অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గొర్రెల పెంపకం

గొర్రెల పెంపకం

  1. నెలూరు జాతి
  2. వివిధ వయస్సుల్లోని నెలూరు జాతి గొర్రెల బరువు
  3. దక్కని జాతి
  4. వివిధ వయస్సుల్లోని దక్కని జాతి గొర్రెల బరువు
  5. పశువుల పాక నిర్మాణంలో గమనించవలసిన మెళుకువలు
  6. పశువుల పాక నిర్మాణం
  7. గొర్రెల పోషణలో రైతులు పాటించవలసిన మేళకువలు
  8. గడ్డి రకాలు
  9. విత్తనపు పొట్టేళ్లకు
  10. ఆడగొర్రెలకు దాణా
  11. ఎదిగే పిల్లలకు దాణా
  12. సంతానోత్పత్తి
  13. ఎద
  14. ఋతు క్రమం
  15. చూడికాలము
  16. జత కలపడం
  17. నిర్వీర్యం
  18. ఆరోగ్య పరిరక్షణ
  19. చిన్న పిల్లల పోషణ
  20. పోషకాహారాల 3
  21. 1. శక్తి
  22. 2. మాంసకృత్తులు
  23. 3. ఖనిజ లవణాలు
  24. 4. విటమినులు
  25. ఆహార సంబంధమయిన కొన్ని ముఖ్యమయిన వ్యాధులు
  26. 1. మూత్రనాళాలలో రాళ్ల జబ్బు
  27. 2. చూలు గొర్రెలలో విషపు జబ్బు
  28. 3. గొర్రెలలో మెదడు మెత్తబడి వచ్చు పోలియో
  29. ఆరోగ్య పరిరక్షణ
  30. సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు
  31. వైరస్ వల్ల కలిగే వ్యాధులు
  32. ఏకకణ జీవుల వల్ల కలిగే వ్యాధులు
  33. అంతరపరాన్నజీవులు
  34. చిటుకు వ్యాధి
  35. రోగనిర్ధారణకు పరీక్షలు
  36. చికిత్స
  37. నివారణ
  38. ఆంత్రాక్స్ లేదా నెరుడు వాపు లేదా నల్ల జాడ్యం
  39. లక్షణాలు
  40. ముఖ్యగమనిక
  41. చికిత్స
  42. నివారణ
  43. వ్యాధి లక్షణాలు
  44. రోగ నిర్ధారణ
  45. చికిత్స
  46. నివారణ
  47. పాగాళ్ళు లేద మితువ కాళ్ళ లేదా ఫుట్రాట్
  48. లక్షణాలు
  49. నివారణ
  50. గొంతు వాపు వ్యాధి (హెచ్.ఎస్.)
  51. లక్షణాలు
  52. చికిత్స
  53. నివారణ
  54. నీలి నాలుక (బూటంగ్)
  55. లక్షణాలు
  56. చికిత్స
  57. నివారణ
  58. గాలికుంటు వ్యాధి (పుట్ అండ్ మౌత్ వ్యాధి)
  59. లక్షణాలు
  60. వ్యాధి తదనంతర లక్షణాలు
  61. చికిత్స
  62. నివారణ
  63. అమ్మతల్లి / బొబ్బరోగం
  64. లక్షణాలు
  65. చికిత్స
  66. నివారణ
  67. పి.పి.ఆర్. లేదా గొర్రెల్లో పారుడు లేదా మేకల ప్లేగు
  68. వ్యాధి వ్యాప్తి
  69. వ్యాధి లక్షణాలు
  70. చనిపోయిన జీవాల్లో లక్షణాలు
  71. వ్యాధి నిర్ధారణకు ప్రయోగశాలకు పంపవలసిన నమూనాలు
  72. వ్యాధి చికిత్స
  73. వ్యాధి నివారణ
  74. ఆస్యపుండ్లు / నోటి పండ్లు
  75. లక్షణాలు
  76. చికిత్స
  77. నివారణ
  78. గొర్రె పిల్లల్లో రక్తపారుడు లేదా కాక్సీడియోసిస్
  79. లక్షణాలు
  80. చికిత్స
  81. నివారణ
  82. అంతర పరాన్న జీవుల వల్ల పారుడు
  83. లక్షణాలు
  84. చికిత్స
  85. నివారణ
  86. గొర్రెలకు మరియు వాటి పిల్లలకు కావలసిన దాణా ఇంటి దగ్గర చేయదలచిన ఎడల ఈ క్రింది విధంగా తయారు చేయవచ్చు.
  87. టికా మందు / నట్ట మందు త్రపుటకు సమయ సూచిక
  88. గొర్రె పొట్టేలు పిల్లల పెంపకం

గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో “నెలూరు" జాతిని, తెలంగాణా ప్రాంతంలో "దక్కని" జాతిని పెంచుతున్నారు. మన రాష్ట్రం దాదాపు 96 లక్షల గొర్రెలు కలిగి గొర్రెల పెంపకంలో దేశంలోనే నాల్గవ స్థానంలో ఉన్నది. గొర్రెల పెంపకం వాణిజ్య పరంగా మంచి లాభదాయకం.

నెలూరు జాతి

దీనిని మాంసోత్పత్తికి మాత్రమే పెంచవచ్చు. మన దేశంలోని జాతులన్నింటికంటే పొడవైనది. నెలూరు జాతిలో జోడిపి, పల్లా, బ్రౌన్ అనే మూడు రకాలున్నాయి. మాంసోత్పత్తిలో కాని, శరీర పరిమాణంలో కాని ఈ మూడు రకాల్లో పెద్ద తేడా లేదు. మన రాష్ట్రంలో జోడిపి మరియు బ్రౌన్ ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.

వివిధ వయస్సుల్లోని నెలూరు జాతి గొర్రెల బరువు

గొర్రె వయసు

బరువు (కిలోల్లో)

పొట్టేళ్ళు

40-50

ఆడ గొర్రెలు

25-35

ఆరు నెల్ల వయస్సులో

19-20

మూడు నెల్ల వయస్సులో

14

పుట్టిన పిల్ల

2.50-4.0

దక్కని జాతి

ఈ జాతి గొర్రెలు నల్లగా, పొట్టిగా ఉండి కబళ్ళు, తాళ్ళు నేయడానికి ఉపయోగపడే తక్కువ నాణ్యత గల ఉన్ని మరియు మంసోత్పత్తికి ప్రసిద్ది. ఈ రకం ఉత్తర, దక్షిణ తెలంగాణాలో ఎక్కువ.

వివిధ వయస్సుల్లోని దక్కని జాతి గొర్రెల బరువు

గొర్రె వయసు

బరువు (కిలోల్లో)

పొట్టేళ్ళు

25-30

ఆడ గొర్రెలు

20

ఆరు నెల్ల వయస్సులో

13-15

మూడు నెల్ల వయస్సులో

9-11

పుట్టిన పిల్ల

1.5-2.0

గొర్రెల మనుగడ ఏదేని ప్రాంతంలో అచ్చటి నేల స్వభాం, వాతావరణం, వర్షపాతం, గాలిలో తేమ మరియు మెత లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ ప్రదేశాలు కంటే అధిక ఉష్ణోగ్రత, తక్కువ తేమ ఉన్న ప్రదేశాల్లో గొర్రెలు బాగా అభివృద్ది చెందుతాయి. మెట్ట వ్యవసాయం పై ఆధారపడిన రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో గొర్రెల పెంపకం ఎక్కువ.

పశువుల పాక నిర్మాణంలో గమనించవలసిన మెళుకువలు

వర్షాకాలంలో మరియు రాత్రులందు గాలి మేలుతురు లేని చీకటి కొట్టాల్లో ఎక్కువ సంఖ్యలో గొర్రెలను వుంచటం వల్ల కొట్టంలో చిత్తడి ఏర్పడి రోగ కారక క్రిముల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇలాంటి పరిస్ధితులను అధిగమించడానికి మరియూ ఎండ, వాన, నుండి పశువులను కాపాడటానికి స్ధానికంగా దొరికే ముడిసరుకు నుపయోగించి నివాసానికి ఉపయోగపడే కొట్టలను నిర్మంచుకోనవచ్చు.

పశువుల పాక నిర్మాణం

స్ధానికంగా దొరికే ముడి సరుకులతో నిర్మించాకోవాలి. ఎత్తేన ప్రదేశాల్లో కొట్టం నిర్మించాలి. గాలి, వెలుతురు పుష్కలంగా ప్రసరించే విధంగా ఉండాలి. కొట్టం లోపల చిత్తడిగా ఉండరాదు. కొట్టం చుట్టుప్రక్కల నీడని మరియు గ్రసాన్ని ఇచ్చె సుబాబుల్, అవిస మరియు తుమ్మ చెట్లను పెంచాలి. కొట్టంలో ప్రతి పశువుకు 1 చ.మీ విస్తీర్ణం అవసరముంటుంది. పిల్లలకు 0.4 చ.మీ స్ధలం అవసరం. ప్రతి కొట్టంలో 4-6 అం.లోతు, 0.4 మీ. వెడల్పుతో కావలసినంత పొడుగుతో దాణా తొట్టి కట్టాలి. ఒక మూలగా 6 అం. లోతు, 0.4 మీ. వెడల్పుతో 2 మీ. పొడగుగా నీటి తొట్టి కూడా నిర్మంచాలి. నేల సిమెంట్ ప్లోర్ కాకుండా మొరం తో ఏర్పాటు చేసుకోవాలి.

గొర్రెల పెంపకంలో లాభ నష్టాలు ఆ మంద యొక్క పునరుత్పత్తి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. గొర్రెల పెంపకంలో లాభాలు మంద పరిమాణం గొర్రెల ఎంపిక, చూడి పశువులు మరియు పాలిచ్చే తల్లి జీవాలు యాజమాన్యం పై ఆధారపడి వుంటుంది. కావున ఆడ గొర్రెల ఎంపిక, పోషణ మరియు పునరుత్పత్తి శక్తి మీద శ్రద్ధ చూపాలి.

గొర్రెల పోషణలో రైతులు పాటించవలసిన మేళకువలు

మనదేశంలో గొర్రెల పెంపకం కూలవృత్తిగా సాగుతున్నందువల్ల మనలో చాలా మందికి ఈ వృత్తి చేపట్టడం కష్టమని ఒక అపోహా ఉన్నది. కాని “మనసుంటే మార్గముండదా” అనే సూక్తిని నిజమ్చేస్తూ మనరాష్ట్రంలో అన్ని కులాల, వర్గాల ప్రజలు గొర్రెల పెంపకం పై ఆసక్తిని చూపిస్తూన్నారు. కనుక శాస్త్రీయ పద్ధతుల ద్వారా గొర్రెల పంపకం చేపట్టిన యువకులు చాలామంది లాభాలు పొందుతున్నారు.

