మన రాష్ట్రంలో ఖరిఫ్ లో మొదటి పంట తర్వాత వర్షాధారంగా లేదా ఏ పంట వేయడానికి అనువుగా లేనప్పుడు, తొలి దశలో వున్న పండ్ల తోటలలో ఉలవ పంటను సాగుచేయువచ్చు . ఈ పంటను మహబూబ్ నగర్, నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాల్లో సాగుచేస్తారు.
నీరు బాగా పట్టి ఉంచే చల్కా, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు అనుకూలం. మురుగు నీరు నిల్వ ఉండి ఎక్కువగా చౌడు కల్గిన నేలలు పనికిరావు.
పంటకాలం/అనువైన సమయంసాధారణంగా లేట్ ఖరిఫ్/రాబీకి ముందు మరియు రబీలో పండించవచ్చు. ఆగష్టు రెండవ పక్షం నుండి మొదలుకొని అక్టోబర్ మొదటి పక్షం వరకు వేసుకోవచ్చును. నేల నీరును/తేమను నిలుపుకునే స్వభావాన్ని మరియు ఆయా ప్రాంతాలలో మొదటి పంటను దృష్టిలో వుంచుకొని సకాలంలో విత్తిన మిగులు తేమను లేదా ఆలస్యంగా కురిసే వర్షాన్ని ఆధారం చేసుకొని మంచి పంటను పండించవచ్చును.
రకాలురకం | ఋతువు / పంటకాలం (రోజుల్లో) | దిగుబడి (క్వి/ఎ) | లక్షణాలు |
---|---|---|---|
పి.డి.యం – 1 | 105 | 2-2.5 | గింజలు బూడిద తెలుపు ఉంటాయి. |
పి.జడ్.యం. – 1 | 90-95 | 2-2.5 | గింజలు నలుపు రంగులో ఉంటాయి. |
పి.హెచ్.జి. – 62 | 85 | 2-2.5 | గింజలు నలుపు రంగులో ఉంటాయి. |
పి.హెచ్.జి – 9 | 90-100 | 2-3.0 | గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి. పల్లాకు తెగులును తట్టుకొంటుంది. |
సి.ఆర్.హెచ్.జి – 19 | 80-90 | 3-4.0 | గింజలు బూడిద రంగు కలిగి మొక్కలు మధ్యస్థ ఎత్తు పెరిగి కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. బూడిద తెగులు, పల్లాకు, ఆకు మచ్చ తెగులును తట్టుకొనును. తెల్లదోమను కూడా కొంత వరకు తట్టుకొనును. కాయలు చిట్లవు, బెట్టను కూడా తట్టుకొని అధిక దిగుబదినిచ్చును. |
సాళ్ళ పద్ధతిలో గోర్రుతో ఎదపెట్టినపుడు 8-10 కిలోలు, వెదజల్లి దున్నే పద్ధతిలో ఎకరానికి 12-15 కిలోల విత్తనం వాడాలి.
విత్తనశుద్ధిప్రతి కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండాజిమ్ లేదా థైరమ్ తో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి.
విత్తే దూరంసాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.
మొక్కల సాంద్రతసాళ్ళ పద్ధతిలో విత్తినప్పుడు ఎకరానికి 1,33,333 మొక్కలు ఉండేలా చూడాలి.
సాధారణంగా తొలకరి పంట తీసిన తర్వాత గాని , వర్షాలు తగు స్ధాయిలో కురవనప్పుడు గాని ఉలవలు విత్తడం జరుగుతుంది. కావున భూమిలో తగినంత తేమ చూసుకొని నాగలితో లేదా కల్టివేటరుతో ఒకసారి గొర్రు తోలి దుక్కి మెత్తగా తయారుచేసి విత్తుకోవాలి. నాగలి లేదా గోర్రుతో సాళ్ళ పద్ధతిలో సాళ్ళ మధ్య 30 సెం.మీ. ఎడంలో గింజలు సమంగా పడేటట్లు తగు పదనులో విత్తుకోవాలి.
అంతర పంటలు / పంటల సరళిఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర , మినుము మరియు జొన్న, మొక్కజొన్న తదితర పంటల తర్వాత మరియు తొలకరిలో ఏ పంట వేయకుండా, లేటు ఖరిఫ్ లో ఉలవలు విత్తుకోవచ్చును. అలాగే ఉలవలతో ఇతర అంతర పంటలుగా కాకుండా ఉలవలను పండ్ల తోటలలో అంతర పంటలుగా విత్తుకోన్నచో పచ్చిరోట్ట, పశువుల మేత మరియు భూసారం పెరిగి పండ్ల తోటల ఎదుగుదలకు, దిగుబడికి దోహదపడును.
చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మోళ్ళను రోటావేటర్ తో భూమిలో కలియ దున్నాలి.
జీవన ఎరువులురైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించవలెను. 100 మి.లీ. నీటిలో 10 గ్రా. పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడెర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లర్చవలెను. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాల పై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలియ బెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను. ఈ ప్రక్రియను పాలిథీన్ సంచులను ఉపయోగించి చేసుకోవలెను. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
ఎకరానికి 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టర్ ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తనం విత్తేటప్పుడు గాని సాళ్ళల్లో పడేటట్లు వేసుకొనవలెను. ఈ ఎరువు భూమిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరమును లభ్యమగు రూపంలోకి మర్చి మొక్కలకు అందుబాటులోకి తెచ్చును.
