న్యూఢిల్లీ, మార్చి 23: దేశమంతా హోలీ సంబరాల్లో మునిగిన వేళ కేంద్ర మంత్రివర్గం గ్రామీణులకు, ప్రభుత్వోద్యోగులకు పండుగ కానుకలు ప్రకటించింది. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్’ (పీఎంఏవై-జీ) కింద గ్రామీణ ప్రాంతాల్లో 2.95 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నిరుడు జూన్లో ‘2022నాటికి అందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద గ్రామీణ, పట్టణ పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని మంత్రివర్గం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన మంత్రిమండలి గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అనంతరం టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ భేటీ వివరాలను విలేకరులకు వెల్లడించారు. తొలి మూడేళ్లలో కోటి గ్రామీణ ఇళ్లకోసం రూ.81,975 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రాలు 60.40 నిష్పత్తిలో భరించాల్సి ఉండగా రూ.68వేల కోట్లను బడ్జెట్ కేటాయింపుల కింద కేంద్రం ఇస్తుందన్నారు. మిగిలిన రూ.21,975 కోట్లు జాతీయ గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి బ్యాంకు-నాబార్డ్ నుంచి రుణంగా అందుతుందని తెలిపారు. ఈ పథకం కింద మైదానాల్లో నివసించేవారికి రూ.1.2 లక్షలు, కొండప్రాంతాలు, సంక్లిష్ట ప్రాంతాల్లో రూ.1.3 లక్షల వంతున ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేస్తారు. ఈ లక్ష్యసాధనకు తోడ్పాటు, పారదర్శకత కోసం జాతీయ సాంకేతిక మద్దతు సంస్థ (ఎన్టీఎస్ఏ)ను ఏర్పాటు చేస్తారు. గ్రామీణ ఇళ్ల నిర్మాణంలో గ్రామసభలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమచేస్తారని, మొబైల్ యాప్ద్వారా తనిఖీ, భౌగోళిక ధ్రువీకరణ అప్లోడ్ వంటి కార్యక్రమాలు పూర్తిచేస్తారని చెప్పారు. ఇక ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులు రూ.70వేలదాకా రుణం తీసుకోవచ్చునని వివరించారు. ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై రాయితీని అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా 2016-17లో రూ.21,274 కోట్ల మేర సబ్సిడీని మంత్రివర్గం కోతకోసింది. వ్యవసాయ రంగంలో సహకారంపై లిథువేనియాతో, నైపుణ్యాభివృద్ధిపై యూఏఈతో ఒప్పందాలను అంగీకరించింది. అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ కేంద్రం నిర్మాణం కోసం ద్వారకలోని 89.72 హెక్టార్ల భూమిని డీఐపీపీకి అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. కాలం చెల్లిన చట్టాలను తొలగించే బిల్లుతోపాటు కొన్ని చట్టాలు తొలగించే వీల్లేకుండా రూపొందించిన బిల్లుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక స్వచ్ఛభారతకు ప్రపంచ బ్యాంకు 105 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం (రూ.9వేల కోట్లు) అందించనుంది. ఇక రాజస్థాన్లో పశుసంవర్ధక కేంద్రం నిర్మాణం కోసం రాజస్థాన్ సర్కారుకు 50 ఎకరాలు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఆధారము: ఆంధ్రజ్యోతి