంది. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి ఆఫీసర్లుగా సబ్-లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఇస్తారు. భవిష్యత్తు: శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారి కెరీర్ సబ్-లెఫ్టినెంట్ హోదాలో మొదలవుతుంది. తరువాత లెఫ్టినెంట్, లెఫ్టినెంట్ కమాండర్, కమాండర్ హోదాలకు చేరుకుంటారు. వెబ్సైట్: www.nausena-bharti.nic.in త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వీటినే త్రివిధ దళాలుగా పిలుస్తున్నాం. సాహసవంతులకు, దేశ సేవలో తమవంతు సహాయ సహకారాలు అందించేందుకు త్రివిధ దళాలు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్.డి.ఎ. అండ్ నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాల్లో వివిధ హోదాల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యు.పి.ఎస్.సి) ఈ పరీక్ష నిర్వహిస్తుంది. కేవలం అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి వయసు 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీస ఎత్తు 157.5 సెం.మీ. ఉండాలి. (ఎయిర్ఫోర్స్ అభ్యర్థులకు 162.5 సెం.మీ.) విద్యార్హతలు: ఎన్.డి.ఎ. ఆర్మీ వింగ్ కోసం ఇంటర్ లేదా తత్సమానం పాసై ఉండాలి. ఎయిర్ఫోర్స్, ఎన్.డి.ఎ. నావెల్ వింగ్స్, నావెల్ అకాడమీ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) కోసం ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ పాసై ఉండాలి. ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాలకు ఎంపికైన వారికి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్.డి.ఎ.)లో కనీసం 3 సంవత్సరాలపాటు ప్రిలిమినరీ శిక్షణ ఉంటుంది. మొదటి రెండున్నర సంవత్సరాలు అందరికీ సమానం. దీన్లో పాసైతే తాము చేరిన విభాగాన్నిబట్టి బి.ఎస్సి./ బి.ఎస్సి. (కంప్యూటర్)/ బి.ఎ. డిగ్రీని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.) ఇస్తుంది. నావెల్ అకాడమీకి ఎంపికైన వారికి కేరళలోని ఎజిమలా ప్రాంతంలో ఉన్న నావెల్ అకాడమీలో 4 సంవత్సరాలు శిక్షణ ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారికి బి.టెక్. డిగ్రీ ఇస్తారు. ఎన్.డి.ఎ. శిక్షణ అనంతరం తదుపరి శిక్షణ నిమిత్తం ఆర్మీ అభ్యర్థులను డెహ్రాడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీకి, నావెల్ అభ్యర్థులను ఆరు నెలలపాటు కేడెట్ ట్రెయినింగ్షిప్కు, ఎయిర్ఫోర్స్ వారిని హైదరాబాద్లోని ఎ.ఎఫ్.ఎ. విభాగానికి పంపిస్తారు. నియామకాల్లో భాగంగా ఆర్మీలో చేరే వారికి లెఫ్టినెంట్ హోదా ఇస్తారు. ఎయిర్ఫోర్స్ అభ్యర్థులకు ఫ్లయింగ్ ఆఫీసర్, నేవీ అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలను ఇస్తారు. వెబ్సైట్: www.upsc.gov.in రైల్వే ఉద్యోగాలు దేశంలో ఎక్కువశాతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాల్లో రైల్వే ముందుంటోంది. టెక్నికల్/ నాన్ టెక్నికల్ విభాగాల నేపథ్యంలో రైల్వేలో ఉద్యోగాలను భర్తీ చేస్తుంటారు. ఇంటర్ అర్హతతో దరఖాస్తు చేసుకోదగిన నాన్-టెక్నికల్ రైల్వే ఉద్యోగాలు: 1. కమర్షియల్ క్లర్క్ 2. టికెట్ కలెక్టర్/ టికెట్ ఎగ్జామినర్ 3. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్4. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 5. ట్రెయిన్స్ క్లర్క్ 6. ట్రెయిన్ టికెట్/ స్టాటిస్టికల్ క్లర్క్ 7. గూడ్స్ క్లర్క్ 8. కోచింగ్ క్లర్క్ వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు, ఇతరులకు నిబంధనల మేరకు మినహాయింపులు లభిస్తాయి ఎంపిక నిమిత్తం రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో రాత పరీక్ష జరుగుతుంది. దీన్లో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అరిథ్మెటిక్ విభాగాలు ఉంటాయి. దీనికి 90 నిమిషాలు కేటాయిస్తారు. ప్రశ్నలు 100 నుంచి 120 దాకా ఉంటాయి. దీన్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.rrbsec.org/ పోలీస్ కానిస్టేబుల్ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇంటర్లో ఉత్తీర్ణులైన వారికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. వీటిలో స్త్టెపెండరీ క్యాడెట్ ట్రెయినీ (ఎస్సీటీ) పోలీస్ కానిస్టేబుల్ (సివిల్- పురుషులు), ఎస్సీటీ కానిస్టేబుల్స్ (సివిల్ - ఏఆర్ మహిళలు) తదితర విభాగాలు ఉంటాయి. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సిబ్బంది నియామక వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఇంటర్ ఏ గ్రూప్ చదివిన వారైనా దరఖాస్తు చేయవచ్చు. అర్హతల్లో భాగంగా వయసు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుషులు 167.6 సెం.