మాంసకృత్తులు మాంసకృత్తులు మన శరీరానికి కావలసిన ఘన పోషకాలు. కండరాలు ఏర్పాటుకు, వాటి కణజాలాల ఎదుగుదలకు, నిర్వహణకు, మరమ్మత్తులకు ఇవి తప్పనిసరి. ఇవి ఎన్నో జీవక్రియలకు తోడ్పడుతాయి. మనలో ఉండే అధిక మాంసకృత్తులను శరీరం జీవక్రియలను జరపడానికి శక్తిగా ఉపయోగించుకుంటుంది. మాంసకృత్తులు మన శరీరంలో 50% కణజాలంలో, 20% ఎముకలలో, 10% చర్మంలో, మిగిలినది ఇతర అవయవాలలో ఉంటాయి. మాంసకృత్తులు ఎన్నో అమైనో ఆమ్లాల సమీకృతం. అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి బంధాలను ఎర్పరచుకొని సమూహంగా మారి మాంసకృత్తులను ఏర్పరుస్తుంది. మన శరీరంలో ఇరవై రకాల అమైనో ఆమ్లాలు మాంసకృత్తుల ఉత్పత్తికి తోడ్పడుతాయి. మాంసకృత్తుల విభజన సంపూర్ణ మాంసకృత్తులు: అన్ని ఆవశ్యక అమైనో ఆమ్లాలు కలిగిన మాంసకృత్తులు. ఇవి పెరుగుదలకు తోడ్పడుతాయి ఉదాహరణ: కోడిగ్రుడ్డు. గ్రుడ్డులో ఉండే మాంసకృత్తులను రిఫరెన్స్ ప్రోటిన్ అని అంటారు. ఇందులో 100% గుణవంతమైన మాంసకృత్తులు ఉంటాయి. దీనితో పోలిస్తే శాఖాహారంలో 65% మాంసకృత్తులు మాత్రమే ఉంటాయి. పాక్షిక మాంసకృత్తులు: ఒకటో, రెండో ఆవశ్యక అమైనో ఆమ్లాలు లోపిస్తాయి. పెరుగుదలకు పాక్షికంగా తోడ్పడతాయి. ఉదాహరణ: గోధుమలు, వరి అసంపూర్ణ మాంసకృత్తులు:రెండు అంతకంటే ఎక్కువ ఆవశ్యక అమైనో ఆమ్లాలు లోపిస్తాయి. ఇవి పెరుగుదలకు తోడ్పడవు. ఉదాహరణ: జిలటిన్ ఆమైనో ఆమ్లాల విభజన ఆవశ్యక అమైనో ఆమ్లాలు, అనావశ్యక అమైనో ఆమ్లాలు , నిబద్దత ఆవశ్యక ఆమైనో ఆమ్లాలు అని మూడు విధాలుగా విభజించబడ్డాయి. ఆవశ్యక అమైనో ఆమ్లాలు అనావశ్యక అమైనో ఆమ్లాలు నిబద్దత ఆవశ్యక ఆమైనో ఆమ్లాలు హిస్టోడైన్ త్రియోనైన్ ఐసోలూసిన్ లూసిన్ లైసిన్ మిథియోనైన్ ఫినైల్ అలనిన్ త్రియోనైన్ ట్రిఫ్టోఫాన్ వాలైన్ అలనైన్ అస్పెర్జిన్ అస్పెర్టిక్ యాసిడ్ గ్లుటానిక్ యాసిడ్ సెరైన్ అర్జినైన్ సిస్టైన్ గ్లుటామైన్ గ్లైసిన్ ప్రొలైన్ టైరోసిన్ ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఇవి మన శరీరంలో తయారుకావు. కాని శరీర పెరుగుదల మరియు నిర్వహణకు ఇవి అవసరం. తప్పనిసరిగా ఆహారం ద్వారా సమకూర్చుకోవలసిందే. ఆవశ్యక అమైనో ఆమ్లాల గల ఆహార పదార్థాలు: పాలు, గుడ్డు, చేపలు, సోయా చిక్కుళ్ళు, మాంసం, ఆకుకూరలు, వేరుశనగలు, ధాన్యాలు, చిరుధాన్యాలు. అనావశ్యక అమైనో ఆమ్లాలు వీటిని మన శరీరమే అవశ్యకతను బట్టి చేసుకోగలదు. కాని దీనికి నైట్రోజన్ అవసరం. అందుచేత మనం తీసుకొనే ఆహారంలో నైట్రోజెన్ ఉండాలి. మాంసకృత్తులు గల ఆహారం తీసుకుంటే నైట్రోజెన్ లభ్యమౌతుంది. ఆవశ్యక అమైనో ఆమ్లాలకైనా అయినా, అనావశ్యక అమినో ఆమ్లాలకైనా మాంసకృత్తులు గల ఆహారం అవసరం. నిబద్దతఆవశ్యక ఆమైనో ఆమ్లాలు మానవ శరీరంలో కొన్ని పరిస్థితులలో అమైనో ఆమ్లాల ఉత్పత్తికి అవసరమైన ఎంజైములు లోపించినపుడు, అటువంటి అమైనో ఆమ్లాలను ఆహారం ద్వారానే పొందవలసి వస్తుంది. ఉదాహరణకు చంటి పిల్లలలో అర్జినిన్ అనే అమైనో ఆసిడ్ ఉత్పత్తికి ఎంజైం ఉండదు. అందుకే పిల్లలకు 6 నెలల నుండి అనుబంధ ఆహారంగా గ్రుడ్డు, పప్పులు ఇవ్వమని నిపుణులు చెప్తారు. వీటి ద్వారా వారికి ఆర్జినిన్ లభిస్తుంది. విధులు: మన శరీరంలో జరిగే ప్రతి జీవరసాయన చర్య మాంసకృత్తుల ఎంజైం వల్ల ప్రేరేపించబడుతుంది. శరీరంలో అన్ని నిర్మాణ కణజాలాలు మాంసకృత్తులని కలిగి ఉంటాయి. అందువల్ల శరీరానికి మాంసకృత్తులు అత్యవసరమైనవిగా చెప్పవచ్చు. పెరుగుదల మరియు కణజాల నిర్వహణ: శరీరంలో కొత్త కణాల ఏర్పాటుకు, వాటి పెరుగుదలకు ఆమైనో ఆమ్లాల మిశ్రమం ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఆమైనో ఆమ్లాల మిశ్రమం సరైన మోతాదులో ఉన్నపుడు ఈ విధి జరుగుతుంది. అమైనో ఆమ్లాలు ఒక సమూహంగా ఏర్పడి మాంసకృత్తులను ఏర్పరుస్తాయి. కణాల పునరుత్పత్తి కూడా మాంసకృత్తుల మీదే ఆధారాపడి ఉంటుంది. కణ నిర్మాణ చట్రం ఎముకల కండరాలలోనే ఆక్టిన్, మయోసిన్, కణాంతర మాతృకలోని కొల్లాజన్ లు కూడా మాంసకృత్తులే. కణవిభజన సమయంలో కణనిర్మాణ చట్రం కదలికను జన్యువులను కలిగి ఉన్న క్రోమోజోంలు సరిక్రమంలో విభజింపబడడానికి, కొత్త కణాలు సాధారణ మరియు సంపూర్ణ స్థితిలో ఏర్పడడానికి మాంసకృత్తులు ఉపయోగింపబడతాయి. మాంసకృత్తులు క్రమక్రమంగా అధోకరణం చెంది మరలా పునరుత్పత్తి అవుతాయి. దీనినే మాంసకృత్తుల టర్నోవర్ అంటారు. ఇది శరీర మొత్తం మాంసకృత్తులలో 0.3-0.4% వరకు జరుగుతుంది. ఈ సమయంలో ఏర్పడిన ఆమైనో ఆమ్లాలను మన శరీరంలో తిరిగి ఉపయోగించుకుంటుంది. చర్మం, జుట్టు, గోర్లు, మలం ద్వారా మాంసకృత్తులను శరీరం కోల్పోతుంది. ఇలా కోల్పోయిన మాంసకృత్తులను తిరిగి మనం ఆహారం పొందాల్సి ఉంటుంది. మన జీర్ణవ్యవస్థలో ఉండే అనేక ఎంజైములు మాంసకృత్తులే. ఇన్సులిన్, గ్యాస్ట్రిన్, పెరుగుదల హార్మోన్ వంటి అనేక హార్మోన్ లు మాంసకృత్తులే. ఈ హార్మోనులు కణాల యొక్క జీవక్రియలను క్రమబద్దీకరిస్తాయి. కణాల ప్రత్యుత్పత్తికి కూడా ఇవి తోడ్పడుతాయి. అడ్రినల్ గ్రంధి నుండి స్రవించబడిన ఎపినెఫ్రిన్ అనే హార్మోన్ ట్రైరోసిన్ అనే ఆమైనో ఆమ్లం నుండి ఏర్పడుతుంది. మన శరీరంలో ఉండే గ్లైకోప్రోటీన్లు థైరాక్సిన్, కార్టిసోల్ అనే హార్మోనులతో ప్రత్యేక బంధాలను ఏర్పరచుకోని వాటి యొక్క విధి నిర్వాహణలో తోడ్పడుతాయి. శ్వాసక్రియ సమయంలో మన ఆహార అణువులు ఆక్సికరణం చెందడానికి కావలసిన ఆక్సిజన్ అణువులను రక్తం ద్వారా రవాణా చేసే హీమోగ్లోబిన్ కూడా ఒక మాంసకృత్తులే. మన రక్తం గడ్డకట్టడానికి కావలసిన పదార్ధాలు కూడా మాంసకృత్తులే. కంటిచూపుకు ఉపయోగపడే ఫోటో రిసెప్టర్లు, కండరాల సంకోచానికి తోడ్పడే ఆక్టిన్ మయోసిన్ లు కూడా మాంసకృత్తులే, ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం యొక్క పూర్వగామిగా వ్యవహరించబడుతుంది. మన నాడీ కణాల ఉత్ప్రేరణకు తోడ్పడే న్యూరోట్రాన్సిమిటర్ సెరిటోనిన్ కూడా ఒక మాంసకృత్తులే. పోషకాల రవాణా: మాంసకృత్తులు