వేసవి కాలం ముదురుతోంది. ఎవరింటికి వెళ్ళినా చల్లటి నీళ్ళు ఇస్తే బాగుండనిపిస్తుంది. ఇప్పుడు కొందరి ఇళ్ళలో ఫ్రీజ్ లున్నాయి. కాని చాలా మంది ఎండాకాలం నీళ్ళ కోసం మట్టి కుండల్నే వాడుతూన్నారు. కుండలో నీళ్ళు చల్లగా ఉంటాయని మనందరికీ తెలుసు. అవి ఎందుకు చల్లగా ఉంటాయో తెలుసా? కుండల్ని మట్టితో తయారు చేస్తారు. అలా తయారైన కుండలో సన్నని రంధ్రాలు ఉంటాయి. రంధ్రాలు లేకుండా కుండ తయారవదు. మనం నీళ్ళని కుండలో పోసి ఉంచితే కొన్ని గంటల్లో అందులోని నీళ్ళు చల్లగా మారుతాయి. ఎందుకంటే కుండలోని నీరు సన్నని రంధ్రాల్లోంచి గుండా బయటకు వస్తుంది. ఇలా బయటికి వచ్చిన నీరు ఆవిరైపోతుంది. నీరు ఆవిరవాలంటే నీటికి ఉష్ణం అవసరం. ఈ వేడిని అది కుండలోని నీటి నుంచి, కుండనించి గ్రహిస్తుంది. అలా నిరంతరం నీరు అవిరవడానికి ఉష్ణం గ్రహించడం వల్ల కుండలోని నీరు చల్లబడుతుంది. ఇది లోహాలతో చేసిన పాత్రలలో జరగదు. అందుకని వాటిలో నీకు ఎన్ని గంటలు ఉంచినా చల్లబడదు. పైగా వేడెక్కుతాయి. ఎందుకంటే లోహాలతో చేసిన పాత్రలకి రంధ్రాలు ఉండవు. అందుకని నీరు ఆవిరవదు. పై పెచ్చు పాత్ర బయటి ఉష్ణోగ్రతకు వేడెక్కి అవేడిని అందులోని నీటికి ప్రసరింపచేసి ఉష్ణోగ్రతని పెంచుతుంది. కుక్కలు ఎండాకాలం నాలుక బయటకు పెట్టి శ్వాస పిల్చడం చూసారుగా? ఎందుకంటే నాలుక మీది లాలాజలం ఆవిరి అవడం వల్ల నాలుక చల్లబడుతుంది. నాలుక చల్లబడితే ఒళ్ళంతా చల్లబడినట్లే . అందుకని! అలానే ఇంకో ఉదాహరణ. మనం బయట ఎండలో తిరిగి ఫ్యాన్ కింద కూర్చున్నప్పుడు చల్లగా అనిపిస్తుంది. కారణం మన చెమట ఫ్యాన్ గాలికి అవిరవుతుంది. అవిరవడానికి కావలసిన వేడిని మన శరీరం నించి తీసుకుంటుంది. ఇప్పుడర్దమైందా కుండలో నీళ్ళు ఎందుకని చల్లగా ఉంటాయో. ఆధారం: ఆనంద్ రాయ్ సింగ్