మీ. ఎత్తు, మహిళలు 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగిన బరువు అవసరం. ఎంపిక మూడు దశల్లో ఉంటుంది 1. ప్రాథమిక ఎంపిక పరీక్ష: ఇది పరుగుపందెం విభాగం. 2. శారీరక సామర్థ్య పరీక్ష: ప్రాథమిక దశ పూర్తిచేసిన వారికి ఉద్దేశించారు. 3. రాత పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇంగ్లిష్, అరిథ్మెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. వెబ్సైట్: www.apstatepolice.org బ్యాంకింగ్ రంగం ఇటీవల బ్యాంకింగ్ రంగంలో వేల సంఖ్యలో క్లరికల్ ఉద్యోగాలకు ప్రకటనలు వెలువడుతున్నాయి. అర్హతలు, నియామకంలో ఎస్.బి.ఐ.కి ఇతర బ్యాంకులకు స్వల్ప తేడా ఉంటుంది. క్లరికల్ పోస్టుల అర్హతలు: ఇతర బ్యాంకుల్లో క్లరికల్ పోస్టులకు ఇంటర్లో (10+2 విధానంలో) 50 శాతం మార్కులు ఉండాలి. ఇంగ్లిష్ బాగా రాయడం, చదవడం వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వయసు 18నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక నిమిత్తం రాత పరీక్షకు హాజరు కావాలి. ఇది రెండు పేపర్లు. 1. ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష: దీన్లో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ క్లరికల్ ఆప్టిట్యూడ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగాలు ఉంటాయి. 2. డిస్క్రిప్టివ్ పేపర్: దీన్లో 5 వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. సుమారు 45 నిమిషాలు కేటాయిస్తారు. కనీసం మూడింటికి సమాధానాలను తమ రాష్ట్ర అధికార భాషలో రాయవచ్చు. ఎస్.బి.ఐ. క్లరికల్ పరీక్ష అర్హతలు: 1. ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. 2. వయసు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 3. ఇంగ్లిష్ చదవడం, రాయడం బాగా వచ్చి ఉండాలి. 4. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఎంపికలో భాగంగా ఆబ్జెక్టివ్ తరహా రాతపరీక్ష ఉంటుంది. దీన్లో జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, మార్కెటింగ్ ఆప్టిట్యూడ్/ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటాయి. ఇతరములు పి సి ఎమ్ (ఎమ్ పి సి) తో ఎన్ డి ఎ ప్రవేశ పరీక్ష పి సి ఎమ్ తో జాయింట్ ప్రవేశ పరీక్ష – ఐ ఐ టి పి సి ఎమ్ (ఎమ్ పి సి) తో ఆల్ ఇండియా ఇంజినీరింగ్ (రంగు) ప్రవేశ పరీక్ష ఆల్ ఇండియా ప్రీ-మెడికల్/ ప్రీ-డెంటల్ ప్రవేశ పరీక్ష (ఎ ఐ పి ఎమ్ టి) ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజి ప్రవేశ పరీక్ష ( ఎమ్ బి బి ఎస్ కోసం ) జవానుల నియామకం కోసం పరీక్షలు ఇండియన్ నావీలో (భారతీయునిలో), టెక్నికల్ (టెక్) కేడెట్ ఎంట్రీ స్కీమ్ బి.ఎస్.ఎఫ్ లో అసిస్టెంట్ సబ్-ఇనస్పెక్టరు క్లర్కు సైన్సులో రైల్వే ఎప్రెంటిస్ ల స్పెషల్ క్లర్క్ ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు జేఈఈ అడ్వాన్స్డ్ -2015లో మార్పులు దేశంలో లక్షల మంది ఇంటర్మీడియెట్, తత్సమాన కోర్సుల విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకునే ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ - 2015 కు రంగం సిద్ధమైంది. పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. 2012 నుంచి అమలు చేస్తున్న బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్ అనే నిబంధనలను సడలిస్తూ కొత్త ప్రవేశ విధానాన్ని ప్రకటించడంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ కొత్త ప్రవేశ విధానం, విద్యార్థులు దృష్టి సారించాల్సిన అంశాలపై విశ్లేషణ.. జాయింట్ ఎంట్రెన్స ఎగ్జామ్ (జేఈఈ)-అడ్వాన్స్డ్.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స- ధన్బాద్లలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించి 2012 నుంచి అమలు చేస్తున్న అడ్వాన్స్డ్ విధానం దేశవ్యాప్తంగా వేల మంది విద్యార్థుల్ని నిరాశకు గురి చేసింది. కారణం.. బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్లో నిలవాలనే నిబంధన విధించడం. దీనివల్ల ఎందరో విద్యార్థులు ఎంట్రెన్స్లో రాణించినా టాప్-20 పర్సంటైల్లో నిలవలేక అవకాశాలు చేజార్చుకున్నారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకులు వచ్చినా టాప్-20 పర్సంటైల్లో లేకపోవడంతో దేశవ్యాప్తంగా దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఐఐటీల్లో అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోయారు. ఈ టాప్-20 పర్సంటైల్ ప్రభావం ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులపై అధికంగా కనిపించింది. బోర్డ్ పరీక్షల్లో 91 శాతం పొందిన విద్యార్థులు సైతం టాప్-20 పర్సంటైల్ జాబితాలో చోటు పొందలేక ఐఐటీలో సీటు సాధించలేకపోయారు. సరికొత్త విధానం.. విద్యార్థుల్లో ఆనందం జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ విధానం, కౌన్సెలింగ్లకు సంబంధించి మూడేళ్లుగా విద్యార్థుల నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జాయింట్ అడ్మిషన్ బోర్డ్.. జేఈఈ-అడ్వాన్స్డ్- 2015 ద్వారా ఐఐటీల్లో ప్రవేశాల నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. అవి.. జేఈఈ-మెయిన్ పరీక్షలో 1,50,000 మందిలో ఒకరిగా నిలవాలి. విద్యార్థులు టాప్-20 పర్సంటైల్లో నిలవాలి లేదా ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో 75 శాతం ఉత్తీర్ణత సాధించాలి. ఈ రెండింటిలో ప్రధానంగా రెండో నిబంధన ఇప్పుడు విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తోంది. ఐఐటీ-జేఈఈ స్థానంలో 2012 నుంచి జేఈఈ-మెయిన్, అడ్వాన్స్డ్ అనే రెండు దశల్లో ప్రవేశ ప్రక్రియ ఉంటోంది. తాజా సడలింపుల ఫలితంగా బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్లో నిలవకపోయినా జేఈఈ-అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు సాధించి, బోర్డ్ పరీక్షల్లో కనీసం 75 శాతం మార్కులు పొందితే ఐఐటీల్లో కౌన్సెలింగ్కు అర్హత లభిస్తుంది. జేఈఈ మెయిన్.. యథాతథం జేఈఈ-మెయిన్..ఐఐటీలు మినహా ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో (ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు తదితర) ప్రవేశానికి అవసరమైన పరీక్ష. తాజా సడలింపుల్లో మెయిన్ విషయంలో ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. గత మూడేళ్ల మాదిరిగానే 2015లోనూ యథాతథంగా జరగనుంది. ఈ క్రమంలో.. కౌన్సెలింగ్ సమయంలో ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ కొనసాగనుంది. విద్యార్థులు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మార్కులా.. పర్సంటైలా జేఈఈ- మెయిన్, అడ్వాన్స్డ్ ఔత్సాహిక విద్యార్థులు ఇప్పుడు ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అవి.. జేఈఈ అడ్వాన్స్డ్కు బోర్డ్ పరీక్షల్లో టాప్-20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కుల నిబంధన నేపథ్యంలో ఈ రెండింటిలో ఏదో ఒకదానిలో నిలిచేలా మార్కులు సాధించడం. జేఈఈ మెయిన్లో యథాతథంగా బోర్డ్ పరీక్షల్లో మార్కులకు 40 శాతం వెయిటేజీ కొనసాగించనున్న నేపథ్యంలో బోర్డ్ పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధన దిశగా కృషి చేయాలి. ఫలితంగా జేఈఈ-మెయిన్, అడ్వాన్స్డ్ రెండింటికీ సంపూర్ణ సంసిద్ధత సొంతం చేసుకోవచ్చు. కేవలం ఐఐటీలనే లక్ష్యంగా పెట్టుకుంటే బోర్డ్ పరీక్షలో 75 శాతం పొందే విధంగా అకడమిక్గా కృషి చేసి.. జేఈఈ అడ్వాన్స్డ్లో విజయం దిశగా సిద్ధం కావొచ్చు. కానీ ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో ప్రవేశం పొందాలంటే.. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇంటర్మీడియెట్ మార్కులకు 40 శాతం వెయిటేజీ నిబంధనను అనుక్షణం గుర్తుంచుకోవాలి. ప్రిపరేషన్.. విశ్లేషణాత్మకం జేఈఈ-మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్ష తేదీలు కూడా వెల్లడైన నేపథ్యంలో ఔత్సాహిక విద్యార్థులు ఇప్పటినుంచే తమ ప్రిపరేషన్ను వ్యూహాత్మకంగా కొనసాగించాలి. ‘ఐఐటీల్లో కౌన్సెలింగ్కు కనీసం 75 శాతం మార్కులు’ అనే సడలింపునకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా.. ఎంట్రెన్స్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించేలా కృషి చేయాలి. జేఈఈ-మెయిన్, అడ్వాన్స్డ్ రెండు పరీక్షల్లో గత మూడేళ్లుగా ప్రశ్నలు పూర్తిగా అనువర్తిత, విశ్లేషణాత్మక దృక్పథంతో ఆలోచించి సమాధానం ఇవ్వాల్సినవిగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు సిలబస్లోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సదరు సమస్య పరిష్కారానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలపై అవగాహన పెంచుకోవాలి. దీనివల్ల అన్నిటిలోకి సులువైన మార్గంపై అవగాహన వస్తుంది. పరీక్షలో సమయ పాలనకు ఎంతో తోడ్పడుతుంది. ప్రశ్న- సమాధానం అనే దృక్పథాన్ని వీడి అనువర్తిత ఆధారిత పరిష్కార మార్గాలను అన్వేషించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. ఇంటర్మీడియెట్ సిలబస్ను, జేఈఈ-మెయిన్స్, అడ్వాన్స్డ్ సిలబస్లతో బేరీజు వేసుకోవాలి. వాటిలో తాము ఇప్పటికే పట్టు సాధించిన అంశాలు.. బలహీనంగా ఉన్న టాపిక్స్తో ఒక పట్టిక రూపొందించుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలకు మెయిన్స్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఉంటున్న ప్రాధాన్యతను గత ప్రశ్నపత్రాల విశ్లేషణ ద్వారా తెలుసుకోవాలి. దీనికి అనుగుణంగా ఆయా అంశాలకు ప్రిపరేషన్ పరంగా ప్రాధాన్యం ఇవ్వాలి. తాము బలహీనంగా ఉన్న అంశాలకు.. ఇతర ముఖ్యమైన టాపిక్స్ మధ్య అనుసంధానం ఉంటే కచ్చితంగా వాటిపై పట్టు సాధించాలి. ముఖ్యంగా ఇలాంటి ఇంటర్-రిలేటెడ్ అంశాలు ఫిజిక్స్ విభాగంలో ఎక్కువగా ఉంటాయి. జేఈఈ-మెయిన్ వచ్చే ఏడాది ఏప్రిల్ చివరి వారంలో, అడ్వాన్స్డ్ మే 24, 2015న జరగనుంది. అంటే.. విద్యార్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో సిలబస్లోని అన్ని అంశాలపై పట్టు సాధించడం సులభమే. ఇంటర్మీడియెట్ సిలబస్ను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు జేఈఈ ప్రిపరేషన్కు కేటాయించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫిబ్రవరి 15 తర్వాత నుంచి బోర్డ్ పరీక్షల ప్రిపరేషన్కు కేటాయించాలి. సాధారణంగా మార్చి చివరి వారానికి బోర్డ్ పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత మెయిన్కు కనీసం నెల రోజుల వ్యవధి లభిస్తుంది. ఈ సమయంలో పూర్తిగా జేఈఈ సిలబస్ రివిజన్కే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత అడ్వాన్స్డ్కు మరో నెల రోజుల సమయం లభిస్తుంది. అప్పుడు కూడా రివిజన్కే ఎక్కువ సమయం కేటాయించాలి. అంటే ఔత్సాహిక విద్యార్థులు ఫిబ్రవరి నాటికి సిలబస్ ప్రిపరేషన్ పూర్తి చేయాలి. లేదంటే ఆ తర్వాత బోర్డ్ పరీక్షలు, ప్రాక్టికల్స్ వంటి వాటికి సమయం సరిపోతుంది. ఆ తర్వాత లభించే సమయంలో జేఈఈ సిలబస్ ప్రిపరేషన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. ఇప్పట్నుంచే బోర్డ్ పాఠ్యాంశాలను, జేఈఈ సిలబస్ అంశాలను తులనాత్మక అధ్యయనం చేస్తూ.. తమకు అనుకూలమైన రీతిలో ముఖ్యాంశాలు, షార్ట్కట్ మెథడ్స్తో కూడిన సొంత నోట్స్ను రూపొందించుకోవాలి. గత పరీక్షల్లో ప్రశ్నల క్లిష్టత స్థాయి, నెగెటివ్ మార్కింగ్ వంటివి పరిగణనలోకి తీసుకుంటే మొత్తం కేటాయించిన మార్కు ల్లో 50 నుంచి 60 శాతం మార్కులు సాధిస్తే కౌన్సెలింగ్ కాల్ ఆశించొచ్చు. ఈ మేరకు విద్యార్థులు తమ వ్యూహాలకు పదును పెట్టాలి. ఉత్సాహాన్ని నింపే మార్పులు జేఈఈ అడ్వాన్స్డ్కు సంబంధించి తాజా మార్పులు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతాయనడంలో సందేహం లేదు. కానీ ఇదే సమయంలో విద్యార్థులు కనీస అర్హత నిబంధనకే పరిమితం కాకుండా.. అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలి. ఫలితంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి అవసరమైన మెయిన్ పరీక్ష విషయంలో లాభిస్తుంది. ప్రిపరేషన్ పరంగా విద్యార్థులు విశ్లేషణాత్మక దృక్పథంతో ఆయా అంశాల్లో పట్టు సాధించాలి. ఒక అంశాన్ని చదివే సమయంలో సదరు అంశానికి గత నాలుగైదేళ్లలో లభించిన ప్రాధాన్యం, ప్రశ్నల క్లిష్టత స్థాయిని పరిశీలిస్తూ చదివితే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. - ఆకాశ్ చౌదరి, డెరైక్టర్, ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మంచి ర్యాంకే ప్రధాన లక్ష్యం జేఈఈ అడ్వాన్స్డ్ విద్యార్థులకు పరీక్షలో మంచి ర్యాంకు ప్రధాన లక్ష్యం కావాలి. నిబంధనల్లో సడలింపు ఉపశమనం కలిగించే మాట వాస్తవం. కానీ లక్షల మంది పోటీ పడే పరీక్షలో అకడమిక్ మార్కులు, అర్హత నిబంధనల విషయంలో కనీస అంశాలనే పరిగణనలోకి తీసుకోకూడదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు బోర్డ్ పరీక్షల్లోనూ అత్యధిక మార్కులు సాధించాల్సిన ఆవశ్యకత నెలకొంది. - ఎం. అరవింద్ కుమార్, ఐఐటీ ఫౌండేషన్ కోర్సు డెరైక్టర్ టి.ఐ.ఎం.