ఈ రోజులలో గోర్రేమాంసానికి చాలా డిమాండు ఉన్నది. సుమారు సంవత్సరం లోపు గొర్రె 20 కిలోల బరువుంటే అందులో 10 కిలోల మాంసము వస్తుంది. మాంసము, చర్మము, తల, కాళ్ళు, కడుపు, పేగులు కలేయాలను అమ్మితే ఆ గొర్రె నుంచి సుమారు వేయి రూపాయలు ఆదాయం వస్తుంది. కాని గొర్రెల పెరుగుదలలోను, పోషణలోను, ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ వషిస్తేనే ఈ విధంగా లాభం. “కృషితో నాస్తి దుర్బిక్షం” అన్న సామెత గొర్రెల పోషణలో ఎంతైనా నిజం. రైతు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చెప్పలేని ఆర్ధిక బాధలకు గురి అవుతాడు. గొర్రెలు అమిత సున్నితమయిన నెమరువేసే జతువులు. వీటిలో జబ్బులు ఎక్కువే. ఇవి తేలికగా క్రూర మృగాల వేటకు గురి అవుతాయి. కనుక రైతు సకాలంలోజాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

మొట్టమొదట మంసోత్పత్తికి పనికి వచ్చే గొర్రెలను ఎన్నిక చేయాలి. పుట్టుకోతోనే పుష్టిగా ఉండాలి. ఉంటె 3 ½ నుంచి 4 కిలోల బరువు గలిగిన పిల్లలు పుట్టాలి. పిల్లలు త్వరగా పెరగాలి. అంటే రోజుకు 100 నుంచి 150 గ్రాముల బరువు పెరగాలి. ఎముక బలంకన్నా కండపుష్టి ఎక్కువగా అంటే నూటికి 45 నుంచి 50 శాతం మాంసం రావాలి. ఉత్తరకోస్తా జిల్లాలలోని గొర్రెలు నాసిరకం వి, చిన్నవి. వీటి పెరుగుదల చాలా ఆలస్యంగా ఉంటుంది. మన రాష్టంలో అత్యున్నతమయిన గొర్రెజాతి నెల్లూరు. ఇవి మాంసోత్పత్తికి ప్రసిద్ధి. మగ గొర్రెలు 50 కిలోలు, ఆడ గొర్రెలు 40 కిలోల వరకు తూగుతాయి. వీటిలో మూడు రకాలున్నాయి.

  • జోడిపి – దీనికి శిరిరమంతా తెల్లగా ఉండి, తల, కడుపు క్రింద, తొడల లోపలభాగాలూ, కాళ్లు నలుపుగా ఉంటాయి.
  • పళ్ల – ఇవి పూర్తిగా తెల్లగా ఉంటాయి,.
  • గోధుమ లేక ముదురు గోధుమ రంగులు. శిరిరపు రంగును చూసి ఒక రకం గొర్రెలు మంచివి, వేరేవితక్కువ అనడానికి లేదు. ఈ మూడు రకాలు నెల్లూరు, కడప జిల్లాలలో దొరుకుతాయి. ఇవి ఏ మాత్రం ఉన్ని ఇవ్వవు. గరివిడిలోని పశు పరిశోధనా కేంద్రంలో సుమారు 200 జోడిపి గొర్రెలను శాస్త్రీయ పద్ధతులతో పెంచుతున్నాము. ఔత్సాహిక యువకులు, రైతులు తరచుగా గరివిడి ఫారాన్ని సందర్శిస్తున్నారు.

ప్రప్రథమంగా గొర్రెల పెంపకం చేపట్టే వాళ్లు మొదట్లో 35 నుంచి 50 ఆడ గొర్రెలు, రెండు విత్తనపు పొట్టేళ్లతో మొదలు పెడితే మంచిది. క్రమేణా అనుభవం వచ్చిన తర్వాత లభ్యమయ్యే పచ్చికబయళ్లు, పనివాళ్లు, తిండిగింజలు, మేత మొదలైన వాటిని బట్టి గొర్రెల సంఖ్యను పెంచుకోవాలి. అత్యాశకు పోయి గొర్రెల పెంపకం చేపట్టి చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు.

గొర్రెల పోషణలో అతి ముఖ్యమయినది ఆహారం. గొర్రెల పెంపకం లాభసాటిగా ఉండాలంటే వాటికి సరిపడా పచ్చిక బయళ్లు చాలా అవసరం. ఎందుకంటే ఎలాంటి మిశ్రమ దాణా లేకపోయినప్పటికీ బయళ్లలో దొరికే పచ్చిక మేసి గొర్రెలను పెంచుకోవచ్చు. పాడిగేదెలు, ఆవులతో పోలిస్తే మొట్టమొదట ఫారం పెట్టుకోవడానికి గొర్రెలు కొనడానికి అంతగా ఎక్కువ ఖర్చు పెట్టక్కరలేదు. మన ప్రాంతాలలో ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి జూను నెలల వరకు పచ్చిమేత దొరకదు. కనుక గొర్రెలు ఆకలితో చచ్చిపోతాయి. రైతు క్రుంగిపోతాడు. అటువంటప్పుడు కేవలం అవి మేసే గడ్డిమీదే ఆధారపడకుండా గొర్రెలు తినే ఆహారంలో కనీసం 8 శాతం వరకు సమీకృత దాణా మనం ఇచ్చినట్లయితే గొర్రెల నుంచి అధికోత్పత్తి సాధించవచ్చు. పెద్ద గొర్రెల దాణా కిలో ఒకటికి 4 రూపాయలు, పిల్లల దాణా 7 రూపాయల వరకు బజారులో అమ్ముడు అవుతున్నాయి. గొర్రెలను ఉదయపు వేళల్లో కాని, సాయంత్రం గాని ఎండవేడి నుంచి తప్పించుకొనేలా, పోలాల్లో మేయడానికి వదలడం మంచిది. అప్పడు అవి నింపాదిగా, ఇష్టంగా గడ్డిమేస్తాయి. గొర్రెలు ఎన్ని గంటలు మేశాయి అన్నది ముఖ్యం కాదు. ఎంతగడ్డి ఎంత తక్కువ కాలంలో అందుబాటులో ఉందో ముఖ్యం. కనుక గొర్రెల మంద బరువు పెరుగుతున్నదో లేక క్షీణిస్తున్నాయా అని తెలుసుకోవడం అవసరం. నెలనెలా మొదటి వారంలో గొర్రెల బరువులను తీయాలి. గత నెలకన్నా ఇప్పటినెలలో గొర్రెల బరువులు తగ్గాయి అంటే వాటికి తిండి చాలటంలేక, తగ్గిపోతున్నాయన్న మాట. అప్పడు గొర్రెలకు అదనంగా షెడ్లలో ఆహారం అమర్చాలి.

గడ్డి రకాలు

ఆరు బయట, పొలాలలో దొరికే పచ్చిక రకాలు కాకుండా, ప్రతిరైతు తన పొలంలో కనీసం 10 శాతం ఏకవార్షిక, బహువార్షిక పచ్చికలను పెంచుకోవాలి. పచ్చిమేతలు అనేక రకాలు. భూసారం, నీటి వసతులను బట్టి చిక్కుడు జాతులయిన బర్సిము, లూసర్ను స్టయిలో, అలసందలు, పిల్లిపెసర, వేరుశనగ కట్టె మొదలయిన వాటిని పెంచుకోవచ్చు. ట్రికో మాంసకృత్తులు ఎక్కువ, కనుక శ్రేష్టమైనవి.

ఇవికాక జొన్న మొక్కజొన్న రాగి, సజ్జలను పచ్చిగా ఉన్నప్పడు గొర్రెల ఆహారంగా ఇవ్వవచ్చు. వీటిని చిన్న ముక్కలుగా కత్తిరించి ఇస్తే వృధా ఉండదు. గొర్రెలు ఇష్టంగా తింటాయి.

పూసాజైంట్ నేపియరు, గినీగడ్డి, పారాగడ్డి, సుడాను గడ్డి రకాలను తగినంత నీటి సదుపాయమున్న చోట్ల పెంచవచ్చును. ఇవి ఒక్కసారి నాటితే చాలా సంవత్సరాలు దిగుబడినిస్తాయి.

వేప, చింత, రావి, మర్రి, సుబాబులు, అవిశె, మునగ చెట్ల ఆకులు కూడా గొర్రెల ఆహారంలో విరివిగా ఇవ్వవచ్చును.

ఎండు వరిగడ్డి మీద 4 కిలోల యూరియా, 1 కిలో ఉప్ప, 1 కిలో ఖనిజ లవణ మిశ్రమాలను 60 లీటర్ల నీళ్లలో కరిగించి స్పే చేసి 2 వారాలు గాలిచొరకుండా చేయాలి. ఆ తర్వాత ఆ మాగుడు గడ్డిని క్రమక్రమంగా గొర్రెలకు అందజేస్తే గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ కార్యక్రమమం గరివిడి పరిశోధనా కేంద్రంలో మేము చేస్తున్నాము.

అంతేకాక పచ్చిమేతలు విస్తారంగా ఉన్నప్పడు, వాటిని ఎండబెట్టి, దాచుకోవాలి. పొలాలలో మేత లేనప్పడు ఈ ఎండుగడ్డిని గొర్రెలకు షెడ్లలో ఇవ్వాలి.

గొర్రెలకు సమీకృత దాణా తినిపిస్తే మంచి ఫలితాలను ఇస్తాయి. స్థానికంగా ఏ వస్తువు చౌకగా దొరికితే అదే వాడుకొని దాణా తయారు చేసుకోవచ్చు లేదా కంపెనీలు తయారుచేసే మిశ్రమ దాణాలను కొనుక్కొనవచ్చు. పెద్ద గొర్రెల దాణా ఈ విధంగా ఉంటే మంచిది.

నలుగకొట్టిన మొక్కజొన్నలు 25 పాళ్లు

వేరుశెనగ పిండి 32 పాళ్లు

గోధుమ/బియ్యపు తవుడు 40 పాళ్లు

ఖనిజ లవణ మిశ్రమం 02 పాళ్లు

ఉప్ప 01 పాళ్లు

పుట్టిన గొర్రె పిల్లలకు 3 నెలల వయస్సు వరకు ఎదగడానికి దాణా ఈ విధంగా చేసుకోవచ్చు.

మొక్కజొన్నలు 60 పాళ్లు

వేరుశెనగ పిండి 20 పాళ్లు

చేప పొట్టు 10 పాళ్లు

గోధుమ తవుడు 07 పాళ్లు

ఖనిజలవణ మిశ్రమం 02 పాళ్లు

ఉప్ప 01 పాళ్లు

ఇక గొర్రెలకు ఇవ్వవలసిన దాణా మోతాదులు.

విత్తనపు పొట్టేళ్లకు

ప్రతి పొట్టేలుకు జతకలిసే సీజనులో రోజుకు 400-500 గ్రాముల దాణా, మిగతా సీజనులో 200-300 గ్రాముల దాణా ఇవ్వాలి.

ఆడగొర్రెలకు దాణా

  • చూడి కట్టించడానికి కనీసం 3-6 వారాల ముందు నుంచి ప్రతి గొర్రెకు సగటున రోజుకు 150 నుంచి 250 గ్రాముల దాణా ఇవ్వాలి.
  • చూలుతో ఉన్నప్పడు 200-300 గ్రాముల దాణా ప్రతి గొర్రెకు ఇవ్వాలి.
  • ఈనిన తరువాత 60–90 రోజుల వరకు 200-300 గ్రా. దాణా ఇవ్వాలి.

ఎదిగే పిల్లలకు దాణా

సగటున రోజుకు 20 గ్రా. దాణా అవసరం. 3 వారాల వయస్సు వచ్చిన తర్వాత 50 గ్రా, దాణా ఇవ్వాలి. ఇట్లా ఇవ్వడం బయటదొరికే పచ్చిక మీద ఆధారపడుతుంది. ఒకవేళ పచ్చిక విరివిగా దొరికితే దాణా ఇవ్వనక్కరలేదు.

ఖనిజలవణ మిశ్రమపు ఇటుకలను గొర్రెల పెడ్లలో వ్రేలాడకట్టితే వాటికి అవసరము వచ్చినప్పడు నాకటం వల్ల లవణ లోపము రాకుండా నివారింపబడి గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి. పిల్లలలో పెరుగుదల బాగా ఉంటుంది.