రసాయనిక ఎరువులుఎకరాకు 4 కిలోల నత్రజని, 10 కిలోల పోటాష్ నిచ్చు ఎరువులు వేయాలి. 10 కిలోల యూరియా, 63 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ఎరువులు ఆఖరి దుక్కిలో వేయాలి. భుసార పరీక్షూ ఆధారంగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి.
ఉలవలు వర్షాధారంగా లేదా మిగులు తేమ ఆధారంగా ఎక్కువగా పండిస్తారు. కావున విత్తిన తొలి 30-40 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. కలుపు సమస్యాత్మక ప్రాంతాలలో దుక్కి పై ప్లూక్లోరాలిన్ 45% ఎకరాకు 1 నుండి 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేల పై పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి.
అవసరం మేరకు విత్తన 25-30 రోజుల్లో భూమిలో తేమ తగినంతగా ఉన్నప్పుడు అంతరకృషి చేసి కలుపు నివారించి, బోదె ఎక్కించినచో అడపాదడపా కురిసిన వర్షపు నీరు బాగా ఇంకి పంట దిగుడిని పెంచాడానికి దోహపడును.
సాధారణంగా మరియు వివిధ నేలలలో పండించే పంట కాని అవసరం మేరకు కీలక దశలలో (మొగ్గ, కాయ తయారగు దశ) నీటి తడి ఇచ్చినచో దిగుబడి పెరుగును. పంట కాలంలో సుమారు 250-300 మి. మీ. నీరు అవసరం. బెట్ట పరిస్థితులో పంటలో హరిత వర్ణం తగ్గిన, మొక్కలు సారం కోల్పోయినచొ మేగ్నిషియం క్లోరైడ్ 6 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు మూడు సార్లు 5 రోజులు వ్యవధిలో పిచికారి చేస్తే బాగా ఉపయోగకరంగా ఉండును,.
ఉలవలలో పూత, పిందే సమయంలో కాయ తొలుచు పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. వీటి నష్టపరిచే లక్షణాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు మరియు నివారణ చర్యలు పెసర, మినుములో సూచించిన విధంగా పాటించవలెను.
పంట పరిపక్వత దశలో కాయలు ఆకుపచ్చ నుండి పసుపు రంగుకు మారి ఎండిపోవును. క్రమేపి క్రింది నుండి పైకి ఆకులు కూడా హరితాన్ని కోలోయి పూర్తిగా రాలిపోవును. సుమారు 80% వరకుకాయలు ఎండిన తరువాత పంటను కోసినచో నాణ్యమైన దిగుబడి పొందవచ్చును. పంటను కొడవలితో పూర్తిగా మొదలు వరకు పొడి వాతావరణంలో కోయాలి.
కోసిన పంటను 3-4 రోజుల వరకు పంట చేనులో గాని లేదా కళ్లం పై ఎండనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టిగాని, పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్ తో తోక్కించి లేదా ఆల్ క్రాప్ త్రేషర్ ను ఉపయోగించి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరచి 2-3 రోజులు ఎండనిచ్చి గింజలలో తేమ 9 శాతం కన్నా మించకుండా చూసుకొని నిల్వ చేయవలెను.
బాగా ఎండిన గింజలు (8-9 తేమ శాతం) బిన్స్ లో గాని, గొనె సంచులలో గాని, పాలిథీన్ సంచులలో గాని నిల్వ చేయవచ్చును. నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలను (గొనె సంచులు) శుభ్రపరుచుకోవాలి. గొనె సంచులను 10 శాతం వేప ద్రావణం పిచికారి చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గొనె సంచులను వాడాలి లేదా సంచుల పై మాలధియాన్ 10 మి.లీ. లేదా డేల్టామెత్రిన్ 2 మి.లీ. లేదా డైక్లోరోవాస్ (0.05%) ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తరువాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి.
బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రింద 20 మి.లీ. మలాధియాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి,. నింపిన బస్తాలు చెక్క బల్లల పై వరుసలలో పేర్చి తేమ తగులకుండా జాగ్రత్త వహించాలి. ధీర్ఘకాలం నిల్వచేసినప్పుడు ఎప్పట్టికప్పుడు గమనించి అవసరం మేరకు అప్పుడప్పుడు ఎండబెట్టి నిల్వ చేయాలి.
క్రమ సంఖ్య | ప్రమాణాలు | మూల విత్తనం | సర్టిఫైడ్ విత్తనం |
---|---|---|---|
1. | విత్తన భౌతిక స్వచ్చత | 98% | 98% |
2. | భౌతిక ఇతర పదార్దాలు (అత్యధికంగా) | 2% | 2% |
3. | ఇతర పంటలు విత్తనాలు (అత్యధికంగా) | - | 10/కిలో విత్తనానికి |
4. | కలుపు మొక్కల విత్తనాలు (అత్యధికంగా) | - | - |
5. | ఇతర గుర్తించదగిన రకాలు (అత్యధికంగా) | 5/కిలో విత్తనానికి | 10/కిలో విత్తనానికి |
6. | మొలక శాతం (గట్టి గింజలు కలుపుకొని) | 80 | 80 |
7. | తేమ శాతం | 9 | 9 |
ఉలవలు సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత (అపరాలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం. వరంగల్, ఫోన్ నెం. 9704222742, 9849133493
ఆధారం: వ్యవసాయ పంచాంగం
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021