మన శరీరంలో పోషకాల రవాణాలో అత్యంత కీలకమైన పాత్రను వహిస్తుంది. పోషకాలు జీర్ణాశయం నుండి రక్తంలోకి, రక్తం నుండి కణజాలాలలోకి , వాటి నుండి కణాలలోకి సరఫరా అవ్వడానికి మాంసకృత్తులు సహాయపడతాయి. ఒక్కొక్క పోషక పదార్ధ సరఫరాకు ప్రత్యేకమైన రవాణా మాంసకృత్తి ఉంటుంది. రెటినాల్ బైండింగ్ మాంసకృత్తి రెటినల్ యొక్క సరఫరాకు మాత్రమే సహాయపడుతుంది. కానీ మోటాలోతయోన్ అనే మాంసకృత్తి మాత్రం కాపర్ మరియు జింక్ ఖనిజలవణాల సరఫరాకు సహాయపడుతుంది. అలాగే, మన శరీరంలో ఉండే లైపోప్రోటీన్లు వివిధ రకాల లిపిడ్ అణువులను సరాఫరా చేస్తాయి. నీటి సమతుల్యత - పర్యవేక్షణ: మన శరీరంలో ఉండే ద్రవం రెండు రకాలుగా విభజించబడుతుంది. అవి: 1. ఇంట్రాసెల్యూలర్ ద్రవం, 2. ఎక్స్-ట్రాసెల్యూలార్ ద్రవం. మరలా ఈ ఎక్స్-ట్రాసెల్యూలార్ ద్రవం రెండు రకాలుగా విభజించబడింది. కణాల మధ్యలో ఉండే ద్రవాన్ని ఇంట్రావాస్క్యులర్ ద్రవంగా అభివర్ణిస్తారు. ఈ ద్రవాల సమతుల్యతకు కరిగే స్వభావం గల మాంసకృత్తులు, ఎలక్ట్రోలైట్లు అయిన పోటాషియం, సోడియంలు సహాయపడుతాయి. ఒకవేళ మన రక్తంలో మాంసకృత్తులు తగ్గినప్పుడు ఈ సమతుల్యం చెడిపోయి రక్తంలో నుండి ద్రవం కణజాలాల్లోకి అధికంగా చేరి పేరుకుపోతుంది. అందువల్ల మనిషి ఉబ్బినట్లుగా కనబడతాడు. శరీరంలో తగిన pH నిర్వహణ: మన శరీరంలో ఎల్లప్పుడు జరుగుతున్న జీవక్రియలలో ఆమ్లాలు, క్షారాలు నిరంతరంగా స్రవించబడుతుంటాయి. ఈ ఆమ్ల క్షారాలు అధికమైనపుడు మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా మాంసకృత్తులు వాటిని రక్తం ద్వారా అవయవాలకు చేర్చి వాటి విసర్జనకు తోడ్పడుతుంది. మన రోగనిరోధక వ్యవస్థలో ప్రతిరక్షకాలు అనే మాంసకృత్తులు ఉంటాయి. వ్యాధి సంక్రమణకు, ప్రతిరక్షకాలు ప్రతిజనకాలతో పోరాడి వ్యాధి సంక్రమించకుండా చేస్తాయి. ఒక్కో ప్రత్యేకమైన ప్రతిరక్షకానికి ఒక్కో ప్రతిజనకం ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు ఈ ప్రతిరక్షకాన్ని మన శరీరం స్రవిస్తుంది. మన ఆహారంలో ఉండే విషపదార్ధాలను కాలేయంలోని ఏంజైములు విషరహిత పదార్ధాలుగా మారుస్తాయి. శక్తినిచ్చే పదార్ధాలు: పిండిపదార్ధాల లాగే మాంసకృత్తులు కూడా ప్రతి ఒక్క గ్రాముకు 4 కిలోకేలరీల శక్తిని అందిస్తాయి. ఏదైన సమయంలో మన ఆహారంలో పిండిపదార్ధాలు తక్కువైనప్పుడు మాంసకృత్తులు మన శరీరంలో శక్తి కొరకు ఉపయోగించుకుంటుంది. సిఫారసు చేయబడిన పరిమాణాలు: జాతీయ పోషకాహార సంస్థ సిఫారసు చేసిన మాంసకృత్తుల పరిమాణాలు వర్గం పరిమాణం(రోజుకు గ్రాములలో) పురుషుడు 60 స్త్రీ 50 గర్భిణీ 50+15 బాలింత తల్లులు 0-6 నెలల బాలింత 6-12 నెలలు బాలింత 50+25 50+18 చంటి బిడ్డలు 0-6 నెలలు 6-12 నెలలు 2.05/kg 1.65/kg పిల్లలు 1-3 సంవత్సరాలు 4-6 సంవత్సరాలు 7-9 సంవత్సరాలు 22 30 41 అబ్బాయిలు 10-12 13-15 16-18 54 70 78 అమ్మాయిలు 10-12 13-15 16-18 57 65 63 మాంసకృత్తులు సమృద్ధిగా ఉండే పదార్ధాలు మాంసం, గుడ్డు, చేపలు, పాలలో మాంసకృత్తులు అత్యధిక మోతాదులలో ఉండడమే కాకుండా , ఆవశ్యక అమైనో ఆమ్లాలు కలిగి ఉంటాయి. పప్పుదినుసులు, నూనెగింజలు, నట్స్ లో కూడా మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. మాంసాహార పదార్ధాలు ప్రోటీన్ గ్రా/100 గ్రా. శాఖాహార పదార్ధాలు ప్రోటిన్ గ్రా./100గ్రా. క్రొవ్వు తీసిన ఆవుపాల పొడి 38 పుచ్చకాయ గింజలు 35 పాల పొడి 26 సోయాబీన్ 43 కోడి మాంసం 26 గోధుమలు 29 చీజ్ 24 వేరుశనగలు 25 హెర్రింగ్ చేప 20 పెసరపప్పు 24 మేక కాలేయం 20 బఠాణీలు(ఎండినవి) 20 రొయ్యలు 19 శనగలు 17 మేక మాంసం 18 తృణ గోధుమలు 12 కోడి గ్రుడ్డు 13 అగతి 8 బర్రె పాలు 4 బియ్యం 7 సోయాలో అత్యధికంగా 40% మాంసకృత్తులు ఉంటాయి. క్రొవ్వు తీసేసిన నూనె గింజల మిశ్రమంలో 50-60% మాంసకృత్తులు ఉంటాయి. ధాన్యాలు చిరుధాన్యాలలో 10% మాంసకృత్తులు ఉంటాయి. ఆకుకూరలు, పండ్లు మరియు దుంపలలో 2% మాంసకృత్తులు ఉంటాయి. శాఖాహరులకు ఆవశ్యక ఆమైనో ఆమ్లాలు సంపూర్ణంగా లభించడానికి కొన్ని చిట్కాలు: అధ్బుతమైన కలయికలు ఎందుకంటే ఉదాహరణ ధాన్యాలు(పప్పుదినుసులు+చిక్కుడు) ధాన్యాలలో లైసిన్ అనే ఆవశ్యక ఆమ్లం లోపిస్తుంది. మోతాదులో మిథియోనైన్ అనే ఆవశ్యక ఆమైనో ఆమ్లం ఎక్కువ మోతాదులో ఉంటుంది. పప్పుదినిసులలో లైసిన్ ఎక్కువగా ఉంది. మిథియోనైన్ లోపిస్తుంది. ఈ రెండు ఆహార పదార్థాలు కలిపి తీసుకున్నప్పుడు ఆమైనో ఆమ్లాలలో సమతుల్యత ఏర్పడి సంపూర్ణ ఆహారం అవుతుంది. అలాగే పాలను, పాల పదార్థాలను ధాన్యాలతో కలిపి తీసుకోవడం వలన మరియు నట్స్ నూనె గింజలను, పప్పులతో కలిపి తీసుకోవడం వలన కూడా సంపూర్ణ ఆహారంగా మారుతుంది. ఇడ్లీ, దోసె, కిచిడీ మరియు చనా కూరతో రొట్టెలు. ధాన్యాలు+పాలు+పాల ఉత్పత్తులు పాయసం, పన్నీర్ పులావ్, పెరుగు అన్నం, చీజ్ తో చేసిన పాస్త. పప్పులు+నట్స్ మరియు నూనెగింజలు వేయించిన శనగపప్పుతో కొబ్బరి పచ్చడి లేదా శనగగింజల పచ్చడి లేదా నువ్వుల పచ్చడిని తీసుకోవాలి. క్వాషియోర్కర్: పిల్లలలో పెరుగుదల మరియు నిర్వహణకు మాంసకృత్తులు అత్యంత ముఖ్య పోషకపదార్థాలు. పేదరికం వలన కాని, తల్లి నుండి దూరంగా ఉండటం వలన కాని లేదా ఇతర జబ్బుల వలన కాని సరైన పౌష్టిక ఆహారం తీసుకోలేకపోయినప్పుడు పోషకాహార లోపం వస్తుంది. ఇది ఎన్నో పోషక లోప వ్యాధులకు దారితీస్తుంది. క్వాషియోర్కర్ కూడా ఇలాంటి వ్యాధియే. ఈ వ్యాధికి ముఖ్యమైన కారణం ఆహారంలో మాంసకృత్తులు తీవ్రంగా లోపించడం. వ్యాది లక్షణాలు బరువు తక్కువగా ఉండటం. శరీరం అంతా ఉబ్బిపోవడం. ముందుగా కాళ్ళు, చేతులు క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. శరీర పెరుగుదల ఆగిపోతుంది. ముఖము వాచి చంద్రుడు ఆకారంలో ఉంటుంది. మానసిక ఎదుగుదల వల్ల సక్రమంగా ఉండదు. చర్మంపై చారలు ఏర్పడతాయి. ఈ లోపం వల్ల తీవ్రమైన స్థాయిలకు వచ్చినప్పుడు చర్మం పెళుసులుగా ఊడి పోతూ ఒక రకమైన ద్రవం శరీరం