ఇ. ఇన్స్టిట్యూట్ స్వీయ ప్రణాళిక.. వ్యూహాత్మక ప్రిపరేషన్తో విజయం జేఈఈ-అడ్వాన్స్డ్ విధానంలో తాజా సడలింపు వల్ల చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం లభిస్తుంది. టాప్-20 పర్సంటైల్ నిబంధన కారణంగా మా బ్యాచ్లో చాలా మంది విద్యార్థులకు అడ్వాన్స్డ్లో మంచి ర్యాంకు వచ్చినా ఐఐటీల్లో సీటు లభించలేదు. జేఈఈ- అడ్వాన్స్డ్లో విజయం సాధించాలంటే ముందుగా మానసిక సంసిద్ధత ఉండాలి. పోటీ పడే వారి సంఖ్యను చూసి ఆందోళన చెందకుండా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. సరైన సమయపాలన, తమ వ్యక్తిగత బలాలు, బలహీనతలను అనుసరించి ప్రాక్టికల్ అప్రోచ్తో ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి నాటికి ఇంటర్ సిలబస్ను పోటీ పరీక్షలో కోణంలో చదవాలి. తర్వాత వీలైనంత ఎక్కువగా మాక్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు రాయాలి. - రావూరి లోహిత్,ఫోర్త ర్యాంకర్, జేఈఈ అడ్వాన్స్డ్-2014 జేఈఈ- 2015 సమాచారం జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ : అక్టోబర్ రెండవ వారం జేఈఈ మెయిన్ పరీక్ష : 2015, ఏప్రిల్ చివరి వారం జేఈఈ అడ్వాన్స్డ్ - 2015 ముఖ్య తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్: మే 2, 2015 నుంచి మే 7, 2015 వరకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: మే 9, 2015 నుంచి మే 12, 2015 వరకు పరీక్ష తేదీ: మే 24, 2015 మార్కుల వెల్లడి: జూన్ 13, 2015 తుది ఫలితాల వెల్లడి: జూన్ 18, 2015 వెబ్సైట్: http://jeeadv.iitkgp.ac.in/ జేఈఈ పరీక్ష విధానం జేఈఈ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో, పెన్-పేపర్ విధానంలో జరుగుతుంది. మెయిన్స్ ఒకే పేపర్గా మూడు గంటల వ్యవధిలో మూడు విభాగాల్లో (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) ఉంటుంది. అడ్వాన్స్డ్ పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. ప్రతి పేపర్కు కేటాయించిన సమయం మూడు గంటలు. ప్రశ్నించే విభాగాలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎడ్యు న్యూస్ ప్రతి జిల్లాలో ఇన్నోవేషన్ ల్యాబ్స్ పాఠశాల, యూనివర్సిటీల స్థాయిలో విద్యార్థులను పరిశోధన దిశగా ఆకర్షితులను చేసే క్రమంలో ప్రభుత్వం కొత్త చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు దిశగా యోచిస్తోంది. దేశంలో పరిశోధన కార్యకలాపాలను పెంచేందుకు తలపెట్టిన రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ పథకంలో భాగంగా.. ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఈ ఇన్నోవేషన్ ల్యాబ్లను.. ఇండస్ట్రీ, అకడమిక్ వర్గాల భాగస్వామ్యంతో సంబంధిత ఉన్నత విద్యా మండళ్లకు అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. దేశానికి అవసరమైన పరిశోధనల విషయంలో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించడం వీటి ప్రధాన ఉద్దేశం. ప్రతి ఏటా వేయి మంది అమెరికా అధ్యాపకుల రాక భారతీయ యూనివర్సిటీల్లో ఇక నుంచి ప్రతి ఏటా వేయి మంది అమెరికా అధ్యాపకులు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా సైన్స్ అండ్ ఇన్నోవేషన్స్ విభాగంలో ఈ లెక్చర్స్ ఇచ్చేందుకు ఎంపిక చేసిన వేయి మంది అమెరికా అధ్యాపకులు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న యూనివర్సిటీలకు రానున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ త్వరలో రూపొందించనుంది. ఎంసెట్లలో మెరవాలంటే.. ఎంసెట్.. ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. ఇంటర్మీడియెట్ ఎంపీసీ/బైపీసీ విద్యార్థుల లక్ష్యం.. ఎంసెట్. ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే ఎంసెట్ ప్రిపరేషన్ ప్రారంభిస్తారనడంలో సందేహం లేదు. రెండు రాష్ట్రాల్లో 3 లక్షల మంది వరకూ ఎంసెట్ ఆశావహులున్నారు. గతేడాది వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఒకే ఎంసెట్ జరగగా.. ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరుగా ఎంసెట్-2015 నిర్వహణకు ప్రకటనలు విడుదల చేశాయి. రెండు రాష్ట్రాల్లోనూ (ఆంధ్రప్రదేశ్లో మే 8న, తెలంగాణ రాష్ట్రంలో మే 14న) ఎంసెట్ జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రిపరేషన్ ప్రణాళిక.. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు పరీక్ష కాలం నేటి నుంచి తెలంగాణలో; బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియెట్ పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంసెట్ ప్రకటనలు విడుదల చేశాయి. దాంతో ఇటు ఇంటర్ పరీక్షల్లో మార్కులు; అటు ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించడం అనే ఆలోచనలతో విద్యార్థులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇంటర్ సిలబస్పై పట్టు సాధిస్తే ఎంసెట్ గురించి ఆందోళన చెందనవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఈ సమయం.. ఇంటర్కే వాస్తవానికి ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల ఔత్సాహికులు ఇంటర్లో చేరిన తొలి రోజు నుంచే ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించే దిశగా