ఏ వస్తువైనా పడిపోకుండా స్థిరంగా ఉండాలంటే దాని గరిమనాభి నుండి గీసిన నిట్టనిలువు రేఖ దాని ఆధారం పాఠంలో ఉండాలి అనేది ప్రాధమిక సూత్రం. ప్రాణంతో ఉన్న వస్తువులకైనా సరే ఇదే సూత్రం వర్తిస్తుంది. జీవులయితే ప్రాణభయం చేత పడిపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తాయి. దీంట్లోనే మన ప్రశ్నకు సమాధానం ఉంది. కుర్చీలో కూర్చొన్న మనిషి ఆధారపీఠం కుర్చీకి చెందిన నాలుగు కోళ్ళు మధ్యభాగం. మనిషికి చెందిన గరిమనాబి నుండి గీసిన నిట్టనిలువు రేఖ ఈ ఆధార పీఠంలో పడుతోంది. కనుక కూర్చొన్నంత సేపూ స్థిరంగా బాగానే వుంది. కుర్చీలో కూర్చోన్న స్థితి నుండి లేవడానికి ప్రయత్నించినపుడు ఏమవుతుందో చూద్దాం. చటుక్కున ఆధారపీఠం మారిపోతుంది. అది ఇక మీదట కుర్చీకాళ్ళ మధ్యభాగం కాదు. నేలను ఆనుకొని ఉన్న నీ పాదాల మధ్య భాగం మాత్రమే . నీ పాదాలు కుర్చీకాళ్ళకి బయట ఉన్నాయా కదా ! కనుక ఇప్పుడు నీ గరిమనాభి నుండి గీసిన నిట్టనిలువు రేఖ నీ కొత్త ఆధారపీఠంలో పడటంలేదు. కనుక లేవబోతే వెనక్కి పడి పోతావు. నిజానికి అదే స్థితిలో వుండి కుర్చీలోంచి లేవడం అసాధ్యమైపోతుంది. ఇపుడు కుర్చీలోంచి లేవాలంటే మూడే మూడు మార్గాలున్నాయి. నీ పాదాలు కదపకుండా ఉన్నచోటనే వుంచి గరిమనాభిని ముందుకు జరిపి, నిట్టనిలువు రేఖ పాదాల మధ్యగల ఆదారపీఠంలో పడేటట్లు చెయ్యాలి. అంటే నువ్వు తగినంతగా ముందుకు వంగాలి. నీ గరిమనాభిని యధాస్థానంలో వుంచి నీ ఆధారపాఠాన్ని తగినంతగా వెనక్కి జరపాలి. అంటే నీ పాదాలను వెనక్కు (కుర్చీకిందికి) జరిపి నిట్టనిలువు రేఖ పాదాల మధ్య పడేలాగ చెయ్యాలి. గరిమనాభిని కొద్దిగా ముందుకు జరిపి ఆధార పీఠాన్ని కొద్దిగా వెనక్కు జరపాలి. అంటే కొద్దిగా ముందుకు వంగి కొద్దిగా పాదాలను వెనక్కి జరపాలి. ఇంతకు మించి మరోమార్గం లేదు. మనందరం సాధారణంగా అవలింబించేది మూడవ పద్దతే.