నుండి బయటకు వస్తుంది. వెంట్రుకలు పలుచుగా మారి లాగగానే నొప్పిలేకుండా ఊడిపోతాయి. అలాగే వెంట్రుకలు రంగుమారి పిల్లలలో ఆకలి మందగిస్తుంది. అతిసార వ్యాధి వస్తుంది. ఇతర పోషక లోపాలు ముఖ్యముగా విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, లోపవ్యాధుల సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. స్థూల ఖనిజ లవణాలు ఖనిజ లవణాలు మన శరీరంలో జీవక్రియలను, కణాల మరియు కణజాల సంరక్షణకు, ఇంకా మన ఆరోగ్యానికి దోహదం చేసే ఇతర కార్యకలాపాలను పరిరక్షించే సూక్ష్మపోషకాలు. ఇవి చిన్న మోతాదులో అవసరమైనప్పటికి వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. స్థూల ఖనిజలవణాలు -అంటే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, సోడియంలు. ఇవి మన శరీరంలో 0.05% ఉంటాయి. సూక్ష్మఖనిజలవణాలు - మన శరీరంలో 0.05% కంటే తక్కువగా ఉండే ఖనిజలవణాలను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు. వీటినే "ట్రేస్ ఎలిమెంట్స్" అని కూడా అంటారు. ఐరన్, అయొడిన్, జింక్, కాపర్, ఫ్లోరిన్, సెలీనియం, క్రోమియం, మాంగనీస్, కోబాల్ట్ మరియు మాలిబ్డినం లను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు. కాల్షియం కాల్షియం మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన ముఖ్య ఖనిజం. మన శరీరంలో కాల్షియం అత్యధిక శాతంలో ఉంటుంది. 99% ఎముకలలో, 1% సుతిమెత్తని కండరాలలో ఉంటుంది. వీటి పనితీరు సక్రమంగా ఉండాలంటే కాల్షియం బాగా అవసరం. స్థూలంగా చెప్పాలంటే కాల్షియం మన శరీరంలో ఈ క్రింది కార్యకలాపాలకు అవసరం. ఎముకలు మరియు దంతాలు ఏర్పడడానికి ఎముకల ఆరోగ్యానికి రక్తం గడ్డ కట్టించడానికి రక్తకణాల ఆరోగ్యానికి గుండె సక్రమంగా పనిచేయడానికి నరాలను ఉత్తేజపరచడానికి కాల్షియం లోపం లక్షణాలు కండారాల నొప్పులు, కొంగర్లు దంతాల క్షీణత ఎముకల బలహీనత బిరుసుగూళ్ళు పొడిబారిన చర్మము మూత్రపిండాలలో రాళ్ళు బహిష్టు సమయంలో అస్వస్థతలు గర్భవిచ్చిత్తి బోలు ఎముకలు విశదంగా తెలుసుకోవాలంటే... ఎముకలు ఏర్పడడానికి: మన శరీరంలోని ఎముకలలో కాల్షియం, ఫాస్ఫేట్, మెగ్నీషియం అనే ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలు ఏర్పడడానికి మరియు అవి బలంగా ఉండడానికి చాలా అవసరం. మన శరీరంలో సుమారు 1 కిలోకి పైగా కాల్షియం ఉంటుంది. ఇది ఫాస్ఫేట్ అనే ఇంకొక ఖనిజంతో చేరి "హైడ్రాక్సి ఎపిటేట్" గా మారి మన ఎముకలలో భాగంగా ఉంటుంది. ఎముకలలోని ఖనిజాలలో 39.9% కాల్షియం ఉంటుంది. కొల్లాజిన్ సమాహారంలో ఉంటుంది. దంతాలు ఏర్పడడానికి: దంతాలపై ఉండే ఎనామిల్ మరియు డెంటైన్ లలో "హైడ్రాక్సి ఎపిటేట్" ఉంటుంది. ఇది కెరాటిన్ అనే ప్రోటీన్ భాగంలో ఉంటుంది. శరీరంలోని మెత్తటి కణజాలాలను కాల్షియం సంపర్కించి వాటిని ధృఢంగా చేస్తాయి. దీనిని కాల్సిఫికేషన్ అంటారు. ఇది తల్లి గర్భంలో శిశువు 20 వారాల వయస్సు ఉన్నప్పుడు మొదలై బిడ్డకు 6 నెలల వయస్సు వచ్చేటపుడు పూర్తవుతుంది. శాశ్వత దంతాల కాల్సిఫికేషన్ బిడ్డకు 3 నెలల వయస్సు ఉన్నప్పుడు ప్రారంభమై 3 సంవత్సరాల వయస్సున్నప్పుడు పూర్తవుతాయి. బోలు ఎముకల వ్యాధి నివారణకు: మన శరీరానికి కాల్షియం సక్రమంగా అందనప్పుడు, ఎముకలలో, మెత్తని కండరాలలో నిల్వ ఉన్న కాల్షియం ను వాడుకుంటుంది. అందువల్ల ఎముకలు సాంద్రత కోల్పోయి, బలహీనంగా మారుతాయి. సులువుగా విరిగిపోతాయి కూడా. దీనినే బోలు ఎముకల వ్యాధి అంటాము. అది ఎక్కువగా మధ్య వయస్సు వారికి మరియు ముసలి వాళ్ళకు చూస్తాము. స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. శరీర ఎదుగుదలకు: కాల్షియం మన శరీరంలో ఎక్కువ పరిమాణంలో అవసరం ఉంటుంది. శరీరంలో ప్రతి కణం ఆరోగ్యంగా పనిచేయాలంటే కాల్షియం తప్పనిసరి. రక్తంలో కంటే కణాలలో కాల్షియం తక్కువ పరిమాణంలో ఉంటుంది. హర్మోనుల ప్రేరణ వంటి రసాయన చర్యల వలన కణాలలోనికి కాల్షియం గ్రహించబడుతుంది. రసాయన చర్యలకు స్పందించే గుణం కాల్షియంకు ఉండటంవలన శరీరంలో కొన్ని కీలక విధులను నిర్వహిస్తుంది- ఇన్సులిన్ ప్రక్రియలో, నాడీకణాలనుండి సంకేతాలను అవయవాలకు అందించడంలో, కండర వ్యాకోచ,సంకోచాలను నిర్వర్తించడంలో, అండంతో కలవడానికి వీర్యకణం కదలికను వేగవంతం చేయడంలో కాల్షియం అవసరం ఎంతో ఉంది. రక్తం గడ్డకట్టడానికి: మనకు ఏదైనా గాయమైనపుడు త్రాంబోప్లాస్టిన్ అనే ఎంజైము గాయపడిన కణజాలాల నుండి స్రవించబడుతుంది. ఇది ప్రోత్రాంబిన్ అనే ప్రోటీన్ ను త్రాంబిన్ గా మారుస్తుంది. ఈ పరివర్తన జరగాలంటే కాల్షియం అత్యంత అవసరం. ఇలా ఏర్పడిన త్రాంబిన్ "పైబ్రినోజన్" అనే ప్రోటీన్ ను పైబ్రిన్ గా మారుస్తుంది. ఈ ఫైబ్రిన్ రక్తం గడ్డకట్టడానికి కావలసిన ఫైబ్రస్ సమూహాన్ని ఏర్పరుస్తుంది. అందువల్ల రక్తం ఎక్కువగా పోకుండా కాపాడుతుంది. హైపోకాల్షిమియా: మన శరీరంలో కాల్షియం అతి తక్కువ ఉండటం వలన ఈ స్థితి సంభవించవచ్చు. ఆహారంలో కాల్షియం తక్కువ పరిమాణంలో తీసుకోవడం వలన శరీరంలో కూడా తక్కువౌతుంది. ఇది ఎక్కువగా పారాథైరాయిడ్ హార్మోనును తొలగించినప్పుడు వస్తుంది. మాల్ అప్సరిటీవ్ సిండ్రోం అనే వ్యాధి ఉన్నప్పుడు కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. దీని వల్ల ఎముకల సాంద్రత కోల్పోయి బలహీనంగా మారుతాయి. కండరాలు పటుత్వం కోల్పోయి స్పర్శ తెలియకపోవడం జరుగుతుంది. కండరాలలో, ఎముకలలో నొప్పి కల్గుతుంది. అధిక రక్తపోటు: మన ఆహారంలో కాల్షియం తక్కువగా ఉన్నట్లైతే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. మన ఆహారంలో కాల్షియం, విటమిన్ D సమృద్ధిగా తీసుకున్నట్లైతే కొలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ కొలాన్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అధిక మోతాదులో కాల్షియం ఇచ్చినట్లయితే కణాల ఉత్తేజాన్ని ఆపి నివారణకు తోడ్పడుతుంది. హైపర్ కాల్షిమియా: ఈ సమస్య ఎక్కువగా చంటిబిడ్డలలో చూస్తుంటాము. ఇది వీరిలో ఎక్కువ మోతాదులో విటమిన్ D తీసుకోవడం వల్ల వస్తుంది. పారాథైరాయిడ్ ఎక్కువగా స్రవించబడినప్పుడు కూడా వస్తుంది. వాంతులు, వికారం, ఆకలి తగ్గిపోవడం, మలబద్ధకం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు చూడొచ్చు.కొన్ని సార్లు మూత్రపిండాలలో రాళ్ళు, కండరాల బలహీనతను కూడా చూడొచ్చు. కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు మి.గ్రా./100 గ్రా ఎండ్రికిచ్చ (కాయ) చిన్నది 1606 చామదుంప ఆకులు 1546 నువ్వులు 1450 కొవ్వు తీసిన పాలు 1370 పాల పొడి 950 మునగాకులు 440 బర్రె పాలు 210 చీజ్ 790 అవిసె ఆకులు 1130 కాల్షియం సహజంగా శాకాహారం, మాంసాహారాలలో ఉంటుంది. ఆకుకూరలు, పాలు, చిరుధాన్యాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలలో తోటకూర, మునగాకు, చిరుధాన్యాలలో రాగి, కూరగాయలలో రాజ్ కీరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఫాస్పరస్ ఫాస్పరస్ అనే ఖనిజం మన శరీరంలో 400-700 గ్రాముల వరకు నిల్వ ఉంటుంది. ఇది ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. మన దంతాలలో, ఎముకలలో, కణజాలల్లో ఉంటుంది. ఎముకల్లో, దంతాల్లో, కాల్షియం ఫాస్ఫేట్ గాను, సుతిమెత్తని కణజాలల్లో సోడియం మరియు పొటాషియం ఫాస్ఫేట్ గాను ఉంటుంది. ఉపయోగాలు ఎముకలు మరియు దంతాలు ఏర్పడ్డానికి కణాలు ముఖ్యంగా మెదడులోని కణాలలోని పొరలైన ఫాస్పోలిపిడ్స్ లెసితిన్ మరియు సిఫాలిన్ ఏర్పడ్డానికి ఇది ముఖ్యం. ఇది న్యుక్లిక్ యాసిడ్స్ అయిన డి.ఎన్.ఎ. మరియు ఆర్.ఎన్.ఎ. లలో అంతర్భాగం. కొవ్వు పదార్థాల జీవక్రియకు ,రవాణాకు అత్యంత అవసరం. పిండి పదార్థాలు, కొవ్వు, మాంసకృత్తుల జీవక్రియలకు అవసరమైన ఎంజైము కార్బాక్సిలేసులలో ఇది అంతర్భాగం. పిండిపదార్థాల జీర్ణక్రియకు ఇనార్గానిక్ ఫాస్పరస్ ఆవశ్యకం. ఫాస్పరస్ లోపం లక్షణాలు ఆకలి లేకపోవడం నీర్సంగా అనిపిచడం కండారల బలహీనత ఎముకలలో నొప్పి అంటువ్యాధులకు త్వరగా లోనుకావడం గుచ్చినట్లుగా, తిమ్మిరిగా, స్పర్శలేనట్లుగా అనిపించడం. కండారాల సమన్వయం లేకపోవడం. మాములుగా ఫాస్పరస్ మానవ రక్త సీరంలో (రక్తంలో ఉండే పదార్థం. రక్తం గడ్డకట్టినపుడు పలుచని స్వచ్చంగా ఉండే ద్రవ పదార్థం) పెద్దవారిలో 100 మి.లీ రక్తంలో 2.5-40 మి.గ్రా, పిల్లలలో 5.0-6.0 మి.గ్రా ఉండాలి ఫాస్పరస్ సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల రికెట్స్ మరియు ఆస్టియోమలేసియా అనే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రికెట్స్ అనే వ్యాధి సోకినప్పుడు ఫాస్ఫరస్ 100 మి.లీ.కు 3 మి.గ్రా. తగ్గుతుంది. రికెట్స్: ఈ సమస్య మనం చిన్నపిల్లలలో చూస్తాము. ఆహారంలో కాల్షియం, విటమిన్ ఫాస్ఫరస్ లు లోపించినపుడు మన శరీరానికిసరిపడా అవసరమయ్యే కాల్షియం, విటమిన్, ఫాస్ఫరస్ లు అందవు.అప్పుడు ఎముకలు సాంద్రత కోల్పోయి, అసాధారణ కాల్సిఫికేషన్ కు లోనౌతాయి.అందువల్ల ఎముకలు విరిగిపోవడం, మెత్తబడడం, అసాధారణ రూపం పొందటం అంటే వంకరగా తిరగడం లాంటివి జరుగుతాయి. పిల్లలలో ఇది ఎముకలలోని ఎపిఫైసల్ ప్లేట్ మూసుకుపోకముందే కాల్సిఫికేషన్ జరుగుతుంది.ఇదే సమస్య పెద్దవారిలో కనిపించినట్లైతే దానిని ఆస్టియోమలేషియా అంటాము. కాని వీరిలో ఎపిప్లేట్ మూసుకున్నాక ఈ సమస్య కనిపిస్తుంది. సరైన మోతాదులలో ఫాస్ఫరస్ తీసుకోవడం మంచిది. సిఫారసు చేయబడ్డ మోతాదు వయస్సు ఒక రోజు మోతాదు (మి.గ్రా.లలో) పిల్లలు 0-6 నెలలు 7-12 నెలలు 1-3 సం. 7-9 సం. 10-12 సం. 250-300 350-400 600 700 700 యుక్తవయస్కులు అబ్బాయిలు అమ్మాయిలు 800 800 గర్భిణులు 1200 పాలిచ్చే తల్లులు 1200 ఫాస్ఫరస్ సమృద్దిగా దొరికే ఆహార పదార్థాలు ఆహారపదార్థం 100 గ్రాములలో లభ్యమయ్యే పరిమాణం(గ్రాములలో) పప్పుదినుసులు, చిరుధాన్యాలు, నూనెగింజలు, ధాన్యాలు 0.2-0.65 ఎండు చాపలు 1.2-1.3 పాల పొడి 0.76-0.82 కొవ్వు తీసిన పాలపొడి 1.0-1.1 మాంసం, గ్రుడ్డు, చేపలు 0.31-0.41 పాలు 0.009-0.11 మెగ్నీషియం మెగ్నీషియం మానవ శరీరంలో సుమారు 25 గ్రా ఉంటుందని అంచనా. అందులో 50% ఎముకలలో, 50% సున్నితమైన కణజాలల్లోను ఉంటుంది. ఉపయోగాలు ఇది అనేక జీవక్రియ ఎంజైములలో అంతర్భాగం. ఎముకలను పటిష్టం చేస్తుంది. అల్కలిన్ ఫాస్ఫేట్ అనే ఎంజైముకు ఉత్ప్రేరణ కల్గిస్తుంది. శరీరంలో అన్ని కణాలలో ముఖ్య ఖనిజం. మానవ శరీరంలో జరిగే అన్ని జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది. మన శరీరంలో ఈ మెగ్నీషియం లోపిస్తే అనేక సమస్యలను ఎదుర్కొంటాము. మానసిక ఒత్తిడికి లోనవ్వడం, ఎముకలు మరియు కండరాల బలహీనత, సిరలలో 100 మి.లీ.రక్తంలో 1 మి.గ్రా. కంటే తక్కువ ఉన్నట్లయితే మూర్చపోవడం, ఫిట్స్ కి గురయ్యే ప్రమాదం ఉంది. మెగ్నీషియం లభించే ఆహారపదార్థాలు మెగ్నీషియం ఎక్కువగా పప్పుదినుసులు, బాదం, జీడిపప్పు, ఆవాలు మొదలైన నునెగింజలలో ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలు, చిరుధాన్యాలలో కూడా ఇది పుష్కలంగా ఉంటుంది. పాలు, గుడ్డు, చేపలు, కాయగూరలలో కూడా లభిస్తుంది. సిఫారసు చేయబడ్డ మోతాదు వయస్సు ఒక రోజు మోతాదు (మి.గ్రా.లలో) చంటి బిడ్డలు 30-45 పిల్లలు 50-100 కౌమారులు 120-153 స్త్రీలు 310 పురుషులు 340 గర్భిణులు 310 పాలిచ్చే తల్లులు 310 సోడియం సోడియం అనే ఖనిజ లవణం మన శరీరంలో 100 గ్రాముల వరకు ఉంటుంది.ఇందులో 50% కణాలలోని వెలుపలి కణద్రవ్యంలో ఉంటుంది. మిగిలిన 50% కణజాలాల్లో మరియు ఎముకలలో ఉంటుంది. ఇది మన శరీరంలోని క్లోరిన్, బైకార్బోనేట్, ఫాస్ఫేట్, లాక్టేట్ మరియు పోపియోనేట్లతో సంపర్కించబడి ఉంటుంది. ఉపయోగాలు శరీరంలో ఆమ్ల-క్షార పరిమాణం యొక్క సమతుల్యతను పరిరక్షిస్తుంది. కణంలోని ప్లాస్మా మరియు ద్రవాల మధ్య ద్రవాభిసరణ పీడన చర్య జరిపి, శరీరం ద్రవాలను అధికంగా కోల్పోకుండా కాపాడుతుంది. చిన్న ప్రేగులలో మోనోశాకరైడ్ పిండిపదార్థాలు మరియు ఆమైనో ఆమ్లాల శోషణకు అవసరం. గుండె కదలికలు మొదలవ్వడానికి మరియు సరైన క్రమంలో కొట్టుకోవడానికి సోడియం అవసరం. ఇన్ని ఉపయోగాలున్న సోడియం ను మన శరీరానికి ఆహారం ద్వారా సరిగ్గా అందించకపోతే మనం చాలా దుష్పరిమాణాలను చూడవలసి వస్తుంది. 1.హైపర్ నేట్రీమియా: రక్తంలో సోడియం శాతం తగ్గినప్పుడు ఈ స్థితిని మనం గమనించవచ్చు. హైపర్ నేట్రీమియా లక్షణాలు అతి నిర్జలీకరణ రక్త పరిమాణం తగ్గిపోవడం రక్త పోటు తగ్గిపోవడం రక్త ప్రసరణ వైఫల్యం హైపర్ నేట్రీమియాకు కారణాలు అతిసారం, అధిక వాంతుల వలన జీర్ణాశయ ద్రవాలను శరీరం కోల్పోయినప్పుడు , దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో సోడియం యొక్క శోషణ మూత్రపిండ గొట్టాలలో సరిగ్గా లేనప్పుడు, అదివృక్క గ్రంథి పనితీరులో లోపం ఉన్నప్పుడు. సాధారణంగా మన రక్త సీరంలో సోడియం 136-145 మి.గ్రా./లీ.గా ఉంటుంది. పొటాషియం మన శరీరంలో పొటాషియం వెలుపలి కణజాల ద్రవంలో అంతర్భాగం. మన శరీరంలో సుమారు 250 గ్రా.ల పొటాషియం ఉంటుంది. ఎర్ర రక్తకణాలలో మరియు ఇతర కణాలలో 90% ఉంటుంది.ఇంకా 10% వెలుపలి కణజాల ద్రవంలో ఉంటుంది. ఉపయోగాలు ఆమ్ల-క్షార సమతుల్యాన్ని కణాలలో పరిరక్షిస్తుంది. కణాలలో అతిముఖ్యమైన కాటాయాన్ మాంసకృత్తులు పెరగడానికి పొటాషియం అత్యంత ప్రాముఖ్యం. ప్రతీ 6-25 కణజాల మాంసకృత్తుల ఉత్పత్తికి 117 మి.గ్రా.ల పొటాషియం అవసరం. గ్లైకోజ్ ఉత్పత్తిని పొటాషియం ప్రేరేపిస్తుంది. కండరాల సంకోచానికి పొటాషియం చాలా అవసరం. సామాన్యంగా మనలో 3.8-5.0 మి.ఈక్వలెంట్స్/లీ.ల పొటాషియం ఉంటుంది. ఒకవేళ దీనికంటే తక్కువ పొటాషియం మన శరీరంలో ఉన్నట్లైతే మనం హైపోకెలిమియా అనే ఆరోగ్య సమస్యనకు గురౌతాము. హైపోకెలీమియా లక్షణాలు కండరాల బలహీనత, పక్షవాతం, నరాల బలహీనత గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె ధమనులకు మరియు మూత్రపిండాలకు గాయాలవ్వడం, గుండె కండరాలు బలహీనపడటం. హైపర్ కెలీమియా లక్షణాలు ఒకవేళ పొటాషియం మన శరీరంలో ఎక్కువైనపుడు ఈ స్థితిని చూస్తాము. దీని లక్షణాలు కండరాలు మరియు నరాల ఒత్తిడికి లోనవ్వడం, గుండె వేగం తగ్గిపోవడం,గుండె చప్పుడు మందగించడం, గుండె స్తంభించడం, బలహీనత, మానసిక రుగ్మతలకు గురికావడం, స్పర్శను కోల్పోవడం, మూతృపిండాలు పని చేయకపోవడం, తీవ్ర నిర్జలీకరణకు గురికావడం సూక్ష్మ ఖనిజ లవణాలు ఖనిజ లవణాలు మన శరీరంలో జీవక్రియలను, కణాల మరియు కణజాల సంరక్షణకు, ఇంకా మన ఆరోగ్యానికి దోహదం చేసే ఇతర కార్యకలాపాలను పరిరక్షించే సూక్ష్మపోషకాలు. ఇవి చిన్న మోతాదులో అవసరమైనప్పటికి వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువ. స్థూల ఖనిజలవణాలు -అంటే కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, క్లోరిన్, సల్ఫర్, పొటాషియం, సోడియంలు. ఇవి మన శరీరంలో 0.05% ఉంటాయి. సూక్ష్మఖనిజలవణాలు - మన శరీరంలో 0.05% కంటే తక్కువగా ఉండే ఖనిజలవణాలను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు. వీటినే "ట్రేస్ ఎలిమెంట్స్" అని కూడా అంటారు. ఐరన్, అయొడిన్, జింక్, కాపర్, ఫ్లోరిన్, సెలీనియం, క్రోమియం, మాంగనీస్, కోబాల్ట్ మరియు మాలిబ్డినం లను సూక్ష్మఖనిజలవణాలు అని అంటారు. ఐరన్ (ఇనుము) సాధారణంగా మానవుని శరీరంలో మొత్తం ఐరన్ 4-5 గ్రా.ల పరిమాణంలో ఉంటుంది. ఐరన్ అనేది మానవుని శరీరంలో హీమోగ్లోబిన్ రూపంలో ఉంటుంది. శరీరంలో ఐరన్ సంక్లిష్ట రూపంలో ప్రోటీన్ కు పార్ఫరిన్ లేదా ఫెర్రిటిన్ లేదా ట్రాన్స్ ఫెరిన్ రూపంలో అతుక్కొని ఉంటుంది. విధులు 1. ఆక్సిజన్ రవాణా చేయడం, భద్రపరచుట ప్రతి గ్రాము హీమోగ్లోబిన్ 3.34 మి.గ్రా. ఐరన్ ను కలిగి ఉంటుంది.మయోగ్లోబిన్ కండరాలలో ఉంటుంది.అక్కడ ఇది ఆక్సిజన్ రిజర్వాయర్ గా పనిచేస్తుంది.ఆక్సిజన్ ఆహారపు అణువులతో కలిసి కండరాల సంకోచానికి కావలసిన శక్తిని విడుదల చేస్తుంది. 2. ఎంజైము కో-ఫాక్టర్ మరియు ఇతర మాంసకృత్తులు ఐరన్ ను కలిగి ఉన్న హీం సముదాయం కూడా ఇతర మాంసకృత్తుల భాగం, పోషకాల ఆక్సీకరణకు శక్తిని విడుదల చేయడంలోను మరియు అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ లోని శక్తిని బంధించడంలో పాల్గొంటుంది.కణాలు సక్రమంగా పనిచేయడానికి, ఐరన్ హీం రహిత ఎంజైములకు కో-ఫాక్టర్ లాగా పనిచేస్తుంది. కాపర్ తో పాటు ఐరన్ ఖనిజ కో-ఫాక్టర్ గా సైటోక్రోం ఆక్సీడేజ్ కు పనిచేస్తుంది. 3. ఎర్రరక్తకణాల తయారీ ఎముక మూలుగ పరిణతి చెందని కణాలను ఉత్పత్తి చేస్తుంది.వాటిని "ఎరిత్రోబ్లాస్ట్" అంటారు.ఎరిత్రోబ్లాస్ట్ లు ఎముక మూలుగలో పరిణతి చెందిన కొద్ది ఐరన్ ను కలిగిన హీం సముదాయం, విటమిన్ –B6 మరియు కాపర్ సహాయం తీసుకుంటుంది.హీం సముదాయం గ్లోబిన్ అణువులకు అతుక్కొని హీమోగ్లోబిన్ అణువులుగా ఎరిత్రోబ్లాస్ట్ ల ద్వారా సంశ్లేషించబడుతుంది. ఎర్రరక్తకణాల జీవితకాలం 120 రోజులు. ఎర్రరక్తకణాలు చనిపోయినపుడు అవి రక్తం నుండి కాలేయ కణాలు, ఎముక మూలుగ మరియు ప్లీహం ద్వారా తొలగించబడతాయి. ఐరన్ లభించే పదార్థాలు ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు ఆకుకూరలు ఐరన్ లభించే ముఖ్య పదార్థాలు.ఐరన్ అనేది శాఖాహారం కంటే మాంసాహారం నుండి ఎక్కువగా ఉంటుంది. మనం రోజు తీసుకునే ఆహారంలో 50 గ్రాం.ల ఆకుకూరలను తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావలసిన ఐరన్ అవసరాలను అందుకోవచ్చు. మాంసాహారం 100 గ్రాములలో ఉండే పరిమాణం (మిల్లి గ్రాములలో) పీతలు 21 రిబ్బన్ చేప 14 హెర్రింగ్ చేప 9 గొర్రె కాలేయం 6 రొయ్యలు 5 బోటి 3 పంది మాంసం 2 కోడి గ్రుడ్డు 2 శాఖాహారం మి.గ్రా./100 గ్రాం కాలీఫ్లవర్ 40 కామంచి 21 అటుకులు 20 బీట్ రూట్ 16 పుదీనా 16 సోయాచిక్కుడు 10 పప్పుకూర 15 చామదుంప ఆకు 10 శనగ పప్పు 10 నువ్వులు 9 బొబ్బర్లు 9 సజ్జలు 8 ఉల్లికాడ 7 ఎండు ఖర్జూర 7 మరమరాలు 7 ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది శరీరంలో ఐరన్ లోపం ఉంటే హీమోగ్లోబిన్ ఏర్పడదు. అందువల్ల ఎర్రరక్తకణాలు చిన్నవిగా పాలిపోతాయి. అందువల్ల వచ్చే అనీమియాను లేదా రక్తహీనతను "హైపోక్రోమిక్ మరియు మైక్రోసైటిక్ అనీమియా" అంటాము. ఈ రకమైన అనీమియా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎక్కువగా ఆడవారిలో, పిల్లలలో కనిపిస్తుంది. ఈ అనీమియా ఐరన్ ఉన్న ఆహారాన్ని సరిగ్గా తినకపోవడం లేదా శరీరంలో సరిగ్గా గ్రహించకపోవడం లేదా రక్తస్రావం వలన శరీరంలోని ఐరన్ ఉపయోగించుకోలేక పోవడం వలన వస్తుంది. ఒక డె.లీ. రక్తంలో ఉండవలసిన హీమోగ్లోబిన్ నవజాత శిశువులలో: 17 - 22 గ్రాములు పిల్లలలో: 11 - 13 గ్రాములు పురుషులలో: 14 - 18 గ్రాములు స్త్రీలలో: 12 - 16 గ్రాములు పైన చెప్పిన దాని కంటే రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువుంటే రక్తహీనత అంటాము రక్తహీనత లక్షణాలు నీరసం, శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం, కళ్ళు తిరగడం, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, గోర్లు వంకర్లు పోవడం, మాట తడబడడం, నిద్రలేమి, ఆకలి మందగించడం, చర్మం పాలిపోవడం, ఏ పని చేయలేకపోవడం తీవ్ర అనీమియా గా ఎప్పుడు అంటామంటే హీమోగ్లోబిన్ 7.5 g/dl కంటే తగ్గినపుడు ప్రాణాపాయం ఎక్కువగా ఉంటుంది. కారణాలు అధిక రక్తస్రావం క్యాన్సర్, అల్సర్ వంటి వ్యాధులున్నపుడు, అతిగా రక్తదానం చేయడం, హుక్ వార్మ్ ఇంఫెక్షన్ రావడం, ఆహారంలో ఐరన్ లోపించడం, గర్భిణులకు, బాలింతలకు ఐరన్ ని అందించలేకపోవడం, అతిసారం, జీర్ణాశయంలో ఆంలాల స్రవణ సరిగ్గా లేనప్పుడు ఐరన్ శోషణ సరిగ్గా జరగదు.అప్పుడు కూడా అనీమియా వస్తుంది. అనీమియా వల్ల తల్లి, బిడ్డలిద్దరి ఆరోగ్యానికి ముప్పు ఉంది. సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ అనగా ఉప్పు.మనం ప్రకృతిలో లభించిన రూపంలో తీసుకునే ఏకైక ఖనిజ లవణం.ఇది చర్మం క్రింది కణజాలల్లో నిల్వ ఉంటుంది. ఇది చెమట మరియు మూత్రం ద్వారా శరీరం నుండి బయటికి వెళ్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతమైన వారిలో 2-10 గ్రాముల సోడియం క్లోరైడ్ విసర్జింపబడుతుంది. వేడి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా శ్రమించినప్పుడు కండరాల సంకోచం నొప్పిగా మారి ఒంట్లో వేడి సెగలు కల్గుతున్న సమస్యను చూడవచ్చు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. మన ఆహారంలో మాంసకృత్తులు లోపించినప్పుడు ఉప్పు అధికంగా తీసుకుంటే శరీరంలో నీరు చేరి మనిషి ఉబ్బిపోతాడు. దీన్ని ఎడిమా అంటాము. దీనివల్ల ఆ వ్యక్తి రక్తపోటు ఎక్కువైపోతుంది. దీన్ని మనం ఎక్కువ అధిక రక్తపోటు సమస్య ఉన్నవారిలో చూడవచ్చు. మనం ఆహారలో ఎంత ఉప్పు తీసుకోవాలో ఈ క్రింది వాటి మీద ఆధారపడి ఉంటుంది. మనం నివసించే వాతావరణంను బట్టి, మనం చేసే పనిని బట్టి, ఆహారంలో ఉప్పు ను బట్టి. సిఫారసు చేయబడ్డ మోతాదు పని వర్గం ఒక రోజు మోతాదు (మి.గ్రా.లలో) తక్కువ పని చేసేవారు 10 ఎక్కువ పని చేసేవారు 15 చాలా ఎక్కువ శ్రమించేవారు 20 పిల్లలు 5-10 కౌమారులు 10-20 గర్భిణులు 5-10 పాలిచ్చే తల్లులు 15 మనం ఉప్పును ఎక్కువగా శాకాహారం కంటే మాంసాహారంలో అధికంగా చూడవచ్చు. సోడియం ఎక్కువగా ఆలుగడ్డలు, టమాటాలు, బేకరి పదార్థాలు, పాలకూర, ద్రాక్ష, పంపర పనస, పచ్చళ్ళు, ఉప్పు ప్రిజర్వేటివ్ కల్పిన జ్యూస్ లలో ఉంటుంది. జింక్ మానవ శరీరంలో సుమారు 1.4-2.3 గ్రాం.ల జింక్ ఉంటుంది. ఇది చర్మంలో, ఎముకలలో, ప్రోస్టేట్ గ్రంథిలో ఉంటుంది. అంతే గాక కార్బోనిక్ అన్ హైడ్రస్ అనే ఎంజైములో మరియు ఎర్ర రక్తకణాలలోను ఉంటుంది. ఉపయోగాలు జింక్ జీవక్రియలకు తోడ్పడే మెటాలో పెప్టైడ్స్, ఫాస్ఫడేజ్, డీహైడ్రోజినేజ్ మరియు ట్రాన్స్ అమైనేజ్ సక్రమంగా పనిచేయుటకు చాలా అవసరం. డి.ఎన్.ఎ.పాలిమరేజ్ అనే ఎంజైము యొక్క స్రవణకు ఇది అవసరం. జింక్ కణాలు ఏర్పడ్డానికి, వాటి ఎదుగుదలకు, సంపర్కణకు మరియు రోగాలను ఎదుర్కొనే శక్తికి చాలా అవసరం. మనకు ఆకలి సరిగ్గ ఉండాలన్నా, పదార్థాల యొక్క రుచి తెలియాలన్నా, చీకటిలో దృష్టి సరిగ్గా ఉండాలన్నా జింక్ తప్పనిసరి. హార్మోన్ల పని సక్రమంగా ఉండాలన్నా కూడా జింక్ మన ఆహారంలో సమపాళ్ళలో ఉండాలి. సుమారు 200 లకు పైగా ఎంజైములు జింక్ మీద ఆధారపడి ఉన్నాయి. జింక్ కి మన కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను తొలగించే శక్తి ఉంది.అందువల్ల దీనిని "ఆంటీ ఆక్సిడెంట్" గా వర్ణించవచ్చు. వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. కణ పొరలలో లిపిడ్స్ సమతుల్యాన్ని జింక్ పర్యవేక్షిస్తుంది. జన్యు పదార్థాలు ఏర్పడ్డానికి కావలసిన మాంసకృత్తుల జీవక్రియలలో జింక్ ఆధారిత ఎంజైములు పాల్గొంటాయి. కొలెస్ట్రాల్ రవాణాకు జింక్ చాలా అవసరం. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు సాధారణంగా జింక్ లోపం మన ఆహారంలో ఫైటేట్స్ మరియు ఫాస్ఫేట్ అధికంగా ఉన్నప్పుడు వస్తుంది. మన ఆహారంలో కాపర్ అధికంగా ఉన్నా పోషకాల శోషణ సరిగా లేకున్నా సిక్కిల్ రక్తహీనత ఉన్నా, శస్త్రచికిత్స జరిగినా, గాయాల కారణంగా రక్తం ఎక్కువగా నష్టపోయినా జింక్ లోపం వచ్చే అవకాశం ఉంది. కొందరిలో జింక్ శోషణ సరిగా లేకపోవడం ఒక జన్యుపరమైన సమస్య. జింక్ గర్భంలో ఉన్న బిడ్డ అవయవాలు ఏర్పడ్డానికి చాలా అవసరం.ఒకవేళ ఇది గర్భిణిలో సమతుల్యంగా లేకుంటే బిడ్డకుఅవయవ లోపం వచ్చే అవకాశం ఉంది.అంతేగాక అలా పుట్టిన పిల్లల్లో గుండె వ్యాధులు, మధుమేహం, ఊబకాయం, ఊపిరితిత్తుల సమస్య వచ్చే అవకాశాలెక్కువగా ఉన్నాయి. జింక్ పెరుగుదల హార్మోన్ల పనితీరును పర్యవేక్షిస్తుంది. 1-2 సం.పిల్లల్లో మెదడు యొక్క కణాల ఏర్పాటుకు జింక్ అత్యంత ఆవశ్యకం.ఒకవేళ ఆ సమయంలో జింక్ లోపం ఉంటే మెదడు ఎదుగుదల సక్రమంగా ఉండదు. జింక్ ఆధారిత ఎంజైము అయిన "రెటినాల్ రిడక్టెస్"గా మార్చి చీకటి దృశ్యాలను చూడడానికి కారణం అవుతుంది.అందువల్లనే పోషకాహార లొపం, పోష్టికాహార లోపం అధికంగా ఉన్న పిల్లల్లో ప్రోటీన్ శక్తి లోపంతో పాటు జింక్ లోపం కూడా అధికంగా ఉంటుంది. ఒకవేళ ఇదే జింక్ సాధారణ స్థాయి కన్నా అధికంగా ఉంటే విషపూరితమే. దానివల్ల నోరు ఒక రకమైన ఖనిజ రుచికి గురికావడం జరుగుతుంది. ఉబ్బరం, కడుపులో నొప్పి, రక్త విరేచనాలకు గురవుతారు. అత్యధికంగా అంటే రోజుకు 18.5 మి.గ్రా.ల జింక్ మనం తీసుకున్నట్లైతే మన శరీరంలో కాపర్ యొక్క శోషణ మందగిస్తుంది.అందువల్ల కాపర్ లోపం ఏర్పడి మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. సిఫారసు చేయబడ్డ మోతాదు వర్గం ఒక రోజు మోతాదు (మి.గ్రా.లలో) పురుషులు 12 స్త్రీలు 10 గర్భిణులు 12 పాలిచ్చే తల్లులు 12 పిల్లలు 1-3 సం. 5 4-6 సం. 7 7-9 సం. 8 బాలురు 10-12 సం. 9 13-15 సం. 11 16-17 సం. 12 బాలికలు 10-12 సం. 9 13-15 సం. 11 16-17 సం. 12 జింకు లభించే ఆహారపదార్థాలు ఆహార పదార్థాలు 100 గ్రాములకు లభించే పరిమాణం(గ్రాములలో) హెర్రింగ్ చేప, ముత్యపు చిప్ప 70-150 తృణధాన్యాలు, చిరుధాన్యాలు 2-6 పప్పుదినుసులు, నూనెగింజలు 3-6 కాలేయం, మాంసం, చేప గుడ్డు 3-10 కాపర్ ఆరోగ్యవంతమైన మానవ శరీరం 100-150 మి.గ్రా.ల కాపర్ ను కలిగి ఉంటుంది. విధులు రక్తంలోని హీమోగ్లోబిన్ స్థాయిలను క్రమబద్దీకరించడానికి కాపర్ ఎంతగానో సహాయపడుతుంది. ఎంజైముల జీవక్రియలో కూడా ఉపయోగపడుతుంది. ఎర్రరక్తకణాలు ఏర్పడ్డానికి, ఎముకలు బలంగా ఉండడానికి, కణజాలాల అభివృద్ధికి, మయలిన్ ఏర్పడ్డానికి, మెలనిన్ వర్ణద్రవ్యం ఏర్పడ్డానికి, ఆక్సీకరణ, ఫాస్ఫారిలేషన్ మొదలైన వాటికి కాపర్ అవసరం. టైరోసినేస్ - మెలనిన్ ఏర్పాటు సైటోక్రోం ఆక్సిడేజ్ - మైటోకాండ్రియాలో ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అనే జీవక్రియకు తోడ్పడుతుంది. లైసిల్ ఆక్సిడేజ్ - కణజాలాలలో కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ బంధాలను ఏర్పరుస్తుంది. సూపరాక్సైడ్ డైమ్యుటేజ్ - ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. కాపర్ లోపం వల్ల వచ్చే అనర్థాలు కాపర్ లోపం మానవులలో చాలా తక్కువగా కనిపించినప్పటికి, దీని లోపం వలన పిల్లల్లో బుద్ధిమాంద్యత, హైపోటోనియా (రక్త ద్రవవిసరణ పీడనం), హైపొపిగ్మెంటేషన్, శ్లేష్మపొర, రక్తహీనత, బోలు ఎముకలు ఏర్పడంవంటివి చోటుచేసుకుంటాయి. మెంక్సీ కీంకీ హేర్ సిండ్రోం ఒక జన్యుపరమైన సమస్య. ఇందులో రక్త సీరంలో కాపర్ మరియు సెల్యులో ప్లాస్మిన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల పెరుగుదల మందగింపు, మెదడు కణజాలాలు చెడిపోవడం, శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోవడం, మూర్చవ్యాధి, ధమని గోడలు దెబ్బతినడం, చర్మం మరియు జుట్టు వర్ణంలో మార్పు రావడం, జుట్టు నాణ్యతను కోల్పోయి తెల్లగా మారటం జరుగుతుంది. మన శరీరంలో కాపర్ శోషణ సరిగా లేకపోయినా, కాపర్ రవాణా జరగకపోయినా, కాపర్ అతిగా విసర్జింపబడిన ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా కాపర్ ఎక్కువగా ఉన్నట్లైతే కొన్ని విష పరిణామాలను చూడవచ్చు. లాలాజలం అధికంగా ఉత్పత్తి అవడం, ఉదరంలో నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు కలుగుతాయి. కాలేయంలో కాపర్ నిల్వలు చాలా ఎక్కువ అయినపుడు కాలేయం పనిచేయడం ఆగిపోతుంది. విల్నన్ వ్యాధి: ఈ వ్యాధి ఒక జన్యుపరమైన సమస్య.ఈ వ్యాధి వచ్చిన వారిలో బైల్ లో ఉండే కాపర్ విసర్జింపకపోవడం వల్ల అది కాలేయంలో, మెదడులో, మూత్రపిండాలలో, కంటి శుక్లములో పేరుకుపోతుంది.అప్పుడు పచ్చని, నశం రంగులో వలయాలు ఏర్పడతాయి. సాధారణ మానవుడు రోజుకు 2.2 మి.గ్రా. కాపర్ తీసుకోవాలి. అన్నం మరియు గోధుమల మీద ఆధారపడి ఉండేవారు రోజుకు 4-6 మి.గ్రా. కాపర్ ను తీసుకోవాలి. కాపర్ లభించే ఆహార పదార్థాలు ఫ్రతి వంద గ్రాముల ఆల్చిప్పలు, ఎండ్రికాయలు, మేకమాంసం, నూనెగింజలు, బాదం, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు పువ్వులు, సోయాలలో 12-37 మి.గ్రా. కాపర్ లభిస్తుంది. పండ్లు మరియు కూరగాయలలో కాపర్ శాతం తక్కువగా ఉంటుంది. తృణ మరియు చిరుధాన్యాలలో పొట్టులో ఎక్కువగా ఉంటుంది. పొట్టు తీసేసిన పిండిలో కాపర్ అసలుండదు. ఫ్లోరిన్ ఫ్లోరిన్ పృకృతిలో ఫ్లోరైడ్ రూపంలో ఉంటుంది. ఇది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. మట్టిలో, నీళ్ళలో, చెట్లలో, జంతువులలో ఉంటుంది. మానవ శరీరంలో ఎముకలలో,దంతాలలో, చర్మంలో, థైరాయిడ్ గ్రంథిలో ఇది ముఖ్య ఖనిజం. ఉపయోగాలు మన దంతాలలో ఉండే ఫ్లోరిన్ వాటిని పుచ్చిపోకుండా రక్షిస్తుంది. ఎముకలకు, కండరాలకు బలాన్ని అందిస్తుంది. ఫ్లోరిన్ పెద్దవారిలో దంత సమస్యలను మరియు ఎముకలు విరగడాన్ని నివారిస్తుంది. నీటిలో 1 PPM (parts per milliong- 1/1000000)కంటే తక్కువ ఫ్లోరిన్ ఉన్నట్లైతే దంత సమస్యలు దరిచేరవు. ఎందుకంటే ఇది నోటిలో ఉండే హానికరమైన సూక్ష్మజీవులను అంతమొందిస్తుంది. దీని సాధారణ స్థాయి 1-2 PPM గా ఉండాలి. కాని 3-5 PPM ఉంటే దంతాల ఫ్లోరోసిస్, 10 PPM అంతకంటే ఎక్కువ ఉంటే ఎముకల ఫ్లోరోసిస్ వస్తుంది. నీటి ద్వారానే ఫ్లోరిన్ శరీరాన్ని చేరుతుంది కనుక, దానిలో ఉండే అధిక ఫ్లోరిన్ ను డీఫ్లోరిడేషన్ చేస్తారు. దీన్నే ఫ్లోరిన్ తొలగించడం అంటారు. ఎముకల ఫ్లోరోసిస్: ఈ సమస్య నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల వస్తుంది.ఎముకలు గట్టిపడడం, ఎముకలలో నొప్పి, వెన్నుపూస వొంగిపోవడం లాంటి అసాధారణ మార్పులు రావడం, కాళ్ళు వంకరపోవడం లాంటివి జరుగుతాయి. కాళ్ళు వంకరపోవడం అనేది నీటిలో ఫ్లోరిన్ శాతం 2-16 మి.గ్రా. ఉన్నప్పుడు వస్తుంది. అంతేగాక మన ఆహారంలో మాలిబ్డినం అనే ఖనిజ లవణం ఎక్కువైనప్పుడు మరియు కాపర్ తక్కువైనప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు. దంతాల ఫ్లోరోసిస్: నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ అవడం వల్ల దంతాలపై శాశ్వతంగా మచ్చలు ఏర్పడతాయి. ఎనామిల్ నునుపుతనంకోల్పోయి గరుకుగా మారుతుంది. దంతాలపై పసుపు పచ్చని చారలు క్రమంగా ఏర్పడి శాశ్వతంగా ఉండిపోతాయి.ఈ సమస్య పురుషులు, స్త్రీలలో సమానంగా వచ్చే అవకాశం ఉంది. ఫ్లోరిన్ అధికంగా తీసుకోవడం వల్ల అయొడిన్ జీవక్రియ తగ్గి హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం ఉంది. ఫ్లోరిన్ అధికంగా ఉండడం వల్ల విటమిన్ లోపం కూడా ఏర్పడుతుంది. దీనివల్ల కాళ్ళు అసాధారణ రూపంలో మారుతాయి. ఫ్లోరిన్ లభించే పదార్థాలు ఫ్లోరిన్ ముఖ్యంగా తాగునీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. సున్నిత జలంలో ఫ్లోరిన్ ఉండదు. కటిన జలంలో దాదాపు 10 ppm వరకు ఫ్లోరిన్ ఉంటుంది. ఆహారపదార్థాలలో లభించే ఫ్లోరైడ్ కు చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. సముద్రపు చేప ద్వారా 5-10 ppm లు, ఛాయ్ పత్తి నుండి 110-140 ppm లు లభిస్తుంది క్రోమియం మన శరీరంలో క్రోమియం సుమారు 6 మి.గ్రా.ల వరకు ఉంటుంది.క్రోమియం మన శరీరానికి కావలసిన ముఖ్యమైన ఖనిజ లవణం. మన శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది.అంతేగాక పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వుల యొక్క జీవక్రియను ప్రభావితం చేస్తుంది.క్రోమియం జన్యు సమాసాన్ని పర్యవేక్షిస్తుంది. క్రోమియం మన శరీరంలో తక్కువ మోతాదులో ఉన్నట్లైతే ఇన్సులిన్ పనితీరు సక్రమంగా ఉండదు. శరీరంలో లిపిడ్స్ లో అసాధారణ మార్పులు కనిపిస్తాయి. క్రోమియం లభించే పదార్థాలు ఆల్చిప్పలు, కాలేయం,బంగాళదుంపలలో క్రోమియం అధికంగా ఉంటుంది.సముద్రపు ఆహార పదార్థాలలో క్రోమియం సమృద్ధిగా ఉంటుంది. తృణధాన్యాలు, కోడి మాంసంలో కూడా లభిస్తుంది.పాలు, పాల పదార్థాలు, పండ్లు,కూరగాయలలో క్రోమియం తక్కువగా ఉంటుంది. సిఫారసు చేయబడ్డ మోతాదు 6 నెలల నుండి 1 సం.ల వయస్సు గల పిల్లలకు 40 మైక్రో గ్రాములు, 1-5 సం.ల వయస్సు గల పిల్లలకు 80 మైక్రో గ్రాములు, కౌమారులకు 125 మైక్రో గ్రాములు, మధ్య వయస్సు వారికి 125 మైక్రో గ్రాములు క్రోమియం కావాలి. కోబాల్ట్ కోబాల్ట్ ఆహారంలో చాలా చిన్న మొత్తంలో అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజం. ఇది ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, మయలిన్ తొడుగు ఏర్పడ్డానికి సహాయపడుతుంది.ఇది విటమిన్ లో అంతర్భాగంగా ఉంటుంది. ఇది అంత సులభంగా జీర్ణవాహికతో శోషణ జరపదు. సాధారణంగా కోబాల్ట్ శరీరంలో 80-300 మైక్రో గ్రాముల స్థాయిలో ఉంటుంది. అలాగే ఇది కాలేయం, మూత్రపిండాలు, ప్లీహం, క్లోమము, ఎర్రరక్తకణాలు మరియు ప్లాస్మా లో తయారవుతుంది. కోబాల్ట్ ఎర్రరక్తకణాల నిర్మాణానికి మరియు ఇతర కణాలకు సహాయపడుతుంది. ఉపయోగాలు కోబాల్ట్ రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. ఇది అలసట, జీర్ణ లోపాలు మరియు నాడీ కండరాల సమస్యలను కూడా నివారించడానికి కొన్ని సందర్భాలలో ఉపయోగకరంగా ఉంటుంది. రేడియోధార్మిక కోబాల్ట్ కొన్ని క్యాన్సర్ చికిత్స లకు ఉపయోగిస్తారు. కోబాల్ట్ ను సగటున రోజుకి 5-8 మి.గ్రా.లు తీసుకోవాలి. కోబాల్ట్ లోపం వల్ల కలిగే అనర్థాలు కోబాల్ట్ లోపం వల్ల అలసట,కాళ్ళు,చేతులు మరియు ఇతర అవయవాలలో బలహీనత,వికారం, బరువు తగ్గడం,తలనొప్పి, నీరసం లాంటివి వస్తాయి. దీర్ఘకాల కోబాల్ట్ లోపం వల్ల నరాల రుగ్మతలు, నరాలు దెబ్బతినడం, మతిమరుపు, సైకోసిస్ మరియు మరణం సంభవించవచ్చు. కోబాల్ట్ ఎక్కువ అవడం వల్ల గుండె సమస్యలు, గుండె ఆగిపోవడం జరుగుతుంది.ఇది ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది.దీని వల్ల గడ్డకట్టడం మరియు స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది. సెలీనియం సెలీనియం అనేది నేలలో కనిపించే ఖనిజం. సెలీనియం సహజంగా నీరు మరియు కొన్ని ఆహారపదార్థాలలో కనిపిస్తుంది. సెలీనియం జీర్ణక్రియలో కీలక పాత్రను పోషిస్తుంది. సెలీనియం లభించే పదార్థాలు సెలీనియం ఎక్కువగా గొడ్డు మాంసం, పౌల్ట్రీ, ధాన్యాలు, సముద్రపు చేపలు, ఎరుపు స్నాపర్, హెర్నింగ్ వంటివి మాంస పదార్థాలలో, అక్రోట్లు, బ్రెజిల్ గింజలు వంటి పదార్థాల్లో ఉంటుంది. సెలీనియం లోపం వల్ల కలిగే వ్యాధులు సెలీనియం లోపం గుండె వ్యాధులు, హైపోథైరాయిడిజం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ మదలైనవాటికి దారితీస్తుంది. పిల్లల్లో గుండె సమస్యలకు కారణమవుతుంది. సెలీనియం అధిక మోతాదులో తీసుకోవడం వల్ల చెడు శ్వాస, జ్వరం, వికారం మరియు కాలేయం, మూత్రపిండాలు, గుండె సమస్యలు సంభవిస్తాయి. చివరికి మరణం కూడా సంభవించవచ్చు. సిఫారసు చేయబడ్డ మోతాదు వర్గం మి.గ్రా./రోజు పిల్లలు 1-3 సం. 20 4-8 సం. 30 9-13 సం. 40 పెద్దలు మరియు 14 సం.లు పైబడిన వారు 55 గర్భిణి స్త్రీలు 60 బాలింతలు 70 మాంగనీస్ మాంగనీస్ అనే ఖనిజ లవణం మన శరీరంలోని ఎముకలలో,మూత్రపిండాలలో, కాలేయంలో, ద్రవ్యాలలో ఉంటుంది.మానవ రక్తంలో మాంగనీస్ 2-3 మైక్రో/100 మి.లీ.గా ఉంటుంది. మన శరీరంలో మాంగనీస్ ఈ క్రింది అవసరాలకు ఉపయోగపడుతుంది. శరీర పెరుగుదలకు ఎముకల ఎదుగుదలకు కేంద్రీయ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంపూర్ణంగా ఎదగడానికి. ఆహారంలో ఉన్న మాంగనీస్ కేవలం 3-4% వరకు మాత్రమే శోషించబడుతుంది. మిగిలింది మలం, మూత్రం ద్వారా విసర్జింపబడుతుంది. మాంగనీస్ లోపం వల్ల వచ్చే అనర్థాలు పెరుగుదల నశించడం ఎముకలలో అసాధారణ మార్పులు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనిచేయకపోవడం, పుట్టిన బిడ్డలలో అస్థిరతను చూస్తాము. అలాగే గనులలో పనిచేసే కార్మికులు మాంగనీస్ ని ఎక్కువగా పీల్చడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవి: మాటలు తడబడడం, చేతులు ఎక్కువగా వణకడం. పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంది.