బిడ్డ ఆరోగ్యం అంటే? బిడ్డ పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన లోపాలు లేకుండా ఉండటమే, బిడ్డ గర్భస్థస్థితిలో ఉన్నప్పటి నుండి 5 సం.ల వయస్సు వచ్చే వరకు ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఆరోగ్యంగా ఉండటాన్నే బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు అని చెప్పగలం. బిడ్డ ఆరోగ్య సంరక్షణలో దశలు గర్భస్థంగా ఉన్నప్పుడు నవజాత శిశువు శిశువు దశలో చిరు బాల్య దశలో ప్రీ – స్కూల్ దశలో పైన చెప్పిన వయస్సులో ఉన్న పిల్లలు ఎక్కువగా అంటువ్యాధులకు, ఇతర లోపాలకు ఎక్కువగా గురవుతుంటారు. కాబట్టి ఈ దశలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి ఆరోగ్యాన్ని కాపాడాటానికి సరైన ఆరోగ్య సేవలు అనేవి గర్భస్థ దశ నుంచి అవసరము. అంతే కాకుండా బాల్య దశలోని ఆరోగ్య స్థితి జీవితంలోని అన్ని దశలలోని ఆరోగ్య స్థితిపై ప్రభావం చూపిస్తుంది. పిల్లల ఆరోగ్యాన్ని పిల్లల మరణాల సంఖ్య మరియు వ్యాధుల సంక్రమణను ఆధారంగా చేసుకొని నిర్ణయించవచ్చును. పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు పేదరికం, అవగాహన లేకపోవడం, నిరక్ష్యరాస్యత, వయస్సు, లింగం, పరిసరాలు, కుటుంబ పరిమాణం, పోషణ, మాతాశిశు సంరక్షణ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం. ఆటిజం--'పర్వేసివ్ డెవలప్మెంటల్ డిసార్డర్స్' ఇన్నాళ్లుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్న 'ఆటిజం' ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగానే ఉందని అర్థమవుతోంది. అందుకు రోజురోజుకూ పిల్లల మానసిక వైద్యుల వద్దకు వస్తున్న కేసుల సంఖ్యే తార్కాణం. ఆటిజం.. ఒకటే రుగ్మత కాదు. ఇదో చట్రం! దీనిలో ఎన్నో ఛాయలు.. ఎన్నో స్థాయులు.. మరెన్నో భేదాలు! అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు. అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే.. దీన్ని అధిగమించటం.. ఈ చట్రాన్ని దాటటం మరీ అసంభవమేం కాకపోవచ్చు. అందుకే తల్లిదండ్రుల్లో 'ఆటిజం'పై అవగాహన పెంచేందుకు సమగ్ర వివరాలను మీ ముందుకు తెస్తోంది. మెడ నిలపటం, పాకటం, తప్పటడుగులు, అత్తతాతలు.. పిల్లల ఎదుగుదల క్రమంలో ప్రతిదీ ఒక పండగే. వీటిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు తల్లిదండ్రులు తేలికగానే గుర్తుపడతారు.. వెంటనే దృష్టిసారిస్తారు కూడా. కానీ ఈ గడపలన్నీ దాటి.. ప్రయాణం బాగానే సాగుతోందనుకుంటున్న తరుణంలో కూడా కొన్ని సమస్యలు ఉండొచ్చు. వీటిని గుర్తించటం అంత తేలిక కాదు. వాటిని పట్టుకోవటానికి కాస్త అవగాహన అవసరం. ఇలాంటి సమస్యల్లో ముఖ్యమైనదీ.. ఇప్పటి వరకూ పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ... సంపన్న వర్గాల్లోనే ఎక్కువ అనుకుంటున్నదీ.. మన దేశంలోనూ, అన్ని వర్గాల్లోనూ ఎక్కువేనని ఇప్పుడిప్పుడే స్పష్టంగా బయటపడుతున్నదీ... ఆటిజం! 'ఆటిజం' భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగల సమస్య. దీన్నే 'పర్వేసివ్ డెవలప్మెంటల్ డిసార్డర్స్' అంటారు. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనబడతాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించొచ్చు. ఇతరులతో కలవలేకపోతుండటం: ఆటిజమ్ పిల్లలు తోటి పిల్లలతో ఆడుకోవటానికి అంతగా ఇష్టపడరు. ఒంటరిగా ఆడుకోవటం, ఒంటరిగా గడపటం ఎక్కువ. భావవ్యక్తీకరణ లోపం: మాటలు రావటం జాప్యం కావచ్చు. వచ్చినా పూర్తిస్థాయిలో ఉండకపోవచ్చు. తమ అవసరాలను తీర్చుకునేందుకు వేలుపట్టుకుని అక్కడి వరకూ తీసుకువెళ్లటం వంటివి చేస్తుంటారు. ప్రవర్తన లోపాలు: చేసిందే మళ్లీ మళ్లీ చేస్తుండటం, ఒకపనిని ఎప్పుడు చేసినా తిరిగి అలాగే చెయ్యాలని ప్రయత్నిస్తుండటం (అబ్సెషన్ ఆఫ్ సేమ్నెస్). రోజూ తాము వాడే టాయ్లెట్నే వాడతామంటారు. రెండోదానిలోకి వెళ్లనని మొరాయిస్తుంటారు. కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్లను పైకీ కిందికీ అదేపనిగా ఆడిస్తారు. మరి కొందరు సూదులు, గుండుపిన్నుల వంటి ఒకే రకం వస్తువులను సేకరిస్తుంటారు..... ఆటిజమ్ పిల్లల్లో సాధారణంగా ఈ మూడు లక్షణాలూ ఉంటాయి. కొందరిలో ఒకట్రెండు మాత్రమే ఎక్కువగా కనబడినా అన్ని లక్షణాలూ ఏదో ఒక స్థాయిలో కనబడతాయి. అమెరికా 'డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ (డీఎస్ఎం)'లో దీన్ని 'పర్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్' కింద దీన్ని వర్గీకరించారు. ఈ లక్షణాలు ఆరంభమైన సమయం, తీవ్రత, క్షీణిస్తున్న తీరు తదితర అంశాలను బట్టి దీన్ని ప్రధానంగా 5 రకాలుగా విభజించారు. ఆటిస్టిక్ డిజార్డర్: ఎక్కువగా కనబడే ఆటిజం సమస్య ఇదే. దీన్ని 'చైల్డ్హుడ్ ఆటిజమ్' అంటారు. ఇది ఆడ పిల్లల్లో కన్నా మగపిల్లల్లో ఎక్కువ. మున్ముందు వివరంగా చూద్దాం. రట్స్ డిజార్డర్: అరుదైన ఈ రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. దీని ప్రత్యేకతేమంటే.. పుట్టిన ఏడాది వరకూ పిల్లలు బాగానే ఉంటారుగానీ తర్వాత లక్షణాలు కనబడటం మొదలవుతుంది. ఇవి రెండు మూడేళ్లలోనే వేగంగా తీవ్రమవుతాయి. అప్పటికి వచ్చిన ఒకట్రెండు మాటలు కూడా తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి. ఇది ముదిరే రకం (ప్రోగ్రెసివ్ డిజార్డర్) కావటం వల్ల కొంతకాలానికి నాడీ సంబంధ సమస్యలూ ఆరంభమవుతాయి. సరిగా నడుము నిలపలేకపోతుండటం వంటివాటితో మొదలై మెల్లగా 'ఫిట్స్' కూడా వస్తాయి. సాధారణంగా వయసుతో పాటు పెరగాల్సిన తల వీరిలో చిన్నదవుతుంటుంది. చొంగ కారటం, చేతులుకాళ్లు ఒకే రకంగా ఆడిస్తుండటం, చేతులతో చప్పుళ్లు చేయటం వంటివి కనబడతాయి. యుక్తవయసుకు ముందే సమస్యలు బాగా ముదిరి వీరు బతికిబట్టకట్టటం కూడా కష్టమవుతుంటుంది. ఆస్పర్జెర్స్ డిజార్డర్: ఇది మగ పిల్లల్లో ఎక్కువ. సాధారణంగా ఆటిజమ్ పిల్లల్లో మాటలు ఆలస్యంగా వస్తుంటాయి. కానీ ఈ రకంలో మాటలు మామూలుగానే ఉంటాయి. నలుగురిలోకి వెళ్లటం, తెలివి తేటలు కూడా బాగానే ఉంటాయి. కానీ తక్కువగా మాట్లాడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పేసి ఆపేస్తారు. శరీరాకృతి భిన్నంగా ఉంటుంది. పొడుగ్గా ఉంటారు. పొడవైన ముఖంతో పాటు చెవులూ భిన్నంగా ఉంటాయి. మిగతా ఆటిజమ్ పిల్లలతో పోలిస్తే ఇతరులతో బాగానే కలుస్తారు కాబట్టి వీరిలో భాషా నైపుణ్యాలు కాస్త ఎక్కువగానే అలవడతాయి. కొంతవరకూ బాగానే చదువుతారు. కొన్ని పనుల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అందువల్ల ఆయా అంశాల్లో నైపుణ్యం సాధిస్తారు. అందువల్ల మిగతా ఆటిజమ్ పిల్లలతో పోలిస్తే కాస్త మెరుగ్గా (వెల్ ఫంక్షనింగ్ ఆటిజమ్) ఉంటారు. కానీ వీరిలో ప్రవర్తనా సమస్యలు అధికం. కోపోద్రేకాల వంటివి ఎక్కువ. చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్: ఇది ఆటిజమ్లో తీవ్రమైన సమస్య. వీళ్లు పుట్టినపుడు బాగానే ఉంటారు. ఒకటి రెండేళ్ల వరకూ ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది. పాకటం, నిలబడటం, మాట్లాడటం అన్నీ మామూలుగానే వస్తాయి. ఆ తర్వాత ఎదుగుదల వెనక్కి మళ్లటం (రిగ్రెషన్) మొదలవుతుంది. అదీ చాలా వేగంగా. వీరిలో- ముఖం రఫ్గా, ముదరినట్టుండటం, తలకట్టు కిందికి ఉండటం, పొట్టిగా, లావుగా ఉండటం వంటివి కనబడతాయి. నాడీ సంబంధ లోపాలూ ఆరంభమై, ఫిట్స్ వచ్చి నెమ్మదిగా మంచానికే పరిమితమవుతారు, బతికి బట్టకట్టే అవకాశాలూ తగ్గుతాయి. కాదు మాంద్యం కొందరు పిల్లల్లో- ఎవరితోనూ కలవకపోవటం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం.. వంటి భిన్న లక్షణాలను గమనించి.. 'లియో కానర్' అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి 'ఆటిజం' అని పేరు పెట్టారు. బుద్ధిమాంద్యం ఉన్నవారూ ఇతరులతో కలవకుండా, తమ లోకంలో తాముంటారు కాబట్టి మొదట్లో దీన్ని అంతా 'బుద్ధిమాంద్యం'గానే భావించేవారు. కానీ 'ఆటిజమ్' పిల్లలు బుద్ధిమాంద్యం పిల్లల్లా స్తబ్ధుగా ఉండరు. హుషారుగా, పరిసరాలను గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇది బుద్ధిమాంద్యం కాదని గుర్తించారు. పైగా ఆటిజమ్ పిల్లలు కొన్నింట్లో చాలా చురుకుగా ఉంటారు. కొందరు ఏదైనా ఒకసారి దారిని చూస్తే మరచిపోరు. మరికొందరు అంకెలు, సంఖ్యలు టకటకా చెప్పేస్తారు. పద్యాలు, గేయాలను ఒకసారి వినగానే తిరిగి అప్పజెప్పేస్తారు. చుట్టుపక్కల పరిసరాలను అంతగా చూడనట్టు ప్రవర్తించినా వీరిలో కొన్ని అసాధారణ సామర్థ్యాలుంటాయి. దీన్నే 'సావంట్ స్కిల్స్' అంటారు. ఈ ప్రత్యేకతలన్నింటి దృష్ట్యా ఇది బుద్ధిమాంద్యం కాదని తేల్చారు. అయితే ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక కొందరిలో బుద్ధిమాంద్యం లక్షణాలు కనిపించొచ్చు. ఇతరులతో కలివిడిగా ఉండకపోవటం, నేర్చుకోకపోవటం వంటివి దీనికి దారితీయొచ్చు. కారణాలు: ఆటిజంకు ఇదమిత్థమైన కారణమిదీ అని చెప్పటం కష్టం. అందుకే దీనికి సంబంధించి రకరకాల సిద్ధాంతాలు, భావనలు విస్తృతంగా ఉన్నాయి. కొందరికి మెదడు లోపాలుంటాయి. ఈ పిల్లల్లో బుద్ధిమాంద్యంతో పాటు ఫిట్స్, ఇతరత్రా వ్యాధులు కూడా కనబడుతుంటాయి. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు, క్రోమోజోములు కూడా ఆటిజంకు దోహదం చేస్తున్నట్టు భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయన మార్పులు కూడా సమస్యకు మూలం కావొచ్చనీ, అలాగే గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్ల బారినపడినా, లేదా కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవటం వంటి సమస్యలు తలెత్తినా ఆటిజం బారిన పడచ్చని భావిస్తున్నారు. తల్లి ఆప్యాయంగా చూసుకోకపోవటం, దగ్గరకు తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ప్రేమ తెలియక, ఒంటరితనానికి దారి తీస్తుందని అనుకునేవారు. కానీ ప్రేమగా చూసుకునే వారి పిల్లలూ ఆటిజమ్ బారినపడుతున్నట్టు గుర్తించి దీన్ని కారణంగా చూడటం లేదు. ఈ మధ్యకాలంలో గుర్తిస్తున్న మరో అంశమేమంటే సాఫ్ట్వేర్ వంటి కొన్ని వృత్తుల్లోని తల్లులకు పుట్టే బిడ్డల్లో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుండటం! దీనికి సంబంధించి ఇదమిత్థమైన గణాంకాలుగానీ, కారణాలుగానీ లేవు. కొన్ని వృత్తుల్లోనివారు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం, పని గంటలు అస్తవ్యస్తంగా ఉండటం, పరిసరాల నుంచి సరైన ప్రేరణ లేకపోవటం, రేడియేషన్ ప్రభావం వంటివి కారణాలు కావచ్చు. మొత్తానికి ఆటిజంపై చాలా రకాల ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలు అందుబాటులోకి వస్తున్నాయిగానీ ఇవేవీ కూడా పూర్తిగా నిరూపణ అయినవి కావు. గుర్తించేదెలా? మరీ చిన్నవయసులో.. అకారణంగా నిరంతరంగా ఏడ్వటం గంటల తరబడి స్తబ్ధుగా ఉండటం తల్లి దగ్గరకు తీసుకుంటున్నా పెద్దగా స్పందించకపోవటం పరిచిత వ్యక్తులను చూడగానే నవ్వక పోవటం తల్లిదండ్రులు రమ్మని చేతులు చాచగానే.. ఉత్సాహంగా ముందుకు రావాల్సిన పిల్లల్లో అలాంటి స్పందనలేవీ కనిపించకపోవటం కాస్త పెద్దవయసులో.. మిగతా పిల్లలతో కలవకపోవటం పిలిస్తే పలకకపోతుండటం పెరిగే కొద్దీ ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతుండటం మనుషుల కంటే బొమ్మలు, వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటం ఎవరైనా పలకరించినా వెంటనే సమాధానం ఇవ్వకపోవటం కళ్లలో కళ్లు పెట్టి చూడకపోతుండటం ముఖంలో భావోద్వేగాలేవీ చూపించకపోతుండటం మాటలు సరిగా రాకపోతుండటం, సరిగా మాట్లాడలేకపోతుండటం గుంపులో ఉన్నా మిగతా పిల్లలతో కలివిడిగా ఉండలేకపోతుండటం, తమ బొమ్మలు తాము పెట్టుకు ఆడుకుంటుండటం ఎదుటి వారికి దెబ్బలు, గాయాల వంటివి తగిలినా పట్టనట్టుగా ఉండిపోతుండటం, వెంటనే స్పందించకపోతుండటం తమకు దెబ్బలు తగిలినా నొప్పి, బాధ పట్టనట్టు ఉండిపోవటం నడక మొదలుపెట్టినప్పుడు మునివేళ్ల మీద నడుస్తుండటం వయసుకు తగినట్లు భాషా పాటవం వృద్ధి చెందకపోవటం పలకరించినా రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోవటం, సంభాషణను కొనసాగించే శక్తి కొరవడటం 'నేను - నువ్వు' అన్న తారతమ్యం తెలియకపోవటం. ఉదాహరణకు 'నీకు పాలు కావాలా' అని అడిగితే.. 