మన దేశవాళీ గొర్రెపిల్లలు పుట్టినప్పడు 2.0–3.0 కిలోల బరువుంటాయి. గొర్రెపిల్లను సామాన్యంగా 3-4 నెలల వయస్సు వచ్చేటప్పటికి తల్లిపాలు మరిపించాలి. అప్పడు పిల్లలు 11.0-18.00 కిలోల బరువుండాలి. సంవత్సరానికి కనీసం 20-23 కిలోల బరువుండాలి. కనుక గొర్రె పిల్లలను 10-15 నెలల వయస్సులో లేదా 23.0–250 కిలోల బరువున్నప్పడు మార్కెట్టుకు కోతకు పంపితే లాభదాయకం.

సంతానోత్పత్తి

మన దేశవాళీ గొర్రెలు 12 నెలలు దాటిన తర్వాత గాని యుక్తవయస్సుకు రావు.

ఎద

ఆడ గొర్రెలు ఎదకు వచ్చినప్పడు ఎద చివరిదశలో అంటే ఎదకువచ్చిన 36 గంటల తర్వాత పొట్టేలుతో దాటించడం లాభదాయకం.

ఋతు క్రమం

గొర్రె జాతి మామూలుగా ఏడాది పొడవునా ఎదకు రాదు. సంవత్సరంలో కొన్ని ఋతువులలోనే ఎదకు వచ్చి కడతాయి. మనదేశంలో గొర్రెలు ఈవిధంగా ఎదకు వస్తాయి.

  • మార్చి, ఏప్రిల్ (15-20 శాతం)
  • జూన్, జూలై, ఆగష్టు (50-80 శాతం)
  • అక్టోబర్, నవంబరు (30-50 శాతం)

చూడికాలము

గొర్రెలలో సగటు చూడికాలము 148 రోజులు, అంటే 5 నెలలు.

జత కలపడం

మన ప్రాంతంలో విత్తనపు పొట్టేళ్ళను ఎప్పడూ గొర్రెల మందతో కలిపి మేపుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. విత్తనపు పొట్టేళ్ళను విడిగా మేపుతూ, రాత్రి వేళల్లో మాత్రం ఎదకువచ్చిన గొర్రెలతో కలపడం మంచిది.

నిర్వీర్యం

మనము విత్తనానికి వాడే పొట్టేలు తప్ప మిగతా అన్ని మగ గొర్రె పిల్లలు 2 వారాల వయస్సులో ఉన్నప్పుడు, వాటి వృషణాలను నలిపివేసి నిర్వీర్యం చేయాలి. దీంతో పిల్లలు బాగా పెరుగుతాయి. తొందరగా లావెక్కుతాయి.

పనికిరాని గొర్రెలను ఏరివేయడం : ప్రతి సంవత్సరం కొత్తగా పుట్టే గొర్రెపిల్లలను ముఖ్యంగా ఆడగొర్రె పిల్లలను అన్నింటిని అట్టేపెట్టి, వయసు మీరిన, రోగిష్టిగా ఉన్న బక్కచిక్కివున్న ఆడగొర్రెలను మంద నుంచి ఏరివేసి అమ్మేయాలి. అవిటిగా పుట్టిన పిల్లలు, పుట్టినప్పడే బలహీనంగా ఉన్న గొర్రెపిల్లలను వెంటనే అమ్మేయాలి. మగగొర్రె పిల్లలలో విత్తనపు పొట్టేళ్లు తప్ప మిగతావాటిని అమ్మివేయాలి. నూరు గొర్రెలకు 3 విత్తనపు పొట్టేళ్లు జతకలపడానికి అవసరం.

సాధారణంగా ప్రతి సంవత్సరం మందలో 5 నుంచి 10 శాతం గొర్రెలను ఏరివేస్తేనే ఆర్థికంగా లాభం. ఆహారపు ఖర్చు తగ్గించవచ్చు

ఆరోగ్య పరిరక్షణ

"ఆరోగ్యమే మహాభాగ్యమ"నే నానుడి గొర్రెల విషయంలో కూడా ఎంతయినా నిజం. దీనికి పరిసరాల పారిశుధ్యం ముఖ్యమయింది.

  • గొర్రెలను గాలి వెలుతురు బాగా వచ్చే పెడ్లలో తిరగడానికి వీలుగా ఉంచాలి.
  • దాణావేసే తొట్టి, నీటి తొట్టిలను అప్పడప్పడు శుభ్రంగా కడిగి సున్నము వేయాలి.
  • గొర్రెలను రోజూ ఒకే పొలంలో మేపకూడదు. మార్పిడి పద్ధతిలో పచ్చిక బయళ్లలో మేపాలి.
  • గొర్రెలకు క్రమం తప్పకుండా ఏలికపాములు, జలగలు మొదలైన పురుగులు పడకుండా మందులు వేయించాలి. అట్లాగే చిటుకురోగం, జబ్బవాపు, గురకరోగం, గాలికుంటు, పారుడు రోగాల్లాంటి అంటు వ్యాధులు రాకుండా సకాలంలో టీకాలు వేయించాలి.
  • సమీపంలో ఉన్న పశువైద్యుడి సలహాలను, సహాయాన్ని సకాలంలో పొందితే మంచిది.

చిన్న పిల్లల పోషణ

గొర్రె పిల్లల్లో పెరుగుదల మొదటి మూడు మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పెరుగుదల రోజుకు దాదాపు 150 గ్రా, చొప్పన ఉంటుంది. ఇలా అధిక పెరుగుదల ఉన్న గొర్రె పిల్లలే ముందు ముందు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ బరువు తూగి లాభాలు చేకూరుస్తాయి. కావున పాలు మరిచే వయస్సు వరకు (దాదాపు మూడు నెలలు) తల్లిపాలకు అదనంగా పోషణ ఇవ్వాలి. పిల్ల గొర్రెలను తల్లుల నుండి వేరు దడిలో ఉంచి పెంచాలి. పిల్లల దడిలో వేప కొమ్మలు వేలాడకట్టిన ఎడల, పిల్లలు నివానంగా ఆకుతింటూ అవి జీర్ణించుకోవటానికి అలవాటు పడతాయి. అదే విధంగా సులువుగా జీర్ణమయ్యే పిల్లల దాణా తొట్టిలో ఉంచిన ఎడల పిల్లలు దాణాకి అలవాటు పడతాయి. పిల్లలకు ఇచ్చే దాణా సులువుగా జీర్ణమై అధిక శక్తిని మరియు కావలసిన ఇతర పోషక పదార్థాలను పిల్లలకు సమకూరుస్తుంది.

పోషకాహార లోపాల వల్ల గొర్రెలలో వచ్చు వ్యాధులు - నివారణ

పోషకాహారాల 3

ఆరోగ్యవంతమయిన గొర్రెల మంద కావాలంటే, వాటికి సరిఅయిన పోషక ఆహారం అవసరం. మంచి యాజమాన్య పద్ధతులు విధిగా పాటించాలి. ఈ రోజుల్లో గొర్రె మాంసం చాలా ఖరీదులో ఉన్నది. ఒక కిలో గొర్రె మాంసము నూరు రూపాయల పైనే ఉంటున్నది. అంటే గొర్రెల ద్వారా గ్రామీణ రైతులు లాభం పొందడానికి ఎంతో అవకాశం ఉన్నది. 20 కిలోల బరువున్న గొర్రె 10 కిలోల మాంసాన్ని ఇస్తుంది. అంటే వెయ్యి రూపాయలు ఒక గొర్రెను అమ్మితే వస్తుందన్నమాట. కానీ, ఆ గొర్రె పట్టిన తర్వాత ఎప్పడు సుమారు 20 కిలోల బరువు వస్తుందనేదే ముఖ్యం. ఆలనాపాలనా లేకపోతే గొర్రె తక్కువగా ఉంటుంది. చాలా ఆలస్యంగా కోతకు వస్తుంది. అదే గొర్రె పట్టినప్పటి నుంచి జాగ్రత్తగా పోషకహారాలు సరి అయిన మోతాదులో సక్రమంగా ఇస్తే తక్కువ కాలంలో వాటి బరువు పెరిగి మాంసోత్పత్తికి తయారవుతాయి. సంవత్సరం పొడవునా గొర్రెను పచ్చిక బయళ్లలో పెంచడం వల్ల సత్ఫలితాలను పొందలేరు. ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు అంటే వేసవి కాలంలో గొర్రెలు మేయడానికి పచ్చిగడ్డి గాని, ఎండుగ్రాసాలు గాని ఉండవు. అప్పడు వాటి పెరుగుదల ఆగిపోతుంది. రైతులలో గొర్రెలను పెంచడంలో నూతన మార్పులు రావాలి. పోషక విలువలు లేని ఆహారం పెట్టడం వల్ల గొర్రెలలో పెరుగుదల తగ్గడమే కాక, కొన్ని వ్యాధులకు లోనవుతాయి. కనుక ఆరోగ్యంగా, బలంగా వున్న గొర్రెలను పెంచాలంటే వాటి ఆహారం సుపోషకంగా, సుసంపన్నంగా ఉండాలి. ఆరోగ్యంలో సరిఅయిన శక్తి, మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమినులు ఉండాలి.

1. శక్తి

గొర్రెల పెంపకంలో అతి కష్టమైనది వాటికి సరి అయిన మోతాదులో ఆహారంలో శక్తిని ఇవ్వడం. ఇది ఎక్కువ అయినా, తక్కువయినా కష్టమే. ఆహారంలో శక్తి లోపం వల్ల గొర్రెలలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. శక్తిహీనమైన ఆహారం ద్వారా గొర్రెల ఎదుగుదల తగ్గుతుంది, బరువు తగ్గుతుంది. చివరకు మరణిస్తుంది. అడగోర్రెలలో సంతానోత్పత్తి, పాల ఉత్పాదకత తగ్గి, చివరకు చనిపోతాయి. పోతులలో కూడా సంతానోత్పత్తికి అవరోధం ఏర్పడుతుంది. ఆహారం ద్వారా శక్తి అందని గొర్రెలు అనేక వ్యాధులకు లోనవుతాయి. పరాన్నజీవుల ద్వారా బెడద ఎక్కువ అవుతుంది. గొర్రెల ఆహారంలో శక్తి పచ్చగడ్డి, ఎండు గ్రాసాలు, చెట్ల ఆకుల ద్వారా సరిపోకపోతే వాటి ఆహారంలో గింజ ధాన్యాలయిన జొన్న మొక్కజొన్న రాగి, సజ్జలు లాంటివి గాని, వరి తవుడు లేక గోధుమ తవుడు ఇస్తే శక్తిలోపం ఉండదు. ఈ ధాన్యాలను గొర్రెల బరువుకు తగినట్లుగా అందచేయాలి. వీటిని పొడిగా ఇవ్వనక్కరలేదు. కనుక గొర్రెల బరువు పెరుగట కోసం, చూలు సరిగా నిలవడానికి, పాలుత్పాదన సక్రమంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఆహారంలో శక్తి సరి అయిన మోతాదులో ఉండాలి. పిండి పదార్ధాలు, పీచు పదార్థాలు, కొవ్వు పదార్థాల ద్వారా గొర్రెకు ఆహారం ద్వారా శక్తిని అందజేయవచ్చు.

