మనం ప్రతినిత్యం ఎన్నో రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాం. తూనిక లేదా కొలత విషయంలో ఏ విధమైన మోసానికి గురి కాకుండా నాణ్యమైన వస్తువులను పొందటం వినియోగదారులుగా మన హక్కు. కాని ఆ హక్కును సాధించుకోగలగటం అంత సులభమేమీ కాదు. విపణి వీధిలో వినియోగదారులుగా మనం ఎన్నో రకాలుగా మోసాలకు గురవుతూనే ఉన్నాం. వస్తువులపై ముద్రించిన ధర కంటే ఎక్కువ ధరను వ్యాపారులు వసూలు చేస్తూనే ఉన్నారు. కిలో అని కళ్ళ ముందే తూచి ఇచ్చిన కందిపప్పు వాస్తవానికి ఎనిమిది వందల గ్రాములే ఉంటోంది. పాలు లేదా కిరోసిన్ కొలత విషయంలోనూ తరుగు సర్వసాధారణంగా ఉంటోంది. ఆటోవాలా మీటరు మీద పది రూపాయాలు ఎక్కువ అడిగే సంగతి అలా ఉంచి ఒకే దూరానికి ఒక్కో మీటరు ఒక్కొక్క రీతిన తిరుగుతూ ఉంటుంది. పెట్రోలు బంకుల్లో ఆపరేటర్ల హస్తలాఘవం వల్ల వాహనదారులు ఎంతో కొంత నష్టపోక తప్పటం లేదు. కేవలం కొనేటప్పుడే ఇలాంటి తరుగు ఉంటుందనుకొంటే పొరపాటే! రైతులు రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని అమ్మేటప్పుడు 70కిలోల బస్తాకు దాదాపు ఆరేడు కిలోలు తూకంలో మోసాల కారణంగా నష్టపోతున్నారు. ఇలా తూనికలు-కొలతల్లో మోసాలవల్ల వినియోగదారులు తాము చెల్లించే డబ్బుకు తగిన విలువైన వస్తువును పొందలేక నష్టపోతున్నారు. కనుక ఈ విషయంలో వినియోగదారుల రక్షణ కోసం ప్రవేశ పెట్టినదే తూనికలు-కొలతల చట్టం. గతంలో తూనికలు-కొలతలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా ఉండేవి. కొలతలకు ఒక ప్రాంతంలో మానికను ఉపయోగిస్తే మరొక ప్రాంతంలో ‘శేరు’ను ఉపయోగించేవారు. అలాగే తూనికలు-కొలతలకు సంబంధించి మూర, సోల, గిద్ద, వీశె, సవాశేరు ఇలా వేర్వేరు కొలతలు వాడేవాళ్ళు. దీనివల్ల వినియోగదారుల్లో వస్తువు పరిమాణం, విలువ విషయంలో కొంత అయోమయం ఉండేది. అయితే స్వాతంత్య్రానంతరం దేశమంతటా ఒకే విధమైన తూనికలు-కొలతలను ఉపయోగించేలా నిర్ణీత ప్రమాణాలను రూపొందించటం జరిగింది. 1976వ సంవత్సరంలో స్టాండర్ట్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ను ప్రవేశపెట్టారు. ప్యాక్ చేసి అమ్మే వస్తువులకు సంబంధించి స్టాండర్డ్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ (ప్యాకేజ్డ్ కామొడిటీస్) రూల్స్ను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని ఒకే విధంగా అమలు చేసేందుకు వీలుగా 1985లో స్టాండర్డ్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ (ఎన్ఫోర్స్మెంట్) యాక్ట్ను ప్రవేశపెట్టారు. తూనికలు-కొలతల చట్టాన్ని అమలుచేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ప్రతి రాష్ట్రంలో ఉన్నట్లే మన రాష్ట్రంలో కూడా లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ ప్రధానాధికారిగా ఈ విభాగం పని చేస్తోంది. రీజనల్ డిప్యూటీ కంట్రోలర్లు, అసిస్టెంట్ కంట్రోలర్స్, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్లు ఈ శాఖలోని ప్రధానమైన అధికారులు. ఎవరికి ఫిర్యాదు చేయాలి? తూనికలు-కొలతల విషయంలో మోసపోయినట్లు భావించినప్పుడు స్థానిక లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయావచ్చు. లేదా కంట్రోలర్కు ఫిర్యాదు చేయవచ్చు. లీగల్ మెట్రాలజీ గ్రీవియన్స్ ఆపీసర్కు ఫిర్యాదు చేయవచ్చు. వ్యాపారి మోసగిస్తున్నట్లు నిరూపణ అయితే ఆ వ్యాపారికి జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. స్టాండర్డ్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ 1976, స్టాండర్డ్స్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 1985లలో 1986లో చేసిన సవరణల వల్ల వినియోగదారులు, గుర్తింపు పొందిన వినియోగదారుల సంఘాలు నేరుగా కోర్టుల్లో కేసులు దాఖలు చేసే అవకాశం లభించింది. సవరణలకు ముందు ఈ అధికారం కేవలం తూనికలు-కోలతల అధికారులకు మాత్రమే ఉండేది. వినియోగదారుల రక్షణ చట్టం అమలులో భాగంగా ఏర్పాటైన జిల్లా వినిగదారుల ఫోరం, రాష్ట్ర కమిషన్, జాతీయ కమిషన్లలో కేసు దాఖలు చేసి నష్టపరిహారం పొందవచ్చు. తెలుగులో తొలి ఇ-బుక్ తూనికలు-కొలతల విషయంలో జరుగుతున్న మోసాలకు సంబంధించి వినియోగదారులు అప్రమత్తం కావాలంటే ముందుగా వారిలో ఆయా చట్టాల గురించిన అవగాహన పెంపొందాలి. అపుడే వారు వ్యాపారులను ప్రశ్నించి సమస్యల పరిష్కరణకు కృషి చేయటం సాధ్యమవుతుంది. ఈ భావనతోనే దశాబ్ద కాలం క్రితమే తెలుగులో తూనికలు-కొలతల శాఖ గురించిన వివరాలతో ‘వినియోగదారుల రక్షణలో తూనికలు-కొలతలు’ పుస్తకాన్ని ప్రచురించిన కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ మరో ప్రయోగం చేసింది. కంప్యూటర్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో ఇ-బుక్ల ద్వారా విద్యార్థులలో అవగాహనను కల్పించటం సులభమని భావిస్తూ ఎలక్ట్రానిక్ పుస్తకాన్ని విడుదల చేయాలని కన్స్యూమర్ ఎడ్యుకేషన్ సొసైటీ భావించింది. దానిలో భాగంగా తూనికలు-కొలతలపై తొలి ఇ-బుక్ను వినియోగదారుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది. ఈ పుస్తకాన్ని వికాస ధాత్రి వెబ్సైట్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించటంతో పాటు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేనివారి కోసం ఈ ఇ-బుక్ను కాంపాక్ట్ డిస్క్ల రూపంలో అందజేయటం జరిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వినియోగదారుల ఉద్యమాన్ని వ్యాప్తి చేయటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. వినియోగదారుల విద్య లక్ష్యంగా పాఠశాలల్లో ‘కన్స్యూమర్ క్లబ్’ లను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఆధారము: ఆంధ్రభూమి మరియు వికాస ధాత్రి