'నీకు పాలు కావాలా' అంటుండటం ఎదుటి వారు అన్న మాటనే తాము మళ్లీ అనటం. ఉదాహరణకు 'నీ పేరేమిటి?' అని అడిగితే సమాధానం చెప్పటానికి బదులు తను కూడా 'నీ పేరేమిటి?' అనటం. (ఎకోలాలియా) మనం ఎప్పుడో అడిగిన ప్రశ్నకు.. వెంటనే స్పందించకుండా.. తర్వాత ఎప్పుడో మళ్లీ అదే ప్రశ్నను అడుగుతుండటం మనసు ఎక్కడో లగ్నమై ఉండటంతో కొన్నిసార్లు అసందర్భంగా మాట్లాడుతుండటం. ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకోవటం. ఎప్పుడూ యావంతా దాని మీదే ఉండటం, దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం రావటం చేతులు, కాళ్లు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదలిస్తుండటం వీటితో పాటు ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా కనబడుతుంటాయి. ముఖ్యంగా అడిగినవి ఇవ్వకపోతే అరవటం, గట్టిగా గీపెట్టటం మొ|| కొంతమందిలో ప్రతి దానికీ భయపడటం. గాలికి తీగలాంటిదేదన్నా గుతున్నా కూడా భయపడిపోవటం, చీమలాంటిది కనబడినా భయపడటం, చిన్న చిన్న శబ్దాలకు కూడా గట్టిగా చెవులు మూసుకోవటం, శబ్దాలు భరించలేకపోవటం వంటి భావోద్వేగపరమైన అంశాలు కూడా ఉంటాయి. కొందరు విపరీతంగా చురుకుగా ఉంటుంటారు. ఎప్పుడూ కదులుతూ, అటూఇటూ తిరుగుతూ ఉండటం చాలామందిలో కనబడుతుంది. కొందరికి మేధస్సు సగటు స్థాయిలోనే ఉన్నా.. కొందరిలో మాత్రం కొన్నికొన్ని విషయాల్లో అపారమైన ప్రజ్ఞ కనబడుతుంటుంది. 30% మందిలో ఫిట్స్, మరికొన్ని రకాల మెదడు, నాడీ సంబంధ సమస్యలూ కనబడుతుంటాయి. కొద్దిమందిలో మానసిక ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు. చికిత్స ఏమిటి? సమస్య అందరిలో ఒకే తీరులో. ఒకే తీవ్రతలో ఉండదు. కారణాలూ స్పష్టంగా తెలీవు కాబట్టి దీనికి చికిత్స కూడా లక్షణాల ఆధారంగా ఉంటుంది. వైద్యులు 'ఆటిజం రేటింగ్ స్కేల్స్' ఆధారంగా పిల్లల ప్రవర్తన, లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే 'ఐక్యూ' పరీక్షలూ చేస్తారు. దీనిలో- మోస్తరు, మధ్యస్తం, తీవ్రం- స్థాయులు నిర్ధారించి దాన్ని బట్టి దీన్ని ఎలా ఎదుర్కొనాలన్నది నిర్ధారిస్తారు. సాధారణంగా ఆటిజం, ఆస్పర్జెస్ సిండ్రోమ్ వంటివి ఉన్నవారు వీటితో చాలా వరకూ మెరుగవుతారు. మందులు (ఫార్మకలాజికల్ థెరపీ): ఫిట్స్, మెదడులో లోపాలు, ఉద్రేకపూరితమైన ప్రవర్తన వంటివి ఉంటే మూడేళ్లు దాటిన పిల్లలకు మందులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా ఒకచోట కూర్చోకుండా, అస్సలు కుదురు లేకుండా నేర్చుకోవటంలో కూడా వెనకబడిపోతుండే 'హైపరాక్టివ్' పిల్లలకు 'ఏడీహెచ్డీ'కి ఇచ్చే మందులు ఇస్తుంటారు. చెప్పిందే చెప్పటం, ఏదైనా ఒక వస్తువునే పట్టుకుని వదలకపోతుండటం వంటి అబ్సెషన్స్ ఎక్కువగా ఉండే పిల్లలకు అవసరమైతే 'యాంటీ డిప్రసెంట్' మందులూ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఉద్రేకాలు, ఉద్వేగాలు ఎక్కువగా ఉండి కొట్టుకోవటం, గిచ్చటం వంటివి చేస్తున్న వారికి యాంటీసైకోటిక్, ట్రాంక్విలైజర్ మందులు కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఇవన్నీ ఆటిజంను తగ్గించేవి కాకపోయినా... పిల్లల్లో ఉండే లక్షణాలను, సమస్యలను అధిగమించేందుకు ఇవి గణనీయంగా దోహదం చేస్తాయి. మానసిక స్థితిని చక్కదిద్దటం (సైకలాజికల్ ఇంటర్వెన్షన్) ఆటిజం పిల్లలకు కీలకమైనది మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణే. తల్లిదండ్రులు దీన్ని అర్థం చేసుకోవటం చాలా అవసరం. చిన్నతనంలోనే ప్రేరణ (స్టిమ్యులేట్) ఇవ్వటం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అతిగా ఆశించకుండా అలాగని నిరాశలో కూరుకుపోకుండా చికిత్సలో భాగస్వాములు కావటం కీలకం. స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్: ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచీ రాత్రి వరకూ పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణా సామర్థ్యం పెరిగేలా చూడటం అవసరం. దీనికి స్పీచ్థెరపీ దోహదం చేస్తుంది. కళ్లలో కళ్లు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు శిక్షణ, అలాగే మలమూత్ర విసర్జన కోసం 'టాయ్లెట్ ట్రైనింగ్' వంటివన్నీ పద్ధతి ప్రకారం నేర్పిస్తారు. క్రమేపీ స్థాయులను పెంచుకుంటూ వెళతారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంటుంది. ప్రవర్తన చక్కదిద్దటం: ఆటిజం పిల్లలకు 'బిహేవియర్ మోడిఫికేషన్' కూడా ముఖ్యమే. పిల్లవాడికి ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా.. మనం చెప్పిన పని చేస్తే అప్పుడు ఇవ్వటం, మంచి అలవాట్లు పాదుకునేలా చూడటం ముఖ్యం. వేరే పిల్లలతో గొడవలు పడటం వంటివి చేస్తుంటే సైకో థెరపీ వంటివీ ఇస్తారు. మరీ చిన్నపిల్లలకు 'సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ' ఇస్తారు. వీళ్లు కంటితో చూసి ఎక్కువ నేర్చుకోరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా స్పర్శ, ధ్వని వంటి వాటి ద్వారా వారికి కావాల్సినవి నేర్పిస్తారు. ముఖ్యంగా వీరిలోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి వాటికి మెరుగుపెట్టించటం ముఖ్యం. వీటిలో వీరు బాగా రాణిస్తారు. దీనికి ఆక్యుపేషనల్ థెరపీ, మ్యూజిక్ థెరపీ వంటివీ దోహదం చేస్తాయి. ఫలితం.. ముందే గుర్తించి చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తే వీరు చదువుల్లో ముందుండటం వంటివి సాధిస్తారు. దీనివల్ల వీరు చాలా వరకూ సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఇతరత్రా లోపాలేమీ లేకుండా మేధస్సు సాధారణ స్థాయిలో ఉండి, మాటలు-సంభాషణ బాగానే ఉన్న వారికి మొదటి నుంచీ చికిత్స ఇస్తే చాలా మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది. పథ్యం: ఆహారంలో పడని వస్తువుల వల్ల ఆటిజం తరహా మెదడు సమస్యలు వస్తున్నాయన్న వాదనా ఉంది. ముఖ్యంగా గోధుమల్లో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీను, పాలలో ఉండే కెసీన్ అనేవి వీరికి అలర్జీ కలిగిస్తాయని భావించి.. వీరికి ఇవి లేకుండా ఆహారం ఇవ్వటం వల్ల ఉపయోగం ఉంటుందన్న వాదన ప్రాచుర్యంలోకి వచ్చింది. దీన్నే 'జీఎఫ్ సీఎఫ్' డైట్ అంటారు. అయితే దీన్ని కచ్చితంగా పాటించటం కష్టం. 2, 3 నెలల పాటు ఇలా ఇచ్చి చూసి ఫలితం ఉంటే కొనసాగించటం లేకపోతే సాధారణ ఆహారానికి మారటం మంచిది. పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలు పిల్లలు డల్ గా ఉంటూ, తమ చుట్టూ ప్రక్కల్ జరిగే విషయాల మీద ఆసక్తి ప్రదర్శించకుండా ఉంటుంటే… అది తప్పకుండా పట్టించుకోవలసిన విషయమే. ఇలా పిల్లలు అనాసక్తికరంగా ప్రవర్తించడాన్ని. ఎటెన్షన్ డిఫిసిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ (ఎ.డి. హెచ్ . డి.)( Attention Deficit Hyper Activity Disorder) అంటారు. ఎ.డి. హెచ్ . డి. అంటే… పిల్లల్లో మొదట్లో చాలా చురుగ్గా అంటే ఆక్టివ్ గా ఉంటారు. కాలక్రమేణా చప్పబడిపోతారు. ఇలా ఒక్కసారిగా వారి ప్రవర్తనలో విపరీతమయిన మార్పు సంభావిస్తుందన్న మాట. మెదడు ఎదుగుదల సక్రమంగా లేనప్పుడే ఈ పరిస్థితి సంభవిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టీకరిస్తున్నారు. మెదడు మొదటి అయిదేళ్ళలో అత్యధిక ఎదుగుదల రికార్డు చేస్తుంది. శరీరంలోని హార్మోన్లు, తినే ఆహారంలోని విటమిన్లు ఈ విషయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జన్యు సంబంధం అంటే తల్లిదండ్రులతో ఎవరికైనా మెదడు సరిగా లేకపోతే పిల్లలకు ఈ పరిస్థితి రావచ్చు. మేనరిక వివాహలలో జన్మించిన పిల్లలు సాధారణంగా ఇవి తక్కువగా ఉండటానికి కారణం ఈ రకమైన జన్యు సంబంధమైన లోపాలే… పసికట్టడమెలా.. క్లాస్ రూమ్ లో తోటి పిల్లలతో వీరి ప్రవర్తన ఎలా వుందో తెలుసుకుంటూ వుండాలి. పిల్లల స్నేహితులేవరు.. వాళ్ళు మన పిల్లలతో ఎలా ఉంటున్నారు? ఈ విషయాలు తెలిస్తే పిల్లాడి ప్రవర్తన అంచనా వేయవచ్చు. జాగ్రత్తలు : ఆరోగ్యకరమైన ప్రశాంత వాతావరణాన్ని పిల్లలచుట్టూ ఏర్పరచాలి. క్రియేటివిటీకి స్థానం ఉండేటట్లు చేయాలి. సంగీతం నేర్పడం… పెయింటింగ్ వేయడం… డ్యాన్స్ అంటే నృత్యం… మ్యూజిక్ అనుగుణంగా చిందులు వేయడం నేర్పితే వాళ్ళల్లో ఆహ్లాదకర భావాలు మొదలవుతాయి. కొంత వారి మానసిక పరిస్థితిని అదుపు చేయడానికి, ఎదుగుదలకు తోడ్పడుతుంది. నవజాత శిశువుకు వచ్చే ఆరోగ్య సమస్యలు – కామెర్లు, ధనుర్వాతం, శ్వాస సంబంధ సమస్యలు, ఉష్ణోగ్రతను క్రమపరచుకోవటం (బయటి వాతారణంలోని ఉష్ణోగ్రతను తట్టుకోకపోవటం), నోటి పూత సంబంధిత వ్యాధులతో బాధపడడం. అంటుసోకటం మొదలగునవి, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డకు ఒక గంటలోపు బరువు చూడటం ముఖ్యమైన చర్య. మంచి ఆరోగ్యంతో పోషకాహారంతో ఉన్న తల్లులకు పుట్టే బిడ్డలు 3.5 కేజీల బరువు ఉంటారు. కానీ భారతదేశంలో పిల్లల యొక్క కనీస బరువు 2.5 నుండి 2.9 కేజీలు. 2.5 కేజీల కంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు అంటారు. తక్కువ బరువుతో పుట్టడం రెండు కారణాల వలన జరుగుతుంది నెలలు నిండకముందే పుట్టిన పిల్లలు – 9 నెలలు నిండకముందే పుట్టిన పిల్లల్లో బరువు, ఎత్తు మామూలుగానే ఉంటుంది. కాని వారు పుట్టిన తరువాత వారి ఎదుగుదల కొరకు చాలా జాగ్రత్తలు తెలుసుకోవలసి ఉంటుంది. కారణాలు – ఎక్కువ సార్లు గర్భం రావటం, తల్లికి తీవ్రమైన అంటు సోకినప్పుడు, మూత్రంలో ఆల్బుమిన్, శరీరంలో వాపు ఉన్నప్పుడు, చిన్న వయస్సులో గర్భం దరించినప్పుడు, ఎక్కువ శారీరక శ్రమ వలన ఇలా జరగవచ్చు. గర్భకాలం పూర్తి అయినా కానీ పూర్తి ఎదుగుదలలో లోపం ఉండడం వలన కానీ జరగవచ్చు దీనికి చాలా కారణాలు ప్రభావితం చేస్తాయి. కానీ ఇవి ముఖ్యంగా తల్లిలో పిండ స్థితికి సంబంధించినవి ఉంటాయి. తల్లికి సంబంధించినవి – పోషణ, తీవ్ర రక్తహీనత 18 సం.ల కంటే తక్కువ వయస్సులో వివాహాలు జరగటం వలన, ఎక్కువ సార్లు పిల్లలను కనటం, వెంట వెంటనే పిల్లలు పుట్టడం, ఎక్కువ రక్తపోటు మరియు మలేరియా. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ఇవ్వవలసిన జాగ్రత్త మరియు చికిత్స ఆసుపత్రిలో అయితే వారికి తగినంత ఆక్సిజన్, ఉష్ణోగ్రత అందించాలి పుట్టిన వెంటనే తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలి అంటుసోకకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు 2.5 కేజీల బరువు వచ్చే వరకు జాగ్రత్తగా చూడాలి ఇంటిలో అయితే బిడ్డను ఉంచే గది శుభ్రంగా ఉంచాలి బిడ్డను మెత్తటి బట్టతో చుట్టి తల్లి ప్రక్కన పడుకోబెట్టాలి పిల్లలకు టీకాలు ఇప్పించాలి బిడ్డను అందరూ తాకకుండా జాగ్రత్తగా చూడాలి ప్రతి నెలా బిడ్డ బరువును నమోదు చేస్తూ ఉండాలి పోషణ 1999 – 2003 సంవత్సరాలలో జాతీయ పోషకాహార సంస్థ మరియు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వారు చెప్పిన లెక్కల ప్రకారం ఆరు నెలల వయస్సు నుంచి రెండు సంవత్సరాల వయస్సు గల పిల్లలు కుపోషణకు గురవ్వడం ఎక్కువగా ఉందని చెప్పారు. పోషణ మరియు అంటువ్యాధులకు గురి అవ్వటం అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. పోషణ లోపం వలన పోషకాహార పదార్థాలను తగినంత పరిమాణంలో తీసుకోరు. దీని వలన వారి ఎదుగుదల నిలిచిపోవటం తో పాటు పోషణ లోపం వలన కొన్ని జబ్బులకు గురి అవుతారు. ఉదా. పిల్లల్లో విటమిన్-ఎ లోపం వలన రేచీకటి వస్తుంది. దీని వలన కంటి గుడ్డు భాగం దెబ్బతినవచ్చు. ఐరన్ లోపము వలన రక్తహీనత వస్తుంది. దీని వలన పిల్లలో పెరుగుదల, అభివృద్ధి లోపించి చేసే పని మీద ఆసక్తి లేకపోవటం, నీరసంగా ఉంటుంది. ఐయోడిన్ లోపం వలన పిల్లలో బుద్దిమాంద్యత వస్తుంది. పిండానికి సంబంధించిన కారణాలు కవలలు, గర్భ సంచికి సంబంధించిన అంటు, క్రోమోజోములలో అవకతవకలు, సాధారణ పిండ స్థితి వలన. మావికి సంబంధించిన కారణాలు మావిలో అసాధారణ పరిస్థితులు, అసాధారణ పరిస్థితులు మరియు మావి కార్డు పొడవు ఉండవలసిన దానికన్నా చిన్నదిగా ఉండం. తక్కువ బరువుతో పిల్లలు పుట్టకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు పేరు నమోదు చేసుకోవటం, కష్టమైన కాన్పులను గుర్తించడం గర్భిణిగా ఉన్నప్పుడు (జాగ్రత్తలు తీసుకోవాలి) సంరక్షణ, సమతులాహారం, పౌష్టికాహారం పిండి పదార్థాలు, ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలు ఏ.