ప్రపంచ పర్యావరణ దినం (ప్ర.ప.ది.) (World Environment Day) 1972వ సంవత్సరమున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది. ప్ర.ప.ది. ప్రతి సంవత్సరము జూన్ 5 వారము నందు ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము జరుగుతుంది. 1972వ సంవత్సరమే స్థాపించబడిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ పధకం (United Nations Environment Programme) ఇదే వేదికను ఉపయోగించుకొని పర్యవరణానికి సంబంధించి రాజకీయులకు, ప్రజలకు ఎఱుకను పెంచే దిశగా తగు చర్యలను చేపడుతుంది. మన చుట్టూ ఉండే గాలి, నీరు, నేల, వాతారణం, వివిధ రకాల మొక్కలు, రకరకాల జంతువులు వీటన్నింటిని కలిపి పర్యావరణంగా పేర్కొనవచ్చు. మనం బ్రతకడానికి గాలి, నీరు, నేల, ఆహారం అవసరం. చెట్లు, పక్షులు, జంతువులను మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు కావలసినవి వాటి నుండి దొరుకుతాయి. అవి క్షేమంగా ఉంటేనే మనం కూడా క్షేమంగా ఉంటాం. కాగా ప్రకృతి లోని ప్రతి ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచంలోని ప్రతి జీవికి శక్తి సూర్యుని నుండి లభిస్తుంది. మొక్కలు సూర్యుని శక్తి వలన కిరణజన్య సంయోగక్రియ వల్ల ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. భూమిపై నివసించే రకరకాల జీవులు ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయి. అన్ని జీవ రాశులకు ప్రధానంగా ఆహారం మొక్కల నుండి అందుతోంది. జీవుల మధ్య ఉండే పర్యావరణ సంబంధాల్లో ఇటీవలి కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మన దేశంలో హరిత విప్లవం తర్వాత వ్యవసాయ రంగంలో పంట దిగుబడి పెంచేందుకు రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం చాలా ఎక్కువైంది. దీని వల్ల పంట దిగుబడి పెరిగింది కానీ గాలి, నీరు, నేల కలుషితమైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించారు. 1972 సవంత్సరం జూన్ 5 వ తేదీన స్వీడన్లో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు వార్షికోత్సవాన్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పాటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని ప్రజలు, ప్రభుత్వం గుర్తించేలా ఈ దినం ప్రాధాన్యతను సంతరించుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జనాభా పెరుగుదల ఒక ప్రధాన సమస్యగా తయారైంది. సౌకర్యాల కోసం ఎదురు చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వాలు కల్పించే ప్రాథమిక సౌకర్యాలు అందరికీ అందడం లేదు. అపరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్య సమస్యల కారణంగా రోజు రోజుకు దారిద్య్రం పెరిగిపోతోంది. ఉద్యోగ, ఉపాధి పనులను వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస రావడం వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బ తినడమే గాక సౌకర్యాల లేమితో పట్టణాలు, నగరాలలో మురికి వాడలు పెరిగిపోతున్నాయి. వీటి వల్ల పర్యావరణంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. కాగా ప్రతి పనికి శక్తి (ఇంధన) వనరులు అవసరం. వంట పనుల కోసం, యంత్రాలు, వాహనాలు నడపడానికి, వ్యవసాయానికి, ఫ్యాక్టరీలు, గృహాలలో, విద్యుత్ అవసరాల కోసం ఇలా ప్రతి పనికి ఇంధనం తప్పనిసరిగా అవసరం. ఆధునికీకరణలో భాగంగా పరిశ్రమలు పెరగడంతో ఇంధన వనరులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా శిలాజ ఇంధనాలు (పెట్రోలియం సహజ వనరులు), థర్మల్ విద్యుత్, జల విద్యుత్ తగినంతగా ఉత్పత్తి కావడం లేదు. పెరుగుతున్న జనాభా వల్ల ఇంధన వాడకం మీద మరింత ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బొగ్గు, పెట్రోలియం, డీజిల్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు వీటి ఉత్పత్తి సమయంలో కాలుష్యం కూడా ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శిలాజ ఇంధనాలు అంతం అయిపోకముందే వాటిని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలి. ముఖ్యంగా ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చి ఇంధన వాడకం తగ్గించడమే గాక వృధాను అరికట్టాలి. కాగా నేటి నాగరిక జీవనంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా ఎంతో అవసరం. పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇవి వీలైనంత కాలుష్యాన్ని ఘన, ద్రవ, వాయు రూపంలో చుట్టూ పరిసరాల్లోకి వదలుతున్నాయి. ప్రతి పరిశ్రమ ముడి పదార్థాలను ప్రకృతి నుండే తీసుకుంటున్నవి. ఉత్పత్తి క్రమంలో పరిశ్రమలు వస్తువులతో పాటు కాలుష్యాన్ని కూడా పుట్టిస్తున్నాయి. ఈ వ్యర్థాలు కొన్ని నీటిలో కరిగి రసాయనిక మురికినీరుగా, కొన్ని ఘన రూపంలోనే విష రసాయనాలుగా, మరికొన్ని రసాయనాలను కలియబెట్టినప్పుడు విష వాయువులుగా పరిశ్రమల చుట్టూ కమ్ముకుంటున్నాయి. కాగా పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి. వ్యర్థాల శుద్ధికి ప్రత్యేకంగా సౌకర్యాలు ఉన్నప్పటికీ చాలా పరిశ్రమల్లో ఇప్పటికీ వ్యర్థాలను శుద్ధి చేసే సదుపాయాలు లేవు. దీనివల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున హాని జరుగుతోంది. నీళ్లలో ఉన్న రసాయనిక వ్యర్థ పదార్థాలను వడగట్టి పెద్ద పెద్ద ట్యాంకర్లలో కదలకుండా ఉంచి వేరే రసాయనాలతో స్థిరీకరించి రకరకాలుగా ఆ మురికి నీటిని శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వాడాలి. అలాగే పొగ గొట్టాలను ఎక్కువ ఎత్తులో ఉంచి పొగ వదిలేలా ఏర్పాట్లు చేయాలి. విష రసాయన వ్యర్థ పదార్థాలను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్చి బూడిద చేయాలి. ఒకే ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నట్లయితే వీటన్నింటిని ఒకేచోట శుద్ధి చేసే ఏర్పాట్లు చేసుకోవచ్చు. కాగా మార్పు మానవ జీవితంలో ముఖ్యమైన అంశం అయినప్పటికీ అది ఆహ్వానించదగినదిగా ఉండాలి. అభివృద్ధి అనేది వినాశనానికి దారి తీయరాదు. ఉదాహరణకు అభివృద్ధి పేరుతో విస్తరిస్తున్న నగరాలు చిత్తడి నేలలను ఆక్రమించి ఎన్నో జీవ రాశులకు నిలువ నీడలేకుండా చేస్తున్నాయి. కాగా ఇటీవల ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఎక్కువైంది. ఇవి పర్యావరణాన్ని ఎంతగానో దెబ్బ తీస్తున్నాయి. ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో కాగితం, బట్టతో తయారు చేసిన సంచులు వాడేలా ప్రోత్సహించాలి. క్యారీ బ్యాగులు అందుబాటులోకి రాకముందు ఏ విధంగా సరుకులు తెచ్చుకునే వారో అదే పద్ధతిని పాటించాల్సిందిగా ప్రచారం చేయాలి. పర్యావరణ కాలుష్యంలో నీటి కాలుష్యం ప్రధానమైంది. మనం బ్రతకడానికి నీరు అవసరం. భూమి మీద మూడు వంతులు నీరు, ఒక వంతు భూ భాగం ఉన్న సంగతి తెలిసిందే. మూడు వంతులు నీళ్లు ఉన్నా మనకు ఉపయోగపడేది ఒక్క శాతం మాత్రమే. చెరువులు, నదులు, భూ గర్భంలో ఉన్న నీరు త్రాగేందుకు ఉపయోగ పడుతున్నాయి. ఒకే ఒక్క భాగం నేలలో మనం మూడు వంతులు ఉన్న నీటిని కలుషితం చేస్తున్నాం. మంచినీటితో పాటు కోట్ల జీవులకు ఆవాసమైన సముద్ర జలాలను కూడా మురికిమయం చేస్తున్నాం. భూమిపై ఉన్న నీరు సూర్యుడి వేడి వల్ల ఆవిరై తిరిగి వర్షం రూపంలో భూమికి చేరుతోంది. మనం వాడిన నీరు మురికి నీళ్లుగా మారి మళ్లీ ఆవరణ వ్యవస్థలోకే చేరుతున్నాయి. వాటిల్లో ఉండే రసాయనాలు చేపల్లోకి చేరి అలాగే ఆ చేపలను తినే అన్ని రకాల జంతువుల్లోకి చేరి ఒక జీవి నుండి మరో జీవికి కాలుష్యం విస్తరించి మొత్తం ఆవరణ వ్యవస్థకే నష్టం కలిగిస్తోంది. కాగా పట్టణాల్లో నగరాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్లను పొదుపుగా వాడి వృధాను తగ్గించాలి. మంచి నీటి కొళాయిలు, బోరింగుల చుట్టూ మురికి నీటి గుంటలు ఏర్పడకుండా చూసుకోవాలి. కాచి చల్లార్చిన సురక్షిత నీటిని త్రాగాలి. కాగా పర్యావరణ కాలుష్యంలో గాలి కాలుష్యం కూడా ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో రసాయనికి ఎరువులు, క్రిమి సంహారక మందుల వల్ల కాలుష్యం ఎదురవుతుంటే పట్టణాలు, నగరాల్లో ఫ్యాక్టరీలు, వాహనాల వల్ల ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్కరూ సొంత వాహనం కొనుగోలు చేయడం ఫ్యాషన్గా మారింది. కార్లు, స్కూటర్లు, రోడ్ల మీదకు కాలుష్యాన్ని మోసుకొస్తున్నాయి. కాగా విమానాలకు వాడే ఇంధనం అధిక కాలుష్యాన్ని పుట్టిస్తోంది. ద్రవ్య చలామణి పెరగడం, విమాన చార్జీలు తగ్గడం, ప్రైవేటు విమానాల సంఖ్య పెరగడంతో ఎయిర్ ట్రాఫిక్ పెరిగి గాలి కాలుష్యం మరింత ఎక్కువైంది. వాహనాలు, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ, చెత్తను కాల్చడం వల్ల గాలిలోకి ప్రమాద కరమైన రసాయనాలు చేరుతున్నాయి. నేలపైన, నీటిలో ఉన్న అన్ని జీవరాశులు, గాలి కాలుష్యం బారిన పడుతున్నాయి. కాలుష్య నియంత్రణా మండలి నామ మాత్రంగా పని చేస్తూ ఎడా పెడా లైసన్సులు జారీ చేస్తుండడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. వృక్షో రక్షతి రక్షితః అన్న నానుడి అందరికీ తెలిసిందే. చెట్లను పెంచడం వల్ల ఈ సమస్యను కొంత వరకు నివారించవచ్చు. అలాగే పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంపై అవగాహన కల్పించాలి. కాగా పర్యావరణ కాలుష్యంలో శబ్ద కాలుష్యం మరొకటి. ఆధునిక కాలంలో శబ్ద కాలుష్యం ప్రమాదకరంగా మారింది. వినికిడి పరిమితికి మించి వచ్చే ఏ శబ్దమైనా శబ్ద కాలుష్యం క్రిందికే వస్తుంది. శబ్ద కాలుష్యాన్ని త్రెషోల్డ్ లిమిట్తో కొలుస్తారు. కొన్ని శబ్దాలు త్రెషోల్డ్ పరిధిలో ఉన్నప్పటికీ భరించరానివిగా ఉంటాయి. ఇవి మన ఏకాగ్రతను, మానసిక ప్రశాంతతను దెబ్బ తీస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ శబ్దం పెరుగుతోంది. వాహనాల హారన్ల మోతతో మనిషి రోడ్డు మీద నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. శబ్ద కాలుష్యం మన శరీరంపై, మెదడుపై ఎంతో ప్రభావం చూపుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. రణగొణ ధ్వనుల మధ్య ఎక్కువ కాలం ఉన్నట్లయితే మనిషి ప్రవర్తనలో కూడా మార్పు వస్తుందని కోపం, ఆదుర్దా, చికాకు ఇవన్నీ శబ్ద కాలుష్యం వల్ల వస్తాయని వైద్యులు నిర్ధారిస్తున్నారు. శబ్ద కాలుష్యంతో వినికిడి లోపాలు, జీర్ణ శక్తి, జీవ క్రియ, రక్త ప్రసరణల్లో కూడా మార్పులు కలుగుతాయి. ట్రాఫిక్ పోలీసులు, ఫ్యాక్టరీలలోని కార్మికులు శబ్ద కాలుష్యం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కటాల్లో శబ్ద కాలుష్యం తీవ్రంగా ఉంది. ప్రపంచంలో అత్యంత పారిశ్రామికీకరణ చెందిన జపాన్ దేశంలోని టోక్యో నగరంలో శబ్ద కాలుష్యం కారణంగా ప్రజలు మాస్క్లు ధరించి రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి వాహనం పొల్యూషన్ చెక్ చేయించుకొని సర్టిఫికెట్ పొందేలా చర్యలు చేపట్టాలి. పొల్యూషన్ చెకింగ్ను పెట్రోల్ పంపుల వద్ద మాత్రమే కాకుండా బయట కూడా చేసేలా చూడాలి. నకిలీ, నాణ్యత లోపించిన లూబ్రికెంట్స్ వాడకాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలి. కాగా నేటి బాలలే రేపటి పౌరులు అనే సూక్తిని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, బి.ఇడి కళాశాలల్లో నేషనల్ గ్రీన్ కోర్ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఎ స్పిరిట్ డీ కోర్ అనే ఫ్రెంచ్ పదం నుండి కోర్ అనే పదాన్ని తీసుకున్నారు. కోర్ అంటే కలిసి (జట్టుగా) పని చేయడం. నీరు, నేల, గాలి, చెట్లు, పక్షులు, జంతువులు వీటన్నింటి కోసం పని చేయాలని అర్థం. కాగా పాఠశాల స్థాయిలో హెచ్ఎం ఎన్జిసి (నేషనల్ గ్రీన్ కోర్) ఛైర్మన్గా, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీలోని ఉపాధ్యాయులను గ్రీన్ టీచర్స్ అంటారు. రాష్ట్ర స్థాయిలో ఎన్జిసి పర్యవేక్షణ కోసం మానిటరింగ్ కమిటీలో పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమీషనర్ అండ్ డైరెక్టర్, టూరిజం శాఖ కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా వ్యవహరిస్తారు. కాగా పాఠశాలలో ఏర్పాటైన ఎన్జిసి టీం పాఠశాలలోని మంచి నీటిని, చెత్తను జాగ్రత్తగా నిర్వహిస్తూ చెట్లను కాపాడుకుంటూ విద్యుత్ను పొదుపుగా