కృషి చేస్తారనడంలో సందేహం లేదు. కానీ.. ప్రస్తుతం విద్యార్థులు ఇంటర్ పరీక్షలు బాగా రాసి మెరుగైన మార్కులు సాధించడంపైనే దృష్టిపెట్టాలి. ఎందుకంటే రాష్ట్రాల స్థాయిలో జరిగే ఎంసెట్, జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈలో తుది ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ (ఎంసెట్- 25 శాతం; జేఈఈ మెయిన్- 40 శాతం) ఉంటుంది. టీఎస్ 47.. ఏపీ 38: ఎంసెట్ అభ్యర్థులు ఇంటర్ పరీక్షల తర్వాతే ఎంసెట్కు ఉపక్రమించాలి. పరీక్షల తర్వాత తెలంగాణ ఎంసెట్కు 47 రోజులు; ఏపీ ఎంసెట్కు 38 రోజుల వ్యవధి ఉంటుంది. రివిజన్, ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్స్కు ఎక్కువ టైమ్ కేటాయించాలి. ఇంటర్లో అకడమిక్ పరంగా క్లిష్టంగా భావించి విస్మరించిన అంశాల జోలికి వెళ్లకూడదు. ఎంసెట్ ప్రిపరేషన్లో సమయపాలన చాలా ముఖ్యం. గంటల కొద్దీ ఒకే టాపిక్ను చదవకుండా.. ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా సమయం కేటాయించాలి. ఇందుకోసం గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. రోజూ పది నుంచి 12 గంటలు ప్రిపరేషన్కు కేటాయించాలి. కాన్సెప్ట్స్.. ప్రాక్టీస్ ముఖ్యం ఎంసెట్లో సిలబస్, ప్రశ్నల స్వరూపాన్ని పరిశీలిస్తే అడిగే ప్రశ్నలన్నీ ఇంటర్ సిలబస్లోని భావనల ఆధారంగానే ఉంటున్నాయి. దీన్ని గుర్తించి అన్ని సబ్జెక్టుల్లోని కీలక భావనలపై పట్టు సాధించాలి. భావనలు/ఫార్ములాలతో కూడిన షార్ట్ నోట్స్లు రివిజన్లో ఎంతో ఉపకరిస్తాయి. ఎంసెట్లోని అన్ని సబ్జెక్ట్ల ప్రాక్టీస్కు ప్రాధాన్యమివ్వాలి. పూర్తిగా ప్రాక్టికల్గా ఉండే మ్యాథమెటిక్స్, బొమ్మలు, చార్ట్ల రూపంలో ఉండే బయాలజీ అయినా ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్ ఎంతో మేలు చేస్తుంది. ప్రాక్టీస్తో ప్రశ్న లేదా సమస్యను సాధించే క్రమంలో మూల భావన ఆధారంగా మరెన్నో కొత్త కోణాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రశ్నను ఏ విధంగా అడిగినా రాయగలిగే నేర్పు లభిస్తుంది. ఎంసెట్ కామన్ సక్సెస్ టిప్స్ ఇంజనీరింగ్, మెడికల్ విభాగమేదైనా విద్యార్థులకు ఎంసెట్లో విజయానికి మంచి మార్కుల సాధనకు ఉపయోగపడే టిప్స్.. ఎంసెట్లో దాదాపు ప్రశ్నలన్నీ ఇంటర్మీడియెట్ సిలబస్ ఆధారంగానే ఉంటాయి. అవి ఇన్డెరైక్ట్గా ఆయా భావనల ఆధారంగా ఉంటాయి. దీన్ని గుర్తించి కాన్సెప్ట్స్పై పట్టు సాధించాలి. అకాడమీ పుస్తకాల్లో ప్రతి చాప్టర్ చివరలో ఇచ్చిన ప్రాక్టీస్ ప్రశ్నలు, ఆయా అధ్యాయాల్లో హైలైట్ చేసిన అంశాలను కచ్చితంగా చదవాలి. టేబుల్స్; చార్ట్స్; పాయింటర్స రూపొందించుకోవడం వల్ల సమయం ఆదా చేసుకోవచ్చు. ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత అందుబాటులో ఉన్న సమయంలో.. ఎంసెట్ సిలబస్ ఆధారంగా ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం; ద్వితీయ సంవత్సరం అంశాల ప్రిపరేషన్కు నిర్దిష్ట టైం ప్లానింగ్ అనుసరించాలి. ఎంసెట్-2015కు హాజరవుతున్న విద్యార్థులు ఇంటర్ పరీక్షల తర్వాత 15 రోజుల సమయాన్ని మొదటి సంవత్సరం సిలబస్కు కేటాయించాలి. కనీసం మూడు గ్రాండ్ టెస్ట్లు, వీలైనన్ని మాక్ టెస్ట్లకు హాజరవడం మేలు చేస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులు 110 నుంచి 130 మార్కులు; మెడికల్ విభాగం విద్యార్థులు 120 నుంచి 145 మార్కులు పొందే విధంగా చదవాలి. ఎంసెట్తో జతగా జేఈఈ ఎంసెట్ రాసే అభ్యర్థుల్లో దాదాపు సగం మంది జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్లకు కూడా పోటీపడుతున్నారు. గతేడాది ఎంసెట్ ఇంజనీరింగ్కు 2,82,799 మంది పోటీ పడగా.. జేఈఈ మెయిన్కు హాజరైన తెలుగు విద్యార్థుల సంఖ్య 1.22 లక్షలుగా నమోదవడమే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్డ్కు 20వేలకు పైగా అభ్యర్థులు ఎంపికయ్యారు. రెండింటికీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఒకే సమయంలో ఎంసెట్, జేఈఈ ప్రిపరేషన్లను ఫలవంతం చేసుకోవచ్చు. ఉమ్మడి ప్రిపరేషన్కు టిప్స్.. ఎంసెట్, జేఈఈ మెయిన్ సిలబస్ల మధ్య వ్యత్యాసాలు, పోలికలు గుర్తించాలి. జేఈఈకి అదనంగా ఉన్న అంశాలను గుర్తించి వాటి కోసం ప్రతిరోజూ కనీసం రెండు గంటల అదనపు సమయం కేటాయించాలి. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ల్లో ప్రశ్నలన్నీ కాన్సెప్ట్, అప్లికేషన్ ఆధారితంగానే ఉంటాయి. ఈ విధానంలో ప్రిపరేషన్ అటు ఎంసెట్కూ ఉపయుక్తమే. ఈ ఏడాది జేఈఈ-మెయిన్ ఆఫ్లైన్లో ఏప్రిల్ 4న; ఆన్లైన్లో ఏప్రిల్ 10, 11 తేదీల్లో జరగనుంది. అంటే.. ఇంటర్మీడియెట్ పరీక్షల తర్వాత ఆఫ్లైన్ ఔత్సాహికులకు వారం రోజులు; ఆన్లైన్ అభ్యర్థులకు పదిరోజులు సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో జేఈఈ ప్రిపరేషన్కు ఎక్కువ టైమ్ కేటాయించాలి. జేఈఈ అడ్వాన్స్డ్ మే 24వ తేదీన జరగనుంది. కాబట్టి విద్యార్థులు ప్రిపరేషన్ పరంగా ఆందోళన చెందక్కర్లేదు. ప్రస్తుత ఇంటర్మీడియెట్ సిలబస్ ప్రకారం అడ్వాన్స్డ్కు సులువుగానే సన్నద్ధత పొందొచ్చు. అడ్వాన్స్డ్ గత పరీక్షల తీరుతెన్నులు పరిశీలిస్తే ప్రాక్టీస్ ఆధారిత ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. దీన్ని గుర్తించి విద్యార్థులు ప్రాక్టీస్కు పెద్దపీట వేయాలి. ఇది అటు అడ్వాన్స్డ్కు, ఇటు ఎంసెట్కు రెండింటికీ ఉపయుక్తంగా ఉంటుంది. ఎంసెట్ సమాచారం తెలంగాణ, ఎంసెట్-2015 అర్హత: ఇంజనీరింగ్: 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. అగ్రికల్చర్ - మెడికల్: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాలు లేదా ఏపీ ఆన్లైన్ కేంద్రాల వద్ద ఇంటర్మీడియెట్ హాల్ టికెట్ నెంబర్; పుట్టిన తేదీ; తండ్రిపేరు వంటి వివరాలు తెలియజేసి రూ. 250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ట్రాన్సాక్షన్ ఐడీ పొందాలి. ట్రాన్సాక్షన్ ఐడీ ఆధారంగా www.tseamcet.in వెబ్సైట్లోని APPLY ONLINE బటన్పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫాం విండో ఓపెన్ అవుతుంది. అందులో పూర్తి వివరాలు నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 28, 2015 నుంచి ఏప్రిల్ 9, 2015 వరకు. రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 15 వరకు; రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22 వరకు; రూ.5 వేల అపరాధ రుసుంతో మే 5 వరకు; రూ. 10 వేల అపరాధ రుసుంతో మే 12 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్లో లోపాల సవరణకు అవకాశం: ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 20 వరకు హాల్టికెట్ డౌన్లోడ్: మే 8 నుంచి మే 12 వరకు. పరీక్ష తేదీ: మే 14, 2015 వెబ్సైట్: www.tseamcet.in ఆంధ్రప్రదేశ్, ఎంసెట్-2015 అర్హత: ఇంజనీరింగ్: 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత. అగ్రికల్చర్ - మెడికల్: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఏపీ ఎంసెట్ ఔత్సాహికులు కూడా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 250 ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: మార్చి 6 నుంచి ఏప్రిల్ 11 వరకు; రూ. 500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు; రూ. 1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22 వరకు; రూ.5వేల అపరాధ రుసుంతో మే 2 వరకు; రూ. 10వేల అపరాధ రసుంతో మే 6 వరకు దరఖాస్తు చేయొచ్చు. పరీక్ష తేదీ: మే 8, 2015 వెబ్సైట్: www.apeamcet.org ఏపీ విద్యార్థులూ అర్హులే తెలంగాణలో నిర్వహించే ఎంసెట్-2015కు రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు హాజరు కావచ్చు. లోకల్-నాన్ లోకల్ రిజర్వేషన్ ప్రకారమే ప్రవేశాలు ఉంటాయి. అంటే.. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల విద్యార్థులు ఓపెన్ కేటగిరీలోని 15 శాతం పరిధిలోకి వస్తారు. పరీక్షలో సిలబస్లో పేర్కొన్న అంశాల పరిధిలో ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్లో తమ సబ్జెక్టులపై పట్టు సాధించిన అభ్యర్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. - ప్రొఫెసర్ ఎన్.వి. రమణరావు, కన్వీనర్, టీఎస్ఎంసెట్-2015 సిలబస్ యథాతథం ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ఎంసెట్లో సిలబస్గా గత ఏడాది వరకు ఉన్న సిలబస్నే నిర్దేశించాం. కాబట్టి విద్యార్థులు సిలబస్ పరంగా ఆందోళన చెందక్కర్లేదు. 1,70,000 ఇంజనీరింగ్ సీట్లు, 3,100 మెడికల్ సీట్ల కోసం నిర్వహించే ఎంసెట్కు రెండున్నర లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నాం. దీనికి అనుగుణంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. - ప్రొఫెసర్ సి.హెచ్. సాయిబాబు,కన్వీనర్, ఏపీఎంసెట్-2015 ఏకాగ్రతే ముఖ్యం ఎంసెట్ పరీక్షలో విజయం.. ఇందుకు ప్రిపరేషన్ విషయంలో ఏకాగ్రత ఎంతో కీలకం. సబ్జెక్ట్ పరంగా ప్రాక్టీస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాథమిక భావనలు అధ్యయనం చేయాలి. మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లకు హాజరవడం లాభిస్తుంది. - ఎన్. పవన్ కుమార్,బీటెక్ సీఎస్ఈ మొదటి సంవత్సరం ఎంసెట్-2014 స్టేట్ ఫస్ట్ ర్యాంక్; జేఈఈ అడ్వాన్స్డ్- 9వ ర్యాంక్ సిలబస్లోని అంశాలపై పట్టుతో.. ఎంసెట్లో విజయం సాధించాలంటే.. ఇంటర్ సిలబస్లోని అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి సబ్జెక్ట్కు సంబంధించి షార్ట్ కట్ మెథడ్స్, ప్రాక్టికల్ థింకింగ్ అలవర్చుకోవాలి. రోజూ కనీసం పది గంటలు ప్రిపరేషన్కు కేటాయించాలి. బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్ను క్లిష్టంగా భావిస్తారు. కానీ ఫార్ములాలను రియల్ లైఫ్తో అన్వయించుకోవడం ద్వారా ఈ సమస్యను సులభంగానే ఎదుర్కోవచ్చు. - జి. సాయి శ్రీనివాస్,ఎంబీబీఎస్ ఫస్టియర్,జిప్మర్ పుదుచ్చేరి ఎంసెట్-2014 మెడికల్ ఫస్ట్ ర్యాంక్ సబ్జెక్ట్లవారీగా అనుసరించాల్సిన విధానం ఎంసెట్ ఇంజనీరింగ్; అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగాల్లో సిలబస్ను పరిశీలిస్తే విద్యార్థులు ప్రిపరేషన్ పరంగా ప్రత్యేక దృక్పథంతో వ్యవహరించాలి. ఈ క్రమంలో అనుసరించాల్సిన విధానం సబ్జెక్ట్ల వారీగా.. గణితం మొత్తం 160 మార్కులకు నిర్వహించే ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 80 మార్కులకు ఉండే మ్యాథమెటిక్స్లో సాధించే మార్కులే మెరుగైన ర్యాంకుకు మార్గం వేస్తాయి. కాబట్టి ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. టైం ప్లాన్లోనూ ఎక్కువ సమయం కేటాయించాలి. ముఖ్యంగా ఎంసెట్ సిలబస్ను పరిశీలించి అందులో ఇంటర్లో లేని అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. స్టాటిస్టిక్స్లోని మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్; మీన్ వాల్యూ థీరమ్లపై ఫోకస్ చేయాలి. వీటితోపాటు మ్యాథమెటిక్స్లో మంచి మార్కుల కోసం వెక్టార్ అల్జీబ్రా; క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్; బైనామియల్ థీరమ్; మ్యాట్రిసెస్; సర్కిల్స్; పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్; ఇంటిగ్రల్ కాలిక్యులస్పై పట్టు సాధించాలి. భౌతిక శాస్ర్తం ఫిజిక్స్లో మంచి మార్కుల సాధనకు భావనల ఆధారిత ప్రిపరేషన్ సాగించాలి. ఆయా అంశాల ఫార్ములాలను తెలుసుకోవడంతోపాటు వాటి అనువర్తిత అంశాల తీరుతెన్నులపై అవగాహన పెంచుకోవాలి. ఒకే ప్రశ్నను కనీసం రెండు పద్ధతుల్లో సాధన చేసే విధంగా యత్నించాలి. అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న సమయంలోనే ఎలక్ట్రో మ్యాగ్నటిజం; మ్యాగ్నటిజం; వేవ్మోషన్; హీట్; న్యూక్లియర్ ఫిజిక్స్; అటామిక్ ఫిజిక్స్; సెమీ కండక్టర్ డివెసైస్ అంశాల పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో లభించే వెయిటేజీ పరంగానూ ఈ అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది. రసాయన శాస్త్రం ప్రశ్నల క్లిష్టత పరంగా సులువుగా ఉండే విభాగం.. కెమిస్ట్రీ. మిగతా సబ్జెక్ట్లతో పోల్చితే కెమిస్ట్రీలో మంచి మార్కులు పొందేందుకు అవకాశాలెన్నో. విద్యార్థులు ఆర్గానిక్ కెమిస్ట్రీ; కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్స్పై పట్టు సాధించాలి. ఇవి మార్కుల సాధనలో కీలకంగా ఉంటాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో సొల్యూషన్స్; ఎలక్ట్రో కెమిస్ట్రీ; థర్మోడైనమిక్స్; స్టేట్ ఆఫ్ మ్యాటర్స్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో తులనాత్మక ప్రిపరేషన్పై దృష్టిపెట్టాలి. ముఖ్యంగా మూలకాల ధర్మాలను బేరీజు వేస్తూ అధ్యయనం చేయాలి. వృక్ష శాస్త్రం బోటనీ విషయంలో ఇంటర్ రిలేటివ్ అప్రోచ్ ఎంతో మేలు చేస్తుంది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలోని అంశాలు చాలా వరకు రెండో సంవత్సరంలో కొనసాగింపుగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ అంశాలను ఒకే సమయంలో చదివే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. సూక్ష్మ జీవ శాస్త్రం; కేంద్రక పూర్వ జీవులు; బ్యాక్టీరియా; వైరస్; మానవ సంక్షేమంలో సూక్ష్మ జీవుల పాత్ర అంశాలను తప్పనిసరిగా చదవాలి. అదే విధంగా ఖనిజ మూలకాల ఆవశ్యకత, మొక్కల హార్మోన్ల్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి. జంతు శాస్త్రం జువాలజీ విషయంలో ప్రాథమిక భావనలపై పట్టు సాధించడం అవసరం. కాలేయం; వానపాము; బొద్దింకల జీవ వ్యవస్థ; ప్రొటీన్లు; ఎంజైమ్లు, క్షీర గ్రంథులు; నాడీ వ్యవస్థ; నేత్ర పటలం; జీవావరణం-పర్యావరణం; జన్యుశాస్త్రం; జీవ పరిణామం; అనువర్తిత జీవ శాస్త్రం చాప్టర్లలోని అంశాలన్నింటినీ అధ్యయనం చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆధారము: సాక్షి ఎడ్యుకేషన్