ఎన్.ఎమ్. ద్వారా అందరికీ పంచటం. తల్లికి మలేరియా, రుబెల్లా, సిఫిలిస్, మూత్ర నాళాలకు సంబంధించిన అంటు ఉన్నప్పుడు గుర్తించి చికిత్స పొందటం అధిక రక్తం పోటు (బి.పి.) – చక్కెర వ్యాధిని గుర్తించి చికిత్స పొందటం పొగత్రాగడం, తమంతట తాము తీసుకొనే వైద్యాన్ని, శిక్షణ పొందని వారిచే తీసుకునే వైద్యాన్ని మానివేయాలి క్రమం తప్పకుండా గర్భిణీ పరీక్షలు, సరైన జాగ్రత్తలు మరియు సక్రమంగా వైద్య పరీక్షలు, వైద్య పరీక్షలు సలహాలు తీసుకోవాలి వారి ఆర్థిక, సాంఘిక స్థితిని మెరుగుపరుచుట స్త్రీ, పురుష సమానత్వాన్ని గురించి చెప్పడం 5-6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే బిడ్డకు ఇవ్వాలి 6 నెలల తరువాత పండ్లు, కూరగాయల రసాలు, జావ, పప్పు ధాన్యాలను మెత్తగా చేసి ఇవ్వాలి అన్ని రకాల ఆహార పదార్థాలను వారికి తగినంత మోతాదులో వారు తినే విధంగా చేసి ఇవ్వాలి ఆడ పిల్లలకు కూడా సరిపడినంత ఆహారం అందేలా చూడాలి పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి చికిత్స ఇవ్వాలి అంటు వ్యాధులు అంటు వ్యాధులు అనేవి పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు మరియు ఇవి ప్రాణాంతకమైనవి కూడా. ఉదా – అతిసార వ్యాధి, తీవ్ర శ్వాస కోశ వ్యాధులు, తట్టు, కంఠసర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో మరియు క్షయ. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు 1947 సర్వే ప్రకారం పిల్లలో మరణాల సంఖ్యకు కారణాలను ఈ విధంగా చెప్పాలి. 5 సంవత్సరాల లోపు పిల్లలు 19 శాతం పిల్లలు డయేరియాతో బాధపడుతున్నారు 13 శాతం ఏ.ఆర్.ఐ. 18 శాతం వి.పి. ఈ వ్యాధులన్నీ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత, వ్యాధి నిరోధక టీకాల ద్వారా పోషణ, ఆహారం వలన నివారించవచ్చు. ప్రమాదాలు మరియు విష పదార్థాల వలన భారత దేశంలో 5 సం.ల కంటే తక్కువ వయస్సు గల పిల్లలలో మరణాల రేటుకు కారణాలు వయస్సు మరణాల రేటుకు కారణాలు ఏడు రోజుల లోపల బరువు తక్కువగా పుట్టడం, కష్టమైన కాన్పు, పుట్టే సమయంలో జరిగిన గాయాలు, శ్వాసకోశ ఇబ్బందులు, తగినంత ఆహారం లేకపోవటం, ఎక్కువగా చల్లదనం, ఎక్కువగా వెచ్చదనం 7-28 రోజులు పైన చెప్పినవన్నీ – శ్వాస కోశ వ్యాధులు, అతిసార వ్యాధి, నియోనేటలం టెటనస్, అంటు వ్యాధులు 1-12 నెలలు అతిసార వ్యాధి, శ్వాసకోశ వ్యాధులు, తట్టు వ్యాధి, కోరింత దగ్గు, కుపోషణ 12 నెలలు 5 సం.ల లోపు కుపోషణ, శ్వాసకోశ వ్యాధులు, తట్టు వ్యాధి వలన కలిగే అనర్ధాలు, అతిసార వ్యాధి, గాయాలు, ప్రమాదాలు 1000 గ్రా.లు అంతకంటే ఎక్కువ బరువుతో గర్భస్థ స్థితిలో జరిగిన మరణాల సంఖ్య (28 వారాలు గర్భంలోనే ఉన్నవారు) 1. గర్భంలోనే చనిపోయి పుట్టిన పిల్లల రేటు --------------------------------------------------------------------- మొత్తం జీవించి పుట్టినవారు + గర్భంలోనే చనిపోయి 1000 గ్రాములు, అంతకంటే ఎక్కువ బరువుతో పుట్టిన వారు x 1000 ప్రమాదాలు మరియు ప్రాణ హాని కలిగించే పదార్థాలను నోట్లో పెట్టుకోవటం, హానికరమైన వస్తువులను నోట్లో పెట్టుకోవటం, అనుకోకుండా క్రిందపడడం, విద్యుత్ షాక్ కొట్టడం, రోడ్డు ప్రమాదాలు మొదలైనవి. కొన్ని చిన్నవిగా ఉన్న కొన్ని ప్రాణానికి అపాయాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలలో మరణాల సంఖ్య/రేటు అప్పుడే పుట్టిన పిల్లల మరణాల నుండి 5 సం.ల వయస్సు గల పిల్లల మరణాల సంఖ్య మొత్తం పిల్లల మరణాల రేటులో ఉంటుంది. 1 కేజీ అంతకంటే ఎక్కువ బరువుతో పుట్టిన తరువాత 7 రోజుల లోపు చనిపోయిన వారి సంఖ్య ఆ సం.లో జరిగిన మొత్తం జననాలు PNMR -------------------------------------------------------------------------------- అదే సం.లో 1 కేజీ అంతకంటే ఎక్కువ బరువుతో మొత్తం సజీవ జననాలు x 1000 పుట్టిన తరువాత 28 రోజుల లోపు చనిపోయిన వారి సంఖ్య NNMR ------------------------------------------------------------------------- x 100 అదే సం.లోని సజీవ జననాల సంఖ్య ఒక సం.లో ఏడాది లోపల వయస్సు గల పిల్లల మరణాల సంఖ్య శిశు మరణాల సంఖ్య ------------------------------------------------------------------------------- అదే సం.లో మొత్తం సజీవ జననాల సంఖ్య పిల్లల పుట్టుక నుంచి 5 సం.లు వచ్చే వరకు ఉన్న దశల ప్రకారం పిల్లల మరణాల రేటు వర్గీకరించారు. పుట్టిన తరువాత వారంలోపు చనిపోయిన వారి మరణాల రేటు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మరణాలు మాతృశిశు, నాణ్యతగల, సరిపడినన్ని ఆరోగ్య సదుపాయాలు లేకపోవటం వలన జరుగుతుంటాయి. కారణాలు కష్టమైన కాన్పులు జరిగినప్పుడు తల్లికి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు, పుట్టుకతోనే జరిగే ప్రమాదాలు జరగడం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం శ్వాస అందనప్పుడు, అంటుసోకినప్పుడు, పుట్టుకతో వచ్చే అసాధారణ కారణాలు. శిశు మరణాల రేటు అనేది సమాజ ఆరోగ్యాన్నిసూచించడానికి మరియు మాతృశిశు సంరక్షణ సేవలను, నాణ్యతను ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తీసుకోవలసిన జాగ్రత్తలు వ్యక్తిగత జాగ్రత్తలు పోషకాహారాన్ని అందించటం పెరుగుదలను పర్యవేక్షించడం వ్యాధి నిరోధక టీకాలను వేయించటం బాల్య దశలో వచ్చే సమస్యలను ముందుగానే గుర్తించటం పిల్లలను పర్యవేక్షించటం వ్యక్తిగత జాగ్రత్తలు ప్రతి బిడ్డ కూడా వ్యక్తిగత జాగ్రత్త పొందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి శారీరక, మానసిక భావోద్రేకాలను మరియు సాంఘికంగా జరిగే ప్రమాదాల నుండి వారిని కాపాడటానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి మరియు మంచి జీవన శైలిని అలవర్చుకోవటానికి సహాయపడుతుంది. వ్యక్తిగత జాగ్రత్తలలో ముఖ్యంగా వారు ధరించే దుస్తులు శుభ్రత, వారం వారం తలస్నానం , రోజూ శరీర అవయవాల పరిశుభ్రతత, సరిపడినంత విశ్రాంతి, నిద్ర, వ్యాయామం, చదువు మరియు మంచి ఆరోగ్య అలవాట్లు అలవర్చుకోవటంలో శిక్షణ చాలా అవసరం. తల్లులు ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. పోషకాహారాన్ని అందించటం సరైన మరియు బాలింత ఆహారాన్ని అందించటం అనేది పిల్లలకు చాలా అవసరం. ఎందుకంటే పోషకాహారం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎదిగే పిల్లలకు శరీరాభివృద్ధికి, శరీర ధర్మాలను నియంత్రించటానికి, కావలసిన శక్తిని ఇవ్వటానికి అవసరం. తల్లి పాలు ఇవ్వటం బిడ్డకు 6 నెలలు వయస్సు వరకు వారి ఎదుగుదలకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి పాల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. తల్లిపాలు బలవర్ధకమైనవి మరియు ఆరు నెలల వరకు బిడ్డకు కావలసిన పరిమాణంలో పోషక పదార్థాలు అన్నీ లభిస్తాయి. ఇవి పరిశుభ్రమైనవి, వీటి కోసం తయారు చేసే పద్ధతులు అనుసరించాల్సిన అవసరం లేదు. తేలికగా జీర్ణమయ్యే విధంగా, తగిన ఉష్ణోగ్రతతో లభిస్తాయి. మొదటి నెలలో బిడ్డకు ఏవిధమైనటువంటి అంటువ్యాధులు రాకుండా కాపాడే వ్యాధి నిరోధక శక్తి తల్లిపాలలో ఉంటుంది. బిడ్డకు ఆహారం అందించటంలో సులభమైన పద్ధతి గర్భిణీగా ఉన్నప్పుడు తయారైన క్రొవ్వు వలన మారిన శరీరాకృతి తల్లి పాలివ్వడం వలన తిరిగి మాములు స్థితికి వస్తుంది. తల్లిపాలివ్వటం వలన ఋతుస్రావం ఆలస్యమవుతుంది. దీని వలన అండ విడుదలను నిరోధింపబడి మళ్ళీ గర్భం కొంత దూరం కావడానికి అవకాశం ఉంది. తల్లిపాలివ్వటం వలన తల్లీ బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. పిల్లలలో కుపోషణను నివారించడానికి మరియు బిడ్డ బ్రతకటానికి సహాయపడతాయి. పిల్లలు పాలను త్రాగటం వలన వారి దవడలు, దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది. తల్లిపాలివ్వడం ద్వారా ప్రసవానంతరం జరిగే రక్తస్రావమును నియంత్రించవచ్చు. తల్లిపాలివ్వటం వలన రొమ్ము మరియు గర్భసంచి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. భారత దేశంలో తల్లిపాలివ్వడం అనేది పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. పట్టణాలలో తల్లిపాలివ్వటం తగ్గిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కుటుంబ ఆరోగ్య పరంగా తల్లిపాలను ఇవ్వమని ప్రోత్సహించటానికి 10 సూచనలు ఇచ్చారు. ఆరోగ్య కార్యకర్తలందరికి తల్లిపాలు ఇవ్వటం గురించి ఒక వ్రాత పూర్వక ప్రకటనలను ఇచ్చి దానిని అందరికి తెలియచేయాలి. ఆరోగ్య కార్యకర్తలందరికి పై దానికి తగినట్టుగా శిక్షణ ఇవ్వాలి. గర్భిణీ స్త్రీలందరికి తల్లిపాలివ్వటం వలన ఉపయోగాలు వివరించాలి. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు బిడ్డకు ఇచ్చేలా చేయాలి. తల్లిపాలు ఇచ్చే విధానాన్ని వివరించాలి. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. వేరే ఇతర పానీయాలు, ఆహారం ఇవ్వకూడదు (వైద్యుని సలహా మేరకు). తల్లీ బిడ్డలి్ద్దరూ ఒక గదిలో రోజు అంతా ఉండేలా చూడాలి. కృత్రిమమైన పాల పీకలు, పాలకు సంబంధించిన ఇతర డబ్బాలను వాడకూడదు. బిడ్డకు అవసరమైనప్పుడల్లా తల్లిపాలివ్వటాన్ని ప్రోత్సహించాలి. ఆసుపత్రి నుంచి వెళ్ళే ముందు తల్లులను తల్లిపాలివ్వటాన్ని ప్రోత్సహించే గ్రూపుల వద్దకు పంపించాలి. తల్లిపాలివ్వడం వలన బిడ్డ క్రమంగా బరువు పెరుగుతూ ఉంటాడు. మొదటి మూడు నెలలో నెలకు 800 గ్రాముల నుండి 1 కేజీ వరకు పెరుగుతారు. సరిపోయినంత పోషణ ఉన్న పిల్లలు ఐదు నెలలు వచ్చేటప్పటికి బరువుకు రెట్టింపు అవుతారు. మరియు ఒక సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికి మూడింతల బరువు పెరుగుతారు. రొమ్ము జాగ్రత్త తల్లిపాలిచ్చేటప్పుడు రొమ్ములు శుభ్రంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. రొమ్ము మొనలను నూనె కాని కోల్డ్ క్రీమ్ కాని రాసుకొని ఎప్పుడు మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అంతరాయం కలగకుండా క్రమంగా తల్లిపాలు ఇస్తూ ఉండాలి. లేకపోతే పాలు గడ్డలు కట్టి పుండ్లుగా మారే ప్రమాదం ఉన్నది. అనుబంధ ఆహారాన్ని ఇవ్వటం సాధారణంగా పిల్లలకు ఆరు నెలల వరకు ఒక కేజీ శరీర బరువుకు 170 మి.లీ. పాలు సరిపోతాయి. మామూలుగా తల్లులు, 450 నుండి 600 మి.లీ. పాలను పిల్లల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయగలరు. 