పెరుగుతున్న దేశ జనాభా ఒకవైపు, తరుగుతున్న సహజ వనరులు మరో వైపు ఇలాంటి పరిస్థితుల్లో ఆహార భద్రతను, కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను అధికం చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో వరి ప్రధాన ఆహార పంట. మన దేశంలో 58 శాతం వరి నీటి పారుదల కింద సాగవుతుంది. వరి సాగవుతున్న భూమిలోను, ఉత్పత్తిలోను అగ్రస్థానంలో ఉంది. 42.41 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో 35.29 శాతాన్ని అక్రమిస్తోందని అంచనాలు తెలుపుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తి చేయడంలో ముఖ్యభూమిక పోషిస్తోంది. 20.08 లక్షల హెక్టార్లలో సాగవుతూ 66.31 లక్షల టన్నుల (2013-14) ఉత్పత్తి అవుతుంది. హెక్టారుకు 3.8 టన్నుల ఉత్పాదకతతో పంజాబ్ తర్వాత 2వ స్థానంలో ఉంది.
వరి దిగుబడిని ప్రభావితం చేసే వివిధ అంశాల్లో మొదటిది. నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించడం, నాణ్యమైన విత్తనం అంటే కనీసం ప్రమాణాలను అనుసరించి, అధిక జన్యు స్వచ్ఛత, అధిక మొలకశాతం, అతి తక్కువ జడ పదార్థం, తక్కువ సంఖ్యలో కలుపు ఇతర పంటల విత్తనాలను కలిగి తెగుళ్ళ బారిన పడనటువంటి విత్తనం. నాణ్యత లేని విత్తనాలు వాడటం వల్ల బెరుకుటు రావడం, చీడపీడలు ఆశించడం, పంట దిగుబడిలో నాణ్యత లేకపోవడం, దిగుబడి తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి విత్తనోత్పత్తి కలీల నుండి నివారించి జన్యు స్వచ్ఛతను కాపాడటం ద్వారా నాణ్యమైన విత్తనాన్ని పొందుటకు రైతులు కొన్ని మెళకువలు పాటించాలి.
సాధారంగా గింజ గట్టిపడే దశలో పొడి వాతావరణం ఉండే ప్రదేశాలలో విత్తనోత్పత్తికి చాలా అనుకూలం. అందువలన రబీ పంటకాలంలో పండించిన విత్తనాలకు నాణ్యత బాగా ఉంటుంది. వరి స్వపరాగసంపర్కం సిద్ధించుకునే మొక్క కాబట్టి చాలా తక్కువ శ్రమతో నాణ్యమైన విత్తనాన్ని పండించుకునే వీలుంది. ఈ విధంగా పండించిన విత్తనాలను తమ పంటకు వాడుకోవడమే కాకుండా ఇతర రైతులకు కూడా అందించి నాణ్యమైన పంటకు తద్వారా అధిక దిగుబడులకు దోహదపడవచ్చు.
విత్తనోత్పత్తికి పొలాన్ని ఎన్నుకోవడం
పండించాలనుకున్న వరి రకం నాణ్యమైన బ్రీడరు లేదా ఫౌండేషన్ విత్తనాన్ని ఏదైన పరిశోధన స్థానం నుండి లేదా ధృవీకరించిన సంస్థ ద్వారా సేకరించాలి.
ఎకరాకు సన్నగింజ రకాలైతే 6 కిలోలు, దొడుగింజ రకాలకు 10 కిలోలు సరిపోతుంది. సేకరించిన విత్తనాలను మంచినీటితో బాగా కడిగి విత్తుకోవాలి.
విత్తనాలను తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 3 గ్రా. కార్భండిజమ్ మందును కలుపుకోవాలి. లేదా దుంవ నారుమళ్ళయితే 1 లీటరు నీటికి 1 గ్రా. కార్భండిజమ్ కలిపిన నీటిలో 24 గంటలు నానబెట్టి, మండెకట్టి నారుమడిలో వేసుకోవాలి.
నారుమడిని పోసేటప్పుడు నేలను బాగా దున్ని కలుపు లేకుండా చేసి, నారు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
నారుమడిలో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్లు పెంచి భూమిలో కలియదున్నాలి. దుక్కిలో సిఫారుసు చేసిన నత్రజనిలో సగం, మొత్తం భాస్వరం, పొటాష్లను వేసిన తరువాత రెండో సగం నత్రజనిని 12-15 రోజుల మధ్య పైపాటుగా వేయాలి.
విత్తన పంటకు మామూలు వాణిజ్య పంట వలె నీటి యాజమాన్యం పాటించాలి. కీలక దశలైన అంకురం ఏర్పడుట, పూత దశ, గింజ పాలుపోసుకునే దశ, గింజ గట్టిపడే దశలేలో నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి లేని పక్షంలో తాలు గింజలు, విరుగుళ్ళు ఏర్పడతాయి.
విత్తనోత్పత్తి చేపట్టే రకానికి ఉండవలసిన లక్షణాలకు భిన్నమైన లక్షణాలు గల మొక్కలను బెరకులు లేదా కేబీలు అంటారు. కేబీలు ఉండడం వల్ల పంట సమానత్వాన్ని కోల్పోవడమే కాక జన్యు స్వచ్చత లోపించి దిగుబడులు తగ్గి, ధాన్యానికి ధర పలకదు. ఈ కేశీల ఏరివేత ముఖ్యంగా 3 దశల్లో చేపట్టాలి. ఎ) పైరు దుబ్బు చేసే సమయం, బి) పూత దశ, సి) గింజ గట్టిపడినప్పుడు
మనం సాగుచేసిన రకం భౌతిక లక్షణాలు బట్టి, అంటే పైరు ఎత్తు, ఆకు రంగు, దుబ్బు చేసే గుణం మొదలగు లక్షణాలకు భిన్నంగా, పొట్టిగా లేదా పొడుగుగా, ఆకు రంగులో మార్చు ఇతరత్రా భౌతికంగా వేరుగా ఉండే మొక్కలను పూర్తిగా వేర్లతో సహా తీసివేయాలి. పూత దశ : ఈ సమయంలో ముందుగా పూతకు వచ్చేవి, పాటాకు అమరికలో వ్యత్యాసాలున్న మొక్కలు పూర్తిగా తీసివేయాలి.
వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను సమూలంగా తీసివేయాలి.
ఈ విధంగా రైతులు కొన్ని మెళకువలు పాటించి నాణ్యమైన విత్తనాలను పండించుకొని విత్తన ఖర్చును తగ్గించుకోవడం, ముఖ్యంగా నాణ్యత లేని విత్తనాల బారినపడకుండా ఉండడం, పండించిన విత్తనాలను తోటి రైతులకు అందించి లాభం పొందటమే కాకుండా నాణ్యమైన అధిక వరి దిగుబడులను సహాయపడే అవకాశం పొందవచ్చు.
ఆధారం : పాడి పంటలు & మాస్ పత్రికలు
చివరిసారిగా మార్పు చేయబడిన : 4/12/2022