2. మాంసకృత్తులు

శక్తి తర్వాత గొర్రెల ఆహారంలో మాంసకృత్తులు చాలా అవసరం. ఆహారంలో అమైనో ఆమూలు లోపిస్తే, కణాలలో మాంసకృత్తుల ఉత్పాదకత తగ్గుతుంది. ఆహారం తీసుకోవడం తక్కువ అవడమేగాక, ఆహారాన్ని వినియోగించుకొనే సామర్ధ్యం కూడా తగ్గుతుంది. మాంసకృత్తులు లేక అమైనో ఆమూల లోపం అతిగా ఉంటె గొర్రెలలో అజీర్ణం ఉంటుంది. బరువు తగ్గుతుంది. రక్తహీనత, శరీరంలో నీరు చేరడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం జరుగుతుంది.

కనుక మాంసకృత్తులు గొర్రెల ఆహారంలో సరి అయిన మోతాదులో ఉండాలంటే వాటికి కాయజాతి పశు గ్రాసాలు (లెగ్యము జాతి) విరివిగా అందజేయాలి. మాంసకృత్తులు అధికంగాను విరివిగాను లభ్యమయ్యే పచ్చి గ్రాసాలయిన బొబ్బర్లు, జనుము, పిల్లిపెసర, ఉలవలు గాని సూబాబులు, అవిశెచెట్ల ఆకులు గొర్రెల ఆహారంలో ఇస్తే మాంసకృత్తుల లోపం ఉండదు. నూనె తీసిన శనగచెక్క, కొబ్బరిచెక్క, పత్తి గింజలు, ప్రొద్దుతిరుగుడు పూవు నుంచి చెక్కలు గొర్రెల ఆహారంలో వాడితే అమైనో ఆమూల, మాంసకృత్తుల లోపాలను భర్తీ చేస్తాయి. ఎదిగిన గొర్రెల ఆహారంలో యూరియా ఇస్తే వాటి అరల పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు యూరియాను అమ్మోనియాగా మార్చి తమ శరీరంలో మాంసకృత్తుల నిర్మాణానికి వాడుకుంటాయి. ఈ సూక్ష్మజీవుల మాంసకృత్తులను గొర్రె తన శరీర అవసరాలకు వాడుకొంటుంది.

గొర్రెల ఆహారంలో శక్తి, మాంసకృత్తులు సరి అయిన మోతాదులోనేకాక సరిఅయిన నిష్పత్తిలో ఉండాలి. ఈ రెంటిలో ఏది ఎక్కువయినా, తక్కువయినా గొర్రెల పోషణలో లోటు వచ్చి రైతుకు నష్టం కలుగుతుంది. త్వరితగతిన అధిక మాంసోత్పత్తికి వాటి ఆహారంలో తగు మోతాదులో శక్తి, మాంసకృత్తులు ఉండాలి. గ్రామాలలో రైతులు తమ గొర్రె మందలను బయట ప్రదేశాలలో ఎంత మేపినా, గొర్రెల బరువు పెరగడం కష్టం. కనుక కాయజాతి పశు గ్రసాలు, ధాన్యపుగింజలు, నూనెతీసిన చెక్కలను గాని కొద్దిగైనా ఇస్తే గొర్రెలలో జబ్బులు రావు. పెరుగుదల అధకంగా ఉండి, మాంసోత్పత్తికి త్వరగా ఎదుగుతాయి.

3. ఖనిజ లవణాలు

గొర్రెల శరీరంలో అనేకమయిన ఖనిజ లవణాలున్నప్పటికీ, వాటికి అత్యవసరమైన 15 లవణాలను గుర్తించారు. ఎక్కువ మోతాదులో ఆహారం ద్వారా కావలసినవి, మరియు ఎక్కువగా గొర్రెల శరీరంలో ఉండే లవణాలు సోడియం, క్లోరిన్, కాలియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాషియం, గంధకం. అతి తక్కువ మోతాదులో ఆహారం ద్వారా కావలసిన ఇతర 8 ఖనిజ లవణాలు - అయోడిను, ఇనుము, మాలిబ్లినము, రాగి, కోబాలు, మాంగనీసు, తత్తునాగం (జింక్) మరియు సెలీనియం. గొర్రెల ఆహారంలో ఏ ఖనిజ లవణం ఎంత మోతాదులో ఉండాలి అని చెప్పడం చాలా కష్టము. కొన్ని లవణాలు ఆహారంలో ఎక్కువయితే, ఇతర లవణాల వినియోగాన్ని అడ్డుకుంటాయి. విటమినులు, ఖనిజ లవణాలు కూడా కలిసి పనిచేస్తుంటాయి. గొర్రెల ఆహారంలో ముఖ్యంగా ఉప్ప (సోడియం, క్లోరిన్), కాలియము, భాస్వరం ఉండాలి. మూడింట ఒక భాగం కాయజాతి పశు గ్రాసాలు గొర్రెలు తింటే, కాలియం సమృద్ధిగా అందుతుంది. ఎముకల పొడిని ఆహారంలో ఇస్తే భాస్వరం లోపం ఉండదు. సముద్రపు ఉప్ప గొర్రెలకు అందుబాటులో ఉంటే, సోడియం, క్లోరిన్ లోపాల వల్ల వ్యాధులు రావు. మార్కెట్టులో ఖనిజ లవణ మిశ్రమాలు పొడి రూపంగాను, ఇటుకల రూపంగాను లభ్యమవుతున్నాయి. త్రాగునీరు విరివిగా లభిస్తే ఖనిజ లవణాలు అధికంగా గొర్రెలు తీసుకున్నా కూడా ఏ ప్రమాదం ఉండదు. దేశంలో అన్ని ప్రాంతాలలో ఉన్న గొర్రెలకు ఒకే విధమయిన ఖనిజ లవణ మిశ్రమం రూపొందించడం కష్టం. ఎందుకంటే భూమిలోని ఖనిజాలు ప్రాంతానికి ప్రాంతానికి తేడా ఉంటుంది. కొన్ని భూములలో లవణాలు లోపిస్తే, మరికొన్ని చోట్ల అధికంగా ఉండి విషప్రభావాలను చూపిస్తాయి. కనుక నేల, నీరు, పెరుగుతున్న గ్రాసాలలో ఉన్న ఖనిజలవణాలను బట్టి గొర్రెల పెరుగుదల, ఆరోగ్యం, వ్యాధి నిరోధక శక్తి ఆధారపడి ఉంటుంది.

4. విటమినులు

మూడునెలల వయస్సు దాటిన గొర్రెల ఆహారంలో బి-కాంప్లెక్స్ విటమినులు అవసరం లేదు. పచ్చికబయళ్లలో సూర్యరశ్మి కలిగిన ప్రాంతాలలో విటమిను-ఎ మరియు డి లోపాలు రావు. విటమిను-బి 12 తయారీకి గొర్రెల ఆహారంలో కోబాలు ఖనిజ లవణం అవసరం. రెండు నుంచి 8 వారాల వయస్సు ఉన్న గొర్రెపిల్ల ఆహారంలో విటమిను-ఇ లేక సెలీనియం లోపిస్తే వాటిలో తెల్లకండరాల జబ్బు (White muscle disease) వసుంది.

ఆహార సంబంధమయిన కొన్ని ముఖ్యమయిన వ్యాధులు

1. మూత్రనాళాలలో రాళ్ల జబ్బు

ఈ జబ్బులో ఖనిజలవణాలు రాళ్లుగా మారి మూత్ర నాళాలలో చేరి మూత్రాన్ని విసర్జింప చేయడాన్ని అరికడుతుంది. ఈ రాళ్లు అడ్డుపడటం వలన గొర్రెలు చనిపోవచ్చును. ఈ జబ్బు ఆహారానికి సంబంధించిన జబ్బు. ఆహారంలో కాల్షియం, బాస్వరం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటే గొర్రెపిల్లలలో మూత్ర నాళాలలో రాళ్లు ఏర్పడటానికి వీలవుతుంది. కాలియము, భాస్వరం ఆహారంలో 2:1 శాతంలో ఉంటే ఈ వ్యాధి నివారించవచ్చు. భాస్వరం ఆహారంలో తక్కువగా ఉండేటట్లు చూడాలి. పచ్చిగ్రాసాలలో ఎక్కువ సిలికా ఉంటే కూడా గొర్రెలలో ఈ వ్యాధి రావచ్చు. వీటి ఆహారంలో 4 శాతం ఉప్ప ఇచ్చినట్లయితే మూత్రాశయములో రాళ్లు తయారినీ ఆపవచ్చును. త్రాగడానికి ఎక్కువగా నీరు అందుబాటులో ఉంటే రాళ్లు మూత్రనాళాలలో కరగడానికి వీలవుతుంది.

2. చూలు గొర్రెలలో విషపు జబ్బు

దీనినే కిటోసిన్, అసిటోనీమియా అంటారు. చూలు ఆఖరిదశలోను, గొర్రె గర్భంలో కవల పిల్లలు ఉన్నట్లయితేను ఈ జబ్బు వస్తుంది. ఈ వ్యాధిలో గొర్రెకు ఆకలి ఉండదు. మందనుండి వేరవుతాయి. 'చివరి దశలో చూపు మందగిస్తుంది. పక్షవాతం వల్ల, బలహీనం వల్ల నిలబడలేవు. చూలు ఆఖరిదశలో గొర్రెల ఆహారంలో శక్తి సంపూర్ణంగా ఉండాలి. దానితో గొర్రె బరువు పెరుగుతుంది నోటిద్వారా 200 నుంచి 300 మి.లీ. ప్రొపిలిన్ గైకాల్ లేదా గ్లిసరాలు గొర్రెలకు త్రాగించితే కూడా ఈ వ్యాధి నయం అవుతుంది. కనుక చూలు కాలంలో గొర్రెల ఆహారంలో పోషక పదార్ధాలలోపం లేకుండా చూస్తే పుట్టిన కవలపిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. తల్లీ పిల్లల వలన రైతుకు ఆదాయం వృద్ధి అవుతుంది.

3. గొర్రెలలో మెదడు మెత్తబడి వచ్చు పోలియో

ఈ జబ్బు ధయమిను అనే బి-విటమిను లోపం వల్ల గొర్రెలలో వస్తుంది. గొర్రెలు మత్తుగా ఉంటాయి, అర్థరహితంగా నడుస్తుంటాయి. ఆకలి ఉండదు. గుండ్రంగా తిరుగుతాయి, చివరికి అంధత్వము, పక్షవాత లక్షణాలు కనిపిస్తాయి. ఈ జబ్బు అన్ని వయస్సుల రకాల గొర్రెలలో ధయమిను లోపంవల్ల వస్తుందని తెలిసింది. 200 నుంచి 500 మి.గ్రా, ధయమిను రక్తనాళాలలోనగాని, చర్మం క్రిందగాని, కండరాలలోగాని ఇస్తే జబ్బు నయం అయిపోతుంది. కనుక జబ్బు మదరకుండా ఉన్నప్పడు ధయమిను ఇంజక్షను ఇవ్వడం ఉత్తమం.