6 నెలల తరువాత పిల్లల పెరుగుదల పోషకావసరాలకు అనుగుణంగా తల్లిపాలు సరిపోవు. కాబట్టి ఇతర ఆహార పదార్థాలను వారికి తినిపించటం అవసరం. దీని వలన వారు నెమ్మదిగా తల్లిపాలను మానివేయడానికి సహాయపడుతుంది. అనుబంధాహారం ఇవ్వటం అనేది తల్లులకు పిల్లలకు ముఖ్యమైనది ఎందుకంటే అనుబంధాహారం తయారీ విధానంలో మరియు తినిపించడంలో పరిశుభ్రత లోపిస్తే పిల్లలకు డయేరియా వచ్చే అవకాశం ఉంది. కావలసిన పరిమాణంలో అందించకపోవటం వలన వారికి కుపోషణ వలన ఇతర వ్యాధులు రావచ్చును. అనుబంధాహారం ఇచ్చేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మొదటగా పప్పు తేట, అన్నం గంజి, కూరగాయలు, పండ్ల రసాలు ఇవ్వాలి. ఈ రసాలను / ద్రవాలను పంచదార / బెల్లం / కొంచెం ఉప్పును కలిపి కూడా ఇవ్వవచ్చు. ముందు తక్కువ మోతాదులో ఇవ్వటం మొదలు పెట్టాలి. పిల్లలు తినటం మొదలు పెట్టిన తరువాత మోతాదును పెంచాలి. వారానికి ఒకసారి ఏదైనా కొత్త ఆహారాన్ని వారికి తినిపించాలి. గ్రుడ్డు తినిపించేటప్పుడు దానిని చాలా మెత్తగా ఉడికించి పచ్చ సొనను మాత్రమే పెట్టాలి. బిడ్డకు అది జీర్ణమైనది అని తెలిసిన తరువాత తెల్ల సొనను కూడా తినిపించవచ్చు. బాగా పండిన పళ్ళను మెత్తగా చేసి ఇవ్వాలి. ధాన్యాలు, పప్పు దినుసులను తినిపించేటప్పుడు బాగా ఉడికించి జావలాగా ఇవ్వాలి. ఉదా. కిచిడి, పాయసం, పాలల్లో నానబెట్టి మెత్తగా చేసిన చపాతి. తల్లిపాలు ఇచ్చిన తరువాత మాత్రమే ఘన పదార్థాలు ఇవ్వాలి. పిల్లలకు రోజూ నాలుగు ఐదు సార్లు అనుబంధ ఆహారాన్ని ఇవ్వటం చేయవచ్చు. ఇది పిల్లలకు 1 సంవత్సరం నుండి అలవాటు చేయాలి. తల్లులు పిల్లలకు ఆహారం తినిపించడానికి సరిపోయినంత కాలాన్ని వెచ్చించాలి. తల్లులు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ఆహారం తయారు చేయటానికి మరియు తినిపించడానికి శుభ్రమైన గిన్నెలు వాడాలి. ఆరోగ్య కార్యకర్తలు తల్లులను అనుబంధాహారాన్ని అందించటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎలా ఇవ్వాలో పద్ధతుల గురించి వివరించాలి. పిల్లల పెరుగుదల అభివృద్ధిని పర్యవేక్షించుట పిల్లల పెరుగుదల అభివృద్ధిని పర్యవేక్షించుట పిల్లల పెరుగుదల, అభివృద్ధిని పర్యవేక్షించడం చాలా ముఖ్యమైనది. ఇది పిల్లల ఆరోగ్యాన్ని వారి పోషణ స్థితిని తెలియచేస్తుంది. మరియు పిల్లల పెరుగుదలలో వచ్చే తేడాలను తెలియచేస్తుంది. దీని వలన కుటుంబ స్థాయిలో నివారణోపాయాలను తీసుకోవడానికి సహాయపడుతుంది. పిల్లలలో పెరుగుదల పిల్లలలో ముఖ్యంగా ఎత్తు, బరువు, తల, ఛాతీలను కొలవటం ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లలలో పెరుగుదలను క్రమ బద్ధంగా పర్యవేక్షించుట ద్వారా కుపోషణ వలన పిల్లల పెరుగుదలలో ఏదైనా తరుగుదల కనిపించటం తెలుస్తుంది. వెంటనే ఆరోగ్య కార్యకర్త /తల్లులు వారిని తిరిగి మామూలు స్థితికి రావడానికి చర్యలు తీసుకోవచ్చు. క్రమంగా బరువు పెరగటం అనేది ఆరోగ్యానికి సూచిక వంటిది. భారత ప్రభుత్వం వారు రూపొందించిన గ్రోత్ చార్ట్ / పిల్లల పెరుగుదల పట్టికలో పిల్లల బరువును నమోదు చేయవచ్చు. ఈ పట్టిక ఆరోగ్య కేంద్రాలలో లభ్యమవుతుంది. సంవత్సరం వరకు పిల్లల బరువును నెలకొకసారి చూడాలి. రెండు సంవత్సరాలు వచ్చే వరకు రెండు నెలలకు ఒకసారి చూడవచ్చు. 5 సం.లు వచ్చే వరకు మూడు నెలలకు ఒకసారి చూడవచ్చును. మంచి పోషణ కలిగి ఆరోగ్యంగా ఉన్న బిడ్డ బరువు 1వ స్థితికి కంటే పైకి ఉంటుంది. బిడ్డ బరువు 1వ – 2 మరియు 2 – 3 మధ్య ఉండే వారికి ఇంటి వద్ధనే అనుబంధ ఆహారాన్ని సరిపోయినంత అందించవలసి ఉంటుంది. బిడ్డ బరువు 3వ లైను కంటే తక్కువ ఉంటే వారు డాక్టరును సంప్రదించి జాగ్రత్తలు పాటించ వలసి ఉంటుంది. వీరు తీవ్రమైన కుపోషణను గురి అవుతుంటారు. బిడ్డ బరువు 4వ లైను కంటే తక్కువ ఉంటే ఆసుపత్రిలో చికిత్స పొందవలసిన అవసరం లేదు. గ్రోత్ చార్టు బిడ్డల పెరుగుదలను క్రమంగా పర్యవక్షించడానికి పిల్లలలో కుపోషణ స్థాయిని నిర్ధారించడానికి తగిన చర్యలను తీసుకోవడానికి ఆరోగ్య కార్యకర్తలను, తల్లులను బిడ్డల బరువును తీసుకోవటం వలన ఉపయోగం గురించి అవగాహన కల్పించవచ్చు. మరియు కుపోషణను నివారించడానికి చర్యలు తీసుకోవచ్చు. పిల్లలలో మొదటి సంవత్సరంలో అనూహ్యమైన పెరుగుదల కన్పిస్తుంది. ఎటువంటి అంటుసోకకుండా జాగ్రత్త తీసుకోవాలి. మరియు వారు వేసుకునే దుస్తులు, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతలను కనపరచాలి. దీని వలన పిల్లల్లో రక్షణ భావం, నమ్మకం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుతుంది. సరిపోయినంత ప్రేమ, ఆప్యాయత మరియు ఇతర అవసరాలకు సరైన స్థితిలో లేకపోవడం వలన పిల్లలలో అభద్రతాభావం ఏర్పడుతుంది. దీని వలన వారి మానసిక మరియు ప్రవర్తనలో మార్పులు జరుగుతాయి. కనుక తల్లిదండ్రులకు వారి పిల్లలు శారీరకంగా, మానసికంగా భావోద్రేకాలపరంగా రక్షణ కల్పించడం అవసరం. ఇది వారిలో ఆత్మస్థైర్యాన్ని, నమ్ముకున్న విషయాలను గ్రహించే శక్తిని మరియు భద్రతాభావాన్ని కల్పిస్తుంది. పిల్లలలో వచ్చే వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి చికిత్స ఇవ్వటం సాధారణంగా బిడ్డకు నెల రోజుల నుంచి 5 సం.ల వయస్సు వరకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వీటి వలన పిల్లలు వ్యాధులకు గురికావటం వలన మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. పిల్లలలో సాధారణంగా వచ్చే వ్యాధులు 4 రకాలు ఉంటాయి. డయేరియా ఏ.ఆర్.ఐ. (శ్యాస కోశ వ్యాధులు) వ్యాధి నిరోధక టీకాల ద్వారా నిరోధించ గల వ్యాధులు పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు వీటన్నింటికి కూడా మొదటి దశలోనే గుర్తించి చికిత్స ఇవ్వడం చాలా ముఖ్యమైన విషయాలు. ఏ.ఆర్.ఐ. భారత దేశంలో ఏ.ఆర్.ఐ. అనేవి పిల్లల మరణాలకు చాలా ముఖ్యమైన కారణం. శ్వాస కోశ వ్యాధులు ముఖ్యంగా గాలి ద్వారా మరియు వ్యాధికి గురి అయిన వ్యక్తుల నుండి సంక్రమిస్తుంది. ఇవి వైరస్, బాక్టీరియా వలన వస్తాయి. పిల్లలను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన మన దేశంలో శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ విషయంలో మన పరిస్థితి పొరుగున ఉన్న చిన్నచిన్న దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంకల కంటే కూడా హీనంగా ఉండటం మనందరికీ కూడా బాధాకరం.పుట్టగానే శిశు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. పుట్టగానే శ్వాస తీసుకోకపోవటం. ఇది పెద్ద సమస్య. కేవలం పుట్టగానే ఏడ్వక పోవటం, శ్వాస తీసుకోకపోవటం మూలంగానే ఎంతోమంది మరణిస్తున్నారు. ఇది తెలియక చాలామంది బిడ్డలు కడుపులోనే చనిపోయారని భావిస్తుంటారు కూడా. ఈ పరిస్థితిని నివారించేందుకు ఇప్పుడు గట్టి ప్రయత్నాలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా- కాన్పు చేసే వారికి తగినంత నైపుణ్యం ఉంటే ఈ సమస్య తలెత్తకుండా ఎంతోమంది శిశువులను కాపాడొచ్చు. పుట్టగానే శిశువు ఏడ్వకుండా... తనంతట తానుగా శ్వాస తీసుకోలేకపోతుంటే.. వెంటనే 'బ్యాగ్-మాస్క్' పరికరంతో బిడ్డ శ్వాస తీసుకునేలా ప్రోత్సహించాలి. ఈ పని బిడ్డ పుట్టిన తొలి నిమిషంలోపే చెయ్యటం అవసరం. ఎందుకంటే బిడ్డ పుట్టిన తొలి నిమిషం చాలా కీలకం. అందుకే దీన్ని 'గోల్డెన్ మినిట్' అంటారు. ప్రసూతి నిపుణుల సంఖ్య పెరిగితే మనం ఈ పుట్టగానే శ్వాస సమస్యను చాలా వరకూ నివారించవచ్చు. ఇన్ఫెక్షన్లు: పిల్లల విషయంలో శుభ్రత చాలా అవసరం. వారిని కనిపెట్టుకుని ఉండేవారు, తాకేవారు తమ చేతులను తప్పనిసరిగా సబ్బుతో 2 నిమిషాల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. వూరికే చేతులు రుద్దుకుంటే చాలదు. పిల్లలకు తల్లిపాలు పట్టటం.. ఇన్ఫెక్షన్లు దరిజేరకుండా చూసే ముఖ్యమైన నివారణ చర్య. ఇదేమీ ఖర్చుతో కూడుకున్నది కాదు. తల్లుల్లో, కుటుంబాల్లో ఈ అవగాహన, చైతన్యం పెరిగితే చాలు. తక్కువ బరువుతో పుట్టటం: పిల్లలు తక్కువ బరువుతో పుట్టటానికి ప్రధాన కారణం- యుక్తవయసు గర్భధారణే. ఆడపిల్లలకు 18 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి చెయ్యటం ద్వారా ఈ సమస్యను చాలా వరకూ తొలగించవచ్చు. ఈ విషయంలో చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచటం ఎంతో అవసరం. కౌమారంలో ఉన్న ఆడపిల్లలకు, యవ్వన స్త్రీలకు రక్తహీనత తలెత్తకుండా 'ఐరన్' మాత్రలు ఇవ్వటం మంచిది. వారానికి 100 గ్రా. మోతాదు ఐరన్ మాత్ర ఒకటి ఇచ్చినా రక్తహీనత చాలావరకూ తగ్గుతున్నట్టు ఎన్నో అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల భవిష్యత్తులో బరువు తక్కువ బిడ్డలు పుట్టటాన్ని అరికట్టొచ్చు. పుట్టగానే శిశువుల మరణాలకు చాలా వరకూ ఈ మూడు అంశాలే కారణమవుతున్నాయి. కాన్పులు ఆసుపత్రుల్లో జరిగేలా చూడటం, బిడ్డ పుట్టిన 48 గంటల వరకూ అక్కడే ఉండటం, బిడ్డకు క్రమం తప్పకుండా తల్లిపాలివ్వటం ద్వారా ఎన్నో శిశుమరణాలను అరికట్టవచ్చు. ఇక ఆ తర్వాతి దశలో పిల్లల మరణాలకు చాలా వరకూ కారణమవుతున్న అంశాలు న్యుమోనియా, డయేరియా. టీకాలతో నివారించదగ్గ వీలున్న జబ్బులతో మరణించే పిల్లల సంఖ్యా మన దగ్గర తక్కువేం లేదు. ముఖ్యంగా మీజిల్స్. వీటి గురించి వివరంగా చూద్దాం. న్యుమోనియా: ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా బిడ్డను సంరక్షించుకోవచ్చు. బిడ్డ శ్వాస తీసుకునే వేగాన్ని బట్టి దీన్ని గుర్తించటం తేలికే. రెండు నెలల వయసు వరకూ పిల్లలు నిమిషానికి 60 కన్నా ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటున్నా, రెండు నెలల నుంచి ఏడాది పిల్లలు 50 కన్నా ఎక్కువ సార్లు గాలి తీసుకుంటున్నా, ఏడాది దాటిన తర్వాత 40 కన్నా ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటున్నా బిడ్డకు 'న్యుమోనియా' వచ్చిందేమోనని అనుమానించి ఆసుపత్రికి తీసుకువెళ్లటం మంచిది. నీళ్ల విరేచనాలు: బిడ్డకు నీళ్ల విరేచనాలు అవుతుంటే ప్రధానంగా ఇవ్వాల్సింది 'చిటికెడు ఉప్పు-చారెడు పంచదార' మిశ్రమమైన ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణం (ఓఆర్ఎస్). దీనితో పాటు జింక్ కూడా ఇవ్వటం చాలా అవసరమని చిన్నపిల్లల వైద్యుల సమాఖ్య అందరికీ నొక్కి చెబుతోంది. ఈ జింక్ మాత్రలు, సిరప్ల రూపంలో లభిస్తున్నా వైద్యులు దీన్ని అందరికీ ఇవ్వటం లేదు. నీళ్ల విరేచనాలు అవుతున్నప్పుడు దీన్ని 6 నెలలు దాటిన పిల్లలకు రోజుకి 20 మి.గ్రా మోతాదులో 14 రోజుల పాటు ఇవ్వాలన్నది సిఫార్సు. వీటిని తప్పకుండా ఇవ్వాలి. ఇక నీళ్ల విరేచనాలు అవుతుంటే యాంటీబయాటిక్స్తో ప్రయోజనం ఉండదు. రక్తబంక విరేచనాలు అవుతుంటేనే (డిసెంట్రీ) యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నీళ్ల విరేచనాలను తగ్గించటంలో 'ప్రోబయాటిక్స్' పాత్ర కూడా పెద్దగా లేదు. అయినా చాలామంది వైద్యులు వీటిని సిఫార్సు చేస్తున్నారు. ఈ విషయంలో వైద్యులు, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. టీకాలు: బిడ్డకు క్రమం తప్పకుండా టీకాలు ఇప్పించటం ద్వారా కూడా శిశు మరణాల రేటును బాగా తగ్గించవచ్చు. ముఖ్యంగా పొంగు/తట్టు (మీజిల్స్) టీకాను 9 నెలల వయసులో పిల్లలందరికీ తప్పనిసరిగా ఇప్పించాలి. ఇది దాదాపు 15 ఏళ్ల నుంచీ ప్రభుత్వం ఉచితంగా అందరికీ ఇస్తున్నదే అయినా ఇప్పటికీ ఇది పిల్లలందరికీ చేరటం లేదు. ఈ టీకాలను బిడ్డకు జలుబు జ్వరం వంటివి ఉన్నప్పుడు కూడా ఇప్పించవచ్చు. అందుకే ఏ కారణంతో ఆసుపత్రికి వెళ్లినా వీటిని వేయించటానికి సందేహించాల్సిన పని లేదు. దీని విషయంలో శ్రద్ధ పెట్టాలి. బిడ్డ చక్కటి పోషకాహారం తింటుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. త్వరగా జబ్బుల బారినపడరు. బిడ్డను వెచ్చగా ఉంచాలి. ఇది చాలా ముఖ్యమైన రక్షణ చర్య. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 97 లక్షల మంది పిల్లలు ఐదేళ్లలోపే మరణిస్తుండగా.. వీరిలో 21 లక్షల మంది మన దేశంలోనే మరణిస్తున్నారు. మన దేశంలో ప్రతి 1000 మందిలో 37 మంది రోజుల బిడ్డలుగానే మరణిస్తున్నారు. గత ఐదేళ్లలో ఈ పరిస్థితి ఏమాత్రం మెరుగవ్వలేదు. దేశంలో ఏటా 2.7 కోట్ల కాన్పులు జరుగుతున్నాయి. కాన్పులు చేసే నిపుణులు సుమారు 3 లక్షల మందైనా కావాలి. డయేరియాతో బాధపడే పిల్లల్లో సగటున 27% మందికే ఓఆర్ఎస్ ఇస్తున్నారు. మన దేశంలో తట్టు/పొంగు (మీజిల్స్) కారణంగా ఏటా 2 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారు. ఇది మన దేశంలోనే అత్యధికం. జ్వరమంటే భయమేల?---డా. జీసన్ ఉన్ని-కొచ్చి, ఔషధ సిఫార్సుల విభాగం, ఐఏపీ చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం రాగానే గాభరా పడిపోతూ వెంటనే 'ప్యారాసిటమాల్' వేస్తుంటారు. నిజానికి అంత ఆదుర్దా అవసరం లేదు. ఎందుకంటే జ్వరం రావటమనేది.. వ్యాధి కారకాలతో మన శరీరం జరుపుతున్న పోరాటంలో భాగమని గుర్తించాలి. కేవలం ఒళ్లు వేడిగా మారటం మూలంగానే ఒంట్లో ఉన్న వైరస్ వంటి వ్యాధికారకాలు ఎన్నో చనిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చి... బిడ్డ చాలా అసౌకర్యంగా ఉన్నప్పుడే జ్వరం తగ్గించే మందులు వెయ్యాలి. చాలామంది ఒళ్లు వేడిగా ఉందనగానే వెంటనే థర్మామీటర్తో కొలవటం మొదలుపెట్టేస్తుంటారు. అంత అక్కర్లేదు. ఒళ్లు వేడిగా ఉన్నా పిల్లలు బాగానే తిరుగుతుంటే దాన్ని పట్టించుకోనక్కర్లేదు. పిల్లలు డల్గా ఉన్నా, చికాకుగా ఉన్నా ప్యారాసిటమాల్ వేయాలి. వణుకుతున్నా, ఏదేదో మాట్లాడుతున్నా ఐబూప్రోఫెన్ ఇవ్వచ్చు. ఈ రెండూ ఐపీఏ సూచిస్తున్న మందులు. ఒకవేళ వైద్యులు వైరల్ జ్వరమని నిర్ధారిస్తే పెద్దగా మందులు వెయ్యక్కర్లేదు. ఒకవేళ ఇతరత్రా కారణాలతో జ్వరం వస్తుంటే- ముందు వాటిని గుర్తించిన తర్వాతే యాంటీబయోటిక్ల వంటివి ఇవ్వాలి. ఎందుకంటే ఒక డోసు యాంటీబయోటిక్ వాడితే మూత్ర, రక్త పరీక్షల్లో తేడా వచ్చేస్తుంది. ఆ తర్వాత మూత్ర ఇన్ఫెక్షన్ల వంటివి ఉంటే గుర్తించటం కష్టం. కాబట్టి కారణాన్ని గుర్తించకుండా మందులు మొదలెట్టే కంటే మరో రోజు జ్వరంతో వేచి ఉన్నా తప్పులేదని తెలుసుకోవాలి. జ్వరం మరీ పెరిగితే ఫిట్స్ వస్తాయని భావించి తల్లిదండ్రులు వెంటనే ప్యారాసిటమాల్ వంటివి వేస్తుంటారు. నిజానికి జ్వరం ఒకేసారి అసాధారణంగా పెరిగినప్పుడు మాత్రమే ఫిట్స్ వస్తాయి. ఇది ఎప్పుడు జరుగుతుందో ముందు గుర్తించటం కష్టం. అందుకని దాన్ని మనమెలాగూ నివారించలేం. ఒకవేళ ఫిట్స్ 15 నిమిషాల కన్నా ఎక్కువసేపున్నా, శరీరంలో ఒక భాగంలోనే వస్తున్నా, రోజుకి రెండుసార్ల కన్నా ఎక్కువ వస్తున్నా, 6 నెలల్లో 4 సార్ల కన్నా ఎక్కువ వస్తున్నా, కుటుంబంలో ఎవరికైనా ఫిట్స్ వ్యాధి ఉన్నా.. జ్వరం వచ్చిన వెంటనే ప్యారాసిటమాల్ వంటి మాత్రలు వేయాల్సి అవసరం ఉంటుంది. అది కూడా ఆరేళ్ల వయసు వరకే. ఆ తర్వాత వారి మెదడు ఎదుగుతుంది. ఈ సమస్య చాలా వరకూ తొలగిపోతుంది. జ్వరంలో ఫిట్స్ ఒకసారి వచ్చినంత మాత్రాన ఏ హానీ ఉండదు. తరచూ వస్తుంటే మాత్రం మున్ముందు అది 'మూర్ఛ'గా మారుతుందేమో గమనించాలి. జ్వరం వచ్చినవారిలో 3% మందిలోనే ఫిట్స్ వస్తుంటాయి. మళ్లీ వీరిలో కూడా అది మూర్ఛగా మారే అవకాశంకేవలం 0.2% మందిలోనే! మన పిల్లలకు మన పాలు!--డా. గదాధర్ సారంగి--భువనేశ్వర్, ఐఏపీ ఆవుపాలు ఆవుదూడల కోసమేగానీ.. మన పిల్లల కోసం కాదు! దీనర్థం మన పిల్లలకు కావాల్సిన పాలు తల్లుల నుంచే వస్తాయిగానీ వేరే వాటి నుంచి కాదు అని. మనకూ జంతువులకూ ఎంతో తేడా ఉంది. ఆవుదూడ పుట్టిన 6 గంటలకల్లా లేచి నిలబడి తల్లి నుంచి పాలు తాగుతుంది. మూడేళ్లకల్లా అది పాలివ్వటానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మన పిల్లలు అలా కాదే! పసిబిడ్డలు మొదటి ఆర్నెల్లూ తల్లిపాల మీదే ఆధారపడతారు. రెండేళ్ల వరకూ పాలు తాగుతారు, తాగాలి కూడా. మన పిల్లల మెదడు జంతువులమెదడు కన్నా వేగంగా, పెద్దగా ఎదుగుతుంది. ఏనుగు మెదడు 800 గ్రాములు కూడా ఉండదు. అదే పిల్లల్లో పుట్టేటప్పటికే 800 గ్రాములుంటుంది, మూణ్ణాలుగేళ్లకల్లా 1,400 గ్రాములకు చేరుకుటుంది. కాబట్టి మన మేధస్సుకు మించిన సామర్థ్యం మరే జంతువుకూ లేదు. మన అవసరాలు వేరు. తల్లిపాలలో లాక్టోజ్ శాతం 7 గ్రాములు ఉంటుంది. అదే ఆవుపాలలో అయితే 3 గ్రాములే. ఈ లాక్టోజ్ తర్వాత దశలో గాలక్టోజ్గా రూపొందుతుంది. ఇది ఇతర హార్మోన్లతో కలిసి గాలక్టోలిపిడ్స్గా మారుతుంది. మెదడు, నాడీ వ్యవస్థ నిర్మాణంలో ఇదే ప్రధానపాత్ర పోషిస్తుంది. ఒకవేళ ఏ కారణం వల్లనైనా పిల్లలకు తల్లిపాలు ఇవ్వకపోతే నాడీ వ్యవస్థకు సరిపడిన ఆహారం లభించదు. పైగా తల్లీబిడ్డల మధ్య మానసిక బంధం కూడా అంతగా బలపడదు. ఇది కౌమారదశలో విపరీత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే మొదటి ఆర్నెల్లూ తల్లిపాలు, ఆ తర్వాత ఇతర పదార్థాలతో పాటుగా పాలివ్వటం అవసరం. ఆ తర్వాత కూడా పిల్లలకు ఆహారం ప్రేమగా, ఆప్యాయతతో పెట్టాలి. లేకపోతే వాళ్లు తిరస్కరిస్తారు. ఈ దశ ఏడాది వరకు కొనసాగుతుంది. ఏడాది దాటేసరికి పిల్లలు తీపి, పులుపు, చేదు వంటి భిన్న రుచులను బాగా గ్రహించే స్థితికి చేరుకుంటారు. ఇష్టాయిష్టాలను బాహాటంగా ప్రదర్శిస్తారు. వీరికి ఇంట్లో తయారు చేసుకునే ఆహారం సరిపోతుంది. అయితే- పెరుగుతున్న పిల్లలకు శరీరం ఎదగటానికి అవసరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే శక్తినిచ్చే పిండి పదార్థాలు కూడా అవసరమే. ఆకుకూరలు, పప్పులు, సోయాబీన్స్, రాజ్మా, జొన్నలు, చేపలు, మాంసం, పాలు వంటి వన్నీ ప్రోటీన్లు ఇస్తాయి. పాలల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయిగానీ దాని నుంచి ఎక్కువ శక్తి కేలరీలు రావు. కాబట్టి తల్లిదండ్రులు ఎదిగే పిల్లలకు పాలు పట్టాల్సిందేగానీ కేవలం అదే సరిపోతుందని భావించకూడదు. బిడ్డకు పుట్టిన గంటలోపే కేవలం 26-46% మందే తల్లిపాలు పడుతున్నారు. 22% తల్లులే బిడ్డకు ఆర్నెల్లు వచ్చే వరకూ కేవలం తల్లిపాలు పడుతున్నారు. పిల్లలు ఏడుస్తుంటే తల్లులు తన పాలు సరిపోవటం లేదని భావిస్తూ డబ్బా పాలు మొదలెడుతుంటారు. దాని ఖర్చు చాలా ఎక్కువ. సరిగ్గా పడితే ఒక డబ్బా 2, 3 రోజులు కూడా రాదు. దీంతో నీళ్లెక్కువ, పొడి తక్కువేసి కలపటం మొదలుపెడతారు. అది పిల్లల అవసరాలకు చాలదు. పిల్లల్లో పోషకాహార లోపానికి తల్లిపాలివ్వకపోవటమే ముఖ్య కారణం. ఇలా 47% పిల్లలు బాధపడుతున్నారు.మన దేశంలో ఎదుగుతున్న పిల్లలను.. పోషకాహార లోపం తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా రక్తహీనత కారణంగా ఎంతోమంది చదువుల్లో వెనకబడుతున్నారు. వారిలో బుద్ధివికాసం మందగిస్తుంది. నీరసం, ఏకాగ్రత కుదరకపోవటం, చికాకు, మొండితనం, తిక్క.. ఇలాంటి ప్రవర్తన సమస్యలు పెరుగుతాయి. చక్కటి పోషకాహారం, ఐరన్ మాత్రలతో ఈ పరిస్థితిని చక్కగా నివారించవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు దీనిపై దృష్టిపెట్టాలి. ఈ వయసు పిల్లలు కొత్తగా బయటకు వెళ్లటం, బయట తినటం, బయట నీరు తాగటం వంటివి చేస్తుంటారు కాబట్టి వీరికి 'శుభ్రతగా జీవించటం' నేర్పాలి. అన్నింటికంటే ఈ వయసులో ఎక్కువగా ఎదురయ్యేది- స్కూలు, చదువు సమస్యలు. 'మా పిల్లాడు సరిగా చదవటం లేదని' చదవమంటే కడుపునొప్పి, తలనొప్పి అంటారని.. తల్లిదండ్రులు రకరకాలుగా ఫిర్యాదులు చేస్తుంటారు. కొత్తగా మొదలైన స్కూలు, చదువు, పోటీ, పరీక్షలు, దండన, భయం, అపోహలు.. ఇవన్నీ కూడా ఈ వయసు పిల్లల్లో ఒత్తిడిని పెంచేవే. మరోవైపు తల్లిదండ్రులేమో- తమ చిన్నతనంలో తాము పొందలేకపోయిన వాటన్నింటినీ ఇప్పుడు తమ పిల్లలకు సమకూర్చి పెట్టినా వాళ్లెందుకు సరిగా చదవటం లేదని విపరీతంగా మధనపడుతుంటారు, పిల్లల మీద మరింత ఒత్తిడి పెడుతుంటారు. ట్యూషన్లు, చదువులు, పోటీల పేరుతో పసివయసులో వారి స్వేచ్ఛను, స్వతంత్రతను కట్టడి చేస్తుంటే వాళ్లు హాయిగాఉండలేరు. చక్కగా ఎదగలేరు. పంజరం బంగారంతో చేసినదే అయినా.. ఏ చిలకా దానిలో హాయిగా ఉండలేదన్న వాస్తవాన్ని తల్లిదండ్రులంతా గుర్తించాలి. వాళ్ల బాల్యాన్ని వాళ్లు హాయిగా ఆస్వాదించేలా చేసినప్పుడే చక్కగా ఎదుగుతారు. వారితో ఎక్కువ సమయం గడపాలి, వారి సాంగత్యాన్ని ఆస్వాదించాలి. వారి లేత మనసులను ఆప్యాయతతో గెలిచి.. ఉత్తమ విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అలవరచాలి. లేకపోతే పిల్లల్లో మానసిక, ప్రవర్తనాపరమైన సమస్యలు బయల్దేరతాయి. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో మానసిక వైద్యనిపుణులను సంప్రదించే పిల్లల సంఖ్య పెరుగుతుండటాన్ని చూసి.. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది! 2-8 సంవత్సరాల పిల్లల్లో ఆహారపోషణ సరిగా లేక ఎదుగుదల లోపాలు ఎక్కువ. 50% మంది ఉండాల్సిన ఎత్తుబరువుల కంటే తక్కువవే ఉంటున్నారు. 70% రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లలలో పెరుగుదల విధానం పెద్ద పిల్లల వయసును బట్టి ఉంటుంది. ఈ క్రింది విధంగా పుట్టినప్పటి నుండి పెరుగుదల ఉంటుంది. భారత ప్రభుత్వం తీసుకున్న సర్వే – సి.ఎస్.ఎస్.ఎమ్. 1995 వయస్సు బరువు ఎత్తు 0-3 నెలలు 200 గ్రాములు / వారానికి 4-6 నెలలు 150 గ్రాములు / వారానికి 7-9 నెలలు 100 గ్రాములు / వారానికి 10-12 నెలలకు 50-75 గ్రాములు / వారానికి 1-2 సం.ల 2.5 కేజీలు / సంవత్సరం 3-5 సం.ల 2 కేజీలు / సంవత్సరానికి ఒక సం. బిడ్డ 25 సెం.మీ. / సంవత్సరానికి 2 సంవత్సరానికి 12 సెం.మీ. / సంవత్సరానికి 3 సంవత్సరానికి 9 సెం.మీ. / సంవత్సరానికి 4 సంవత్సరానికి 7 సెం.మీ. / సంవత్సరానికి 5 సంవత్సరానికి 6 సెం.మీ. / సంవత్సరానికి టీకాలు తయారు–వాటి ప్రయోగాలు మొదలైన సంవత్సరాలు 1885 మొట్ట మొదట లైవ్ అంటెన్యూటేడ్ వైరస్ వ్యాక్సిన్. మానవులపైన మొట్టమొదట ప్రయోగం చేయబడింది. 1909 బాక్టీరియా లైవ్ వ్యాక్సిన్ బి.సి.జి. టి.బి. తయారు చేయబడ్డది 1921 డిప్తిరియా టాక్సిడ్ ను గుర్తించారు 1924 టెటనస్ టాక్సాడ్ తయారు చేశారు 1930 కోరింత దగ్గు వ్యాక్సిన్ తయారు చేయబడింది 1932 ప్లూ జ్వరం వ్యాక్సిన్ తయారు చేయబడింది 1940 డిపిటి మొదలు పెట్టారు 1955 ఇన్ వ్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ మొదలు పెట్టారు 1963 నోటి ద్వారా పోలియో చుక్కలు, తట్టు సూది కూడా 1986 హెపటైటీస్ – బి 1990 వ్యాక్సిన్ హిబ్ – బి తయారు చేయబడింది వ్యాధి నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి? ప్రతి శిశువుకి పుట్టినప్పుడు తల్లి శరీరము నుండి బొడ్డు త్రాడు ద్వారా సహజమైన వ్యాధి నిరోధక శక్తి లభిస్తుంది. ఇది కొన్ని నెలల వరకు బిడ్డకు ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఈ సహజమైన శక్తి కొంత కాలానికి తగ్గిపోతుంది. కాబట్టి శరీరము సొంతంగా ఈ శక్తిని పెంపొందించుకోవాలి. మన శరీరములో శక్తిని పెంపొందించుకోవడమనేది మనం తీసుకునే ఆహారముపైన మరియు జీవనశైలి మీద ఆధారపడి ఉంటుంది. మన ఆహారములో తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే మనకు జబ్బులు తొందరగా రావు. ఎందుకంటే వీటిలో విటమిన్లు, ఖనిజాలు మరియు సూక్ష్మ పోషక విలువలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి వ్యాధి క్రిములతో పోట్లాడి అనారోగ్య పరిస్థితులను తట్టుకునే శక్తిని ఇస్తుంది. మాతా శిశు సంరక్షణకు వ్యాధి నిరోధక టీకాల పాత్ర చాలా ఉంది. వీటి గురించి వివరంగా తెలుసుకోవాలి. గర్భ సమయంలో తీసుకోవలసిన టీకాలు గర్భము అని తెలిసిన వెంటనే అనగా 4వ నెలలో మొదటి టి.టి.ని ఆరోగ్య ఉపకేంద్రంలో లేదా ఆసుపత్రిలో తీసుకున్నతర్వాత ఒక కార్డు ఇస్తారు. ఇందులో తల్లీ బిడ్డకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆ తరువాత ఒకటిన్నర నెలల వ్యవధిలో 2వ టి.టి. తీసుకోవాలి. ఈ టి.టి. సూది తల్లీ బిడ్డలకి ధనుర్వాతము రాకుండా కాపాడుతుంది. సరైన సమయంలో టీకాలు తీసుకోకపోవటం వలన కలిగే నష్టాలు తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు టి.టి. తీసుకోకపోతే తల్లికీ బిడ్డకీ ఇద్దరికీ కూడా ధనుర్వాతం వచ్చే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలకు సరైన సమయంలో టీకాలు ఇప్పించకపోతే ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చి మరణానికి దారి తీస్తాయి. ఇంతే కాకుండా చిన్న పిల్లలకు టీకాలు ఇప్పించకపోతే శ్వాస కోశ వ్యాధులు వంటి ఇతర జబ్బులు కూడా వస్తాయి. టీకాలు ఇచ్చినప్పుడు తల్లి తెలుసుకోవలసినవి టీకా వేశాక తల్లిపాలు ఇవ్వవచ్చును డి.పి.టి. ఇంజక్షను ఇచ్చిన చోట వాపు నొప్పి ఉంటాయి. జ్వరం వస్తుంది. ఇలా జ్వరం రావడం మంచిదే. కార్డును జాగ్రత్త చేయాలి. ఏ రోజు వ్యాక్సిన్ ఇవ్వాలో ఆ రోజే బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వాక్సిన్ ఇచ్చిన చోట ఏ మందూ రాయకూడదు. కాపడం పెట్టకూడదు అన్ని మోతాదులు సకాలంలో వేయిస్తేనే ఫలితం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు మరియు యూనిసెఫ్ సహకారంతో యునైటెడ్ స్టేట్స్ 1980లో జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం మొదలు పెట్టిన 70 శాతం వరకు మాత్రమే టీకాలు ఇవ్వాలి. తట్టు వ్యాప్తిని తగ్గించలేకపోయాయి. పిల్లలు వ్యాధి నిరోధక టీకాలు క్షయ, పోలియో, కోరింత దగ్గు, కంఠ సర్పి, ధనుర్వాతం, పచ్చకామెర్లు, తట్టు, మొదలైన ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను వ్యాధి నిరోధక టీకాల ద్వారా కాపాడవచ్చును. ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది పిల్లలు ఈ వ్యాధి నిరోధక టీకాలను సరైన వయస్సులో, సరైన సమయంలో మరియు అవసరమైన పరిమాణంలో ఇవ్వటం వలన ఈ వ్యాధుల నుంచి కాపాడగలుగుతున్నాయి. క్షయ ఇది బ్యాక్టీరియా వలన సంక్రమిస్తుంది. వ్యాధి కారకం మైక్రో బాక్టీరియం ట్యూబర్ క్యులోసిన్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ (హెపటైటిస్ – బి వ్యాక్సిన్ తో కలిపి) లబ్ధిదారులు వయస్సు వాక్సిన్ డోసుల సంఖ్య ఏ విధంగా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి శిశువులు పుట్టిన వెంటనే 6 వారాల నుండి (ఒక నెల వ్యవధితో అనగా 6, 10 మరియు 14 వారాలు బి.సి.జి. డి.పి.టి. హెపటైసిట్ – బి 1 3 3 ఇంట్రాడర్మల్ ఇంట్రామస్కులర్ ఇంట్రామస్కులర్ 1 మి.లీ. 0.5 మి.లీ. 0.5 మి.లీ. క్షయ వ్యాధి నుండి పిల్లల్ని కాపాడుటకు బిడ్డను ధనుర్వాతం, కోరింత దగ్గు, కంఠసర్పి నుండి రక్షించుటకు హెపటైటిస్-బి నుండి రక్షించుటకు 6 వారాల నుండి (ఒక నెల వ్యవధితో) ఓరల్ పోలియో వాక్సిన్ 3 నోటిలో రెండు చుక్కలు బిడ్డను పోలియో వ్యాధి నుండి రక్షించుటకు 9 నెలల తరువాత తట్టు టీకా 1 సబ్ క్యుటేనియస్ 0.5 మి.లీ. బిడ్డను తట్టు వ్యాధి నుండి రక్షించుటకు 16వ నెల నుండి డి.సి.టి. 1 ఇంట్రామస్కులర్ 0.5 మి.లీ. బూస్టర్ డోసుగా పనిచేయుటకు 24 నెలలకు ముందు ఓరల్ పోలియో వాక్సిన్ 1 నోటి రెండు చుక్కలు 9వ నెల విటమిన్-ఎ (మొదటి) నోటి ½ స్పూను బిడ్డను విటమిన్-ఎ లోపం నుండి రక్షించుటకు 15-18 నెలలు విటమిన్-ఎ (రెండవ) నోటి 1 స్పూను బిడ్డను విటమిన్-ఎ లోపం నుండి రక్షించుటకు 21-24 నెలలు విటమిన్-ఎ (మూడవ) నోటి 1 స్పూను బిడ్డను విటమిన్-ఎ లోపం నుండి రక్షించుటకు 27-30 నెలలు విటమిన్-ఎ (మాల్గవ) నోటి 1 స్పూను బిడ్డను విటమిన్-ఎ లోపం నుండి రక్షించుటకు 33-36 నెలలు విటమిన్-ఎ (ఐదవ) నోటి 1 స్పూను బిడ్డను విటమిన్-ఎ లోపం నుండి రక్షించుటకు పిల్లలు 5 సంవత్సరాలు డి.టి. 1 ఇంట్రామస్కులర్ 0.5 మి.లీ. బిడ్డను డిప్తీరియా, ధనుర్వాతం నుండి రక్షించుటకు పిల్లలు 10 సం.లు డి.టి. 1 ఇంట్రామస్కులర్ 0.5 మి.లీ. తల్లిని, బిడ్డను ధనుర్వాతం నుండి రక్షించుటకు 16 సం.లు డి.టి. 1 ఇంట్రామస్కులర్ 0.5 మి.లీ. గర్భిణీ స్త్రీలు 16-36 వారాల గర్భము డి.టి. 2 ఇంట్రామస్కులర్ 0.5 మి.లీ. వ్యాధి సంక్రమించు మార్గాలు వ్యాధి గ్రస్థుని ఉమ్ము తుంపరల ద్వారా (చికిత్స పొందకుండా ఉన్నవారి ద్వారా మరియు చికిత్సను మధ్యలో ఆపివేసిన వారి ద్వారా వ్యాపిస్తుంది). వ్యాధి సంక్రమించే మార్గాలు కలుషితమైన పాలు (కాచకుండా పాలు త్రాగటం వలన) ఈ క్రిమి ఊపిరితిత్తులకు సోకుతుంది. పిల్మినరీ క్షయను మరియు కడుపులోని ప్రేగులకు, ఎముకలకు కీళ్ళకు, లింఫ్ గ్రంధులకు కూడా వ్యాపిస్తుంది. వ్యాధి గ్రస్తుల శ్వాస లేదా తుంపరల ద్వారా ఈ క్రిమి వాతావరణంలో నుండి ఒకరి నుండి ఒకరికి లభిస్తుంది. క్షయ వ్యాధి అందరికీ వస్తుంది. దీనికి వయస్సుతో తేడా లేదు. ఇది ఎక్కువగా సంవత్సరం లోపు పిల్లల నుంచి యుక్త వయస్సు వారికి వస్తుంది. వ్యాధిగ్రస్థులు తాకిన వస్తువుల నుంచి రాదు. శ్వాస కోశ టి.బి.తో బాధపడే వారి వలన ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఎముకలకు సంబంధించిన టి.బి. ఇతర శరీర అవయవాలకు వచ్చిన టి.బి. వలన ఇతరులకు టి.బి. వ్యాప్తి చెందటం జరగదు. నివారించటం బిసిజి టీకా వేయించటం చికిత్సా విధానం రోగగ్రస్థుని గుర్తించి వారికి చికిత్స ఇవ్వాలి. క్రిమి నివారణ జాతీయ కార్యక్రమాన్ని ముందు అధ్యాయంలో చూడాలి. డాట్ రోగగ్రస్థునికి మందులు ఇవ్వాలి. ఒక సంవత్సరం పాటు చికిత్స ఇస్తారు. ధనుర్వాతం ధనుర్వాతం చాలా తీవ్రమైన వ్యాధి. ఇది క్లాస్ట్రీడియంటెటని అనే బాక్టీరియా ద్వారా వస్తుంది. ఈ బాక్టీరియా చాలా శక్తివంతమైనది మట్టిలో దుమ్ములో చాలా సంవత్సరాలు బ్రతకగలదు. 120సెంటీగ్రేడ్. వద్ద 20 నిమిషాలు ఆవిరి ఉంచి వీటిని నాశనం చేయగలం. ఇవి పశువులు, మేకలు, గొర్రెల యొక్క ఉదరములో ఉండి వాటి మల విసర్జనలో బయటకు వస్తాయి. ఇవి స్పోర్సో రూపములో దుమ్ము మట్టిలో కలిసిపోతాయి. గాలి ద్వారా అన్ని పరిసరాలకు వ్యాపిస్తాయి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దీని ద్వారా అంటుసోకుతుంది. ఆ దెబ్బ ఎంత చిన్నదైనా, పెద్దదైనా కావచ్చు మరియు పడిపోవడం వలన గాయం కావచ్చు. జంతువుల కాట్ల వల్ల కావచ్చును. ఈ అంటు కాన్పు జరిగే సమయంలో మరియు కాన్పు తరువాత, బొడ్డుత్రాడు కత్తిరించేటప్పుడు తరువాత బొడ్డు త్రాడు సంరక్షణ సరిగా చేయకపోవడం వలన, ఇంజక్షన్ల ద్వారా ,పళ్ళు పీకేటప్పుడు, పచ్చ బొట్లు పొడిపించుకునేటప్పుడు ఎప్పుడైనా అంటుసోకవచ్చు. కండరాలకు దెబ్బ తగలటం, గాలి ఆడకపోవటం ధనుర్వాతం రావడానికి కారణాలవుతాయి. ధనుర్వాతం అన్ని వయస్సులో వారికి వస్తుంది కానీ హైస్కూల్ పిల్లలో వచ్చే అవకాశం ఎక్కువ. అసురక్షిత బ్లేడును బొడ్డు కత్తిరించటానికి వాడినప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలలో ధనుర్వాతం వస్తుంది. ధనుర్వాతం అబ్బాయిలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో వారికి ఎక్కువగా వస్తుంది. ధనుర్వాతం ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించటం వలన కలుగుతుంది. పశువుల మల విసర్జనను మట్టిలో కలిపి తోటలకు వాడుతుంటారు. చేతులకు ఇతర శరీరావయవాలకు ఏదైనా గాయాలు ఉంటే ఈ స్పోర్సును శరీరములోనికి ప్రవేశిస్తాయి. లక్షణాలు బయట పడడానికి 6-10 రోజులు పడుతుంది. కాని ఇది చాలా తక్కువ సమయం (1 రోజు) కావచ్చు. లేదా చాలా ఎక్కువ కాలం (చాలా నెలలు) పట్టవచ్చు. ఇది స్పోర్సు అభివృద్ధి అవి విడుదల చేసే ఎక్సోటాక్సిన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎక్సోటాక్సిన్స్ కండరాలు బిగుసుకునేలా చేస్తాయి. మొదటిగా దవడ, మెడ కండరాలు బిగుసుకుపోతాయి. తరువాత 14 గంటలలో మెలికలు తిరిగటం / ఫిట్స్ రావటం జరుగుతుంది. వ్యాధి గ్రస్తులు 14 రోజులు బ్రతికిన వారు తరువాత కూడా జీవించే అవకాశం ఉంది 40-90 శాతం వరకు ఉంటాయి. నివారణ సరైన సమయంలో, మోతాదులో టెటనస్ టాక్సిడ్ అనే టీకా వేయించడం వలన దీనిని అరికట్టవచ్చు. దీనికి డిపిటితో పాటు 3 సార్లు వేస్తారు. బూస్టర్ డోసులలో మొదటిది డిపిటి, రెండవది డిటిగా వేస్తారు. ఈ వ్యాక్సిన్ 5 సం.లు వరకు పనిచేస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు టి.టి. సూది తీసుకోవటం వలన పుట్టగానే బిడ్డకు ధనుర్వాతం రాకుండా అరికట్టవచ్చు. దీనితో పాటు ఏదైనా గాయాలు అయినప్పుడు శుభ్రంగా కడగాలి. దానికి కట్టుకట్టించుకోవాలి. కాన్పులను శుభ్రతలు పాటించి చేయమని చెప్పాలి. ఆరోగ్య కార్యకర్తలు ఈ విషయాలపై ప్రజలకు, తల్లులకు అవగాహన కల్పించాలి. పోలియో పోలియో మైలిటిస్ అనేది అంగవైకల్యానికి దారితీస్తుంది. ఇది వైరస్ వలన వ్యాపిస్తుంది. ఈ వైరస్ మానవులలో మాత్రమే ఉంటుంది. ఇది వ్యాధి గ్రస్తుని మలములో ప్యారామైలజికల్ గా ఉంటుంది.వీరు వ్యాధిని వ్యాపించేస్తూ ఉంటారు. వ్యాధి గ్రస్తుని మలం త్రాగు నీటిలో కలిసినప్పుడు ఆరోగ్యవంతులు ఈ నీటిని త్రాగినప్పుడు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎక్కువగా 5 సం.ల లోపు పిల్లలలో ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. 6 నెలల బిడ్డ నుండి 3 సం.ల వరకు వస్తుంది. మగ పిల్లలో 3 శాతం ఎక్కువ అవకాశం ఉంది. లక్షణాలు పక్షవాతం (కొన్ని అవయవాలకు లేదా అన్ని శరీర అవయవాలకు రావచ్చు) నివారణ పుట్టగానే ప్రతి ఒక్కరికి టీకా చుక్కలు వేయించాలి. సరైన సమయంలో మోతాదులో 15 సం.లలో లోపల వయస్సు ఉన్న పిల్లలకు వేయించాలి. ఒకటిన్నర సం.లో బూస్టరు డోసులు కూడా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో వ్యాధి గ్రస్తులను వెతికి గుర్తించటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీని ద్వారా 15 సం.ల లోపు వారు పక్షవాతం తో బాధపడేవారిని గుర్తించి వారికి ప్రత్యేక పోలియో వ్యాధి క్రిమి గురించి పరీక్షించబడుతుంది. ఆరోగ్య కార్యకర్తలు ఇటువంటి వారిని గుర్తించి పరీక్షలు చేసి ఆరోగ్య కేంద్రానికి పంపాలి. పరీక్షలో ఎవరికైనా పోలియో ఉందని నిర్ధారణ అయితే వెంటనే పల్స్ పోలియో కార్యక్రమం చేయాలి. వ్యాధి నిరోధక టీకాలు పోలియో, డిప్తిరియా, టెటనస్, మీజిల్స్, హెపటైటీస్, విటమిన్-ఎ పోలియో ఇది వైరస్ వలన వ్యాపిస్తుంది. ఇది మానవుని మలం ద్వారా బయటికి వ్యాధి గ్రస్తుడు ఉమ్మి తుమ్మటం ద్వారా వ్యాపిస్తుంది. అపరిశుభ్రత వలన గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. శరీరములోకి ప్రవేశించిన తరువాత నుంచి 14 రోజులలలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ మానవునిలో కేంద్ర నాడీ వ్యవస్థ కు పక్షవాతం వచ్చే అవకాశం ఉన్నది. దీనిని నివారించటానికి వ్యాధి నిరోధక టీకా / పోలియో చుక్కలు వేయించాలి. అవి రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో నోటి ద్వారా వేసే చుక్కలు, పోలియో వైరస్ లో 1, 2, 3 రకాలు ఉన్నాయి. పుట్టగానే జీరో పోలియో వేస్తారు. ఆ తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి డోసుకు నెల తేడా ఉంటుంది. 6, 10, 14 వారాలలో పోలియో చుక్కలు వేస్తారు. వీటితో పాటు సూదులు కూడా వేస్తారు. పోలియో వైరస్ ను పారద్రోలటానికి పోలియో నివారణా కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ఏర్పాటు చేసారు. దీని వలన ఒకేసారి అనేక మంది పిల్లలకు పోలియో చుక్కలు ఇవ్వటం జరుగుతుంది. పోలియో చుక్కలు నిరోధక టీకాలలో భాగంగా పోలియో చుక్కలు వేయించని వారి కోసం పరిశోధన చేసి టీకాలు వేయించటం జరుగుతుంది. డిప్తీరియా ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. సరైన సమయంలో దీనిని నివారించలేకపోతే మరణాల సంఖ్య తీవ్రంగా పెరుగుతుంది. డిప్తీరియా వ్యాధి, కోరిన్ బాక్టీరియా అనే బాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ముక్కు, గొంతు, కళ్ళు, చర్మము మర్మావయవాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. ఆ బాసిల్లై గొంతులోనే అత్యధికంగా పెరిగి అక్కడ ఒక ఎక్సోటాక్సిన్ అనే విష పదార్ధాన్ని విడుదల చేస్తుంది. ఈ విష పదార్ధం గొంతులో పలచని పొరలాగా ఏర్పడుతుంది. అది గొంతులో కణితి మీద మరియు శ్వాస నాళం మధ్యలో ఒక పొర ఏర్పడి ఎర్రగా చుట్టు ప్రక్కల కణాలని పాడు చేస్తుంది. ఆ గొంతు దగ్గర ఉన్న గ్రంధులు వాయడం, చాలా ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది (ఊపిరి కూడా తీసుకోలేనటువంటి). వ్యాధి కారక బాక్టీరియా ఒకసారి శరీరంలో ప్రవేశించిన తరువాత వ్యాధి బయటపడేందుకు 2 నుండి 6 రోజులు పడుతుంది. ఈ వ్యాధి నుండి పిల్లలను కాపాడటానికి వ్యాధి నిరోధక టీకాలు వేయించవలెను. కోరింత దగ్గ–వూఫింగ్ కాప్ చిన్న పిలలకు ఎక్కువగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. బి.పర్టూసిస్ అనే బాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఈ వ్యాధిని Hundred Day Cough అంటారు. ఈ వ్యాధి స్వల్ప జ్వరం మరియు పొడి దగ్గుతో ప్రారంభమై తరువాత వెంట వెంటనే దగ్గు రావడం వలన ఊపిరి బిగపట్టి (ఊప్) అనే శబ్దం వచ్చేలా దగ్గుతూ పిల్లలు బాధపడతారు. ఇది దగ్గు తంపరల ద్వారా, తుమ్మడం, మాట్లాడేటప్పుడు ఈ వ్యాధి ఇతరులకు సంక్రమిస్తుంది. ఈ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన తరువాత 7-14 రోజుల లోపు వ్యాధి బయటకు కనిపిస్తుంది. దీని వలన నిమోనియా, ముక్కు నుంచి రక్తం, కళ్ళ పొరలలో రక్త ధారలు మరియు సెరిబ్రల్ హెమరేజ్ కూడా సంభవించును. దీని నివారణ ఇంజక్షన్ లేదా డిపిటి అనే వ్యాధి నిరోధక టీకా మూడు దపాలుగా ఇవ్వడం ద్వారా నివారించవచ్చు (వ్యాధి నిరోధక టీకాల పట్టిక చూడుము. హెపటైటీస్ - బి ఇది ప్రమాదకరమైనది. కామెర్లు వైరస్ ఒకసారి శరీరంలో ప్రవేశించిన తరువాత చాలా కాలం వరకు నిద్రాణ స్థితిలో ఉంటుంది. చాలా తక్కువ మందిలో కామెర్లు లక్షణాలు బయటకి కనపడవు. హెపటైటీస్-బి వైరస్ వ్యాప్తి సూదులు, సిరంజిలు, సురక్షితం కాని సెక్స్ వల్ల కలుషితమైన రక్తం ఇతర శరీర ద్రవాల వలన వ్యాధి వస్తుంది. ఒకసారి ఈ వ్యాధి వచ్చినా మరియు ఈ క్రిమి అలానే ఉంటుంది. ఈ వ్యాధిని శరీర విసర్జనల ద్వారా వ్యాపించేలా చేస్తుంది. ఈ వ్యాధి ఉన్నట్లు రక్త పరీక్ష ద్వారా నిర్ణయించవచ్చు. వైరస్ ప్రవేశించిన తరువాత 45-180 రోజుల లోపల లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు జ్వరం, పచ్చగా ఉన్న మూత్రం రావటం ఈ లక్షణాలు కొంత కాలం వరకు ఉంటాయి. ఆ తరువాత దీర్ఘకాల వ్యాధి జాతీయ టీకాల కార్యక్రమంలో ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి ఈ వ్యాధికి గురి అయిన తరువాత టీకాలతో దీనిని నివారించలేం, కనుక పుట్టిన తరువాత ఒకటిన్నర, రెండున్నర, మూడున్నర నెలల లోపు డి.పి.టి.తో పాటు వేయించాలి. తట్టు ఇది ప్రపపంచమంతటా ఉన్న వ్యాధి. ఇది వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ. చాలా ప్రమాదకరమైన అంటువ్యాధి. వైరస్ శరీరం లోపలికి ప్రవేశించిన తరువాత 8-16 రోజుల తరువాత వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. ఈ సమయంలోనే నోటి బుగ్గలు లోపలికి నొక్కులుగా కనిపిస్తుంది. ముక్కు, గొంతు, నోరు మరియు దగ్గు నుంచి వచ్చే స్రావాల ద్వారా వ్యాధి వస్తుంది. వ్యాధి మొదట దశలో ఉన్నప్పుడే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 5వ రోజు నుంచి చర్మం మీద దద్దుర్లు ఎర్రటి పొక్కులు కనిపిస్తాయి. 6 నెలల నుండి 3 సం.లు వారు ఎక్కువగా గురి అవుతారు. 7 సం.ల లోపలి వారు కూడా గురి అవుతున్నారు. 6 నెలల లోపల పిల్లలను తల్లిపాలలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి వలన ఈ అంటు వ్యాధి వచ్చే అవకాశం ఉండదు. ఒకసారి ఈ తట్టు సోకితే తరువాత వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒక వేళ వచ్చిన తరువాత డాక్టరు సలహా / చికిత్స పాటించకపోతే వ్యాధి తీవ్రత ఎక్కువైనా మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఉదా. నిమోనియా, డయేరియా, శరీరంలో నీరు కోల్పోవటం, కుపోషణ, ఇవి అన్నీ పిల్లల ప్రాణాపాయానికి దారి తీస్తాయి. తట్టు టీకా ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చు. దీని ద్వారా 98 శాతం వ్యాధి వచ్చే అవకాశం తక్కువ. బిడ్డకు 10వ నెలలు రాగానే ఈ టీకా వేయించాలి. నివారణ ఈ వ్యాధి వలన పిల్లలను మొదటి 7 రోజులు ఇతర పిల్లలకు దూరంగా ఉంచాలి. వ్యాధి వచ్చిన వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవ్వవలసిన ఆహారం, ఆసుపత్రికి తరలించటం, గురించి ఆరోగ్య కార్యక్రమాలలో అవగాహన కల్పించాలి. 3-4 సం.ల లోపల పిల్లలకి తట్టు వ్యాధి టీకాలు ఇచ్చినా, తట్టు వ్యాధి క్యాంపులలో కూడా వేయించాలి. పిల్లల రక్షణ పిల్లలకు రక్షణ కల్పించటం ఎంతో ముఖ్యమైనది పిల్లలకు అనువైన వాతావరణాన్ని మరియు ఇతర భౌతిక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం వలన పిల్లలలో ఆరోగ్యమైన మానసిక, సాంఘికపరమైన అభివృద్ధి ఉంటుంది. పిల్లలకు అంటుసోకే మార్గాలకు దూరంగా ఉంచాలి. ఈ వ్యాధి సోకిన వారికి ఇతరత్రా వ్యాధులు వస్తాయి. 1) తీవ్రమైన శ్వాసకోశ (నిమోనియా) వ్యాధి, 2) అతిసార (డయేరియా) వ్యాధి, 3) చెవిలో చీము కారటం, మెదడు వాపు – అంటు ఈ వ్యాధిలో మరణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాధి తీవ్రమై ఎక్కువ ఉన్న సమయంలో దీనిని నివారించటానికి వ్యాధి టీకాలు సరైన సమయంలో, సరైన మోతాదులో టీకా ఇచ్చినచో 95 శాతం వ్యాధి నిరోధకం జరుగుతుంది. ఈ వ్యాధిని గురించి మూడు వ్యాక్సిన్ లు కలిపిన ఎం.ఎం.ఆర్. తట్టు వ్యాధిని పారద్రోలటం అనే కార్యక్రమాన్ని పట్టణాలలో 2000 సం.లో 9 నెలల పిల్లల నుండి 5 సం.ల పిల్లలకు ఈ టీకాలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు దీన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాధి నిరోధక శక్తి శరీరములో వ్యాధి నిరోధక క్రిములు ప్రవేశించినప్పుడు వాటిని నశింపచేసే శక్తిని వ్యాధి నిరోధక శక్తి అంటారు. వ్యాధి ప్రతి నిరోధకాలు అనే వాటిని శరీరములో కొన్ని రక్షక కణాలు ఉత్పత్తి చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తి రెండు రకాలు యాక్టివ్ వ్యాధి నిరోధక శక్తి యాక్టివ్ వ్యాధి నిరోధక శక్తి, శరీరములో ఇది ఎప్పటికి ఉంటుంది. వ్యాధి నిరోధక టీకాల ద్వారా ముందే ఉంటుంది. డయేరియా డయేరియా అంటే నీళ్ళగా విరోచనాలు అవ్వటం. ఇవి 3 సార్లు కంటే ఎక్కువగా జరుగుతాయి. నీళ్ళ నిరోచనాలతో పాటు రక్తం కూడా నిసర్జించబడిన దానిని రక్త విరోచనాలు అంటారు. ఇది పిల్లలకు వచ్చే వ్యాధులలో ప్రాణాంతకమైనది ఎందుకంటే శరీరం ఎండిపోయి (నీరు కోల్పోతుంది) నట్లు అవుతుంది. మరియు కుపోషణకు దారితీస్తుంది. వీటి వలన శరీరంలోని నీరు, సోడియం క్లోరైడ్, పొటాషియం బైకార్బోనేట్ వంటి లవణాలను కోల్పోవటం జరుగుతుంది. దీని వలన శరీరం నీటిని కోల్పోయి ఎండిపోయినట్లు అవుతుంది. అతిసార వ్యాధి అనేది ఆరు నెలల వయస్సు పిల్లల నుంచి 1 సం.ల వరకు ఎక్కువగా వస్తుంది. మరియు అనుబంధాహారం తినిపించేటప్పుడు అపరిశుభ్రత వలన కూడా రావచ్చు మరియు ఇది కుపోషణతో ఉన్న పిల్లలలో మరియు తక్కువ బరువు ఉన్న పిల్లలలో ఇది ఎక్కువగా ఉంటుంది. డయేరియా అనేది ఇ.కోలై, విబ్రో కలరా మరియు నొర్మొనెల్లా, రోటో వైరస్, ప్రోటోజోన్స్ వలన వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియాలు మానవుని మరియు జంతువుల (శరీరంలో) పొట్టలో ఉంటాయి. మల విసర్జకాల గాని ద్వారా, నీటి ద్వారా, మానవునిలోకి ప్రవేశించుట వలన అపరిశుభ్రమైన చేతులు, గోళ్ళు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. లక్షణాలు ఎండు గుణం తీవ్రతను గుర్తించుట లక్షణాలు లేకుండుట కొంచెం లక్షణాలు ఎక్కువ లక్షణాలు సాధారణ పరిస్థితి గుండుట, ఆరోగ్యంగా ఉండుట నిలకడగా లేకుండుట, ఎల్లప్పుడు ఏడ్వడం శక్తి లేకుండా పోవటం అపస్మారక స్థితి కళ్ళు కంటి నీరు సాధారణంగా ఉంటాయి కళ్ళ చుట్టూ గుంతలు ఏర్పడతాయి ఎక్కువ, ఎండిపోయినట్లు ఉండవు నోరు, నాలుక తడిగా ఉంటుంది మామూలుగా ఎండినట్లు ఉంటుంది ఎండిపోయి ఉంటుంది దాహం సాధారణంగా త్రాగుతారు ఎక్కువ నీళ్ళు త్రాగాలని ఆశ ఉంటుంది త్రాగటం చాలా తక్కువ నీరు త్రాగుతారు, నీరు త్రాగలేని పరిస్థితి చర్మం సాగే గుణం చర్మం మీద సాగే గుణం కనిపిస్తుంది చాలా తక్కువగా ఉంటుంది అసలు కనిపంచదు మాడు సాధారణంగా ఉంటుంది సాధారణంగా ఉంటుంది గుంత పడుతుంది. నిర్ణయం ఎండు గుణం రెండు లేక మూడు కనిపిస్తే కొంచెం ఎండు గుణం ఉన్నట్లు డయేరియాకి గురి అయిన వారికి మొదటిగా తీసుకోవలసిన జాగ్రత్తలు పరిసరాలు పరిశుభ్రత పాటించాలి బిడ్డకు ఆహారం తయారు చేసేటప్పుడు, తినిపిఁచేటప్పుడు చేతులు కడుక్కోవాలి. ప్రతి సారి సబ్బు ఉపయోగించాలి. పిల్లలు కూడా తినేముందు చేతులు కడుక్కోవాలి. మల మూత్ర విసర్జన తరువాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే బిడ్డకు ఇవ్వాలి. వయస్సు ప్రతి మల విసర్జనకు ఎంత ఓ.ఆర్.ఎస్. పట్టాలి ఓ.ఆర్.ఎస్. ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి 24 నెలల లోపు 2-10 సం. 10 పైన 50 నుండి 100 మి.లీ. 100-200 మి.లీ. ఎంత తీసుకుంటే అంత 500 మి.లీ. 1000 మి.లీ. ప్రతి రోజు 2000 మి.లీ. ప్రతి రోజు చికిత్స- వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది తల్లిపాలు ఇవ్వటం ఆపకూడదు మామూలుగానే ఆహారం అందజేయవచ్చు, వారికి ఎక్కువగా ద్రవదార్థాలు ఇవ్వాలి. ఉదా – గంజి, పప్పు తేట, మజ్జిగ, ద్రవాలు మరియు ఓ.ఆర్.ఎస్. ఇవ్వాలి 2 సం.ల వయస్సు కంటే తక్కువ ఉన్న వారికి ప్రతి 2 ని.లకు ఒక స్ఫూను ఓ.ఆర్.ఎస్. ఇవ్వాలి తల్లులుకు కూడా అవగాహన కలిగి ఉండాలి ఓ.ఆర్.ఎస్. ద్రవం ఇచ్చినప్పుడు ఎంత పరిమాణంలో ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా ముఖ్యమైనది డయోరియాకు ఇంటి వద్ద తయారు చేసుకొనే చికిత్స ఎక్కువ ద్రవ పదార్థాలు ఇవ్వటం ఇంటిలో తయారు చేసుకున్న పప్పు నీరు, మామూలు నీరు, ఓ.ఆర్.ఎస్. ద్రావణం ఎంత కాలం అయితే డయేరియా ఉంటుందో అంత కాలం ద్రవ పదార్థాలు అందిస్తూనే ఉండాలి పోషణ కాపాడుటకు పోషక పదార్థాలు అందించాలి తల్లి పాలు ఇవ్వటం తల్లి పాలు త్రాగకపోతే బిడ్డ కు ఏ ఆహారం మామూలుగా అందిస్తున్నారో అదే ఆహారాన్ని అందించాలి ఉదా – పప్పు నీరు, గంజి నీరు అన్ని కలిపిన కూరగాయాలను, తాజా కూరగాయలను, అప్పటికప్పుడు తయారు చేసిన వంట పదార్థాలను మాత్రమే ఇవ్వాలి. ఈ ఆహారం దాదాపు ఒక రోజుకు ఆరు సార్లు తినిపించాలి. డయేరియా తగ్గిన తరువాత కూడా రెండు వారాల పాటు ఇస్తూనే ఉండాలి. పైన చెప్పిన ప్రకారం డయేరియా పరిస్థితి తగ్గకుండా ఉంటే నీళ్ళ విరోచనాలు ఎక్కువగా కావటం, మరల మరల వాంతులు, దాహం ఎక్కువ ఉండటం, తినటం కాని, త్రాగటం కాని ఇష్టపడకపోవటం, జ్వరం, రక్తంతో కూడిన మలం ఇవన్నీ ఉంటే ఆరోగ్య కార్యకర్త వద్దకు తీసుకెళ్ళాలి. 2 సం.ల కంటే పెద్ద వారికి ఒక కప్పు / గాస్లు తరచుగా ఇస్తూ ఉండాలి పిల్లలు వాంతులు చేసుకున్నట్లయితే పది నిమిషాలు ఆగి నెమ్మదిగా ద్రవాన్ని పట్టించాలి తీవ్రత తగ్గనప్పుడు ఓ.ఆర్.ఎస్.తో పాటు ఇతర ద్రవాలను కూడా ఇవ్వమని చెప్పాలి శ్వాస కోశ వ్యాధులు లక్షణాలు ముక్కు కారటం, గొంతు నొప్పి, దగ్గు, ఎక్కువగా ఊపిరి పీల్చటం, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటం, జ్వరం గురక పెట్టడం, పొబ్బ ఉబ్బి ఉండటం. ఈ క్రింది లక్షణాలను గుర్తించండి తిండి తినకుండా ఉండటం మూర్ఛలు నిద్ర సరిగా ఉండకపోవటం, గురకపెట్టడం, ఊపిరి బిగపట్టడం, జ్వరం లేదా శరీర ఉష్ణ్రోగ్రత తగ్గిపోవటం అత్యవసర పరిస్థితులో ఆసుపత్రికి తరలించాలి మొదటి డోసు రోగ నివారణ బిడ్డను వెచ్చదనంలో ఉంచాలి (తరలించు సమయంలో) బిడ్డకు తరచూ తల్లిపాలు ఇస్తూనే ఉండాలి తీవ్ర శ్వాసకోశ (న్యూమోనియా) గుర్తించటం శ్వాస ఎక్కువగా తీసుకోవటం తీవ్రంగా డొక్కలు ఎగురవేయడం, మొదటి డోసు రోగ నిరోధక మందు బిడ్డను వెచ్చదనంలో ఉంచాలి బిడ్డకు తరచుగా తల్లిపాలు ఇస్తూనే ఉండాలి శ్వాస కోశ (న్యూమోనియా) కనపడుట శ్వాస ఎక్కువగా తీసుకోకపోవటం (60 శాతం ని.ల తక్కువగా ఉండటం) డొక్కలు ఎగరవేయడంలో తీవ్రత లేకపోవడం తల్లి ఇంటి వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు బిడ్డను వెచ్చదనంలో ఉంచాలి తరచు పాలిచ్చేటప్పుడు ఇబ్బంది కలిగితే బిడ్డ ముక్కును శుభ్రపరచాలి. ఏ పరిస్థితులలో తల్లి ఆసుపత్రికి తీసుకురావాలి ఆరోగ్యం క్షీణించినచో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పాలు తాగడంలో ఇబ్బంది పడుతూ ఉంటే ఇంటి దగ్గర (అయితే) తీసుకోవలసిన జాగ్రత్తలు పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు మరియు తక్కువగా శ్వాస తీసుకోవటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇంటి దగ్గరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. పిల్లలకు మామూలుగానే తల్లిపాలు / ఆహారం ఇవ్వాలి. తగ్గిన తరువాత ఎక్కువగా ఇవ్వవచ్చు. ముక్కును సెలైన్ నీటితో శుభ్రపరచటం వలన ముక్కు లోపల పదార్థాలు గట్టిపడటాన్ని తగ్గిస్తాయి. దీని వలన ఊపిరి సరిగా అందుతుంది. తల్లిపాలతో పాటు ఇతర ద్రవ పదార్థాలు కూడా ఇవ్వాలి జ్వరం తగ్గడానికి పారసిటమాల్ మాత్రలు వేయవచ్చు పిల్లలకు సరైన పద్ధతిలో కప్పి ఉంచి వెచ్చగా ఉండేలా చూడాలి కొన్ని గృహ చిట్కాలను పాటించవచ్చు. తేనెలో తులసి రసం, అల్లం రసం, గోరు వెచ్చని నీరు దగ్గును తగ్గించి గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అపాయకర లక్షణాలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఉదా – ఎక్కువగా ఊపిరి పీల్చటం, సరిగా ఊపిరి అందకపోవడం మొదలైనవి ఇంటువంటి పరిస్థితులలో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. తట్టు టీకా తప్పక ఇప్పించాలి తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు ప్రసవానంతరం మంచి ఆహారం తీసుకోవటం వలన బరువు తక్కువగా పుట్టే పిల్లలను శ్వాస కోశ వ్యాధులను తగ్గించవచ్చు. ఆరోగ్య కార్యకర్తలకు ఈ విషయాలన్నింటిని తెలియచేయాలి. వీరు తల్లులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. వ్యాధి తీవ్రత వ్యాధి తీవ్రతను తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది. యాక్టివ్ వ్యాధి నిరోధక శక్తి యాక్టివ్ వ్యాధి నిరోధక శక్తి, శరీరములో ఇది ఎప్పటికీ ఉంటుంది. వ్యాధి నిరోధక టీకాల ద్వారా ముందే ఉంటుంది. డయేరియా డయేరియా అంటే నీళ్ళగా విరోచనాలు అవ్వటం. ఇవి 3 సార్లు కంటే ఎక్కువగా జరుగుతాయి. నీళ్ళ నిరోచనాలతో పాటు రక్తం కూడా నిసర్జించబడిన దానిని రక్త విరోచనాలు అంటారు. ఇది పిల్లలకు వచ్చే వ్యాధులలో ప్రాణాంతకరమైనది ఎందుకంటే శరీరం ఎండిపోయి (నీరు కోల్పోతుంది) నట్లు అవుతుంది. మరియు కుపోషణకు దారితీస్తుంది. వీటి వలన శరీరంలోని నీరు, సోడియం క్లోరైడ్, పొటాషియం బైకార్బోనేట్ వంటి లవణాలను కోల్పోవటం జరుగుతుంది. దీని వలన శరీరం నీటిని కోల్పోయి ఎండిపోయినట్లు అవుతుంది. అతిసార వ్యాధి అనేది ఆరు నెలల వయస్సు పిల్లల నుంచి 1 సం.ల వరకు ఎక్కువగా వస్తుంది. మరియు అనుబంధాహారం తనిపించేటప్పుడు అపరిశుభ్రత వలన కూడా రావచ్చు మరియు ఇది కుపోషణతో ఉన్న పిల్లలలో మరియు తక్కువ బరువు ఉన్న పిల్లలలో ఇది ఎక్కువగా ఉంటుంది. డయేరియా అనేది ఇ.కోలై, విబ్రో కలరా మరియు నొర్మొనెల్లా, రోటో వైరస్, ప్రోటోజోన్స్ వలన వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియాలు మానవుని మరియు జంతులు (శరీరంలో) పొట్టలో ఉంటాయి. మల విసర్జకాలు గాని ద్వారా, నీటి ద్వారా, మానవునిలోకి ప్రవేశించుట వలన అపరిశుభ్రమైన చేతులు, గోళ్ళు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. లక్షణాలు ఎండు గుణం తీవ్రతను గుర్తించుట లక్షణాలు లేకుండుట కొంచెం లక్షణాలు ఎక్కువ లక్షణాలు సాధారణ పరిస్థితి కళ్ళు కంటి నీరు నోరు, నాలుక దాహం చర్మం సాగే గుణం మాడు బాగుండుట, ఆరోగ్యంగా ఉండుట సాధారణంగా ఉంటాయి తడిగా ఉంటుంది సాధారణంగా త్రాగుతారు చర్మం మీద సాగే గుణం కనిపిస్తుంది సాధారణంగా ఉంటుంది నిలకడగా లేకుండుట, ఎల్లప్పుడు ఏడ్వడం కళ్ళ చుట్టూ గుంతలు ఏర్పడతాయి మామూలుగా ఎండినట్లు ఉంటుంది ఎక్కువ నీళ్ళు త్రాగాలని ఆశ ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది సాధారణంగా ఉంటుంది శక్తి లేకుండా పోవటం అపస్మారక స్థితి ఎక్కువ, ఎండిపోయినట్లు ఉండవు ఎండిపోయి ఉంటుంది త్రాగటం చాలా తక్కువ నీరు త్రాగుతారు, నీరు త్రాగలేని పరిస్థితి అసలు కనిపంచదు గుంత పడుతుంది. నిర్ణయం ఎండు గుణం రెండు లేక మూడు కనిపిస్తే కొంచెం ఎండు గుణం ఉన్నట్లు డయేరియా కి గురి అయిన వారు మొదటిగా తీసుకోవలసిన జాగ్రత్తలు పరిసరాలు పరిశుభ్రత పాటించాలి బిడ్డకు ఆహారం తయారు చేసేటప్పుడు, తినిపించేటప్పుడు చేతులు కడుక్కోవాలి. ప్రతి సారి సబ్బు ఉపయోగించాలి. పిల్లలు కూడా తినేముందు చేతులు కడుక్కోవాలి. మల మూత్ర విసర్జన తరువాత చేతులు సబ్బుతో కడుక్కోవాలి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే బిడ్డకు ఇవ్వాలి. వయస్సు ప్రతి మల విసర్జనకు ఎంత ఓ.ఆర్.ఎస్. పట్టాలి ఓ.ఆర్.ఎస్. ఇంటి దగ్గర తయారు చేసుకోవాలి 24 నెలల లోపు 2-10 సం. 10 పైన 50 నుండి 100 మి.లీ. 100-200 మి.లీ. ఎంత తీసుకుంటే అంత 500 మి.లీ. 1000 మి.లీ. ప్రతి రోజు 2000 మి.లీ. ప్రతి రోజు చికిత్స- వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది తల్లిపాలు ఇవ్వటం ఆపకూడదు మామూలుగానే ఆహారం అందచేయవచ్చు, వారికి ఎక్కువగా ద్రవపదార్థాలు ఇవ్వాలి. ఉదా – గంజి, పప్పు తేట, మజ్జిగ, ద్రవాలు మరియు ఓ.ఆర్.ఎస్. ఇవ్వాలి 2 సం.ల వయస్సు కంటే తక్కువ ఉన్న వారికి ప్రతి 2 ని.లకు ఒక స్ఫూను ఓ.ఆర్.ఎస్. ఇవ్వాలి తల్లులకు కూడా అవగాహన కలిగి ఉండాలి ఓ.ఆర్.ఎస్. ద్రవం ఇచ్చినప్పుడు ఎంత పరిమాణంలో ఎప్పుడు ఇవ్వాలి అనేది చాలా ముఖ్యమైనది డయోరియాకు ఇంటి వద్ద తయారు చేసుకొనే చికిత్స ఎక్కువ ద్రవ పదార్థాలు ఇవ్వటం ఇంటిలో తయారు చేసుకున్న పప్పు నీరు, మామూలు నీరు, ఓ.ఆర్.ఎస్. ద్రావణం ఎంత కాలం అయితే డయేరియా ఉంటుందో అంత కాలం ద్రవ పదార్థాలు అందిస్తూనే ఉండాలి పోషణ కాపాడుటకు పోషక పదార్థాలు అందించాలి తల్లి పాలు ఇవ్వటం తల్లి పాలు త్రాగకపోతే బిడ్డ, ఏ ఆహారం మామూలుగా అందిస్తున్నారో అదే ఆహారాన్ని అందించాలి ఉదా – పప్పు నీరు, గంజి నీరు అన్ని కలిపిన కూరగాయాలను, తాజా కూరగాయలను, అప్పటికప్పుడు తయారు చేసిన వంట పదార్థాలను మాత్రమే ఇవ్వాలి. ఈ ఆహారం దాదాపు ఒక రోజుకు ఆరు సార్లు తినిపించాలి. డయేరియా తగ్గిన తరువాత కూడా రెండు వారాల పాటు ఇస్తూనే ఉండాలి. పైన చెప్పిన ప్రకారం డయేరియా పరిస్థితి తగ్గకుండా ఉంటే నీళ్ళ విరోచనాలు ఎక్కువగా కావటం, మరల మరల వాంతులు, దాహం ఎక్కువ ఉండటం, తినటం కాని, త్రాగటం కాని ఇష్టపడకపోవటం, జ్వరం, రక్తంతో కూడిన మలం ఇవన్నీ ఉంటే ఆరోగ్య కార్యకర్త వద్దకు తీసుకెళ్ళాలి. 2 సం.ల కంటే పెద్ద వారికి ఒక కప్పు / గ్లాసు తరచుగా ఇస్తూ ఉండాలి పిల్లలు వాంతులు చేసుకున్నట్లయితే పది నిమిషాలు ఆగి నెమ్మదిగా ద్రవాన్ని పట్టించాలి తీవ్రత తగ్గనప్పుడు ఓ.ఆర్.ఎస్.తో పాటు ఇతర ద్రవాలను కూడా ఇవ్వమని చెప్పాలి శ్వాస కోశ వ్యాధులు లక్షణాలు ముక్కు కారటం, గొంతు నొప్పి, దగ్గు, ఎక్కువగా ఊపిరి పీల్చటం, శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటం, జ్వరం గురక పెట్టడం, పొట్ట ఉబ్బి ఉండటం. ఈ క్రిఁది లక్షణాలను గుర్తించండి తిండి తినకుండా ఉండటం మూర్ఛలు నిద్ర సరిగా ఉండకపోవటం, గురకపెట్టడం, ఊపిరి బిగపట్టడం, జ్వరం లేదా శరీర ఉష్ణ్రోగ్రత తగ్గిపోవటం అత్యవసర పరిస్థితులో ఆసుపత్రికి తరలించాలి మొదటి డోసు రోగ నివారణ బిడ్డను వెచ్చదనంలో ఉంచాలి (తరలించు సమయంలో) బిడ్డకు తరచూ తల్లిపాలు ఇస్తూనే ఉండాలి తీవ్ర శ్వాసకోశ (న్యూమోనియా) గుర్తించటం శ్వాస ఎక్కువగా తీసుకోవటం తీవ్రంగా డొక్కలు ఎగురవేయడం, మొదటి డోసు రోగ నిరోధక మందు బిడ్డను వెచ్చదనంలో ఉంచాలి బిడ్డకు తరచుగా తల్లిపాలు ఇస్తూనే ఉండాలి శ్వాస కోశ (స్యూమోనియా) కనపడుట శ్వాస ఎక్కువగా తీసుకోకపోవటం (60 శాతం ని.ల తక్కువగా ఉండటం) డొక్కలు ఎగరవేయడంలో తీవ్రత లేకపోవడం తల్లి ఇంటి వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు బిడ్డను వెచ్చదనంలో ఉంచాలి తరచు పాలిచ్చేటప్పుడు ఇబ్బంది కలిగితే బిడ్డ ముక్కును శుభ్రపరచాలి. ఏ పరిస్థితులలో తల్లి ఆసుపత్రికి తీసుకరావాలి ఆరోగ్యం క్షీణించినచో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పాలు తాగడంలో ఇబ్బంది పడుతూ ఉంటే ఇంటి దగ్గర (అయితే) తీసుకోవలసిన జాగ్రత్తలు పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు మరియు తక్కువగా శ్వాస తీసుకోవటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇంటి దగ్గరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. పిల్లలకు మామూలుగానే తల్లిపాలు / ఆహారం ఇవ్వాలి. తగ్గిన తరువాత ఎక్కువగా ఇవ్వవచ్చు. ముక్కును సెలైన్ నీటితో శుభ్రపరచటం వలనముక్కు లోపల పదార్థాలు గట్టిపడటాన్ని తగ్గిస్తాయి. దీని వలన ఊపిరి సరిగా అందుతుంది. తల్లిపాలతో పాటు ఇతర ద్రవ పదార్థాలు కూడా ఇవ్వాలి జ్వరం తగ్గడానికి పారసిటమాల్ మాత్రలు వేయవచ్చు పిల్లలకు సరైన పద్ధతిలో కప్పి ఉంచి వెచ్చగా ఉండేలా చూడాలి కొన్ని గృహ చిట్కాలను పాటించవచ్చు. తేనెలో తులసి రసం, అల్లం రసం, గోరు వెచ్చని నీరు దగ్గును తగ్గించి గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అపాయకర లక్షణాలను జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఉదా – ఎక్కువగా ఊపిరి పీల్చటం, సరిగా ఊపిరి అందకపోవడం మొదలైనవి ఇంటువంటి పరిస్థితులలో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. తట్టు టీకా తప్పక ఇప్పించాలి తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు ప్రసవానంతరం మంచి ఆహారం తీసుకోవటం వలన బరువు తక్కువగా పుట్టే పిల్లలకుశ్వాస కోశ వ్యాధులను తగ్గించవచ్చు. ఆరోగ్య కార్యకర్తలకు ఈ విషయాలన్నింటిని తెలియచేయాలి. వీరు తల్లులకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు. వ్యాధి తీవ్రత వ్యాధి తీవ్రతను తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది. పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులు మెరాస్ మస్ (కట్టె నంజు) కారణాలు- అదనపు ఆహారం గురించి తల్లికి అవగాహన లేకపోవటం క్యాషియార్క్ ర్ (ఉబ్బు నంజు) కారణాలు- అదనపు ఆహారం గురించి తల్లికి అవగాహన లేకపోవటం లక్షణాలు- కట్టె నంజుకు దీనిలో కండరాలు తగ్గిపోతాయి, క్రొవ్వు పదార్థాలు, బరువుకు తగ్గ ఎత్తు లేకపోవటం, ఆకలి బాగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. అతిసార వ్యాధి కూడా ఉంటుంది. లక్షణాలు- కాళ్ళ వాపు, బరువులో అభివృద్ధి లేకపోవటం, ఆకలి లేకపోవటం, రాగి రంగు జుట్టు కలిగి ఉండటం, అప్పుడప్పుడు అతిసారం, చర్మంపై పగుళ్ళు, చర్మం పగిలి, చెక్కులు చెక్కులుగా రాలిపోవటం. ఈ రెండింటిని నివారించటానికి గర్భవతిగా ఉన్నప్పుడు సమతులాహారం, తల్లిపాలు మాత్రమే పట్టించాలి, 6 నెలల వయస్సు ఉన్న బిడ్డకు ఆహారంలో ఘన పదార్థాలు మొదలుపెట్టి అదనపు ఆహారం ఇవ్వాలి. సమతులాహారం గురించి అవగాహన కల్పించాలి. కుటుంబ నియంత్రణ పాటించాలి. కుటుంబ వాతావరణం, మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి. ముందుగానే వ్యాధిని గుర్తించి, సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేసి, సమతులాహారం ఇచ్చి, క్రమబద్దంగా ఎత్తు, బరువును పరీక్షించాలి. అదనపు ఆహారం శిశువుకు తల్లిపాలకు తోడుగా, తగినంత పోషక పదార్థాలను ఇచ్చే ఇతర ఆహారాన్ని అదనపు ఆహారమంటారు. శిశువుల్లో అది పాల వంటి ద్రవ పదార్థాలు కావచ్చు లేదా జారుడు ద్రవంగా ఉండే పాయసం కావచ్చు. లేదా ఒక ఏడాది బిడ్డల విషయంలోనైతే, అన్నం లాంటి ఇతర ఘనాహారాలు కావచ్చు. అదనపు ఆహారాన్ని ఎందుకు, ఎప్పుడు వాడాలి పుట్టినప్పుడు తల్లిపాలు ఒక్కటే చాలు. శిశువు పెరిగే కొద్ది, క్రమంగా అన్ని పోషక పదార్థాల అవసరాలు ఎక్కువ అవుతాయి. అదే సమయంలో క్రమేపి, తల్లిపాల పరిమాణం తగ్గుతూ ఉంటుంది. పెరుగుతున్న పోషకావసరాలు, తగ్గుతున్న తల్లిపాలు ఈ రెండు కారణాల వల్ల బిడ్డకు లభించే పోషక పదార్థాలు క్రమేపీ తగ్గుతాయి. మామూలుగా ఈ పరిస్థితి బిడ్డకు 4-6 నెలల వయస్సప్పుడు ఏర్పడుతుంది. అందుకే అలాంటప్పుడు శిశువుల పెరుగుదల తగిన విధంగా ఉండాలంటే 4-6 నెలల వయస్సు నుండి తల్లిపాలతో బాటు అదనంగా ఇతర ఆహార పదార్థాలు ఇవ్వాలి. ఉదా- కిచిడి తయారికి కావలసిన పదార్థాలు – బియ్యం 30 గ్రా, పెసరపప్పు 15 గ్రా, ఆకుకూరలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర కొంచెం. పద్ధతి- బియ్యం, పెసర పప్పును శుభ్రం చేసి ఉప్పు వేసిన నీటిలో నీరు ఇంకి, గింజలు మెత్తబడే దాకా ఉడికించాలి. ముప్పాతిక ఉడికిన సమయంలో ఆకు కూరలను వేయాలి. నూనెలో జీలకర్రను వేయించి చివర కలపాలి. ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్ ఆధారము: వైద్యరత్నాకరం బ్లాగ్ ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు