దేశవ్యాప్తంగా 63,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఏసి), /లార్జ్ ఏరియా మల్టీ-పర్పస్ సొసైటీలు (ఎల్ఏఎంపిఎస్)/ రైతు సేవా సంఘాలు (ఎఫ్ఎస్ఎస్)ల కంప్యూటరైజేషన్ కోసం 2,516 కోట్ల రూపాయల ఖర్చుతో పథకం అమలు జరుగుతోంది. కేంద్ర ప్రాయోజిత పధకంగా ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి 2022 జూన్ 29న జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల కమిటీ (CCEA) సమావేశం ఆమోదం తెలిపింది. 54,752 పిఏసి / ఎల్ఏఎంపిఎస్ / ఎఫ్ఎస్ఎస్ ల కంప్యూటరీకరణ కోసం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతిపాదనలు అందాయి. హార్డ్వేర్ సేకరణ, పాత సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయడం, సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 201.18 కోట్లు విడుదల చేసింది. ప్రాజెక్టు అమలు జరుగుతున్న తీరు పరిశీలించడానికి నాబార్డ్ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసింది. నాబార్డ్ ఎంపిక చేసిన నేషనల్ లెవల్ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ వెండర్ (NLPSV) సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పని చేస్తున్న అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఈఆర్పీ (ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) ఆధారిత సాధారణ సాఫ్ట్వేర్ పరిధిలోకి తీసుకు వచ్చి వాటిని రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా నాబార్డ్తో అనుసంధానించడానికి ఈ ప్రాజెక్టు రూపొందింది. దీనివల్ల రుణాలు వసూలు అవుతున్న తీరు పరిశీలించడానికి, సమన్వయం సాధించడానికి ఈ ప్రాజెక్ట్ వీలు కల్పిస్తుంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు తమ కార్యక్రమాల పరిధిని విస్తరించి మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలుగా అభివృద్ధి సాధించడానికి వీలు కల్పించే మోడల్ బై-లాస్ను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత వర్గాలతో చర్చించి సహకార మంత్రిత్వ శాఖ రూపొందించింది. తమ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు మోడల్ బై-లాస్ ఆమోదం పొందేలా చూడడానికి 05.01.2023న అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సహకార మంత్రిత్వ శాఖ మోడల్ బైలాలు పంపింది. పాడి పరిశ్రమ, చేపల పెంపకం, ఆహార ధాన్యాల నిల్వ, ఎల్పీజీ /సిఎన్జీ /పెట్రోల్/డీజిల్ పంపిణీదారు, సాధారణ సేవా కేంద్రాలు, చౌక ధరల దుకాణాలు, గ్రామాల్లో నీటిపారుదల, వ్యాపారం వంటి 25 పైగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు నూతన విధానం వల్ల అవకాశం కలుగుతుంది. PACS ద్వారా ఎరువులు, విత్తనాలు మొదలైన ఇన్పుట్లను అందించడంతో సహా మోడల్ బైలాస్లో పేర్కొన్న అన్ని కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు జాతీయ సాఫ్ట్వేర్ సహకరిస్తుంది. . అయితే, వ్యవసాయ రుణాల మాఫీ సహకార మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదు. ఈ విషయాన్ని సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. ఆధారం : PIB