మామూలుగా గొర్రెలలో సూక్ష్మజీవుల ద్వారాగాని, సూక్ష్మాతి సూక్ష్మజీవుల ద్వారాగాని, వచ్చే వ్యాధులు త్వరితగతిన తమ ప్రభావాన్ని చూపిస్తాయి. మందలో చాలావరకు గొర్రెలు ఈ జబ్బులకు లోనవుతాయి. రైతుకు అమితమైన ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. వీటిని మందుల ద్వారా, టీకాల ద్వారా నివారించవచ్చు

అదే పోషకాహార లోపాలవల్ల వచ్చే వ్యాధుల వల్ల గొర్రెలలో లక్షణాలు త్వరగా స్పష్టంగా కనిపించవు. మేత మేయకపోవడం, మందనుంచి వేరవడం, ఏ విషయంలోను ఆసక్తి లేకపోవడం, నెమరు వేయకపోవడం వంటి లక్షణాలు నెమ్మదిగా తెలుస్తాయి. మందలో అన్ని జీవాలు ఒకేసారి పోషకాహార లోపాల వల్ల బాధకు గురికానక్కరలేదు. రైతుకు ఈ విషయాలలో పరిజ్ఞానం తక్కువ కనుక, సమీపంలో ఉన్న పశువైద్యుడిని తక్షణం సంప్రదించి గొర్రెల వ్యాధి ఏమిటో నిర్ధారణ చేయించి తగిన చర్యలు చేపట్టాలి. బయళ్లలో మేత బొత్తిగా లేనపుడు, మిశ్రమ దాణాను కొని గొర్రెలకు వేయాలి. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేయడం ఖర్చుతో కూడుకొన్న పని.

కనుక వ్యాధి రాకుండా నిరోధించడానికి పోషకాహారాలను గొర్రెలకు ఇవ్వాలి. అశ్రద్ధ చేస్తే రైతుకు అమిత నష్టం. మందులతో ఈ ఆహార సంబంధ వ్యాధులు నయం కావు. కనుక మాంసోత్పత్తి గొర్రెల ద్వారా అధికం చేసి రైతు ఆర్థికంగా లాభం గడించాలంటే పోషకాహార పదార్థాలను సమతుల్యంగా వాటికి అందుబాటులో అన్ని కాలాలలో ఉంచాలి. కేవలం బీళ్లలో గడ్డి, చెట్టు, చేమలు, ముళ్లదిబ్బలు, ఆకులు అలముల ద్వారా గొర్రెలను పోషించినట్లయితే రైతుకు నష్టము రాకపోయినా, గిట్టుబాటు ధర రాదు. గొర్రెలు కోతకు రావడానికి చాలా ఆలస్యం అవుతుంది.

ప్రస్తుత మార్కెటు పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ గొర్రెల పోషణలో మార్పులు చేర్పులు తక్షణం చేపట్టాలి. షెడ్లలో కోళ్ల పెంపకం ఎలా లాభాలను సాధించిందో అలాగే గొర్రెలను కూడా పోషించడానికి శాస్త్రీయ దృక్పధాన్ని అలవరచుకోవాలి. పాడిపరిశ్రమ, కోళ్ల పరిశ్రమల లాగే గొర్రెల పరిశ్రమ దేశంలో అభివృద్ధి చెందాలంటే రైతులు నూతన పద్ధతులను పాటిస్తూ పోషకాహారాలను గొర్రెలకు అందించేటట్లు చేయడానికి ప్రయత్నాలు చేయాలి. ఆరోగ్యవంతమయిన, పెరుగుదల అధికంగా ఉన్న గొర్రెలను శాస్త్రీయ అవగాహనతో పోషించినట్లయితే, చిన్న సన్నకారు రైతులు తమ ఆర్థిక వనరులను ఇతోధికంగా అభివృద్ది చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంది. ఖర్చుకు తగిన ఫలితం, ప్రతిఫలం ఉంటాయి అని రైతు నమ్మాలి.

గొర్రెల ద్వారా మాంసోత్పత్తిని అధికం చేయడానికి పోషక విలువలున్న ఆహారపదార్థాలను తయూరు చేసిగాని, మార్కెటులో అందుబాటులో ఉంటే కొనిగాని గొర్రెలకు మేపినట్లయితే వ్యాధులు రావు. రైతుకు లాభాలు తప్పకుండా వస్తాయి.

ఆరోగ్య పరిరక్షణ

తల్లి గొర్రెలను మేతకు పంపిన తరువాత వేపాకు, లేత గడ్డి లేదా పిల్లల దాణా వేసి అన్ని పిల్లలు ఆరోగ్యంగా ఉన్నదీ లేనిది చూడాలి. పిల్లల దడిలో క్రింద వరి గడ్డి పరచిన ఎడల వెచ్చగా ఉండి మట్టి తినడానికి వీలుపడదు. దడి రొచ్చుగా మరియు చీకటిగా ఉంచకూడదు. శుభ్రమైన గాలి ఎల్లవేళల ప్రసరిస్తుండాలి. మూడు నెలల వయస్సు దాటిన తరువాత మొదటిసారి నట్టల మందు త్రాపాలి. నట్టల మందు త్రాపేటప్పడు ఊపిరితిత్తుల్లోకి మందు పోకుండా జాగ్రత్తగా తాపాలి. నట్టల మందు త్రాపిన 10-15 రోజుల వ్యవధిలో చిటుక వ్యాధి టీకా మందు ఇవ్వవలసి ఉంటుంది. తరువాత 15 రోజులకు రెండవ డోసు టీకా రోజుల వ్యవధిలో. చిటుక వ్యాధి టీకా ఇచ్చిన 15-30 రోజుల తర్వాత బొబ్బ రోగానికి టీకా మందు ఇవ్వవలసి ఉంటుంది. ఈ శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ గొర్రె పిల్లలను పెంచినటైతే పెరుగుదల బాగా ఉంటుంది.

మూడు నెలల వయస్సు వచ్చిన తరువాత (దాదాపు 12-14 కిలోల బరువు తూగే పిల్లలు) ఘనాహారం తిని జీర్ణించుకొనే శక్తి పిల్లలకు వస్తుంది. అప్పడు పిల్లలను తల్లి నుండి వేరుచేసి ఒక మందగా మేపాలి. ఈ వయస్సులో పిల్లలను దాదాపు 8-10 గం. బయట మేతకు పంపుతూ, ఉదయం లేదా సాయంత్రం 150 గ్రా. దాణా లేదా అవసరం మేరకు వేరుశనగ/ఉలవ/కంది/శనగ/మినుము/పెసర పొట్టు మేపినట్లయిన ఆరు నెలల వయస్సు వచ్చేటప్పటికి దాదాపు 18-20 కిలోల బరువు పెరిగి మార్కెట్టులో మంచి ధర పలక గలవు.

గొర్రెలకు వచ్చే ముఖ్యమైన వ్యాధులు - వాటి చికిత్స మరియు నివారణ : వివిధ రకాల వ్యాధి కారక క్రిములు గొర్రెలను ఆశ్రయించి నష్టం కలిగిస్తాయి.

సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు

చిటుకు వ్యాధి (ఇ.టి.). ఆంత్రాక్స్ లేదా నెరుడు వాపు లేదా నల్ల జాడ్యం, ఊపిరితిత్తుల్లో నెమ్మ లేదా నిమోనియా, పొగాళ్ళ లేదా బురద పుండ్లు లేదా మితువకాళ్ళ (ఫుట్రాట్), గొంతువాపు వ్యాధి (హెచ్.ఎస్. వ్యాధి)

వైరస్ వల్ల కలిగే వ్యాధులు

గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్ వ్యాధి), నీలి నాలుక (బూటంగ్), బొబ్బరోగం/ అమ్మతల్లి (పీప్ ఫాక్స్), పి.పి.ర్ (మేకల ప్లేగు), ఆస్యపుండ్లు / నోటి పండు.

ఏకకణ జీవుల వల్ల కలిగే వ్యాధులు

రక్తపారుడు లేదా కాక్సీడియోసిస్

అంతరపరాన్నజీవులు

జలగలు, ఏలికపాములు, బద్దె పరుగులు

జీవాలను పైన తెలిపిన వ్యాధుల నుండి రక్షించుకోవటానికి వ్యాధి కారకాలు, చికిత్స మరియు నివారణ గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

చిటుకు వ్యాధి

తొలకరి వరాలు మొదలైన వెంటనే గొర్రెలకు సోకే వ్యాధుల్లో ఇది చాలా ముఖ్యమైనది. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలి వుంది. ఈ వ్యాధి క్లాస్టీడియం జాతి సూక్ష్మజీవుల వల్ల వర్షాకాలం, తొలకరి వరాలు పడిన వెంటనే సంక్రమించే అవకాశం ఉంది. ముఖ్యంగా బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్న గొర్రె పిల్లలకు మరియు లేత వయస్సు జీవాలకు ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి ఆరోగ్యంగా మరియు బలిష్టంగా ఉండే చిన్న వయసు జీవాల్లో ఎక్కువగా వస్తుంది. బాగా మేస్తున్న జీవం ఒకేసారి ఎగిరిపడి కొట్టుకొని మరణించడం. ఒకేసారి ఎక్కువ తిన్న లేదా పాలు త్రాగిన జీవాల్లో కడుపులో ఎక్కువ శాతం పిండి పదార్థాలు వుండడం వలన క్రిమికారకాలు వృధి చెంది విషపదార్థం ఉత్పత్తి అవుతుంది. కడుపును కాళ్ళతో తన్నడం, కడుపునొప్పి, కడుపుబ్బటం నల్లగా దుర్వాసన వచ్చే పారుడు, నోటి నుండి నురగ రావటం, కొన్ని జీవాల్లో ఫిట్స్ లాంటి లక్షణాలు కనబడటం, గుండ్రంగా తిరగటం, కుప్పకూలి పోవటం జరుగుతుంది.

రోగనిర్ధారణకు పరీక్షలు

చనిపోయిన గొర్రెలను కోసి చూసిన మూత్రపిండాలు మెత్తబడి ఉంటాయి. గుండెపొరలపై పొట్టమీద, చిన్నపేగు మొదటి భాగంలో మరియు ఊపిరితిత్తులపై రక్తస్రావాలు వుంటాయి. పొట్టలో మరియు ప్రేగుల్లో ఆకుపచ్చ ద్రవం ఉంటుంది.

చికిత్స

పశువైద్యుని సలహామేరకు ఆక్సిటెట్రసైక్లిన్ మందును 5-10 మిల్లిగ్రాములు ఒక కిలో బరువుకు లెక్కకట్టి ఇవ్వాలి (షుమారు 3-5 మి.లీ.) 50 మిల్లిగ్రాముల పొటాషియం పర్మాంగనేట్ను 100 మి.లీ. నీటిలో కలిపి త్రాగించాలి.

నివారణ

ఈ వ్యాధికి టీకా మందుకలదు. వి.బి.ఆర్.ఐ. సంస్థ తయారు చేసిన టీకా మందును ప్రభుత్వ పశువుల ఆస్పత్రిలో ఉచితంగా ఇస్తారు. 2.5 మి.లీ. మందును చర్మం కింద ఇవ్వాలి. మొదటిసారి టీకా మందును 3 మాసాల వయస్సు నిండిన గొర్రె పిల్లలకు నట్టల మందు త్రాపిన తరువాత ఇవ్వాలి. మొదటి టీకా ఇచ్చిన 15 రోజులకు బూస్టర్ దోనె మళ్ళీ ఇవ్వాలి. ఆ తరువాత ప్రతి సంవత్సరం మే లేదా జూన్ మొదటి వారంలో క్రమం తప్పక ఇస్తుండాలి.

ఆంత్రాక్స్ లేదా నెరుడు వాపు లేదా నల్ల జాడ్యం

ఆంత్రాక్స్ సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధి. ఈ జబ్బు పాడి పశు వులు, గొర్రెలు మరియు మేకల్లో వస్తుంది. వ్యాధి గ్రస్తమైన పశువుల మాంసం తినడం వల్ల లేదా చర్మం వలచడం లాంటి పనులు చేసిన మనుషులకు కూడా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కలుగచేసే బాసిల్లస్ జాతి సూక్ష్మక్రిములు భూమి లోపల స్పోరుల రూపంలో కొన్ని సంవత్సరాల వరకు ఉండి అనువైన పరిస్థితుల్లో ముఖ్యంగా వరాకాలం మొదలైన వెంటనే పశువులను ఆశ్రయించి వ్యాధి కలుగజేస్తాయి.

లక్షణాలు

అకస్మాత్తుగా మరణించడం, తీవ్రమైన జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, తూలి పడడం, కాళ్ళు పడిపోవడం మరియు ఉన్నట్లుండి కుప్పకూలి చనిపోవడం, చనిపోయిన జీవాల్లో నోరు, చెవులు, ముక్కులు, మలద్వారం, యోని నుండి నల్లని రక్తం గడ్డ కట్టకుండా కారుతుంది. చనిపోయిన జీవాల శరీరం త్వరగా ఉబ్బిపోయి కుళ్ళి పోతుంది.

ముఖ్యగమనిక

ఈ వ్యాధితో చనిపోయిన జీవాలను శవ పరీక్ష (పోష్ణుమార్టమ్) చేయకూడదు. చనిపోయిన పశు వుల లేదా చివరి దశలో ఉన్న పశువును కోసినట్లైతే, సూక్ష్మక్రిముల స్పోరులు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తాయి. కావున శవ పరీక్ష చేయకూడదు.

ఒకవేళ పొరపాటున కోసిన ఎడల స్పీన్ చాలా పెరిగి ఉంటుంది. కాలేయం మరియు మూత్రపిండాలు బాగా ఎర్రబారి ఉంటాయి. శరీరంలోపల ఎర్రని ద్రవం చేరి ఉంటుంది. పొరపాటున జీవాలను చనిపోయిన తరువాత లేదా చివరి దశలో కోసిన ఎడల వెంటనే గొయ్యి త్రవ్వి పూడ్చి సున్నం చల్లాలి. అదే విధంగా ఆ ప్రాంతమంతటా సున్నం చల్లాలి.

 

చికిత్స

వ్యాధి నిర్ధారించిన యెడల వ్యాధిగ్రస్తమైన జీవాలకు క్రింది వానిలో ఏదైనా ఒక ఆంటిబయాటిక్ 5 రోజులు ఇవ్వాలి. ఆక్సిటెట్రసైక్లిన్ 5-10 యమ్.జి./ఒక కిలో బరువు చొప్పన లేదా పెన్సిలిన్ 10,000-20,000 ఐ.యు./ కిలో బరువు చొప్పన లేదా ఆంఫిసిల్లిన్ 5-10 యమ్.జి./కిలో బరువు చొప్పన ఇవ్వాలి.

నివారణ

వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం టీకా మందు ఇవ్వాలి. ఏదైన ప్రాంతంలో ఆంత్రాక్స్ వ్యాప్తి చెందినట్లు వార్త వచ్చిన వెంటనే మిగిలిన అన్ని పశువుల్లో టీకాలు ఇవ్వాలి. టీకా మందు 1 మి.లీ. చర్మం క్రింద ఇవ్వాలి. ఈ టీకా మందును ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది.

చనిపోయిన లేక వ్యాధి గ్రస్తమైన పశువుల మాంసం తినడంవల్ల మరియు చర్మం ద్వారా ఈ రోగం మనుషుల్లో కూడా వస్తుంది. వ్యాధి సోకిన మనుషుల్లో నిమోనియాతో కూడిన జ్వరం లేదా చేతులపై చర్మం మీద పండ్లు ఏర్పడవచ్చు.

ఊపిరితిత్తుల్లో నెమ్మ/ గుండె నెమ్మ (నిమోనియా) : గొర్రెల్లో ఊపిరితిత్తులకు నెమ్మ లేదా గుండె నెమ్మ లేదా నిమోనియా వ్యాధి తరచూ వస్తుంది. వరాకాలం మరియు చలికాలంలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ. వైరస్ లేదా ఇతర సూక్ష్మక్రిముల ద్వారా వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు

జ్వరం, దగ్గు, ముక్కునుంచి చీమిడి / నీరు కారడం, ఎగ శ్వాస, రాత్రులందు మంద దగ్గరకు పోయిన ఎక్కువ సంఖ్యలో జీవాలు కంగున దగ్గుతుంటాయి.

రోగ నిర్ధారణ

చనిపోయిన పశువులను కోసి చూసిన దొబ్బ గట్టిబడి ఉంటుంది. ఊపిరితిత్తుల ముక్కకోసి నీటిలో వేసిన మునుగుతుంది.

చికిత్స

స్టెప్లో పెన్సిలిన్ 4-5 మి.గ్రా. లేదా జంటామైసిన్ 2-4 మి.గ్రా/కిలో బరువు చొప్పున లేదా సిప్రాప్లాక్సిన్ 5-10 మి.గ్రా/కిలో బరువు చొప్పున ఇవ్వాలి.

నివారణ

జీవాలుండే పాకను పొడిగా, గాలి వెలుతురు సమృద్ధిగా సోకేట్టు నిర్మించాలి. దగ్గుతున్న జీవాలను గుర్తించి వీలైనంత త్వరగా చికిత్స చేయించాలి.

పాగాళ్ళు లేద మితువ కాళ్ళ లేదా ఫుట్రాట్

వర్షాకాలంలో గొర్రెల్లో పాగాళ్ళ దాదాపు అన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. జీవాలు ఉంచేపాకలో, ఆరుబయట మరియు దడిలో రొచ్చు మరియు చిత్తడిగా ఉండటం వల్ల మరియు పచ్చిక బయళ్ళలో కూడా బురద లేదా నీరు ఉండడంవల్ల గిట్టల మధ్య సూక్ష్మక్రిములు చేరి అభివృద్ధి చెంది ఈ వ్యాధిని కలుగచేస్తాయి.

లక్షణాలు

జీవాలు కుంటడం, గిట్టలు మొత్తపడటం, గిట్టల సందులో పుళ్ళు, దుర్వాసన, జ్వరం తీవ్రంగా వచ్చినపుడు గిట్టలు ఊడిపోవటం కాళ్ళకు వ్యాధి సోకినపుడు మోకాళ్ళ మీద నిలబడడం జరుగుతుంది. చికిత్స : జీవాలు పాక నుండి బయటకు వచ్చే గేటు దగ్గర లోతు తక్కువగా ఉండి, వెడల్పు మరియు పొడవుగా ఉండే గుంత సిమెంటుతో నిర్మించి అందులో 8% పొటాషియం పర్మాంగనేట్ను లేదా 5% ఫార్మలిన్ (ద్రావణాన్ని నింపాలి. ఇట్టి గుంతలో అన్ని జీవాలను 3 నుంచి 5 నిమిషాలు నిలబెట్టిన ఎడల పాగాళ్ళ పూర్తిగా నివారించవచ్చు. వ్యాధి సోకిన జీవాలకు ప్రొకేయిన్ పెన్సిలిన్ 70,000 ఐ.యు. సైప్లోపెన్సిలిన్ 70 మి.గ్రా/కిలో బరువు చొప్పన ఒకసారి ఇచ్చిన సరిపోతుంది. చికిత్స చేసినా కూడా తగ్గని జీవాలను కోతకు అమ్మివేయాలి.

నివారణ

పాకలో లేదా మంద కట్టే ప్రాంతంలో చిత్తడి/రొచ్చులేకుండా చూడాలి. బురదనీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మే పరాదు. పాక లేదా దడి గేటు దగ్గర వెడల్పాటి సిమెంటు గుంత నిర్మించి 8% పొటాషియం పర్మాంగనేట్ను లేదా 5% ఫార్మలిన్ ద్రావణం ఉంచి, ప్రతిరోజు జీవాలను దీని గుండా నడపాలి. పండ్లకు హిమాలై వంటి మందును పూయాలి.

గొంతు వాపు వ్యాధి (హెచ్.ఎస్.)

ఇది పాశ్చురెల్లాజాతికి చెందిన సూక్ష్మజీవుల వలన వచ్చే వ్యాధి. రక్తంలో వ్యాధి జనక సూక్ష్మజీవులు మరియు వాటి విషపదార్ధాలు చేరే అంటువ్యాధి. వ్యాధి గ్రస్తపశువుల లాలాజలంతో కలుషితమైన మేత, నీరు ద్వారా ఆరోగ్యంగా వున్న పశువులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జూన్-అక్టోబర్ నెలల్లో వ్యాధి సంక్రమిస్తుంది.

లక్షణాలు

తల, గొంతు, ఛాతి భాగాల్లో చర్మం క్రింద నీరు చేరటం వలన పూర్తిగా వాచి పోయి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత బాగా పెరుగుతుంది. (102-106" ఫారన్హీట్). నోటి నుండి ఎక్కువగా లాలాజలం కారుతుంది. కళ్ళు ముక్కు నుండి కూడా ఎక్కువగా నీరు కారుతుంది. వ్యాధి సోకిన 24-36 గం.లలోపు చికిత్స చేయకపోతే శ్వాస అందక చనిపోతుంది. చనిపోయిన పశువును శవపరీక్ష చేసి గొంతు వాచిన భాగంలో కోసి చూసినట్లయితే రక్తంతో కలసిన నీరు ఉంటుంది. శరీరంలోని వివిధ అవయవాలు (గుండె, కాలేయం, మూత్రపిండం, ఊపిరితిత్తులు) గుండెను అంటిపెట్టుకొని ఉన్న పొర, రక్తకేశ నాళికల నుండి రక్తస్రావం జరుగుతుంది.

చికిత్స

సల్బాడిమిడిన్/సోడియం సల్బాడిమిడిన్ కిలో బరువుకు 150 మి.గ్రా, చొప్పన సిరలోనికి ఇచ్చినట్లయితే 24 గం|లలోపు దాదాపు లక్షణాలన్నీ తగ్గిపోతాయి. అలాకాని పక్షంలో 24 గంటల తర్వాత ఇదే మందును తిరిగి ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి సోకిన పశువును కాపాడవచ్చు టెట్రాసైక్లిన్ కిలో బరువుకు 5-10 మి.గ్రా. చొప్పన సిరలోనికి మొదటి మూడు రోజులు యిచ్చి తరువాత కండరంలోనికి 3 రోజులు ఇవ్వాలి.

నివారణ

గొంతు వాపు వ్యాధి టీకా 2.5 మి.లీ. చొప్పన చర్మం క్రింద ఆరు నెలల పైబడిన పశువుల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాలి. గొంతువాపు మరియు జబ్బవాపు మిశ్రమ టీకా 5 మి.లీ. చొప్పన 6 నెలలు పైబడిన పశువుల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వడం ద్వారా పశువుల్లో ఈ రెండు వ్యాధులను నివారించవచ్చు.

నీలి నాలుక (బూటంగ్)

వర్షాకాలంలో గొర్రెలకు సూక్ష్మాతి సూక్ష్మజీవుల వల్ల (వైరస్ వల్ల) వచ్చే ಮಿಖ್ಯಮನಿ వ్యాధి నీలి నాలుక, ఈ వ్యాధి మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపించింది. ఈ వ్యాధి కారక వైరస్ క్యూలికాయిడస్ అను దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. టీకా మందు లేనందున ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తి మరియు ఉధృతిని నివారించాలి. సెప్టెంబరు నుండి డిసెంబరు వరకు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

లక్షణాలు

తీవ్రమైన జ్వరం, చిగుళ్ళ వాపు, నోటి లోపల, నాలుక మీద కురుపులు, నాలుక నీలి రంగులోకి మారడం, నోటిలో పళ్ళు ఏర్పడి నోటి నుండి దుర్వాసన రావటం మరియు పశువులు కుంటుతాయి. మడమ చుట్టు వాపు ఉంటుంది. వ్యాధి సోకే కాలంలో చూడి గొర్రెలు ఎక్కువగా ఉండటం వల్ల ఈడుసుకు పోవడం కూడా గమనించవచ్చు.

చికిత్స

జబ్బు పడ్డ జీవాలను వేరు పరచాలి. జబ్బు పడ్డ జీవాల్లో ఇతర వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు ఆక్సిటెట్రాసైక్లిన్ 5-10 యమ్.జి./కిలో బరువుకు వ=ఇవ్వాలి. నోట్రి పండ్లను శుభ్రపరచి బోరోగ్లిసరిన్ పూత మందు వాడాలి. నోటి పండ్ల కారణంగా జీవాలు తినలేవు. కావున రాగి లేదా జొన్న జావ చేసి త్రాగించాలి.

నివారణ

టీకా మందు లేదు కావున క్రింది చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు జబ్బు పడిన పశువులను ఏరివేయాలి. క్యులికాయిడస్ దోమ నివారణకు చర్యలు చేపట్టాలి. చుట్టు ప్రక్కల ప్రదేశాల్లో మురుగు నీరు లేకుండా చూడాలి. సంధ్య వేళలో వేపాకు పొగ పెట్టడం ద్వారా దోమల నివారణ చేపట్టవచ్చు. జీవాల పాకను/మందను కట్టే ప్రదేశాన్ని ఎత్తైన చోట నిర్మించాలి.

గాలికుంటు వ్యాధి (పుట్ అండ్ మౌత్ వ్యాధి)

గాలికుంటు వ్యాధి వైరస్ వలన గొర్రెల్లో అతి తక్కువ సమయంలో అకస్మాత్తుగా కలిగే భయంకరమైన అంటువ్యాధి. ఈ వ్యాధి కాలిగిట్టలు చీలి వున్న పశువుల్లో మాత్రమే కలుగుతుంది. స్పర్శ, గాలి, పశువుల కాపరులు, పాలు పిండే వాళ్ళు మరియు వ్యాధి గ్రస్థ పశువు లాలాజలం ద్వారా వ్యాధి సోక్రిన పశువు నుండి మందలోని ఇతర పశువులకు వ్యాపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ వ్యాధి గాలి ద్వారా చల్లని వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది.

లక్షణాలు

నాలుక, డెంటల్ పాడ్, ముక్కుపైన, కాలి గిట్టల మధ్య పొక్కులు లేదా బొబ్బలు ఏర్పడతాయి. కొన్నిసార్లు పొక్కులు పొదుగు మీద కూడా ఉండి పొదుగు వాపు వ్యాధి కలుగుతుంది. క్రమంగా గిట్టల మధ్య వున్న పొక్కులు వాచి పుండ్లు పడతాయి. పశువు నడవ లేకుండా అవుతుంది. నోటిలోని పొక్కులు చితికిపోయి పుండ్లు ఏర్పడతాయి. దీనితో పశువు మేత తీసుకోలేక నీరసించి పోతుంది. నోటి నుండి లాలాజలం ఎక్కువగా కారుతుంటుంది. పాలిచ్చే పశువుల్లో పాలదిగుబడి అధికంగా తగ్గుతుంది. చూలు పశువుల్లో గర్భస్రావం సంభవించవచ్చు

వ్యాధి తదనంతర లక్షణాలు

ఈ వ్యాధి నుంచి కోలుకున్న పశువులు ఎక్కువ కాలం వాతావరణంలోని వేడిని తట్టుకోలేక అధిక వేగంతో శ్వాసతీసుకుంటాయి. పశువు శరీరంపైన వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ వ్యాధితో చనిపోయిన పశువుకు శవ పరీక్ష చేసినపుడు గుండెపైన పచ్చటి చారలు గమనించవచ్చు.

చికిత్స

నోట్లోని గిట్టల మధ్య పండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం లేదా బోరిక్ ఆసిడ్ ద్రావణం లేదా ఆక్రిఫ్లెచిన్ వంటి యాంటి సెప్టిక్ ద్రావణాలతో శుభ్రపరచాలి. నోట్లోని పండ్లకు గ్లిసరిన్ను పూయాలి. అదేవిధంగా గిట్టల్ మధ్య పండ్లకు సల్ఫర్ ఆయింట్మెంట్ను పూయాలి. గంజిని త్రాగించాలి.

నివారణ

ప్రభుత్వం వారు సరఫరా చేసే గాలి కుంటు వ్యాధి టీకా 5 మి.లీ. లేదా రక్షా ఎఫ్.ఎమ్.డి. టీకా 1 మి.లీ.ను 6 నెలల వయసులో మొదటి డోస్ ఇచ్చి తిరిగి ప్రతి 6 మాసాల కొకసారి చర్మం క్రింద ఇప్పించాలి.

అమ్మతల్లి / బొబ్బరోగం

ఇది సూక్ష్మాతి సూక్ష్మజీవుల వలన గొర్రెల్లో చలికాలంలో సంక్రమించే అంటువ్యాధి. దీని వలన శరీరంలోని అన్ని ప్రదేశాల్లో పొక్కులు వస్తాయి. ఈ వ్యాధి సోకినందువలన పెద్ద వాటిలో 50% వరకు పిల్లలలో 90% వరకు మరణాలు సంభవిస్తాయి. వ్యాధి వున్న గొర్రెలతో కలసి వున్నప్పడు ఇతర వాటికి నేరుగా స్పర్శ ద్వారా, ఈగలు, దోమలు మరియు ఇతర కీటకాల ద్వారా కూడా వ్యాధి వ్యాపిస్తుంది.

లక్షణాలు

అధిక జ్వరం, చర్మంపైన వెంట్రుకలు తక్కువగా వున్న ప్రదేశాల్లో ముఖ్యంగా ముఖం, చెవులు, తొడలు, పొదుగు మొదలగు చోట్ల బొబ్బలు వచ్చి శరీరమంతా వ్యాపిస్తుంది. నోటిలోని చిగుళ్లపై పూత వచ్చి పుండ్లు పడతాయి. ముక్కు రంధ్రాలు, పెదువుల మరియు శ్వాసకోశంలో పండు వచ్చి నిమోనియా కలిగి చిన్న పిల్లలు అతిగా పారుతూ శ్వాస క్రియ ఇబ్బందివలన చనిపోతాయి. చూడు గొర్రెల్లో గర్భస్రావం జరుగుతుంది.

చికిత్స

వ్యాధి సోకిన గొర్రెలకు సౌకర్యంగా ఉండేటట్లు చూసి గంజి వంటి ఆహారాన్ని ఇవ్వాలి. పండ్లకు వేపనూనె రాయాలి లేదా హిమాక్స్ వంటిపూత మందులు పూయాలి.

నివారణ

వ్యాధి సోకిన వాటిని మంద నుండి వేరుచేసి చికిత్స చేయాలి. అమ్మతల్లి టీకా 1 మి.లీ. చొప్పన మందలో మిగిలిన పశువులకు చర్మం క్రింద ఇవ్వాలి.

పి.పి.ఆర్. లేదా గొర్రెల్లో పారుడు లేదా మేకల ప్లేగు

గొర్రెల్లో మేకల్లో వచ్చే ఈ వ్యాధిని మేకల ప్లేగు (గోట్ ప్లేగు) అని కూడా పిలుస్తారు. ఈ మధ్యనే ఎక్కువ వస్తున్న ఈ వ్యాధి పారామిక్సోవిరిడే జాతికి చెందిన మార్జిల్లి వైరస్ వలన వస్తుంది. పి.పి.ఆర్. వ్యాధిని కలుగచేసే వైరస్కు, ముసరవ్యాధి (ఆర్.పి.)ని కలుగ చేసే వైరస్కు దగ్గరి పోలిక ఉంది. కావున మసర వ్యాధి నిర్మూలన పథకం క్రింద టీకాలు ఇచ్చినంతకాలం పి.పి.ఆర్. వ్యాధి అదుపులో వుంటూవచ్చింది. కాని భారతదేశాన్ని ముసర వ్యాధి నిర్మూలిత దేశంగా ప్రకటించి వ్యాధినిరోధకాలు ఇవ్వడం నిలిపి వేసినప్పటి నుండి పి.పి.ఆర్. ఉధృతి ఎక్కువైంది.

వ్యాధి వ్యాప్తి

జబ్బు చేసిన జీవాలతో పాటు ఆరోగ్యమైన జీవాలు ఉండటం వల్ల జబ్బు చేసిన జీవాలు దగ్గినప్పడు వెలువడే తుంపరలో కూడా వ్యాధి కారక వైరస్లు ఉంటాయి. వ్యాధి సోకిన జీవాలు పారిన పెండ మరియు ముక్కు కళ్ళ నుండి వచ్చే ద్రవాల ద్వారా వ్యాధి వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన జీవాలకు తీవ్రమైన జ్వరం (104" ఫారన్ హీట్) ఉంటుంది. ముక్కునుండి నీళ్ళు కారడం ప్రారంభమై, ఒకటి రెండు రోజుల్లో చీమిడి రూపంలోకి మారుతుంది. కళ్ళు ఎర్రబడి కళ్ళ నుండి నీరు కారుతుంది. నోటిలోపలి పొర దెబ్బతిని, చిగుర్ల మీది పొర సెక్రోసిస్ చెందవచ్చు. ఊపిరి తిత్తులకు వ్యాధి సోకడం వల్ల దగ్గువస్తుంది. స్టెతస్కోపు పెట్టి పరిశీలించిన అసాధారణ శబ్దాలు వినబడతాయి. నీళ్ళగా పారడం 3-4 రోజుల్లో ప్రారంభమవుతుంది. దానితోపాటు మూకస్ లేదా రక్తపు జీర కూడా కనపడుతుంది. జీవాలు నీరసించి వారంలోపల చనిపోతాయి.

చనిపోయిన జీవాల్లో లక్షణాలు

ఊపిరితిత్తులు (దొబ్బ) ఎర్రగా మారి బరువెక్కి గట్టిబడి ఉంటాయి. గాలి వాహిక మరియు ఊపిరితిత్తుల్లో నురగలాగా ఉండవచ్చు. చిన్న పెద్ద ప్రేగులు కలిసే ప్రాంతంలో ప్రేగులు ఎర్రబడి, కొన్నిసార్లు జీబ్రా సారల మాదిరి కనపడవచ్చు. ప్రేగుల్లో లింఫ్ గ్రంథులు ఉబ్బి ఉంటాయి.

వ్యాధి నిర్ధారణకు ప్రయోగశాలకు పంపవలసిన నమూనాలు

తీవ్రమైన జ్వరం సోకిన పశువుల ముక్కు మరియు నోటిలోని ద్రవాలను స్వాబ్ ద్వారా సేకరించి అలాగే చనిపోయిన పశువుల ఊపిరితిత్తులు (దొబ్బ), ప్రేగుల్లోని లింఫ్ గ్రంథులు, నెరడు (ప్లీహం) మరియు కాలేయం (కార్థం) ముక్కల శాంపిల్స్ నిర్ధారణకు పంపాలి.

