పిల్లల్లో పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. వీరిలో ఎదుగుదల లేకపోవడం, అర్థం చేసుకొనే శక్తి లోపించడం జరుగుతుంది. ఈ తరహా పిల్లలు బడి మానివేయడం జరగవచ్చు. వీరిలో జబ్బులను ఎదుర్కొనే శక్తి లోపించడం వల్ల తరచు వ్యాధుల బారిన పడతారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం వల్ల కలిగే కొన్ని పర్యవసనాలు తిరిగి సవరించుకోలేనివిగా ఉంటాయి. పోషకాహారం లేకపోవడం అనేది పిల్లల్లో తీవ్ర ఆందోళనలు కలిగించే విషయం, పోషకాహారం తక్కువగా లభించే పిల్లలు తప్పనిసరిగా శారీరక, మానసిక లోపాలకు కూడా గురవుతారు. పిల్లలు ముఖ్యంగా విటమిన్ - ఎ ఐరన్, కాల్షియం, అయొడిన్ వంటి పోషక పదార్థాల లోపానికి గురవుతారు. ఆ లోపాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అవి పిల్లల ఎదుగుదలకు, రోగనిరోధకశక్తి పై ప్రభావం చూపుతాయి పోషకాహార లోపం - పిల్లల లక్షణాలు పిల్లలలో పోషకాహార లోపాన్ని తల్లిదండ్రులు సాధారణంగా గుర్తించలేరు. అదే వయసు గల పిల్లలతో పోలిస్తే వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేని పిల్లలను సులభంగా గుర్తించవచ్చు. తీవ్ర పోషకాహార లోపం గల పిల్లలపై దృష్టి సారించకపోతే వారు మరింత తీవ్ర పోషకాహార లోపానికి గురయ్యే అవకాశం ఉంది. క్షయ, మశూచి, నిమోనియా ఇతర శ్వాస సంబంధమైన, ప్రేగు సంబంధమైన వ్యాధులకు, అంటు వ్యాధులకు వారు త్వరగా గురి కావచ్చు. పోషకాహార లోపం గల పిల్లలకు రెట్టింపు ఆహారం ఇచ్చే ఏర్పాటు చేయాలి. తీవ్ర పోషకాహార లోపం గల పిల్లల బరువు కంటే స్వల్ప పోషకాహార లోపానికి గురైన పిల్లల బరువును పెంచడం సులభం. కనుక ప్రాథమిక దశలోనే పోషకాహార లోపాన్ని గుర్తించి, దానిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం అవసరం. పిల్లల శారీరక పెరుగుదల వారి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పెద్దవారిలో కంటే పిల్లల్లో శరీర పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించడం, వారికి సమతుల పోషక ఆహారం ఇవ్వడం తల్లిదండ్రులకు ఒక సమస్య. దేశంలో దాదాపు 60 శాతం పిల్లలు బరువు తక్కువగాను, ఎదుగుదల లోపంతోను బాధపడుతున్నారు. తీవ్ర పోషకాహార లోపం కారణంగా నంజు జబ్బులు వస్తాయి. జబ్బులు పోషకాహార లేమికి పరాకాష్ట, కాళ్ళు ఉబ్బడంతో నంజు జబ్బు మొదలవుతుంది. క్రమంగా చేతులు మొత్తం శరీరం ఉబ్బుతుంది. కట్టె నంజు పిల్లలు కదిలే అస్తిపంజారాల్లా ఉంటారు. ఈవ్యాధికి గురైన పిల్లల చర్మం గరుకుగా మారుతుంది. చర్మం పొక్కులు లేస్తుంది. జుట్టు దాదాపు ఊడిపోతుంది. వారిలో వ్యాధి నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఈ పిల్లలకు చాలా త్వరగా వ్యాధులు సోకుతాయి. కట్టం, ఉబ్బ నంజు పిల్లలను త్వరగా గుర్తించి చికిత్స చేయకుంటే వారు మరణానికి చేరువ అవుతారు. పిల్లల ఆహార అలవాట్లు పిల్లలకు సక్రమమైన ఆహారపు అలవాట్లు ఉండడం అవసరం. వేళకు భుజించటం, వేళకు నిద్రపోవడం వంటి మంచి అలవాట్లు ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అయితే కొంత మంది పిల్లలు ఆహార నియామాలను పట్టించుకోరు. అతిగా తినటమో లేదా డైటింగ్ పేర అసలు తినకపోవటమో చేస్తూ అనారోగ్యాలు కొని తెచ్చుకొంటారు. సక్రమమైన పద్ధతిలో ఆహారం తీసుకోకపోవట మన్నది అబ్బాయిల్లో కంటే అమ్మాయిలలోనే ఎక్కువ. ఇది పిల్లలకే కాక పెద్దలకు వర్తిస్తుంది. పిల్లలకు సక్రమమైన ఆహారపు అలవాట్లు చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పేచీలు పెడుతున్నారు కదా అని చెప్పి అన్నం పెట్టడం మానేస్తే అదే అలవాటైపోతుంది. పిల్లలు తక్కువ ఆహారం తీసుకోవడానికి అలవాటు పడిపోతారు. శరీరానికి అవసరమైనంత మోతాదులో ఆహారం లభించకపోవడంతో బలహీనంగా తయారవుతారు. కాబట్టి పిల్లలకు అవసరమైనంత మేరకు ఆహారాన్ని ఇస్తుండాలి. పిల్లలకు ఒకే రకమైన ఆహారం ఇవ్వడం వల్ల కూడా వారు ఆహారం సరిగా తినరు. అందువల్ల తరచు ఆహారం మార్చడం అవసరం. కొత్త రుచులు, కొత్త వాతావరణం కూడూ పిల్లలు బాగా ఆహారం తీసుకోవడానికి దోహదం చేస్తాయి పిల్లలు మితిమిరి తినడం అనారోగ్యం ఆకలి ఉన్నప్పటికి కొందరు పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోకుండా అనారోగ్యం కొని తెచ్చుకొంటే, మరికొంత మంది పిల్లలు తమకు ఇష్ఠమైన పదార్థాలను ఎక్కువగా తిని వ్యాధులు తెచ్చుకొంటారు. స్వీట్లు, చాక్లెట్లు వంటివి పిల్లలకు చాలా ఇష్ఠమని అందరికీ తెలిసిందే. ఇటువంటి తినుబండారాలను కొంతమంది పిల్లలు అతిగా తింటుంటారు. ఈ అలవాటు కూడా మంచిది కాదు. ఇందువల్ల శరీరంలో కొవ్వు పెరిగి పిల్లలు స్థూలకాయులుగా తయారవడం, శరీరం ఎక్కువ బరువు పెరగడం వంటి అవ లక్షణాలు కనిపిస్తాయి. వయసు, ఎత్తుకు మించి బరువు ఉండడం కూడా అభిలషణీయం కాదు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. పిల్లలు ఒక క్రమ పద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం అన్నది వారసత్వరీత్యా కూడా సంక్రమించవచ్చు. ఇది వరకు కుటుంబంలో ఎవరన్నా ఈ లక్షణాలను ప్రదర్శిస్తే జన్యురీత్యా వారి సంతానం కూడా అలాగే ప్రవర్తించే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. పిల్లలు సరిగా తినడం లేదనికానీ లేదా ఎక్కువగా తింటున్నారని కానీ తల్లిదండ్రులు ఒక్కోసారి గుర్తించలేకపోవచ్చు. వయసును బట్టి పిల్లల ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తుంటాయి. పిల్లల పెరుగుదల క్రమంలో ఈ మార్పులు సహజం. అయితే మార్పులు సక్రమంగా తీసుకోని విధంగా మాత్రం ఉండకూడదు. పౌష్టికాహార పదార్థాలకు ఉదాహరణలు కిచిడి కావలసిన పదార్థాలు : బియ్యం 30 గ్రా. పెసరపప్పు 15 గ్రా. ఆకుకూరలు రెండు కట్టలు, నూనె 2 టేబున్ స్పూన్లు, జీలకర్ర కొంచెం. పద్ధతి : బియ్యం, పెసరపప్పును శుభ్రంచేసి ఉప్పు వేసిన నీటిలో నీరు ఇంకి గింజలు, మెత్తబడేదాకా ఉడికించాలి. ముప్పాతిక ఉడికిన సమయంలో ఆకుకూరలును వేయాలి. నూనెలో జీలకర్రను వేయించి చివరగా కలపాలి. మాల్టు చేయబడిన రాగులతో జావ కావలసిన పదార్థాలు : మాల్టు చేయబడిన రాగులు 30 గ్రా.. వేయించిన వేరుశనగలు15 గ్రా.. బెల్లం 20గ్రా. పద్ధతి : మొలకెత్తిన తరువాత వేయించి మాల్టు చేయబడిన రాగులు, వేరుశనగలు, బెల్లం మూడింటిని పొడి చేయాలి. తగినంత నీళ్ళు కలిపి ఉడికించాలి. గోధుమ పాయసం కావలసిన పదార్థాలు : గోధుమలు 30 గ్రా.. వేయించిన శనగపిండి 15 గ్రా. వేయించి, పొడి చేసిన వేరుశనగలు 5 గ్రా.. చక్కెర 15 గ్రా.. పద్ధతి : గోధుమలను వేయించి పొడిచేయాలి. వేయించి శనగపిండి, వేరుశనగలు, చక్కెరను కలపాలి. తగినంత నీటిలో ఉడికించాలి. సూచనలు ఈ వంటకాలన్నీ సుమారు 200 కిలో కేలరీలను, 5 గ్రాముల మాంసకృత్తులను ఇస్తాయి. ఇచ్చిన పరిమాణం రెండుసార్లు తినిపించడానికి సరిపోతుంది. వంటకాలను రెండు, మూడు గాలిదూరని డబ్బా / సీసాలలో నిల్వ ఉంచి అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. మెత్తగా ఉడికించిన గ్రుడ్లు, మెత్తని మాంసం బిడ్డకు 6 నెలల వయసునప్పుడు ఇవ్వడం మొదలు పెట్టవచ్చు. ఆధారము: మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ – ఆంధ్రప్రదేశ్