వాడేలా పని చేస్తుంది. ఈ విధంగా చేస్తే సహజ వనరులను ఎలా వాడాలో అలవాటవుతుంది. అంతేగాక గ్రీన్ టీచర్స్ ఎప్పటికప్పుడు పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పిస్తూ మన పరిసరాల్లో ఉండే జంతువులు, పక్షులను ఎలా సంరక్షించుకోవాలో అవగాహన కల్పిస్తారు. కాగా మానవ తప్పిదాల వల్ల పర్యావరణ కాలుష్యం ఇలాగే కొనసాగితే కాలక్రమంలో అడువులు కనుమరుగవుతాయి. త్రాగేందుకు మంచి నీరు లభించని పరిస్థితి కలిగితే జీవ రాశుల మనగడ ప్రమాదకరంగా మారుతుంది. అరుదైన జాతులు అంతరించిపోయే ఆస్కారం ఉంది. కాగా పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేవలం ఉపాధ్యాయులదే కాదు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. ర్యాలీలు నిర్వహించి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసి మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని కాపాడేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఏది ఏమైనప్పటికీ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఆధారము: డే సెలబ్రేషన్స్.బ్లాగ్ స్పాట్.ఇన్ పర్యావరణ పరిరక్షణ మన దేశంతో సహా ప్రపంచంలోని ఏ దేశ భవిష్యత్తు అయినా ప్రజలకు ఆహారాన్ని అందించే సామర్ధ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ దేశపు నేల ఆరోగ్యంపైన అన్నమాట. నేల కోట్లాది మొక్కలకు, జంతువులకు ఆవాసంగా ఉంటుంది. ఇవి తిరిగి మనిషి ఉనికికి భద్రత కల్పిస్తాయి. కనుక నేల ఒక వనరుగా జీవావరణ, ఆర్థిక, సామాజిక విలువలను కలిగి ఉంటుంది. మనదేశంలో నేల ఎలా ఉంది? ఇప్పుడున్న దానికంటే రెట్టింపు జనాభాకు కూడా మన దేశం అన్నం పెట్టగలదని వ్యవసాయ శాస్తవ్రేత్తలు అంటున్నారు. అయితే అది నేలలను సరిగా నిర్వహించినపుడు మాత్రమే! కానీ ఇప్పుడు నిర్వహణ ఏమాత్రం సరిగాలేదు. మనదేశంలో 25 మిలియన్ల హెక్టార్ల మేర నేల పూర్తిగా క్షీణింది. పెద్దఎత్తున నేల కోత జరగడం, నీళ్లు నిలవడం దాంతో నేలలు చవుడు నేలలుగా మారడం, రసాయన ఎరువులు, పురుగుమందులను మోతాదుకు మించి ఎక్కువగా వాడడం వంటివి ఇందుకు ప్రధానమైన కారణాలుగా నిలుస్తున్నాయి. మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వందల హెక్టార్ల ప్రాంతంలోని సారవంతమైన పైమట్టి కొట్టుకుపోతోంది. నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి విలువైన పోషకాలు పైమట్టితో పాటు ప్రతి ఏటా కొట్టుకుపోతున్నాయి. నేలకోతకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ అడవులు క్షీణించిపోవడమే ప్రధానమైన కారణం అవుతోంది. మనదేశంలో 1980 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతిఏటా మిలియన్ హెక్టార్ల అడవులను మనం కోల్పోవడమే ఇందుకు కారణం. స్థానిక పల్లె ప్రజల మ ద్దతుతో సామాజిక అటవీ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. అదేసమయంలో దేశం అంతటా ఎనిమిది బిలియన్ల చెట్లను నాటి పోషించాలనే భారీ కార్యక్రమాన్ని కూడామొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలన్నిటినుంచి డివిడెండ్లు లభించాయి. గత కొన్ని దశాబ్దాలలో పచ్చదనం మన దేశంలో పెరగడం మొదలైంది. తరిగిపోయిన అడవులకు మళ్లీ జీవం పోయడంలో ఈ ప్రయత్నాలు సఫలం అయినప్పటికీ దట్టమైన అడవుల్లో నేలలు మాత్రం కుంచించుకపోవడం ఆగలేదు. మనదేశంలో పూర్తిగా క్షీణించిన నేలల్లో అధికారిక రికార్డుల ప్రకారం అటవీ భూములున్నాయి. వీటిలో మచ్చుకు ఒక్క చెట్టు కూడా లేదు! జీవ వనరులు: ఈ నేలమీద మొక్కలు, జంతువులు పుట్టినప్పటినుంచే ఒక అద్భుతమైన జీవ వైవిధ్యానికి అంకురార్పణ చేసాయి. మిలియన్ల సంఖ్యలో మొక్కలు, జంతువుల జాతులు ఈ నేలమీద ఉన్నా యి. మళ్లీ ఒక్కో జాతిలోనే ఎంతో వైవిధ్యం ఉంది. ఉదాహరణకు ప్రపంచంలో కేవలం ఒక్క వరిలోనే 120,000 రకాలున్నాయి. ఈ వైవిధ్యమే మనందరికీ చెందిన ఆస్తి. మన ఉనికికి ఈ జీవ వైవిధ్యమే బీమా వంటిది. మనకు ఉపయోగపడే కొత్త రకాల మొక్కలు, జంతువులను పెంచడం పెరుగుతున్న ఈ పరిస్థితిల్లో ప్రకృతి మనకిచ్చిన జన్యు నిధిని కాపాడుకోవడం మన కర్తవ్యం. చెట్లు ఏం చేస్తాయి...నేలమీద జరిగే జీవావరణ ప్రక్రియలు అన్నింటికి చెట్ల మద్దతు ఉంటుంది. ఆరోగ్యవంతమైన వృక్ష సమూహం పూర్తిగా క్షీణించిన ఆవరణ వ్యవస్థను సైతం పునరుజ్జీవించేలా చేయగలదు. పచ్చని ప్రాంతాలు నగర, పల్లె ప్రాంతాల్లో ఈ మార్పులను తీసుకు రాగలవు. భూగర్భ నీటి మట్టాన్ని రీచార్జి చేస్తాయి. వరదలు, భారీ వర్షాల సమయంలో నేల కోతను అరికడతాయి. తుపానులు వచ్చినపుడు గాలి తాకిడిని తగ్గిస్తాయి. సముద్రపు నీరు లోపలికి చొచ్చుకు రాకుండా ఆపుతాయి. సునామీ వంటి ఉపద్రవాలు వచ్చినపుడు ప్రమాద స్థాయిని తగ్గిస్తాయి. కర్బనాన్ని పీల్చుకుని వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి. నీటిపారుదల: వరమా? శాపమా? పంటలు పండేందుకు పొలాలకు నీళ్లు అవసరం. నీటిపారుదల కాల్వలు రైతులకు కావలసిన నీళ్లను అందిస్తాయి. అయితే ఇవి పచ్చని పొలాలను నీళ్లు నిలిచిపోయిన చవుడు నేలలుగా కూడా మార్చేయగలవు. కాల్వలు వుండే ప్రాంతాల్లో పొలాలు సాధారణంగా చదునుగా ఉండి, నీళ్లు సులభంగా బయటికిపోలేవు. ఫలితంగా పొలాల్లోకి వచ్చిన నీరు ఎక్కువ కాలంపాటు అలాగే వుంటాయి. దానివల్ల నేలలు ఉప్పురికి సారాన్ని పోగొట్టుకుంటాయి. రసాయన సంక్షోభం నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు మన దేశపు నేలల్లో తక్కువ. కనుక ప్రభుత్వం కూడా మన రైతులను దిగుబడి పెంచుకునేందుకు పెద్దమొత్తాల్లో రసాయన ఎరువులు వాడేలా ప్రోత్సహించింది. కాని కాలం గడిచేకొద్దీ ఈ రసాయన ఎరువులను విచక్షణా రహితంగా వాడడంతో నేల సారానికి ఇవి ప్రమాదకరంగా మారాయి. పురుగుల మందు పరిస్థితి ఇంతే. మనదేశంలో వ్యవసాయానికి లక్ష మెట్రిక్ టన్నుల పురుగు మందుల డిమాండ్ ఉంది. అలాగే ప్రజారోగ్యం కోసం మరో 50వేల మెట్రిక్ టన్నుల పురుగు మందుల అవసరం ఉంది. జీవావరణ వ్యవస్థలో మార్పులు కలిగించే సత్తా ఈ రసాయనాలకు ఉంది. వాటిలో ఎక్కువ మనకు విషమే. మరికొన్ని ఆహార చక్రాల్లో గాఢతను సంతరించుకుంటున్నాయి. ఒక్కసారి పంట పొలం మీద జల్లిన తర్వాత ఈ పురుగుమందుల ప్రయాణం మొదలవుతుంది. వీటిలో కొంత మొక్కల్లో చేరుతుంది. కొంత భాగం జంతువుల, కీటకాల, పురుగుల నేలలో ఉన్న సూక్ష్మ క్రిముల శరీరంలోకి చేరుతుంది. నేలసారానికి అవసరమయ్యే సూక్ష్మజీవులన్నింటినీ చంపి ఇవి నేల ఆరోగ్యానే్న దెబ్బతీస్తాయి. ఒక గ్రాము నేలలో మిలియన్ల సంఖ్యలో సూక్ష్మజీవులుంటాయి. మొక్కల జీవితానికి ఇవి ఆధారంగా ఉంటాయి. పురుగుల మందు లు ఈ సూక్ష్మజీవులను చంపడంతోపాటు పర్యావరణంలో దీర్ఘకాలంపాటు కొనసాగుతాయి. ఆహార చక్రాల్లో కొనసాగుతాయి. జంతువుల కొవ్వు కణాల్లో చేరి ఆహార చక్రంలో పైస్థాయిలకు చేరతాయి. ఈ కారణంగానే తల్లిపాలలో కూడా వీటి అవశేషాలు కనిపించాయి. ఆరోగ్యానికి ముప్పు: ఈ విషాలతో నేల కలుషితమైతే మన శరీరాలు మాత్రం మామూలుగా ఎలా ఉంటాయి. ఈ విషాలు మన శరీరంలో జీవ ప్రక్రియపై ప్రభావం చూపుతాయి. క్యాన్సర్, కాలేయం దెబ్బతినడం, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మార్పులు, పార్కిన్సన్, అల్జీమర్స్ వంటి నరాల సంబంధ వ్యాధులు పెరగడానికి ఈ విషాలే కారణమని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మన భారత ఉపఖండం వైవిధ్యమైన జీవావరణ ప్రాంతాలతో వైవిధ్యమైన జీవులకు నిలయంగా ఉంది. మనదేశంలో 15వేల మొక్క జాతులను, 75వేల జంతు జాతులను ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. ప్రపంచం మొత్తంమీద ఉన్న నేలలో మనదేశం రెండు శాతాన్ని మాత్రమే ఆక్రమించినప్పటికీ, ఈ భూమి మీద వున్న జీవజాతుల్లో అయిదు శాతానికి ఆశ్రయం కల్పిస్తోంది. సుసంపన్నమైన జీవవైవిధ్యం ఆర్ధిక వ్యవస్థకు ఎంతో ఆసరా ఇస్తుంది. దురదృష్టవశాత్తు మానవ కార్యకలాపాలవల్ల ఈ సంపదను మనం పోగొట్టుకుంటున్నాం. ఎన్నో మొక్కల జాతులు పూర్తిగా అంతరించిపోతున్నాయి. వాటి విలువ ఏమిటో మనకు తెలియకముందే అవి అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. వేటాడడంవల్ల, వన్య ప్రాణుల ఉత్పత్తులకు వున్న డిమాండ్ వల్ల వన్యప్రాణులు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఆవాసాలు కోల్పోవడంవల్ల, తడినేలలు కనుమరుగుకావడంవలన మన దేశంలో పక్షి జాతుల సంఖ్య కూడా తగ్గుతోంది. ఆధారము: ఆంద్ర భూమి భావితరాలకు రక్ష పర్యావరణ పరిరక్షణ -జె. ఎస్. భాస్కర్ మనిషి లేకపోయినా చెట్లు, నీరు, గాలి తదితరాలతో నిండి ఉన్న ప్రకృతికి ఏమీకాదు. కానీ ప్రకృతి లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్ధక మవుతుంది. అందుకే ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత. దానికి ధనిక, పేద, పాలితులు, పాలకులు అన్న తారతమ్యం లేదు. అసలు మనిషి ప్రకృతికి చేసినదానికంటే దాని నుండి మనిషి లబ్ధిపొందుతున్నదే ఇదంతా. అందుకే ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత. మానవజాతి మనుగడకు ప్రకృతి పరిరక్షణ చాలా ముఖ్యం. ప్రకృతిలో లభించే జల, వాయు, భూమి కాలుష్యం కాకుండా జాగ్రత్తగా చూసు కోవలసిన బాధ్యత మనిషిదే. ఎందుకంటే అవి లేకుంటే మానవ మనుగడే అసాధ్యం. అవి కాలుష్యమైతే మనిషికి మనుగడ లేదు. ఒకప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనం కనువిందు చేసేది. జనాభా పెరిగింది అన్న కారణంతో పచ్చని చెట్లను నరికి వాటి స్థానంలో నివాసాలను ఏర్పాటుచేస్తు న్నారు. అలాగే కొన్ని అగ్రదేశాలు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పచ్చదనాన్ని తగ్గించేశాయి. వాటిని చూసి వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామిక ప్రగతిని సాధించాలన్న థ్యేయంతో పచ్చదనంతో కళకళలాడే గ్రామాలను సైతం ఆక్రమించి పారిశ్రామిక వాడలుగా మార్చి పచ్చదనాన్ని కరువు చేస్తున్నారు. నేడు మండే ఎండల్లో ఒక క్షణం రహదారి ప్రక్కన చెట్టు నీడలో నిలబడాలంటే ఓ చిన్న చెట్టు కూడా కనిపించదు. కొన్ని చోట్ల పారిశ్రామిక కాలుష్యం వల్ల ఆయా ప్రాంతాల్లో కలుపుమొక్కలు కూడా మొలవని పరిస్థితి. దేశ ప్రగతికిపారిశ్రామిక ప్రగతి అవసరం. కానీ దానికై పర్యావరణాన్ని నాశనం చేసుకుంటే ఫలితం ఆ తరంవారే కాదు రాబోయే తరాలు సైతం ఆ దుష్ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. ఈ పారిశ్రామిక ప్రగతిమాటున మరో పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది. అది నీటి కాలుష్యం. ఇది అధికశాతం పలు పరిశ్రమల వల్ల వస్తున్న, చేస్తున్న కాలుష్యమే. పరిశ్రమల్లో తయారయ్యే పలు వస్తువుల తయారీకి ఉపయోగించే వ్యర్ధాలను గ్రామాలు, పట్టణ ప్రాంతాలలోని త్రాగే చెరువుల్లో, మంచినీరు పారే ప్రాంతాల్లో కలిసేలా ఏర్పాటుచేయడంతో ప్రజలఆరోగ్యాన్ని దెబ్బతీసే పలు అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. దీనివల్ల అనారోగ్యంతో పాటు, జలకాలుష్యం కూడా పెరిగిపోతున్నది. ఇలా చేయడానికి కొందరు పెద్దల నిర్లక్ష్యంకారణం కాగా, మరికొందరి ధన వ్యామో హం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. పలు వ్యర్థాలు త్రాగునీటిలో కలిసి, అలాగే వాయు కాలుష్యం. పరిశ్రమలు వదిలే పలు రసాయన వ్యర్ధాలు నీటిలో కలిస్తే, వాటివల్ల వచ్చే పొగ తదితరాల వల్ల వాయు కాలుష్యం ఏర్పడి ఊపిరితిత్తులు తదితర అవయవాల అనారోగ్యానికి కారణమవుతున్నది.వీటికి తోడు కొత్త సౌకర్యాలు, కొత్త వస్తువుల తయారీ పేరుతో మరో పర్యావరణ సమస్య ఏర్పడింది. ఉదాహరణకు ప్లాస్టిక్ సంచులు. నేడు అన్నిదేశాల్లో కూడా ఈ సంచులను వాడు తున్నారు. సౌకర్యాల పేరుతో అభివృద్ధి చెందిన దేశాలు ఇటువంటి వస్తువులను రూపొందించి కొంతకాలం ఉపయోగించి అవతల పారవేయడం చేస్తారు. అవి భూమిలో కలిసిపోక నదీ, సముద్ర జలాల్లో పేరుకుపోవడమో లేదా డ్రైనేజీల్లో కూరుకు పోయి ఆ వ్యవస్థ దెబ్బతినడానికి కారణమవు తున్నాయి. అవేే మనదేశంలో ఎన్నోసార్లు పశువుల మరణానికి కూడా కారణమవుతున్నాయి. ఇవి ఇప్పుడు పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కనుక వాటిని నిషేధించాయి చాలా దేశాలు. కొన్ని దేశాలు నిషేధించే పనిలో ఉన్నాయి. ఇటువంటివే మరికొన్ని. పారిశ్రామిక ప్రగతి కనుగుణంగా వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతూ వస్తున్నది. జల, వాయు, భూ కాలుష్యాలు మనుషుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. పర్యావరణానికి ఆరోగ్యానికి అవినాభావ సంబంధమున్నది. ఐ.రా.స ఈ దినోత్స వం సందర్భంగా ప్రతి ఏటా ఒక లక్ష్యాన్ని నిర్దేశించు కుని ఆ దిశగా పర్యావరణ ప్రగతికోసం కృషి చేస్తున్నది. ఐక్యరాజ్యసమితి మొదటిసారిగా పర్యా వరణానికి సంబంధించిన సమావేశాన్ని 1972 జూన్ 5-16తేదీలలో స్టాక్హాంలో నిర్వహించింది. నాటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని 'పర్యావరణ దినం'గా పాటిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 1972వ సంవత్సరం నుండి ఐక్యరాజ సమితి జనరల్ అసెంబ్లీచే జరుపబడుతోంది. 1973లో తొలి సమావేశం ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ఏదైనా ఒక నిర్ణీత నగరంలో పర్యావరణంపై అంతర్జాతీయ సమా వేశం జరుగుతుంది. 1972లో ఐక్యరాజ్యసమితిచే ప్రారంభించబడిన పర్యావరణ పథకం ఆయా వేదికలను ఉపయోగించుకుని పర్యావరణానికి సంబంధించి ప్రపంచంలోని పలు దేశాలలోగల రాజకీయనాయకులు, పార్టీలు, సేవా సంస్థలు ప్రజ లలో అవగాహన పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. 2011 జూన్5వ తేదీన మనదేశంలోని న్యూఢిల్లీ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి వేదిక అయినది. 1973 సంవత్సరం నుండి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు యు.ఎన్. ఆధ్వ ర్యంలో జరుగుతున్నాయి. 1974 సంవత్సరంలో 'ఓన్లీ వన్ ఎర్త్' ఇతివృత్తంతో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు. అయితే 1987 సంవత్సరం నుండి పలు దేశాల్లో ఈ పర్యావరణ దినోత్సవాలు ఏర్పాటు చేయడం ప్రారంభమయింది. 1987 సంవ త్సరంలో కెన్యాలోని నైరోబిలో'ఎన్విరాన్మెంట్ అండ్ షల్టర్ : మోర్ దేన్ ఎ రూఫ్' అనే ఇతివృత్తంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరగ్గా, 1988 సంవత్సరంలో థారులాండ్లోని బ్యాంకాక్లో 'వెన్ పీపుల్ పుట్ ద ఎన్విరాన్మెంట్ ఫస్ట్, డెవలప్ మెంట్ లాస్ట్', అనే ఇతివృత్తంతో జరిగింది. 1989లో 'గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్నింగ్' అని బెల్జియంలోని బ్రసెల్స్లో, 1990లో మెక్సికోలోని మెక్సికో సిటీలో 'చిల్డ్రన్ అండ్ ద ఎన్విరాన్మెంట్' అని, 1991లో 'క్లయిమేట్ ఛేంజ్. నీడ్ ఫర్ గ్లోబల్ పార్టనర్షిప్' స్వీడన్లోని స్టాక్హాంలో, 1992లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో 'ఓన్లీ వన్ ఎర్త్, కేర్ అండ్ షేర్' అని, 1993 సంవత్సరం 'ప్రవర్టీ అండ్ ద ఎన్విరాన్మెంట్ వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ' చైనాలోని బీజింగ్లోను, 1994 సంవత్సరంలో బ్రిటన్లోని లండన్లో'వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ' అని, 1995లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో 'వురు ద పీపుల్స్ : యునైటెడ్ ఫర్ ద గ్లోబల్ ఎన్విరాన్ మెంట్', 1996లో టర్కీలోగల ఇస్తాంబుల్లో 'ఆవర్ ఎర్త్, ఆవర్ హాబిటాట్, అవర్ హోమ్' అని, 1997లో రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని సియోల్లో 'ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్', , 1998 సంవత్సరం రష్యాలోని మాస్కోలో'ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్- సేవ్ ఆవర్ సీస్' అని, 1999 సంవత్సరంలో జపాన్లో టోక్యోలో 'ఆవర్ ఎర్త్- ఆవర్ ఫ్యూచర్- జస్ట్ సేవ్ ఇట్' అని 2000 సంవత్సరం ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో'ద ఎన్విరాన్మెంట్ మిలీనియమ్- టైమ్ టు యాక్ట్' అని, 2001లో 'కనెక్ట్ విత్ ద వరల్డ్ వైడ్ వెబ్ ఆఫ్ లైఫ్' ఇటలీలోని టొరినొ, క్యూబాలోని హవానా లలోనూ జరిగాయి. 2002 సంవత్సరంలో చైనా లోని షింజైన్ 'గివ్ ఎర్త్ ఎ ఛాన్స్' అని, 2003లో 'వాటర్-టూ బిలియన్ పీపుల్ ఆర్ డైయింగ్ ఫర్ ఇట్' లెబనాన్లోగల బీరుట్లో, 2004 సంవత్సరం స్పెయిన్లోని బార్సిలోనాలో 'వాంటెడ్! సీస్ అండ్ ఓషన్స్- డెడ్ ఆర్ ఎలైవ్?', 2005 సంవత్సరంలో 'గ్రీన్ సిటీస్- ప్లాన్ ఫర్ ద ప్లానెట్'అని అమెరికాలో గల శాన్ ఫ్రాన్సిస్కోలో, 2006లో అల్జీరియాలోగల అల్జీర్స్లో 'డిజర్ట్స్ అండ్ డిజర్టిఫికేషన్ - డోంట్ డిజర్ట్ డ్రైలాండ్స్' అని, 2007లో 'మెల్టింగ్ ఐస్- ఎ హాట్ టాపిక్?' అని నార్వేలోగల ట్రొమ్సొలో, 2008 'కిక్ ద హాబిట్-టువర్డ్స్ ఎ లొ కార్బన్ ఎకానమీ' ఇతివృత్తంతో న్యూజిలాండ్లో విల్లిం గ్టన్లో, 2009 సంవత్సరంలో 'యువర్ ప్లానెట్ నీడ్స్ యు- యునైట్ టు కంబాట్ క్లయిమేట్ ఛేంజ్' ఇతివృత్తంతో మెక్సికోని మెక్సికో సిటీలో, 2010 రువాండాలోగల కిగాలిలో 'మెనీ స్పీసిస్. వన్ ప్లానెట్. వన్ ఫ్యూచర్' ఇతివృత్తంతో జరుగగా, ప్రస్తుతం 2011 సంవత్సరంలో భారత్లోని న్యూఢిల్లీలో జరిగింది. 2011 సంవత్సరానికి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి 'నేచర్ ఎట్ యువర్ సర్వీస్' ఇతివృత్తంగా నిర్ణయించారు. ప్రకృతిని పరిరక్షించడమంటే మనల్ని మనం రక్షించుకోవడమేకాదు, భావితరాలకు ఆరోగ్యకర మైన జీవితాలను ఇవ్వడం కూడా. నేడు ఎడారు లుగా మారిన పలు ప్రాంతాలు ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడేవని పలువురు శాస్త్రజ్ఞులు గతంలో చాలా సార్లుతెలిపారు. అప్పుడు కొన్ని పొరపాట్లు, తెలియనితనం, దానికి కారణం కావచ్చు. అయితే సాంకేతికంగా విజ్ఞానపరంగా బాగా అభివృద్ధి చెందినా నేడు ఆ పరిస్థితిని మిగిలిన ప్రాంతాలకు రాకుండా చూసుకోవలసిన బాధ్యత అందరిమీద ఉంది. ప్రకృతిలో ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. ఉదాహరణకు నీరు కాలుష్యమైతే దానివల్ల భూమి నిస్సారమవుతుంది. నిస్సారమైన భూమిలో ఏవిధమైన చెట్లు మనలేవు కనుక నేల బీడుపడిపోతుంది. మనిషికి ప్రాణాధార మైన ఆక్సిజన్ను చెట్లు వదిలి కార్బన్డై ఆక్సైడ్ను పీల్చుకుంటాయి. చెట్లే లేనికారణంగా ఆ ప్రభావం మనిషి ఆయుర్దాయంపై పడి క్రమంగా ప్రాంతాలు ఎడారిగా మారిపోతే, మనిషి జీవనకాలం తగ్గి చివరకు అనారోగ్యాల బారిన పడి మరణానికి చేరువవుతాడు. ప్రపంచవ్యాప్తంగా 10లక్షలకు పైగా ఆదివాసీ తెగలు, ప్రజలు అడవులపై, ఆహార, వాణిజ్య పంట లపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పారిశ్రామికీకరణ పేరుతో అడవు లను నరకటం, పంట పొలాలను సైతం వ్యాపారాల పేరుతో ఇతర అవసరాలకు ఉపయోగించడం వల్ల ఆహార సమస్యతోపాటు, ప్రత్యక్షంగా లక్షల కుటుంబాలు జీవనోపాధి కోల్పోడానికి కారణమవుతున్నది. ఇటువంటి కారణాలకు చదువుకున్న, మేధావులని చెప్పుకునే వారే కారణం కావడం విచారించదగ్గ విషయం. ఇలా చేయడంపై ఎంతోమంది తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రత్యక్ష నిరసనను తెలుపుతున్నారు. అలాగే గతంలో సముద్ర జలాలు కలుషితం కావడం వల్ల తాబేళ్ళు, పలురకాల చేపలు వంటి సముద్ర జీవరాశులు లక్షల సంఖ్యలో మరణించిన విషయం తెలిసిందే. ఇటువంటి సంఘటనలను బట్టి ప్రగతి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం ఎంతవరకు సమంజసం అన్నది అందరూ ఆలోచించాల్సిన విషయం. అడవితల్లి బిడ్డలుగా చెప్పుకునే ఎన్నో తెగలు నేటికీ అడవులను, అక్కడి సాధుజంతువులను కాపాడుతూ వాటికోసం ప్రభుత్వాలతో సైతం పోరాడుతున్నాయి. దీనికై స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు, పారిశ్రామిక వేత్తలు కలిస్తే వారితో సామాన్యులు చేయి కలిపి ముందుకు సాగేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అందుకోసం పర్యావరణ పరిరక్షణను ఓ దీక్షగా స్వీకరించాలి. అందుకోసం పరిసరాల పరిశుభ్రత, చెట్ల పెంపకం, నీటిని జాగ్రత్తగా వాడుకోవడం, ప్లాస్టిక్ వంటి హానికారక పదార్ధాల తయారీని మానుకోవడం, లేదా నిషేధించడం చేయాలి. పాఠశాలల్లో చదివే చిన్నారులకు సైతం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. ఎవరికి తోచిన రీతిలో వారు ప్రకృతిని సంరక్షించాలి. అది ప్రకృతి కోసం కాదు. మనందరి కోసం. భావితరాల కోసం. మనిషి మనుగడకోసం. ఆధారము: విశాలాంధ్ర