వ్యాధి చికిత్స

పి.పి.ఆర్. వైరస్ వల్ల సంక్రమించే వ్యాధి కనుక నిర్దిష్టమైన చికిత్స లేదు. కాని వేరే బాక్టీరియా వ్యాధులు చేరి ఇతర రోగాలు రాకుండా దీర్ఘకాలం పాటు పనిచేసే ఆక్సీటెట్రాసైక్లిన్ వాడవచ్చు. నీరసించిన జీవాలకు గూకోజ్ ఎక్కించవచ్చు

వ్యాధి నివారణ

ఈ వ్యాధి టీకా మందును పశుసంవర్థక శాఖ వారు ఉచితంగా జీవాలకు ఇస్తున్నారు. కావున వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో టీకాలను ఇచ్చి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. ఆరోగ్యంగా ఉన్న జీవాలకు చర్మం క్రింద 1 మి.లీ. ఇవ్వాలి. నిండుచూలు పశువులకు టీకా ఇవ్వరాదు.

ఆస్యపుండ్లు / నోటి పండ్లు

సూక్ష్మాతి సూక్ష్మజీవుల వలన గొర్రెల్లో అన్ని కాలాల్లో ముఖ్యంగా చలికాలంలో సంక్రమించే అంటువ్యాధి. ప్రస్తుతం మనదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల గొర్రెల సంతతిలో ఈ వ్యాధి వున్నట్లు నమోదు చేయబడింది.

లక్షణాలు

ముక్కుపైన, పెదవుల పైన కంటిచుటూ పొక్కులు, బొబ్బలు వుంటాయి. పండ్ల వలన పశువు నోరు తెరవలేక పోతుంది. గాయాల నుండి చీము, నెత్తురు కారుతుంది. కంటి నుండి, ముక్కు నుండి చిక్కటి ద్రవం కారుతుంది. నోటి నుండి ఎక్కువ లాలాజలం కారుతుంది. చిన్న పిల్లల్లో వ్యాధి ఎక్కువగా వుండి పాలు త్రాగేటపుడు తల్లికి సంక్రమించి పొదుగు గట్టి వస్తుంది.

చికిత్స

పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో గాయాలను శుభ్రపరచాలి. పొక్కులపైన 5% కాపర్ సల్ఫేట్ను పూయాలి. గంజిని ఆహారంగా త్రాగించాలి.

నివారణ

వ్యాధి సోకిన గొర్రెలను మందనుండి వేరుచేసి చికిత్స చేయాలి. పరిశుభ్రమైన ఆహారాన్ని అన్ని పశు వులకు అందజేయాలి.

గొర్రె పిల్లల్లో రక్తపారుడు లేదా కాక్సీడియోసిస్

గొర్రె పిల్లల్లో ముఖ్యంగా వరాక్రాంలో రక్తపారుడు ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. మందకట్టే ప్రదేశం/పాక అపరిశుభ్రంగా ఉండటం, గాలి వెలుతురు అంతగా సోకకుండా ఉండడం లాంటి కారణాల వల్ల ఈ వ్యాధి కారక కాక్సీడియా అను ఏకకణ జీవాలు అధికంగా అభివృద్ధి చెందుతాయి. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గొర్రె పిల్లలను తల్లి నుండి వేరుచేసి గంప క్రింద కమ్మటం అలవాటు. అలా చేసిన ఎడల అక్కడి ప్రదేశం చిత్తడిగా, చీకటిగా మరియు గాలి ప్రసరించకుండా ఉండటంవల్ల కూడా వ్యాధి కారక క్రిములు అధిక సంఖ్యలో వృద్ది చెందుతాయి.

లక్షణాలు

రక్తంతో కూడిన పారుడు ఆకలి లేక ఆహారం తీసుకొనకపోవడం, గొర్రెపిల్లలు నీరసించి 2-4 వారాల్లో చనిపోవటం, కాక్సీడియా గ్రుడు పేడలో ఉండటం జరుగుతుంది.

చికిత్స

కిలో బరువు ఆంఫ్రాలియిమ్ 50 మి.గ్రా. లేదా నైట్రోపురజోన్ 15 మి.గ్రా. లేదా సల్పమిడిన్ 140 మి.గ్రా. ఇవ్వాలి.

నివారణ

పాకను చిత్తడి / రొచ్చు లేకుండా పొడిగా ఉంచాలి. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి. జబ్బు పడ్డ జీవాలను ఏరివేయాలి. గొర్రె పిల్లలకు దాణ ఇస్తున్నట్లయిన కిలో దాణాకు 25 మి.గ్రా, చొప్పన సల్బమిడిన్ దాణాలో కలపాలి లేదా నైట్రో పురజోన్ 0.04% త్రాగే నీటిలో కలపాలి.

అంతర పరాన్న జీవుల వల్ల పారుడు

గొర్రెల పెంపకంలో అధిక నష్టం కలుగచేసేవాటిలో అంతర పరాన్న జీవులు ముఖ్యమైనవి. గొర్రెలను ఆశ్రయించే పరాన్నజీవుల్లో జలగలు, ఏలిక పాములు మరియు బద్దె పురుగులు ముఖ్యమైనవి. అంతర పరాన్నజీవులు ఆశ్రయించిన జీవాలు నీరసించి, రక్తహీనత ఏర్పడి మరీ నీరసించిపోతాయి. రక్తహీనత వల్ల గొంతు క్రింద వాపు వస్తుంది. అదే విధంగా పారుడు ఉంటుంది. అశ్రద్ధ చేసిన మరణాలు సంభవించవచ్చు. అన్ని కాలాల్లో వస్తుంది. వరా కాలంలో ఉధృతి ఎక్కువ ఉంటుంది. జలగలు, గుండ్రని పరుగులు (ఏలిక పాములు), బద్దెపురుగుల ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది.

లక్షణాలు

జీవాలు బలహీనంగా ఉండి రక్తహీనతతో కళ తప్పి ఉంటాయి. పారుడు, గొంతు క్రింద వాపు, పేడలో పరాన్నజీవుల గ్రుడు ఉండటం గమనించవచ్చు.

చికిత్స

సమయానుసారం డాక్టరు సలహా మేరకు నట్టల మందు త్రాపడం, పేడ పరీక్ష చేసి తదనుగుణంగా సిఫారసు చేసిన మందు వాడటం లేదా ఈ క్రింద పేర్కొన్న మందుల్లో ఏదైనా వాడవచ్చు.

కిలో బరువుకు ఆల్బెండజోల్ 5-10 మి.గ్రా. లేదా లెవామిసోల్ 7.5 మి.గ్రా. కిలో బరువుకు లేదా ఫెన్ బెండజోల్ 5-10 మి.గ్రా. లేదా నిక్లోసమైడ్ 100 మి.గ్రా. లేదా ఐవరెక్టిన్ 200 మి.గ్రా, వాడాలి.

నివారణ

క్రమం తప్పక నట్టల మందు తాపాలి, పేడ పరీక్ష చేసి మందులు వాడాలి. పచ్చిక ప్రదేశాలను మారుస్తూ ఉండాలి. నత్తలను నివారించాలి. పరాన్నజీవుల గ్రుడ్లతో కలుషితమైన మడుగుల్లో లేదా కుంటల్లో నీరు తాపకుండా ఉండాలి. ఖనిజ లవణాలు, విటమిన్లు వున్న సమతులమైన మేతను పశువుకివ్వాలి.

గొర్రెలకు మరియు వాటి పిల్లలకు కావలసిన దాణా ఇంటి దగ్గర చేయదలచిన ఎడల ఈ క్రింది విధంగా తయారు చేయవచ్చు.

ఎదిగిన

గొర్రె పిల్లలకు

మొక్కజొన్న / జొన్నలు

25 పాళ్ళు

50 పాళ్ళు

వేరుశనగ పిండి

32 పాళ్ళు

20 పాళ్ళు

వరి తవుడు

40 పాళ్ళు

17 పాళ్ళు

మినరల్ మిక్చర్

2 పాళ్ళు

2 పాళ్ళు

ఉప్పు

1 పాళ్ళు

1 పాళ్ళు

చేప పొట్టు

100 పాళ్ళు

10 పాళ్ళు

100 పాళ్ళు

టికా మందు / నట్ట మందు త్రపుటకు సమయ సూచిక

జనవరి

అంతర పరాన్న జీవుల నిర్మూలన మరియు పి.పిఆర్ వ్యాధి టికా (మొదటిసారి 3  నెలల వయస్సు దాటినప్పుడు) ఇవ్వాలి.

ఫిబ్రవరి

బొబ్బవ్యాధి టీకాలు

ఏప్రిల్

అంతర పరాన్న జీవుల నిర్మూలన

మే

చిటుక వ్యాధి టీకాలు

ఆగష్టు

అంతరపరాన్న జీవుల నిర్మూలన

అక్టోబర్

బాహ్యపరాన్న జీవుల నిర్మూలన

నవంబర్

గాలికుంటు వ్యాధి టీకాలు (అవసరాన్ని బట్టి)

గొర్రె పొట్టేలు పిల్లల పెంపకం

గొర్రె పొట్టేలు పిల్లల పెంపకంలో ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే, ఈ పెంపకం లాభాసాటిగా ఉంటుంది. వీటి పెంపకంలో లాభ నష్టాలు ఎక్కువగా పిల్లలను కొనుగోలు చేసినప్పటి ధర, దాణా ఖర్చు, పచ్చిగడ్డి పెంచుటకయ్యే ఖర్చు మరియు పెరిగిన పొట్టేలు పిల్లలను మాంసోత్పత్తికి అమ్మేటప్పుడు పలికే ధరపై ఆధారపడి యుంటుంది. వీటి పెంపకంతో తక్కువ కాలంలోనే లాభాలను పొందవచ్చు. మామిడి, జామ, నిమ్మ, మునగ మొదలగు తోటలు కలిగిన వారు కూడా పొట్టేలు పిల్లల పెంపకం చేపట్టవచ్చు. ఏపుగా పెరిగిన పిల్లలను తొమ్మిది మాసాల వయస్సులోనే కోతకు అమ్మివేయవచ్చు. అయితే పచ్చిగడ్డిని (పప్పుజాతి + ధాన్యపజాతి) విరివిగా పెంచి అన్ని కాలాల్లోను మేపాల్సి ఉంటుంది. వయస్సును బట్టి రోజుకు 100 గ్రా. నుంచి 250 గ్రా, వరకు సమీకృత దాణాను ఇవ్వాలి. వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు త్రాగించడం, మేలైన యాజమాన్యం చేపట్టడం వలన గొర్రె పొట్టేలు పిల్లల్లో మరణాల శాతం తగ్గించి లాభాలను పొందవచ్చు.

గొర్రెల, మేకల పెంపకంపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామాలు : "సీనియర్ సైంటిస్ట్ లేదా సైంటిస్ట్ (యల్.పి.ఎమ్), పశు పరిశోధనా స్థానం, పలమనేరు-517 408, చితూరు జిల్లా". ఫోన్ నెం. 08579-252208

 

లేదా

"సైంటిస్ట్ (ఎ.జి.బి.), పశు పరిశోధనా స్థానం, మహబూబ్నగర్ - 509 001". ఫోన్ నెం. 08542-275007

 

లేదా

 

"సీనియర్ సైంటిస్ట్ (యల్.పి.ఎమ్), పశు పరిశోధనా స్థానం, గరివిడి-582 101, విజయనగరం జిల్లా". ఫోన్ నెం. 08952-282458

 

లేదా

 

"సీనియర్ సైంటిస్ట్, పశు పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం. 040-20025442/24002752

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/5/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate