తల్లీబిడ్డల సంరక్షణ అత్యంత ప్రాముఖ్యమైన ప్రజారోగ్యాంశం. వారి ఇరువురి ఆరోగ్యంపైనే కుటుంబం, సంఘం మరియు దేశ ఆరోగ్య స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. మానవాభివృద్ధి గర్భస్థదశ నుంచే ప్రారంభమవుతుంది. గర్భవతి అయిన తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, బాలింతగా బిడ్డ యొక్క పోషకావసరాలు కూడా తీర్చగలుగుతుంది. అభివృద్ధి పంథాలో నడుస్తున్నప్పటికీ ఈ క్రింది వాస్తవాల పట్ల అప్రమత్తత అవసరం. వివిధ కారణాల వలన మనదేశంలో 56వేల మంది స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతున్నారు. ప్రతి 8 నిమిషాలకు ఒకరు చనిపోతున్నట్లుగా అంచనా. అధిక రక్తపోటు రక్త స్రావం అందుకు ప్రధాన కారణాలుగా నమోదు అయింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుగా ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్నమాతృ మరణాలలో 19% మన దేశంలోనే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం విషయ పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం. గతంతో పోలిస్తే మే 2013 నివేదిక ప్రకారం మాతృ మరణాలు కొంతవరకూ తగ్గాయి. అయినప్పటికీ కొన్ని ధుర్భలపరిచే దీర్గకాలిక వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల 20% మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. మాతృత్వానికి శరీరం పరిపూర్ణంగా సిద్దం కాకముందే చిన్న వయస్సులో తల్లులు కావటం వల్ల 36% మంది వివిధ పోషక లోప వ్యాధులతో, ముఖ్యంగా 55% మంది రక్త హీనత కల్గి ఉంటూ తల్లులు అవుతున్నారు దీని దుష్ప్రభావం తల్లి బిడ్డలిద్దరిపైనా ఉంటున్నది. ఇంకా కొన్ని ప్రాంతాలలో ప్రసవాలు ఆస్పత్రులలో కాకుండా అపరిశుభ్రమైన పరిసరాలలో జరుగుతున్నాయి. అందుచేతనే తల్లీబిడ్డల సంరక్షణలో గర్భవతిగా, బాలింతగా తీసుకోవలసినటువంటి ఆరోగ్య ఆహార జాగ్రత్తలు, పుట్టినప్పటినుండి సంవత్సరం వయస్సు వచ్చేవరకు బిడ్డ పట్ల చూపించవలసిన భద్రత ఇమిడి ఉంటాయి. వైద్యఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా మాతృ, శిశు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది అవగాహన లేకపోవడం. ముఖ్యంగా మూడు అంశాలపై అవగాహన కావాలి. గర్భవతిగా ఉన్న 9నెలల సమయంలో, బాలింతగా బిడ్డకు పాలిస్తున్నప్పుడు, బిడ్డకు సంవత్సరం వయస్సు వచ్చేవరకు ఏ సమయంలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకొని ఆచరించగలిగితే చాలావరకు తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. ఆధారం: డాక్టర్.ఎస్.శారద, ప్రొఫెసర్, ఉస్మానియా ఆసుపత్రి కుమారి. జె.సుష్మ, విద్యార్ధి, ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/093.